Wednesday, December 4, 2013 0 comments By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామయి షిర్డీసాయి సేవా సత్సంగం-60


ఓం శ్రీ దీనబాంధవే నమో నమ:



శ్లో" శర్వరీ దీపక శ్చంద్ర: ప్రభాతో దీపకో రవి:!

  త్రైలోక్య దీపకో ధర్మ: సుపుత్ర: కుల దీపక: !!

భా:  రాత్రికి వెలుగు చంద్రుడు. పగటికి వెలుగు సూర్యుడు. ముల్లోకాలకు వెలుగు ధర్మం. వంశానికి వెలుగు సుపుత్రుడు.

 "ప్రతి పౌరుడు ఈ లోకానికి ధర్మమనే వెలుగు నివ్వాలని, సామాజిక స్పృహతో వ్యవహరించాలనీ అవినీతిని నిర్మూలించాలని" ...భారతరత్న అబ్దుల్ కలాం  ఒక ఉన్నత పాఠశాల విద్యార్ధుల    సమావేశంలో విద్యార్ధులచే ప్రతిజ్ణ చేయించారు. 

 పట్టిందల్లా బంగారమవుతున్న ప్రతీ వ్యక్తిలోనూ ఎక్కడో సంకల్ప ఐక్యత, గంభీర శ్రద్ధ, విశ్వాసం ఉండి తీరాలి. ఇవే అతడి అద్భుత విజయానికి హేతువులు. మనిషి తాను అనుకొన్న నిర్దారిత పని కోసం మనస్సులో చేసే గాఢమైన ఆలోచననే సంకల్పం అంటారు. ఆ ఆలోచనను కార్యరూపంలో పెట్టడానికి  వ్యక్తి ఎంత తీవ్రంగా ఆలోచిస్తే అంత సంకల్పశక్తి వృద్ధి చెంది తనపై తనకు విశ్వాశాన్ని కలిగిస్తుంది. శ్రద్ధను పెంచుతుంది.ఒక ఆదర్శాన్ని, ఆశయాన్ని స్వీకరించండి. దాన్ని మీ జీవిత ధ్యేయంగా చేసుకోండి. సంకల్పశక్తితో ఆశయాలను ఆచరణలోకి తీసుకువచ్చి నవభారత నిర్మాణానికి నడుం బిగించాలి.-- స్వామి వివేకానంద.

  మాఇంట జరిగిన బాబాగారి అద్భుత లీలలు తదుపరిభాగం:

మేము చూసి వచ్చిన స్థలముపై మరల వారితో సంప్రదించగా, కూరల వ్యాపరస్తురాలు ఇలా చెప్పింది,  'మా  ఊరువారు,నా కొడుకులు వారు నిన్ను మాయ చేస్తున్నారు, స్థలము కై  మంత్రాలు చేస్తున్నారు అంటున్నారు సార్! అని తెలిపింది. సరే పోనీ స్థలము అమ్ముతావా! కొని  గుడి కడతాము అని మావారు చెప్పగా  నా కొడుకులు  అమ్మనివ్వరు సార్! అని చెప్పింది. మేమందరం చాలా నిరుత్సాహంగా ఉండగా బాబాగారి వద్దనుండి ఇలా సమాధానం వచ్చింది. " పది జన్మలైనా ఆమె వద్దనుండి ఆ స్థలము తీసుకుంటాను" అని అన్నారు. అపుడు మాకు అర్ధం అయింది. ఆ నర్సమ్మ  "ఈ స్థలములో బాబాను కూర్చుండబెట్టాలి అని ఎప్పుడైతే అందో అప్పుడే నిర్ణయంచేసారు  బాబా. అందుకే పది జన్మలైనా అది ఆమె నుండి తీసుకుంటాను అని తెలిపారు. తదుపరి ఆ ఊరిలో గల మాణిక్ ప్రభు గుడి పూజారికి మా వారు లేఖ వ్రాసి, అచట వెలిసిన స్వామి ప్రతిమను, మరియు గణపతి ప్రతిమను మాకు పంపమని ఒక వ్యక్తిని పంపగా వారు గణపతి ప్రతిమను పంపి బాబా ప్రతిమ అదృశ్యమైనది  అని తెలిపారు. మేము  ఆందోళన పడుతున్న సమయాన బాబాగారు మీరు కట్టే గుడిలో ప్రత్యక్షమవుతాను అచటికి ఆ ప్రతిమ వచ్చును అన్నారు. మొదటి స్థల ఘట్ఠం ఆవిధంగా ముగిసింది .

 మా వారి రెండవ ప్రయత్నం తదుపరి  టపాలో...

"ప్రకృతిలోని భోగాలన్నింటినీ అనుభవించాలని తాపత్రయపడుతూ ఉంటాం. కానీ ఆ ప్రకృతే మన సర్వస్వాన్నీ సంగ్రహంచి, శక్తిని సంపూర్ణంగా హరించి పక్కన పారేస్తుందని చివరికి తెలుస్తుంది."- స్వామి వివేకానంద.

 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.