Tuesday, January 31, 2017 0 comments By: visalakshi

శరణం - స్మరణం

శ్లో"  కాయ వాంజ్మన:  కార్యముత్తమం 
       పూజనం జప  శ్చింతనం క్రమాత్.  (రమణ మహర్షి)


 భావం:- భగవంతుడు అనుగ్రహించిన దేహాన్ని పూజకీ, వాక్కుని జపానికీ, మనస్సుని ధ్యానానికీ వినియోగించాలి. ఇవన్నీ క్రమంగా ఒకదానికన్నా తరువాతది ఉత్తమం.




సిద్ధపురుషుల లక్షణాలు సాధకుల సాధనాలు అవుతాయి. అవి సంపాదించడానికి గొప్ప ప్రయత్నంతో అభ్యాసం చేయాలి. పాల కడుపులో నెయ్యి ఉంటుంది. కానీ దాన్ని తోడు పెట్టకపోతే మజ్జిగ ఉండదు. వెన్న కూడా ఉండదు. దానికి కొంత అవసరమైన ప్రక్రియ చేయవలసి ఉంటుంది. మజ్జిగ చిలకకపోతే వెన్న లభించదు. దాన్నైనా అగ్నిమీద కాచకపోతే రుచికరమైన నెయ్యి లభించదు. అలాగే సాధకులకు మొదట సంస్కారబలం కావాలి. తరువాత పూర్వాభ్యాసంతో లభించిన బుద్ధికుశలత కావాలి. అభ్యాసం లేకుండా చిత్తశుద్ధి కలుగదు. చిత్తశుద్ధి లేకుండా ఆత్మజ్ఞాన ప్రాప్తి కష్టమౌతుంది. కనుక స్వరూపస్థితి చేతికి చిక్కనంతవరకూ సాధకులు భగవద్భక్తిని వదలకూడదు. ఆత్మజ్ఞానమనే మందిరాన్ని నిర్మించటానికి, నాలుగు రకాల ముక్తులనే కలశాలు తళతళ మెరవటానికి, విరక్తి అనే పతాకం ఎగరటానికి భగవద్భక్తి అనే పునాది అవసరం.

స్వధర్మాచరణ అనే తపస్సు సాధనతో మానవదేహంలో చిత్తశుద్ధి కలుగుతుంది. అఖండ బ్రహ్మసిద్ధి కలుగుతుంది. సాధు సేవే ముక్తికి ఇల్లు. 

చక్కటి సద్వర్తనతో కేవలం శరీరపోషణకై భుజిస్తూ అన్య విషయాల్లో ఏ విధమైన ఆకాంక్ష లేకుండా భగవదనురక్తితో చరించు భగద్భక్తులు ధన్యులు. సాయిబాబా నామస్మరణను నిరంతరం ధ్యానించేవారి  అనుభవంలోని అపూర్వత, మహత్యం చూడండి.బాబా వారికి ఋణపడి వారిని గుర్తు పెట్టుకుంటారు.  స్వయంగా గురువు కూడా భక్తుల స్మరణ చేస్తారు. 

 సాయిబాబా నామం యొక్క అఖండ ఆవర్తనే మనకి నియమం, తపము, దానము. పదే పదే శిరిడీ వెళ్ళటమే మన తీర్ధాటన. ఆయనకి అనన్యంగా శరణు అనటం, "సాయి సాయి" అనే మంత్రాన్ని స్మరించటం, అనుష్టానం చేయటమే మన ధ్యానము, పురశ్చరణ. నిష్కపటంగా ప్రేమతో అనుసంధానాన్ని పెట్టుకొని ఆయన్ని పూజించి చూడండి. ఆయన అతర్క్యలీలలను హృదయంలో అనుభవించి చూడండి.

 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు



సూర్య ఉపనిషత్

Saturday, January 7, 2017 0 comments By: visalakshi

వైకుంఠ ఏకాదశి

ఓం నమో నారాయణాయ 




 అనాది నిధనం విష్ణుం సర్వలోక మహేశ్వరం !
లోకాధ్యక్షం స్తువన్నిత్యం సర్వదు:ఖాతిగోభవేత్ !!

ఆది మధ్యాంత రహితుడు, నిర్వికారుడు, బ్రహ్మాది దేవతలకు ప్రభువు, సర్వలోకాలకు నియామకుడు,సర్వవ్యాపకుడు అయిన శ్రీ మహావిష్ణువును నిరంతరం స్తుతించడంవల్ల సకల దు:ఖాలు తొలగి సంపదలు కలుగుతాయి. వైకుంఠ ఏకాదశినాడు గోపూజ చేయడం చాలా మంచిది. విష్ణుమూర్తి సన్నిధిలో ఆవునేతితో దీపం వెలిగిస్తే అజ్ఞానమనే చీకట్లు తొలగి ముక్తి లభిస్తుందని ప్రతీక. 





వైకుంఠ ఏకాదశి ఉత్తరాయణ ప్రారంభదినం  కావడం వలన ఇది అత్యంత విశిష్టమైన పండుగ. మన ఆరునెలలు దేవతలకు పగలు, మరో ఆరునెలలు రాత్రి. దీని ప్రకారం దేవతలందరూ దక్షిణాయనం నుంచి ఉత్తరాయణ పుణ్యకాలానికి అంటే చీకటి రాత్రి నుంచి వెలుగులు చిమ్మే పగటిలోకి వచ్చారన్నమాట. స్వర్గద్వారాలను తెరవగానే ముందుగా ఈ కాంతి ఉత్తరద్వారం నుంచి ప్రవేశిస్తుంది. అందుకే విష్ణ్వాలయాలలో ఈ రోజు ఉత్తరం వైపున ఉన్న ద్వారాన్ని తెరచి ఉంచుతారు. ఈ ద్వారం నుంచి భక్తులు  స్వామివారిని దర్శించుకోవడం అత్యంత పుణ్యప్రదం.ఈ రోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుండి మేల్కొంటాడు.ఉత్తర ద్వారం నుంచి దర్శనమిస్తాడు.ఉత్తర ద్వారం ద్వారా స్వామి ని దర్శిస్తే ఎంతో పుణ్యఫలం.

 ముక్కోటి అంటే ముప్పది మూడు కోట్ల దేవతలని ఉద్దేశించినది. ఈ ఏకాదశినాడు విష్ణుమూర్తి గరుడ వాహనారూఢుడై ఉత్తర ద్వారాన దర్శనమిస్తాడట. ఆ దివ్యసుందర రూపుని దర్శించుకోవడం కోసం దేవతలందరూ ఈ రోజున దివి నుండి భువికి దిగి వస్తారట. అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరు. ఇదే వైకుంఠద్వారం. వైకుంఠద్వారమే సూర్యుని ఉత్తరాయణ ప్రవేశానికి సూచన. అందుకే ఉత్తరద్వారం నుంచి విష్ణుదేవుని దర్శించుకున్న వారికి మోక్షం లభిస్తుందని పురాణ వచనం. ఈ రోజు విష్ణు సహస్ర నామ పారాయణం బహు శ్రేష్ఠం. 

                          (జనవరి 13వ తేదీ గురువారం వైకుంఠ ఏకాదశి).....


సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.
Friday, January 6, 2017 0 comments By: visalakshi

శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం -2



5 వ శ్లో" దేహం ప్రాణమపీంద్రియాణ్యపి చలాం బుద్ధించ శూన్యం విదు:
            స్త్రీబాలాంధజడోపమాస్త్వహమితి బ్రాంథా భృశం వాదిన: !
            మాయాశక్తి విలాసకల్పిత మహావ్యామోహ సం హారిణే
             తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే !!

భా:- "ఆత్మతత్వమును తెలియజాలని కొందరు, ఆత్మ దేహమనియు, ప్రాణమనియు తప్పుగా గ్రహిస్తారు. బుద్ధిపరంగా స్త్రీలవలె, చిన్నపిల్లలవలె, మూఢులవలె, విషయాలనర్ధం చేసుకునే శక్తిహీనులు,మాయా ప్రభావానికి లోనై, శరీరమే సత్యమనీ, ప్రాణమే సత్యమనీ, ఇంద్రియాలనే సత్యమనీ, మనస్సే సత్యమనీ, నిత్యమూ మార్పు చెందే బుద్ధే సత్యమనీ, శూన్యమే సత్యమనీ శాస్త్రం నుండి తప్పుగా గ్రహిస్తారు. అట్టివారి భ్రమలను తొలగించగలిగే పరమగురువుకు శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా ప్రణామాలు."

6 వ శ్లో"   రాహుగ్రస్త దివాకరేందు సదృశో మాయా సమాచ్చాదనాత్
               సన్మాత్ర: కరణోప సం హరణో యోభూత్సుషుప్త: పుమాన్ !
               ప్రాస్వాప్సమితి ప్రబోధసమయే య: ప్రత్యభిజ్ఞాయతే
               తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే !!

భా:-" గ్రహణ సమయంలో సూర్యచంద్రులు రాహువుచే కప్పబడినట్లుగా, సర్వేంద్రియ వ్యవహారాలూ ఉపశమించిన  సుషుప్తి అవస్థలో ప్రవేశించి మాయావరణతో కూడిన సత్యం సన్నిధిలో విశ్రాంతినొంది మళ్ళీ మెలకువలో తాను నిద్రపోయినట్లుగా తెలుసుకునే పరమసత్యానికి శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా ప్రణామాలు."




7 వ శ్లో"     బాల్యాదిష్వపి జాగ్రదాదిషు తధా సర్వాస్వవస్థాస్వపి
                వ్యావృత్తాస్వనువర్తమాన మహమిత్యంత: స్ఫురంతం సదా !
                స్వాత్మానాం ప్రకటికరోతి భజతాం యో భద్రయా ముద్రయా
                తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే !!

భా:-   " బాల్యకౌమార యౌవన వృద్ధాప్య దశలలోనూ, జాగృత్ స్వప్న సుషుప్తి మొదలైన అన్ని అవస్థలలోనూ భూత వర్తమాన భవిష్యత్ కాలాలలోను, సర్వదా అన్నిప్రాణులలోనూ "నేను"గా ఉంటూ తన భక్తులకు చిన్ముద్ర ద్వారా తన నిజ తత్వాన్ని వ్యక్తం చేసే సద్గురుమూర్తి శ్రీదక్షిణామూర్తికి ఇవే నా ప్రణామాలు."

8 వ శ్లో"      విశ్వం పశ్యతి కార్యకారణతయా స్వస్వామి సంబంధత:
                  శిష్యాచార్యతయా తధైవ పితృపుత్రాద్యాత్మనా భేదత: !
                  స్వప్నే జాగృతి వా య ఏష పురుషో మాయా పరిభ్రామిత:
                  తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే !!


భా:-" ఏ పురుషుడు మాయా ప్రభావంతో తనలో.. కార్యకారణ సంబంధరూపమయిన విశ్వాన్నీ, శిష్యాచార విభేదాన్నీ, పితృపుత్ర మొదలయిన తేడాలనీ జాగృత్ స్వప్నావస్థలనీ చూస్తున్నాడో, ఆయనను, ఆ పరమగురువుకి, శ్రీదక్షిణామూర్తికి ఇవే నా ప్రణామాలు."




9 వ శ్లో"    భూరంభాస్య నలో2నిలో2ంబర మహర్నాధోహిమాంశు: పుమాన్
                ఇత్యాభాతి చరాచరాత్మకమిదం యస్యైవ మూర్త్యష్టకం !
                నాన్యత్కించన విద్యతే విమృశతాం యస్మాత్పరస్మాద్ విభో
                తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే !!


