Friday, January 22, 2016 0 comments By: visalakshi

మనోవికారాలకు అతీత స్థితి

  శ్రీరామ భద్రాయ నమో నమ:









 మనసులో ఇష్టాయిష్టాలు ఎందుకు కలుగుతాయి? అని శ్రీరాముడు...వసిష్ఠ మహర్షిని ప్రశ్నిం పగా వారు ఇలా వివరించారు.

 ఏ మనస్సైతే పూర్ణమైన ఆత్మ స్వరూప సాక్షాత్కారాన్ని పొందదో, అప్పుడది "ఇదినాకు ఇష్టం. ఇది నాకు కష్టం" అనే కల్పనలన్నీ చేసుకుంటోంది. అయితే, తత్వజ్ఞుల మనస్సు ఇలాగ చపలంగా ఉండదు. మనస్సు అనేది చేతనశక్తి నుండే స్ఫురిస్తోంది.కాబట్టి ఈ వాయు, ప్రకాశ, ద్రవత్వాలూ "మనస్సే",కఠినతనీ, శూన్యతనీ పొందుతున్నదీ అదే. చైతన్యం అనిర్వచనీయమైన తన ఇచ్చాశక్తిచేతనే ఇలా మనస్సు యొక్క రూపాన్ని స్వీకరిస్తోంది. అలాంటి మనోరూపంతో భావనామాత్రంగా దేశకాలాదుల అనుభవం తనలోని అంగీకారబుద్ధి వలన పొందుతోంది. 

 మనస్సు ఎక్కడ సంలగ్నమైతే అక్కడే ఆ భావనకు సంబంధించిన అనుభవాన్ని పొందుతుంది.ఒకడి మనస్సు ఎక్కడో లగ్నమై ఉన్నప్పుడు, అతడు తాను తింటున్న పదార్ధపు రుచిని గుర్తించడుకదా! ఎదురుగా ఉన్న వస్తువుపై దృష్టి ఉన్నా కూడా, మనస్సు లగ్నం కాకపోతే ఆ వస్తువుని మనం చూడలేం.

 ఓ రామా! అజ్ఞానానికి ఈ చిత్తం - శరీరం వేరువేరుగా కనిపిస్తాయి. ఈ మనస్సే "నేనిలా అవుతాను" అని భావించి, అటువంటి భావనకు అనుకూలమైన ఆయా ఉపాధులను నిరంతరం పొందుతోంది.ఈ మనస్సుతో ఉపాధులకావల నిశ్చలంగా ఉన్న ఆత్మను గ్రహించేవారు ఉపాధి భావనను అధిగమించి, ఆత్మభావనను స్వీకరించగలుగుతున్నారు.అఖండమైన ఆత్మను ఎరిగినవారు అఖండభావననే పొందుతున్నారు. మహాత్ములు సర్వం గ్రహించడం వలన మనోరహితులై ఉంటున్నారు. జ్ఞానులు అభ్యాసబలం చేతనే దు:ఖాలను సుఖాలుగా, స్త్రీ-ధన-వస్తుప్రాప్తులను తుచ్చమైనవిగా చూడగలుగుతున్నారు.

  ఒకరి మనస్సు ఎక్కడో సంలగ్నమై ఉంటే ...నీవు అతనికి ఒక కధ ఎంత వివరంగా చెప్పినా అది గ్రహిస్తాడా? లేదు కదా! స్వప్నంలో మనసు అనేకవ్యక్తులను,సంఘటనలను పొందుతోంది. స్వప్నంలోని ఆయా పదార్ధాలన్నీ ఆ స్వప్న సమయంలో వాస్తవంలాగే తోస్తాయి. అవన్నీ ఎక్కడినుండి వచ్చాయి? ఆత్మ తన స్వస్వరూపం నుండి చ్యుతి చెంది, క్షుభితమైనప్పుడు తన హృదయంలోనే ఆ స్వప్న వ్యవహారాన్ని అలాగ దర్శిస్తోంది.

 సముద్రజలం నుండి తరంగాలు ఉత్పన్నమవుతున్నాయి. అలాగే ఈ దేహంలో అంతర్గతంగా ఉన్న మనసు నుండే ఆకార వికారాలు ఏర్పడుతున్నాయి.

ఆత్మతత్వాన్ని ఎవరైతే తెలుసుకుంటారో వారు మనోవికారాలకు అతీతులవుతారు. 

సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు
Thursday, January 21, 2016 0 comments By: visalakshi

అవధూతోపాఖ్యానము - 2

 ఓం శ్రీ గురుదేవ దత్త నమో నమ:


మొదటి గురువు భూమి:- పూర్వకర్మననుసరించి జీవులకు ఈశ్వరుడే ఆయా దేహాలు ప్రసాదించి, వాటి జీవనానికవసరమైనరీతిగా ప్రవర్తింపజేస్తాడు.  అటువంటి పశుపక్ష్యాదులెన్నో భూమిపై నివసిస్తున్నాయి.
మానవులు భూమిని  దున్నుతారు. బావులు,చెరువులు కోనేళ్ళకోసం భూమిని త్రవ్వుతారు.అయినప్పటికీ భూమి ఓర్పు వహించి, జీవులకు సస్యాలు, ఆశ్రయమూ యిచ్చి పోషిస్తుంది. ఇన్ని జీవులనుండి తనకెంత బాధ కల్గినా చలించక, తన ధర్మాన్ని తాను అనుసరిస్తుంది. అలానే పూర్వకర్మవలన ప్రేరేపింపబడిన సకల భూతాలవలనా పీడింపబడినప్పటికీ ముముక్షువు,ప్రేమ-ఓరిమిలతో సహించి ధర్మమార్గము నుండి చలించకుండా ధైర్యం వహించి వుండాలని భూమినుండి నేర్చుకున్నాను.

 రెండవ గురువు వాయువు:- వివిధ వస్తువుల శీత-ఉష్ణ, శుచి-అశుచి, సుగంధ-దుర్గంధాలతో సంబంధము లేకనే వాయువు అనాసక్తుడై వాటిమధ్య సంచరిస్తాడు. తాత్కాలికంగా వాటిచేత ప్రభావితుడైనట్లు కనిపించినా మరుక్షణమే తన సహజ నైర్మల్యంతో ఎల్లెడలా సంచరిస్తాడు. ముముక్షువుగూడ యింద్రియ విషయాలనుభవమవుతున్నా సుఖ దు:ఖాది ద్వంద్వాలలో తగుల్కొనక హృదయము-వాక్కులకు అనుక్షణమూ సంభవించే విక్షేపాలను తొలగించు కోవడమే జీవితలక్ష్యమని తలచి, ప్రాణరక్షణ కవసరమైన ఆహారం మాత్రం చేతనే యోగి తృప్తి చెందాలి. 

 మూడవ గురువు ఆకాశము:- అప్పుడప్పుడు ఆకాశము, మేఘాలు, ధూళి, సంధ్యారాగాల చేత ప్రభావితమైనట్లు కంపించినా, అది సహజంగా దేనికీ అంటనిది.ముని గూడా కాల గతిలో సృష్టించబడిన త్రిగుణాల వికారరూపమైన దేహానికీ,దానివలన కలిగిన మనోవికారాలకూ అంటని వాడై, ఆకాశంలా స్వచ్చుడై ఉండాలని తెలుసుకున్నాను. అంతేగాక, ఆత్మ ఆకాశంవలె సర్వవ్యాపి. దానియందు గోచరించే వివిధ రూపాలచేత అది అవిభేద్యము, అసంగము, శుద్ధమూ అని గ్రహించాను. అట్టి ఆత్మయే బ్రహ్మంగదా! 

నాలుగవ గురువు అగ్ని:- అగ్నిదేవుడు ఒకప్పుడు విశేషాగ్నిగా ప్రజ్వలిస్తాడు. ఒకప్పుడు నివురుగప్పి మందంగా వెలుగుతాడు. మరొకప్పుడు రాపిడివల్లనే ప్రకటమయ్యే అగ్నితత్వంగా వస్తువులలో సూక్ష్మంగా దాగియుంటాడు. అట్టి సామాన్యాగ్ని,మధనంచేత విశేషాగ్నిగా ప్రకటమై, యజ్ఞం చేసేవారి పూర్వపాపాలను హరించి, రానున్న కర్మదోషాలను నివారించడం కోసము ఎవరినుండైనా సరే హవిస్సును గ్రహిస్తాడు. కాని తాను మాత్రం వారి పాపాల చేత అపవిత్రుడుగాకనే, వారి పాపాన్ని దహిస్తాడు. అలానే మునిగూడా తన    తపశ్శక్తిని  గుప్తంగా వుంచుకుంటూ, జనాన్ని పావన మొనర్చడానికై సర్వులనుండీ భిక్షనుగొని వారిననుగ్రహిస్తాడు. తాను మాత్రం అగ్నివలె యెట్టి భిక్షవల్లనైనా అపవిత్రుడు గాడు. అంతేగాక, అగ్నికి సహజంగా రూపం లేకపోయినప్పటికీ, కట్టెను చేరినపుడు ఆ రూపంలో భాసిస్తుంది. అలాగే ఆత్మగూడా,వివిధ దేహాలయందు తాదాత్మ్యం చెంది, ఆయా రూపాలలో గోచరిస్తుంది.జీవులన్నీ సకాలంలో జన్మించి మరలా సకాలంలో మరణిస్తున్నా, వాటి ఆద్యంతాలు అట్టి ఉత్పత్తిలయాల వలె గుప్తమైనవి. మధ్యదశలో మాత్రమే జీవులు గోచరిస్తాయి. కాని వాటి సృష్టిస్థితిలయాలకు ఆధారమైన ఆత్మ శాశ్వతము, వికారరహితము, అవ్యక్తము,సర్వగతమున్నూ అలానే సామాన్యాగ్నిగూడ. కనుక అగ్నియొక్క తత్వాన్ని గూర్చి విచారించి, నేనూ అట్టి తత్వజ్ఞానాన్ని పొందాను. అగ్ని వివిధ వస్తువుల గుణభేదాలను దహించి ఏకరూపమైన విభూతిగా మారుస్తుంది. అలానే ఈ తత్వజ్ఞానమనే అగ్ని వివిధములైన వస్తువులనూ,గుణాలనూ నిరసించి, సర్వగతమైన విశ్వవిభుని తత్వాన్ని గ్రహించి తనలో తానే అణగియుంటుంది. 

 తదుపరి టపాలో మరి కొందరి గురువులను గూర్చి వివరణ....


సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు
Tuesday, January 12, 2016 0 comments By: visalakshi

అవధూతోపాఖ్యానము -1

 ఓం శ్రీ గురుదేవ దత్త నమో నమ:


 మొదట పరబ్రహ్మమొక్కడే ఉంటాడు. 'నేననేక మౌదునుగాక! అని ఆయన సంకల్పించి త్రిగుణాలనాశ్రయించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా ఆవిర్భవించి సృష్టి స్థితిలయాలు చేస్తాడు. ఈ త్రిమూర్తుల ఐక్యతే పరబ్రహ్మతో చేరి గురుతత్వమయింది. కనుక ఈ విశ్వమే గురురూపమని 'గురుగీత ' చెబుతుంది. 

 విశ్వమంతా తమరూపమేనని భక్తులకు ప్రత్యక్షానుభవాన్ని ప్రసాదించగలవారే నిజమయిన తత్వద్రష్టలు,సద్గురువులు. విశ్వమంతా వ్యాపించిన సద్గురు తత్వాన్ని ఎలా గుర్తించవచ్చో సిద్ధుడు నామధారకుడికి అవధూతోపాఖ్యానంతో ఉదహరించాడు.శ్రీ షిర్డీ సాయిబాబా వంటి సద్గురువు ఈ నాటికీ తన భక్తులకట్టి అనుభవాలు ప్రసాదిస్తున్నారు.

  గురు తత్వాన్ని సిద్ధుడు ఇలా ఒక పురాణోపాఖ్యానంతో వివరించాడు:-

" యయాతి పుత్రుడైన యదుమహారాజు ఒకనాడు వేటకు వెళ్ళి ఆ నిర్జనారణ్యంలో కటిక నేలపై పడుకొని ఉన్న ఒక సర్వసంగపరిత్యాగి, సమర్ధుడూ అయిన ఒక అవధూతను చూచి, ఆశ్చర్యపడి ఇలా అడిగాడు: 'స్వామీ! ఆయుష్యము, సంపద, కీర్తి వీటిని కోరి మానవుడు ధర్మార్ధకామాలనే పురుషార్ధాలయందు ఆసక్తుడవుతాడు. మీరు మాత్రము ఆసక్తులు గాలేదు.మీరు శక్తిమంతులు,జ్ఞానులు అనే సంగతి తెలుస్తున్నది. మీరీ నిర్జనారణ్యంలో ఏ కోరికలు లేకుండానే పరమానందంగా ఎలా సంచరించగలుగుతున్నారు?' అపుడా అవధూత లోకశ్రేయస్సుకై ఇలా బోధించాడు: 'నేను 24 మంది గురువుల నుండి జ్ఞానాన్ని గ్రహించి, అనుష్ఠించి, ఆత్మజ్ఞానం పొందాను. దానివల్లనే నిర్హేతుకమూ, శాశ్వతమూ అయిన ఆనందం లభిస్తుంది."నా గురువులెవ్వరో, వారినుండి నేను నేర్చినదేమో యోగ్యుడవైన నీకు వివరిస్తాను.  

నా మొదటి గురువు 'భూమి '..రెండవ గురువు 'వాయువు '..మూడవ గురువు 'ఆకాశము '..నాలుగవ గురువు 'అగ్ని '..ఐదవ గురువు 'సూర్యుడు '..ఆరవ గురువు 'పావురము '..ఏడవ గురువు 'కొండచిలువ '.. ఎనిమిదవ గురువు 'సముద్రము '.. తొమ్మిదవ గురువు 'మిడుత '..పదవ గురువు 'ఏనుగు '..పదకొండవ గురువు 'చీమ '.. పన్నెండవ గురువు 'చేప '..పదమూడవ గురువు 'పింగళ అనే వేశ్య '.. పదునాలుగవ గురువు 'శరకారుడు '..15వ గురువు ' బాలుడు '..16వ గురువు 'చంద్రుడు '..17 వ గురువు 'తేనెటీగ '.. 18 వ గురువు 'లేడి '..19 వ గురువు 'గ్రద్ద '..20 వ గురువు 'ఒక కన్య '.. 21 వ గురువు 'సర్పము '.. 22 వ గురువు 'సాలెపురుగు '.. 23 వ గురువు 'భ్రమరకీటము '..24 వ గురువు 'జలము '.....వీరినుండి అవధూత నేర్చిన జ్ఞానం .......తదుపరి టపాలో....


  సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు

Monday, January 11, 2016 0 comments By: visalakshi

భోగత్యాగం - బ్రహ్మానందం

  ఓం శ్రీ బ్రహ్మానంద స్వరూపాయ నమ:

శ్లో" నైనం చిందంతి శస్త్రాణి  నైనం దహతి పావక:!
   న చైనం క్లేదయంత్యాప: న శోషయతి మారుత:!!
   అచ్చేధ్యో2 యమదాహ్యో2 యం అక్లేద్యో2 శోష్య ఏవచ!
  నిత్యస్సర్వగత: స్థాణు: అచలో2 యం సనాతన:!! (2-23,24)


 భా:-   "ఈ ఆత్మను శస్త్రాలు చేదింపజాలవు. అగ్ని దహింపజాలదు. నీరు తడుపజాలదు. వాయువు ఆర్పివేయజాలదు. ఈ ఆత్మ నిత్యము, సర్వవ్యాపి, చలింపనిది, స్థాణువు,స్థిరమైనది, సనాతనం, శాశ్వతమైనది." 

 ఒక చోట చేపలు పట్టువారు చేపలు పడుతున్నారు. దూరంగా ఎక్కడి నుంచో ఓ గద్ద వచ్చి ఓ చేపను నోట కరచుకొని వెళ్ళిపోయింది. అలా చేపను పట్టుకొని వెళ్ళిపోతున్న గద్దను కాకుల గుంపు చూసింది. వెంటనే వందలాది కాకులు ఆ చేపకోసం దానిని తరమసాగాయి.గద్ద వాటిని తప్పించుకుంటూ నాలుగు దిశలకూ వెళితే అవి కూడా వెంబడించడం మానలేదు. వాటిని తప్పించుకొనే ప్రయత్నంలో గరుడపక్షి నోటినుంచి చేపను జారవిడుచుకుంది. అంతే! ఒక్కసారిగా కాకులన్నీ చేప పడ్డ చోటుకేసి దూసుకుపోయాయి; గద్దను వదిలేసాయి. అప్పుడు ఆ పక్షి నిశ్చింతగా ఓ చెట్టుపై కూర్చొని తనలో తాను ' ఈ చేపే కదా, ఇంత గందరగోళానికి కారణం.ఇప్పుడు ఆ చేపా నా చెంత లేదు; చింతా నా చెంత లేదు ' అనుకుంది. 









 మనిషి జీవితమూ అంతే! భోగాలనే చేపను పట్టుకున్నంత కాలం, కష్టాలనే కాకులు, కర్మలనే కాకులు వెంబడిస్తూనే ఉంటాయి. వాటి వల్ల చింత, విచారం, అశాంతి కూడా వెన్నంటే వస్తాయి. 

  సురమందిర తరుమూల నివాస:, శయ్యా భూతల మజినం వాస:
 సర్వపరిగ్రహ భోగత్యాగ:, కస్య సుఖం న కరోతి విరాగ:....    అంటున్నారు 'భజగోవిందం' పరంపరలో శంకర భగవత్పాదుల శిష్యప్రముఖులు నిత్యానందులు.దేవాలయాల్లో ఏదో చెట్టు కింద నివసిస్తూ, నేలమీద పడుకుంటూ, లేడి చర్మాన్నే ధరిస్తూ, అన్నీ వదలిపెట్టి, భోగాలను కోరని విరాగికి ఇక సుఖం ఎందుకు లభించదని ప్రశ్నిస్తున్నారు. ఈ రోజు మనిషి జీవితం అతి దుర్భరంగా మారడానికి ప్రధాన కారణం భోగలాలసే! 

  ఒకసారి భగవాన్ రమణ మహర్షుల వారు భౌతికంగా జీవించి ఉన్నకాలంలో ఆశ్రమంలో ఒక ఉత్సవం జరిగింది. భోజనవేళ కాగానే నిర్వాహకులు 'ప్రముఖులందరికీ ముందుగా వడ్డన జరుగుతుంది. బైరాగులు, బికారులు బయట కూర్చోండి; తరువాత పంక్తిలో పిలుస్తాం' అంటూ రమణుల కోసం వెతికారు. కానీ మహర్షి ఎక్కడా కనిపించలేదు.; బయట ఎక్కడో బైరాగుల మధ్య కూర్చున్నారు. 'ఇదేంటి మహాత్మా! మీ కోసం న్యాయమూర్తులు, పురప్రముఖులు వేచి చూస్తున్నారు ' అన్నారు నిర్వాహకులు. 'బైరాగులు, బికారులు తరువాత పంక్తిలో అన్నారుగా! అందుకే తరువాత పిలుస్తారనుకొని బయటకు వచ్చాను ' అన్నారు భగవాన్ రమణులు. భోగాలను త్యజించి,కౌపీనం ధరించినంత మాత్రాన వారి విలువ ఏమైనా తరిగిపోయిందా!అందుకే ఎందులో వెళుతున్నామా? అన్నది కాదు ప్రధానం; అంతరంగంలో ఎంత అకళంకంగా, ఆనందంగా ఉన్నామన్నదే ప్రమాణం.  

 శ్రీమద్భాగవతంలో అజగర మౌని ప్రహ్లాదుడితో తన ఆనంద రహస్యం చెబుతూ...
లేదని ఎవ్వరి నడుగను, రాదని చింతింప పరులు రప్పించినచో
కాదనియెద్దియ మానను, ఖేదము మోదమును లేక క్రీడింతు మదిన్.....  అంటాడు.

 " లేదని నేను ఎవరినీ యాచించను ; లభించలేదని చింతించను. పరులు ఏదైనా పంపితే దానిని కాదనను. ఏదీ మానను; ఏదీ కోరను.ద్వేషం లేదు, ప్రేమా లేదు; సుఖం లేదు, దు:ఖమూ లేదు. ఈ విధంగా జీవితాన్ని లీలా వినోదంగా గడుపుతున్నా"నని చెబుతాడు.లౌకికులైన వారు సుఖాలకూ, సౌకర్యాలకూ అలవాటు పడకుండా ఇలా వాటితో అంటీముట్టనట్టుగా వ్యవహరించాలి. ఆవగింజంత నిరాశ కూడా ఎదురు కాకూడదంటే అసలు భోగాలకే దూరంగా ఉండాలి.

 భోగవాసన అంత సులువుగా మనస్సు నుంచి విడివడదు. భోగాలతో కాలం గడుపుతున్నంత కాలం భగవంతుడు మన వైపు చూడడు. బ్రహ్మజ్ఞానాన్ని,బ్రహ్మానందాన్నీ ఇవ్వజాలడు. వైరాగ్యం ఒక్కటే నిర్భయత్వాన్ని ప్రసాదిస్తుంది.ఎవరికైతే ప్రియాప్రియములు లేవో వారే బంధనాలు లేనివారై, భగవంతునికి దగ్గరవుతారు. 

 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు    
Thursday, January 7, 2016 0 comments By: visalakshi

శ్రీ గురుని సాన్నిధ్యము..(గాణుగాపూర్)

 ఓం శ్రీ దత్తాత్రేయ స్వామియే నమో నమ:




 గాణుగాపూర్ క్షేత్ర మహత్యము:........











 భీమ,అమరజా నదుల సంగమం జరిగిన ప్రదెశము. దీనినే "సంగం" అంటారు. ఈ పుణ్య ప్రదేశంలో స్నానమాచరించి  శ్రీ నృసిం హ సరస్వతి స్వామిని దర్శించుకోవాలి. కర్ణాటక యందు  గుల్బర్గా జిల్లాలో సంగమ స్థానమందున్న దివ్య దత్త జాగృతీ స్థానము. ఇచట స్వామి 20 సం"లు తపస్సు చేసి ఎందరో భక్తులను అనుగ్రహించారు. 





 శ్రీ గురువు తృతీయావతారమందు శ్రీ నృసిం హ సరస్వతిగా ప్రసిద్ధి చెంది, ఎందరో దీనులను ఉద్ధరించిరి. భక్తులకు అనేక లీలలు చూపించారు....చూపిస్తున్నారు. అవతారమునకు ధ్యేయమైన జ్ఞానప్రబోధము చేసి ఉన్నారు. కృష్ణానదీతీరమందు సాంగ్లీజిల్లాలో ఔదుంబర క్షేత్రమున,భీమ అమరజాసంగమ స్థానమందున్న 'గాణుగాపురము ' లేక గంధర్వనగరమందును వీరు మనోహర పాదుకలను స్థాపించిరి.శ్రీ నృసిం హ సరస్వతులు నేటికిని తమ భక్తులకు దర్శనమిచ్చుచునే ఉన్నారు.

  పల్లకీ సేవ:- స్వామి వారికి ప్రతిరోజూ రాత్రి సమయమందు పల్లకీ సేవ జరుగును. అందు విశేషంగా భక్తులు పాల్గొందురు. మా అనుభవం..... పల్లకీ సేవ ఎలా ఉంటుందా! అన్న ఉత్సాహముతో మేము ఆరోజు ముందుగా క్షేత్రమును చేరుకొని స్వామిని దర్శించుకొని ఆలయ ప్రాంగణములో కూర్చున్నాము. స్వామిని ఊరేగింపుగా మూడుసార్లు ఆలయము చుట్టూ పల్లకీ సేవను మంగళవాద్యాలతో భక్తి కీర్తనలతో చేస్తారు. భక్తులంతా పడుకొని ఉండగా వారిని దాటుకుంటూ వారి మీదనుండి స్వామిని ఊరేగిస్తారు. దానికై ఎంతో అతృతతో ఎదురు చూసిన మాకు మూడవసారి ఆ అవకాశం లభించింది. మా మీదుగా స్వామి పల్లకిపై వెళుతుంటే ..ఆ అనుభూతితో మేము మైమరచాము భక్తిప్రపత్తులతో స్వామికి వందనాలు అర్పించాము. 

 భిక్ష:- ఈ ప్రసిద్ధ క్షేత్రంలో మధ్యాహ్నము భక్తులు ఒక ఐదుగురి వద్ద బిక్ష తీసుకొని,  తాను మరల ఐదుగురికి బిక్ష సమర్పించాలి.ప్రతిరోజు శ్రీగురుడు ఏదో ఒక రూపంలో వచ్చి భిక్ష తీసుకుంటారుట. అది నాకు అర్ధం కాక ఏమి జరుగుతుందా అని ఎదురు చూస్తున్నాను. అపుడు మావారు ఎక్కిరాల భరద్వాజ గారి గురించి ఇలా చెప్పారు.....వారు గాణుగాపూర్ సందర్శానానికి వచ్చి బిక్షకు ఏ రూపంలో వస్తాడో చూస్తాను. అన్నారుట.ఆయన సంగం లో స్నానమాచరించి వచ్చునంతలో వారికి విపరీతమైన జ్వరం వచ్చి అక్కడ గట్టు మీద పడుకున్నారుట. మెళుకవ వచ్చేసరికి మధ్యాహ్న సమయము మించిపోయిందట.వారు భిక్షకు వచ్చి జోలె ముందుకు చాచగా వారు ఇందాకే కదా వచ్చి భిక్ష తీసుకున్నావు..మరల వచ్చావేమి అని అడుగగా భరద్వాజ గారు 'స్వామీ నా రూపంలో వచ్చావా అని తన్మయులయ్యారట. మేము ప్రసాదము చేయించి మేము వరుసలో భిక్ష వేయుటకు సిద్ధముగా ఉన్నాము. మేము నలుగురం ఉన్నాము . మావారు ఐదుగురికి వేసి వారు భిక్షకై వెళ్ళారు. నేను కూడా ఐదుగురికి వేసి భిక్షకై వెళ్ళాను . నేను ఐదుగురి వద్ద తీసుకొని వచ్చి చూస్తే ప్రసాదము ఇంకా చాలా ఉండడముతో నేను భిక్ష వేస్తాను అన్నాను. సరే అని వేస్తుండగా అందరూ నాకు శ్రీగురుని వలే చిరునవ్వుతో, అడిగి,అడిగి వేయించుకుంటుంటే ఒక తెలియని తన్మయమునకు లోనయ్యాను. ప్రసాదము చివరి వరకు అక్షయ పాత్రలా అందరికీ భిక్ష వచ్చింది. మేము కూడా ఆ ప్రసాదమును స్వీకరించి ధన్యులైనాము.  

ఈ క్షేత్రమునకు ఎక్కువగా వికలాంగులు,మానసిక రోగ పీడితులు, పిచ్చివారు వస్తుంటారు. వారు వచ్చి ఒకసారి సందర్శిస్తే స్వామి సాన్నిధ్యంలో రుగ్మతలు తగ్గి  వారికి ఆరోగ్యం చేకూరుతుందని భక్తుల నమ్మకము. దీనికి అనేకములైన నిదర్శనాలు ఉన్నాయని లోకోక్తి.  

 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు