Sunday, June 18, 2023 3 comments By: visalakshi

నాన్నకో ఉత్తరం.....మణిగాడి లేఖ...

 నాన్నకో ఉత్తరం...





మీకంటూ ఒక రోజుని కేటాయించి ఆరోజు మీకు శుభాకాంక్షలు చెప్పాలని తహ తహలాడే ఎంతో మంది అమ్మాయిలని అబ్బాయిలని చూస్తూ,  ఆశ్చర్యపోతూ , ఈరోజు ప్రత్యేకంగానో, ప్రత్యక్షంగానో,పరోక్షంగానో అందరిచేత అందరి నాన్నలు శుభాకాంక్షలు అందుకొంటుంటే, మరి నేనెలా అందజేయను నా శుభాకాంక్షలు మీకు? "నేను మీదగ్గరికి వచ్చేయనా నాన్నగారు "? అని అడుగుదామనిపిస్తొంది , మరి నేను వచ్చేస్తే ..మీ మనవడు, మనవరాలు ఎలా?


 " ఉత్తరం అంటే ఎదుటి మనిషి మనముందే ఉండి మనతో మాట్లాడుతున్నట్లు ఉండాలి! ఏ నది వడ్డునో కూర్చుని, వెచ్చటి టీ తాగుతూ, గుప్పున సిగరెట్ పొగ, చేతిలో చెలి ఉత్తరం, పక్కన నెచ్చెలి అలా అలలా తీయగా మాట్లాడ్తున్నట్లుగా ఉండే భావన ఎంతో బాగుంటుందిట. చలంగారు ప్రేమలేఖలు చెప్తాయి.


మేము ఉత్తరాలు రాసే అవసరం లేకుండా ఎప్పటికప్పుడు క్షేమ సమాచారాలు తెలుసుకొనే అవకాశం మా చేతిలో ఉండేట్టుగా అరచేతిలోనే ప్రపంచాన్ని చూపించేస్తొంది ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానం.


మరిలా ఈ సెల్ ఫోన్లలో మాట్లాడుకొంటూ, కంప్యూటర్‍లో శుభాకాంక్షలు అందుకోంటూ అందరూ అధునిక సాంకేతికపరిజ్ఞానం ఆసరాగా అందరికి దగ్గర్లో ఉంటున్నట్టుగా భావించి, అంత ఆనందంగా పరస్పర శుభాకాంక్షల వెల్లువ కురిపిస్తుంటే నువ్వేంటి పాతకాలంలా ఉత్తరం వ్రాస్తున్నాననుకొంటున్నారా నాన్నగారు? " ఏం చేయను? వెళ్తూ వెళ్తూ కనీసం ఒక్కమాట చెప్పారా నాకు, నేను "వెళ్తున్నానమ్మా" అని, (అయినా నా పిచ్చి కాని , మీరు వెళ్ళేప్పటికి ఈ email కాని, ఈ సెల్ ఫోన్లు కాని ఉన్నాయా నాన్నగారు, నంబరు అడగడానికి  గాని, మెయిల్ అడ్రస్ అడగడానికి గాని) "నాన్నగారు స్కూలుకి వెళ్తున్నాను" అంటే "తప్పమ్మా వెళ్ళొస్తాను అనాలి, ఒక్క హాస్పిటల్ లో ఇలా అనకూడదు" అని చెప్పిన మీరు ఎక్కడ నేను "నాన్నగారు వెళ్ళొస్తాను అనండి" అని సతాయిస్తాననే కదూ మాటవరసకన్నా నాకు "వెళ్తున్నాను " అని చెప్పలేదు.


 అవును నాన్నగారు! ఒక్క విషయం ఎన్నాళ్ళుగానో అడగాలని అనుకొంటూ ఎప్పటికప్పుడు దాటేస్తున్నాను. ఆరోజు మీకు గుర్తుందా? అమ్మా , తమ్ముడు వరలక్ష్మి వ్రతం అని ఊరెళ్ళారు. చిన్నదాన్ని నాదగ్గిర ఉంచమని మీరు అమ్మదగ్గిర మంకు పట్టు పట్టారు, ఎందుకని ?  "ఆడపిల్లలు ఇద్దరూ ఉండాలి ఇంటి మహాలక్ష్ములు, వరలక్ష్మీ  వ్రతానికి వాళ్ళిద్దరూ ఉండాలి అన్నా కాని, వద్దంటే , వద్దని వాదన చేసి నెగ్గారు. ఎందుకు నాన్నగారు, మీరు అంత బతిమాలి నన్ను మీదగ్గిర అట్టేపెట్టుకొని, జాగ్రత్తగా చూసుకొంటానని మాట తప్పారు కదూ.. చూసుకోలేకపోయానని, అమ్మకి చెప్పెస్తే సరిపోయేది కదా, దానికి మీరలా వెళ్ళిపోవడమెందుకు? .


నాకింకా గుర్తుంది నాన్నగారు! తెల్లవారుఝామునే నన్ను లేపి తలంటు పోసి, నీకేమి తెచ్చానో చెప్పుకో చూద్దాం అని కళ్ళు మూసి , నాతో దోబూచులాడి మరీ చూపించిన ఆకుపచ్చ గళ్ళ పట్టులంగా కళ్ళల్లో నిన్నో మొన్నో కొని తెచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. అదివేసి, జడలు వేయడానికి విఫల ప్రయత్నం చేసి, " నాకు రాదురా అత్తయ్య చేత వేయించుకో " అని అన్నప్పుడు, పరిగెత్తుకొని వెళ్ళి అదేదో హక్కులా "అత్తయ్యా మా నాన్నగారు జడ వెయ్యమంటున్నారు " అంటే , "పండగ పనిలో ఉన్నానిప్పుడు, నా దగ్గిరకి పంపడమేమిటే?" అని విసుక్కొంటూ అత్తయ్య జడ వేస్తే , "ఇదిగోండి, పాపని విసుక్కొవద్దు, పసిపిల్ల దానికేమి తెలీదు " అని నన్ను తీసుకొచ్చుకొన్నారు కదూ.. నిన్న మొన్న జరిగినట్లుండే ఏ విషయాన్ని మనసుపొరల్లోంచి బయటికి పంపలేక పోతున్నాను. మరి పక్కింటావిడ విసుక్కొంది అని, అలా చెప్పి నన్ను తీసుకెళ్ళిన మీరు ఆరోజు సాయంత్రమే ఎందుకు వెళ్ళిపోయారు? "మావయ్యా వాళ్ళింటికి వెళ్తున్నాను" అన్నారు. ఆ తరువాత ఈరోజు వరకూ ఎంత మంది మీరు లేరని అలుసుగా తీసుకొని నన్ను విసుక్కొన్నారో మీకు తెలుసా? మీరు చెంతనుంటే ఎవరన్నా ఎమన్నా అనేవారా? ఎందుకొదిలేసారలా?


 మొన్నే అనుకోకుండా ఎవరో ఒక sms పంపించారు. అది చదువుతుంటే అసలు తప్పు మాది కూడా ఉందనిపిస్తొంది నాన్నా!.


ఒక చిన్న పాప, వాళ్ళ నాన్న అలా నడుస్తూ ఉంటే.... ఒక చిన్న పిల్ల కాలువ దాటాల్సివచ్చిందిట. అప్పుడు వాళ్ళ నాన్న అన్నారుట:


 "చిన్నారి! నన్ను జాగ్రత్తగా పట్టుకోమ్మా! గబుక్కున ఎక్కడన్నా కాలువలో జారిపడ్తావేమో! జాగ్రత్త" అని చెప్తే ....ఆ చిన్నారి అందిట


 "నాన్నా! నేను నీ వేలు పట్టుకొంటే భయానికి గబుక్కున జార విడిచేస్తానేమో, నువ్వే నా వేలు పట్టుకో.. నేనెక్కడపడిపోతానో అని వడిసి పట్టుకొంటావు, అప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉంటావు, నేను సేఫ్" అని అందిట.


ఆ చిన్నారి తెలివితేటలు నిజానికి నా(మా)కు లేవేమో కదా నాన్నగారు, మేము మీవేలు వదిలేసాము. మీకు కోపమొచ్చింది కదూ.. "తెలియక చేసిన తప్పు నాన్నగారు ! మా వేలు పట్టుకోండి నాన్నగారు" అని చెప్పాడానికి అందనంత దూరానికి వెళ్ళిపోయారు. ఉండిలేక ఉన్నది మీరే, ఉన్నా కూడా లేనిది నేనే. మిమ్మల్ని మా వేలు పట్టుకోనీయకుండా , నేనే మీ వేలు పట్టుకొని నడుద్దామన్న స్వార్థం మమ్మల్ని ఇలా శిక్షించింది. అయినా... ఈరోజు ప్రత్యేకమంటూ అందరూ శుభాకాంక్షలు చెప్తుంటే, నేను మటుకు మౌనం వహించడమెందుకని, ఇంకో ఇన్ని జన్మలకి మీకే కూతురిగా పుట్టాలని, అప్పుడు ఆ భగవంతుడిని మిమ్మల్ని పూర్ణాయుష్కుడిని చేయాలని, మీరే మావేలు పట్టుకొని నడిపించాలని మనస్పూర్తిగా కోరుకొంటూ........


ఇక్కడ లేని నాన్నగారికి! ఇక్కడే ఉన్న నా శుభాకాంక్షలు. 


ఎప్పటికీ మీ కూతురే అయిన మణిగాడు


*******

మా చెల్లి రాసిన ఈ లేఖ నా మనసును కదిలించింది.. అందుకే ఇలా బ్లాగులో...నాన్న గారికి నా నమస్సులు..🙏🙏🙏...



Friday, February 3, 2023 0 comments By: visalakshi

అద్వైతం - విశిష్టాద్వైతం

ఓం శ్రీ గురుభ్యో నమః

                                   🙏🙏🙏...



అద్వైతం - విశిష్టాద్వైతం / జగత్ గురువులు జగతికి వెలుగులు.


శ్రీ శంకరాచార్యులు - అద్వైతం - సర్వ భౌతిక ప్రపంచానికి బ్రహ్మమే ఆధారం.


శ్రీ రామానుజాచార్యులు - విశిష్టాద్వైతం


 సర్వ భౌతిక ప్రపంచంతో బ్రహ్మం అంతర్లీనమై అంతా ఒక్కటే.


     

 జగత్తులో అనేక రకాల ఆధ్యాత్మిక సాధనాలున్నాయి. ఇందులో ఏది ఎవరికి తగినదనే దాన్ని సాధకుని యోగ్యత, అవగాహన స్థాయిని బట్టి నిర్ణయించి, అది వారికి ఉపదేశించేది గురువే. గురువు అంటే అజ్ఞానాన్ని దూరం చేసేవాడని అర్థం. ‘గు’ అంటే చీకటి. ‘రు’ అంటే ప్రకాశం. గురువు అంటే చీకటిని తొలగించి వెలుగుతో ప్రకాశింపచేసేవాడు అని అర్థం. జ్ఞాన మార్గ దర్శకుడైన గురువు స్థానం పరమ పవిత్రమైనది. జ్ఞానాన్ని ఆర్జించడం కన్నా సద్గురువు చరణారవిందాలను సేవించడం, అనుగ్రహాన్ని పొందడం ఉత్తమమైనది.


వేదాంతులందరూ జరిపే తత్వవిచారం జీవాత్మ, పరమాత్మల అంతర్లీనత ప్రాతిపదికన జరుగుతుంది. అవి వేరుకాదన్న ఏకాభిప్రాయమే వారందరిలో కనపడుతుంది. ప్రామాణికాలైన వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత- అద్వైతం చెప్పేదంతా పొందుపరచి బ్రహ్మజిజ్ఞాసులకు అందుబాటులో ఉంచాయి. వేదాంతులైన మహాగురువులు ఆదిశంకరుడు, రామానుజుడు ఇద్దరూ జీవాత్మపరమాత్మల సంలీనమే అద్వైతానికి మూల సూత్రంగా అంగీకరిస్తారు. ఆ రెండింటి స్వరూపం మీద, ఆ సంయోగం జరిగేది ఎలాగో, అందుకు వారిచ్చే వివరణలు మాత్రం భిన్నమైనవిగా ఉన్నట్లు అనిపిస్తాయి.


జీవాత్మ పరమాత్మలు వేరుకాదని చెప్పే తిరుగులేని అద్వైతం శంకరుడిది. ‘లోకమాయ’, ‘కర్మసిద్ధాంతం’ కేంద్ర బిందువులుగా ఆయన అద్వైత వాదనలుంటాయి. జీవుడు, దేవుడు ఒకరేనన్న నిజాన్ని మాయా ప్రభావంతో మనిషి గుర్తించలేడంటారు శంకరులు. చీకటిలో చూసిన తాడును పాము అనుకుని, వెలుతురు రాగానే అది పాము కాదు తాడు అని తెలుసుకున్నట్లే- లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు అనిపింపజేసే ‘సర్పరజ్జుభ్రాంతి’లాంటి అటువంటి మాయను అధిగమించలేనంత కాలం ‘అవిద్య’తో ఉండిపోతాడని చెబుతారు. జీవితకాలమంతా అతణ్ని వెంటాడుతూ వేధించే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలకు అది మూలరూపమంటారు. ఆత్మశక్తికి తప్ప అవి లొంగుబాటులోకి రావని తెలుసుకొమ్మంటారు. కార్యం లేకుండా ఫలితం ఉండదని, ఫలితం ఉండబట్టే అందుకొక కారణం ఉండితీరాలని ఆయన విశ్వసిస్తారు. వర్తమానంలో మనిషికి ఎదురయ్యే పర్యవసానాలన్నీ కార్యకారణాలతో ముడివడిఉన్నవేనని చెప్పే కర్మసిద్ధాంతం, ఆయన అద్వైతవాదనలన్నింటిలో కీలకమై కనిపిస్తుంది.


శంకరులు- నిద్రాణమై తనలోనే ఉన్న ఆత్మను జ్ఞానభక్తి సాధనలతో జాగృతం చేయమంటారు. అప్పుడే అది బ్రహ్మంతో పునరేకీకరణ పొందగలదంటారు. జ్ఞానానికి, భక్తికి సమగ్రమైన వివరణలుండే సౌందర్యలహరి, శివానందలహరి, వివేకచూడామణి వంటి రచనలు శంకరులవే. అహంకారభావనలు తొలగిపోవటమే జ్ఞానమని చెప్పే సారాంశమే ఆ రచనలన్నీ ప్రస్ఫుటిస్తాయి.


రామానుజులు వైదిక పరమైన దైవత్వాన్ని గురించి చెప్పే అద్వైతాన్ని ఆమోదిస్తారు. వేదోక్తమైన ఆస్తికత్వాన్ని సమర్థించేదాన్ని ‘విశిష్టాద్వైతం’ అన్నారు. దేహం, ఆత్మ రెండూ దైవ స్వరూపాలే అంటారాయన. శంకరులు చేసినట్లు- సగుణ నిర్గుణ బ్రహ్మలుగా, బ్రహ్మాన్ని వేరుచేసేందుకు అంగీకరించరు. అద్వైతానికి మౌలిక సూత్రమైన జీవాత్మపరమాత్మల సంవిలీనాన్ని మాత్రం వ్యతిరేకించరు. జీవుడు, పరమాత్ముడు ఒకరేనన్న ప్రగాఢ విశ్వాసంతో జీవుణ్ని పరమాత్ముడిని వెదకమంటారు. కర్మరాహిత్యం అయినప్పుడే జీవుడికి ‘శుద్ద సత్వస్వరూపం’ లభిస్తుందని, ‘బ్రహ్మశరీరం’ అంటే అదేనని, ఆ శరీరంతోనే అతడు అంతర్యామిలో విలీనం కాగలడన్నారు. ‘వైకుంఠపాప్త్రి’ అదేనంటారు.


సామాజిక స్పృహ కనపడని ఆధ్యాత్మికతను విశిష్టాద్వైతం ప్రోత్సహించదు. రామానుజులు-మనుషుల మధ్య సంచారం చేస్తూ, కులం మూఢనమ్మకాలకు అతీతంగా వారిని కొనసాగమంటూ ఉద్బోధించారు. దేవాలయాల్లో ప్రవేశానికి అందరూ అర్హులేనన్నారు. సామూహికంగా ప్రజలు, భగవత్సేవలు నిర్వహించమన్నారు. విశిష్టాద్వైతానికి వివరణలన్నీ ఆయన రచించిన శ్రీభాష్యం, వేదాంత సాగరం, వేదాంత సంగ్రహాల్లో కనపడతాయి.


శంకరుడు అది అద్వైతం అన్నా, రామానుజుడు విశిష్టాద్వైతం అని చెప్పినా, వారిద్దరూ భగవంతుడైన బ్రహ్మాన్ని చేర్చేది అద్వైత మార్గం ఒక్కటేనని తెలిసిన మహాజ్ఞానులు. అది సూత్రీకరించి మనిషికి సులభగ్రాహ్యం చేసిన మహాపురుషులు.


మన సనాతన ధర్మాన్ని కాపాడటానికి జన్మించిన

మహనీయులు,ఈ రోజు మన ధర్మం ఉందంటే

అది వారు ఏర్పరిచిన బాట,క్షేత్రాలు,మార్గదర్శనం తోనే అని మనం తెలుసుకోవాలి.


మన భారతీయ సంప్రదాయంలో ‘గురు’ శబ్దం చాలా మహత్తరమైనది. ఆధ్యాత్మిక వేత్తల్ని గురువులుగా భావించే విలక్షణ సంస్కృతి మనది. 


విశిష్ట దర్శనాలతో ప్రజానీకానికి మార్గదర్శనం చేసిన శంకరాచార్యులు, రామానుజాచార్యులు ఇరువురూ వైశాఖ శుద్ధ పంచమి నాడే జన్మించడం విశేషం.


#శ్రీ ఆది శంకరులనగానే అద్వైతం, శ్రీ రామానుజుడనగానే విశిష్టాద్వైతం గుర్తుకు వస్తాయి.


#శ్రీ ఆది శంకరాచార్యులు


శంకరులు కేరళలోని కాలడి గ్రామంలో జన్మించారు. ఆర్యాంబ, శివగురువులు వీరి తల్లిదండ్రులు. రెండేళ్ల స్వల్ప వ్యవధిలోనే వేదాలను, వేదాంతసారాన్ని అధ్యయనం చేసిన కుశాగ్రబుద్ధి. గోవింద భగవత్పాదుల వద్ద సన్యాస దీక్షను స్వీకరించారు. గురువుల ఆదేశానుసారం కాశీకి వెళ్ళి శిష్యులకు ఉపదేశంచేస్తూ, పండితులతో చర్చలు సాగిస్తూ, వివిధ మతాల్లోని దోషాలను సహేతుకంగా విమర్శించేవారు. మండనమిశ్రుణ్ని, అతడి భార్య ఉభయ భారతిని శాస్త్ర చర్చల్లో ఓడించి, సత్యనిష్ఠతో జ్ఞానమార్గ వైశిష్ట్యాన్ని గుర్తింపజేశారు. సన్యాసం ఒక మానసిక పరిపక్వ స్థితి. మనుషుల మధ్య ఉంటూనే మమతానుబంధాలను అధిగమించి మానవతా ధర్మాన్ని ప్రచారం చెయ్యాలని శంకర సందేశం.


శంకరులు బోధించిన తత్వం అద్వైతం. అది ఈ దేశపు అఖండత్వాన్ని కాపాడటానికి అక్షయమైన సిద్ధాంతం. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ వంటి శ్రుతి వాక్యాలు అద్వైత సిద్ధాంతానికి ప్రాతిపదికలు. నాలుగు వేదాల నుంచి ఈ నాలుగు వాక్యాలు గ్రహించి బ్రహ్మ స్వరూపాన్ని వివరించడంలో వాటిని సమన్వయించారు. శంకరాచార్యులు జ్ఞానమార్గానికి అత్యంత ప్రాముఖ్యం ఇచ్చారు.

          


 అద్వైతం అంటే రెండు కానిది. అంటే జీవుడికి, దేవుడికి భేదం లేదని చెప్పే మతమన్నమాట. ఈ సిద్ధాంతానికి రూపకర్త జగద్గురు శ్రీ ఆదిశంకరులు. కేరళలోని కాలడి అనే గ్రామంలో జన్మించిన ఆదిశంకరులు ప్రపంచమంతా జగద్గురువుగా గౌరవించే అత్యున్నతమైన ఆధ్యాత్మికవేత్త, మహాజ్ఞాని, మహాపండితులు. సౌందర్యలహరి, శివానందలహరి, వివేకచూడామణి, ప్రస్థాన త్రయభాష్యంతో బాటు ఈనాడు మనం స్తుతించుకునే అనేక స్తోత్రగంథాలు, ప్రకరణ గ్రంథాలు, కనకధారాస్తోత్రం, భజగోవింద శ్లోకాలు ఆయన రచించినవే. రవాణా సదుపాయాలు లేని రోజుల్లోనే ప్రపంచమంతా కాలినడకన పర్యటించి అన్ని మతాలను, విశ్వాసాలను ఒక తాటిపైకి తెచ్చిన ఈ జగద్గురువు భారతదేశంలో నాలుగు పీఠాలను స్థాపించారు.


 బదరీనాథ్, పూరి, శృంగేరి, ద్వారకలలో వీరు స్థాపించిన ఈ పీఠాలకు బాధ్యతలు చేపట్టిన వారు కూడా వీరి నామంతోనే జగద్గురువులుగా ప్రఖ్యాతి చెందుతుండటం విశేషం. వీరి లెక్క ప్రకారం దేహమే దేవాలయం. దేహంలో ఉండే జీవుడే దేవుడు. భౌతికమైన దేహం నశించినా, ఆ దేహంలో ఉండే జీవుడు మాత్రం స్థిరంగా ఉంటాడని అద్వైతుల నమ్మకం. నిశ్చలమైన బుద్ధితో ‘అహం బ్రహ్మాస్మి’ అంటే నే నే బ్రహ్మను అని తెలుసుకునేవాడు  జీవన్ముక్తుడు అవుతాడని అద్వైతులంటారు.

               ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మ సూత్రాలు అనే ప్రస్థానత్రయానికి భాష్యం రాశారు. వివేక చూడామణి, శివానందలహరి, సౌందర్య లహరి, భజగోవిందం, కనకధారాస్తవం వంటి గ్రంథాల్లో వారి పాండిత్యం వెల్లడవుతుంది. సర్వజనామోదంగా ఉండేలా శివ, విష్ణు, గణపతి, సూర్య, శక్తి రూపాలతో కూడిన పంచాయతన పూజా విధానాలను ప్రవేశపెట్టారు. శంకరులు జాతీయ సమైక్యతా సూత్రాన్ని పరిరక్షించడానికి ధార్మిక జాగృతిని కలిగిస్తూ బదరి, ద్వారక, పూరి, శృంగేరిలలో నాలుగు పీఠాలు స్థాపించారు.


                                  °°°°°°°°°°°°

🙏🙏🙏...


#శ్రీరామానుజాచార్యులు


రామానుజులు తమిళనాడులో శ్రీపెరంబుదూరులో జన్మించారు. తల్లిదండ్రులు కాంతిమతి, కేశవాచార్యులు. యామునాచార్యుల వద్ద వైష్ణవ దీక్షను పొందారు. తిరుకోష్ఠియారు ‘ద్వయ’ మంత్ర రహస్యాన్ని వివరించి గోప్యంగా ఉంచమని కోరితే మోక్షం ఏ కొద్దిమందికో పరిమితం కాకూడదని తలచిన రామానుజులు ఆలయ గోపురం అధిరోహించి అక్కడ గుమిగూడిన జనులందరికీ మంత్రాన్ని బోధించారు.


పరమాత్మ ఒక్కడే. ఆయన విశిష్ట గుణసంపన్నుడు. ఆ విశేషణాలు, తత్వాలకు గల లక్షణాల్ని, వాటి మధ్య పరస్పర సంబంధాన్ని అవగాహన చేసుకునేందుకు తోడ్పడేదే జ్ఞానమని విశిష్టాద్వైతం చెబుతుంది. సూక్ష్మరూపంలో ఉండే అనేక జీవాత్మలు స్థూల రూపుడైన పరమాత్మలో అంశగా ఉంటూ పరమాత్మతో భేదాన్ని కలిగి ఉంటాయని, ఇదే విశిష్టాద్వైతమని పేర్కొన్నారు రామానుజులు. రామానుజులు సంస్కర్త. నాటి సమాజంలోని వివిధ వర్ణాలవారికి వైష్ణవంలో స్థానం కల్పించారు. భక్తిని ఉద్యమస్థాయిలో ప్రచారం చేశారు.


రామానుజులు వేదాంత సారం, వేదాంత సంగ్రహం, వేదాంత దీపం అనే గ్రంథాలు రచించారు. బ్రహ్మ సూత్రాలు, భగవద్గీతకు భాష్యం వెల్లడించారు. ఆయన కేవలం వేదాంతి కాదు. సమత, మమతలను నిత్య జీవితంలో ఆచరించిన పుణ్య యోగి. అనేక ప్రత్యేక సేవలను భగవదారాధనలో భాగంగా చేసి, విలక్షణ పూజా విధానాన్ని వ్యాప్తి చేశారు.


 బ్రహ్మానికి, ప్రకృతికి భేదం లేదని బోధించే విశిష్టాద్వైత మత స్థాపకులు రామానుజాచార్యులు. ఈ మతాన్ని అనుసరించేవారు విశిష్టాద్వైతులుగా ప్రసిద్ధి. జగత్తు సత్యం, జీవుడు సత్యం, దేవుడు సత్యం అన్నది వీరి విశ్వాసం. దేహంలోని భాగాల వలె జీవుడు కూడా దేవునితో చేరి ఉంటారని, దేహం నశించిన తరువాత జీవుడు మరో దేహంలో ప్రవేశిస్తాడు లేదా ప్రకృతిలో లీనమైపోతారని వీరి నమ్మకం.


విశిష్టాద్వైతమతాచార్యులైన భగవద్రామానుజులు నేటి చెన్నైకు చేరువలోని శ్రీపెరంబుదూరులో జన్మించారు. కాంచీపురం లోని తిరుక్కచినంబికి శిష్యులైన రామానుజులు శ్రీరంగంలో గొప్ప పండితుడు, వైష్ణవ మత ప్రవక్త అయిన యామునాచార్యులవారి వారసుడిగా నిలిచారు.


 బ్రహ్మసూత్రభాష్యానికి విశిష్టాద్వైత దృష్టితో శ్రీ భాష్యం వ్యాఖ్యను రచించారు. మొట్టమొదటి మత సంస్కర్తగా నిలిచిన రామానుజులవారు వేదాంత సంగ్రహం, గద్యత్రయం వంటి విశిష్టమైన గ్రంథాలను రచించారు. ఉత్తరభారతమంతా విస్తృతంగా పర్యటించిన ఆయన దేశం నలుమూలలా నాలుగు శ్రీైవైష్ణవ మఠాలను నెలకొల్పారు. జాతి, మత భేదాలను పాటించకుండా భక్తి భావంతో భగవంతుని సందర్శించాలనుకున్న ప్రతి ఒక్కరికి ఆలయ ప్రవేశం కల్పించేలా చేశారు. తిరుమలతో సహా అనేక దేవాలయాలలో నిర్దిష్టమైన పూజావిధానాలను, సంప్రదాయాలను ఏర్పరిచారు.

                     

తత్వాలు భిన్నంగా గోచరించినా గమ్యం ఒక్కటే. పుణ్య శ్లోకులు సదా స్మరణీయులే.....,,🙏🙏🙏.....

సంగ్రహించిన వ్యాసం...



Thursday, February 2, 2023 1 comments By: visalakshi

సీతోపనిషత్

  ఓం నమో శ్రీ నారాయణాయ నమః




  శ్లో"  ఇచ్చా జ్ఞాన క్రియాశక్తి త్రయం యద్భావ సాధనం!

     తద్బ్రహ్మసత్తా సామాన్యం సీతాతత్వ ముపాస్మహే !!


మం!!  ఓం దేవాహవై ప్రజాపతి మబ్రువన్, కా సీతా కిం

      రూపమితి, సహోవాచ, ప్రజాపతిః సా సీతా ఇతి (1)

ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులనే మూడు శక్తులూ ఎలాంటి దివ్యభావాన్ని సాధించడానికి ఉపయోగపడతాయో , అలాంటి బ్రహ్మసత్తాతో సమానమైన సీతాదేవి తత్వాన్నిఉపాసిస్తున్నాను. 

పూర్వం ఒకనాడు దేవతలు బ్రహ్మ దగ్గరకు వెళ్లి పితామహా! సీత అంటే ఎవరు? ఆమె ఎలాంటి రూపం కలిగి ఉంటుంది ?అని ప్రశ్నించారు.

బ్రహ్మదేవుడు వారికిలా సమాధానం చెప్పాడు. "సీతాదేవి మూలప్రకృతి స్వరూపిణి అందుకే ఆమె ప్రకృతి అని పిలవబడుతోంది.'సీతా' అనే పదంలో మొత్తం మూడు అక్షరాలు ఉన్నాయి. ఆమె సాక్షాత్తు మాయా స్వరూపిణి. విష్ణువు ప్రపంచ బీజం. 'ఈ'కారం మాయా, 'స'కారం సత్యం అమృతం, ప్రాప్తం, చంద్రుడు, 'త'కారం లక్ష్మీ బీజం.  శ్రీంకారం,వైరాజం , సోమ , అమృతావయవాలు కలిగిన దేవి  'ఈ'కార రూపిణి అవుతోంది. ఆ దేవి ఆభరణాలతో ముత్యాలతో అలంకరించబడివుంది. ఆది మహామాయ శబ్ద బ్రహ్మరూపం. అందుకే స్వాధ్యాయం సమయంలో ప్రసన్నురాలౌతుంది. సమున్నతమైన భావాల్ని ఉత్పత్తి చేస్తుంది. ఇక రెండవ మాయ పృధ్వీభాగంలో హలం (నాగలి)చివర సీతగా జన్మించింది.'ఈ'కార స్వరూపిణి అనే ఆమె ఆ దేవికి చెందిన మూడో మాయ. అది అవ్యక్త రూపంలో ఉంటుంది. శౌనకీయమైన శౌనకీ తంత్రంలో సీతాదేవి ఈవిధంగా వర్ణించబడివుంది. ఆమె శ్రీరాముడు సన్నిధిలో జగదానంద కారిణిగా ఉన్నది. సృష్టి , స్థితి, లయకారిణి కూడా ఆ సీతాదేవే.ఆ సీతమ్మ వ్యక్తంగా ఉన్న అన్ని జీవుల శరీరాలలో మూలప్రకృతి స్వరూపిణిగా జ్ఞేయరూపంలో ఉంటుంది. ఆమె ప్రణవ స్వరూపిణి కనుక ప్రకృతి అని వ్యవహరిస్తారు. ఆమెనే బ్రహ్మవాదినీ అని కూడా అంటారు. ఆ దేవి  "అధాతో బ్రహ్మజిజ్ఞాసా" స్వరూపిణి , సర్వవేదమయి , సర్వకీర్తిమయి , సర్వధర్మమయి , సర్వలోకమయి , సర్వాధార కార్యకారణమయి , మహాలక్ష్మీ తదితర దేవేశుల భిన్నాభిన్న రూపమయి , చేతనా చేతనాత్మక , బ్రహ్మ స్థావరాత్మక , గుణ ,కర్మ ,విభాగ భేదంలోదేహ స్వరూపిణి, ఆమె. దేవ ,ఋషి ,మనుష్య ,గంధర్వ స్వరూపిణి, అలాగే అసుర ,రాక్షస, భూత ,ప్రేత ,పిశాచ , దేహాలు ధరించినది.పంచభూత ,ఇంద్రియ ,మనః ప్రాణ స్వరూపిణి కూడా ఆమేనని తెలుస్తోంది. 



ఆ సీతాదేవి 1.ఇచ్ఛాశక్తి 2.క్రియాశక్తి 3.సాక్షాత్ శక్తి అనే నామాలతో మూడు రూపాల్లో శక్తి స్వరూపిణిగా ఉన్నది. ఆమే శ్రీ, భూ , నీలా , భద్రరూపిణీ ,ప్రభావరూపిణీ ,సోమసూర్యాగ్ని రూపిణీ అవుతున్నది. ఆ జనని సోమరూపిణిగా ఓషధుల్ని పుట్టిస్తోంది.కల్పవృక్షం, పుష్ప ,ఫల‌ ,లతా, గుల్మాత్ములైన ఔషధ భేషజాత్మికా ఉంది.అమృతం రూపంలో దేవతలకి మహస్తోమరసఫలాన్నిస్తోంది. అలా దేవతలకు అమృత రూపంలో, మానవులకు అన్నం రూపంలో , పశువులకి గడ్డి రూపంలో ఇలా సకల జీవులకీ ఎన్నో విధాలుగా ఆహారాన్ని అందిస్తోంది. ఆ సీతాశక్తి సూర్యాదులతో సకల లోకాల్నీ ప్రకాశింపజేస్తోంది. రాత్రి -పగలు రూపంతో , కాలస్వరూపిణిగా కల , విమేషం నుంచి ఘడియ,8జాములు ,దినం ,వారం ,పక్షం ,ఋతుఆయన ,సంవత్సర భేదాలతో మనుషులకి (వందసంవత్సరాలు ) కల్పనతో ప్రకాశిస్తోంది. ఇలా చిర ,క్షిప్ర రూపాలలో నిముషం నుంచి పదార్ధం వరకు ఉన్న ఈ కాలచక్రాన్ని  ఒక చక్రం లాగ త్రిప్పుతూ ,తన కాల విశేషాలతో ప్రకాశిస్తూ, తానే కాల స్వరూపిణి అవుతోంది.

ఆ సీతాదేవి అగ్ని రూపం కలిగింది. ఆమె ఆకలి దప్పికల రూపంలో ప్రాణులలో , ముఖ రూపంలో దేవతలలో , శీతోష్ణ రూపంలో వనౌషధులలో , కాష్ఠం(కర్ర) లోపలా బయటా నిత్యానిత్య రూపంతో ఉఃటుంది. ఆ శ్రీదేవి మొత్తం మూడు రూపాలు ధరించి శ్రీహరి సంకల్పం ప్రకారం లోకాల్ని రక్షిస్తూ ఉంటుంది. కాలానుగుణంగా ఆయా అవతారాలు ధరిస్తుంది. శ్రీ అని లక్ష్మీ అని భూదేవి అని ఆమెని పిలుస్తారు. ఆ తల్లి సప్త సాగరాల్లో నీరుగా , సప్త ద్వీపాలతో కూడిన భూమిగా, భూమి మొదలు14లోకాలకీ ఆధార ఆధేయమైన ఓంకార రూపిణి గా ఉంటుంది. సీతాదేవి అవతారమైన నీళాదేవి విద్యున్మాలినీ రూపంతో సకల ఔషధులకీ ,ప్రాణులకీ  పోషణ నిమిత్తం సర్వ స్వరూపిణి గా ఉంటుంది. అంతేకాక ఈ దేవి సమస్త భువనాలకీ క్రింది భాగంలో  జలాకారాత్మకమైన ఒక మండూకం (కప్ప)రూపంలో భువనాలన్నిటికీ ఆధారంగా ఉంటుంది.


సీతాదేవి క్రియాశక్తి స్వరూపిణి. ముందుగా శ్రీ మహావిష్ణువు ముఖం నుంచి నాదం , ఆ నాదం నుంచి బిందువు, ఆ బిందువు నుంచి ఓంకారం , ఆ ఓంకారానికి చివర వైఖానస పర్వతం ఆవిర్భవించాయి. ఆ పర్వతం నుంచి కర్మజ్ఞానమయమైన ఉపశాఖలు వచ్చాయి. ఆ ప్రదేశం లో త్రయీమయ రూపంలో అనగా ఋగ్వేదం యజుర్వేదం సామవేదం.. సర్వార్ధాలు దర్శనమిస్తాయి. లోకంలో వేదాలు మూడే అని చెప్పినప్పటికీ కార్యసిద్ధికో నాలుగో వేదం ఏర్పడింది. ఆ నాలుగో దాన్నే ఆసంగిరసం అంటారు. ఈ అధర్వాంగి రసవేదం కూడా త్రివేదాత్మకంగానే ఉంటుంది. ఋగ్వేదం21శాఖలతో., యజుర్వేదం 109శాఖలతో సామవేదం 100శాఖలతో ,అధర్వణ వేదం 50శాఖలతో ఉంది. ముందుగా అన్ని దర్శనాలకన్నా వైఖానస దర్శనం ప్రత్యక్ష దర్శనంగా ఉంది. ఆ తరువాత కల్పం ,వ్యాకరణం ,శిక్ష, జ్యోతిష్యం , నిరుక్తం ,ఛందస్సు అనేవి షడాంగాలు (ఇవే వేదాంగాలు).వీటి ఉపాంగాలైన న్యాయ మీమాంస లు ఏర్పడ్డాయి. ధర్మాన్ని తెలుసుకోవడం కోసం వేదవేదాంగాలన్నిటికన్నా అధికంగా  కాలానుగుణంగా ధర్మశాస్త్రాలు ఏర్పడ్డాయి. ధర్మశాస్త్రము అంటే అది మునీశ్వరుల అంతఃకరణ ప్రవృత్తే. బ్రహ్మ చెబుతున్నాడు ..ఇంకా ఇతిహాస పురాణాలు 1. వాస్తు వేదం 2.ధనుర్వేదం 3.గాంధర్వవేదం 4.ఆయుర్వేదం 5.మునివేదం..అనే ఈ అయిదు ఉపవేదాలు ఉన్నాయి. అలాగే దండం ,నీతి, వార్త ,విద్య ,వాయుజయం లాంటి స్వయంప్రకాశాలైన 21రకాల శాస్త్రాలున్నాయి. వైఖానస మహర్షికి పూర్వమే శ్రీ మహావిష్ణువు వాక్కు ప్రభవించింది. అది మూడువేదాల రూపంలో ఆవిర్భవించింది. వైఖానస మహర్షికి ముందు సాంఖ్యశాస్త్రం ఎలా పుట్టిందో అది ఏం చెప్పిందో మీకు బోధిస్తాను శ్రవణం చేయండి. (ఇతిహాస.. పురాణాలని పంచమవేదంగా పండితులు చెబుతారు.)


ఆ క్రియాశక్తి స్వరూపిణి ఉత్తమమైన బ్రహ్మమయ రూపం కలిగింది. సాక్షత్తు బ్రహ్మమైన ఆ శక్తిని స్మరించినంత మాత్రానే ఆమె అనుభవాన్నిస్తుంది. అంతే కాక ఆ దేవి నిగ్రహానుగ్రహ స్వరూపిణి. శాంతి తేజోరూపిణి. ఆమె వ్యక్తావ్యక్తకారణ చరణాది సమగ్ర అవయవ రూపంలో ,భేదాభేద రూపంగా ప్రకాశిస్తుంది. ఆ దేవి భగవంతుడి సహచారిణిగా ఉంటుంది. అనపాయిని అయిన ఆమె అనవతరం సాధకులకి సహాయ ఆశ్రయాల్ని ప్రసాదిస్తుంది. కళ్ళు మూసి తెరిచేంతలోనే సృష్టి ,స్ధితి, సంహార తిరోధాన ,అనుగ్రహాది శక్తుల్నీ ఆమె ప్రదర్శించగలదు.ఇంత సమర్ధులు కలిగిన ఆ దేవి  (సీత) సాక్షాత్తు శక్తిగా ప్రస్తుతించబడుతోంది.

ఇచ్ఛాశక్తి అనేది మూడు విధాలుగా ఉంటుంది. 1.యోగశక్తి 2.భోగశక్తి 3.వీరశక్తి అని.

1.యోగశక్తి - ప్రళయకాలంలో విశ్రాంతి తీసుకుంటున్న భగవంతుడి (శ్రీహరి) వక్షస్ధలంలో శ్రీవత్సాకార రూపంతో విశ్రమిస్తూ ఉంటుంది.

2.భోగశక్తి- భోగరూపంలో కల్పవృక్ష ,కామధేను ,చింతామణి ,శంఖ ,పద్మ నిధుల్ని ,నవనిధుల్ని ఆశ్రయించి ఉంటుంది. భగవంతుణ్ణి కోరికలతోగానీ ,కోరికలు లేకుండా గానీ ఉపాసించేవారిని అనుగ్రహిస్తుంది. అంతేకాదు భక్తులైనవారు అగ్నిహోత్రాలతో, యమ నియమాది అష్టాంగాలతో ,ఆరాధనలతో ,నిత్యపూజా జపహోమాదికాలతో ,పితృపూజలు ,నైవేద్యాలు ,వ్రతాలు, నోములు వంటి వాటితో నిత్యం భగవంతుని ఆరాధిస్తున్నారు.

3.వీరశక్తి - సీతాదేవి వీరశక్తి రూపంలో చతుర్భుజగా ,అభయ ,వరద ,పద్మాలని ,కిరీటాది సకలాభరణాలనీ ధరించి ఉంటుంది. సకల దేవతలతో పరివేష్ఠించబడి ,కల్పవృక్షం నీడలో నాలుగు ఏనుగులు తమ తొండంతో ఉంచిన రత్న ఘటాలలోని అమృత జలాలతో అభిషేకం చేస్తుండగా, దివ్యంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఆమె సమస్త దేవతల చేతా ,బ్రహ్మాదుల చేతా ,కామధేనువు ,వేదశాస్త్రాల చేతా ప్రస్తుతించబడుతూ జయాది అప్సరసలు చేత పరిచర్యలు అందుకుంటూ ఉంటుంది. ఆమె సూర్య చంద్రులనే దీపాలతో ప్రకాశించబడుతుంది. నారద తుంబురులు నిత్యం ఆమె ని తమ గానంతో సంతృప్తి పరుస్తుంటారు. ఆమె రాకా ,సినీవాలీ అనే ఛత్రాల నీడలో అలంకృతమై ఉంటుంది. హ్లాదినీ అనే మాయ ఆమె కి చామరాలు వీస్తూ ఉంటుంది. స్వాహా, స్వధా అనేవారు వ్యజనాలతో ఆమెను పూజిస్తారు. బృగువు లాంటి ఎందరో మహర్షులు ఆమెని నిత్యం అర్చిస్తుంటారు. ఇలా దివ్య సింహాసనం మీద ఆసీనురాలై సకల కార్యకారిణి అయిన ఆ లక్ష్మీదేవి భవనానికి వేరుగా స్థిరంగా ఉన్నది. ఆమె ప్రసన్నమైన నేత్రాలతో సర్వదేవతలతో పూజించబడుతూ వీరలక్ష్మి అనే నామంతో ప్రసిద్ధి చెందింది..

                              ఓం శ్రీ మాత్రే నమో నమః