భా:- " ఎవని అష్టమూర్తులు భూమి జలము అగ్ని వాయువు ఆకాశం సూర్యుడు చంద్రుడు జీవుడు విరాజిల్లుతున్నారో, ఎవరు చరాచరమైన జగత్తుగా వ్యక్తమవుతున్నాడో, ఎవనిని ఆరాధించి సర్వవ్యాప్తమయిన ఆత్మతత్వంకంటే వేరుగా రెండవదేదీలేదని సాధకులు తెలుసుకుంటున్నారో .... అట్టి సద్గురువునకు శ్రీదక్షిణామూర్తికి ఇవే నా ప్రణామాలు."


10 వ శ్లో"     సర్వాత్మత్వమితి  స్ఫుటీకృతమిదం యస్మాదముష్మిన్ స్తవే
                   తేనాస్య శ్రవణా త్తదర్ధ మననాద్ధ్యానాచ్చ సంకీర్తనాత్ !
                   సర్వాత్మత్వ మహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వత:
                   సిద్ధ్యేత్ తత్పునరష్టధా పరిణతం చైశ్వర్యమవ్యాహతం !!

భా:-     "  సర్వాత్మత్వం ఈ దక్షిణామూర్తి స్తోత్రము నందు వివరించబడింది. ఈ ప్రపంచము సర్వమూ ఆత్మస్వరూపమే..అని స్పష్టము చేయబడినది. కాబట్టి దీనిని శ్రవణం మననం చేసి ధ్యానించి కీర్తించడంలో అష్టవిభూతి సహితమయిన సర్వాత్మత్వం, ఈశ్వరత్వం, స్వరూపానుభూతి సిద్ధిస్తాయి."



 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు





Thursday, January 5, 2017 0 comments By: visalakshi

శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం - 1

శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం 




ధ్యానం

శ్లో" మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం
     వర్షిష్ఠాంతే వసదృషిగణై రావృతం బ్రహ్మనిష్ఠై:!
     ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్ర మానందరూపం
     స్వాత్మారామం ముదిత వదనం దక్షిణామూర్తి మీడే !!

 భా:- ఆత్మనిష్ఠుడై ప్రసన్నవదనంతో మౌనంగా చిన్ముద్రాంచిత హస్తంతో, వేదవిదులైన మహర్షులకు ఆత్మవిద్యను బోధిస్తున్న యువగురువు శ్రీదక్షిణామూర్తిని నేను ఆరాధిస్తాను.

శ్లో"  వటవిటపి సమీపే భూమిభాగే నిషణ్ణం
    సకలముని జనానాం జ్ఞానదాతారమారాత్ !
    త్రిభువనగురు మీశం దక్షిణామూర్తి దేవం
    జనన మరణ దు:ఖచ్చేద దక్షం నమామి !!

మర్రిచెట్టు క్రింద కూర్చొని తనచుట్టూ ఉన్న మహర్షులకు ఆత్మవిద్యను అందిస్తూ జనన మరణాలతో కూడిన సంసారదు:ఖాలను నిర్మూలిస్తూ ముల్లోకాల చేతనూ గురువుగా కొలవబడే శ్రీ దక్షిణామూర్తికి నమస్కృతులు. 

శ్లో"   చిత్రం వటరోర్మూలే వృద్ధా: శిష్యా గురుర్ యువా !
       గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్నసంశయా: !!

ఆహా! ఎంత ఆశ్చర్యకరం! యువకుడైన గురువుచుట్టూ వృద్ధులైన శిష్యులు శ్రద్ధాభక్తులతో కూర్చొని ఉన్నారు. గురువు తన మౌనంతోనే వారి సర్వసందేహాలనూ నివారింపగలుగుతున్నారు.

శ్లో"   నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణాం !
        గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమ: !! 

భవరోగ బాధితులకు వైద్యుడై జగద్గురువై, జ్ఞానస్వరూపంగా ప్రకాశించే దక్షిణామూర్తికి నమస్కృతులు.

శ్లో"  ఓం నమ: ప్రణవార్ధాయ శుద్ధజ్ఞానైక మూర్తయే !
     నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమ: !!

నిత్యశుద్ధుడవై, ప్రశాంతస్వరూపుడై, శుద్ధజ్ఞానమే మూర్తిగా, ప్రణవనాదమైన ఓంకారానికి లక్ష్యార్ధంగా భాసిస్తూ, నిర్మలుడైన దక్షిణామూర్తికి నమస్కృతులు. 





శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం -  ........

 శ్లో"   విశ్వం దర్పణ దృశ్యమాన నగరీతుల్యం నిజాంతర్గతం
              పశ్యాన్నాత్మని మాయయా బహిరివోద్భూతం యధా నిద్రయా
             య స్సాక్షాత్కురుతే ప్రబోధసమయే స్వాత్మాన మేవాద్వయం
             తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే !!

 భా:-  " నామరూపాత్మకమైన ఈ సర్వజగతినీ, ఆత్మచైతన్యమయిన తనలో లీలామాత్రంగా, స్వానుభవంగా, స్వాత్మగా, అద్దంలో కనిపించే నగరంవలె, స్వప్నదృశ్యం వలె తనకంటే భిన్నంగా ఉందన్న భ్రమ కలిగిస్తోందని గుర్తిస్తున్న జగద్గురువైన శ్రీ దక్షిణామూర్తికి నా నమోవాకాలు... దక్షిణాభి ముఖంగా ఉన్న మూర్తిని(దక్షిణామూర్తిని) ఆ పరబ్రహ్మస్వరూపమే అని ఈ శ్లోకం నిర్ధారిస్తోంది. "

వ శ్లో"   బీజస్యాంతరివాంకురో జగదిదం ప్రాక్ నిర్వికల్పం పున:
              మాయాకల్పిత దేశకాలకలనా వైచిత్ర్య చిత్రీకృతం !
              మయావీవ విజృంభయత్యపి మహాయోగీవ య: స్వేచ్చయా
              తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే !!  

  భా:-  " పరిపూర్ణమూ ఏకమూ అయిన ఆత్మతత్వంతో ఈ సమస్త సృష్టి ఇమిడి ఉంది.  విత్తనంలో మహావృక్షం దాగి ఉన్నట్లుగా గోచరించే ఈ మహావిశ్వమంతా, దేశకాలావృతమైన సమస్త చరాచర జగతినీ, ఇంద్రజాలికునివలె, మహాయోగివలె, బహిర్గతం చేసి తన మాయాశక్తితో స్వేచ్చగా జగన్నాటకాన్ని నడిపే పరమాత్ముడైన నా గురువునకు, శ్రీ దక్షిణామూర్తికి ఇదే నా నమస్కృతులు. "

వ శ్లో"   యస్యైవ స్ఫురణం సదాత్మక మసత్కల్పార్ధకం భాసతే
               సాక్షాత్తత్వమసీతి వేదవచసా యో బోధయత్యాశ్రితాన్ !
               యత్సాక్షాత్కరణాధ్ భవేన్న పునరావృత్తి ర్భవాంభోనిధౌ
               తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే !!

 భా:-    ఆత్మ యొక్క  ఈ ఉనికి ,స్ఫురణా వలననే మనకు వస్తువిషయక జ్ఞానమూ అనుభవమూ సంభవమవుతున్నాయి.  ఈ ఉనికి ,స్ఫురణా ఆత్మలో అంతర్లీనమై ఉన్న లక్షణాలే. ఇదే సర్వానికీ కారణం అని నిశ్చయింపవచ్చును. "ఎవరి వ్యక్తరూపం ఈ ప్రపంచంగా స్ఫురిస్తూ కూడా నిత్యసత్యమై ప్రకాశిస్తూ ఉంటుందో, శ్రద్ధతో శరణువేడినవారికి తత్త్వమస్యాది మహాక్యాలతో ఎవరు జ్ఞానబోధ చేస్తుంటారో, ఎవరి జ్ఞానబోధవల్ల జననమరణయుక్తమైన ఈ సంసారచక్రం నుండి ముక్తిపొందుతున్నారో, అట్టి పరమ పవిత్రమైన గురుమూర్తికి శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా నమస్కృతులు."






వ శ్లో"    నానాచిద్ర ఘటోదరస్థిత మహాదీప ప్రభాభాస్వరం
               జ్ఞానం యస్యతు చక్షురాదికరణద్వారా బహి: స్పందతే !
               జానామీతి తమేవ భాంత మనుభాత్యేతత్సమస్తం జగత్
               తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం  శ్రీ దక్షిణామూర్తయే !!


 భా:-  "  ఆత్మచైతన్యం అంత:కరణలో ప్రతిఫలించి, మనస్సులో సంచలనాన్ని సృష్టించి మన కళ్ళు చెవులు మొదలయిన ఇంద్రియాలద్వారా,బాహ్యంగా ప్రసరిస్తూ 'అనేక చిల్లులు కలిగిన కుండలో ఉన్న దీపకిరణాలవలె, పైకి ప్రసరిస్తూ ఉందో.'.ఏ చైతన్యం ప్రకాశించడం వలన ఈ వస్తుమయ మహా ప్రపంచమంతా తెలియబడుతూ ఉందో.... అటువంటి దివ్యమూర్తికి సద్గురువుకు, శ్రీ దక్షిణామూర్తికి ఇవే నా ప్రణామాలు."

                                                                                         - సశేషం


సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు








Monday, January 2, 2017 0 comments By: visalakshi

త్రికరణశుద్ధి

  ఓం నమో భగవతే వాసుదేవాయ



 ఆడి పాడే వయస్సులోనే అనంతాత్ముడి దర్శనం కోసం వ్యాకుల పడుతున్న బాలుడికి నారదమహర్షి మధువనం వైపు మార్గం చూపాడు. ఓంకారంతో కూడిన పన్నెండక్షరాల మహిమాన్వితమైన వాసుదేవ మంత్రాన్ని ఉపదేశించాడు. 'ఓం నమో భగవతే వాసుదేవాయ ' అనే మంత్రాన్ని ఏడు దినాలు జపిస్తే, ఆ దేవదేవుడి సాక్షాత్కారం సాధ్యమవుతుందని స్పష్టం చేశాడు.  భక్తుడు మనోనిగ్రహం కలవాడై, శాంతుడై, మితభాషియై సదాచార సంపన్నుడై,కందమూలాశనుడై శ్రీహరి కల్యాణ గుణగణాలను ధ్యానించాలని ప్రభోదించాడు.ఇలా సర్వసమర్పణ బుద్ధితో చేసే పూజలను 'ఓం నమో భగవతే వాసుదేవాయ ' అనే మంత్రంతో ఆ వాసుదేవునికి సమర్పించాలని నారద మహర్షి ధ్రువుడికి సూచించారు.  త్రికరణశుద్ధిగా భక్తితో పూజించే భక్తుడు భగవంతుడి మాయలో చిక్కుకొనడని, ధర్మార్ధ కామ మోక్షాలనే పురుషార్ధాలలో కోరినదానిని అనుగ్రహిస్తాడని ఆ బ్రహ్మమానస పుత్రుడు అభయమిచ్చాడు. ఆ నీలమేఘశ్యాముని వర్ణిస్తూ...గరుడవాహనుడిని గరికపోచలతో సేవించాలి. పద్మనేత్రుడైన పరమాత్ముడిని పద్మాలతో పూజించాలి. తులసిదండలు ధరించే స్వామిని తులసీదళాలతో ఆరాధించాలి అని ప్రస్ఫుటం చేశాడు.



నారదమహర్షి ప్రసాదించిన "ఓం నమో భగవతే వాసుదేవాయ " మంత్రాన్ని స్వీకరించి ధ్రువుడు తీవ్ర తపస్సుకు పూనుకున్నాడు.  సమస్త పుణ్యాలకు ఆలవాలమైన మధువనంలో ఉపవాస దీక్షతో, ఏకాగ్రచిత్తుడై భగవంతుణ్ణి ధ్యానింపసాగాడు. ప్రాణవాయువును నిరోధించి పరమాత్మతో అనుసంధించాడు. ఆ బాలుడి అకుంఠిత దీక్షకు భూనభోంతరాలు కంపించిపోయాయి. తుదకు దేవతలందరూ ఆ దేవదేవుడిని లోకరక్షకుడైన పుండరీకాక్షుని శరణు వేడారు. పరమాత్మా! నీవు సర్వప్రాణి శరీరాలలో అంతర్యామిగా ఉండే స్వామివి. పూర్వం ఎప్పుడూ ఈ విధంగా మాకు ప్రాణనిరోధం ప్రాప్తించలేదు. ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతున్నాం. ఓ హరీ! కేశవా! జగదీశ్వరా! సర్వశరణ్యా! నీ చరణ కమలాలను శరణు పొందుతున్నాం ఆపదను తొలగించి కాపాడు ప్రభూ! అని వేడుకున్నారు. వారి విన్నపాన్ని విన్న పరాత్పరుడు వారిని ఓదారుస్తూ, బాలభక్తుడైన ధ్రువుడు నా యందు మనస్సును సంధానపరచి తపస్సు చేస్తున్నాడు. అందుకే మీకు ప్రాణనిరోధం కలిగింది. తపస్సు నుంచి ఆ బాలుని విరమింపజేస్తాను భయపడకండి అని అభయమిచ్చాడు. అనంతరం శ్రీహరి గరుడవాహనమెక్కి మధువనంలో ధ్రువుడి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు ధ్రువుడు తనముందు సాక్షాత్కరించిన కరుణామూర్తిని తిలకించి ఆనందభాష్పాలతో పులకించాడు.



అనంతరం తన కనుదోయితో స్వామి సౌందర్యాన్ని తాగుతున్నట్లు, ముఖంతో స్వామిని ముద్దాడుతున్నట్లు తనకరములతో స్వామిని కౌగలించుకుంటున్నట్లు అనుభూతి చెందుతూ ధ్రువుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. ఆ విశ్వంభరుడిని వేవేల స్తుతిస్తూ ..."శ్రీ హరీ! నిర్మలాత్ములై నీ సేవయందాసక్తులైన భక్తులతో నాకు మైత్రి చేకూర్చు. ఆ సత్పురుషుల సాంగత్యం చేత నీ కధాసుధారసాన్ని మనసారా గ్రోలి, దు:ఖాలతో నిండిన సంసార సాగరాన్ని సులభంగా తరిస్తాన"ని ప్రార్ధించాడు. ఇలా సజ్జనుల సాంగత్యానికున్న మహత్యాన్ని ధ్రువుడు మరోమారు గుర్తుచేశాడు. పరమాత్మ ఉనికి ప్రస్ఫుటం కావటానికి సత్పురుషుల సాహచర్యం ఎంత ఉపకరిస్తుందో అనటానికి ఈ బాలభక్తుని ప్రార్ధనే నిదర్శనం. పారవశ్యంతో పరంధాముని గొంతెత్తి సుతిస్తూ పాదాభివందనం చేశాడు. భగవంతుడి దర్శనభాగ్యంతో బాలుడైనా, భావుకుడై కవితాత్మకంగా కీర్తించాడు.   
                       
                              ఓం నమో భగవతే వాసుదేవాయ