Friday, November 1, 2019 0 comments By: visalakshi

శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి, స్వామి సమర్ధుల అద్భుత లీల..

             శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి ,
           స్వామి సమర్థుల అద్భుత లీల




బహుశా ఇది మల్లాది గోవింద దీక్షితులుగారి ముత్తాత తరంలోఅంటే సుమారు 1910 -15 సంవత్సరాల మధ్య జరిగిన సంఘటనఅని చెప్పారు. అప్పుడు మల్లాదివారి కుటుంబీకులు పిఠాపురంలో ఉంటుండేవారు.ఒక సారి గుంటూరు నుంచి ఒక వైశ్య వర్తకుడు పిఠాపురం వచ్చాడు. అతనికి అక్కడ కొంతమంది స్నేహితులు కూడా ఉన్నారు. అక్కడ భూములు కొనుక్కుని అక్కడే వ్యవసాయం చేస్తూ స్థిర పడి పోవాలి అనే ఉద్దేశ్యంతో ఆయన వచ్చాడు. చుట్టూ ప్రక్కల అంతా వెతుక్కుని కొన్ని పొలాలను చూసుకున్నాడు. వాటికోసం ఆయనకి కొంత పైకము అడ్వాన్స్ గా ఇవ్వాల్సి వచ్చింది.

అది ఇచ్చి ఆయన గుంటూరు కి తిరిగి వెళ్లి అక్కడ ఉన్న ఆస్తి-పాస్తులు అమ్ముకుని ఆ వచ్చిన ధనముతో ఆ భూమి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అనే తలంపు అతనికి కలిగింది. కాని అతని దగ్గర అడ్వాన్స్ చెల్లించడానికి అంత డబ్బు లేక పోవడముతో అక్కడే పిఠాపురంలో ఉన్న ఒక సంపన్న వర్తకుని దగ్గరకి వెళ్లి ప్రామిసరీ నోటు వ్రాసి ఇచ్చి కొంత డబ్బు అప్పు తీసుకుని ఆ వ్యవసాయదారునికి అడ్వాన్స్ చెల్లించి గుంటూరు వెళ్ళిపోయాడు. అక్కడి ఆస్తి-పాస్తులు అమ్మేసుకుని ఆ ధనం తో పిఠాపురానికి వచ్చేసి ఆ ధనిక వర్తకుని బాకీ తీర్చేసాడు. కాని యేవో కారణాలవల్ల ఆ ప్రామిసరీ నోటు ఆ ధనికుడు వాపసు ఇవ్వలేదు. ఆ వర్తకుడు కూడా అంత పట్టించుకోలేదు. ఇలా కొన్ని రోజులైనాక ఆ వర్తకునికి రాజమండ్రి హైకోర్ట్ నుంచి ఒక నోటీసు వచ్చింది. దాని సారాంశం ఏమంటే ఫలానా తేదీన ఈ వర్తకుడు నా దగ్గర్నుంచి ధనం అప్పు తీసుకుని ఇన్ని నెలలైనా బాకీ తీర్చలేదు. తక్షణమే ఆ డబ్బు వడ్డీతో సహా వాపసు ఇవ్వవలసినదిగా కోర్ట్ నోటీసు ఇప్పించాడు. ఇది చదివిన ఆవర్తకుని గుండె చెదిరి పోయింది. చాలా భయపడి పోయాడు. ఆ ధనికుడు ఆ పట్టణంలో మంచి పేరున్నవాడే. ఏదో పొరబాటు జరిగి ఉంటుంది అని ఆలోచించి ఆ ధనికుడి దగ్గరకి వెళ్ళాడు."నేను అప్పుడే మీ బాకీ తీర్చేసాను కదా ! ఈ సంగతి మీకు తెలిసీ కూడా నాకిలా ఎందుకు కోర్ట్ నోటీసు పంపించారు ?" అని అడిగాడు. "మీలాంటి పెద్దవాళ్ళు ఇలాంటి పనులు చేయరు అని నాకు నమ్మకం ఉంది. ఎక్కడో, ఏదో పొరబాటు జరిగి ఉంటుంది అని కనుక్కోవడానికి వచ్చాను" అని చెప్పాడు.

దానికి ఆ అప్పు ఇచ్చిన ధనికుడు, "భలేవారే ! ఏమిటీ ఇలా మాట్లాడుతున్నారు? మీరు నాకు అసలు ఎప్పుడు డబ్బు వాపసు ఇచ్చారు? మీరు వాపసు ఇచ్చి ఉంటె ఆ ప్రామిసరీ నోట్ మరి నా దగ్గరే ఎందుకు ఉంది? అది మీ దగ్గరే ఉండాలి కదా ! అయినా ఎవరైనా సాక్ష్యం ఉన్నారా?" అని అడిగాడు.

దానికి గుంటూరు నుంచి వచ్చిన వర్తకుడు ఇలా అన్నాడు. మీరేమో పెద్ద మనుష్యులు. ఇలా అన్యాయం చేయడం ఏమి బాగా లేదు . ఈ విషయం మన ఇద్దరికీ తప్ప ఇంకెవరికీ తెలియదు అని మీకు బాగా తెలుసు అని ఆ వర్తకుడు అన్నాడు . అప్పుడేమో ఆ ధనికుడు మీరు అప్పు తీర్చేసి ఉంటే ఆ ప్రామిసరీ నోటు నేను మీకు వాపసు ఇచ్చేవాడిని. అది నా దగ్గరే ఉన్నది. మీరు నా అప్పు తీర్చలేదు. ముందు నా బాకీ తీర్చండి అని గట్టిగా మందలించి ఆ వర్తకున్ని పంపించేసాడు.




దీనితో పాపం ! ఆ వర్తకుడు దిక్కు తోచక గాభరా పడిపోయాడు. ఏం చేయాలో అర్థం కాలేదు. డబ్బులు వాపసు ఇచ్చినప్పుడు సాక్షులు కూడా ఎవ్వరూ లేరు . పైగా ఎవరూ నా మాటలు నమ్మరు. పరిస్థితి చాలా విషమంగా ఉంది అని సతమతమవుతూ ఉంటే అతని స్నేహితులు ఒక ఉపాయం చెప్పారు. ఈ ఊళ్లోనే శ్రీ పాద శ్రీ వల్లభుల వంశానికి చెందిన మల్లాదివారి కుటుంబం ఉంది. పై ఊరినుంచి వచ్చిన ఎవరినైనా సరే దత్త స్వరూపులుగా భావించి ఆతిథ్యం ఇస్తారు. నీవు అక్కడికి వెళ్ళు. తప్పకుండా నీ సమస్య తీరిపోతుంది అని సలహా ఇచ్చారు. ఇక దిక్కు తోచని స్థితిలో ఆ వర్తకుడు శ్రీ పాద శ్రీ వల్లభులని నమ్ముకుని ఆయన మీదే భారం వేసి మల్లాది వారింటికి వెళ్ళాడు. ఆ ఇంటి సాధ్వీమణి అతనిని చూసి మీరు పై ఊరినుంచి వచ్చినట్టున్నారు. బాగా అలసి పోయినట్టు కనిపిస్తున్నారు. త్వరగా కాళ్ళు చేతులు కడుక్కుని రండి. భోజనం వడ్డిస్తాను అని అన్నది.సరే అని ఆయన కాళ్ళు చేతులు కడుక్కుని భోజనానికి కూర్చున్నాడు. అన్యమనస్కంగా భోజనం చేస్తున్న అతన్ని చూసి ఆ సాధ్వీమణి , "ఏమిటీ నాయనా ! అలా ఉన్నావు ?నిన్ను చూస్తుంటే ఏదో చాలా బాధ పడుతున్నట్టుగా ఉన్నావు. అసలు విషయమేమిటీ? అని అడిగింది. ఆయన భోరున ఏడుస్తూ జరిగిన సంగతి అంతా చెప్పాడు విషయం విని ఆవిడ కూడా చాలా బాధ పడింది . మరి సాక్ష్యం చెప్పడానికి ఇప్పుడు ఎవరూ లేరా? అని అడిగింది. నిన్ను చూస్తే మంచి సాధు స్వభావం ఉన్న వాడిలా కనిపిస్తున్నావు. నీవు చెప్పింది నిజమైతే మా శ్రీపాదుడే వచ్చి సాక్ష్యం చెప్తాడులే అని అన్నది. మంచి మనస్సు ఉన్నవాళ్ళు ఏమీ ఆలోచించకుండానే వారి మనస్సులో ఉన్నది మనస్పూర్తిగా బయటకి చెప్పేస్తారు. ఆవిడ మాటలు వినగానే ఆ వర్తకునికి ధైర్యం వచ్చింది. ఈలోగా ఆ సాధ్వీమణి ఈ విషయం తన భర్తకి చెప్పితే ఆయన లబోదిబోమని మొత్తుకున్నారు.

నీవెందుకు శ్రీపాదుడు సాక్ష్యం ఇస్తాడు అని చెప్పావు ? శ్రీపాదుడేమిటి ? సాక్ష్యం ఏమిటీ? ఇది జరిగే పనేనా? ఇలాంటి అసాధ్యమైన హామీలు ఎందుకు ఇస్తున్నావు? అని మందలించారు. ఆవిడ మటుకు ధైర్యంగా మరి దేవుడైన శ్రీపాద శ్రీ వల్లభుడు భక్తులైన వారికి సహాయం చేయాలి కదా ! మరి ఆ మనిషిని చూస్తే నిజమే చెప్తున్నాడని నాకనిపిస్తుంది. అటువంటి మంచి ,నిజాయతిపరుడైన వ్యక్తికి శ్రీపాద శ్రీ వల్లభుడు సహాయం చేయకపోతే మన మాట పోదా ? ఏమో ! నాకేమీ తెలియదు. నేనైతే మాట ఇచ్చేశాను. నా మాట నిలబెట్టడం ఆ శ్రీ పాదుని బాధ్యతే అని చెప్పేసి తన పనిలో ఆవిడ మునిగిపోయింది.

ఇక్కడ గుంటూరు నుంచి వచ్చిన వర్తకుడు తన లాయరు దగ్గరకి వెళ్ళాడు. నీకెవరైనా సాక్ష్యం ఉన్నారా అని లాయరుగారు అడిగితే ఉన్నారు అని బదులు చెప్పాడు. ఆ లాయరుగారు కూడా అంత పట్టించుకోలేదు.రాజమండ్రి హై కోర్టులో తారీఖు వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ కోర్ట్ కి వెళ్ళారు. ఆ రోజుల్లో బ్రిటిషువారి పరిపాలన మూలంగా అక్కడ ఒక ఆంగ్లేయుడే న్యాయమూర్తిగా ఉన్నాడు. కేసు విచారణకి వచ్చిన రోజున ఆ వర్తకుని లాయరుగారు సాక్షి గురించి ఎప్పుడు వస్తాడు? ఎక్కడ ఉన్నాడు? అని అడిగితే శ్రీ పాద శ్రీ వల్లభులే సాక్ష్యం ఇస్తారు అని ఆ సాధ్వీమణియే చెప్పారు అని సమాధానం చెప్పాడు. అది విని లాయరుగారు బిత్తర పోయారు. అదేమిటండీ! శ్రీ పాద శ్రీ వల్లభుల వారేమిటీ? సాక్ష్యం చెప్పడానికి రావడ మేమిటీ? నాకంతా గందరగోళంగా ఉంది. మీరు నాకు ముందే చెప్పాల్సింది కదా ! ఆయన ఎలా వస్తారు? అని గాభరా పడ్డారు.

ఇంతలో " శ్రీ పాద శ్రీ వల్లభుల వారు హాజరు కావాలి " అని బంట్రోతు గట్టిగా పిలిచాడు. అక్కడ సాక్ష్యం చెప్పే బోనులో స్వామి సమర్థ వారి ఆకారం ప్రత్యక్షమయింది. కోలాహలంతో కోర్ట్ హాలు దద్దరిల్లి పోయింది. జడ్జిగారు కూడా చాలా ఆశ్చర్య పోయారు. ఇదంతా ఏదో దైవిక శక్తి లాగా ఉంది. ఇది ఎలా సాధ్యం? అయినా ఒక్క నిమిషం ఆలోచించి తన విధి తానూ చేయాలి కాబట్టి "స్వామీ ! మీరు సాక్ష్యం చెప్పడానికి వచ్చారు కదా ! మీ పేరేమిటీ ? అని స్వామి సమర్థవారిని అడిగారు.

ఇదేమి ప్రశ్నరా బాబూ ! నేనేమిటీ ? నా పేరేమిటీ ? అన్ని పేర్లు నావే. నేను అంతటా ఉన్నాను. అందరిలో ఉన్నాను అని స్వామి సమర్థవారు బదులు చెప్పటం జరిగింది.

ఆ మాటలు విని ఆ జడ్జిగారు ఇతనెవరో సాధారణమైన వ్యక్తి కాదు. అందరి లాగా కాదు అని భావించుకుని నెమ్మదిగా, "స్వామీ ! తమరి కులమేమిటీ?" అని అడిగారు.

"నేను చర్మకారుణ్ణి. మాదిగవాణ్ణి "అని స్వామి సమర్థవారు గట్టిగా అరిచి చెప్పారు
.అప్పటికే హాలులో ఉన్న జనమంతా హడలిపోయి ఉన్నారు.అక్కడ జరుగుతున్నదంతా విచిత్రంగా ఏదో మహా శక్తి ఆవరించుకున్నట్టుగా అనిపించింది. ఈ అప్పిచ్చిన ధనికుడు గడగడా వణికి పోసాగాడు.అటువంటి మహా దైవిక శక్తి ముందు తను చేసిన ఈ అమానుష పనికి లోపల్లోపలే పశ్చాత్తాప పడడం మొదలు పెట్టాడు. శ్రీపాద శ్రీ వల్లభుడు సాక్ష్యం చెప్పడానికి వస్తాడు అని నేనెప్పుడూ అనుకోలేదు. అనవసరంగా అబద్ధమాడాను. ఇప్పుడు నాగతేమిటీ? ఏమన్నా శిక్ష పడుతుందో ఏమో అని పరిపరి విధాలా ఆలోచించ సాగాడు.
తదుపరి ప్రశ్న "మీ తల్లిదండ్రులేవరూ?" అని జడ్జిగారు అడిగారు.
"నా తలిదండ్రులా? నాకు పుట్టుక ఏమిటీ? చావేమిటీ? నా తల్లిదండ్రులంటూన్నావేమిటీ ? అసలు నీ పుట్టుక గురించి నువ్వాలోచించుకో. నీ తండ్ర్రెవరో నీకు తెలుసా?" అనిగర్జించారు.
ఆ స్వామివారి మేఘ గర్జనకి ఆ జడ్జి గారేమిటీ, లాయర్లేమిటీ, అందరూ కూడా నిశ్చేష్టులై పోయారు. గడ గడా వణికి పోవడం మొదలు పెట్టారు.
పాపం ! ఆ జడ్జీ గారు దెబ్బకి క్రింద పడిపోయారు. ఇదేమిటీ? నేను అనాథున్ని, అక్రమ సంతానాన్ని (లావారిస్),నా తండ్రెవరో ఏమో నాకే కాదు మరెవ్వరికీ కూడా తెలియదు అని ఈయనకి ఎలా తెలిసి పోయిందీ? అని గాభరా పడి పోయారు. కోర్టులో అందరూ కూడా ఏమవుతుందా అని భయపడి పోయారు. ఇతనెవరో సామాన్య మానవుడు కాదు. మహానుభావుడు అయి ఉంటాడు అని అనుకున్నారు.

ఇక్కడ ఆ ధనికుడు పశ్చాత్తాప పడుతూ జడ్జీ గారి దగ్గరకి పరిగెత్తుకుని వచ్చాడు. గుంటూరు నుంచి వచ్చిన ఆ వర్తకుడికి మాత్రం ఆశ్చర్యంతో నోట మాట రాకుండా అలాగే ఉండి పోయాడు. అక్కడ అందరి పరిస్థితి అలాగే ఉండింది. ఆ ధనికుడు గబా గబా జడ్జీగారి దగ్గరకి వెళ్లి , నేను చాలా పొరబాటు చేసాను.ఆ వర్తకుడు చాలా మంచివాడు, నిజాయతిపరుడూ,నా బాకీ అప్పుడే తీర్చేసాడు. నేను ఆ ప్రామిసరీ నోటు అతనికి వాపసు ఇవ్వకుండా,అతన్ని మోస పుచ్చి, మళ్ళీ డబ్బు అతని దగ్గర్నుంచి లాక్కోవాలనే దురాశతో ఇలా చేసాను నన్ను క్షమించండి. మీరు ఏ శిక్ష విధించినా నాకు అంగీకారమే అని ప్రాధేయ పడ్డాడు. ఈ విధంగా ఆ ధనికుడు తన తప్పు ఒప్పుకున్నాడు. ఆ జడ్జిగారు ఆ ధనికున్ని కోప్పడి బాగా జరిమానా వేసి అక్కణ్ణుంచి పంపించేసారు. ఆ గుంటూరు నుంచి వచ్చిన వ్యాపారి మాత్రం శ్రీ పాద శ్రీ వల్లభులవారి మహిమ ఏమిటీ ఇలా జరిగింది. నిజంగా వారి వంశం వారు ఇచ్చిన మాట ఆయన నిలబెట్టారు కదా ! అని అనుకుని శ్రీ పాద శ్రీ వల్లభులవారి పరమ భక్తాగ్రేసర చక్రవర్తి లాగా మారి పోయాడు. అయితే ఈ వృత్తాంతమంతా ఆ జడ్జీ గారు తన డైరీలో వ్రాసుకున్నట్టుగాలేక స్పెషల్ గా నోట్ చేసుకున్నారు. అది ఇప్పుడు కూడా ఇంగ్లాండ్ లో ఉన్నది అని శ్రీ గోవింద దీక్షితులు గారు చెప్పారు.

దయచేసి మీకు   తెలిసిన   పెద్దవారికి , దర్శించే వీలు లేని వారికి చూపించండి . దేవుడు ఎలా అనుగ్రహిస్తాడో , ఎప్పుడు దర్శనభాగ్యం కలిగిస్తాడో మన ఊహకు అందదు.అందరికీ దర్శనభాగ్యం కలగాలనే మా ప్రయత్నం.

" సంభవామి యుగే యుగే " ఫేసుబుక్ పేజీ ద్వారా పోస్ట్ చేస్తున్న ఇతర పోస్ట్ లు కూడా చూడండి మీకు కొన్నైనా ఉపయోగపడితే మా ప్రయత్నం సఫలీకృతం అవుతుంది అని మా ఆశ


శ్రీ పాద రాజం శరణం ప్రపద్యే
ఓం నమో శ్రీ స్వామి సమర్ధ

వాట్సప్ లో ఫార్వార్డ్ చేయబడిన ఈ ఆధ్యాత్మిక పోస్ట్ ను నా బ్లాగు లో కాపీ చేసాను..
Sunday, October 27, 2019 0 comments By: visalakshi

వివాహనిశ్చితార్థం....

                             ఓం శ్రీ గణేశాయ నమో నమః








సంప్రదాయాలకు, సంస్కారాలకు, శ్రేష్టమైన
ఆచారవ్యవహారాలకు నిలయం "భారతీయ సంస్కృతి". అందులో ఒకటైన మన వివాహ విధానం ఘననీయమైనది. గృహస్థాశ్రమం నాలుగుఆశ్రమంలలో శ్రేష్ఠోత్తమం. ఈ ఆశ్రమం లోనికి  ప్రవేశంకి  ఉత్తమ సంస్కారముంది. అదే వివాహం. 
   
వివాహం అనేది ఒక వైదిక కార్యం. ఇది ఒక సాంస్కృతిక సార్వజనీనమైన సంప్రదాయం. మూడు ముళ్ళ బంధం ద్వారా ఒకటై విడదీయరాని నూతన బంధానికి శ్రీకారం చుడుతూ తమ పవిత్ర కలయిక ద్వార మరో కొత్తతరానికి నాంది పలికేటట్లు చేసే సంస్కారమే వివాహం. 

అసలు వివాహం ఎందుకు? పురుషార్ధాలలో ఒకటైన కామం కోసమా...కానేకాదు. ఆమె కామపత్నికాదు ధర్మపత్ని. దేనికైన ఓ పవిత్రతను కలిగించడం, దైవభక్తితో, దేవతల శక్తులతో అనుసంధానించడం భారతీయజీవన ఔనత్యం. హిందూ వివాహవ్యవస్థ ఓ ధర్మం. మన సంస్కృతి 'వివాహం'ను ఓ ధర్మసాధనగా పేర్కొన్నది. గృహస్థ కర్తవ్యములైన పంచయజ్ఞములను నిర్వహించుటకొరకు, ముఖ్యంగా మువ్విధములైన ఋణములు తీర్చుకొనుటకొరకు.ఆ ఋణాలేమిటంటే - 

దైవఋణం:- దైవం ఒకటే అయినా అనేక దేవతారూపాల్లో పూజిస్తాం. అలా ఆరాధించడం వలన, మరియు జపధ్యానాదులు యజ్ఞయాగాదుల చేయడం ద్వారా, పంచభూతాల రూపంలో నిరంతరం మనల్ని పోషిస్తున్న దైవాన్ని అర్చించడం (ప్రకృతిశక్తులకు కృతజ్ఞత చూపడం) ద్వారా దేవఋణం తీరుతుంది. 

పితృఋణం :- గత జన్మల ప్రారబ్ధం అనుభవిస్తూ , ఈ జన్మలో ఉత్తమకర్మలు చేస్తూ, పునరావృతి లేని ముక్తస్థితి పొందడానికి అవసరమైన శరీరాన్ని ఇచ్చి, పెంచిన తల్లితండ్రుల ఋణం తీర్చుకోవాలి. తల్లితండ్రులను పెద్దలను గౌరవించడం వలన, అలాగే పూర్వీకులైన పితృదేవతల పట్ల మనకున్న ఋణం సంతానం కనడం ద్వారా తీరుతుంది. అంటే వంశాన్ని ముందుకు తీసుకెళ్ళడం వల్ల పూర్విజులైన పితృఋణం తీరుతుంది. దేవఋణం తీరడానికి యజ్ఞయాగాదులు ఎలాగో, పితృదేవతల ఋణం తీరడానికి శ్రాద్ధకర్మలు కూడా అలాంటివే . 

ఋషిఋణం:- జ్ఞానసంపన్నులు అయిన ఋషులు చెప్పిన వేదోపనిషత్తులను అధ్యయనం చేయడం, సాధనలు, సత్గ్రంధ పఠనాదులు చేస్తూ ధర్మాన్ని ఆచరించడం ద్వారా ఋషిఋణం తీరుతుంది. 
పై ఋణాలకి వివాహానికి సంబంధం ఏమిటంటే- దేవతానుగ్రహం చేతనే సర్వకార్యములు జరుగుతాయి. వారికి అందుకే కృతజ్ఞత చూపాలి. యజ్ఞయాగాదులతో హవిస్సునివ్వాలి. అలా ఇవ్వాలంటే ప్రక్కన ధర్మపత్ని వుండాలి. ధర్మపత్నితో కూడి వున్నప్పుడే యజ్ఞం చేయడానికి అర్హత వుంటుంది. 

ఇక పితృఋణం వంశాన్ని ముందుకు తీసుకెళ్ళడం అంటే సంతానం పొందడం ద్వారా తీరుతుంది కాబట్టి, ఆ సంతానం ధర్మబద్ధంగా ఉండాలి కాబట్టి వివాహ సంస్కారంద్వారా పత్నిని పొందాలి.ఆపై తాను పుణ్యకర్మములు చేయలన్న,  జాతిహితంకై ఋషులు చెప్పిన వాజ్మయంలను చదివి ఆచరించాలన్న, తనని, తనవారిని శ్రద్ధగా చూసుకుని, సహకరించే భార్య కావాలి. అప్పుడే ఋషిఋణం తీర్చుకోవడం అవుతుంది.

ఈ మూడు ఋణాలు తీరాలంటే వివాహం చేసుకొని గృహస్థాశ్రమం లోనికి ప్రవేశించాలి తప్ప వేరే మార్గం లేదు. ధర్మాచరణకు ప్రధానమైన ఉపకరణం ధర్మపత్నియే. ఎన్ని వున్నా, వున్నది పుణ్యంగా మార్చుకోవడానికి సహచరి తప్పనిసరి. 

ఎన్నెన్నో అనుభూతులు ఆనందాలు సుఖాలు కష్టాలు సర్ధుబాటులు...ఒకటనేముందీ...అన్ని అనుభవాలను సామరస్యంగా ఒకరికొకరు తోడై పంచుకుంటూ సంతోషంగా జీవనగమనం సాగిస్తూ పురుషార్ధాలను సాధించడమే వివాహ అంతరార్ధం. 

ఇక మన వివాహపద్ధతిలో చాలా ప్రత్యేకతలున్నాయి. మన ఈ పద్ధతుల్లో ప్రతీ ఘట్టం సంప్రదాయకమే, మరుపురాని మధురస్మృతే. ముందుగా అబ్బాయికి తగిన అమ్మాయిని, అమ్మాయికి తగిన అబ్బాయిని ఎంపిక చేయడం ఓ ముఖ్యఘట్టం.

మొదటి ఘట్టం 'పెళ్ళిచూపులు'.
యుక్తవయస్సు వచ్చిన అబ్బాయి, అమ్మాయిలకు వివాహం చేయదలచి ఇరుపెద్దలు చక్కటి సంబంధాలకై పెద్దవారిని, తెలుసున్నవారిని ఆశ్రయించి (ఇప్పటివారు సమిష్టితత్వం లేనందున మాట్రిమోనీలమీద ఆధారపడుతున్నారు)
వారి సహకారంతో వారిని సంధానకర్తలుగా నిలిపి 
ఇరు కుటుంబాల నడుమ రాయభారాలు నడిపి ఒకరిది ఒకరికి నప్పింది అని అనుకున్నప్పుడు తొలుత పెళ్ళిచూపుల కార్యక్రమంకు నాంది పలుకుతారు. ఆపై చేసుకున్నవారికి, చేసేవారికి సమ్మతమై, ఇరువురి ముఖ్యబంధువులు ఒకచోట సమావేశమై, పరస్పర సంప్రదాయలు, కుటుంబ ఆచారవ్యవహారాలు చర్చించుకొని, అన్నీ కుదిరాక ఓ శుభముహుర్తమున 'నిశ్చితార్ధం' చేయ నిర్ణయించుకోవడం రెండవ ఘట్టం.




నిశ్చితార్ధం:- ఇరు కుటుంబాలవారు వారి అబ్బాయి అమ్మాయి ఏకమవ్వడానికి చేసిన ప్రతిపాదనను శాస్త్రానుసారంగా వేదమంత్రాల నడుమ వాగ్ధానం ద్వారా నిశ్చయించుకోవడాన్ని నిశ్చితార్ధం అంటారు. సంప్రదాయబద్ధంగా పెద్దల సమ్మతితో అందరి అత్మీయుల ఆశీర్వాదములతో జరిగే ఈ వివాహ నిశ్చయం అమ్మాయి ఇంట్లో గాని వారు సూచించే చోట జరుగుతుంది. నిశ్చితార్ధంకై అబ్బాయి తన కుటుంబ బంధుమిత్రాదులతో వచ్చినప్పుడు అమ్మాయి తరుపున వారు ఆదరాభిమానాలతో ఆహ్వానిస్తారు. పరస్పర నమస్కారాలతో (నమస్కారం మన సంస్కారమంటారు. దీనిలో కూడా ఓ అంతరార్ధముంది. భగవంతునికి నమస్కరించడంలో భక్తిభావం, గురువుని నమస్కరించడంలో పూజ్యభావం, పెద్దలను నమస్కరించడంలో గౌరవభావం ఉన్నట్లే, పెళ్ళి ఒప్పందం లాంటి ఈ వేడుకలో ఇరు కుటుంబాలవారు నమస్కరించుకోవడంలో రెండు కుటుంబాలు ఒకటి కావాలనే ఆకాంక్షతో అరమరికలు లేకుండా కలిసుందామని రెండుచేతులు జోడించి అనుబంధాన్ని దృఢపర్చుకునేభావముంటుంది)పలకరించుకుంటారు.

హితులు, స్నేహితులు, బంధువుల నడుమ వైదిక మంత్రాలమధ్య అందరికీ అమోదయోగ్యమైన ఈ ఇరువురు పెళ్ళిని లాంచనప్రాయంగా ఖాయపరచుకోవడమనే ఈ కార్యక్రమం ప్రధమంగా విఘ్నేశ్వరుని పూజతో ప్రారంబమౌతుంది. వివాహప్రక్రియ అసాంతం విఘ్నాలు లేకుండా చూడమని ఆయన్ను పూజించడం ఆనవాయితి. ఆపై అమ్మాయికి అబ్బాయి తల్లితండ్రులు నూతనవస్త్రాలను నగానట్రా పండ్లు మధురపధార్ధాలను ఇచ్చి తనకోడలుగా స్వీకరిస్తారు. ఇప్పుడు అమ్మాయికి అత్తమ్మగారు (అబ్బాయి తల్లి), అబ్బాయికి మామయ్యగారు(అమ్మాయి తండ్రి) ఉంగారాలు తొడుగుతారు. అయితే నేటితరంవారు అబ్బాయి అమ్మాయి ఒకరికి ఒకరు తొడుక్కుంటున్నారు. శాస్త్రరీత్యా వివాహం అప్పుడే పాణిగ్రహణం జరగాలని పెద్దలు చెప్తుంటారు. ఇది ఎవరి వంశానుసారంగా వారి వారి కుటుంబ పెద్దలు ఆచరించినది అనుసరించడం ఉత్తమం. 
పురోహితుడు బంధుమిత్రుల సమక్షంలో పెళ్ళి ముహుర్తాన్ని లగ్నపత్రికగా వ్రాయించిన తదుపరి, వధూవరుల తల్లితండ్రులు నూతన వస్త్రాలపై లగ్నపత్రికలు, తాంబులాలు పెట్టి మార్చుకుంటారు. అటుపిమ్మట అమ్మాయితో కొందరికి తాంబులాలు ఇప్పించి వధూవరులను వేరు వేరుగా ఆశ్వీరదిస్తారు. కానీ ఇప్పటి తరంవారు ప్రక్క ప్రక్కనే కూర్చొబెట్టి ఆశీర్వదిస్తారు. అది సరికాదని, అంతగా సరదా ఉంటే వేరువేరు కుర్చీలలో కూర్చోబెట్టి మధ్యలో చిన్న ఉదకబాండం ఉంచండని పెద్దలవాక్కు. తాత్కాలిక ముచ్చట్లుకు కాకుండా జీవితాంతం ముచ్చటగా ఉండేటట్లు చూడండి అని పెద్దలు చెప్తుంటారు. అప్పటికి ఇప్పటికి కొన్ని మార్పులు అన్నింటా చోటుచేసుకున్నవి. 




పిమ్మట రెండు మనసులు జీవితకాలం తోడునీడై కలిసుండడానికి వేసే ఈ తొలి వేడుకలో, రెండు కుటుంబాలూ కుటుంబాలు జీవితకాలం ఆత్మసంబంధీకుల్లా కలుసిపోయే శుభతరుణంలో, అందరూ ఒకచోట కలుసుకునే ఈ మధురక్షణాల్లో ఆత్మీయముచ్చట్లు,విందుఆరగింపులు,చలోక్తులు, చతురోక్తులు...నవ్వులు, కవ్వింపులు...ఓహో...ఆనంద వెల్లువ...కమనీయ వేడుక...శుభాకాంక్షల డోలిక..... మూడవది ముచ్చటైనది మూడుముళ్లు  పడే శుభదినంకై సన్నాహాలు ఎదురుచూపులు... ఈ ఉల్లాస ఉత్సాహాలు మరుపురాని మధురఘట్టం.

ఇలాంటి మధురానుభూతుల సమాహారాల కలయికే వివాహ బంధంగా ముడిపడి దంపతులుగా ఆదర్శంగా నిలవాలని ముక్కోటి దేవతలు ఆశీర్వదిస్తారు..

                       సర్వే జనా సుఖినో భవంతు...
















Monday, September 30, 2019 0 comments By: visalakshi

ఆత్మశక్తి-దైవ ఆరాధన...


ఓం శ్రీ సాయినాథాయ నమో నమః


   
స్వభావరీత్యా మానవునకు ప్రేమానురక్తులను ఆశించడం పరిపాటి. ఆ ఆశలను అందుకోవడంలో విఫలమైనప్పుడు ఆవేశపూరితుడవుతాడు. కానీ ఆలోచిస్తే ఆ ఆశ అన్న భావాన్ని మనసునుండి తొలగించుకునే ప్రయత్నంలో అతను సాధు స్వభావుడవుతాడు.

మహాత్ముల స్వరూపం సదా ఆనంద దీపికలు వెలిగిస్తూ ఉంటుంది. దైవదృష్టికి పరిమితి లేదు. "ఏయధా మాం ప్రపద్యంతే తాంస్తధైవ భజామ్యహం" (నా పట్ల ఎలాంటి భక్తిని కలిగిఉంటే వారికి వారి భక్తి ననుసరించి అలాంటి ప్రతిఫలమిస్తాను) అయితే మహాత్ముల అంత:కరణ వారిని నిందించిన వారిపై కూడా కారుణ్యం కురిపిస్తుంది. బాబా ఎన్నోసార్లు "ఇతరుల మనసుకి కష్టం కలిగేలా మాట్లాడితే అవి నా హృదయాన్నే తూట్లు పొడుస్తాయి. నా అత్యంత సున్నితమైన భాగానికి గుచ్చుకుంటాయని తెలుసుకోండి. ఇతరులను   బాధాకర మాటలతో కోపం కలిగేలా మాట్లాడితే అవి నన్నే బాధిస్తాయి. కానీ వాటిని శాంతంగా సహించే వారే నాకు బాగా తృప్తి కలిగిస్తారు". అని చెప్పి ఉన్నారు. అలా సాయిబాబా జీవులన్నింటా లోపలా, బయటా నిండి ఉన్నారు .ఆ మహా మంగళప్రదమైన ప్రేమమయి సర్వవ్యాపకుడై  భక్తుల హృదయనివాసుడైనాడు...ఓం సాయిరాం.... 





దృఢమైన మనసుతో భగవానుని కొరకు లోకమందలి స్వజన సంబంధములు మరియు మిత్ర పరిచయముల వంటి సమస్త సంబంధములకు ఋణములన్నీ తీర్చుకోవలెను. ఋణవిముక్తులవ్వాలంటే ఆధ్యాత్మిక జీవనమనే సాధు సాంగత్యముతో విష్ణు ఆరాధనలో భక్తిభావ సమన్వితులై భగవచ్చరణారవిందములను ఆశ్రయించడం ద్వారానే మనం ఋణము లనుండి విముక్తులవుతాము.

 సుఖదు:ఖములు తాత్కాలికము. వాటి రాక పోకలు శీతగ్రీష్మ అనుభవముల వంటివి. జీవితానుభవముల వలన అవి కలుగుచుండును. కావున కలత పొందక వాటిని సహింపవలెను. నిజానికి సుఖదు:ఖములనేవి మనస్సు వలన కలుగునన్నది మనకు విదితము. కాబట్టి మనసును దైవ ఆరాధనలో నిమగ్నం చేసి  ప్రశాంతతను అలవరచుకోవాలి....ఓం సాయిరాం...,




బాబా తమ కమలసుమదళంలాంటి చేతిని శిరస్సుపై పెట్టటంతోనే అనేక జన్మలనుంచీ సంతరించుకొన్న పాపాలు ప్రక్షాళనం అయిపోయి నా లాంటి సాయియొక్క ప్రేమిక భక్తులు పవిత్రులవుతారు. బాబాస్పర్శతో హృదయంలో అష్టసాత్విక భావాలు ప్రకటమవుతాయి. పారాయణ చేస్తున్నా, పురాణాలు చదువుతున్నా అడుగడుగునా బాబా కనిపిస్తారు. రాముడు కృష్ణుడు, వేంకటేశ్వరుడు....ఏ దేవాలయానికి వెళ్ళినా.. ఆ రూపాలలో బాబా దర్శనమిస్తారు. ఆహా జన్మ ధన్యము కదా!... కాయా, వాచా, మనసా శ్రీ సాయినాధునికి సాష్టాంగం చేస్తే ధర్మ అర్ధ కామ మోక్షాలనే నాలుగు పురుషార్ధాలను, కర్మ,జ్ఞాన యోగ, భక్తి- అనే నాలుగు మార్గాలతోనూ ఈశ్వరుడు ప్రాప్తిస్తాడు. మనసనే తోటలో భక్తి అనే నీటిని చల్లితే వైరాగ్యం మొలకెత్తుతుంది. జ్ఞానమనే పూలు విరగబూస్తాయి. కైవల్యమనే ఫలం లభిస్తుంది. జ్ఞానమయం విప్పారుతుంది. జనన, మరణాలు నిశ్చయంగా తప్పిపోతాయి.."ఓం సాయిరాం..."





" మా మనస్సును అంతర్ముఖము చేయుము. దానిని లోపలివైపు పోవునట్లు చేయుము. నిత్యానిత్యములకు గల తారతమ్యమును తెలిసికొను శక్తిని కలుగజేయుము. ప్రపంచ వస్తువులందు మాకు గల ఆసక్తిని పోగొట్టి మాకు ఆత్మసాక్షాత్కారము కలుగునటుల చేయుము. మేము మా శరీరమును ప్రాణమును సర్వమును నీకు సమర్పించెదము. సుఖదు:ఖానుభవములు కలుగకుండునట్లు మా నేత్రములు నీవిగా చేయుము. మా శరీరమును మనస్సును నీ స్వాధీనమందుంచుకొనుడు... మా చంచల మనస్సు నీ పాదముల చెంత విశ్రాంతి పొందుగాక!"...ఓం సాయిరాం...

"తడిసిన కట్టెలకు నిప్పు సెగను పెట్టగానే తేమ పోయినట్లు, సాధు సా౦గత్య౦ వల్ల  లౌకికుల హృదయాల్లోని లోభ మోహాలనే తేమ పోతు౦ది."


"ఒక దీపాన్ని, మరో దీప౦ వెలిగిస్తు౦ది. అ౦తమాత్ర౦ చేత వెలిగి౦చే దీప౦ వెలుగు తగ్గిపోదు. అలాగే ఇతరులకు బోధి౦చే కొద్దీ మీ జ్ఞాన౦ పెరుగుతు౦దే కానీ తరగదు." .."ఓం సాయిరాం".


సర్వం శ్రీ సాయి నాధార్పణ మస్తు









Friday, September 27, 2019 0 comments By: visalakshi

శ్రీ సుబ్రహ్మణ్యుడే సుబ్బారాయుడు గా నిజరూప దర్శనం....


               ఓం శ్రీ సుబ్రహ్మణ్యస్వామి నమోనమ:



500 ఏళ్ళ క్రితం జరిగిన అద్భుత సంఘటన -
శ్రీ సుబ్రహ్మణ్యుడే శ్రీ  సుబ్బారాయుడుగా వెలసిన క్షేత్రం ,
శ్రీ సుబ్బారాయుడి నిజరూప దర్శనం.................................... ఫేస్ బుక్ సౌజన్యంతో ఈ టపా.....

పాణ్యం మండలం సుబ్బరాయుడు కొత్తూరు భిన్నమైన ఆచారాన్ని పాటిస్తోంది. ఆదివారం అందరికీ సెలవు. ఆ పల్లెకూ సెలవే. కానీ మిగిలినవారికంటే కాస్త ఎక్కువ సెలవు. ఆదివారం మాంసాహారం ముట్టకపోవడం, అంత్యక్రియలు నిర్వహించకపోవడం ఈ పల్లెలో అనాదిగా వస్తున్న ఆచారం. మిగిలిన రోజుల్లో మాంసాహారం తినాలన్నా.. ఆ ఊరిలో దొరకదు. ఆరు కిలోమీటర్లు వెళ్లి తెచ్చుకోవాల్సిందే. ఆసక్తి కలిగించే ఈ ఆచారం వెనుక సుబ్రహ్మణ్య స్వామి ఆలయ స్థల పురాణ నేపథ్యం ఉంది.

*ఏమిటా కథ..?*
500 ఏళ్ళ క్రితం కొత్తూరు గ్రామానికి చెందిన బీరం చెన్నారెడ్డి అనే రైతు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. గట్టెక్కే మార్గం చూపాలని ఓ బ్రాహ్మణుడిని ఆశ్రయిం చాడు. మాఘ శుద్ధ షష్ఠి రోజున పొలం దున్నితే కష్టాలు తొలగుతాయని బ్రాహ్మణుడు సూచించాడు. దీంతో చెన్నారెడ్డి కాడెద్దులను నాగలికి కట్టి పొలం దున్నడం ప్రారంభిస్తాడు. ఆ సమయంలో నాగలికి ఉన్నట్లుండి భూమిలో ఏదో అడ్డుతగులుతుంది. ఆ క్షణంలోనే ఆకాశంలో 12 తలల నాగుపాము రూపం ప్రత్యక్షమౌతుంది. ఆ తేజస్సుకు రైతు కంటిచూపు కోల్పోతాడు.

కాసేపటి చుట్టు పక్కల రైతులు వచ్చి నాగలిని వెనక్కులాగి చూస్తారు. అక్కడ 12 శిరస్సుల నాగేంద్రుడి విగ్రహం బయట పడుతుంది. ఒక బాలుడు ప్రత్యక్షమై తాను సుబ్బరాయుడినని(సుబ్రహ్మణ్యేశ్వస్వామి), మూడు రోజుల పాటు తనకు క్షీరాభిషేకం చేస్తే చెన్నారెడ్డికి చూపు వస్తుందని చెబుతాడు. అలా పూజలు చేయగానే చెన్నారెడ్డికి కంటిచూపు వస్తుంది. దీంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గుడి కట్టాలని గ్రామస్థులు నిర్ణయించుకుంటారు. స్వామివారిని వేడుకుంటారు. ‘రాత్రి రోకలిపోటు తరువాత మొద లుపెట్టి.. తెల్లవారు జామున కోడి కూతకు ముందే గుడి నిర్మాణం పూర్తి చేయాలి’ అని స్వామి సెలవిస్తాడు. లేదంటే ఏడుగురు బలి అవుతారని హెచ్చరి స్తాడు. స్వామివారి స్వయంభు విగ్రహాన్ని నేలపైనే పెట్టి గుడి నిర్మాణం ప్రారంభిస్తారు. కోడి కూతలోగా ప్రహరీ మాత్రమే పూర్తవుతుంది. పైకప్పులేని ఆలయం సిద్ధమౌతుంది. అప్పటిదాకా ఆ గ్రామం పేరు కొత్తూరు కాగా.. స్వామి వెలసిన తరువాత సుబ్బరాయుడు కొత్తూరుగా మారింది. ఇదీ స్థల పురాణం.

*ఆదివారం సెలవెందుకు..?*
సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిపాత్రమైన రోజు ఆదివారం. ఎస్‌ కొత్తూరు గ్రామానికి ప్రతి ఆదివారం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వస్తారు. కేవలం ఆదివారం రోజే 6 నుంచి 8 వేల మంది భక్తులు స్వామిని సందర్శిస్తారు. ఆ ఒక్కరోజే సుమారు మూడు వందల అభిషేకాలు జరుగుతాయి. స్వామిని పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. తమను చల్లాగా చూస్తున్న స్వామి కోసం ఆదివారం ఆచారాన్ని ఆలయం నిర్మించిన సమయంలోనే ప్రారంభించారు గ్రామస్థులు. ఆదివారం వస్తే మాంసాహారం వండరు, తినరు. గ్రామంలో మాంసాహార దుకాణాలు లేవు. మామూలు రోజుల్లో కావాలన్నా.. గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందివర్గం వెళ్లి తెచ్చుకోవాల్సిందే. ఇక పండుగ మరుసటి రోజున మాంసాహారంతో కర్రిపండుగ నిర్వహించడం సాధారణం. ఆ పండుగ ఆదివారం వస్తే.. సోమవారానికి వాయిదా పడుతుంది.

*ఆ మూడు మాసాల్లోనూ అంతే..*
ఏడాది పొడవునా ఆదివారాలతోపాటు కార్తీకం, మాఘం, శ్రావణ మాసాల్లో గ్రామస్థులు మాంసాహారం ముట్టరు. ఈ కట్టుబాటును ఎవ్వరూ మీరింది లేదు. ఆదివారాలతో కలిపి ఇలా ఏడాదిలో సుమారు నాలుగు నెలల పాటు మాంసా హారానికి దూరంగా ఉంటూ గ్రామస్థులు స్వామిపై తమకున్న భక్తిని చాటుకుం టున్నారు. ప్రతి ఆదివారం వేలాదిగా వచ్చే భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహిస్తున్నారు.

*అంత్యక్రియలకూ సెలవే....*
కొత్తూరులో 220 కుటుంబాలు ఉన్నాయి. జనాభా సుమారు 900. ఆదివారం గ్రామస్థుల్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహించరు. మరుసటిరోజు వరకూ మృత దేహాన్ని ఇంటివద్దే ఉంచుతారు.సోమవారం అంత్యక్రియలు నిర్వహి బస్తారు. ఇందుకూ స్వామిపై ఉన్న అపార మైన భక్తే కారణం. గ్రామానికి ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వస్తారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అలాంటి పవిత్రమైన రోజున మృతదేహాన్ని తీసుకువెళితే భక్తులకు అసౌకర్యం కలుగుతుందని గ్రామస్థులు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. మృతదేహంతో వెళితే భక్తులకు అంటు తగులుతుందని తమకు తామే కట్టడి చేసుకున్నారు.

*ఎలా చేరుకోవచ్చు...?*
బనగానపల్లె మండలం నందివర్గం నుండి S.కొత్తూరు 5 కి.మీ దూరంలో కలదు.ఇక్కడ నుండి ఆటో సదుపాయం కలదు.

 ఓం నాగేంద్రాయ నమ:




Thursday, June 13, 2019 0 comments By: visalakshi

అమ్మ దీవెనలు

 ఓం శ్రీసాయినాధాయ నమ:

మాణిక్యవీణా ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం
మాహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి
చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే
పుండ్రేక్షుపాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేకమాత:!!
  



 అమ్మలగన్నయమ్మ  ముగురమ్మలమూలపుటమ్మ చాలపెద్దమ్మ లలితమ్మ..జగతికి మూలమైన శక్తి స్వరూపిణి. సమస్త చరాచర జగత్తు యొక్క రూపము తానే అయి ఉన్న తల్లికి నమస్కారము.  జగత్తును ధరించి పోషించు  అమ్మవారిని బహు రూపాలలో పలు నామాలతో అర్చిస్తాము. ఏ పేరుతో పిలిచినా చల్లని వరాలను కురిపించే కరుణామయి నా దుర్గమ్మ తల్లి.
మంగళకరమైన స్వరూపముగల తల్లి భద్రకాళీమాత.. ఓరుగల్లు{వరంగల్} భద్రకాళీ అమ్మవారి క్షేత్రములో అమ్మ దీవెనలు భక్తులకు ప్రతిక్షణం అందుతాయనుటకు నిదర్శనం ఆ అద్భుతమైన అమ్మ వీక్షణ కరుణాకటాక్షాలు...భక్తుల భక్తి యందు ప్రియము గల తల్లి..నిష్కల్మషమైన భక్తిద్వారా ఆ తల్లి అనుగ్రహమును పొంది తరించగలము.


శ్లో" సర్వభూతహితేదేవి సర్వసంపత్ ప్రదాయిని
     పద్మమాలాధరేదేవి నారాయణి నమోస్తుతే!!

వేదమాత గాయత్రి.."గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దేవత లేదు".మాతృరూపంలో,పితృరూపంలో గాయత్రీ దివ్యశక్తిగా తన    భక్తులకు,
ఆరాధకులకు లోకకళ్యాణదృష్ట్యా ఆ తల్లి సద్గుణ సర్వస్వాన్నీ ప్రసాదిస్తుంది.
జన్మజన్మాంతరాల కర్మపాశాలనుండి విముక్తుల్ని చేస్తుంది.



 లక్ష్మీమాత ధనవైభవశక్తులకు అధిష్ఠాత్రి. ఈతల్లి భక్తులకు ధన వైభవ ఐశ్వర్య సంపద పదవీ మొదలగు సమస్త భౌతిక సుఖసాధనలను ప్రసాదిస్తుంది.

"ఓం మహాలక్ష్మ్యై చ విద్మహే, విష్ణు పత్న్యైచ ధీమహీ తన్నో లక్ష్మీ: ప్రచోదయాత్."



 .
రాధాదేవి ప్రేమశక్తికి అధిష్ఠాత్రి. భక్తులకు యదార్ధమైన ప్రేమభావాన్ని కలుగజేసి అసూయా ద్వేష  భావాదులను  దూరం  చేస్తుంది.


"ఓం వృషభానుజాయ విద్మహే. కృష్ణప్రియాయ ధీమహీ, తన్నో రాధా ప్రచోదయాత్."



 .
సరస్వతీమాత జ్ఞానశక్తికి అధిష్ఠాత్రి. జ్ఞాన, వివేక దూర దర్శిత్వం, బుద్ధిమత, విచారశీలత్వాదులను ప్రసాదిస్తుంది.


"ఓం సరస్వత్యై చ విద్మహే. బ్రహ్మ పుత్ర్యై చ ధీమహీ తన్నో దేవీ ప్రచోదయాత్."




 .
దుర్గామాత దమనశక్తికి అధిష్ఠాత్రీదేవి. సమస్త విఘ్నబాధలపై విజయాన్ని ప్రసాదిస్తూ దుష్టులనూ, శత్రువులనూ నాశనం చేస్తూ భక్తులకు సమస్త ప్రకారాలైన శక్తి సామర్ధ్యాలను ప్రసాదిస్తుంది.


"ఓం గిరిజాయై చ విద్మహే. శివప్రియాయై చ ధీమహీ తన్నో దుర్గి:ప్రచోదయాత్."




 .
సీతామాత తపశ్శక్తికి అధిష్ఠాత్రీదేవి. నిర్వికారంగా పవిత్రభావంతో సాత్త్వికవృత్తితో అనన్య భావాలతో తపో నిష్ఠులనుగా తన భక్తులను తయారుచేసి ఆధ్యాత్మికోన్నత మార్గానికి మనలను ప్రేరితులను చేస్తుంది.


"ఓం జనక నందిన్యై చ విద్మహే.భూమిజాయై చ ధీమహీ తన్నో సీతా ప్రచోదయాత్."




 .
హంసదేవత వివేక శక్తికి అధిష్ఠాత. హంస యొక్క క్షీరనీరవివేకం జగత్ ప్రసిద్ధమైనది.సదసద్వివేకాన్నీ, దూరదర్శిత్వాన్నీ, సత్సంగతినీ ఉత్కృష్ఠాహారాన్నీ, ఉజ్వల యశస్సంతోషాది గుణాలనూ ఈ దేవత ప్రసాదిస్తుంది.


"ఓం పరమహంసాయ విద్మహే. మహా హంసాయ ధీమహీ, తన్నో హంస: ప్రచోదయాత్"




 .
తులసీదేవి సేవాశక్తికి అధిష్ఠాత్రి. సత్కార్యాలలో ప్రేరణ, ప్రాణిమాత్రులను సేవించాలన్న ప్రవృత్తి, ఆత్మశాంతి, పరదు:ఖ నివారణ, పవిత్రనిష్ఠాది ఫలాలను ప్రసాదిస్తుంది.


"ఓం శ్రీ తులస్యై విద్మహే. విష్ణు ప్రియాయై ధీమహీ తన్నో బృందా ప్రచోదయాత్."




శృంగేరి శారదా మాతను వీక్షించే కన్నుల్లో.. అలౌకిక ఆనందానుభవం మాటలకందనిది.



 .
 " అమ్మా!" అని నిష్కపటంగా నిరహంకారంగా శ్రద్ధాభక్తులతో మనం ఏ రూపాన్ని స్మరించినా పిలిచినా చాలు అమ్మ తన భక్తులను దీవిస్తుంది ఉద్ధరిస్తుంది.


"ఓం శ్రీ మాత్రే నమ:"