Friday, November 14, 2014 1 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 73

ఓం శ్రీ పరబ్రహ్మస్వరూపాయ నమ:

" సాయి పారాయణగ్రంధము లో ప్రతీఘటనను పరిశీలిస్తే ఓ అద్భుతమైన ఆధ్యాత్మికబోధన అవగతమౌతుంది. మన శాస్త్రాలు స్మృతులు సంక్లిష్టంగా చెప్పేవే సరళంగా తెలియజేసిన ఘటనలే అవన్నీ. ఉదాహరణకు త్రివిధములైన సంచిత, ఆగామి, ప్రారబ్ధకర్మములలో ప్రారబ్ధం భోగముతో, జ్ఞానంచే సంచితము, మిత్రులు శత్రువుల పరుష మాటలచే ఆగామి నశించునని శాస్త్రం చెప్తున్దిలా -

ప్రారబ్ధం భోగతో నశ్యేత్తత్త్వజ్ఞానేన సంచితమ్ / 
ఆగామి ద్వివిధం ప్రోక్తం తద్ద్వేషి ప్రియవాదినో: //

దీనినే సామాన్యులకు సైతం అర్ధమయ్యే ఘటనలు పారాయణంలో చదివాను - అని  బాబాగారి సచ్చరిత్ర లోని ప్రతి సంఘటన ఒక జ్ఞానబోధ. ప్రతి ఘటనను వివరముగా రాయమని ప్రోత్సహించిన నా శ్రేయోభిలాషి, ప్రియస్నేహితురాలికి ధన్యవాదాలు తెలుపుతూ", బాబాగారు శ్యామాకు తెలిపిన ప్రారభ్దకర్మ గురించి ఇలా....

 ఒక భక్తుడు సాయిబాబాకి భక్తితో 2రూ"ల దక్షిణ ,సాయి పేరుమీద శిరిడీకి పంపాడు. ఆ సమయములో సాయి మశీదులో లేరు. ఆ రెండు రూపాయలను శ్యామా తీసుకొని సంతకం చేసాడు. శ్యామాకు బాబాగారిని పరీక్షించాలని వారి సర్వజ్ఞత, శక్తి స్వయంగా చూడాలని,వాటిని సాయికి ఇవ్వకుండా, మశీదులో ఒక మూలకు పాతిపెట్టాడు. సాయి మశీదుకు వచ్చి ఏమీ మాట్లాడలేదు. కొన్నాళ్ళకు ,శ్యామా ఇంట్లో దొంగలు పడి 200రూ"లు దొంగిలించారు. శ్యామా బాధపడి, తనకు జరిగిన దుస్థితిని సాయితో చెప్పుకున్నాడు.  అపుడు సాయి నవ్వుతూ,  "నీకు చెప్పుకోడానికి నేనైనా వున్నాను. నా రెండు రూపాయలు పోయి ఆరు నెలలు అయింది. మరి నేనెవరితో చెప్పుకోవాలి." అని శ్యామావైపు సాయి గంభీరంగా చూసాడు. 

శ్యామా రెండు రూపాయలు దాచిపెట్టిన సంగతి సాయి తెలుసుకున్నారని సాయి సర్వజ్ఞత్వానికి ఆశ్చర్యపోయి బాబా! ఏదో తమాషాకొద్దీ, నేను 2రూ"లు దాచిపెడితే, నాకు 200రూ"ల నష్టం కలిగిస్తావా? ఇదేమి న్యాయం అని శ్యామా అన్నాడు.

  "ఎందుకు దిగాలు పడతావు, ఎవరి తలరాత ఎలావుంటే అలా జరుగుతుంది. మనచేతనిబట్టే ప్రారబ్ధమనే తలవ్రాత వుంటుంది. కర్మఫలాన్ని అనుభవించక తప్పదు" అని   ఉద్యోగం చేసే నీకు 200రూ"లు ఎంతో, ఏ ఉద్యోగం లేని ఈ ఫకీరుకు 2రూ"లు అంతే. అని శ్రీసాయి చెప్పడముతో ధర్మ సూక్ష్మానికి శ్యామా అశ్చర్యపడ్దాడు. బాబా హితబోధ వలన ప్రారబ్ధం అన్నది అనుభవించక తప్పదని, అది అనుభవిస్తే పోతుందని,   తెలుసుకొని తిరుగులేని విశ్వాసాన్ని సాయి మీద నిలుపుకున్నాడు.

  శ్యామాద్వారా మనకు 3 విషయాలు బోధపడ్డాయి. అవి "1. గురువును పరీక్షించరాదు. 2. గురువు విషయంలో తప్పు చేస్తే, ఎప్పుడో ఒకనాడు శిక్ష అనుభవించక తప్పదు. 3. గురువుకు చేసే మంచైనా, చెడైనా శిష్యునికి 100 రెట్లు తిరిగి వస్తుంది " 

ఇక్కడ నా ప్రారబ్ధ ఘటన గురించి కూడా మీకు తెలియజేయాలి. దాదాపు ఐదు నెలల క్రితం నేను,మావారు మా వియ్యంకులవారి ఇంటికి వెళ్ళి వస్తుండగా, రాత్రి వర్షం పడి, చిన్న,చిన్న చినుకులు పడుతుండగా నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ పరధ్యానంగా ఉన్న సమయంలో,బైక్ మీద ఒకవ్యక్తి మమ్మల్ని కంఫ్యూజన్ చేస్తూ మా ముందుకు వచ్చి నామీద లైట్ ఫోకస్ చేస్తూ నాకు తెలియకుండా పక్కకు వచ్చి నా మంగళసూత్రాలు, నల్లపూసలగొలుసు ఒక్క క్షణంలో లాక్కుని వెళ్ళిపోయాడు. నేను లాగేస్తున్నాడు అని అరుస్తుంటే మావారు పరిగెత్తి పట్టుకోబోయి పడిపోయారు. వర్షం వల్ల రోడ్డుపైన జారి పడిపోయారు. వాడు అప్పటికే పారిపోయాడు.నా అరుపులకి చుట్టుపక్క జనాలు వచ్చి నన్ను ఓదారుస్తుండగా అప్పటి వరకు వెలగని స్ట్రీట్ లైట్స్ అప్పుడు వెలిగాయి. ఐదు ని"లలో  పోలీసులు వచ్చారు. జరిగినది తెలుసుకున్నారు. మా వియ్యంకులవారు,మేము పోలిస్ స్టేషన్లో ఎఫ్.ఐ.ఆర్ రాసి సంతకంచేసి ఇచ్చి వచ్చాము. జరిగిన దానికి నా అజాగ్రత్తే కారణమని తలచినా, మంగళవారం నాడు పోయాయి అని చాలా బాధపడ్డాను. ఈ సంఘటన తెలిసిన సత్సంగ సభ్యులు ఇద్దరుమరియు స్నేహితులు మమ్ములను ఇలా అడిగారు. "మీరు రోజూ బాబాకి పూజలు చేస్తారుకదా! మరి మీకెందుకిలా జరిగింది?"మేము చెప్పాము..."మీ కర్మలకు నన్ను కారణభూతుణ్ణి చేయకండి. నేను సాక్షీభూతుణ్ణి మాత్రమే!" అని బాబాగారు చాలా సంధర్భాలలో చెప్పారు.మరి నేను చేసిన ఏ కర్మఫలమో అని అనుకున్నాను. కానీ బాబాగారికి విన్నవించుకున్నాను. ఎందుకిలా జరిగిందో తెలియదు. పరిష్కారం నీకే తెలుసు. నీ చరణాలు పట్టుకున్న మేము ఈ విషయాన్ని నీ పాదాలవద్ద వుంచాము అని. ఒక వారంలో  స్టేషన్ నుండి ఫోన్ వచ్చింది. మీ గోల్డ్ దొరికింది. దొంగను పట్టుకున్నాము. కోర్టుకు వచ్చి మీ బంగారం తీసుకెళ్ళవచ్చు . అని చెప్పారు. మూడున్నర తులాలు పోతే, సగంకి కొంచం ఎక్కువ బంగారం ఇచ్చారు. అప్పుడు సత్సంగ సభ్యులు మీ భక్తి, పూజలవల్ల బాబాగారి అనుగ్రహం వల్ల మీకు పోయిన బంగారం దొరికింది అని అన్నారు.    ఎందుకు జరిగినా.. మమ్మల్ని సదా ఎరుకలో ఉండమని బాబాగారు హెచ్చరించినట్లు మాకు బోధపడింది.


  శివేరు ష్టే గురు: త్రాతా గురౌ రుష్టే న కశ్చ న !



శివుడు కోపించిన గురువు మనలను రక్షించును. గురువు కోపించిన రక్షించువాడు మరొకడు లేడని పరమేశ్వరుడు తెలిపెను.

  ఇద్దరువ్యక్తులవాక్కలహంతో ఆగామి నశించే విధం ...ఘటనలు సవివరముగా తదుపరి.....



సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.




Wednesday, November 5, 2014 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 72

 ఓం  శ్రీ సాయికృష్ణాయ నమో నమ:


"నిరంతర సాధన వల్ల సాంసారిక చింతలు పూర్తిగా తొలగిపోయి భగవచ్చింతన మనస్సును ఆక్రమిస్తుంది. అప్పుడు అవసానకాలంలో సైతం మనస్సులో అదే మెదలుతూ ఉంటుంది."- శ్రీరామకృష్ణులు.



శ్రీ సాయికృష్ణుడు నానాకు చేసిన జ్ఞానబోధ :


శ్లో" తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా!


   ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్వ దర్శిన:!!

 ఇది గీతలోని మూల శ్లోకం. మొదటి రెండు చరణాల్లోని అర్ధాన్ని నానా వివరించి చెప్పింది బాబాగారు అంగీకరించారు. మిగిలిన రెండు చరణాల గురించి బాబాగారు ఎలా వివరించారో వినండి. 

 "నానా! శ్లోకంలోని మూడవ చరణం మళ్ళీ పూర్తిగా గుర్తుకు తెచ్చుకో. జ్ఞానమనే శబ్దం వెనుక అవగ్రహం ('అ ' ని లోపించినట్లు చూపించే 2చిహ్నం )పెట్టు. అప్పుడు ఆ చరణానికి అర్ధం చెప్పు. జ్ఞానులు, తత్వదర్శులు జ్ఞానోపదేశాన్ని చేస్తారని అన్నచోట అజ్ఞానాన్ని ఉపదేశిస్తారన్న శబ్దం ఉపయోగించు. అప్పుడు నిజమైన అర్ధం నీకు తెలుస్తుంది. జ్ఞానం మాటలతో చెప్పబడేది కాదు. మరి దాన్నెలా ఉపదేశించగలం? కనుక జ్ఞానం అనే మాటకి వ్యతిరేక శబ్దాన్ని తీసుకో. అప్పుడు దాని అనుభవాన్ని చూడు. నీవు చెప్పిన జ్ఞానం అనే మాటకి అర్ధాన్ని విన్నాను. అక్కడ అజ్ఞానం అనే మాటకి అర్ధం తీసుకుంటే ఏమైనా నష్టమా? అజ్ఞానం అనేది వాక్కుకి విషయం అవగల్గితే అప్పుడు జ్ఞానం మాటలకి అతీతంగా ఉంటుంది. గర్భాన్ని చుట్టుకొని ఉండే పొరలాగా, అద్దానికి పట్టే దుమ్ములాగా,లేదా అగ్నిని కప్పేసే బూడిదలాగే అజ్ఞానం జ్ఞానాన్ని కప్పేసి ఉంటుంది. జ్ఞానం అజ్ఞానంతో ఆవరించబడి ఉంటుందని శ్రీకృష్ణుడు గీతలో అన్నారు.కనుక అజ్ఞానాన్ని పక్కకు నెడితే జ్ఞానం స్వాభావికంగానే ప్రకాశించబడ్తుంది. జ్ఞానం స్వయం ప్రకాశకం. కానీ నాచుతో ఆచ్చాదించబడిన శుద్ధజలంలా ఉంటుందది. ఈ నాచుని తెలివిగలవారు పక్కకు నెట్టుతారు. వారికే ఆ శుద్ధజలం లభిస్తుంది. చంద్రుడికీ, సూర్యుడికీ గ్రహణం పట్టినప్పుడు చంద్రుడు, సూర్యుడు సర్వదా ప్రకాశిస్తూనే ఉంటారు. కానీ రాహు,కేతువులు అడ్డుగా వచ్చి మన దృష్టిని అడ్డుకొంటారు. చంద్రుడిపై, సూర్యుడిపై వీరి ప్రభావముండదు. మన దృష్టికే అవరోధం కలుగుతుంది. అలాగే జ్ఞానం తన స్థానంలో స్వయంసిద్ధంగా సురక్షితంగా ఉంటుంది. కళ్ళకున్న చూడగల శక్తే జ్ఞానం. దానిపై నున్న తెర అజ్ఞానం. దాన్ని తప్పకుండా దూరం చేయాలి. ఆ తెర లేదా ఆచ్చాదనని చేతి కుశలతతో దూరంగా నెట్టేయాలి. అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి, చూడగల శక్తిని ప్రకటం చేయాలి.

ప్రణిపాతం, పరిప్రశ్న, సేవ ఇవి గురుకృపను పొందడానికి సాధనలు. జగత్తుని నిజమని అనుకోవటం పెద్ద అజ్ఞానం అజ్ఞానమే సంసారంలోని దు:ఖానికి మూలం. గురుకృప అనే కాటుక కళ్ళకి పెట్టుకుంటే మాయా ఆవరణ ఎగిరిపోతుంది. స్వాభావిక జ్ఞానం మిగిలిఉంటుంది. దేవుడు, భక్తుడు వేరు అనుకోవడమే విలక్షణమైన అజ్ఞానం. దాన్ని నిరసించగానే పూర్ణజ్ఞానం మిగులుతుంది.దేహం జన్మించడానికి కారణం మాయ. దేహచలన వలనాలు, వర్తన,విధిననుసరించి ఉంటాయి. సమస్త (సుఖదు:ఖాలు, జయాపజయాలు, లాభనష్టాలు ఇత్యాదులు) ద్వంద్వాలు కూడా విధి ననుసరించి ఉంటాయి. మన శరీరంపట్ల ఆసక్తి ఉండటమే అజ్ఞానం. నేను శరీరాన్ని అన్న గుర్తు చెరిగిపోతే అజ్ఞానం నశిస్తుంది. కనుక మాయను నిరశించటానికి ఈశ్వరభజన అనేది ఒక్కటే ఉపాయం. మాయను దాటి   వెళ్ళడానికి సద్గురు పాదాలు పట్టుకోవాలి. ఆయన్ని అనన్యంగా శరణనాలి. అప్పుడు ఈ సంసారభయం వెంఠనే నశించిపోతుంది. అనివార్యంగా వచ్చేమరణం వస్తే రానీ. కానీ హరి విస్మరణని మాత్రం రానీకు.మనసులో హరి చరణాలను ధ్యానం చేయాలి.జీవుడు స్వస్వరూప జ్ఞానాన్ని ప్రాప్తింప చేసుకోగల మార్గానికి వెళ్ళాలి. అప్పుడు శాశ్వత శ్రేష్ఠ సుఖం అనే లాభం మిగులుతుంది. అంత:కరణలో హరి,గురువుల చింతన కలగాలి.చెవులతో వారి చరిత్రను వినాలి. మనసులో నిరంతరం వారిని ధ్యానించాలి. నాలుకతో వారి నామస్మరణ చేయాలి. పాదాలతో నడిచి హరి,గురు గ్రామాలకు వెళ్ళాలి.నాసికతో వాళ్ళ నిర్మాల్యాలను వాసన చూడాలి. చేతులతో వారి పాదాలకు నమస్కరించాలి. కళ్ళతో వాళ్ళ దర్శనం చేసుకోవాలి.అలా ఈ సమస్త ఇంద్రియ వృత్తులను హరి,గురువుల వైపు ప్రేమతో మళ్ళించిన ఆ భక్తుల స్థితి ధన్యం.  ఇంతకుమించిన భగవద్భక్తి మరోటి ఏముంటుంది? 

సారాంశం - అజ్ఞానాన్ని సమూలంగా పెకలించివేయాలి. మిగిలినదే స్వయంసిద్ధజ్ఞానమని తెలుసుకోవాలి అని ఈ శ్లోకం యొక్క అంతరార్ధాన్ని శ్రీకృష్ణుడు అర్జునునికి సూచించారు. 

శ్రీసాయిబాబా ప్రేమ,కరుణలు కలబోసిన సాగరం. ఆయన నానాని నిమిత్తంగా చేసుకొని మనందరికోసం గీతార్ధాన్ని ప్రవచనం చేసారు. 

 బాబాగారి జ్ఞానబోధను వినగానే నానాసాహెబ్ వినయవిధేతలతో బాబాకి సాష్టాంగ నమస్కారం చేశాడు. రెండు చేతులతో ఆయన పాదాలకి నమస్కరించి ఎంతో శ్రద్ధతో "బాబా నా తీవ్రమైన  అజ్ఞానాన్ని దూరం చేయండి. నాకు సరైన శిక్షణనిచ్చి నా మొండి అహంకారాన్ని నశింపజేయండి.నాపై కృపాదృష్టి చూపండి.ఇదే నాకు సుఖసంతృప్తులనిస్తుంది" అని ప్రార్ధించాడు. బాబాగారు ప్రేమ,కరుణలతో నానాను ఆశీర్వదించారు.


 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు