Monday, June 29, 2020 0 comments By: visalakshi

శ్రీ సాయి దత్త .....

"శిరిడి సాయిబాబా అంటే ఆనందసాగరమే*"..!!



శ్రీ సాయిబాబా ఎంతటి మహనీయులైనా, ఇప్పుడా యన బౌతికంగా లేరు కదా అన్నదే చాలామందికి కలిగే సందేహం. దానికి తోడు ఎంతటి సద్గురువైనా సజీవులుగా వున్నంత వరకే శిష్యులకు ఆత్మజ్ఞానం ప్రసాదించగలరని పెద్దలు చెబుతుంటారు. కానీ శ్రీసాయి కేవలం సిద్ధపురుషులు మాత్రమే కాదు. సాక్షాత్తూ దత్తాత్రేయుల అవతారం!

అంతేగాక బాబా మహాసమాధి అనంతరం కూడా తాము భక్తులను పూర్వంలాగానే అనుగ్రహిస్తామని గమ్యం చేరుస్తామని వాగ్దానం చేశారు. ఎందరో మహనీయులు కూడా ఈ విషయమే ధృవపరిచారు. అది ఎందరి అనుభవమో సాయి భక్తులు శ్రీ ఎమ్
రంగాచార్యగారు శ్రీసాయి గురించి సాధు సత్పురుషుల నుండి వినిన వాక్యాలను వ్రాస్తున్నారు.

స్వామి శంభునాథ్ జీ అను సిద్ధ పురుషుడు 1937లో నాతో, “ముందు ముందు నీవు ఒక సాటిలేని మహాత్ముని శరణు పొంది అంతిమ ఘడియ వరకు ఆయనకు అంకితమవుతావు" అన్నారు. వారు చెప్పిన మాటలు ఒకటి రెండు సంవత్సరాలలో నేను శ్రీ సాయిబాబాను ఆశ్రయించడం జరిగింది. తరువాత 1940లో స్వామి రామదాసు (కన్హన్ గఢ్)గారిని దర్శిం చాను. వారు నా గురించి విని, నిధులన్నింటికీ నిధియని చెప్పదగిన మహాత్ముని ఆశ్రయించావు. ఆయననెన్నడూ విడువకు" అన్నారు.

అలానే 1958లో విజయదశమికి ఋషీకేశ్ లోని స్వామి శివానందసరస్వతి గారిని సందేశం కోరగా “షిరిడి సాయిబాబా అంటే ఆనందసాగరమే! అంతకంటే గొప్పది మరేమున్నది?" అన్నారు. శ్రీ గణపతి సచ్చిదానంద అను సిద్ధపురుషుని యిటీవల నేను దర్శించాను. అప్పుడు వారు "శిరిడి సాయిబాబా అంటే దత్తాత్రేయుని అవతారమే!" అని, ఒక్కక్షణం ఆలోచించి, "కాదు, కాదు! వారు సాక్షాత్తూ దత్తాత్రేయులే!" అన్నారు.

కొద్ది సంవత్సరాల కిందట మద్రాసు వెళ్ళి నప్పుడు ఒక మిత్రుడు నన్ను ఒక భక్తురాలి దర్శనానికి తీసుకు వెళ్ళాడు. మేము వెళ్ళే సరికి శ్రీ మాతాజీ ధ్యాన సమాధిలో వివిథ దేవతా పటాలకి ఎదుట కూర్చుని వున్నారు. నేనొక మూల కూర్చొన్నాను. ఒక పావుగంట తర్వాత ఆమె "శిరిడి సాయిబాబా" అన్నారు. ఆయనే నా ఇష్టదైవమని వారికెలా తెలుసు ఆమె యింకా యిలా అన్నారు. "త్రిమూర్తుల్లో బ్రహ్మకు ఆలయం, పూజా లేవు. వారి మొదటి అవతారం త్రేతాయుగంలో వశిష్టమహర్షి, రెండవ అవతారం ద్వాపరయుగంలో దత్తాత్రేయుడు, మూడవ అవతారం కలియుగంలో షిరిడి సాయిబాబా!" అన్నారు.

బాబాకు ముందు కొందరు దత్తావతారులు వున్నారు కదా! అని మనసులో అనుకున్నాను. వెంటనే ఆమె “బాబాకు ముందున్న వారంతా దత్తాత్రేయుని అంశ అవతారాలే. ఈ యుగంలో శిరిడి సాయిబాబా ఒక్కరే సంపూర్ణ దత్తావతారం. ఇప్పుడు శివాలయాలు, రామ మందిరాలు వున్నట్లే, ఒకటి రెండు శతాబ్దాల్లో ప్రతి గ్రామంలోనూ సాయి మందిరాలు వెలుస్తాయి. అవి మన గ్రామ జీవితమంతటికి కేంద్రాలవుతాయి" అన్నారు.

(సాయిలీలామృతం నుండి)

*సాయితత్వ రహస్యం*..

మానవాళికి భగవంతుడు ఇచ్చిన మహనీయ వరం శ్రీ సాయి. శ్రీకృష్ణుడు మనిషి ఎలా బతకాలో భగవద్గీతలో చెప్పాడు .

శ్రీ సాయి అలా జీవించి చూపారు. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న ఎన్నోసమస్యలకు, బాధలకు ఏకైక పరిష్కారం సాయితత్త్వం. చిక్కులో పడి కొట్టుకుపోతున్న మనిషికి, అలసిన మనసుకు చేయుతనిచ్చి సేద తీర్చే సాధనం సాయితత్త్వమే. మానవాళికి ఉద్దరణ కోసం, మనిషిగా మానవత్వంలో ఎలా బతకాలో చెప్పటం కోసం శ్రీ సాయి తన కాలాన్ని మొత్తం వెచ్చించారు.

పూజా విధులు, పురస్కార తంతులు, విధి విధానాలు ... బాబాకు వీటితో పనిలేదు. శ్రద్ధ , సహనం ...ఇవి రెండే భక్తుల నుంచి కోరిన బాబా, వాటిని ఆచరించిన వారికి తన ప్రేమను పంచారు. సాయి ఆదర్శ జీవన విధానం మనవ సంశయాలను పటాపంచలు చేస్తుంది.

బాబా బోధనలు మనో వికాసాన్ని కలిగిస్తాయి . ఉత్తమ వ్యక్తిత్వ లక్షణాలను అలవరుస్తాయి. అదే సాయితత్వ రహస్యం.
 
   సాయితత్వాన్ని నిత్యజీవితంలో ఆచరిస్తే ఆధ్యాత్మిక చింతన అలవడుతు౦ది జీవితం ధన్యమవుతుంది .సాధన అనేది జీవితంలో ఒక భాగం కావటం కాక, జీవితమే ఒక సాధనగా మారుతుంది.

 శ్రీ సాయి సద్గురువు. ధర్మసూత్రాలు, సత్య ప్రవచనాలు చెప్పి ఊరుకోలేదు . స్వయంగా ఆచరించి చూపారు. అందుకే బాబా సమర్ధ సద్గురు అయ్యారు .మనిషి జీవిత పరమార్ధం ఏమిటి ?ఎలా నడుచుకోవాలి ?ఇదంతా బాబా ఆచరించి చూపారు .

ఆచరించి చూపటమే అవతార పురుషుని ప్రథమకర్తవ్యం కదా! బాబా చెప్పిన విషయాలను, బాబా జీవన విధానాలను చదివి మననం చేసుకోవటం ముఖ్యం. బాబా బోధనలు, మంచి మాటలు మన హృదయమనే క్షేత్రంలో మొలిచిన దుష్టబుద్దులు, చెడు లక్షణాలనే కలుపు మొక్కల్ని పెకిలించి వేస్తాయి.

 షిరిడి సాయిబాబా ఈ యుగావతరం. నేడు ప్రపంచ౦ ఎదుర్కొంటున్న అన్ని సమస్యలకు ‘శ్రీ సాయి సచ్చరిత్ర’లో పరిష్కారం లభిస్తుంది.

           *ఓం సాయిరాం*
Sunday, June 28, 2020 0 comments By: visalakshi

సాయినాధ గురు సాన్నిధ్యం - ప్రార్ధన...

    ఓం శ్రీ సాయినాధాయ నమో నమః




మనసే మందిరంగా చేసి సాయిని ఆరాధిద్దాం
సాయిబాబాకు ఆర్భాటాలు, ఆడంబరాలు అక్కర్లేదు. నిండైన మనసు చాలు. మనసునే మందిరంగా చేసి సాయిని ఆరాధిద్దాం.
సాయిబాబా పాదాలను ఆశ్రయించడమే ఆరాధన. మనసులో నిరంతరం బాబాను తల్చుకోవడమే నివేదన.
సాయిబాబాకు భక్తుల గురించే ధ్యాస. మనని భవబంధాలనుండి ఎలా విముక్తుల్ని చేయాలి, అశాశ్వతమైన అనుబంధాల నుండి ఎలా బయట పడేయాలి, ఆధ్యాత్మిక చింతన పెంచి జీవితాన్ని సార్ధకం చేయాలి అనే ఆయన చింత. భగవంతుడు మనిషికి అవసరమైనవన్నీ ఇచ్చి భూమ్మీదకు పంపాడు. మరి అలాంటప్పుడు భగవంతుడు తాను ఇచ్చిన ఆస్తులను, మానవులు సవ్యంగా ఖర్చు పెట్టాలని ఆశిస్తాడు కదా. కనుక మనం దేన్నీ దుర్వినియోగం చేయకూడదు. మనకు ఉన్న ఆస్తులను సద్వినియోగం చేసుకుంటూ, తోటివారికి ఉపయోగపడుతూ, జీవితాన్ని సార్ధకం చేసుకోవాలి.

వివిధ సందర్భాల్లో సాయిబాబా అన్న మాటలు గుర్తుచేసుకుందాం...

"ప్రజల్ని సన్మార్గంలో పెట్టమని భగవంతుడు నన్ను పంపాడు. కానీ, ఈ రోజుల్లో ప్రజలు కాస్తయినా దేవుడిపట్ల భక్తిశ్రద్ధలు లేకుండా కాలం గడుపుతున్నారు. క్షణికమైన మొహావేశాల్లో పడి కొట్టుకుపోతున్నారు. సత్సంగాలపై ధ్యాస, నమ్మకం లేవు. సత్యం మాట్లాడుతూ, ధర్మాన్ని ఆచరించమంటే, అసత్యాలు చెప్తూ, అధర్మంలో తేలుతున్నారు. భక్తిభావన నిలుపుకుంటే మీకే శ్రేయస్కరం. నా ప్రయత్నాన్ని నేను చిత్తశుద్ధితో చేస్తాను."



పుడుతున్నాం. తింటున్నాం. కాలయాపన చేస్తున్నాం. పుట్టడం, ఆయుష్షు ఉన్నంతవరకు జీవించడం - ఇదేనా జీవితం? ఇందులో ఏమైనా జీవితపరమార్ధం ఉందా? మన జీవితానికి గమ్యం అంటూ ఉండనవసరం లేదా? సరైన, నిర్దుష్టమైన గమ్యాన్ని నిర్ణయించుకుని దాన్ని చేరేందుకు ప్రయత్నించాలి. మనిషి తనను తాను తెలుసుకోలేనంతవరకూ, గమ్యాన్ని నిర్దేశించుకునేంతవరకు జ్ఞానం లేనట్లే. గమ్యం తెలిసివాడే జ్ఞాని. సద్గురువు బోధనలు వింటే, వాటిని పాటిస్తే జీవితం సార్ధకమౌతుంది.

పుట్టినవారు గిట్టకమానరు. అందరూ మట్టిలో కలిసిపోవలసిందే. అయితే, చావుపుట్టుకల మధ్య ఉన్న జీవితాన్ని సార్ధకం చేసుకోవాల్సిన బాధ్యత మనమీద ఉంది. తోటివారితో వీలైనంత వినయవిధేయతలతో మాట్లాడాలి.  , విలాసాలకు దూరంగా నిరాడంబరంగా గడపాలి.

''ఇంద్రియాలను అదుపులో ఉంచుకో..సౌశీల్యాన్ని, సౌజన్యాన్ని అలవర్చుకో..ఎక్కువగా మాట్లాడకు..ఎదుటివారు చెప్పేది విను..
సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించు..దంతులు, వాదులాలు వద్దు..
అహంకారాన్ని విడిచిపెట్టు..కోపతాపాలకు దూరంగా ఉండు..
దేనిమీదా ఇష్టాన్ని పెంచుకోకు..దేన్నీ ద్వేషించకు..మనోవికారాలకు దూరంగా,నిర్వికారంగా ఉండటం అలవర్చుకో..శ్రద్ధ, సబూరీలను సమర్పించు
ఇదే నిజమైన గురుదక్షిణ''

సాయిబాబా సదానంద స్వరూపం. మోక్షాన్ని ప్రసాదించే సాధనం. శాంతికి మారుపేరు. సర్వ విజ్ఞాన ఖని.




బాబా మాటలు అమూల్యమైన హితోక్తులు. ఆయన బోధనలు అమృత జల్లులు..బాబా మనమధ్య తిరిగినప్పుడు ఎన్ని అద్భుతాలు చేసి చూపాడో, సమాధి స్థితిలోనూ చూపుతున్నాడు. ..బాబా మనకు మార్గదర్శకుడు.

బాబా అడుగులతో పునీతమైన షిర్డీ నేల పుణ్యక్షేత్రం అయింది. షిర్డీ వెళ్ళి వస్తే చాలు తమ కష్టాలు తీరుతాయని నమ్ముతారు భక్తులు. షిర్డీ క్షేత్రానికి వెళ్ళి, ప్రశాంత చిత్తంతో వెనుతిరిగి వస్తుంటారు. 

సాయి భక్తులు వీలైనపుడల్లా షిర్డీ వెళ్ళి వస్తుంటారు.

చిన్నాపెద్దా, పేదాధనిక తేడా లేకుండా బాబా అందర్నీ కాపాడుతాడు. కష్టాలను ఎదుర్కొనే శక్తి సామర్ధ్యాలను అందిస్తాడు.

బాబా సిద్ధపురుషుడు అయ్యుండీ సామాన్యుడిలా జీవించాడు. నలుగురి మధ్యా సాధకునిలా జీవించి ఎన్నెన్నో జీవనసత్యాలను అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్లు అర్ధం చేసి చెప్పాడు.


లోకమంతా నిద్రలో ఉంటే జగద్రక్షకుడిగా బాబా మెలకువగా ఉండేవాడు. అందరూ మేల్కొని ఉన్నప్పుడు ఆయన యోగనిద్రలో ఉండేవాడు.

మనల్ని ఎల్లవేళలా కంటికి రెప్పలా కనిపెట్టుకుని ఉండే బాబా ఉండగా మనకెందుకు చింత? నిశ్చింతగా, నిబ్బరంగా ముందుకు సాగుదాం. జీవన మాధుర్యాన్ని ఆస్వాదిద్దాం.....ఓం సాయిరాం



ప్రార్ధన..ఓం సాయిరాం ..


ప్రేమతో ,భక్తితో పిలిస్తే పలకని ,తలిస్తే తరింపచేయని దైవం ఉంటారా ?


భక్తుల ప్రార్ధనలోని వేడుకోలు అనే వెచ్చదనానికి భగవంతుని హృదయం వెన్నలా కరగకుండా ఉంటుందా ?


ద్రౌపదిని వస్త్రాభరణం నుంచికాపాడింది ప్రార్ధనే!

గజేంద్రుడికి ప్రాణభిక్ష పెట్టింది ప్రార్థనే !
మార్కండేయుడిని యమగండం నుంచి తప్పంచింది ప్రార్థనే !
ప్రహ్లాదుడిని భక్తిముక్తిదాయకుడిని చేసింది ప్రార్దనే!

శ్యామాను పాముకాటు నుంచి రక్షించి౦ది ,తాత్యాకు ప్రాణభిక్ష పెట్టింది ప్రార్దనే !


ఈ కాలంలో ప్రార్ధనకు అర్ధం మారిపోయింది.

దేవుడితో బేరసారాలు ఆడటమే ప్రార్ధనల పరమావధి అయింది .'నా కోరిక తీర్చు...నీ చెంతకొస్తా'.....'ఫలానా పనయ్యేలాచెయ్యి... ''నీకు కానుకలిస్తా ''ఇంకా ఇలాంటివే మన ప్రార్ధనలన్ని !
ఏదిఏమైనా భగవంతుడు అందరివాడు అందరిలోనూ ఉన్నాడు .

ప్రార్ధన స్వభావం ఏదైనా భగవంతుడు వెంటనే కదులుతాడు.అందుకే మనం చేసే ప్రతి ప్రార్ధనకు ప్రతిఫలం ఉంటుంది .


కీర్తి ,ప్రతిష్ట ,గౌరవం,ఐశ్వర్య౦,ఆరోగ్యం .....ఏదడిగిన కాదనకుండా భగవంతుడు మనకు కోరినవన్నీ ప్రసాదిస్తాడు .మనం కోరకునేవన్ని కూడా అవే !

మనం చేసే ప్రార్ధనలో 'దేవుడిలా కావాలని ' చేసే ప్రార్ధన ఒకటి ఉండదు .జ్ఞానాన్ని ప్రసాదించమని 'ఒక్కరూ భగవంతుడ్ని వేడుకోరు .

ఒకసారి కుంతిదేవితో శ్రీకృష్ణుడు ''అత్తా !ఏదైనా వరం కోరుకో ''అన్నాడట .


''నాపై దయ ఉంటే నాకు ఎడతెగని కష్టాలు ప్రసాదించు ''అందట కుంతిదేవీ .


''అదేమిటి ?అందరు భోగభాగ్యాలు ,సుఖసంతోషాలు కోరుకుంటే నువ్వేమో కోరికష్టాలను ఇవ్వమంటావు?''అని కృష్ణుడు ఆశ్చర్యపోయాడు .
''కష్టాలలో ఉంటేనే కదా నిరంతరం భగవంతుడు గుర్తుండేది .సుఖాలకు మరిగితే ఇక నీ అవసరం ఉండదు .నాకు భగవంతుని సాంగత్యమే ఇష్టం .అందుకే నేను భగవంతుడినే ఎల్లప్పుడూ ధ్యానించాల౦టే నాకు కష్టాలనే ఇవ్వు ''. భగవంతుడు చెంతనే ఉంటే మాత్రం కోరి కష్టాలను వరించటం ,మనసును కష్ట పెట్టుకోవటం ఎవరికీ మాత్రం ఇష్టం .మరి ,మన కోరికలను తీర్చుకుంటునే భగవంతుడుని ఎలా ధ్యానించాలి ?నిత్యం భగవంతుడిని మనసు మందిరంలో ఎలా ప్రతిష్టించుకోవాలి ?అసలు మనం భగవంతుడిని కోరుకోవాల్సినవి ఏమిటి ?ఇవన్ని భక్తుడిని సందిగ్ధంలో పడవేసే ప్రశ్నలు .చాలా వరకు సులభరీతిలో సమాధానం దొరకనివి కూడా!




ఈ క్రమంలోనే మానవజన్మకు భూమిపైనే చరితార్థం చేయగల సులభోపాయాలు ,సరళబోధలు ,..నీతిసూత్రాలు , చక్కని ఉపదేశాలతో జ్ఞానమార్గాన్ని చూపటానికి ఓ దివ్య అవతారం వెలసింది .మానవాళి ఉద్ధరణకు మానవ రూపంలో అవతరించిన ఆ దైవమే షిరిడిసాయినాధుడు .అరవై ఏళ్ళ పాటు ఈ నేలపై నడయాడి మనుషుల పాప కర్మలని ,కష్టాల్ని తనపై వేసుకుని ,తననుభవించి మానవ జీవితాలను పావనం చేసిన సాయినాధుడు భక్తసులభుడు. మనిషి నడవడిక ఎలా ఉండాలో బాబా స్వయంగా ఆచరించి చూపారు.ఆదర్శజీవన  విధానానికి బాటలు వేశారు .ఆ అడుగుజాడలే ఇవి....ఆసాయిపధ౦ ఇది .......ఆ బాటలో నడవండి!ముక్తులుకండి! జీవితాల్ని ధన్యంచేసుకోండి.

ఇక సర్వం శ్రేయస్సులు మీవే!.......Fb సౌజన్యంతో..

సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు