Wednesday, November 18, 2015 1 comments By: visalakshi

గురువుకు భగవద్దర్శనం కలిగించిన శిష్యుడు

 ఓం శ్రీ గురుభ్యో నమ:

 అగస్త్యమహర్షి, ఆయన శిష్యులు ఋగ్వేదాన్ని కూలంకషంగా అధ్యయనం చేసినవారు. అగస్త్యుని ఆశ్రమంలో అనేకమంది విద్యార్ధులు విద్యను అభ్యసిస్తున్నారు.సుతీష్ణుడు వారిలో ఒకడు.

 గురుదేవా పూజకు అన్ని ఏర్పాట్లు చేసాను.అన్నాడు సుతీష్ణుడు. చూడండి,సుతీష్ణుడు ఎంత చురుగ్గా,ఉత్సాహంగా ఉంటున్నాడో! 
శిష్యులారా! రామనామం ఒక దీపం వంటిది.అన్నారు గురువు.

అవును గురుదేవా ! అది బాహ్యమైన చీకటినీ, ఆంతరిక అంధకారాన్నీ పారద్రోలుతుందని మునుపు ఒకసారి మీరు సెలవిచ్చారు.భేష్ సుతీష్ణా! నీ జ్ఞాపకశక్తి అద్భుతం. 

 గురువు సుతీష్ణుని ప్రశంసించడంతో తక్కిన శిష్యులకు అసూయ కలిగింది.వారు అగస్త్యునితో...గురుదేవా! మీరు సుతీష్ణుని అమితంగా ప్రశంసిస్తున్నారు, అందువల్ల అతడు మమ్మల్ని అసలు ఖాతరు చెయ్యడమే లేదు.మమ్మల్ని ఆటపట్టిస్తూ పరిహసిస్తున్నాడు.

  మీకన్నా చిన్నవాడైన అతడు ఏకసంధాగ్రాహిగా ఉన్నాడు. అలా ఉండడం నేర్వండి. అనవసరంగా అసూయ చెందకండి. సుతీష్ణుడు ఉత్తమ విద్తార్ధే అయినప్పటికీ, చిన్నతనం కారణంగా అతడిలో కాస్త అల్లరి ఉండడం సహజమే.

  ఒకసారి అగస్త్యుడు ఒక యాత్రకు వెళ్ళి తిరిగి వస్తున్నాడు.ఆయన సాలగ్రామం ఉన్న పూజాద్రవ్యాల పెట్టెను సుతీష్ణుడు వెనకాల మెల్లగా తీసుకువస్తున్నాడు. దారిలో ఒక నేరేడు చెట్టును చూడగానే రాళ్ళతో కొట్టి క్రింద పడ్డ పళ్ళను తినసాగాడు.ఇలా రాళ్ళతో పండ్లను కొట్టి కొట్టి అక్కడ ఉన్న రాళ్ళన్నీ ఖాళీ చేసాడు. అలా విసిరిన రాళ్ళు పక్కనే ఉన్న నదిలో పడ్డాయి. చివరికి పండ్లమీద ఉన్న ఆశతో చిన్నతనపు తుంటరితనం కారణంగా గురువుగారి పెట్టెలోని సాలగ్రామాన్ని కూడా తీసుకొని విసిరివేశాడు.

 ఆహా! పండు పడింది కానీ సాలగ్రామం నదిలో పడిపోయిందే! అయ్యో గురువుగారు కోప్పడతారే! ఏం చెయ్యాలి?.. నదిలో ఎంత వెతికినా సాలగ్రామం లభించలేదు.అందుచేత సాలగ్రామంలా ఉన్న ఒక నేరేడు పండును పూజాద్రవ్యాల పెట్టెలో జాగ్రత్తగా పెట్టాడు.  

  మర్నాడు అగస్త్యుడు పూజ చేస్తున్నప్పుడు.....ఈ రోజు సాలగ్రామం మృదువుగా ఉందే!అభిషేక జలం పడితే తోలు వొలిచేసినట్లు ఉంటోందే,ఏమిటిది? ఆ...ఇది నేరేడుపండు.! ఎవరీ తుంటరి పనిచేసింది? సుతీష్ణా...  క్షమించండి గురుదేవా! పళ్ళు తినాలనే ఆశతో నేనే ఈ పాపానికి ఒడికట్టాను... మూర్ఖుడా! నీ తుంటరితనం శ్రుతిమించింది. నీ ముఖం చూపించకు. వెళ్ళిపో!

అనుగ్రహించండి గురుదేవా!మిమ్మల్ని చూడకుండా, మీకు సేవ చేయకుండా నేను క్షణం కూడా ఉండలేను...నేను సాక్షాత్తూ భగవంతునిగా ఎంచి ఆరాధించిన సాలగ్రామాన్ని పోగొట్టావు.ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా ,నా భగవంతుణ్ణి నాకు తెచ్చి ఇవ్వు అంతవరకు నా ముందుకు రాకు.! విచారంతో ఆశ్రమం నుండి బయటకు వచ్చిన సుతీష్ణుడు దండకారణ్యంలో ఒక పర్ణశాల కట్టుకొని గురువు ఉపదేశించిన రామనామాన్ని జపిస్తూ రాముని ధ్యానంలో లీనమయ్యాడు. 



 కొన్ని ఏళ్ళు గడిచిపోయాయి. వనవాసానికి వచ్చిన శ్రీరాముడు, లక్ష్మణునితో ఇలా చెప్పాడు.. లక్ష్మణా! ఈ ప్రాంతంలో రామనామం బిగ్గరగా వినవస్తున్నది. ఇక్కడ ఎవరో కఠోరతపస్సు చేస్తున్నట్లు తెలుస్తోంది. ..వెంటనే శ్రీరాముడు సీతా లక్ష్మణ సమేతుడై సుతీష్ణుని పర్ణశాలకు వెళ్ళాడు. అప్పటికీ సుతీష్ణునికి  ధ్యానభంగం కాలేదు. శ్రీరాముడు అతడి హృదయంలో చతుర్భుజమూర్తియైన నారాయణునిగా దర్శనమిచ్చాడు. బాహ్యచైతన్యం కలిగిన సుతీష్ణుడు ...

 పరమాత్మయైన శ్రీరామా! ఈ అల్పుడి కోసం ఈ ఘోరారణ్యంలోకి ఇంత శ్రమపడి వచ్చావా...?ఓ శ్రీరామా! మీరు నా గురుదేవుల ఆశ్రమాన్ని ఒక్కసారి పావనం చేయండి.ఆయన నా పట్ల మునపటిలా వాత్సల్యంతో ఉండేలా చూడాలి.,,అలాగే!


అగస్త్యుడు శిష్యులకు పాఠం బోధిస్తున్నాడు. విద్యార్ధులారా! ఓంకార మాహత్యమూ,దివ్యశక్తీ రెండూ రామనామంలో ఉన్నాయి. ..గురుదేవా ప్రణామాలు. మీరు ఆజ్ఞాపించినట్లే భగవంతునితో వచ్చాను. ఇదుగో మన ఆశ్రమాన్ని సీతాలక్ష్మణ సమేతుడై శ్రీరాముడు పావనం చేస్తున్నాడు.శ్రీరామచంద్ర ప్రభువా! ఏం చెబుతున్నావు సుతీష్ణా?...శ్రీరాముని చూసి అగస్త్యుడు పులకరించిపోయి ఆయనను ఆహ్వానించి సముచిత మర్యాదలు చేశాడు. తరువాత...

సుతీష్ణా! గురువు శిష్యుడికి భగవద్ధర్శనం చేయిస్తాడు. కానీ నువ్వు మాత్రం గురువుకే భగవంతుని దర్శనం కలిగించావు. నీ గురుభక్తి మహోన్నతమైనది. నువ్వు చిరస్మరణీయుడవు.  

 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు
Saturday, November 14, 2015 0 comments By: visalakshi

భగవన్నామ మధువు మాధుర్యము

  ఓం శ్రీ పరంధామాయ నమ:

  ద్వా సుపర్ణా సయుజా సఖయా సమానం వృక్షం పరిషస్వజాతే!
 తయోరస్య: పిప్పలం స్వాద్వత్తి అనశ్నన్ అన్యో అభిచాకశీతి!!


  భా:- ఒకే చెట్టు పైన రెండు పక్షులు ఉన్నాయి. కింద కొమ్మ మీద ఉన్న పక్షి పళ్ళను తింటున్నది. అది తియ్యని పళ్ళను తిన్నప్పుడు సుఖాన్ని, చేదు పళ్ళను తిన్నప్పుడు దు:ఖాన్ని పొందుతుంది.రెండవ పక్షి ఏమీ తినకుండా ప్రశాంతంగా కూర్చొంది. సుఖదు:ఖాలకు అతీతమైన ఆత్మానందాన్ని అనుభవిస్తోంది.


  దేవదానవుల మధ్య తీవ్ర యుద్ధాలు జరుగుతున్న రోజులవి.  దేవతలు 
ఎంతో కష్టపడి దానవులపై విజయం సాధించినా ఆ ఆనందం ఎక్కువ కాలం నిలిచేది కాదు.దానవ గురువు శుక్రాచార్యుడు అసురులను మృతసంజీవని విద్యను ప్రయోగించి బ్రతికించేవాడు. ఈ కారణం చేత దేవతల సంఖ్య క్రమేణా తగ్గుతూ వస్తున్నది. 'ఇది ఇలాగే కొనసాగితే మనం అంతరించిపోతాం,ఏదైనా మార్గాన్ని అనుసరించి మనల్ని మనం రక్షించుకోవాలీ, అని దేవతలందరూ భావించారు. దేవగురువైన బృహస్పతి కుమారుడు కచుడిని శుక్రాచార్యుడి దగ్గరకు పంపాలని నిశ్చయించారు.   అతడు రాక్షస గురువు వద్ద మృతసంజీవని విద్యను నేర్చుకొని వచ్చి యుద్ధంలో చనిపోయిన దేవతలను తిరిగి బ్రతికిస్తుండాలి.ఆనాటి గురువులలో వివక్షత లేదు. దేవతల ప్రతినిధిగా వచ్చినప్పటికీ కచుడి వినయ విధేయతలు నచ్చి శుక్రాచార్యుడు కచుని శిష్యుడిగా స్వీకరించాడు. వినయ సంపదే విజ్ఞానార్జనకు మొదటి అర్హత అని చాటాడు. కచుడు గురుశుశ్రూష చేస్తున్నాడు. రోజులు గడుస్తున్నాయి.రాక్షసులు కచుడిని గమనిస్తున్నారు.అతడు దెవగురువు కుమారుడని,తమ గురువు వద్ద మృతసంజీవని విద్యను నేర్చుకొని యుద్ధంలో దానవ సమ్హారాన్ని నిరాటంకంగా కొనసాగించటానికి దేవతలు వేసిన ఎత్తుగడ అని వారికి అర్ధమైంది. ఒక రోజు కచుడు అడవిలో ఆలమందను మేపుతూ, ఒంటరిగా ఉన్నప్పుడు కచుని చంపి, శరీరాన్ని ఖండఖండాలుగా చేసి మృగాలకు ఆహారంగా వేసారు. శుక్ర తనూజ దేవయానికి కచుడంటే మహాభిమానం. కూతురంటే శుక్రాచార్యుడికి వల్లమాలిన ప్రేమ. బ్రహ్మజ్ఞాని అయిన ఆ ఋషి మనసు కుమార్తె కారణంగానే లౌకిక ప్రపంచంలో నిలిచేది. ఆ రోజు ఆవులతో పాటు కచుడు రాలేదు. దేవయాని ప్రమాదాన్ని శంకించింది. తండ్రి వద్దకు వెళ్ళి కచుడు తిరిగి రాలేదని ఏడుస్తూ చెప్పింది. ఆత్మజ రోదించడం చూడలేని ఆ సం యమి వెంటనే దివ్యదృష్టితో జరిగిన విషయాన్ని గమనించాడు. మృతసంజీవని విద్యను ప్రయోగించాడు. కచుడు జంతువుల శరీరాలను చీల్చుకుంటూ బయటకు వచ్చాడు.   ఇంకోసారి కచుడు దేవయానికి పూలను తీసుకురావటానికి అడవికి  వెళ్ళినపుడు రాక్షసులు అదే అవకాశంగా కచుడిని చంపి, శరీరాన్ని కాల్చి  ఆ బూడిదను సముద్రంలో కలిపారు. కచుడు ఆశ్రమానికి రాలేదని చూసి దేవయాని మళ్ళీ వెళ్ళి తండ్రి వద్ద మొరబెట్టుకుంది. ఈసారి కూడా అసుర గురువు తన అద్భుత విద్యతో కచుడిని బ్రతికించాడు. దైత్యులు ఇక లాభం లేదనుకొని మరోసారి కచుడు ఏకాంతంగా ఉన్నాప్పుడు అతడిని చంపి, ఆ శరీరాన్ని కాల్చి బూడిద చేసి, మద్యంలో కలిపి తమ గురువుతో తాగించారు. కచుడు కనబడకపోయేసరికి దేవయాని విచలిత మనస్కురాలైంది. కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ కచుడిని బ్రతికించమని తండ్రిని వేడుకుంది. దేవయాని కచుడిని చూడందే అన్నపానీయాలు ముట్టనని భీష్మించింది. దైత్యగురువుకి ఇక తప్పలేదు.మళ్ళీ విద్యను ప్రయోగించి, 'నాయనా కచా! లేచి రా'అన్నాడు. 'గురువర్యా నేను మీ శరీరంలోనే ఉన్నాను.' అని కచుడు బదులిచ్చాడు. శుక్రాచార్యుడికి దానవుల పన్నాగం అర్ధమైంది. మహాతపశ్శాలి ఐన ఆయన సురాపానం వలన తాను మోసపోయినట్లు గ్రహించాడు. కచుడు బయటకు వస్తే తాను  చనిపోవాల్సి ఉంటుంది. ఇక నిశాచర గురువుకి ప్రత్యామ్నాయం కనబడలేదు. కచుడికి మృతసంజీవని విద్యననుగ్రహించాడు. కచుడు గురువు శరీరాన్ని చీల్చుకొని, బయటకు వచ్చి తరువాత తాను గ్రహించిన విద్య ద్వారా గురువుని బ్రతికించాడు.ఆచార్యుడి ఋణం తీర్చుకున్నాడు.ఆదర్శ శిష్యుడనిపించుకున్నాడు. అసురాచార్యుడు జరిగిన తంతునంతా విచారించి,మధ్యపానం ఎంత అనర్ధానికి దారి తీసిందో గ్రహించి ఆగ్రహోదగ్రుడయ్యాడు. భయంకర శాపాన్ని భవిష్యత్ మధ్యపాన ప్రియులపై ప్రయోగించాడు. 'ఎవరైతే జ్ఞానవిహీనులై సురాపానం చేస్తారో వారు    ధర్మభ్రష్టులవుతారు.వారిని అందరూ చీదరించుకుంటారు. ఈసడిస్తారు. ఈ నా ఆజ్ఞను పాటించనివాళ్ళు పతనమవుతారు.అన్నాడు శుక్రాచార్యుడు.ఇది మహాభారతంలోని ఒక అద్భుత సన్నివేశం. ఈ గాధలో ఎన్నో ధర్మసూక్ష్మాలు ఉన్నాయి.       

 ఒక వ్యక్తి మద్యానికి బానిసై, గురువుతో యావజ్జీవితమూ నన్ను మత్తులో పడేసే మద్యాన్ని దయచేసి నాకివ్వండి ' అంటాడు. భగవన్నామం జపించమని ,ఆ మధువు ముందు అన్నీ దిగదుడుపేనని చెప్పి ఆ వ్యక్తిని మహా భక్తుడిగా తీర్చిదిద్దారు గురుతుల్యులు.ఈ భగవన్నామ మధువును రుచి చూడలేకపోవటం వల్లనే మనిషి చవకబారు మద్యానికి అలవాటు పడుతున్నారు.మందార పుష్పంలోని మకరంద మాధుర్యం అనుభవించే తుమ్మెద ఉమ్మెత్తపూల వైపుకి పోతుందా?'అంటాడు ప్రహ్లాదుడు.భగవన్నామ మాధుర్యమును ఆస్వాదించ లేకపోవటం వలననే మన మనస్సనే తుమ్మెద మద్యమనే ఉమ్మెత్త పూవుపైకి పోవుచున్నది. కానీ ఈ మాధుర్యాన్ని గ్రోలాలంటే ఎంత ఆధ్యాత్మిక సంస్కారం కావాలి!మధుపాన ప్రియులను, మాధవ ప్రియులుగా మార్చుటకు 'దయాస్వరూపుడైన ఆ శ్రీహరి అందరినీ సమగ్రజ్ఞానం వైపుకు నడిపించు గాక!'

 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.
Friday, November 13, 2015 1 comments By: visalakshi

మధుర స్పందన

  ఓం శ్రీ సర్వేశాయ నమో నమ:




ఆత్మీయ భావం మధుర స్పందన. ఆంతరంగిక అనుభూతి ఒక మధుర స్పందన. మదిలోఊగిసలాడే మధుర భావాలు ఒక మధుర స్పందన. ఈ స్పందనలన్నీ మనసులో నిక్షిప్తమై ఉంటేనే మధురంగా ఉంటుంది. మాటలద్వారా బయటకి బహిర్గతమయ్యాయా అనుకోని స్పర్ధలవుతాయి. సఖ్యతకు చెలిమికి దూరమయ్యే భావనలకు లోనవుతాము. సత్యానికి అందరం ఎంతో మధురానుభూతితో పలకరించుకుంటాము .కానీ ఆప్యాయత తో మరిన్ని కబుర్లు అపార్ధాలకు దారి తీస్తాయి. పరుష భావజాలము మొదలవుతుంది. 

మైత్రిలో ఒకరి భావాలను,ఒకరు పంచుకుంటాము. బాధలను కూడా పంచుకుంటాము. అలాగే భేదాభిప్రాయాలను కూడా అర్ధం చేసుకొని మైత్రీ భావనను మధుర స్పందనగా మలచుకొని హృదయంలో ఆత్మీయతానురాగాలను పదిలపరచుకోవాలి.

 అధ్యాత్మికంగా ఎల్ల వేళలా భగవంతుడి స్మరణం మనకు అలౌకిక ఆనందానుభూతిని కలిగిస్తుంది. మనము సౌమ్యముగా సఖ్యతతో,ఆత్మ స్వభావము తో స్నేహం,ప్రేమ భావ మైత్రితో అంతరంగమున దివ్య స్పందనలు మధురంగా నిక్షిప్తపరచుకోవాలి.

అధరం మధురం, వదనం మధురం,
నయనం మధురం, హసితం మధురం!
హృదయం మధురం, గమనం మధురం,
మధురాధిపతేరఖిలం మధురం!!


 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.

ఆత్మాభిమానం (Self - respect )


 సమతన్ స్నేహముచే సుతత్వమును,విశ్వాసంబు చేతన్ సఖి
 త్వము,జాలన్ హితవృత్తి చేతన్ సుహృత్త్వంబున్, సుమంత్రోపదే
 శముచేతన్ నిజదేశికుం డనగ నిచ్చల్ పూజ్యుడౌ నిష్టదై
 వమునై వారికి కాలచక్రభయముల్ వారింపుదుం....


భా:-" సర్వసముడనైన నేను స్నేహం వల్ల కుమారుని వలెనూ, విశ్వాసము వల్ల చెలికాని వలెనూ,హితం చేకూర్చటం వల్ల ఆత్మీయుని వలెనూ, మంత్రం ఉపదేశించటం వల్ల ఆచార్యుని వలెనూ ఉంటూ వారికి నిత్యమూ పూజింపదగిన ఇష్టదైవాన్నై;కాలచక్రం వల్ల భయం కలగకుండా వారిని కాపాడుతూ ఉంటానని " అభయమిస్తూ...భక్తుడి భావాన్ని బట్టి భగవంతుడు తన అనుబంధాన్ని పెనవేసుకుంటాడు. 



 1. ఎవరికీ తలవంచని మనస్తత్వంతో, స్వతంత్రభావాలతో, ఋజువర్తనతో ఆత్మగౌరవానికి,విలువలకు కట్టుబడి ఏ ప్రలోభాలకు లొంగకుండా ఆత్మాభిమానంతో మెలగాలి.

2. అహంభావంగా వ్యవహరించకుండా ,బాధ్యతల విషయంలో నిక్కచ్చిగా ఉండాలి.

3. అంతరాత్మ ప్రభోదముతో మన వ్యక్తిత్వాన్ని,ఆత్మాభిమానాన్ని చాటుకోవాలి.

4.మనలోచాలామందికిఆత్మాభిమానం(Selfrespect)కి,అహంకారాని(egotism )కి తేడా తెలియదు. ఆత్మాభిమానం పేరుతో అహంకారంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అణకువ,నమ్రత పేరుతో ఆత్మన్యూనతతో తమను తాము తక్కువ చేసుకుంటూ ఉంటారు. రెండూ హర్షణీయం కాదు.  

5. ఆత్మ గౌరవం అత్యున్నతమైన గుణం. ఎక్కడా రాజీపడకూడదు. మన గౌరవాన్ని నిలబెట్టుకుంటూనే ,ఎదుటివారిని గౌరవించాలి. -ఎదుటి వారిని గౌరవించే ప్రక్రియలో నిన్ను నీవు తక్కువ చేసుకోవద్దు. 

6. ఇతరులకు సముచితమైన గౌరవాన్ని ఇస్తూ,మన ఆత్మాభిమానానికి భంగం కలగకుండా నడుచుకోవడం ఆదర్శవ్యక్తిత్వానికి చిహ్నం. అప్పుడే ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యపడుతుంది.

 " విశ్వాసమే గొప్పధనం, ధర్మాన్ని అనుసరించి జీవించడం శాంతిదాయకం. సర్వరుచులలో సత్యవాక్కు అమిత రుచికరం. ప్రజ్ఞతో కూడిన జీవితం ఉత్తమోత్తమం."-బుద్ధుడు


సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు     
Tuesday, November 10, 2015 2 comments By: visalakshi

జ్ఞానదీపతేజం

  శ్లో" సమో& హం సర్వభూతేషు న మే ద్వేష్యో& స్తి న ప్రియ:!
    యే భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహం!!(భగవద్గీత - 9.29)

  "నేను సర్వభూతముల యందు సమదృష్టి కలిగి ఉంటాను. నాకొకడు ఇష్టుడు కానీ,ఒకడయిష్టుడు కానీ లేడు. ఎవరు భక్తితో ఆరాధిస్తారో వారియందు నేను, నా యందు వారు నెలకొని ఉంటార"ని స్పష్టం చేస్తాడు భగవాన్ శ్రీకృష్ణుడు.


 మనం వెలిగించే దీపావళి దీపాలు బయట చీకటిని పారద్రోలుతున్నాయి కానీ హృదయంలో ఉన్న అజ్ఞానమనే అమావాస్యపు చీకటిని తొలగించలేకపోతున్నాయి. ప్రపంచంలో జీవులనుభవించే బాధలన్నింటికీ ఈ అజ్ఞానమే మూలకారణమై ఉన్నది. అజ్ఞానమనే ఈ గాడాంధకారం ఎన్నెన్నో జన్మలనుండి హృదయంలో ఘనీభవించి ఉన్నందునే, జన్మ పరంపరలు,సంసారపు యాతనలు కలుగుతున్నాయి. ప్రకాశవంతుడైన భగవంతుని ఉనికి కనుగొన్నాప్పుడు మాత్రమే ఈ అజ్ఞానపు చీకటి తొలగిపోతుంది. మన చిత్తంలో గల దోషాలను తొలగించుకొని హృదయాన్ని సత్త్వగుణమయం చేసుకొవాలి. మన హృదయమంతా అహంకారమనే నరకాసురుడు నిండి ఉంటే భగవద్దర్శనం లభించదు. ఈ అహంకారాన్ని నిర్మూలించుకునేవరకూ మనలోనే ఉన్న నరకుడు విజృంబిస్తూనే ఉంటాడు. 

  సర్వగం సచ్చిదానందం జ్ఞాన చక్షుర్నిరీక్ష్యతే!
  అజ్ఞాన చక్షుర్నే క్షేత భాస్వంతం భానుమందవత్!!

  'సర్వ వ్యాపకమై ఉన్న సచ్చిదానంద పరబ్రహ్మాన్ని జ్ఞాననేత్రం మాత్రమే చూడగలదు. ప్రకాశించే సూర్యుని అంధుడు చూడజాలనట్లు అజ్ఞాననేత్రం ఆ పరబ్రహ్మాన్ని దర్శించలేదు.'
  అందుచేత అహంకారమనే నరకుని నశింపజేసినపుడే, మనం ఆత్మానందమనే దీపావళిని జరుపుకున్న వాళ్ళమవుతాము.

  దీపావళినాడు భగవదారాధనం,లక్ష్మీ పూజ చేయాలని శాస్త్రవచనం. సంధ్యా సమయంలో దీపాలను వెలిగించి,అందు లక్ష్మిని ఆహ్వానించి,లక్ష్మీపూజ చేయడం పరిపాటి. 
    తామరపూవు సత్యానికి,పవిత్రతకు,సుందరత్వానికి ప్రతీక.అంతే కాక మన హృదయానికి కూడా ప్రతీకగా నిలుస్తుంది.మానవుని హృదయం తామరమొగ్గ వలె ఉండునని,ధ్యానం చేత అది వికసించునని అందు పరమాత్ముని యోగులు సర్వదా గాంచుదురని మహాత్ములు తెలిపి ఉన్నారు.తామరపుష్పానికి మరొక విశేష లక్షణం ఉంది; తామరపూవు ఉదయించే సూర్యుని రాకతో వికసించి,రాత్రికి ముడుచుకునిపోతుంది.
 మన హృదయం అనే తామర వికసించేందుకు జ్ఞానసూర్యుడు ఆవశ్యకమని కమలం మనకు ప్రభోదిస్తోంది.అందుచేతనే శ్రీమహాలక్ష్మి పంకజాసనియై,మానవుని పరిపూర్ణతకు గుర్తు తామరపుష్పం అని చేత సంకేతంగా ధరించి ఉన్నది.సమస్త ఐశ్వర్యాలకూ అధిష్టానదేవత అయిన ఆ శ్రీమహాలక్ష్మిని, దీపావళి సందర్భంగా మనలోని అజ్ఞానపు తిమిరాన్ని పారద్రోలి జ్ఞానదీప తేజాన్ని ప్రసాదించమని ప్రార్ధిస్తూ అర్చించాలి. 

 దీపావళి శుభాకాంక్షలతో.... సర్వే జనా సుఖినో భవంతు... 


సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు
Sunday, November 8, 2015 2 comments By: visalakshi

మనో సంస్కారాలు

  ఓం శ్రీ రామాంజనేయాయ నమో నమ:

 స్తోత్రం:-
               సదారామ రామేతి రామామృతం తే

               సదారామ మానంద నిష్యంద కందం

              పిబన్న స్వహం నన్వహం నైవ మృత్యో


              ర్బిభేమి ప్రసాదా దసాదాత్త వైవ !!



  భా:- నిరంతరమూ ఆనందరసమును స్రవింపచేయు 'రామ రామ రామ 'అనెడి నామ సుధారసమును నిత్యము పానము చేయుచున్న నేను మృత్యువునకు భయపడను.నీ అనుగ్రహము వలన నేను నిర్భయుడనైతిని..

1. ప్రతి మనిషి జీవితంలో శారీరక కర్మల ప్రభావం కన్నా, మానసిక కర్మల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.మనం ఏ పని చేసినా రెండు రకాల ఫలితాలు కలుగుతాయి.ఒక ఫలితం బాహ్యంగా కనిపిస్తుంది.రెండవ ఫలితం మన మనస్సుపై ప్రతిఫలిస్తుంది.మనస్సులో పడ్డ సత్కర్మల,దుష్కర్మల పని తాలూకు ముద్రలు కాలక్రమంలో సంస్కారాలుగా పరిణమిస్తాయి.

2. సమాజంలో ఇలాంటి సంస్కారాల ప్రభావం చేతనే ఒక్కో మనిషి ఒక్కో రీతిలో ప్రవర్తిస్తూ ఉంటాడు.కొందరు ప్రలోభాలకు లొంగిపోయి తప్పటడుగులు వేస్తారు.మరికొందరు ప్రాణాల వరకు వచ్చినా తాము నమ్ముకున్న సిద్ధాంతం నుంచి ఒక్క అడుగు కూడా పక్కకు వేయరు.మంచి సంస్కారాలతో మనస్సు ఎంత సుసంపన్నమైతే, జీవితం అంత అర్ధవంతమవుతుంది. 

3.ఆధునిక జీవనపు అలజడిలో యధాలాపంగా జీవించకుండా ఎప్పటికప్పుడు ఆత్మావలోకనం చేసుకుంటూ ఉండాలి.ఒక నియమానికి కట్టుబడి ఉండేలా మనసుకు శిక్షణ ఇవ్వాలి. విచక్షణ పాటించి, 'ఈ పని చేయడం అవసరమా? కాదా? అని ఆత్మావలోకనం చేసుకోవాలి.మంచి ఏదో, చెడు ఏదో వివేకంతో తెలుసుకొని మసలుకోవాలి.ముఖ్యంగా యౌవనప్రాయంలో తాత్కాలిక సరదాలకు లోనయితే ఆ అలవాట్లే సంస్కారాలుగా మారి భవిష్యత్తులో వ్యక్తిగతంగా తమనే నాశనం చేస్తాయని తెలుసుకోవాలి. మనల్ని అందలం ఎక్కించినా, అధోగతి పాల్జేసినా ఆ మనో సంస్కారాలేనని గుర్తుంచుకోవాలి.  

  సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు. 
Monday, November 2, 2015 0 comments By: visalakshi

ఉభయకుశలోపరి

ఉభయకుశలోపరి అని నిన్న ఈనాడు ఎడిటొరియల్ లో నాకు నచ్చిన కొన్ని అంశాలు.


 'సర్వే భవంతు సుఖిన:/సర్వేసంతు నిరామయా- అందరూ సుఖంగా, నిశ్చింతగా ఉండాలి. ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి. మంగళవచనాలు వీనులకు మంగళకార్యాలు అక్షులకు విందులు చేయాలి. ఏ ఒక్కరూ దు:భాజితులు కారాదు అని కోరుకొనే 'మంగళాచరణం' తెలుగునాట ప్రతి గుడి ముంగిట సమయ సందర్భం వచ్చినప్పుడల్లా గుడిగంటలతో కలిసి ప్రతిధ్వనించడం అనాదిగా వస్తున్న సదాచారం.  

 "వాక్కును మితంగా,పరహితంగా వాడితే అదే మంత్రమవుతుంది." అంటారు శ్రీశంకరులు. 

 అభయహస్తం ఆశించి వచ్చినవాడు పరమశత్రువైనా సరే ఉభయకుశలోపరి విచారించకుండా తిప్పి పంపడం భారతీయులకు బొత్తిగా సరిపడని సంస్కృతి.

స్వసంస్కృతీనిష్టులై,స్వదేశానురాగులయీ.... పరసంస్కృతుల పట్ల సంసర్గం, పరాయిదేశాల పట్ల గౌరవాలు పుష్కలంగా ప్రదర్శించే సామరస్య ధోరణి తెలుగుజాతి అనాదినుంచి హుందాగా ప్రదర్శిస్తూ వస్తున్న జీవనశైలి.  

 "ఆత్మాభిమానం, స్వాతంత్ర్య ప్రియత్వం... ఒక ఆకు ఎక్కువ కావడం వల్లనేమో...విశాలదృక్పధం ఉండీ మనసు అడుగుపొరలకిందే పడి ఉంది".అన్నారు కోట సచ్చిదానందమూర్తి.

  "నీ అడుగులకో తుదిగమ్యం అందాలంటే /ఎడతెగని యెదురు దెబ్బలు గమనించు మిత్రమా! గుండెను ఒక అద్దంలా తుడిచి చూసుకో నేస్తమా!" అని అంటారు సినారె!

 ప్రతి వ్యక్తిలోనూ పెత్తనం ప్రదర్శించే పెద్దాయన, కార్యశీలత కనబరచే పెద్దమనిషి, గారాబంగా ప్రవర్తించే పసిబిడ్డ ఉంటారు. ఇది ఎరిన్ బెర్న్ 
సిద్ధాంతం.

   'సమయానికి తగు మాటలాడు ' చాతుర్యం ప్రదర్శిస్తే చాలు ' విద్వేషం వింధ్యపర్వతంలా అడ్డంగా నిలబడ్డా... నట్టింట్లో ఆనందం వెల్లువలై పొంగులెత్తుతుంది.- అన్నది బెర్న్ మార్కు.

"మైత్రి సంపాదనకైనా, కొనసాగింపుకైనా మాటపట్టింపేగదా ప్రధాన అవరోధం! అందుకే 'ఓహో ...నువ్వా! ఎక్కడ ఎప్పుడు ఏం చేస్తున్నావు ఏలాగ/ఏ నక్షత్రం కింద సంచారం చేస్తున్నవు ' అంటూ కవి అజంతా సరళిలో కుశల ప్రశ్నల శరపరంపర మనోచాపం నుంచి వరుస పెట్టి సంధిస్తే ...కోపతాపాలు,భేదభావాలు పక్కనపెట్టి ఎవరైనా కూరిమితో ఆత్మీయాలింగనం కోసం చేరువ కావడం ఖాయం."   

 "తామెల్లరూ భద్రంగా ఉంటూనే చుట్టుపక్కలవారందరూ క్షేమంగా జీవించాలని మనసా వాచా కాంక్షించే గొప్ప సంకల్పం ' యోగక్షేమం వహామ్యహం ' కల్పన చేసింది."

 "వ్యక్తిలోని మూర్తిమంతమైన సంస్కృతే పరిణత మానవత్వంగా పరిమళించేది."అన్నారు రమణ మహర్షి.

 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు