Friday, November 18, 2016 0 comments By: visalakshi

బాబా ఆశీర్వాదం

సాయి సత్యచరిత్ర 13వ అధ్యాయములో బాబా ఆశీర్వాదం భక్తుల యందు అనన్యంగా ఉంది. భక్తుల రోగాలను తమ కేవల వచనాలతో, ఆశీర్వాదంతో బాబా ఎలా నయం చేసేవారో మనకు తెలుస్తుంది.   అప్పుడప్పుడూ ఆయన ఉపాయం విచిత్రంగానూ, బాధాకరంగానూ ఉండేది. అయినప్పటికీ కూడా భక్తులకు రోగం నయమయ్యేది. తాత్పర్యం, గుణం ఔషధంలోనో లేదా ఉపాయంలోనో కాక బాబా చేతిలో, ఆశీర్వాదంలో ఉంది.  



  ఈ జగత్తులో మానవప్రాణులకు దేవుడు బుద్ధి ఇచ్చినప్పటికీ దాన్ని వాడుకుని మనసులో నిశ్చయించుకొన్నట్లు తమ ఇష్టమొచ్చినట్లు వ్యవహరించలేరు. వారి వెనుక కర్మ తంత్రం పట్టుకొని వుంటుంది.  జన్మల పర్యంతం చేసిన కర్మల సంస్కారం, వాటి ప్రారబ్ధాల పరిణామం, వారిని చెడుమార్గంవైపు లాక్కెళతాయి. ' శ్రద్ధ పుణ్యంవైపు పోతే పాదాలు పాపాలవైపు లాక్కెళతాయి. సత్కర్మను శోధిస్తూపోతుంటే కుకర్మలు అడ్డుగా వస్తాయి.' కనుక సత్కర్మలు చేసి పరమార్ధం సాధించటంకోసం మానవులు గొప్ప ప్రయత్నం చేయవలసివుంటుంది. ఇంతే కాదు సద్గురువుని ఆశ్రయించవలసి వుంటుంది.



మానవులు సుఖం కోసం అహోరాత్రులూ ప్రయత్నం చేసినప్పటికీ పూర్వకర్మల ఫలాలుగా దు:ఖాలు వారి మెడకు చుట్టుకొంటాయి. నెట్టిపారేద్దామనుకొంటే మరింతగా పెనవేసుకొంటాయి. ఇదంతా జీవుల వ్యర్ధశ్రమ. అవి అనుభవించక గత్యంతరం లేదు.  వేరే ఉపాయలతో ఆపివేసినా, మళ్ళీ   జన్మించి ఆ కర్మలను అనుభవించవలసి వుంటుంది. జీవన్ముక్తులకి అంటే జీవించి ఉండగానే ఆత్మజ్ఞానం కలిగి ముక్తులైన వార్ని కూడా ప్రారబ్ధభోగం వదిలిపెట్టదు. అప్పుడు ఇలాంటి దు:ఖాలను సహించటానికి  మానవులు  తయారుగా  వుండాలి. 



 అలాంటి దు:ఖాలను నివారించుకోవటానికి ఒక ఉపాయం మాత్రం వుంది. అదేమిటంటే సద్గురువుని శరణనటం. వారి కృపాదృష్టి పడితే మానవులు దు:ఖాన్ని సహజంగా ఏ యాతనలూ లేకుండా అనుభవించగలరు. సద్గురువు అనుభవించగల ధైర్యాన్నిస్తారు. 'అదృష్టవశాత్తూ మహాత్ముల దర్శనం అయితే అదే వ్యాధికి ఒక ఉపశమనం. వ్యాధిగ్రస్తులపై వారి కరుణా దృష్టి ప్రసరింపజేస్తారు. అప్పుడు వ్యాధిని దు:ఖం లేకుండా సహజంగా సహిస్తారు.' 



ప్రతి ఒక్క సందర్భంలోనూ మనసులో ఉండే బాబా తమ దైవీ శక్తిని ఉపయోగించి భక్తుల దు:ఖాల నన్నిటినీ కలిపి ఒక్కసారిగా అనుభవింపజేసి వారిని వెంటనే వాటినుంచి విడుదల చేస్తారు. ఆ దు:ఖాన్ని తమ మీదకు తీసుకొంటారు. ఈ అధ్యాయంలో భక్తులు బాబాకి తమ కృతజ్ఞతను ఎలా వ్యక్తం చేయాలో ఆ బోధ మనకి కలుగుతుంది. సద్గురువులకు తమ భక్తులపై "లాభం కోరని ప్రీతి" వుంటుంది. వారి ఉపకారానికి కృతజ్ఞతగా శిరస్సు వంచి, రెండు చేతులూ జోడించి అనన్యశ్రద్ధతో, దృఢవిశ్వాసంతో ప్రణామములర్పించాలి. అదితప్ప సాయినాధులకు మరోటి అవసరం లేదు.

 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.




Thursday, November 17, 2016 0 comments By: visalakshi

మేఘశ్యాముడి భక్తిఫలం

 సాయి సత్యచరిత్ర 28వ అధ్యాయములో మేఘుడు..ఆతని శివభక్తిని గూర్చి తెలుసుకుందాం..

ఒక గుజరాతీ బ్రాహ్మణుడు (మేఘుడు) రావుబహదూర్ సాఠె వద్ద పని చేసేవాడు. సాఠె అతన్ని నిత్యపూజలకోసం శివాలయంలో పూజారిగా పెట్టాడు. తరువాత సాఠె శిరిడీకి వచ్చాడు. అక్కడ సాయిమహరాజు సాన్నిధ్యం లభించింది. సాఠె మేఘుడికి గాయత్రీమంత్రం ఉపదేశించి, మంచిమార్గంలో ప్రవేశపెట్టాడు. మేఘుడు సాఠెని గురువుగా భావించేవాడు.  సాఠె బాబాను గురువుగా కొలిచేవాడు. ఓసారి సహజంగా మేఘుడితో మాట్లాడుతూ బాబాగారి గొప్పతనం గురించి చెఫ్ఫేటప్పుడు సాఠె హృదయంలో ప్రేమ ఉప్పెనలా పొంగి, "బాబాకి గంగాజలంతో స్నానం చేయించాలని నా మనసులో తీవ్రంగా కోరిక కలిగింది. అందుకు నిన్ను నేను శిరిడీ పంపుతున్నాను. నీ అనన్య సేవ చూసాక నాకేమనిపిస్తోందంటే, ఆ సద్గురువుతో నీకు సాంగత్యం ఏర్పడాలి. ఆయన చరణాల్లో నీకు భక్తి కలగాలి. వెళ్ళి కాయా, వాచా, మనసా నువ్వు ఆ సద్గురువు పాదాలు పట్టుకో. నీ జన్మ సార్ధకమౌతుంది . మేఘుడు ఎవరా సద్గురువు జాతి ఏమిటి? అని అడిగాడు. నిజం చెప్పాలంటే సాఠెకి కూడా ఆ విషయం తెలియదు. "మశీదులో ఉంటారు కనుక ఆయన్ని ముస్లిం అంటారు." ముస్లిం అన్న పదం వినగానే మేఘుడి మనసు తల్లడిల్లిపోయింది. అతను మనసులో ఆయన గురుత్వం ఎంతటిది? కాదు అంటే సాఠె కోపిస్తాడు. సరే అందామంటే తను ఖచ్చితంగా దుర్గతిపాలౌతాడు. మేఘుడికి ఏంచెయ్యాలో తోచలేదు. కానీ సాఠె ఎంతో బలవంతం చేయటం వల్ల అతను బాబాని దర్శనం చేసుకోవాలని శిరిడీ వచ్చాడు. మశీదు ప్రాంగణం చేరుకున్నాడు.    అతను మశీదు మెట్లెక్కేటప్పుడు "ఖబద్దార్! ఇంకో అడుగు వేసావంటే చూడు.గుర్తుంచుకో ఇది ముస్లింలుండే స్థానం. నీవు బ్రాహ్మణుడివి. నేను నీకు అంటరానివాణ్ణి వెళ్ళు. " ఉగ్రంగా ఉన్న బాబా రూపంసాక్షాత్తూ ప్రళయకాలంలోని రుద్రుడి స్వరూపమే. మేఘుడు గజగజ కంపించిపోయాడు. బాబాకి నా మనసులోని విషయాలెలా తెలుసు అని నిర్ఘాంతపోయాడు. ముందుకెళ్ళే ధైర్యం లేక కొద్దిరోజులు శిరిడీలో ఉండిపోయాడు. బాబా కోపతాపాలు చూసాడు. సేవ చేశాడు. కానీ దృఢవిశ్వాసం మాత్రం కలగలేదు. తరువాత అతను ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ విపరీతమైన జ్వరంతో బాధపడి, బాబాపై గాలి మళ్ళగానే తిరిగి శిరిడీ వచ్చేశాడు. 




 అతనికి సాయిబాబా చరణాలపై భక్తిభావం కుదిరింది. సాయికి అనన్య భక్తుడిగా అయ్యాడు. బాబా అంటే ప్రత్యక్షంగా శంకర భగవానుడే అన్న భావన అతనికి కల్గింది. శిరిడీలో బిల్వవృక్షం లేదని, నాలుగు కిలోమీటర్ల దూరం నడచి వెళ్ళి.బిల్వపత్రాలతో బాబాని కొలిచేవాడు. ప్రేమపూర్వకంగా బాబా ఆసనానికి నమస్కరించటం, బాబా పాదాలు నొక్కటం, కడగటం, ఆయన చరణతీర్ధాన్ని త్రాగటం - ఇదే అతని నిత్యక్రమం.  మేఘుడు శిరిడీలో గ్రామ దేవతలను పూజించి, మశీదుకు వెళ్ళేవాడు. ఒకరోజు అతని నియమం తప్పిపోయింది. ఎంత ప్రయత్నించినా ఖండోభా తలుపులు తెరుచుకోలేదు. పూజకు అంతరాయం కలిగింది. అలాగే మేఘుడు హారతి తీసుకొని మశీదుకు వచ్చాడు. బాబా అతనితో నీ పూజకు అంతరాయం కలిగింది. సర్వదేవతల పూజను చేసావు కానీ ఒకదైవం పూజ చేయలేదు. వెళ్ళు తలుపులు తెరచివున్నాయి ..అది పూర్తి చేసి ఇక్కడికి రా అన్నారు. అతని మనసులో అశాంతి తొలగిపోయింది. మేఘుడు ఖండోబాని పూజించి, గంధపుష్పాది ఎనిమిది ఉపచారాలతో బాబాని పూజించాడు. 




ఒక మకరసంక్రాంతి నాడు  మేఘుడు తనకు శివుడైన బాబాకు అభిషేకము చేసితీరవలెనని పట్టుబట్టెను. మేఘశ్యాముడు 8 క్రోసుల దూరమునున్న నదీతీరము నుండి గంగాజలము తెచ్చి  బాబా వద్దకు వచ్చి మరల అభిషేకమునకై అడుగగా.. సమ్మతించి క్రిందికి దిగి పీటపై కూర్చుండి తల ముందుకుసాచి ..ఓ మేఘా శరీరమునకు తల ముఖ్యము కావున తలపైనే నీళ్ళు పోయుము. శరీరమంతటిపై పోసినట్లగును" సరే అని మేఘుడు భక్తిపారవశ్యమున 'హరగంగే, హరగంగే' అనుచు శరీరమంతటిపై నీళ్ళు పోసెను. బాబా వైపు చూడగా అతని ఆశ్చర్యానందములకు మేరలేదు. బాబా తల మాత్రమే తడిసి, శరీరమంతయు పొడిగా నుండెను. ఇదే సాయి భక్తియొక్క సారం. ఆ భక్తి అంటూ ఏర్పడితే అప్పుడు ఆ భక్తులు దేన్నైనా ప్రాప్తింపచేసుకోగలరు.

 మేఘశ్యాముడు బాబాను రెండుచోట్ల పూజించుచుండెను. మశీదులో ప్రత్యక్షంగా, సాఠెవాడాలో నానాసాహెబ్ చాందోర్కర్ ఇచ్చిన పటమును పూజించుచుండెను. ఒకనాడు వేకువఝామున మేఘుడు తనశయ్యపై పడుకొని కండ్లుమూసుకొని లోపల ధ్యానము చేయుచు బాబా రూపమును చూసెను. బాబా అతనిపై అక్షతలు చల్లి "మేఘా! త్రిశూలము గీయుము"! అని చెప్పి అదృశ్యుడయ్యెను.ఇది కలా నిజమా అని చూడగా అక్కడ అక్షతలు పడియుండెను. బాబా వద్దకు వెళ్ళి త్రిశూలం సంగతి అడుగగా..నా మాటలు వినలేదా? త్రిశూలము గీయి. దృశ్యము కాదు నేనేచెప్పాను. నేను ప్రవేశించడానికి తలుపులు అవసరం లేదు. నాకు ఆకారమూ లేదు విస్తరణా లేదు. నేను సర్వదా అంతటా వ్యాపించి వున్నాను. మేఘుడు వాడాలో బాబా పటము వద్ద గోడపై త్రిశూలమును ఎర్రరంగుతో గీసెను. ఆ మరునాడు ఒక రామదాస భక్తుడు పూనా నుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించెను. అక్కడ మేఘుడు కూడా ఉండెను. "చూడు శంకరుడు వచ్చినాడు! జాగ్రత్తగా పూజింపుము!" మేఘుడు త్రిశూలము గీసిన వెంటనే లింగము వచ్చుట చూసి ఆశ్చర్యపడెను. వాడాలో కాకాసాహెబ్ దీక్షిత్ స్నానము చేసి సాయిని తలచుకొనుచుండగా తన మనోదృష్టి యందు లింగము వచ్చుట గాంచెను. అతడాశ్చర్యపడుచుండగా మేఘుడు వచ్చి, బాబా తనకు లింగము కానుకగా ఇచ్చెనని చూపెను. కాకాసాహెబ్ కి ఈ లింగం విశిష్టతను చూసి ఆశ్చర్యంతో పాటు ఆనందం కలిగింది. ఒక క్షణం ముందర ఎవరి ఆకారమూ, చిహ్నమూ ధ్యానంలో వచ్చాయో అదే లింగాన్ని చూసి దీక్షిత్ మనసు సుఖించింది. ఈ ప్రకారంగా గోడమీద త్రిశూల ఆకారం గీయించి, తన చిత్రం పక్కన శివలింగస్థాపన చేయించారు బాబా. మేఘుడికి శంకరుని పూజ అంటే ఇష్టమని అతనికి శివలింగాన్నిచ్చి అతని శివభక్తిని బాబా దృఢం చేశారు.











  ఈ మేఘుడు బ్రహ్మచారి. ప్రతిరోజు ఉదయాన్నే చన్నీటి స్నానం చేసి దేహమంతా భస్మం పూసుకొని మృగచర్మంపై కూచునేవాడు. ఫాలభాగంపై అడ్డుగా విభూతిరేఖలు దిద్దుకొని తెల్లటి చందనం పెట్టుకొనేవాడు. తన దేహంలో తపోబలాన్ని మరొక జలంధరుడులా ప్రతిబింబించేవాడు. నిజంగానే మేఘుడి తపస్సు గొప్పది. అతను బాబా హారతి కూడా ఒంటికాలిమీదే నిలబడి చేసేవాడని అంటారు. బాబాకి అతనితో ఏదో ఋణానుబంధం ఉండి ఉంటుంది. లేకపోతే అతన్ని రావ్ బహదూర్ సాఠె ద్వారా శిరిడీకి లాగి, శంకరుడు సాక్షాత్తూ తానే అన్నట్లు అతని భక్తి పట్లా, తపశ్చర్య పట్లా ప్రసన్నులై బాబాగారు క్రీ.శ 1912వ సంవత్సరంలో శిరిడీలో తమ వద్ద మేఘుడు మరణించినప్పుడు స్వయంగా అతని శ్మశాన యాత్రలో తాము ఉండి, అతని దేహంపై పూలు జల్లి, అతనికి సద్గతిని ప్రసాదించారు. మేఘుడు అదృష్టవంతుడు. మేఘుడు జన్మ ధన్యం. మేఘుడు తన జీవితాన్ని సార్ధకం చేసుకొన్నాడు. గురుకృప ఉన్నప్పటికీ సాధకులు తమ సాధన తామే స్వయంగా చేసుకోవాలి. గురువు కేవలం మార్గదర్శనం చేస్తూ వారి  సాధనను నడిపిస్తారు. బాబాఇలా చెప్పారు. " మీరు తీవ్రంగా ప్రయత్నించండి! ప్రతిఫలాపేక్షను పూర్తిగా వదిలేయండి. మీకు ఫలాన్నివ్వటానికి మీ వెనక నేను నిలబడి ఉన్నాను."



   సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు








Wednesday, November 16, 2016 0 comments By: visalakshi

అన్నదానం

 సాయి సత్యచరిత్ర 38 వ అధ్యాయములో నిరుపేదలకు బాబా స్వయంగా భక్తులకు పెద్ద గుండిగలలో అన్నం వండి అన్నదానం చేసేవారు.. "అన్నం పరబ్రహ్మ స్వరూపం." "పుణ్యాలలోకెల్లా పుణ్యం అన్నదానం". "ఆచార ధర్మాల్లోకెల్లా ప్రధానమైనదీ అన్నదానం" అందుకే బాబా దాన్ని స్వయంగా ఆచరణలో పెట్టి లోకంలో ఓ ఆదర్శం నెలకొల్పారు. అన్నదానం చేయటంలో బాబా బోధ ఏమిటంటే దాన్ని స్వయంగా వండి, అది తినేవారికి గొప్ప ప్రేమతోనూ, ఆదర సత్కారాలతోనూ సమక్షంలో పెట్టవలసివుంది. ఆ శ్రమ బాబా స్వయంగా తీసుకొనేవారు. "గడపలోకి ఎవరైనా ఎప్పుడైనా రానీ వచ్చిన అతిధులను అన్నదానంతో సంతృప్తి పరచాలి గృహస్థులు" .ఇదే మనుష్యయజ్ఞం అని బాబాగారు 19వ అధ్యాయములో వివరించారు.





గురువు స్వయంగా ప్రసాదమిచ్చినప్పుడు అది తినటానికి యోగ్యమా అయోగ్యమా అన్న శంక శిష్యుల మనసుకు కలగకుండా ఆ ప్రసాదాన్ని ఆదరపూరకంగా స్వీకరించి భుజించాలి. దేవుడి ప్రసాదానికి కూడా ఉపవాసం ఉన్నాము మరుసటిరోజు తింటాము అని పక్కన పెట్టకూడదు. "తినాలీ తినకూడదూ అన్న వికల్పం" యోగ్యం కాదు. అలా వ్యవహరించేవారు ఆ దేవతను అనాదారం చేసినట్లే. ఎంతో అదృష్టంతో లభించిన దైవప్రసాదాన్ని వెంటనే స్వీకరించాలి. అనుగ్రహాన్ని అనుభవించాలి. 

  ఏదైనా పనిమీద బయలుదేరేటప్పుడు భోజనసమయం అయి ఉంటే ఉపవాసంతో బయలుదేరకూడదు. ఎవరైనా ప్రేమతో ఫలహారం పెడితే తిరస్కరించి బయలుదేరకూడదు. దాన్ని "పూర్తిగా శుభశకునంగా కార్యనిర్విఘ్నకారకంగా భావించాలి." 32వ అధ్యాయంలో దీని గురించి బాబా , వనంలో కలిసిన వణజరి గురించిన స్వంత అనుభవాన్ని తెలిపారు. 




 అన్నం ఒంటరిగా తినటం మంచిదికాదు. మన ఎవరైనా వ్యక్తిగానీ లేదా పశుపక్షులుగానీ వున్నా వారికి అందులోంచి కొద్దిగా పెట్టి తినాలి. ఎవరూ లేకపోతే బాబాని స్మరించుకొని ఆయనకు అర్పించి తినాలి.బాబా స్వయంగా ఎప్పుడూ ఉపవసించలేదు. ఎవరినీ ఉపవసించనీయలేదు. అన్ని ఇంద్రియాలూ శక్తివంతంగా ఉన్నప్పుడే దేవుడిపై భక్తి పెట్టుకోగలం. అని చెప్పేవారు. "కడుపులో అన్న తడి లేకపోతే ఏ కళ్ళతో దేవుణ్ణి చూడాలి? ఏ వాక్కుతో మహిమను వర్ణించాలి? ఏ చెవులతో వినాలి? ఉపవాసం అంటే దైవం వద్ద వుండటం, పరమాత్ముని సతత చింతనలో రోజుని గడపటం. అన్ని ప్రాణుల్లోనూ నన్ను చూసేవారే నాకు ప్రీతి పాత్రులు. భేదబుద్ధిని వదిలి నా పట్ల భక్తిభావంతో శ్రద్ధతో వుండి పారమార్ధిక ప్రాప్తిని పొందండి.





"సమస్త దేవీదేవతలు ఒకటే కానీ జనులు వారిని వేర్వేరు పేర్లతో పిలుస్తారు. అందుకని ఇతర దైవాలను అవమానించకూడదు." ఈ తత్వానికే మరో బోధ ఏమిటంటే అది బాబా ఎప్పుడూ ఉపదేశించే ..రాముడు, రహీము ఒక్కరే. వీరిలో తేడా లేదు. మరి వారి భక్తులు ఎందుకు శత్రువుల్లా ప్రవర్తిస్తారు? ఎంత మూర్ఖులు! హిందూముస్లింల మధ్య సత్సంబంధాలు నెలకొల్పండి. చక్కని ఆలోచనలను మనసులో దృఢం చేసుకోండి. అప్పుడే అవతలి తీరానికి చేరుకొంటారు. ఈ ప్రకారంగా ఈ అధ్యాయంలో అన్నదానం, సర్వదేవతల ఐక్యత, సర్వధర్మాల ఏకాత్మత విషయాల గురించి అమూల్యమైన బోధను బాబా మనకు ప్రసాదించారు.


సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు


బాబా బోధన


 శ్రీ బాబాగారు సాయి సత్యచరిత్ర 27వ అధ్యాయంలో తమ భక్తులపై చూపే అనుగ్రహం ఇలా...ఒకసారి ప్రసన్నులైతే సద్గురువు ఆ భక్తులని అనేకరకాల ఉపాయాలతో ఉద్ధరించడానికి ప్రయత్నిస్తారు. అలాగే ఒకానొక భక్తుడికి తాను స్వయంగా ఎన్నుకొన్న మార్గం నచ్చినా కానీ సద్గురు అభిప్రాయం ప్రకారం ఆ మార్గం ఆభక్తుడికి అయోగ్యమైనదైతే ఆయన ఆ మార్గం గురించి ఎలాంటి ఉత్తేజాన్నీ ఇవ్వకుండా దాన్నుంచి అతన్ని వెనక్కి మరలుస్తారు. 

 సాయిబాబా పద్ధతి అదే. భక్తులు ధార్మిక గ్రంధాలను అంగడి నుంచి తెచ్చి బాబా చేతికిచ్చేవారు. వారి చేతినుంచి మరల ప్రసాదంగా ఆ గ్రంధాలను తీసుకోవాలని  కోరుకొనేవారు. అలా చేస్తే తమ ఆ పుస్తక పారాయణలోని బోధ యధావిధిగా అర్ధమౌతుందని వారనుకొనేవారు. కానీ బాబా ఆ గ్రంధాలను అందరికీ తిరిగి ఇచ్చేవారు కాదు. భక్తుల బుద్ధి, వారి గ్రహణశక్తి, స్వభావంలోని నిజానిజాలను చూసి ఆయన వాటిని వారికి ఇస్తుండేవారు. మిగిలినవి శ్యామాకి సంగ్రహం కోసం ఇచ్చేసేవారు.



శ్యామా కాకా మహాజని నుంచి చదవటం కోసం తీసుకొన్న ఏకనాధభాగవతాన్ని బాబా చూడటానికి అని అడిగి తీసుకొని శ్యామాకి దాన్ని ఇచ్చారు. ఎందుకంటే అది చదవాలని శ్యామాకి మనసులో కోరిక కలుగుట వలన..ఆకోరికను బాబాగారు నిజంచేయుటకు ఆ పుస్తకం శ్యామాకు ఇచ్చారు. కాకామహాజనికి ఆ తరువాత బాబా కరుణతో మరో భాగవతాన్నిచ్చి పదిలపరుచుకోమన్నారు.

 బాపూసాహెబు జోగ్ కొచ్చిన 'గీతారహస్యం ' పార్శిల్ ఎవరో పంపగా వచ్చింది. అసలు బాబానే ఈ ఏర్పాటు చేసి ఉండవచ్చు. జోగ్ బాబా పాదాలకు నమస్కరిస్తున్నప్పుడు సరిగ్గా ఆ పుస్తకం బాబా చరణాలపై పడటం, బాబా అతన్ని దాని గురించి అడగటం ఈ ఘటన చాలా అద్భుతం. తిలక్ గారి గీతారహస్యం(అంటే కర్మయోగ శాస్త్రం గురించిఉన్న ఈ పుస్తకాన్ని) జోగ్ తప్పక చదవాలి అన్న సంకల్పం ఉండి ఉండొచ్చు. ఎందుకంటే జోగ్ భార్య జీవించివున్నప్పుడు అతని మనసులో సన్యసించాలన్న ఆలోచన వచ్చింది. సర్వజ్ఞులైన బాబాకిది తెలుసు. సన్యసించటానికి అతనికి అప్పటికింకా ఆలస్యం ఉంది. ఆ సమయం వచ్చేవరకు జోగ్ తన సంసారంలోని కర్తవ్యం నెరవేర్చవలసి ఉంది. కనుకే బాబా ఆ ఏర్పాటు చేసారు. తరువాత జోగ్ భార్య మరణించింది. జోగ్ నిజంగా సన్యాసం తీసుకొన్నాడు. శ్యామాని ఏకనాధ భాగవతం చదవమనటం, సుశిక్షితుడైన జోగ్ ని గీతారహస్యం చదవమని చెప్పటం..బాబా భక్తుల అధికారాన్ని చూసి వారిని అనుగ్రహిస్తారనటానికి చక్కని నిదర్శనం. 







 శ్యామాకి రామదాసు వద్ద ఉన్న విష్ణుసహస్రనామ పారాయణ గ్రంధం ఇవ్వటం బాబాకి భక్తులపట్ల ఉన్న అనన్యకారుణ్యాన్ని చూపిస్తుంది.తరువాత రామదాసుకి కూదా క్రోధాన్నీ, అలాగే లోభాన్నీ కూడా పెట్టుకోరాదన్న రామదాస సంప్రదాయానికి శోభ కలిగేలా వ్యవహరించటం గురించిన బోధను బాబా ఇచ్చారు. బాబా బోధనా పద్ధతి ధన్యం.

భగవంతుడు తన భక్తులచేతిలో ఆటబొమ్మ. అమాయకులు, భావికులు అయిన భక్తులకోసం ఆయన అలమటిస్తుంటాడు. వాళ్ళ ప్రేమకోసం వారికి అంకితమవుతాడు. 

సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు. 


Monday, November 14, 2016 0 comments By: visalakshi

పంచమహాయజ్ఞాలు

 శ్రీబాబా బాల్యం నుంచి సర్వస్వాన్నీ త్యాగం చేసిన బ్రహ్మచారి. కనుక భిక్ష చేయటం ఆయనకి ఎంతో యోగ్యం. విశ్వమంతా నా యిల్లు. నేనే వాసుదేవుణ్ణి, విశ్వంభరుణ్ణి. నేనే అవినాశి పరబ్రహ్మని అన్న ప్రజ్ఞ ఉండి, మనసులో దృఢనిశ్చయం ఉన్నవారికి, విశ్వమే తన కుటుంబం అని తెలిసినవారికి బిక్షాన్నం మీద పూర్ణ అధికారం ఉంటుంది. 

శ్లో" ఇష్టాన్ భోగాన్ హి వో దేవా దాస్యంతే యజ్ఞభావితా:
    తై ర్దత్తా న ప్రదాయైభ్యో యో భుజ్కే స్తేన ఏవ స:  ( 3వ అ..12శ్లో)

భా:- వివిధజీవితావశ్యకముల నిచ్చు కార్యమున నియుక్తులైన దేవతలు యజ్ఞాచరణముచే తృప్తులై మీ కావశ్యకవస్తువు లన్నింటి నిత్తురు; కాని దేవతలిచ్చు వస్తువులను మరల వారి కీయకుండ ననుభవించువాడు. నిజంగా దొంగయే అగును.




అయిదురకాల మహాయజ్ఞాలు ..బ్రహ్మయజ్ఞం అంటే వేద పురాణ పఠనం, మానవులందరు పరమ పురుషార్ధ సాధనకు, వైదిక నిత్యకర్మలను ఆచరిస్తూ, నిత్యం, ప్రాత:సాయం సంధ్యా సమయాలలో సంధ్యావందనం చేయాలి. స్త్రీ,పురుషభేదం, వర్గ వర్గ తారతమ్యం లేకుండా బ్రహ్మయజ్ఞం చేయాలి. పరమాత్మను ప్రార్ధించాలి. ప్రకాశం-అంధకారం ఈ రెండింటి సమ్యోగ సమయమే సంధ్యాకాలం. అప్పుడు చేసే ధ్యానక్రియ "సంధ్య" అనబడుతుంది. 'సం 'అంటే చక్కగా 'ధ్య ' అంటే ధ్యానం చేయడం 'సంధ్య ' అంటే సృష్టికర్త ఐన పరాత్పరుని ధ్యానించడమని అర్ధం. బ్రహ్మయజ్ఞంలో నమస్కారమంత్రంతో సుఖదాతా, సుఖకరుడు, మంగళస్వరూపుడైన పరమాత్మకు భక్తితో నమస్కరిస్తూ ఉపాసకుడు సంధ్యావందనాన్ని సమాప్తం చేయాలి. దేవయజ్ఞమంటే స్వాహాకారాలతో దేవతలకు ఆహుతి ఇవ్వటం,  అగ్నిహోత్రంలో హోమంకై సుఘందయుక్తములైన కస్తూరి, కుంకుమపువ్వు మొదలైనవి,.. తియ్యని మధుర పదార్ధాలు బెల్లం, తేనె, మిష్టాన్నాలు..పుష్టిని కలిగించే పదార్ధాలు నేయి, పాలు, ధాన్యాలు...రోగనాశకాలు సోమలతాది ఓషధులు,మొదలైన వస్తువులను అగ్నిలో వేసి హోమం చేయాలి. సర్వవ్యాపకుడై అంతటా ఓతప్రోతంగా నిండియున్న ఆ పరమాత్మ ప్రతినిత్యం మనం చేసే యజ్ఞంలో స్థితమై ఉన్నాడు. పితృయజ్ఞం అంటే స్వాధాకారాలతో పితరులకి ఆహుతి ఇవ్వటం, వృద్ధాప్యంలో పెద్దలు జీవించి ఉన్నప్పుడే శ్రద్ధతో ఆదరించి, వారి ఆజ్ఞలను పాలించి, వారికి తృప్తిని సంతోషాన్ని కలిగించాలి. పెద్దల పేరుమీద ప్రజలకు హితాన్ని కలిగించే పనిచేయాలి. ఋషులు నిష్పక్షపాతంగా వివరించిన పితృయజ్ఞంలో పెద్దలను పూజించి, సేవించి వారిమాటలకు విలువనిచ్చి వారి ఆదేశాలను మన్నించాలని ఉంది. భూతయజ్ఞం అంటే భూతాలకు బలిదానాలు, క్రిమి - కీటకాలకోసం, పశుపక్షులకోసం ముద్ద తీసి పెట్టటం, మనుష్యయజ్ఞం అంటే అతిధులకి భోజనం పెట్టటం లాంటి యజ్ఞాలు చేయని  గృహస్థాశ్రమ మానవుల నింద్య(శాస్త్రాలచే నిషేధించబడ్డ) భోజనాన్ని శిరిడీలో సాయిబాబా స్వయంగా పవిత్రం చేయించేవారు. ఆయన ప్రతిరోజూ అయిదిళ్ళలో భిక్షకు పోయి వారికి అతిధి యజ్ఞాన్ని గుర్తు చేస్తుండేవారు. ఆ ప్రకారంగా ఆ అదృష్టవంతులైన గృహస్థులు తమ ఇళ్ళలో కూర్చునే ఆ లాభాన్ని పొందారు. ఆ అయిదు మహాయజ్ఞాలు చేసాక మిగిలిన అన్నాన్ని తినేవారి 'పంచసూన ' మనే పేరుగల ప్రసిద్ధిచెందిన, తెలీకపోవటంవల్ల సంభవించే, తెలుసుకోవటానికి కఠినమైన పాపాలు నశించిపోతాయి. కండణీ(రోట్లో వేసి దంచటం), చుల్లీ(పొయ్యంటించటం), పేషణీ(తిరగలిలో వేసి విసరటం), ఉదకుంభీ(నీరునింపటం), మార్జనీ (పేడతో అలకటం)అనే ఈ అయిదు పాతకాలు 'పంచసూన 'మనే పేరుతో ప్రసిద్ధి చెందాయి. ఈ అయిదు రకాల  పాతకాల వలన అనేక జీవక్రిముల హత్య జరుగుతుంది. వీటినుంచి ముక్తులవటానికి గృహస్థులు పంచమహాయజ్ఞాలు విధిపూర్వకంగా ఆచరిస్తే ఆ 'పంచసూన ' పాతకాలు క్షయమౌతాయి. గృహస్థులకి చిత్తశుద్ధి లభిస్తుంది. 



 అయితే ఈ రోజుల్లో అన్ని సదుపాయాలతో పాటు కాలమానాన్ననుసరించి పరిస్థితులలోనూ, జీవనవిధానంలోనూ అనేక మార్పులొచ్చాయి. అయినా మనకి తెలియకుండా లేదా అనివార్యంగా సంభవించే పాపాలను పరిహరించుకోవాలి అన్న శ్రద్ధ ఉన్నవారు యోగ్యమైన మార్పులతో ఈ రోజుకీ ఆచరణలో పెట్టుకోవటం సాధ్యమే. ఉదాహరణకి... బ్రహ్మయజ్ఞమంటే పురాణగ్రంధాలు చదవటం, దేవయజ్ఞం,పితృయజ్ఞం, భూతయజ్ఞం వీటిలో అగ్నికి ఆహుతి ఇవ్వటం మనకు సాధ్యం కాదు. అయితే దేవతలకు చక్కెర నైవేద్యం, మరణించిన తల్లిదండ్రులకు వారి పుణ్యతిధుల రోజును గుర్తు    పెట్టుకొని పేదవారికి అన్నదానం చేయటం,కుక్కలు,పిల్లులు, పిచ్చుకలకి అవకాశం వచ్చినప్పుడు రొట్టెముక్క పెట్టటం సాధ్యమే. మనుష్యయజ్ఞం అంటే అతిధులకి భోజనం పెట్టటం ..ఈ రోజుల్లోనూ మన దగ్గరకి కూడా ఎవరో అతిధులు అనుకోకుండా వస్తారు. అలాంటి సందర్భంలో ఆనందంతో, ప్రేమతో వారికి భోజనం పెట్టి తృప్తిపరచటం ..అదే మనుష్యయజ్ఞం. అతిధిదేవోభవ అని అందుకే అంటారు. ఈ విధులన్నిటి వెనుకా ఉండే మూలతత్వమంటే సాయిబాబా 24వ అధ్యాయంలో అణ్ణాసాహెబ్ కి శనగల గురించి ఆతన్ని హాస్యం పట్టించి"ఒంటరిగా తినటం మంచిది కాదు" అని చేసిన ఉపదేశమే. తమ అదృష్టంతో ఏది ప్రాప్తిస్తుందో అందులో కొద్దిభాగం పరమేశ్వరుడికి లేదా ఇతరులకి, పశుపక్షులకి ఇవ్వాలి. అప్పుడే మనం తినాలి లేదా అనుభవించాలి.  



 పంచయజ్ఞాల ముఖ్యతత్వం తెలుసుకొని ఆ ప్రకారంగా కాలానుగుణంగా తమ ఆచరణ పెట్టుకోవాలి. అప్పుడే మనకు శ్రేయస్సు కలుగుతుంది. మనసుకి శాంతి లభిస్తుంది.

సర్వం శ్రీసాయినాధార్పణ మస్తు. 





Sunday, November 13, 2016 0 comments By: visalakshi

కృపా ప్రసాదం

 సాయి సత్యచరిత్ర పంతొమ్మిదవ అధ్యాయములో హేమాడ్ పంత్ పై బాబాగారు కురిపించిన కృపా ప్రసాదం.

 శ్లో" యే యధా మాం ప్రపద్యంతే తాం స్తధైవ భజా మ్యహం
       మమ వర్త్మానువర్తంతే మనుష్యా: పార్ధ సర్వశ:  (4వ అ...11వశ్లో)  

 భా:- ఓ పృధాకుమారా! మానవులెట్లు నన్ను శరణుపొందుదురో, అట్లే వారికి ఫలము లొసంగుచుందును. మానవులు అన్ని విధముల నామార్గమునే అనుసరింతురు. 



జ్ఞానమార్గం అన్నింటిలోనూ శ్రేష్టమార్గం అని బాబా ఉపదేశం చేసినప్పటికీ ఆయన సర్వసాధారణంగా భక్తిమార్గాన్నే అవలంబించమని చెప్పేవారు. జ్ఞానమార్గం మహిమ చెప్తున్నప్పుడు ఆయన ఇలా అనేవారు. 'జ్ఞానమార్గం రామాఫలం లాంటిది. భక్తిమార్గం అంటే సీతాఫలాన్ని ఆస్వాదించటమే అవుతుంది. దాన్ని సహజంగా సాధించగలం.అది ఎంతో రుచిగా, మధురంగా ఉంటుంది. జ్ఞానం అంటే బాగా పండిన రామాఫలం. భక్తి అంటే మధురమైన సీతాఫలం . రెండూ రసంతో నిండి ఒకదానికన్నా మరొకటి మధురంగా ఉంటాయి. సుగంధం కూడా రెండింటిదీ ఒకేలా ఉంటుంది. రామాఫలాన్ని చెట్టుమీదే పండించిన ఫలాలే మాధుర్యంగా ఉంటాయి. సీతాఫలం అలా కష్టపడనవసరం లేదు. చెట్టునుండి కోసి పండించవచ్చు. రామాఫలానికి భూమ్మీద రాలిపడే భీతి ఉంటుంది. అదేవిధంగా జ్ఞానమార్గం అవలంబించే వారికి నిర్భయత్వం ఉండదు. వారు అణిమ, మహిమ వగైరా అష్టసిద్ధులమీద విజయం పొందవలసి ఉంటుంది. వాళ్ళు ఏమాత్రమూ నిర్లక్ష్యంగా ఉండకూడదు. కనుక శ్రీసాయి తమ శిష్యులకు సామాన్యంగా భక్తి, నామస్మరణల గురించే చెప్పేవారు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జనునికి జ్ఞానం కంటే ధ్యానం శ్రేష్టమని చెప్పాడు. "జ్ఞానం కంటే ధ్యానం గొప్పది." కానీ దానికోసం యదార్ధజ్ఞానం కావాలి. ఆత్మ గురించిన చక్కటి అనుభవజన్య జ్ఞానమే జ్ఞానానికి మూలం. దీన్నే అంతర్యామి ఆత్మానుష్ఠానం అంటారు.

 విశేష ప్రమాణం లేకుండా అంటే స్థితి లేకుండా ఉండేదాన్ని ధ్యానంలోకి ఎలా తీసుకురావాలి? అయితే అంతర్యామి ఆత్మే ఈశ్వరుడు. ఈశ్వరుడే గురువు. ముగ్గురి మధ్యా అణువంతైనా భేదం లేదు. మళ్ళీ మళ్ళీ చింతన చక్కగా పూర్తిగా అయి ధ్యాత, ధ్యానం రెండూ కలిసిపోతే ఏ విధమైన గాలి లేనప్పుడు స్థిరంగా ఉండే దీపంలా చిత్తానికి శాంతి కలుగుతుంది. దాన్నే సమాధి అంటారు. సర్వ ఇచ్చలూ, ఆకాంక్షల నుంచి పూర్తిగా ముక్తులైనవారే సర్వప్రాణుల అంతర్యామి అని తెలుసుకుని తాము తప్ప జగత్తులో అన్యులెవరూ లేరని తెలుసుకుని ఎవరి గురించీ, ఎలాంటి భీతిలేని స్థితి ప్రాప్తిస్తే దాన్ని ధ్యానమంటారు. అప్పుడు కర్మ బంధనాలతో సంబంధం వెంటనే తెగిపోతుంది. విధినిషేధాల నిర్బంధం విడిపోతుంది. ముక్తి అనే ఆనందం లభిస్తుంది.  సాయిబాబా స్వతహాగా సంపూర్ణ అనుభవజ్ఞానానికి నిధి. సాయి స్వరూప జ్ఞానాన్ని యధాతధంగా తెలుసుకోవటమే ఆయన ధ్యానాన్ని అనుష్టించడం, దర్శించటం అవుతుంది. అవిద్య, కామము, కర్మ - ఈ బంధనాలనుంచి సంపూర్ణంగా విడివడటానికి మరో సాధన లేదు.పరమార్ధం లభించినవారు కృతార్ధులు.. 



ఇప్పుడు నాకు అనుభవాన్నిచ్చిన సాయిబాబా  స్వభావం  గురించిన ఒక కధను వినండి...భక్తులు బాబాకి అనన్యంగా శరణు వెళ్తే వారికి భక్తి యొక్క గొప్పతనం అనుభవంలోకి వస్తుంది. అది శిరిడీ లాంటి పవిత్రస్థానం. ఆ రోజు గురువారంలాంటి శుభప్రదమైన రోజు. ఆ రోజంతా రామనామాన్ని అఖండంగా జపించాలని నాకనిపించింది. బుధవారం రాత్రి పక్కమీద శరీరం నిద్రలోకి జారే వరకు నా మనసు శ్రీరామప్రభు చింతనలో మునిగింది. ప్రాత:కాలం మేలుకోగానే మనసుకి రామనామం గుర్తొచ్చింది. అలాంటి భావన లో ఆనందాతిశయంతో మనసుని స్థిరం చేసుకొని, శౌచము, ముఖప్రక్షాళనము పూర్తిచేసి దొరికిన పూలను తీసుకొని సాయిబాబా ప్రాత:కాల దర్శనానికి బయలుదేరాను. దీక్షిత్ ఇంటి బయటకొచ్చి, బూటీవాడాని దాటినప్పుడు ఔరంగాబాద్కర్ మధురంగా ఓ అందమైన గీతాన్ని ఇలా పాడటం వినిపించింది.

 పదం:  గురుకృపాంజన పాయో మేరీ భాయి! రాం బినా కచు మానత్ నాహి!!
            అందర్ రామ బాహర్ రామ! జహదేఖే వహా పూరన్ రామ!!       1
            జాగత్ రమ సోవతరామ! సపనే మే దేఖత్ సీతారామ!!             2
           ఏకాజనార్ధనీ అనుభవ నీకా! జహాదేఖే వహరామ సరీఖా!!           3  

 ఓ సోదరా! గురుకృప అంజనం అంటే అంటే కళ్ళకి పెట్టుకొనే కాటుక. దానివల్ల దృష్టి సరి అవుతుంది. అది నాకు లభించింది.ఇప్పుడు నేను రాముణ్ణి తప్ప వేరెవవరినీ అంగీకరించను. సర్వం రాముడే కనిపిస్తున్నాడు. రామనామాన్ని చిత్తంలో పెట్టుకోవాలనుకున్నాను. ఆ నిశ్చయాన్ని ప్రారంభించకముందే ఆ గీతంతో అది దృఢతరమయింది. దానివల్ల మనసుకి జ్ఞానం కలిగింది. నా నిశ్చయమనే అంకురాలపై దయాసాగరులైన సాయిసమర్ధులు ఈ గీతమనే నీటిని చిలకరించారు. బాబా ఎదుట ఆ ప్రాంగణంలో ఔరంగాబాద్ కర్ పాడిన ఈ పాట నేను మైమరచి విన్నాను. అతనికి అనేక గీతాలు వచ్చు. అయినా అప్పుడతనికి ఈ గీతమే పాడాలని అనిపించటమేమిటి? నా మనసులోని ఆలోచనను తెలుసుకున్నట్లు...బాబా తమ సూత్రాన్ని ఎలా కదిలిస్తారో అలాగే మనసుకి స్పురణ కలుగుతుంది. మనమంతా తోలుబొమ్మలం. సాయి జనని సూత్రధారి. ఆయన ఏమీ మాట్లాడకుండానే చక్కని ఉపాసనను నాకు ప్రసాదించారు. నా మనసులోని కోరిక బాబా అంత:కరణలో ప్రతిబింబించింది. 



సమర్ధరామదాసు అంటారు "ఈ రాఘవుని నామం ఎంత అందమైనది. సంసారమూలాన్ని నిర్మూలిస్తుంది. జీవులకి ఇదే కైవల్యసాధనం."సంతతుకోబా ఇలా అంటారు"రామనామంతో నేను కృతార్ధుణ్ణయ్యాను. నామం ఉచ్చరించడానికి ఏమీ ఖర్చుకాదు. నామ మంత్రం కష్టం కాదు. అది కేవలం రెండక్షరాలు మాత్రమే. రామ రామ అని ఉచ్చరించండి.సంత్ తులసీదాస్ ఇలా అంటారు "రామనామం ఎంతో ప్రభావాన్ని చూపిస్తుందని సత్పురుషులు, పురాణాలు, ఉపనిషత్తులు గానం చేశాయి. జ్ఞానగుణరాశి అయిన శివుడు సతతము దీన్ని జపిస్తాడు. రామరక్షాస్తోత్రంలో శంకరుడు పార్వతికి రామనామ మహత్వాన్ని చెప్తూ విష్ణువు యొక్క వెయ్యినామాలు ఒక్క రామనామంతో సమానమని" అన్నాడు. "శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే" ఈ నామం వల్ల స్వరూపం ప్రాప్తిస్తుంది. 

ఒక్క రామనామం స్మరణతో లెక్కలేనన్ని లాభాలు చేకూరుతాయి. రామనామ గర్జన ఉన్నచోట విష్ణువు సుదర్శన చక్రం తిరుగుతుంది. దీనులను రక్షించేది ఈ రామనామమే. నేను ఈ అనుభవాన్ని పొందినప్పుడు నా మనసుకి శాంతి, అంత:కరణలో ఆశ్చర్యముతో కూడిన పారవశ్యము కలిగాయి. శ్రీ సాయినాధ్ గురుమహారాజ్ కీ జై.....

సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు    















  


Saturday, November 12, 2016 0 comments By: visalakshi

Message


Om Sree Saayinaadhaaya Namaha


"God manifests Himself in different forms.  Even as a human form.  He manifests Himself at different places, at different times with different levels of consciousness."

"A human soul is generally born with the experience of same paths or religions, he had adopted in the earlier lives.  However, in certain cases in the next life he is born of parents of a different religion from the one he had adopted in earlier life.  The past lives' experiences, even if he does not remember, do manifest as a part of his behaviors thinking and conduct in the later life.  Thus, some people go back to their earlier path due to such 'samskara' or if the jiva gets saturated with the experience of one path, they get into another path.  While doing so people may think logically of having done a volitional act of having changed a religion or a path, but in the ultimate analysis, this thinking process itself is pre-ordained due to past Karmas, ;which generate clear cut propensities in human minds.  Experiences of the earlier lives at times propel us to have the same experiences in this life also"


Shirdi Sai Baba said, SAB KA MALIK EK, ALLAH MALIK.  Allah Means GOD.  In other words LORD or  Supreme Soul.  Creator of this Universe Knowing God is not  easy to any  human being. that is way all the Saints stated first know one's self . once  human being knows about himself, he will never dispute with other human being merely stating that particular incarnation of God is only Lord or ask others to trust and convert in to other Religions.  Hinduism never asked people to come to their Religion or path. Our Saints will give discourses about the Lord as Omnipotent, Omnipresence and Omniscience and explained the very concept of the Avatars in order to uplift mankind and re-establish dharma.


                                                     by

                         Our shirdee sai seva satsang...President..

Friday, November 11, 2016 0 comments By: visalakshi

ఆత్మజ్ఞానం

అత్యంత శ్రేష్ఠము,అతి దుర్లభము, కఠినమూ అయిన బ్రహ్మజ్ఞానము లేదా ఆత్మజ్ఞానాన్ని ప్రాప్తింప చేసుకోగల ఉపాయం  శ్రీసాయిబాబా సత్యచరిత్ర    పదహారు, పదిహేడు అధ్యాయాల్లో వివరంగా చెప్పబడింది.

 శ్లో" చతుర్విధా భజంతే మాం జనా: సుకృతినో'ర్జున
     ఆర్తో జిజ్ఞాసు రర్ధార్ధీ జ్ఞానీ చ భరతర్షభ   (7వ అ..16వశ్లో")

భా:- ఓ భరతవంశ శ్రేష్ఠుడైన అర్జునా! ఆపదలోనున్నవాడు, సంపద గోరువాడు,జ్ఞానమునువాంచించువాడు,పరమాత్మజ్ఞానము నన్వేషించువాడు..ఈ నాలుగురకములైన పుణ్యాత్ములును నాకు భక్తియుక్తమైన సేవ చేయును.  

 పరబ్రహ్మ ప్రతీక 'ప్రణవస్వరూప ఓంకారా'న్ని సదా ధ్యానించాలి. ఇది వేదాలన్నిటికీ సారం. ఓంకార ఉచ్చారణతో దాని అంతరార్ధం మనసుకి స్పురిస్తుంది. దాని ఆవర్తన (మళ్ళీ మళ్ళీ అనటం) తో బ్రహ్మ సాక్షాత్కారమౌతుంది. జ్ఞానులు స్వస్వరూపంలో లీనమయితే వేదాంతాల్లో విద్వాంసులు వర్ణించిన సత్యము, జ్ఞానము, ఆనందము ఇత్యాది లక్షణయుక్తమైన  బ్రహ్మ స్వయంగా  వారివద్ద  ప్రకాశిస్తుంది. 







 'శ్రేయస్సు ' అంటే సర్వదు:ఖాల నుంచి సంపూర్ణంగా ముక్తులై నిత్య ఆనందస్వరూప పరబ్రహ్మ పురుషోత్తముని ప్రాప్తింప చేసుకొనే ఉపాయం. ప్రేయస్సు అంటే భార్య, పుత్రులు, ధనం, ఇల్లు, వాకిలి, మానసన్మానాలు, యశస్సు ఇత్యాది ఇహపరలోకాల్లోని సుఖాలను అనుభవంలోకి రప్పించుకోవటానికి చేసుకొనే ఉపాయం. శ్రేయస్సు వివేకరూపంగా ఉంటుంది. ప్రేయస్సు అవివేకరూపంగా ఉంటుంది. శ్రేయస్సు విషయం కేవలం విద్య,జ్ఞానము. ప్రేయస్సు విషయం కేవలం అవిద్య, అజ్ఞానం, మోహం. ఈ రెండిటి గురించితెలిసినప్పటికీ మానవప్రాణులు స్వతంత్రబుద్ధితో సరైనదాన్ని ఎన్నుకోవాలి. ప్రేయస్సును పక్కకు జరిపి శ్రేయస్సుని ఆదరించడం పురుషార్ధమవుతుంది. పురుషార్ధం ఉదయిస్తే అప్పుడా పురుషులు తమ హితంకోసం సంసార చక్ర భ్రమణం నుంచి విడుదల అవటానికి, యోగ్యమైన ఉపాయం సాధిస్తారు. జీవుడికి అజ్ఞానమనే ఈ వృత్తే అతణ్ణి సంసారంవైపు ప్రవృత్తం చేస్తుంది. ఆత్మజ్ఞానం ప్రాప్తించిన తర్వాత అదే జీవుడు సంసారం నుంచి నివృత్తి అయిపోతాడు. ఆత్మను నిజంగా తెలుసుకొన్నవారికి అహంభావం అణుమాత్రమైనా ఉండదు. నివృత్తి విశేషం ఏమిటంటే నేనే సర్వత్రా ఉన్నాను అన్న భావంతో చూడటం వల్ల అక్కడ శతృత్వం, మితృత్వం అనేవి ఉండవు. అలాంటి మహాసుఖం ముందు శారీరిక మహాదు:ఖాలు ఏపాటి! మహాసుఖం ఇష్టమైనప్పుడు ఐహిక సుఖాలకోసం ఎవరేడుస్తారు! ఆత్మదర్శనంపై ఆసక్తి ఉన్నవారు ఈ భూమ్మీద ఆయుష్షుని కోరతారు. ఇక్కడే చిత్తశుద్ధి కలుగుతుంది. నిర్మలబుద్ధి ప్రాప్తిస్తుంది. భక్తిశ్రద్ధలు కలబోసిన మనసుతో, పూర్ణంగా నమ్రతతో సాష్టాంగ నమస్కారం చేసి 'గురువు 'కి శరణు వెళ్ళాలి. వారు జ్ఞాననిధిని ప్రసాదించగలరు. సర్వమూ సమర్పించి ఆయన్ని సేవించాలి. ఆత్మ ఎవరు, పరమాత్మ ఎవరు అన్న విషయం 'గురువు 'తప్ప ఎవరూ చెప్పలేరు. 




 'గురువు ' కూడా పూర్ణంగా శరణు రాకుండా ఉంటే జ్ఞానాన్ని ప్రసాదించరు. బ్రహ్మ, ఆత్మల ఐక్యతను సులభం చేయటానికి గురుపాదాలే సమర్ధవంతమైనవి.  సాష్టాంగం చేసి గురుచరణాల్లో శిరసుంచి మనసులోని ఉత్తేజాన్ని దృఢం చేసుకొని గురుపాదాలు పట్టుకొని నోటితో, నేను మీ దాసానుదాసుణ్ణి. నాకు మీ పాదాలపై అచంచల విశ్వాసముంది " అనాలి. అప్పుడు చూడండి ఆ గురువు చమత్కారం! ఆ గురువనే దయామృత సాగర తరంగాలు ఉవ్వెత్తున ఎగసిపడ్తాయి. పీడలను నాశనం చేసి తమ అభయహస్తాన్ని మీ తలమీద పెట్టి సర్వపాపాల రాశిని దగ్ధం చేసి నుదుటిమీద విభూతి పెడ్తారు. 



 క్లుప్తంగా చెప్పాలంటే ఆత్మజ్ఞానమనేది వృద్ధాప్యంలో ఇంద్రియశక్తి క్షీణించిన తరువాత జగత్తులో ఎవరూ పట్టించుకోనప్పుడు ఖాళీగా ఉన్నామని చేసే పని కాదు. అలాగే రానూ పోనూ బాడుగకు తీసుకొన్న గుర్రబ్బండిలో హడావిడిగా వచ్చి అది కూడా తనదగ్గర రెండువందల యాభైరూపాయలు జేబులో ఉంచుకొని కేవలం అయిదు రూపాయలపై లోభం పెట్టుకొంటే బ్రహ్మజ్ఞానం ప్రాప్తించదు.  బ్రహ్మప్రాప్తికి సాధకులు సర్వసుఖోపభోగాలు త్యాగం చేసి సమస్త ఆశలు, ఆకాంక్షలూ వదిలేసి బాగా శ్రమించవలసి ఉంటుంది. శ్రీ సాయినాధుని వంటి సద్గురువుని ఆశ్రయించవలసి ఉంటుంది. అప్పుడే ఆత్మ ప్రసన్నమై స్వయంగా సాధకులకి తన యదార్ధస్వరూపాన్ని చూపిస్తుంది. ఆత్మ ఎవరిని స్వీకరిస్తుందో వారికే ఆత్మజ్ఞానం ప్రాప్తిస్తుంది. వారికోసం ఆ ఆత్మ తన స్వరూపాన్ని స్వయంగా ప్రకటం చేస్తుంది. 




 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు. 




Thursday, November 10, 2016 0 comments By: visalakshi

సీతాన్వేషణ - చివరిభాగం

జాంబవంతుడు ప్రేరేపించగా మహాబలశాలి అయిన హనుమంతుడు సీతాదేవిని వెతికి చూడాలన్న కాంక్షతో దేవతలు, చారణులు సంచరించే ఆకాశమార్గంలో ప్రయాణం చేసి లంకాపట్టణాన్ని చేరాలని సంకల్పించాడు.తూర్పు దిక్కుగా తిరిగి తండ్రి అయిన వాయుదేవుని స్మరించి ఆశీస్సులు కోరి దక్షిణ దిక్కుగా వెళ్ళేందుకు హనుమంతుడు శరీరాన్ని మేరుపర్వతమంత పెద్దదిగా పెంచాడు. శత యోజన విస్తీర్ణ సాగరాన్ని దాటి సీతాన్వేషణ చేయడానికి పూనుకున్నాడు. సముద్ర ఉల్లంఘన సమయంలో హనుమకు పర్వత రూపంలో ఉన్న మైనాకుడు సముద్రుడి ఆదేశంపై మానవరూపంలో వచ్చి పర్వతశిఖరంపైన నిలిచి ఆకాశంలో ఉన్న హనుమంతుడితో ..ఎవ్వరికీ సాధ్యంకాని పని చేపట్టావు. వానరోత్తమా కొద్దిసేపు నా శిఖరంపై విశ్రమించు. నీకు సహాయం చేయడం ద్వారా రఘువంశ రాజైన రాముడికి సేవ చేసినట్లవుతుందని నా భావన. నా ఆతిధ్యం స్వీకరించి నన్ను కృతార్ధుణ్ణి చెయ్యి.అన్నాడు.




 హనుమంతుడు ఓ మైనాకుడా! నీ ప్రియమైన మాటలు నాకు సంతోషము కలిగించాయి   చాలు. ఇప్పుడు నేను మీ ఆతిధ్యాన్ని స్వీకరించలేను. ఎక్కడా ఆగకుండా లంకాపట్టణాన్ని చేరుతానని నా స్నేహితుల వద్ద ప్రతిజ్ఞ చేశాను. అందువలన నీ మాట మన్నించలేకపోతున్నాను అని వారిని చేతితో తాకి వారికి ఆనందాన్ని కలిగిస్తూ ముందుకు సాగిపోయాడు. సురస, సింహికల రాక్షస మాయలు అడ్డుగా నిలిచినా ప్రలోభాలకూ, ప్రతిబంధకాలకూ లొంగక హనుమంతుడు కార్యదీక్షాపరుడై లంకాపట్టణం చేరుకున్నాడు.మహాబలశాలి అయిన వానరశ్రేష్ఠుడు నగరంలోనికి ప్రవేశిస్తూ ఉండగా లంకానగరం స్త్రీరూపంలో హనుమంతుని అడ్డుకుంది. హనుమంతుడి ధాటికి భయపడింది. దీనస్వరంతో ఓ మహానుభావా! నేనే సాక్షాత్తూ లంకానగరాన్ని. నన్ను నీ పరాక్రమంతోజయించావు.ఇక బ్రహ్మవాక్కు నిజమవబోతోంది.  దురాత్ముడైన రావణుడు సీతను అపహరించి తెచ్చాడు. దాంతో అతడికి, మిగిలిన రాక్షసులందరికీ వినాశకాలం దాపురించింది.వానరశ్రేష్ఠుడా! నీవు ఈ లంకాపట్టణానికి  ఏయే పనులు చక్కపెట్టటానికి వచ్చావో, ఆ పనులన్నీ పూర్తి చేసుకో! ఈ పట్టణమంతా స్వేచ్చగా సంచరించు. మహా పతివ్రత అయిన సీతను అన్వేషించు. అంది.

 హనుమంతుడు రావణుని అంత:పురంలోకి రహస్యంగా ప్రవేశించి,  రావణుని మందిరాలలో సీతకై వెదుకుతున్నాడు. రాక్షస ప్రముఖుల ఇళ్ళన్నీ గాలించాడు. వారి ఐశ్వర్య సమృద్ధిని చూసి హనుమ ఆశ్చర్యపోయాడు.  రావణుని అంత:పుర భవన సముదాయాలలో పుష్పక విమాన గృహంలో రావణుడు నివసిస్తూ ఉంటాడు. ఆ నివాసంలో కూడా నిద్రించే స్త్రీలను పరిశీలించి సీతమ్మ కానరాక దిగులుచెందాడు. మరల ఒకసారి వెదుకుతుండగా దివ్యమైన పడకగదిలో వీరుడైన రావణుడు నిద్రించుచున్నాడు. అచటికి దూరంగా ఏకాంత శయ్యపైన ఒక సుందరాంగి ఒంటరిగా నిద్రిస్తోంది. అతిరూప సౌందర్యవతి అయిన మండోదరిని చూసి మొదట ఆమెయే సీతాదేవి అనుకున్నాడు. ఆమె సీతాదేవి కాదని తెలుసుకున్నాడు. సీతమ్మ రాముని వియోగముతో కంటిమీద కునుకులేక శోకవనితలా ఉంటుంది. రాముడు తప్ప పరపురుషుని కన్నెత్తి కూడా చూడదు. అలంకారాలు చేసుకోదు కాబట్టి ఈమె సీత కాదు అనుకొని ఆమె మండోదరి అని తెలుసుకొన్నాడు.   తిరిగి అన్వేషణ ప్రారంభించాడు. పానశాలలో వెదికాడు.అయినా సీతాదేవి కనిపించలేదు. సీత మరణించినదేమోనన్న అలోచనతో బాధగా పుష్పకవిమాన గృహం నుండి క్రిందికి దిగి రాముని తలుచుకొని..అనేక విధాలుగా అలోచిస్తూ..సీతాదేవి కనిపించేవరకు వెదుకుతాను అని శపధంచేసుకుంటూ వస్తూండగా ఎదురుగా పెద్దపెద్ద వృక్షాలతో అశోకవనం కనిపిస్తోంది. ఇంకా ఈ వనంలో వెదకలేదు ఇప్పుడు సీతాదేవి కోసం ఆ వనంలో ప్రవేశిస్తాను. పరమపూజ్యురాలు అయిన సీతాదేవి ఇప్పుడు నాకు కనపడు గాక! అని మనస్సులోనే ప్రార్ధన చేసుకున్నాడు.  




 హనుమంతుడు అశోకవనంలోకి ప్రవేశించాడు. ఆ అశోకవనం అనేక ఉపవనాలతో కూడిన వనసమూహం. హనుమంతుడు అక్కడ కొన్ని బంగారు వృక్షాలు చూశాడు. అక్కడొక శింశుపావృక్షం ఉంది. మహాబలశాలియైన హనుమంతుడు ఆ శింశుపావృక్షం చిటారు కొమ్మపైన కూర్చుని సీతాదేవి ఎక్కడైనా కనిపిస్తుందేమోనన్న ఆశతో నాలుగు ప్రక్కలా కలయ చూశాడు. హనుమంతుడు అలా అశోకవనంలో ఒక వృక్షం నుండి, మరోవృక్షంపైకి దూకుతూ, ఒకానొక వృక్షాగ్రం నుండి పరికించి ఒక భవనం చూసాడు .ఆ భవనం కైలాసంలా తెల్లగా మెరిసిపోతోంది. ఆ భవనాన్ని వెయ్యి స్తంభాలపైన కట్టారు. హనుమ ఒక్క గెంతుతో ఆ భవనం పైకి దూకాడు. అక్కడ ఒక యువతిని చూసాడు.  ఆహారం లేనందున ఆమె శరీరం కృశించిపోయి ఉంది. శరీరంపై ఎక్కడా ఏవిధమైన అలంకారాలూ లేక దీనురాలై వున్న ఆ యువతి సీతయే అయిఉండవచ్చని హనుమంతుడు భావిస్తున్నాడు.  రాముడు చెప్పిన అలంకారాలన్నీ అంటే ఆమె చెవులకున్న కుండలాలు,గాజులు,మణులతో పొదిగిన హారాలు అన్నీ రాముదు వర్ణించి చెప్పినట్లే కనబడుతున్నాయి. కాకపోతే కాస్త మాసిపోయి ఉన్నాయి. సందేహం లేదు ఆమె తన ఉత్తరీయంలో మూట కట్టిపడేసిన నగల్ని మేమంతా చూశాం. ఆ నగలు మూట కట్టిన ఉత్తరీయమూ ఇప్పుడు ఈమె ఒంటిపై ఉన్న వస్త్రమూ ఒకేమాదిరిగా ఉన్నాయి. రాముడు చెప్పిన నగల గుర్తులను బట్టి, ఈమె ధరించిన వస్త్రం, నగల ఉత్తరీయం అన్నివిధాలా ఒక్కటిగానే ఉండడం వల్ల ఈమె రాముని సఖి సీతయేనని నా మనస్సు కచ్చితంగా చెబుతోంది.అనుకున్నాడు. 


  ఈమె సీత అని నిర్ధారణ చేసుకున్న హనుమంతుడు ఆనందాశ్రువులతో రాముని స్థుతించి, నమస్కరించాడు. హృదయం అంతా ఆనందం నిండి ఆ చెట్టు ఆకుల మధ్య పొంచి కూర్చున్నాడు. రావణుడు అశోక వనానికి వచ్చి సీతను చూడాలనే కాంక్షతో సీతాదేవి దగ్గరగా వచ్చాడు. హనుమంతుడు ఆ కొమ్మపై కూర్చుని అక్కడినుండి అన్నీ పరిశీలనగా చూస్తున్నాడు. రావణుని చూడగానే సీతాదేవి భయపడింది.రావణుడు సీతను బ్రతిమాలుతూ తన మనోభావాల్ని తెలియజేస్తూ, ప్రలోభపెట్టాలని చూశాడు.సీత తనపై గల మనస్సును భార్యలపైకి మరల్చుకోమనీ, ఐశ్వర్యము, ధనము చూపి నన్ను ప్రలోభపెట్టాలని చూడకు. కాంతి సూర్యుని నుండి ఎలా వేరు కాదో అలాగే నేను రాముడి నుండి వేరు కాను. నీవు జీవించి ఉండాలన్నా, నీ రాజ్యాన్ని నీవు పాలించాలన్నా పురుషశ్రేష్ఠుడైన రాముని శరణు కోరుకో .ఆ మహాత్ముడు నిన్ను క్షమించి విడిచిపెడతాడు. రావణా నేను చెప్పిన హితాన్నిపెడచెవిన పెడితే నీవు మరణించడం తధ్యం! అని నిందించింది.

  రావణుడు సీతమాటలన్నీ అప్రియంగా ఉన్నా విని, కోపం వచ్చినా ఆమె పట్ల మోహం చేత తనకు వశమవ్వడానికి సీతకు రెండు మాసాల గడువు ఇస్తాడు.ఇలాంటి చులకన స్వభావంకల రావణుడు రెండు నెలల గడువు నివ్వడం విని శింశుపావృక్షం వద్దకు పోయి విలపించి, రాముని తలపులతో ప్రాణాలు విడవాలని సీత నిశ్చయించుకుంది. సీత ధర్మాన్ని ఆలోచించి ఆత్మహత్యను పాపకార్యంగా భావించి ఆలోచిస్తుండగా ఆమెకు అనేక శుభశకునాలు కనిపించాయి. హనుమంతుడు సీత పడుతున్న ఆవేదన అంతా స్వయంగా విన్నాడు. త్రిజట స్వప్న వృత్తాంతమంతా అత్యంత ఆసక్తితో ఆలకించాడు. సీతాదేవిని చూడగలిగాడు. రామకార్యం సగం పూర్తి అయింది గదా! అని సంతోషించాడు.సీతకు వినబడే విధంగా రాముణ్ణి మధురాతి మధురంగా కీర్తించాడు. హనుమంతుడి మాటలు వినబడిన దిక్కుగా తలపైకెత్తి చూసింది. అతణ్ణి చూసి కలవరపడింది. ఆశ్చర్యపడింది. వానరుడి రూపం భయంకరంగా ఉండడంతో స్పృహతప్పినట్లయింది. చేష్టలుడిగిన సీతాదేవి వానరుని గురించి ఆలోచించుతుండగా హనుమంతుడు సీతాదేవికి వినయంగా శిరస్సు వంచి రెండుచేతులతో నమస్కరిస్తాడు. నీకు సర్వ శుభాలు కలగాలని కోరుకుంటున్నాను. జనస్థానం నుండి రావణుడు అపహరించిన సీతాదేవివి కదా! నీ దైన్య స్థితి చూస్తే నీవు రాముని భార్యవని నాకు అనిపిస్తోంది అన్నాడు. సీత హనుమంతునికి తన వృత్తాంతము చెప్పి, నిజానికి నీవు వానరుడవా..లేక మాయా రూపంలో వచ్చిన రావణుడివా అని సందేహపడ్తుంది. ఓ దేవీ! నీవు సందేహపడినట్లుగా నేను రావణుడను కాను. నా మాటలు విశ్వసించు. అని అనేక విషయాలను గుర్తుచేస్తూ నేను రామదూతగా వచ్చాను.ఇదిగో! ఆ ఉంగరాన్ని చూడు.  రామ ముద్రికతో ఉన్న ఈ ఉంగరము  మహాత్ముడైన రాముడు నీకిమ్మన్నాడు. నీకు ఇకపై అన్నీ శుభాలే అన్నాడు. జానకి భర్త పంపిన ఉంగరాన్ని తీసుకొని రాముడిదేనని గుర్తించి, భర్త సందేశాన్ని హనుమ ద్వారా విని సంతోషించింది. హనుమంతుణ్ణి ప్రత్యక్షదైవంగా భావించి ప్రశంసించింది.

   కానీ హనుమతో వెళ్ళడానికి నిరాకరించింది." ఓ హనుమంతుడా! ఈ కార్యం  నెరవేరరడానికి అంటే ఈ చెరనుండి విడిపించడానికి, రామప్రభువు నా దు:ఖం పోగొట్టడానికి నీవే కర్తవు కావాలి. నీ ద్వారానే ఆ మహానుభావుడు నన్నుతీసుకెళ్ళే ప్రయత్నం చేస్తాడు. నా భర్తతో ఈ మాట మరీ మరీ చెప్పు. " ఓ రామప్రభూ! నేను ఇంకా ఒక్క మాసమే జీవించి ఉంటాను. నేను శపధం చేసి చెప్తున్నాను. పాపాత్ముడైన రావణునిచే అపహరింపబడిన నన్ను రామప్రభువే తీసుకొనిపోవాలి."తరువాత తన చీర కొంగునుండి సుందరమైన దివ్యమైన చూడామణిని తీసి రాముడికి తన ఆనవాలుగా ఇమ్మంది. హనుమంతుడు ఆ చూడామణిని తీసుకొని తన వేలుకి ధరించాడు. సీతమ్మ దర్శనం అయింది; రామకార్యం సిద్ధించింది. అని సంబరంతో సీతాదేవి అనుమతితో చూడామణిని తీసుకొని కిష్కింధకు ప్రయాణమయ్యాడు. కానీ రావణాదులు బంధించడంతో... రామదూతగా వచ్చానని చెప్పినా.. ఆలకించకపోవటంతో తోకకు నిప్పు పెట్టినా.. తనకు ఏమీ కాకపోయినా, అగ్ని ఆవహించి ఉన్నాడు. ఆయనకు ఏదైనా హోమద్రవ్యాన్ని సమర్పించి ఆయన్ని తృప్తి పరుస్తాను అనుకొని రాక్షస భవనాలకు, లంకా పట్టణానికి నిప్పు పెట్టి లంకాదహనం గావించాడు. సీతాదేవి క్షేమంగురించి భయపడి మరల సీతాదేవిని దర్శించాడు. హనుమంతుడు సీతాదేవిని శింశుపావృక్షానికి దగ్గరలో కూర్చొని ఉండడం చూసాడు. మనస్సులోని భయాలు తొలగిపోగా మహదానందపడిపోయాడు. ఆమెకు నమస్కారం చేసి .. నీవు క్షేమంగా ఉండటం చూసి ఆనందంగా బయలుదేరుతున్నాను నీ అనుమతితో అని భయంకరంగా గర్జిస్తున్న సముద్రాన్ని దాటి  ఉత్తరపు దిక్కున ఉన్న ఒడ్డుకు చేరుకునేందుకు హనుమ ఆకాశంపైకి ఎగిరాడు. సముద్రతీరాన హనుమంతుడు ఎప్పుడు వస్తాడా అని చూస్తున్న వానరయోధులకు హనుమంతుని సింహనాదం వినిపించింది. జాంబవంతుదు వానరయోధులారా! హనుమంతుడు విజయలక్ష్మితో తిరిగి వస్తున్నాడు. అని అన్నాడు. హనుమంతుడు వాయువేగంతో సెలయేటి గట్టున దిగాడు. 




 గురువుకు నమస్కరించి, పెద్దలకు,జాంబవంతుడికి నమస్కరించి.. వారందరినీ ఉద్దేశించి "సీతమ్మను చూసాను" అన్నాడు.హనుమంతుడు లంకా విశేషాలను వివరించాడు."లంకాదహన ఘట్టం అంతరార్ధాన్ని పరిశీలిస్తే లంకా పదాన్ని తిరగేస్తే కాలం అవుతుంది. కాలం అంటే నలుపు అని అర్ధం. అది తమో గుణానికి సంకేతం. రాక్షసత్వం తమోమయం. ఆ తమోగుణాన్ని సాధకుడు తన కృషితో దహించివేయాలి."  విభీషణుడు జ్ఞాని.  హనుమ విభీషణుడి మందిరంవైపు వెళ్ళలేదు. సాత్విక గుణసంపన్నులైన మండోదరి, త్రిజటల మందిరాలవైపు చూడలేదు. వారికి ఎటువంటి హానీ కలిగించకుండా ఆయన లంకానగర దహనకాండ కొనసాగించాడు. సాధించిన విజయంతో  తన ఆనందాన్ని కపివీరులతో పంచుకున్నాడు. వారితో కలిసి కిష్కింధ చేరుకొని సీత వృత్తాంతాన్ని రామునికి తెలిపాడు. సీతమ్మ ఇచ్చిన 'చూడామణి 'ని శ్రీరామచంద్రుడికి అందజేసి సంతోషపరిచాడు. పరమాత్మను ఆనందభరితుణ్ణి చేశాడు. ప్రకృతి శక్తుల సమాహారమే జీవాత్మ. జానకీ మాత ప్రకృతి. శ్రీరాముడు పరమాత్మ. జీవాత్మను పరమాత్మతో జతచేయడమే హనుమంతుడి కర్తవ్యం. జీవాత్మ, పరమాత్మల ఆనందాన్ని చూసి బ్రహ్మానందభరితుడయ్యాడు. హనుమంతుడి విజయం లోకకల్యాణకారకమైంది. ఆయన శ్రీరాముడి ఆలింగన భాగ్యాన్ని పొందాడు.


 సర్వం శ్రీ సాయిరామార్పణ మస్తు













Wednesday, November 9, 2016 0 comments By: visalakshi

సీతాన్వేషణ -నాలుగవభాగం

 వర్షాకాలం గడిచిపోయింది. శరదృతువు ప్రారంభమైంది. వర్షాలు తగ్గి నేల గట్టి పడింది. సుగ్రీవుడు శరదృతువు ప్రారంభం కాగానే సీతను వెదకడానికి ఏర్పాట్లు చెయ్యాలి. కానీ అతడి జాడ లేదు. అంత:పురంలో భార్యలతో శృంగారజీవితం సాగిస్తూ తనమాట మర్చిపోయాడు - అనిపించింది రాముడికి.  తమ్ముడిని పిలిచాడు. 

 లక్ష్మణా! సీతాన్వేషణ చేస్తానని మాటయిచ్చి సుగ్రీవుడు తనపని పూర్తికావడంతో నన్ను ఉపేక్షిస్తున్నాడు. మనమిక్కడ దు:ఖంలో పడి కొట్టుకుంటూ క్షణమొక యుగంలా గడుపుతుంటే అతడక్కడ రాజభోగాల్లో మునిగి తేలుతూ మనని మర్చిపోయాడు. సుగ్రీవుడు యిప్పుడు రాజయ్యాడు. నేను రాజ్యం పోగొట్టుకొని ఉన్నాను. ఆ వానరుడు భార్యను చేరి ఆనందిస్తున్నాడు. నేను భార్యావియోగంతో దు:ఖిస్తున్నాను. అతడి దృష్టిలో నేను అనాధుణ్ణి, రాజ్యభ్రష్టుణ్ణి . ఇల్లూ వాకిలీ లేకుండా తిరుగుతున్న వాణ్ణి. రావణుడి చేతిలో అవమానం పొందినవాణ్ణి. అతని సహాయం మీద ఆధారపడిన వాణ్ణి. ఇలా అనుకుని నన్ను చులకన చేసి అవమానిస్తున్నాడు. వెంటనే కిష్కింధకు వెళ్ళు. స్త్రీ సాంగత్యంలో మననీ, మనపట్ల కర్తవ్యాన్నీ మర్చిపోయిన ఆ మూర్ఖుడికి నా మాట చెప్పు.





 'తమ పనులు మిత్రులచేత చేయించుకుని, ఆ మిత్రుల పనికి ఉపయోగపడని వాడిని కృతఘ్నుడంటారు. యుద్ధంలో నేను చేసే ధనుష్టంకారం వినాలనుకుంటున్నావేమో! ఆ పని చెయ్యకు. మన మధ్య ఒప్పందం ఒకటుంది. దానిమీద నిలబడు. వాలిని అనుసరించి వెళ్ళేందుకు ప్రయత్నించకు. నేను సత్యాన్నీ, ధర్మాన్నీ రక్షిస్తానని ప్రతిజ్ఞ చేసాను. ధర్మాన్ని అతిక్రమించినందుకు వాలిని చంపాను. ఇప్పుడు నువ్వు సత్యాన్ని అతిక్రమిస్తే నిన్నే కాదు, నీ బంధువర్గాన్నంతటిని   చంపుతాను. క్షణికమైన సుఖాలలో పడి కొట్టుకుపోకు. శాశ్వతమైన ధర్మాన్ని గమనించు. ఇచ్చిన మాట నిలబెట్టుకో. ' లక్ష్మణా ఈ మాటలు సుగ్రీవుడికి చెప్పు అన్నాడు. 

సీతను వెదకడం నాలుగునెలల తరువాత ప్రారంభిద్దామని రాముడు చెప్తే దానిని సాకుగా తీసుకుని నాలుగు నెలలుగా సుగ్రీవుడు ప్రస్రవణ పర్వతం వైపు కనీసం తొంగి చూడలేదు. అసలు తమ ఉనికినే గుర్తించనట్లు ప్రవర్తించాడు. లక్ష్మణుడికి కోపం వస్తోంది..కానీ కోపం ఇన్నాళ్ళూ అణిచి పెట్టుకున్నాడు. ఇప్పుడు రాముడు ఒక మార్గం చూపించాడు. అంతే! అగ్నిపర్వతం బద్దలైంది. రామా! ఈ సుగ్రీవుడు మంచీ చెడూ తెలియని అవివేకి. ఇటువంటి వాడికి రాజ్యం ఇవ్వకూడదు. వీడు వానరరాజ్యం అనుభవించే హక్కు పోగొట్టుకున్నాడు.నీ అనుగ్రహంతో ఇంత వైభవం పొంది ఉపకారం చెయ్యాలని మర్చిపోయాడు. ఇక ఈ కోపాన్ని అణుచుకోలేను. సుగ్రీవణ్ణి ఇపుడే వధిస్తాను. వాలి పుత్రుడైన అంగదుడు సీతమ్మను వెదుకుతాడు.అంటూ ధనుస్సు అందుకున్నాడు. రాముడు లక్ష్మణుణ్ణి ఇలా అనునయించాడు.

 లక్ష్మణా! మనం సుగ్రీవుడితో స్నేహం చేసాం. ఒకరికొకరు సాయం చేసుకోవాలని ఒప్పందం చేసుకున్నాం. అతడు మంచివాడని నమ్మాం. దనువు కూడా చాలా మంచివాడని చెప్పాడు. సీతాన్వేషణకు ఇతడే మనకు ఆధారం. ఎంత వీరుడైనా కోపాన్ని అణుచుకుంటేనే పురుషశ్రేష్ఠుడౌతాడు. చెప్పిన సమయానికి స్పందించకపోవడం సుగ్రీవుడు చేసిన తప్పు. దానికోసం పరుషంగా మాట్లాడకుడదు. అతడితో మంచిగా మాట్లాడి పని సాధించుకురా. అన్నాడు. కోపం తీవ్రత తగ్గినా కోపం తగ్గలేదు. చక్కటి సుగమమైన కాలిబాట ఉన్నా, దుర్గమమైన దగ్గర దారిలో నడుస్తూ సుగ్రీవుని తలచుకొని కోపంతో చెట్లకొమ్మలు విరిచేస్తున్నాడు.. చేతికందిన బండరాళ్ళను బంతుల్లా విసిరేస్తూ..కిష్కింధకు చేరాడు.

 వానరవీరులు లక్ష్మణుడు దగ్గరకు సమీపిస్తుంటే అతణ్ణి గుర్తించారు. ఆతని రౌద్రరూపం చూసి సుగ్రీవుడి వద్దకు వెళ్ళి లక్ష్మణుడు కోపంతో మండిపడుతూ వస్తున్నాడని చెప్పారు.  సుగ్రీవుడు మద్యం మత్తులో అందమైన స్త్రీలమధ్య ఉన్నాడు. అతడికి వానరుల మాటలు వినబడలేదు. తాను వచ్చినా సుగ్రీవుడినుంచి స్పందన లేకపోవడంతో లక్ష్మణుడికి కోపం మరింత పెరిగింది. ఈలోగా అతడికి అంగదుడు కనిపించాడు. కోపాన్ని అదుపు చేసుకుని శాంతంగా, 'నాయనా! అన్నగారి దు:ఖం చూడలేక లక్ష్మణుడు వచ్చాడు.నీ నగరద్వారం ముందు నిలుచున్నాడు- అని సుగ్రీవునికి చెప్పు.' అన్నాడు. సుగ్రీవుడికి అంగదుడి మాటలూ వినబడలేదు. అంతలో లక్ష్మణుడు రాజప్రసాదం సమీపించాడు.అతణ్ణి ప్రసన్నం చేసుకుందుకు అనేకవేలమంది వానరవీరులు   సింహనాదాలు చేసారు. ఆ కోలాహలానికి సుగ్రీవుడికి కొంత మత్తు వదిలింది. అంగదుడి వెనుక అంత:పురంలోకి చనువుగా రాగలిగిన మంత్రులు ప్లక్షుడూ, ప్రభావుడూ, హనుమంతుడూ వచ్చారు. వారు లక్ష్మణుడు తీవ్రమైన కోపంతో ధనుస్సు ధరించి రాజభవనం ముందు నిల్చున్నాడని చెప్పారు. హనుమంతుడు సుగ్రీవునికి కర్తవ్యం బోధిస్తాడు. ఓ వానరరాజా! నీవు మనస్సులో కూడా రామలక్ష్మణుల ఆజ్ఞలను నిర్లక్ష్యం చేయకూడదు. రాముడి బలం ఏమిటో నువ్వే చూసావు. ఇక అతడి వద్ద ఉన్న దివ్యాస్త్రాల గూర్చి నీవు ఊహించనైనా ఊహించలేవు సుమా !




 సుగ్రీవుని వద్దకు వెళ్ళిన అంగదుడు లక్ష్మణుని వద్దకు వచ్చి సాదరంగా లోనికి రమ్మని ఆహ్వానించాడు. లక్ష్మణుడు అన్నీ దాటుకుంటూ అంత:పురంలోకి ప్రవేశించాడు. ధనిష్ఠంకారానికి సుగ్రీవుడు ఉలిక్కిపడి, ఎదుటపడడానికి భయపడి..తారను పంపాడు. తార లక్ష్మణుని నీ కోపానికి కారణమేమిటని ప్రశ్నించింది. సుగ్రీవుడు ప్రత్యుపకారాన్ని మరచి కాలాయాపన చేస్తున్నాడు. .అనగా..  నాయనా! నీవు ఉత్తముడవు నా మాట నమ్ము. సుగ్రీవుడు కామ కలాపాల్లో మునిగి ఉన్నా మీ విషయంలో ఏమరి లేడు. కార్యసాధనకు అవసరమయ్యే ప్రయత్నాలన్నీ ముమ్మరంగా చేస్తున్నాడు. నీవు పరస్త్రీలు ఉన్నారని బిడియపడుతూ ఇక్కడే నిలబడిపోయావు నీవు సదాచారవంతుడవు.  కానీ మిత్రుల భార్యలను చూడటంలో కానీ, మాట్లాడడంలో గానీ దోషం ఏమీ లేదు. అందువల్ల లోపలికి రా! సుగ్రీవుణ్ణి చూడు. అతడితో మాట్లాడు. కోపంతో ఎరుపెక్కి ఉన్న కళ్ళతో లక్ష్మణుడు ...లోపలికి ప్రవేశించాడు. బంగారు ఆసనంపై కూర్చొని ఉన్న సుగ్రీవుడు విశాలనేత్రుడైన లక్ష్మణుని చూశాడు.  ఎదురు వచ్చి చేతులు జోడించి నిలబడ్డాడు. అతడి వెనుక రుమ ఇతర స్త్రీలు నిలబడ్డారు. అతడి వేషాన్ని చూడగానే అంతవరకు అణుచుకున్న కోపం తన్నుకొచ్చింది లక్ష్మణుడికి. 

 సుగ్రీవా! ఉపకారం చేసిన మిత్రులకు సహాయం చేస్తానని మాట యిచ్చి,ఆ మాట నిలబెట్టుకోని రాజుకంటే క్రూరుడు యీ లోకలో ఉండడు.ముఖం చాటేసేవాడిని కృతఘ్నుడంటారు. ప్రత్యుపకారం చేస్తానని రాముడి ముందు ప్రతిజ్ఞ చేసావు. కానీ ఏమీ చెయ్యలేదు..వాలి మార్గంలో వెళ్ళాలని ప్రయత్నించకు. రాముని గుర్తు తెచ్చుకో ఉత్తరక్షణంలో వాలిని చేరుకుంటావు అన్నాడు. పిడుగుల్లాంటి ఆ మాటలకు సుగ్రీవుని నోట మాట లేదు. తార కలగజేసుకొని, కొండగుహల్లో గడిపినవాడికి గొప్ప సుఖం దొరకడంతో కాలగమనం మర్చిపోయాడు. సుగ్రీవుడు రాముడికి ప్రత్యుపకారం చెయ్యాలనే కృతనిశ్చయంతో ఉన్నాడు. సుగ్రీవుడికోసం నిన్ను ప్రార్ధిస్తున్నాను.వేడుకుంటున్నాను.కోపంవదిలిపెట్టు.అంది.  సుగ్రీవుడు కుడా చేతులు జోడించి వినయపూర్వకంగా రాముడి అనుగ్రహంతో రాజ్య లభించింది. ఇంతటి ఉపకారానికి ఎంత చేసినా ప్రత్యుపకారం అవదు. రాముడు సీతను తన బలపరాక్రమాల చేతనే పొందగలడు. నేను చేసే సహాయం కేవలం నామమాత్రమే. నా వలన ఏదైనా పొరపాటు జరిగితే నన్ను మన్నించాలి.అన్నాడు.  సుగ్రీవుడి మాటలు విన్న లక్ష్మణుడికి కోపం పూర్తిగా పోయింది. ప్రేమగా నువ్వు సహాయంగా ఉంటే రాముడికి అంతా మేలే జరుగుతుంది. నీ ప్రభావం గొప్పది. నువ్వు వెంటనే బయల్దేరు. దు:ఖిస్తున్న నీ మిత్రుణ్ణి ఓదార్చు. నాలుగు నెలలుగా రాముడు అనుభవిస్తున్న దు:ఖాన్ని చూసి తట్టుకోలేక ఇంతకు ముందు పరుషంగా మాట్లాడాను. 'క్షమస్వ సఖే మమ ' నన్ను క్షమించు. ఇదీ లక్ష్మణుడి ఔదార్యం. సుగ్రీవుడూ, లక్ష్మణుడూ రాముడున్న గుహకు వచ్చారు. వారివెంట కోట్లమంది వానరులు వచ్చారు. సుగ్రీవుడు రాముణ్ణి చుడగానే చేతులు జోడించి నమస్కరించాడు. సమీపించి సాష్టాంగ నమస్కారం చేసాడు. రాముడు వానరరాజును లేవనెత్తి ప్రేమగా కౌగలించుకుని తన పక్కన కూర్చోపెట్టుకున్నాడు.అతడి పట్ల చూపవలసిన గౌరవమంతా చూపించి, మెత్తగా హితబోధ చేసాడు.రాజు మిత్రులను సంపాదించాలి. శత్రువులను ఎదుర్కోవాలి. ఇప్పుడు శత్రువుని ఎదుర్కొనే సమయం వచ్చింది. సీతజాడ ఎలా తెలుసుకోవాలో నీ మంత్రులతో ఆలోచించి తగిన ఏర్పాట్లు చెయ్యి అన్నాడు.



 సుగ్రీవుడు ఒక్క క్షణం ఆలస్యం చెయ్యకుండా ఎవరేం చెయ్యాలో చెప్పాడు. వినతుడనే వానరరాజుని లక్షమంది వానరవీరులతో తూర్పు దిక్కున వెదకమన్నాడు. అంగదుడి నాయకత్వంలో హనుమంతుడు, జాంబవంతుడు, నీలుడు, గజుడు, గవయుడు,గవాక్షుడు, మైందద్వివిదులు మొదలైన మహావీరులతో ఒక గొప్ప సైన్యాన్ని దక్షిణదిశలో వెదకమన్నాడు. శతబలి అనే వీరుడి నాయకత్వంలో గొప్ప సైన్యాన్ని ఉత్తర దిశకు పంపాడు. వారు ఒక్కొక్కరూ వెదకవలసిన ప్రదేశాలు వివరంగా చెప్పాడు. వెదకడం పూర్తి చేసి వెనక్కి రావడానికి అందరికీ ఒక్క నెల గడువు ఇచ్చాడు. గడువు దాటి వచ్చేవారికి దండన మరణశిక్షే అని హెచ్చరించాడు.అందరికీ అన్నీ చెప్పి హనుమంతుని పిలిచాడు. 

 "హనుమా! నీకు భూమిమీద గానీ, ఆకాశంలో గానీ, నీటిలో గానీ కోరినట్లు సంచరించే శక్తి ఉంది. నీ తండ్రి వాయుదేవుడితో సమానమైన వేగముంది. తెలివిలోనూ, బలంలోనూ నీకు నువ్వే సాటి. సీతాన్వేషణలో నీదే కీలకమైన బాధ్యత "అన్నాడు. సుగ్రీవుడు హనుమంతుడితో చెప్పన మాటలు రాముడు విన్నాడు. అతడే సీతజాడ తెలుసుకోగలడనుకున్నాడు. వెంటనే తన పేరు చెక్కిన ఉంగరాన్ని హనుమంతుడికిచ్చాడు. 'ఈ ఉంగరాన్ని సీతకిస్తే ఆమె దీనిని గుర్తు పడుతుంది. నిన్ను నేనే పంపానని నమ్ముతుంది. భయపడకుండా నీతో మాట్లాడుతుంది.' అన్నాడు హనుమంతుడు ఆ ఉంగరాన్ని భక్తిగా శిరస్సుమీద ఉంచుకుని, తరువాత జాగ్రత్తగా దాచి రాముడికి పాదాభివందనం చేసాడు. అందరూ రాజాజ్ఞప్రకారం వెదకడానికి బయలుదేరారు. నెల గడిచేలోగా తూర్పు, పడమర, ఉత్తర దిశలకు వెళ్ళినవారు వెనక్కి వచ్చి సీతజాడ తెలియలేదన్నారు. నెలగడచిపోయాక దక్షిణదిశకు వెళ్ళినవారు వచ్చి సీతజాడ హనుమంతుడు కనుగొన్నాడన్నారు. ఎలా కనుగొన్నాడన్నది చివరిభాగంలో......

 సర్వం శ్రీసాయిరామార్పణ మస్తు














Tuesday, November 8, 2016 0 comments By: visalakshi

సీతాన్వేషణ - మూడవభాగం

 రామలక్ష్మణులు మతంగాశ్రమం నుంచి బయల్దేరి, పంపాసరస్సును చుట్టి అవతలి వైపుకు వెడుతున్నారు. ఆ సరోవరం తీరం వసంతశోభతో కలకలలాడుతోంది. సరోవరంలో పద్మాలూ, కలువలూ పుష్కలంగా ఉన్నాయి. నీటిలో అనేకరకాల చేపలు మిలమిలలాడుతూ  కదుల్తున్నాయి. పక్షులూ, జంతువులూ ఉత్సాహంతో జతలు కడుతున్నాయి. 

ఆ రమణీయమైన ప్రకృతిని చూస్తూ రాముడు విషాదానికి లోనయ్యాడు. రాముడికి తామరపూవులను చూస్తే సీతమ్మ ముఖం జ్ఞాపకం వచ్చింది. కలువపూవులను చూస్తే సీతమ్మ కళ్ళు గుర్తుకొచ్చాయి. కదిలే చేపలను చూస్తే ఆమె చూపులు గుర్తుకొచ్చాయి...పురివిప్పి ఆడుతున్న మగనెమలిని చూసి రాముడికి మరింత దు:ఖం వచ్చింది. 'అవునులే దాని భార్యను రాక్షసుడు ఎత్తుకుపోలేదు. అది ఆనందంగానే ఉంటుంది.' అన్నాడు. క్రమంగా విరహవేదన ఆయన బుద్ధిని కప్పివేసింది. 




 లక్ష్మణుడు రాముణ్ణి ఓదార్చి కర్తవ్యం జ్ఞాపకం చేసాడు." రామా! ఎంత ప్రేమించిన వారినైనా వియోగం ఏర్పడినప్పుడు నిరంతరం అదే పనిగా జ్ఞాపకం చేసుకోవడం మంచిది కాదు. అతిస్నేహం అతిదు:ఖానికి దారితీస్తుంది. ఆలోచన క్రమంగా ఉండదు. ఆత్మవిశ్వాసం  తగ్గుతుంది. ఉత్సాహమే  బలం.
ఆత్మవిశ్వాసమున్నఉత్సాహవంతుడు సాధించలేనిదిలేదు. ఓటమిఉండదు.
త్సాహంతో సీతమ్మను తెచ్చుకునేందుకు ప్రయత్నిద్దాం.రావణుడు పాతాళంలో ఉన్నా, ఇంకే లోకాలలో ఉన్నా వాడు చేసిన పనికి మరణించక తప్పదు. వాడు నీకు సీతనైనా అప్పగించాలి. ప్రాణాన్నైనా అప్పగించాలి. మనస్సును కుదుట పర్చుకో. ధైర్యాన్ని అవలంభించు. కామప్రకోపం కలిగించే ఊహల్ని పక్కకు నెట్టు. నువ్వెంత మహాత్ముడివో జ్ఞాపకం చేసుకో. 

 రాముడు శోకమోహాలు వదిలిపెట్టాడు. వారు ముందుకు సాగారు. ఋశ్యమూక పర్వతాన్ని సమీపిస్తుంటే సంన్యాసి వేషంలో ఉన్న హనుమంతుడు వారికి ఎదురయ్యాడు. వారు సుగ్రీవుడికై వెదుకుచుండగా..వారెవరో తెలుసుకోమని సుగ్రీవుడు తనమంత్రిని పంపాడు. వెదకబోయిన తీగ కాలికి తగిలింది. హనుమంతుడు నెమ్మదిగా రామలక్ష్మణుల వద్దకు వెళ్ళి వినయంగా వాళ్ళకు నమస్కరించి మృదుమధురంగా..మహాత్ముల్లారా ! మీరు చూట్టానికి దేవతల్లా ఉన్నారు. మీ ముఖవర్చస్సు చూస్తే రాజర్షుల్లా కనిపిస్తున్నారు. మునుల వేషంలో ఉన్నారు. ధనుస్సు,బాణాలు,ఖడ్గము ధరించారు.మీరు ఎవరు? అని పలువిధాల వారిని శ్రేష్ఠులుగా అభివర్ణిస్తూ..ఓ నరశ్రేష్ఠులారా ! నేను ఇంతసేపు మాట్లాడినా మీరు బదులు చెప్పరేమి? సరే. నేనే విషయానికొస్తాను.. ధర్మాత్ముడు, వీరుడు అయిన సుగ్రీవుడు అనే వానరరాజు ఉన్నాడు. అతడు తన అన్నగారైన వాలిచేత అవమానింపబడి దేశం నుండి వెళ్ళగొట్టబడ్డాడు. అతడు ఈ పర్వతంపై తల దాచుకుంటున్నాడు. నేనుకూడా వానరాన్నే . నా పేరు 'హనుమంతుడు ' సుగ్రీవుడు పంపగా వచ్చాను. రాముడు మహదానందం పొందుతూ లక్ష్మణా! చూసావా మనం ఏ వానరరాజైన సుగ్రీవుణ్ణి వెతుక్కుంటూ వచ్చామో, అదే సుగ్రీవుడి మంత్రి అయిన ఈ హనుమంతుడు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఈ వానరుడు మంచి మాటకారి. స్నేహపాత్రుడు. శత్రుసంహారం చేయగల శక్తీ, నేర్పు రెండూ ఉన్నాయి.అటువంటి ఈ హనుమంతునితో స్నేహంగానూ, మధురంగానూ మాట్లాడు. అన్ని వేదాలూ చదివిన వేదవిదుడిలా కనిపిస్తున్నాడు.ఈతని పలుకు వ్యాకరణబద్ధంగా ఉంది. 




 రాముని మాటలు విన్న లక్ష్మణుడు.. హనుమంతునితో ఓ బుద్ధిమంతుడా మేము రామలక్ష్మణులం..మహాత్ముడైన సుగ్రీవుని గుణాలను గూర్చి మేము ఎరుగుదుము. మేము సుగ్రీవుని మైత్రికై వచ్చాం. సత్పురుషులలో శ్రేష్ఠుడవైన ఓ హనుమంతుడా! మేము సుగ్రీవుడు కోరినట్లు అతడితో స్నేహం చేయడానికి వచ్చాం.

 రామసుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు. ఒకరి కధ ఒకరికి చెప్పుకున్నారు. రాముడు వాలిని చంపుతానని ప్రతిజ్ఞ చేసాడు. సీతమ్మ ఎక్కడున్నా వెదికించి ఆమెను తిరిగి పొందడానికి సహాయం చేస్తానని సుగ్రీవుడు ప్రతిజ్ఞ చేసాడు. రాక్షసుడొకడు ఒక స్త్రీని బలవంతంగా పట్టుకుని ఆకాశమార్గంలో దక్షిణదిశకు తీసుకువెడుతుంటే తాము చూసామని సుగ్రీవుడు చెప్పాడు. ఆమె రామా! రామా! లక్ష్మణా! లక్ష్మణా! అని ఏడ్చిందన్నాడు. ఆమె కూడా తమను చూసి, కొన్ని నగలు పట్టుబట్టలో కట్టి తామున్న చోటుకి విసిరిందనీ, ఆ మూట అలాగే భద్రపరిచామనీ చెప్పాడు. ఆ మూట తీసుకువచ్చి రాముడికిచ్చాడు. 




ఆ పట్టుబట్టను గుర్తించిన రాముడి కళ్ళు జలపాతాలైపోయాయి. చూపు మసకబారింది. లక్ష్మణుణ్ణి ఆ ఆభరణాలు చూడమన్నాడు. లక్ష్మణుడు చెప్పిన సమాధానం:...

'నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే,
 నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్.


సోదరా! ఆమె భుజాలకు ధరించే అలంకారాలు గాని, చెవులకు ధరించే కుండలాలుగాని నేనెపుడూ చూడలేదు. ఎందుకంటే తలెత్తి నేనెపుడూ సీతమ్మను చూడలేదు. నిత్యం ఆమె పాదాలకు నమస్కరించడం వలన ఆమె పాదాలకుండే నూపురాలను మాత్రం గుర్తించగలను అన్నాడు. ఆ భావాన్ని భక్తిభావమనవచ్చు .  

 వాలి సుగ్రీవుల వైరానికి గల కారణాలు తెలుసుకున్న రాముడు ఇచ్చిన మాట ప్రకారం వాలిని వధించాడు. సుగ్రీవుడు వానర సామ్రాజ్యానికి ప్రభువయ్యాడు.రాజ్యాభిషిక్తుడైన సుగ్రీవుడు రాముని అనుమతి పొంది కిష్కింధా నగరానికి వెళ్ళాడు. తరువాత రామలక్ష్మణులు ప్రస్రవణ పర్వతంపై నివసించాలనుకున్నారు. అక్కడికి కిష్కింధ కూడా దగ్గర్లోనే ఉంది. అప్పటికి వర్షాకాలం ప్రారంభమౌతోంది. ఆ కాలం సీతాన్వేషణకు అనువైనది కాదు కనుక నాలుగు నెలల తరువాత ఆ ఏర్పాట్లు చేయమని రాముడు సుగ్రీవునకు ఆదేశించాడు. రామలక్ష్మణులు ప్రస్రవణపర్వతం మీద ఒక విశాలమైన గుహలో ఉన్నారు.

రాముడు సుగ్రీవాదుల సహాయం ఎలా వినియోగించుకున్నాడు....తదుపరి భాగంలో....  


సర్వం శ్రీసాయిరామార్పణ మస్తు.