Tuesday, December 29, 2020 1 comments By: visalakshi

శ్రీ దత్తాత్రేయ వజ్రకవచం...

 #శ్రీ దత్తాత్రేయ వజ్రకవచమ్* 

#తాత్పర్యం


పూర్వం వేదవ్యాస మహర్షిని సంకల్పసిద్ధి పొందే ఉపాయం చెప్పమని ఋషులు అడిగిరి. అందుకు వేదవ్యాస మహర్షి, ఒక్కసారి చదివితే చాలు సంకల్పాన్ని సిద్ధింపచేసేది, భోగమోక్షాలను ప్రసాదించేది చెపుతాను, అందరూ వినండి అంటూ ఉపక్రమించాడు.


హిమవత్పర్వత గౌరీశృంగంపై రత్నసింహాసనం మీద ఆసీనుడై ఉన్న పరమేశ్వరునితో ఒకనాడు పార్వతీ దేవి, "ఓ లోక శంకరా! నీవల్ల అనేక మంత్రాలను, యంత్రాలను, తంత్రాలను తెలుసుకున్నాను, ఇప్పుడు మహీతలాన్ని దర్శించాలని కోరుకుంటున్నాను" అని పలికింది. పార్వతి కోరికను సంతోషంతో అంగీకరించిన పరమేశ్వరుడు వృషభవాహనం పై బయలు దేరి భూలోక వింతలు చూపించసాగాడు. వారు వింధ్య పర్వత ప్రాంతంలోని ఒక దుర్గమమైన అరణ్యానికి చేరుకున్నారు. అక్కడ వారికి గొడ్డలి ధరించి సమిధలను సేకరిస్తున్న ఒక కిరాతుడు కనిపించాడు. అతని శరీరం వజ్రము వలె ధృఢముగా ఉన్నది. ఇంతలో ఒక పెద్ద పులి అతని పై దాడి చేయుటకు వేగముగా వచ్చినది. అయితే దానిని చూచిన కిరాతుడు తనను రక్షించుకొనుటకు ఎటువంటి ప్రయత్నమూ చేయలేదు. పైగా సంతోషముతో నిర్భయముగా నిలబడి ఉన్నాడు. అదే సమయములో ఒక లేడి పరిగెత్తుకుంటూ అక్కడకు రాగా దానిని చూచిన పులి బెదిరి పారిపోయింది.


ఈ వింతను చూసిన పార్వతి శంకరునితో "ఏమాశ్చర్యం! ప్రభూ, ఎదురుగా చూడు" అన్నది. దానికి పరమేశ్వరుడు "దేవీ! మేము చూడనిదంటూ లోకంలో ఏ కొంచమూ లేదు. వాక్కులకు, మనస్సుకు అందని అద్భుతం నీకు చెబుతాను, విను" అంటూ చెప్పనారంభించాడు.


ఈ భిల్లుని పేరు దూరశ్రవుడు. పరమ ధార్మికుడు. ప్రతీరోజూ అడవికి వెళ్ళి కష్టపడి సమిధలూ, దర్భలూ, పుష్పాలూ, కందమూల ఫలాలూ తెచ్చి మునీంద్రులకిస్తాడు. ప్రతిఫలంగా తానేమీ కోరడు. ఆ మునులందరూ కూడా అతని పట్ల దయతో ఉంటారు.


అక్కడే దలాదనుడను మహాయోగి ఉన్నాడు. ఒకనాడు దలాదనుడు, "దత్తాత్రేయుడు స్మర్తృగామి (స్మరించిన‌వారి వద్దకు తక్షణమే వెళతాడు)" అని విన్న కథను తలుచుకొని, దత్తుని స్మరించాడు. మరుక్షణంలో దత్త యోగీంద్రుడు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. దలాదన మహర్షి ఆశ్చర్యానందాలు పెల్లుబికగా ఆయనను పూజించి, "ఓ దత్తాత్రేయ మహామునీ! నా ఆహ్వానం విని నీవు విచ్చేశావు. స్మర్తృగామివని విని, కేవలం పరీక్షించడానికే నిన్ను స్మరించాను. నా అపరాధం మన్నించు." అన్నాడు. అందుకు దత్త భగవానుడు ఆ మునితో "నా ప్రకృతి ఇటువంటిది. భక్తితోగాని, భక్తి లేకుండా కాని అనన్యచిత్తంతో నన్ను స్మరించిన వారి వద్దకు వెళ్ళి వారి కోరికలు తీరుస్తాను" అని చెప్పాడు. "నీవు తలచుకున్నందుకు వచ్చాను గదా, నీకు ఏమి కావాలో కోరుకో" అని దత్తుడు అడుగగా, దలాదుడు, "ఓ మునిపుంగవా! నేనేమీ అడగను. నీ మనస్సులో ఉన్నది, నాకు శ్రేయస్కరమైనది నాకు ప్రసాదింపుము" అన్నాడు.


శ్రీ దత్తాత్రేయుడు, "నా వజ్రకవచం ఉన్నది, తీసుకో" అని చెప్పగా, దలాదుడు అంగీకరించాడు. దత్తుడు తన వజ్రకవచమునకు సంబంధించిన ఋషినీ, ఛందస్సునూ చెప్పి, న్యాసం, ధ్యానం, ప్రయోజనము అన్నీ వివరించి చెప్పాడు.


#దత్తాత్రేయ ధ్యానమ్ :


జగత్తు అనే మొక్కకు దుంప వంటి వాడు, సచ్చిదానంద మూర్తి, యోగీంద్రచంద్రుడు, పరమాత్మ అయిన దత్తాత్రేయునికి నమస్కారము. ఒకప్పుడు యోగి, ఒకప్పుడు భోగి, ఒకప్పుడు నగ్నంగా పిశాచి వలె ఉండే దత్తాత్రేయుడు ప్రత్యక్ష హరి స్వరూపుడు. భుక్తి ముక్తి ప్రదాయకుడు. ఆయన ప్రతిదినమూ వారణాసిలో స్నానము, కొల్హాపురంలో జపము, మాహురీపురంలో భిక్ష స్వీకరించి, సహ్యాద్రిపై శయనిస్తాడు. ఆయన శరీరం ఇంద్రనీలమణి వలె, కాంతి వెన్నెల వలె, జటలు వైఢూర్యం వలే ఉంటాయి. కన్నులు తెల్లగా మైత్రితో, కనుపాపలు చాలా నీలంగా ఉంటాయి. కనుబొమలూ, గుండెలపై రోమాలూ, గెడ్డమూ, మీసాలూ నల్లగా ఉంటాయి. నవ్వు పొగమంచు కంటే చల్లగా, కంఠం శంఖం కంటే అందంగా ఉంటాయి. భుజాలు పుష్ఠిగా ఉంటాయి. బాహువులు పొడవుగా, చేతులు చిగుళ్ళ కంటే కోమలంగా ఉంటాయి. వక్షస్థలం విశాలంగా బలిసి ఉంటుంది. పలుచటి ఉదరంతో, విశాలమైన పిరుదులతో, అందంగా ఉంటాడు. కటి స్థలం విశాలంగా, తొడలు అరటిబోదెల వలె ఉంటాయి. చక్కటి మోకాళ్ళు, పిక్కలూ కలిగి ఉంటాడు. చీలమండలు గూఢంగా ఉంటాయి. పాదాల పైభాగాలు తాబేటి డిప్పల వలె ఉంటాయి. అరికాళ్ళు ఎర్ర తామర పువ్వుల వలె అందంగా ఉంటాయి.


ఆయన మృగచర్మమును వస్త్రంగా ధరిస్తాడు. ప్రతీక్షణమూ తనను తలచుకున్న వారి వద్దకు వెళుతుంటాడు. జ్ఞానోపదేశం చేయటమంటే ఇష్టం. ఆపదలు తొలగించటం ఆయన దీక్ష. సిద్ధాసనంలో నిటారుగా కూర్చుని ఉంటాడు. నవ్వు ముఖం. ఎడమచేత వరదముద్ర, కుడిచేత అభయ ముద్ర. బాలురు, ఉన్మత్తులు, పిశాచాలతో కలిసి తిరుగుతుంటాడు. త్యాగి. భోగి. మహాయోగి. నిత్యానందుడు. నిరంజనుడు, సర్వరూపి, సర్వదాత, సర్వగామి. సర్వకామదుడు. భస్మోద్ధూళిత శరీరుడు. మహాపాతకాలను నాశనం చేసేవాడు. భోగ మోక్ష ప్రదాయకుడు.


"ఇలా ధ్యానం చేసి అనన్యచిత్తంతో నా వజ్రకవచాన్ని పఠించాలి. సర్వత్రా నన్నే దర్శిస్తూ, నాతో సంచరించాలి" అని దత్తుడు తెలిపాడు.


దత్తుడు దిగంబరుడు, భస్మ సుగంధం పూసుకున్నవాడు. చక్రం, త్రిశూలం, డమ్రువు, గద అనే ఆయుధాలు ధరించినవాడు. పద్మాసనుడు. యోగీంద్రులూ, మునీంద్రులూ నిత్యమూ ఆయనను "దత్తా, దత్తా" అంటూ నమస్కరిస్తూంటారు.


#దత్తాత్రేయ వజ్రకవచమ్ 


ఓం, దత్తాత్రేయుడు సహస్రార కమలంలో ఉండి, శిరస్సును రక్షించుగాక. అనసూయేయుడు చంద్రమండల మధ్యభాగంలో ఉండి ఫాలాన్ని కాపాడుగాక. మనోమయుడు హం క్షం ద్విదళ పద్మభవుడై భ్రూమధ్యమును రక్షించుగాక. జ్యోతిరూపుడు రెండు కన్నులను, శబ్ద స్వరూపుడు రెండు చెవులను, గంధ స్వరూపుడు ముక్కును, రస స్వరూపుడు నోటిని, వేద స్వరూపుడు నాలుకను, ధర్మ స్వరూపుడు దంతాలను మరియూ రెండు పెదవులను కాపాడుగాక. అత్రిభవుడు నా చెక్కిళ్ళను, ఆ తత్వవేత్త నా ముఖమంతటినీ కాపాడుగాక. సర్వస్వరూపుడు, నా ఆత్మలో ఉండేవాడు షోడశారకమలంలో ఉండి, నా కంఠాన్ని రక్షించుగాక. చంద్రానుజుడు నా భుజ శిరస్సులను, కృతాదిభవుడు నా భుజాలను, శత్రుజిత్తు కొంకులను, హరి వక్షస్థలాన్ని కాపాడుగాక. కకారాది ఠకారాంతమైన ద్వాదశారకమలంలో ఉన్న వాయు స్వరూపుడు యోగీశ్వరేశ్వరుడు నా హృదయాన్ని రక్షించుగాక. పార్శ్వస్థితుడనే హరి నా పార్శ్వాలను, హఠయోగాది యోగజ్ఞుడు మరియు కృపానిధి నా కుక్షినీ కాపాడుగాక. డకారాది ఫకారాంతం కల దశారకమలంలో ఉండే అగ్ని స్వరూపుడు నా నాభిని, వహ్నితత్వమయుడైన యోగి నా మణిపూరకాన్ని రక్షించుగాక. కటిలోని బ్రహ్మాండ వాసుదేవ స్వరూపుడు నా కటిని కాపాడుగాక. బకారాది లకారాంతమైన షట్పత్రకమలాన్ని వికసింపచేసే జలతత్వమయుడైన యోగి నా స్వాధిష్ఠాన చక్రాన్ని రక్షించుగాక. సిద్ధాసనంలో కూర్చున్న సిద్ధేశ్వరుడు నా ఊరువులను కాపాడుగాక. వకారాది సకారాంతమైన నాలుగు రేకుల కమలాన్ని వికసింపచేసే మహీరూపుడైన వీర్యనిగ్రహశాలి, మోకాళ్ళపై హస్తపద్మాలు పెట్టుకున్నవాడు నా మూలాధార చక్రాన్ని, ఇంకా అన్ని వైపులనుండీ నా పృష్ఠాన్ని రక్షించుగాక. అవధూతేంద్రుడు నా పిక్కలను, తీర్థపావనుడు నా రెండు పాదాలను, సర్వాత్ముడు నా సర్వాంగాలను కాపాడుగాక.


కేశవుడు నా రోమాలను రక్షించుగాక. చర్మాంబరుడు నా చర్మాన్ని, భక్తిప్రియుడు నా రక్తాన్ని, మాంసకరుడు నా మాంసాన్ని, మజ్జాస్వరూపుడు నా మజ్జను, స్థిరబుద్ధి గలవాడు నా అస్థులను, వేధ నా మేధను, సుఖకరుడు నా శుక్రాన్ని కాపాడుగాక. దృఢాకృతి నా చిత్తాన్ని, హృషీకేశాత్మకుడు నా మనస్సును, బుద్ధిని, అహంకారాన్ని, ఈశుడు నా కర్మేంద్రియాలను, అజుడు నా జ్ఞానేంద్రియాలను రక్షించుగాక. బంధూత్తముడు నా బంధువులను కాపాడుగాక. శత్రుజిత్తు నన్ను శత్రువులనుండి కాపాడుగాక. శంకరుడు నా ఇల్లు, తోట, ధనం, పొలం, పుత్రులు మొదలైనవి రక్షించుగాక. ప్రకృతివిదుడు నా భార్యను కాపాడుగాక. శార్ ఙ్గభృత్తు నా పశువులను రక్షించుగాక. ప్రధానజ్ఞుడు నా ప్రాణాలను, భాస్కరుడు నా భక్ష్యాదులను, చంద్రాత్మకుడు నా సుఖాన్ని పాలించుగాక. పురాంతకుడు నన్ను దుఃఖం నుండి రక్షించుగాక. పశుపతి నా పశువులను, భూతేశ్వరుడు నా ఐశ్వర్యాన్ని పాలించుగాక.


విషహరుడు తూర్పున, యజ్ఞస్వరూపుడు ఆగ్నేయాన, ధర్మాత్మకుడు దక్షిణాన, సర్వవైరిహృత్ నైరృతి మూల, వరాహుడు పడమటి దిక్కున, ప్రాణదుడు వాయువ్యపు మూల, ధనదుడు ఉత్తరాన, మహాగురుడు ఈశాన్యాన, మహాసిద్ధుడు ఊర్ధ్వదిక్కున, జటాధరుడు అధోదిశన రక్షించాలి. ఆది మునీశ్వరుడు ఏ దిక్కు రక్షణ లేకుండా ఉంటే ఆ దిక్కును కాపాడాలి.


"ఈ నా వజ్రకవచాన్ని ఎవడు చదివినా విన్నా వాడు వజ్రకాయుడు చిరంజీవి కాగలడు. అతడు త్యాగి, భోగి, మహాయోగి, సుఖ దుఃఖ రహితుడు, సర్వత్ర సిద్ధసంకల్పుడు, జీవన్ముక్తుడు అయి వర్తమానంలో ఉంటాడు." అని చెప్పి దత్తాత్రేయ యోగి అంతర్థానం చెందాడు. దలాదుడు కూడా అది జపించి జీవన్ముక్తుడైనాడు. దూరశ్రవుడు అనే భిల్లుడు అప్పుడు దీనిని విన్నాడు. ఒక్కసారి విన్నంతనే వజ్రకాయుడయ్యాడు.


దత్తాత్రేయ కవచమంతా శివుని నోట విన్న పార్వతి, "ఈ కవచం మహత్మ్యమూ, ఉపయోగించే విధానమూ తెలియచేయ"మని అన్నది. వినయంగా అడిగిన పార్వతి ప్రశ్నకు, "ఓ పార్వతీ ఏకాగ్రతతో విను. ధర్మార్థకామ మోక్షాలకు ఇదే ఆధారం"


"ఇది ఏనుగులనూ, గుర్రాలనూ, రథాలనూ, కాలిబంట్లనూ, సర్వైశ్వర్యాన్ని ఇస్తుంది. పుత్ర మిత్ర కళత్రాది సర్వసంతోష సాధనము. వేదశాస్త్రాది విద్యలకు నిధానము. సంగీత, శాస్త్ర సాహిత్య, సత్కవిత్వాలను ప్రసాదిస్తుంది. బుద్ధిని, విద్యను, తలపును, ప్రజ్ఞను, మతిని, నేర్పును ఇస్తుంది. శత్రువులను శీఘ్రమే సంహరిస్తుంది. యశస్సును, కీర్తినీ పెంచుతుంది."


"దీనిని వెయ్యి సార్లు జపిస్తే ఎనిమిది మహారోగాలూ, పదమూడు సన్నిపాతాలూ, తొంభై ఆరు కంటిజబ్బులూ, ఇరవై మేహ రోగాలూ, పద్దెనిమిది కుష్ఠు రోగాలూ, ఎనిమిది విధాల గుల్మాలూ, ఎనభై వాత రోగాలూ, నలభై పైత్య రోగాలూ, ఇరవై శ్లేష్మ రోగాలూ, క్షయ, చాతుర్థికం మొదలైనవీ, మంత్ర యంత్ర, కుత్సిత యోగాదులూ, కల్పతంత్రాదుల వల్ల కలిగించినవీ, బ్రహ్మరాక్షసులూ, భేతాళులూ, కూష్మాండాది గ్రహాలూ, వీటి వల్ల కలిగినవీ, ఆయా దేశకాలాలలో ఉన్నవీ, తాపత్రయం వల్ల కలిగినవీ, నవగ్రహాల వల్ల ఏర్పడినవీ, మహాపాతకాల వల్ల కలిగినవీ, అన్ని రోగాలూ పూర్తిగా నశిస్తాయి. ఇది నిశ్చయం."


"పది వేలసార్లు జపిస్తే గొడ్రాలు పుత్రవతి అవుతుంది. ఇరవై వేలసార్లు జపిస్తే అపమృత్యుజయం లభిస్తుంది. ముప్ఫై వేల సార్లు జపిస్తే ఆకాశ సంచారం అలవడుతుంది. కోటిమార్లు జపిస్తే సర్వకార్యాలు సాధ్యమవుతాయి. లక్ష సార్లకే కార్యసిద్ధి కలుగుతుంది. సంశయం లేదు."


"విషముష్టి చెట్టు మొదట దక్షిణాభిముఖంగా ఒక్క నెల జపిస్తే శత్రువు వికలేంద్రియుడవుతాడు. వృద్ధికి మేడి చెట్టు మొదటా, సిరి కోసం లక్ష్మీ బిల్వం మొదటా, అరిష్టాదుల శాంతికి చింతచెట్టు మొదటా, ఓజస్సు కోసం రావి చెట్టు మొదటా, భార్య కొరకై తీయ మామిడి చెట్టు మొదటా, జ్ఞానార్థం తులసి చెంతా జపించాలి. సంతతి కావాలనుకొనేవారు గర్భగృహంలో, ధనార్థులు మంచి క్షేత్రాలలో, పశువులు కోసం గోశాలలో, ఏ కోరిక గలవరైనా దేవాలయంలోనూ జపించాలి."


"బొడ్డులోతు నీటిలో నిలబడి సూర్యుని చూస్తూ వేయిసార్లు జపించినవాడు యుద్ధంలోగానీ, శాస్త్రవాదంలో గానీ జయిస్తాడు. గొంతులోతు నీటిలో రాత్రిపూట కవచం పఠిస్తే, జ్వరం, అపస్మారం, కుష్ఠు మొదలైన రోగాలూ తాపజ్వరాలూ తొలిగిపోతాయి."


"ఏది ఏది ఎక్కడ స్థిరంగా ఉంటుందో, ఏది ఏది ప్రసన్నమైతే అది నివారణమౌతుందో దాని కొరకు అక్కడ జపిస్తే సిద్ధి కలుగుతుంది. ఇది నిశ్చయం."


అని శివుడు చెప్పాడు. ఈ వజ్రకవచాన్ని పఠించినవాడు దత్తాత్రేయ సమానుడౌతాడు. ఈ విధంగా దత్తాత్రేయుడు దలాదునికి చెప్పినది, శివుడు పార్వతికి తెలియచేశాడు. ఈ కవచమును పఠించినవాడు ఈ లోకంలో దత్తుని వలె యోగి, చిరాయుష్మంతుడు అయి చరిస్తాడు.

Thursday, December 24, 2020 0 comments By: visalakshi

ఉత్తర ద్వార దర్శనం - విశిష్టత*


భగవద్గీతలోని "సర్వారంభ పరిత్యాగీ:సర్వసంకల్ప సన్న్యాసి"అనే పదబంధాలలోని పరమార్ధం శరణార్ధి అయినవాడు స్వయం సంకల్పిత కర్మలు చేపట్టరాదని,భగవత్ సంకల్పం ఉంటే చేయగలమని..మన పూర్తి బాధ్యతను భగవంతునిపై మోపవలెనని సారాంశం.

 *వైకుంఠ ఏకాదశి విశిష్టత*


సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు.

ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకొని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే వేచి ఉంటారు.

ముక్కోటి రోజున మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై మూడు కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి.. భక్తులకు దర్శనమిస్తాడు. కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు.

ఈ ఒక్క ఏకాదశి.. మూడు కోట్ల ఏకాదశులతో సమానమట. అందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు.

ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే శివుడు హాలాహలం మింగాడు. సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే 'మార్గళి' మధ్య.. ముక్కోటి ఏకాదశి వస్తుందని చెబుతారు.

ముక్కోటి రోజున భక్తులు ఉత్తరద్వారం గుండా వెళ్ళి మహావిష్ణువును దర్శనం చేసుకొంటారు. ఏకాదశినాడు ఉపవాసం ఉండి, ద్వాదశినాడు అన్న దానం చేస్తే మంచిదని చెబుతారు.

పూజ, జపం, ధ్యానం లేదా ఉపాసన మొదలైన సాధనల ద్వారా మనసును మాధవుడిపై లగ్నం చేయాలి.

ఏకాదశి వ్రతంలో ఏడు నియమాలున్నాయి. ఒకటి దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి. రెండు.. ఏకాదశి రోజు మొత్తం- ఉపవాసం ఉండాలి. మూడు.. అబద్ధం ఆడకూడదు. నాలుగు స్త్రీ సాంగత్యం పనికి రాదు. ఐదు.. చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. ఆరు.. ముక్కోటి రాత్రంతా జాగరణ చేయాలి. ఏడు.. అన్నదానం చేయాలి.

ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించే రెండు పురాణ కథనాలు ప్రచారంలో ఉన్నాయి.

పర్వతమహర్షి సూచనమేరకు వైఖానసుడనే రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించినందువల్ల.. నరక బాధలనుభవించే అతని పితృదేవతలు విముక్తులై స్వర్గలోకానికి వెళ్లారట!

మురాసురుడి కథ రెండోది

కృతయుగంలో ముర అనే రాక్షసుడు దేవతలను, సత్పురుషులను బాధించేవాడు. దేవతలు తమ గోడు విష్ణుమూర్తికి విన్నవించారు. రక్షించమని ప్రార్థించారు. విష్ణువు మురాసురుడిపై దండెత్తి, మొదట రాక్షస సైన్యాన్ని సంహరించాడు. కాని, మురాసురుడు మాత్రం తప్పించుకొని వెళ్లి, సాగరగర్భంలో దాక్కున్నాడు. మురాసురుణ్ని బయటకు రప్పించే ఉపాయాన్ని విష్ణువు ఆలోచించి, ఒక గుహలోకి వెళ్లాడు.

విష్ణువు నిద్రిస్తున్నాడని భ్రమించిన మురాసురుడు, విష్ణువును వధించడానికి అదే అనువైన సమయమని కత్తిని ఎత్తాడు. అంతే! మహాలక్ష్మి దుర్గ రూపంలో అక్కడ ప్రత్యక్షమై, మురాసురుణ్ని సంహరించింది. విష్ణువు లేచి ఆమెను మెచ్చుకొని, ఆమెకు 'ఏకాదశి' అనే బిరుదునిచ్చాడు! అప్పటినుంచి ఏకాదశీ వ్రతం ప్రాచుర్యం పొందింది.

ఇందులోని తాత్త్విక సందేశం ఇలా వుంది. విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్రనిర్ణయం. ఉపనిషత్తులు తెలిపినట్లుగా, ప్రతి మానవ హృదయగుహలోను పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. అంత దగ్గరలో ఉన్న పరమాత్మను ఉద్ధేశించి ఏకాదశీ వ్రతాన్ని నియమంగా ఆచరించాలి.

ఉపవాసం ద్వారా పదకొండు ఇంద్రియాలను నిగ్రహంతో ఉంచుకుని, పూజ-జపం-ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించమని భావం. పంచజ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలతో కలుపుకుని మొత్తం పది. వాటితో పాటు.. మనస్సు అనే పదకొండు ఇంద్రియాల ద్వారా పాపాలు చేస్తారు మానవులు. ఆ పదకొండే అజ్ఞానానికి స్థానం.

అందుకే పదకొండు స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ని, జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశీవ్రతాన్ని నిష్ఠగా ఆచరించినవారు జ్ఞానవంతులవుతారని చెబుతారు.

ఇదీ హిందువులు పరమపవిత్రంగా భావించే ముక్కోటి ఏకాదశికి చెందిన పూర్తి సారాంశం.


వైకుంఠ ఏకాదశి నాడు ఆచరించవలసిన విధులు* 

 శేషతల్పం మీద శయనించే విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు ముక్కోటి దేవతలు వైకుంఠానికి తరలివెళ్లే సందర్భం- వైకుంఠ ఏకాదశి.

భక్తులందరికీ పరమ పవిత్రమైన ఈ రోజున ఆస్తికులు ఆచరించాల్సిన విధుల గురించి పెద్దలు ఈ విధంగా చెబుతున్నారు.

వైకుంఠ ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే నిద్రలేవాలి. స్నానానంతరం పూజాగదిని శుభ్రపరచుకుని తోరణాలతో అలంకరించాలి. వైకుంఠ ఏకాదశి విష్ణుమూర్తికి ప్రశస్తమైన తిథి కాబట్టి, హరికి ప్రీతిపాత్రమైన తులసీదళాలతో ఆ స్వామిని పూజించుకోవాలి.

ఈ రోజున విష్ణుమూర్తిని వైకుంఠద్వారం వద్ద దర్శించుకున్న మధుకైటభులనే రాక్షసులకి శాపవిమోచనం కలగడంతో... తమలాగానే వైకుంఠద్వారాన్ని పోలిన ద్వారం ద్వారా హరిని దర్శించుకునేవారికి మోక్షం కలగాలని వారు కోరుకున్నారట. ఉత్తర దిక్కు జ్ఞానానికి సూచన కాబట్టి.. ఇహలోకంలో కొట్టుమిట్టాడుతున్న తమ మనసుకి పరిపక్వత కలిగించమంటూ ఆ భగవంతుని వేడుకోవడం ఈ ఉత్తర ద్వార దర్శనంలోని ఆంతర్యంగా కనిపిస్తుంది.

ఏడాది పొడవునా ఏ ఏకాదశి రోజున ఉపవాసం చేయడం కుదరకున్నా, ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే అపార ఫలితం దక్కుతుందంటారు. మనలో ఐదు కర్మేంద్రియాలు, ఐదు జ్ఞానేంద్రియాలు, మనసు... ఇలా మొత్తం కలిపి ఏకాదశ ఇంద్రియాలు ఉంటాయి. 

ఈ ఏకాదశ ఇంద్రియాలనూ ఆ హరికి అర్పించే అరుదైన అవకాశమే ఏకాదశి వ్రతం.

ఇందుకోసం ముందురోజు రాత్రి నుంచే ఉపవాసం ఉండి, ఏకాదశి రోజున కేవలం తులసి తీర్థాన్నే స్వీకరిస్తూ, మర్నాడు ఉదయం ఎవరికన్నా అన్నదానం చేసిన పిదప భుజించాలి.

ఏకాదశి రోజు రాత్రి భగవన్నామస్మరణతో జాగరణ చేయాలి. ఇలా జాగరణతో మనసునీ, ఉపవాసంతో శరీరాన్నీ అదుపు చేసుకుని... వాటిని హరిధ్యానంలోకి మరల్చడమే ఏకాదశి వ్రత ఉద్దేశం. అందుకనే లౌకికమైన ఆలోచనలు వేటికీ తావివ్వకుండా కేవలం హరినామస్మరణ మీదే మనసుని లగ్నం చేయాలని చెబుతారు. 

 ఇలా నిష్ఠగా ఏకాదశి వ్రతాన్ని చేసినవారికి ఇహపర శాంతి లభిస్తుంది.

 *హరినామ స్మరణం...* 

 *సమస్త పాప హరణం ....* 


*మార్గశిర శుద్ధ ఏకాదశి ... గీతా జయంతి*

గీతా జయంతి హిందూ పవిత్ర గ్రంధం భగవద్గీత పుట్టినరోజు. 

భారతదేశం మరియు ప్రపంచ వ్యాప్తంగా హిందూ పంచాంగం ప్రకారం మార్గశిర శుద్ధ ఏకాదశి రోజున గీతాజయంతి జరుపుకొంటారు. 

గీత సాక్షాత్తు భగవానునిచేత పలకబడినది . 

కాబట్టి ఏ సందేహానికి తావులేకుండా భగవద్గీత పరమ ప్రామాణికమైన మానవజాతికి దివ్యమార్గాన్ని చూపే పవిత్రగ్రంథం.

 గీకారం త్యాగరూపం స్యాత్

 తకారమ్ తత్వబోధకమ్

 గీతా వాక్య మిదమ్ తత్వం

 జ్ఞేయమ్ సర్వ ముముక్షుభి:

 గీత అను రెండక్షరముల తాత్పర్యమును ఈ శ్లోకం తెలుపు చున్నది. 

"గీ" అనే అక్షరం త్యాగాన్నిను బోధించుచున్నది. "త" అనే అక్షరం తత్వాన్ని అంటే ఆత్మస్వరూపాన్ని ఉపదేశించుచున్నది. 

గీత అనే రెండుశబ్దములకు అర్థము ఇదేనని ముముక్షువులు తెలుసుకోవాలని పెద్దలు భోధిస్తున్నారు. 

త్యాగశబ్దానికి నిష్కామ యోగమైన కర్మ ఫలత్యాగమనీ లేక సర్వసంగపరిత్యాగమనీ అర్థము వుంది . అలాగే తత్వబోధన ఆత్మసాక్షాత్కారమనీ, బంధమునుండి విముక్తి కలగటం అనే అర్థం వుంది. ఈ పరమ రహస్యాన్నే గీతాశాస్త్రము ఉపదేశించుచున్నది. 

అటువంటి పరమ పావనమైన గీత భగవానుని నోట వెలువడిన మహాపుణ్యదినము మార్గశిర శుద్ధ ఏకాదశి. ఈరోజు ఆపవిత్రగ్రంథాన్ని సృజించినా మహాపుణ్యము వస్తుంది

ఇక పఠన ప్రభావాన్ని వర్ణించనలవికాదు. మానవాళికి సర్వ సమస్యలకు పరిష్కారాన్ని సూచించే జగద్గురువైన ఈ గ్రంథ రాజాన్ని ఈ రోజునుంచైనా పఠించటం మొదలెడదాం. 

  సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాననందనః|

 పార్థోవత్సః సుధీర్భోక్తాదుగ్ధం గీతామృతమ్మహత్||

ద్వాపరయుగంలో కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీ కృష్ణపరమాత్మ అర్జునుడి ద్వారా లోకానికి అందించిన బ్రహ్మవిద్య భగవద్గీత. అందుకే అంటారు, సర్వ ఉపనిషత్తులను ఒక ఆవుగా,అర్జునుడిని దూడగ మలిచిన కృష్ణుడు గోపాలకుడిగా, ఈ అర్జునుడనే దూడను ఆవు వద్ద పాలుత్రాగడానికి విడిచి, ఒక ప్రక్క అర్జునుడికి అందిస్తూనే, మరొపక్క లొకానికి పాలను(ఉపనిషత్ సారమైన గీతను)అందించాడట.

అందుకే గీత సకల ఉపనిషత్ ల సారం. అర్జునుడు కాక మరెవరి ద్వారానూ ఈ ఉపదేశం ఇంత చక్కగానూ శాశ్వతకాలమూ అందరికీ చేరదు. ఆ కారణంగా కృష్ణుడే బాగా ఆలోచించి తానే అర్జునునికి ఈ మోహబుద్ధిని పుట్టించి, ఇనుముతో వస్తువుని చేయించదలచినవాడు ఎలా ఇనుముని కొలిమిలో ఎర్రబడేలా కాలుస్తాడో, అలా అర్జునునికి శ్రీకృష్ణుడు నిర్వేదాన్ని కలిగించాడు. ఆ విషయాన్నే తన ఉపదేశంలో పరోక్షంగా చెప్పాడు, 

 మన వర్త్మానువర్టంతే మనుష్యాః పార్థ సర్వశః.

అంటే నేననుకున్న మార్గానికే వాళ్ళొస్తారు తప్ప నేను వాళ్ళ మార్గానికి వెళ్ళను.

ఎప్పుడో ద్వాపరయుగంలో చెప్పింది ఇప్పుడు పాటించాలా,ఇప్పటికి అప్పటికి చాలా తేడా అని

కొందరి భావం.

అప్పుడు మనిషిలో స్వార్ధం,అహం,లాభం,మోసం

ఇంకా ఎన్నో చేదు భావనలు ఉన్నాయో,ఇప్పటికి మనిషిలో ఆ గుణాలు ఎక్కువైపోయాయి,

కాబట్టి కాలం మారినా పరిస్థితులు మారినా

మనిషి నైజం,బుధ్ధి మారలేదు.....

ఏ యుగానికైనా ఏ రోజుకైనా మానవాళికి పనికి వచ్చే బోధనలు భగవద్గీత సొంతం

.ఇది ఆ మతం ఈ మతం అని కాకుండా సర్వ మాన వాళికి పనికి వచ్చే అపురూప గ్రంధం,అద్భుతాలను నింపుకున్న ఆదర్శ గ్రంధం..

మాహేశ్వర సూత్రాలు...

 

#మాహేశ్వర సూత్రాలు:


పూర్వం పరమశివుడు నాట్యం చేస్తూ తన ఢమరుకాన్ని పదునాలుగు పర్యాయాలు మ్రోగించగా,ఆ శబ్దం నుండి పుట్టిన అక్షరాలను ‘పాణిని’ అనే ఋషి గ్రహించి,పదునాలుగు వ్యాకరణ సూత్రాలుగ రచించాడు. ఈ సూత్రాలే  "మాహేశ్వర" సూత్రాలుగ పిలువబడుతున్నాయి, ఆ సూత్రాలే అక్షరాల పుట్టుకకి ముఖ్య భూమికలు. ఈ శ్లోకం చూడండి. " నృత్తావసానే నాటరాజ రాజో / ననాద ఢక్కాం నవ పంచవారం"

(నవ=తొమ్మిది. పంచ=ఐదు కలిపితే =14)

ఉద్ధర్తు కామః సనకాది సిద్ధాన్ /ఎతద్విమర్శే శివ సూత్రజాలం// అక్షరాలని సృష్టించి సూత్రీకరించింది పాణిని ఐతే, వాటికి వార్తీకం వ్రాసినది ‘వరరుచి’. వివరణాత్మకమైన భాష్యాన్ని వ్రాసినది ‘పతంజలి మహర్షి.’ అందుకనే "“వాక్యకారం వరరుచిం/ భాష్యకారం పతంజలిం/పాణినిం సూత్రకారంచ/ ప్రణతోస్మి మునిత్రయం// అని ముందుగా పైముగ్గురు మునులకి నమస్కరించి, పూర్వం  వ్యాకరణాన్ని, తద్వారా భాషని అభ్యసించేవారు. పదునాలుగు సూత్రాలని తెలుసుకొందాం.  ఇవి పరమేశ్వరుడు చేసిన ఢమరుక శబ్దం నుండి గ్రహింపబడినవి.


1‘అ ఇ ఉ ణ్’ (అకార, ఇకార, ఉకారాలు)

2‘ఋ లు క్’ (ఋకార అలుకారాలు)

3‘ఏ ఓం గ్’ ( ఏకార, ఓకారాలు)

4‘ ఐ ఔ చ్’ (ఐ కారము, ఔ కారము)

5‘హ య వ ర ట్’ (హకార, యకార, వకార, రకారాలు.)

6‘ల ణ్’ (లకారం)

7‘ఙ, మ, ఞ, ణ నం’ ( వర్గల యొక్క చివరి ఐదు అక్షరాలు )

8‘ఝ, భ య్’ ( ఝాకార, భకారాలు)

9‘ఘ,ఢ,ధ ష్’ ( ఘకారం, ఢ కారం, ధకారం)

10‘జ, బ, గ, డ ద శ్’ ( ఐదు అక్షరాలు )

11‘ఖ ఫ ఛ ఠ థ చ ట త వ్’ ( ఎనిమిది అక్షరాలు)

12‘క ప య్’ (క & ప )

13‘శ ష స ర్’( శకార, షకార,సకారాలు )

14‘హల్’ ( హకారం)

 



ఈ పదునాలుగు మహేశ్వరుని సూత్రాలు.


ప్రతి సూత్రం చివరఉన్న పొల్లు హల్లులు సులభంగా పలకడానికి నిర్దేశించబడినవి. అట్లే అచ్చులు, హల్లులు కూడ ప్రత్యాహార సంజ్ఞతో సులభంగ అర్థమయే రీతిలో నిర్దేశించబడినవి. అవి తొలి సూత్రములోని మొదటి అక్షరం ‘అ’ నాల్గవ సూత్రములోని చివరి హల్లు ‘చ్’ కలిపితే ‘అచ్’ సంజ్ఞ ఏర్పడి, వాటిమధ్య ఉండే అక్షరాలని ‘అచ్చులు’ అని వ్యవహరిస్తారని, ఐదవ సూత్రములోని మొదటి అక్షరం ‘హ’ని గ్రహించి పదునాల్గవ సూత్రములోని చివర ఉన్న ‘ల్’ అనే పొల్లుతో కలిపితే ‘హల్’అనే సంజ్ఞ ఏర్పడి వాటి మధ్య ఉండే అక్షరాలని ‘హల్’ అనే పేరుతో పిలుతురని పాణిని స్పష్టంగా సూచించాడు.   ఇట్టి సూత్రములతో ఎనిమిది అధ్యాయాలలో పాణిని  మహర్షిచే రచించబడిన తొలి వ్యాకరణ గ్రంథానికి “అష్టాధ్యాయి” అని పేరు. ఈ సూత్రాలకే ‘వరరుచి’ వార్తికాలని, “పతంజలి”భాష్యాన్ని రచించి లోకానికి ప్రసాదించారు.  ఇప్పటికీ ఇదే గొప్ప ప్రామాణిక గ్రంథము.


---వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

Wednesday, December 23, 2020 0 comments By: visalakshi

అష్టావక్ర మహర్షి...

 



#అష్టావక్ర_మహర్షి....


సకల విద్యావంతుడైన ఏకపాదునకు, సుజాతకు జన్మించిన వాడే అష్టావక్రుడు. ఏకపాదుడు గురుకులాన్ని నడుపుతూ, విద్యార్థులకు వేదవిద్య బోధించేవాడు. అయితే, విద్య బోధించే విషయంలో చాలా కఠినంగా ఉండేవాడు. ఈ విషయంలో నిద్రాహారాలు కూడా లెక్కచేసేవాడు కాదు. ఏకపాదునకు  వివాహమై చాలాకాలం వరకూ సంతానం కలుగలేదు. ఎన్నో నోముల ఫలితంగా సుజాత గర్భవతి అయింది. ఏకపాదుని ఆనందానికి అవధులు లేవు. సుజాతకు నెలలు నిండుతున్నాయి.


ఒకరోజు ఏకపాదుడు నిద్రాహారాలు కూడా లెక్కచేయకుండా తన శిష్యులచేత వేదాధ్యయనం చేయిస్తున్నాడు. విద్యార్థులు అలసిపోతున్నారు... అయినా గురువుకు భయపడి వేదాన్ని అభ్యసిస్తూనే ఉన్నారు. ఇది సుజాత గర్భంలో పెరుగుతున్న శిశువుకు బాధాకరంగా తోచింది. వెంటనే తన తండ్రితో ‘ తండ్రీ.., ఏమిటీ విద్యాబోదన ? శిష్యులు నిద్రాహారాలు లేక సొలసిపోతున్నారు. వారి ఆరోగ్యం పాడవుతోంది.ఈ విదమైన విద్యావిధానాన్ని మార్చుకో ’ అని గర్భంలోంచే సలహా ఇచ్చాడు. ‘తనకు పుట్టబోయే కుమారుడు.., తనకు సలహాయిచ్చేంత గొప్పవాడా’ అని ఏకపాదుడు అహంకరించి, ఆ గర్భస్థ శిశువును ఉద్దేశించి.. ‘నీ జన్మకు కారణభూతుడనైన తండ్రినే విమర్శించేంత ఘనుడవా నీవు ? వేదాధ్యయనమునకు వక్రముగా గురువునే విమర్శించిన పాపానికి ప్రతిఫలంగా నీవు ‘అష్టావక్రుడు’గా జన్మించు’ అని కోపంగా శపించాడు. ఆ గర్భస్థ శిశువు తన తండ్రి శాపాన్ని ఆనందంగా స్వీకరించాడు.


సుజాతకు తొమ్మిది నెలలు నిండాయి. ప్రసవ సమయం దగ్గర పడిందని., ఇక రెండు మూడు రోజులలో శిశు జననం జరుగుతుందని గ్రహించాడు ఏకపాదుడు. ప్రసవ సమయానికి అవసరమైన తిలలు, ఘృతము, ఇతర ధాన్యములు సంపాదించే నిమిత్తం ఏకపాదుడు జనకుని రాజ్యానికి వెళ్ళాడు. అక్కడ అనుకోని విధంగా వరుణుని కుమారుడైన వందితో వాదానికి దిగి ఓడిపోయాడు. పోటీ నియమానుసారం వంది.., ఏకపాదుని జల మధ్యంలో బంధించాడు. సరిగ్గా ఆ సమయంలోనే సుజాత., తన అన్న అయిన ఉద్దాలకుని ఇంట ఒక మగ శిశువును ప్రసవించింది. అయితే తండ్రి శాపానుసారం ఎనిమిది వంకరలు గల దేహంతో జన్మించాడు. అందుచేతనే అతనికి  ‘అష్టావక్రుడు’ అని పేరు వచ్చింది.


ఉద్దాలకుడు తన కుమారుడైన శ్వేతకేతునకు, అష్టావక్రునకు సమంగా వేదవిద్య నేర్పుతున్నాడు. ఒకరోజు అష్టావక్రుడు తన మేనమామ అయిన ఉద్దాలకుని తొడపైన కూర్చున్నాడు. అది చూసిన శ్వేతకేతువు గబగబా వచ్చి ‘నా తండ్రి తొడ మీద నేను కూర్చోవాలిగానీ., నువ్వెలా కూర్చుంటావు? వెళ్లి నీ తండ్రి తొడమీద కూర్చో.’ అని ఘర్షణకు దిగాడు. వెంటనే అష్టావక్రుడు తన తల్లి దగ్గరకు వెళ్లి ‘ అమ్మా..నా తండ్రి ఎక్కడ అని అడిగాడు’. ధన సంపాదనకై జనకుని సభకు వెళ్లారని చెప్పింది సుజాత. వెంటనే అష్టావక్రుడు జనకుని సభకు వెళ్లి., జరిగిన సంగతి తెలుసుకుని తన వాదనతో వందిని ఓడించి, తన తండ్రితో పాటు, గతంలో ఓడి బంధింపబడిన వారినందరినీ కూడా జలమధ్యం నుంచి విడిపించాడు. ఆ తర్వాత తన తండ్రిని తల్లికి అప్పగించి, తల్లికి ఆనందం కలిగించాడు.


అష్టావక్రునకు యుక్తవయస్సు వచ్చింది. వివాహం చేసుకోదలచి వదాన్యుని దగ్గరకు వెళ్లి అతని కుమార్తె అయిన ‘సుప్రధ’ను తనకు కన్యాదానంగా ఇమ్మని అర్థించాడు. వదాన్యుడు అతని శక్తిని పరీక్షింపగోరి ‘నీవు ఉత్తరదిశగా వెళ్లి, కుబేరుని పట్టణం దాటి, కైలాసగిరి చేరి, శివపార్వతులు సంచరించిన ప్రదేశం దాటి ముందుకు వెడితే ఒక స్త్రీ కనిపిస్తుంది. ఆమెను చూసి రా..అప్పుడు నా కుమార్తె ‘సుప్రధ’ నీకిచ్చి వివాహం జరిపిస్తాను’ అని పలికాడు.


అష్టావక్రుడు ఉత్తరదిశగా బయలుదేరాడు. ముందుగా కుబేర పట్టణం చేరాడు. కుబేరుడు అతనికి స్వాగతం పలికాడు. అష్టావక్రుడు, కుబేరుని ఇంట రంభ, ఊర్వసి, తిలోత్తమల నృత్యగానాలను ఆస్వాదిస్తూ ఒక సంవత్పరం అతిథిగా కాలం గడిపి, తిరిగి తన ప్రయాణం కొనసాగించి.. హిమాలయాలలో బంగారుమయమైన ఒక దివ్యభవనాన్ని చూసాడు. అక్కడ కొందరు సుందరీమణులు అష్టావక్రునకు స్వాగత మర్యాదలు జరిపి ఆ భవనంలోకి తీసుకుని వెళ్లారు. ఆ భవనంలోపల ఒక జగన్మోహిని చిరునవ్వుతో అష్టవక్రుని దగ్గకు వచ్చి ప్రేమగా అతనిని తన అభ్యంతర మందిరానికి తీసుకుని వెళ్లి, తన కోరిక తీర్చమని అర్థించింది. ‘తల్లీ.. నేను అస్ఖలిత బ్రహ్మచారిని. పరసతిని కూడుట ధర్మం కాదు. నన్ను విడిచిపెట్టు’ అని అర్థించాడు. ‘ఈ రాత్రికి మా ఆతిథ్యం స్వీకరించి వెళ్లండి’ అని కోరింది ఆ సుందరి. అంగీకరించాడు అష్టావక్రుడు. తెల్లారింది. అష్టావక్రుడు ప్రయాణానికి సిద్ధమయ్యాడు. అప్పుడా జగన్మోహిని అతని దగ్గకు వచ్చి ‘ మహాత్మా...పరసతిని అనే కదా మీ అభ్యంతరం. నన్ను వివాహం చేసుకోండి. మీ సతిని అవుతాను. కాదనవద్దు.’ అని అర్థించింది. ‘అమ్మా...నీవు బాలవు. నీ వివాహ విషయంలో నీ తండ్రిగానీ, సోదరుడుగానీ నిర్ణయం తీసుకోవాలిగానీ.. నీకుగా నీవు స్వతంత్రించి నిర్ణయం తీసుకునే అధికారం నీకు లేదు. నిజం చెప్పు. నువ్వెవరు?’ అని ప్రశ్నించాడు అష్టావక్రుడు. ఆమె అతని దర్మనిష్ఠకు సంతసించి ‘మహామునీ..నేను ఉత్తరదిక్కాంతను. మిమ్ములను పరీక్షింపమని వదాన్యుడు నన్ను పంపాడు. ఈ పరీక్షలో విజయాన్ని వరించారు. వెళ్లి సుప్రధను వివాహం చేసుకోండి.’ అని పలికింది. ఆ తర్వాత  సుప్రధ, అష్టావక్రుల వివాహం ఘనంగా జరిగింది.

---నామనసిధ్ధాంతి

రోలు..రోకలి.. తిరుగలి

 #పెళ్లి వేడుకల సమయంలో రోలు, రోకలి వంటివాటిని పూజిస్తారెందుకు? అది దేనికి సంకేతం తెలుసుకుందాం* 


రోలు, రోకలి, తిరుగలి ఈ మూడు మానవ జీవితంలో ముడివడి ఉన్నవి. ధాన్యం, జొన్నలు, సద్దలు, రావులు, తైదులు, కొర్రలు మొదలగు ధాన్యాలను మొదట దంచి వంటకు అనువుగా చేసుకొని అన్నం వండుకుంటారు. ఇక కందులు, పెసలు, శనగలు, మినుములు తిరుగలితో విసిరి పప్పులు చేసుకుంటారు. రుబ్బురోలుతో మినపపప్పు ఇతరములు రుబ్బుకొని పిండివంటలు చేసుకుంటారు. మనిషి తినాలి అంటే రోలు, రోకలి, తిరుగలి, రుబ్బురాయి ఇవి తప్పనివి. ప్రొద్దున్నే లేచి పిండి విసురుకోవటం, ధాన్యం దంచుకోవటం, మిరపకాయలు కారం కొట్టుకోవటం, పసుపు కొమ్ములు పసుపు కొట్టుకోవటం ఇవన్నీ నిత్యకృత్యములు. విసురుట, దంచుట, నూరుట గృహిణికి మంచి ఆరోగ్యసూత్రాలు. అప్పటి వారికి అందుకే రోగాలు వచ్చేవి కావు.


పెళ్లి కుదిరిందంటే రెండు నెలల ముందునుంచి వడ్లు దంచుకోవటం, కారం, పసుపు కొట్టుకోవటం, అరిసెల పిండి కొట్టుకోవటం, ఇవి పదిమంది కలిసి చేసేవారు. ఇపుడు యాంత్రిక యుగం వచ్చినది. అన్నిటికీ యంత్రాలే. అన్నీ రెడీమేడ్‌గా షాపులో దొరుకుతున్నాయి. కారం, పసుపు, పిండి, చివరికి ఊరగాయలు, కూరలు కూడా కొంటాము. వారు అందులో ఎన్ని కల్తీలు చేస్తున్నారో, మన ఆరోగ్యానికి ఎంత ఆపద రాబోతుందో

తెలియడం లేదు.వస్తువులతోపాటు రోగాలను కొంటున్నాము. రోగాలకు మందులు కొంటున్నాము. మందులు వాడిన పంటను తిని మనం కూడా మందులు వాడుతున్నాం.


అందుకే వివాహం, ఉపనయనం మొదలగు శుభకార్యాలలో మన సంప్రదాయాన్ని గుర్తుచేయటం, స్వయంగా అన్నీ సిద్ధంగా చేసుకోండి. మీరు తినండి, పదిమందికి పెట్టండి అనే రోలు, రోకలి, తిరుగలిని పూజిస్తాము. బలరాముడు నాగలిని, రోకలిని ఆయుధాలుగా ధరించాడు. నాగలితో భూమిని దున్ని, పంటను పండించి, ఆ పంటను రోకలితో దంచి భుజించండి అన్ని చెప్పిన బలరాముడు నిజమైన రైతుకు ప్రతినిధి. రోలు లక్ష్మీదేవి, రోకలి నారాయణుడు, తిరుగలి శివుడు, దాని పిడి పార్వతి. ఇట్లు ఆయా అధిష్ఠాన దేవతలను పూజించి ధనధాన్య సమృద్ధి కలగాలని ప్రార్థించడం రోలు, రోకలి, తిరగలిని పూజించడంలోని అంతరార్థము.


#లోకాన్ సమస్తాన్ సుఃఖినోభవంతూ! 🙏

Tuesday, December 22, 2020 0 comments By: visalakshi

కదండి..ద్విదండి..త్రిదండి..

 🙏ఓం నమః శివాయ🙏


#కదండి.. ద్విదండి... త్రిదండి అంటే ఏమిటి?


మనం ఎంతో మంది పీఠాధిపతులను లేదా యతీంద్రులను (స్వాములను) చూస్తూ వుంటాం. వారి చేతుల్లో కర్రలు పట్టుకోని వుండటం కూడా చూసివుంటాం. ఆ కర్రలను దండెములు అంటారు. అవి,  వైరాగ్యానికి, తాత్వికతకు, ద్వైత, అద్వైత మరియు విశిష్టాద్వైత భావానికి సంకేతాలు. వారి చేతిలో పొడవాటి కర్రలు ఎల్లవేళలా పట్టుకుంటారు. ఈ (దండాలు) కర్రలు వివిధ ఆకారాలలో ఉంటాయి. ప్రతీదానికి కూడా ఓ అర్థం ఉంది. గాలి, నీరు, భూమి, అగ్ని, ఆకాశం అనే పంచభూతాల (5) సమ్మేళనమే మనిషి, కాబట్టి సన్యాసులు అయిదు అడుడుగుల కర్రను ధరిస్తారు.


ఆ యతీంద్రులు తమ చేతి ధరించే, కర్రలలో ఏకదండి (ఒక కర్ర), ద్విదండి (రెండు కర్రలు), త్రిదండి (మూడు కర్రలు) అని మూడు విధాలుగా ఉన్నాయి. దండి అంటే కర్ర అని అర్థం. ఒక కర్రను (ఏకదండి) ధరించే వారు అద్వైత సిద్ధాంతాన్ని నమ్మేవారని అర్థం. అద్వైతం అనగా జీవాత్మ, పరమాత్మ ఒక్కటేననే సిద్ధాంతం. అంతరాత్మకు విరుద్ధంగా అక్రమ, అన్యాయ మార్గాన సంచరించినా, ప్రవర్తించినా ఆ పాపఫలితాన్ని బతికి ఉండగానే ఏదో ఒక రూపంలో ఇక్కడే తప్పకుండా అనుభవించక తప్పదు అనే సిద్ధాంతాన్ని వారు బోధిస్తారు. ఇది  జగద్గురు ఆది శంకరాచార్యుల వారు బోధించినది. ఈ అద్వైత సిద్ధాంతాన్ని అనుసరించే వారి చేతిలో జ్ఞానానికి సంకేతమైన రావిచెట్టు నుండి సేకరించిన ఒక కర్ర ఉంటుంది.


ఇక రెండవ సిద్ధాంతం ద్వైతం. రెండు కర్రలు కలిపి (ద్విదండి) ధరించి బోధనలు చేసేవారు ద్వైత సిద్ధాంతం అనసరించి బోధించేవారు. వీరి ప్రథమాచార్యుడు మధ్వాచార్యులు. వీరిని ‘ద్విదండి స్వాములు’ అంటారు వీరు విష్ణుభక్తులు. వీరు పరమాత్మ వేరు మరియు జీవాత్మ వేరు అని బోధిస్తారు. జీవుడు మిథ్య కాదు. అలాగే జడ జగత్తు కూడా మిథ్య కాదు. ఈశ్వరుడు ఎంత సత్యమో జీవజగత్తులు కూడా అంత సత్యం.


ఇక మూడవది విశిష్టాద్వైతం. మూడు కర్రలను కలిపి (త్రిదండి) భుజాన పెట్టుకునేవారిని తత్వత్రయం అనుసరించే వారు అంటారు. వీరిది భగవద్రామానుజాచార్యుల పరంపర. ఈ సిద్ధాంతం ప్రకారం, శరీరంలో జీవుడున్నట్లే, జీవునిలో అంతర్యామిగా శ్రీమన్నారాయణుడు ఉంటాడని, జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి సత్యాలని, ఈ మూడింటిని నారాయణ తత్వంగా నమ్ముతూ, జీవుడు ఆజ్ఞానంతో సంసార బంధంలో చిక్కుకుంటాడని, నారాయణుని శరణు వేడిన వారు భగవదనుగ్రహం వలన అజ్ఞానం నుండి విముక్తులై, మరణానంతరం నారాయణ సాన్నిధ్యం (మోక్షం) పొందుతారని, వారికి మరుజన్మ ఉండదని విశిష్ఠాద్వైతపు సిద్ధాంతాన్ని బోధిస్తారు .

ఈ మూడు కర్రలలో, ఒక్కో దండం ఒక్కోక్క తత్వానికి గుర్తు. ఒకటి జీవుడికి, ఒకటి ప్రకృతికి మరియూ ఒకటి పరమాత్మకి. మనం చూసే ఈ ప్రపంచం అంతా ఈ మూడు తత్వాలతోనే నిండి ఉంటుంది అని వేదం తెలియజేస్తుంది. వేదార్థాన్ని వివరించే పురాణాలు, ఇతిహాసాలు, వాంగ్మయాలు ఈ విషయాన్నే స్పష్టం చేస్తున్నాయి. తత్వాలు అన్నింటినీ మూడుగా విడదీయవచ్చు. అందులో మనం లెక్కకు అందనంత మంది జీవులు వుంటారు. రెండోది రకరకాల చిత్ర విచిత్ర రూపాలు మార్చుకొనే పంచభూతాత్మకమైన ప్రకృతి. ప్రకృతి అంటే అచేతనమైనది మరియు ప్రకృతికి జ్ఞానం ఉండదు. అందుకే దానిని అచిత్తు అని అంటారు. చేతన రహితమైనప్పటికీ చేతనమైన జీవ సంబంధంచే తన రూపాన్ని మార్చుకుంటుంది. కర్మ సంబంధం చేత సహజమైన జ్ఞానం కలిగి అణుస్వరూపుడైన జీవులు, ఈ ప్రకృతిని శరీరాలుగా దాల్చి ఉంటారు. ఎనభైనాలుగు లక్షల రకాల జీవులు ఈ విశ్వంలో వుంటారని చెబుతారు. ఈ జీవులంతా ప్రకృతిలో సంచరిస్తూ, కర్మ అనుభవాన్ని కష్టమైనదో లేక సుఖమైనదో ఎదో ఒకదాన్ని పొందుతూ ఉంటారు. ప్రకృతిని జీవరాశిని ఈ రెండు తత్వాలని నిరంతరం బయట లోపల వ్యాపించి వాటిని నిలబెట్టి, వాటికి కావల్సిన శక్తిని ఇచ్చి నడిపిస్తూ ఉండే తత్వం పేరే పరమాత్మ. ఈ పరమాత్మ అనే తత్వం మూడోది. ఈ మూడు తత్వాలు ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి, విడిచి ఉండటం అనేది లేనే లేదు. పరమాత్మ జీవాత్మ ప్రకృతిలలో వ్యాపించి ఉంటాడు. జీవుడు ప్రకృతిలో నిరంతరం ఉంటాడు. అంటే మరి ముక్తి ఉండదా అని అంటే అట్లాంటి సందేహం అవసరం లేదు. ప్రకృతి అనేక రకాలుగా అనేక గుణాలతో ఉంటుంది. ప్రకృతికి సత్వ, రజస్సు అని మరియు తమస్సు అనే గుణాలు కలిసి వుంటాయి. అందుకే మిశ్రమ తత్వం అని పేరు. రజస్సు, తమస్సు ఏమాత్రం లేని కేవలం సత్వం మాత్రమే ఉండే సుద్ద సత్వ ప్రకృతి విరజా నదికు ఆవల ఉండే ప్రకృతి. ఇవి రెండు కాక గుణములకు అతీతమైన కాలం అనేది ఒక ప్రకృతి. కాలం కూడా ప్రకృతిలో ఒక భాగమే, అందుకే అది సత్వ శూన్యం అని పేరు. ఇలా మూడు రకాలుగా ఉండే ప్రకృతి, ఎన్నో జీవులు, వీటికి వెనకల ఉండి నడిపించే పరమాత్మ ఈ మూడుతత్వాలని విశ్వసించి మనకు మార్గం చూపే యతులు త్రిదండాన్ని ధరించాలని శాస్త్రం యొక్క నిర్ణయం. ఈ మూడు దండాలను కలిపి కట్టి, ధరించిన వ్యక్తిని త్రిదండి అని అంటారు. చక్రం ధరించిన వాడిని చక్రీ అన్నట్టుగానే 'త్రిదండీ' అని సంస్కృతంలో పదం వస్తుంది, అదే తెలుగులో 'త్రిదండి' అని వ్యవహరిస్తాం. శ్రీవైష్ణవ సంప్రదాయంలో యతులు త్రిదండాన్ని ధరించాలని నియమం. వేదం కానీ, ఇతిహాసాలు ఇదే విషయాన్ని ప్రస్తావించాయి.


దత్తాత్రేయుడు అనే భగవంతుడు వేదోద్దరణకై ఎత్తిన అవతారం. కర్నాటక రాష్ట్రంలో, మండ్యా దగ్గరలో మేలుకోట క్షేత్ర ప్రాంతంలో ఆయన పాద చిహ్నాలు ఉంటాయి. అక్కడి పుష్కరిణికి దత్తాత్రేయ పుష్కరిణి అని పేరు. భగవంతుడు, అత్రి మహర్షికి అనసూయకు తనను తానే వారి పుత్రునిగా అర్పించుకోవడం చేత దత్తుడు అయ్యాడు. అందుకే ఆయన పేరు దత్తాత్రేయుడు అయ్యింది. వైదిక ధర్మాన్ని లోకానికి నెలకొల్పి ఉన్నాడు, ఆయనకూడా త్రిదండి సన్యాసి అని తెలుస్తున్నది. ఈ నాడు దత్తాత్రేయుడు అని మూడు ముఖములో, చూపించే దత్తాత్రేయుడు వేరే అని తెలుస్తున్నది. మనకు ప్రామాణికమైన గ్రంథాలు తెలిపే దత్తాత్రేయుడు తిదండి సన్యాసి అని తెలుస్తున్నది. అందుకే అవసరం ఏర్పడినప్పుడు తిదండి సన్యాసులు మేలుకోటలో దత్తాత్రేయుని వద్దకి వెళ్ళి తిదండాన్ని పొందే సంప్రదాయం ఉంది.  రామానుజుల వారి చరిత్రలో వారికి కుళోత్తుంగచోళుడి వల్ల ఏర్పడ్డ ఉపద్రవం నుంచి రామానుజుల వారిని తప్పించడానికి, కూరేశులు రామానుజులవారి దండాన్ని మరియు కాశాయాన్ని తాను ధరించి, రామానుజులవారిని పశ్చిమ దేశం వైపు పంపారు. రామానుజులవారు మేలుకోట ప్రాంతం చేరే సరికి వారి వద్ద త్రిదండం, కాశాయం లేదు. తిరిగి వాటిని పొందే అవకాశం లేదు. అందుకే వారు మేలుకోటలోని దత్తాత్రేయుడి వద్ద కొత్త త్రిదండాన్ని, కాశాయాన్ని ఉంచి స్వీకరించినట్లు చరిత్ర చెబుతుంది.


🙏🔱ఓం శ్రీ రుద్రాణీ సమేత శ్రీ రుద్రకోటేశ్వరాయ నమః🔱🙏🙏🔱🙏🔱🙏🔱🙏🔱🙏🔱🙏

Monday, December 21, 2020 0 comments By: visalakshi

మిత్రా సప్తమి....

 



ఈ రోజు మిత్రా సప్తమి*


మార్గశిర్ష మాసంలోని శుక్ల పక్ష సప్తమిలో మిత్రా సప్తమిని జరుపుకుంటారు. సూర్య సప్తమి రోజున సూర్యుడిని ఆరాధించడం హిందూ సంస్కృతిలో ఒక ముఖ్యమైన భాగం. ఈ పండుగను దేశవ్యాప్తంగా ఆనందంతో జరుపుకుంటారు.  సూర్యుడిని మిత్రా అంటే స్నేహితుడు అని కూడా పిలుస్తారు.  అందువల్ల *ఈ రోజును మిత్రా సప్తమి* అని కూడా జరుపుకుంటారు. ఈ రోజున భాస్కరుడిని భక్తులు  పూర్తి భక్తితో , ఆచారాలతో పూజిస్తారు. గంగా , యమునా వంటి పవిత్ర నదుల ఒడ్డున నిలబడి ప్రజలు సూర్యుడిని ఆరాధిస్తారు మరియు  నీటిని అందిస్తారు.


#మిత్రా సప్తమి యొక్క చారిత్రక ప్రాముఖ్యత*


సూర్యదేవ కశ్యప మరియు అతని భార్య అదితికి జన్మించారు. దీనిని అదితి పుత్రా అంటే అదితి కుమారుడు అని పిలిచేవారు. ఇతిహాసాల ప్రకారం , రాక్షసుల కోపం రోజురోజుకు దేవతలను ఇబ్బంది పెడుతున్నారు. అంతిమంగా రాక్షసుల సైన్యం తమ రాజ్యాన్ని స్వర్గం మీద స్థాపించింది , దీనివల్ల ప్రతి ఒక్కరూ కలత చెందుతారు , సమస్యకు పరిష్కారం కోసం వెతుకుతారు.  చుట్టుపక్కల అందరి దుస్థితిని చూసి , దేవతల తల్లి (దేవ మాతా) అదితి సూర్య భగవానుని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేస్తుంది. ఆదితి అంకితభావంతో సూర్య దేవుడు సంతోషించి ఆమె ముందు కనిపిస్తాడు. రాక్షసుల సమస్యను పరిష్కరించడానికి , అదితికి చెప్తాడు , దేవుని కుమారులను రాక్షసుల కోపం నుండి రక్షించడానికి అతను ఆమె గర్భం నుండి జన్మనిస్తాడు. దేవుడు చెప్పినట్లు , కొంత సమయం తరువాత అదితి గర్భం ధరిస్తుంది.


తన కొడుకును అన్ని ఇబ్బందులు మరియు బాధల నుండి రక్షించడానికి ఆమె వివిధ రకాల ఉపవాసాలు మరియు ఆరాధనలను చేస్తుంది. ఇవన్నీ చూసి కశ్యపుడు కలత చెందుతాడు , మరియు చాలా ఉపవాసాలు పాటించడం ద్వారా ఆమె శరీరాన్ని నొక్కిచెప్పకుండా , ఆమె ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని సలహా ఇస్తాడు. ఇది గర్భస్రావం కావచ్చు మరియు పిండానికి కూడా మంచిది కాదు.  దీనిపై అదితి తన భర్తకు పెద్దగా చింతించవద్దని చెబుతుంది , ఎందుకంటే ఆమె బిడ్డ భగవంతుని ఆశీర్వాదం మరియు ఏ శక్తి దానిని నాశనం చేయదు.  అదితి పవిత్ర సమయంలో కొడుకుకు జన్మనిస్తుంది.  అతను కథానాయకుడిగా మారి రాక్షసుల సైన్యాన్ని చంపుతాడు. ఆ విధంగా , దేవతలను ,  రాక్షసుల నుండి రక్షించడం. సూర్య ఉపనిషత్తు , భవష్య పురాణం , మత్స్య పురాణం , బ్రహ్మ పురాణం , మార్కండేయ పురాణం మరియు సంపూర్ణం సూర్యుని మహిమను వివరించే కొన్ని గ్రంథాలు.


#మిత్రా సప్తమి పూజ*


సూర్యదేవుణ్ణి అంకితభావంతో మిత్రా సప్తమి ఉపవాసం పాటించబడుతుంది. భగవంతుడిని ఆరాధించే ఆచారాలు మార్గశిర్ష నెల ప్రారంభంతో ప్రారంభమవుతాయి. ఇంద్ర సప్తమి రోజున సూర్యుడిని పూజిస్తారు. ఈ రోజున పరిశీలకుడు ఉదయాన్నే సూర్యోదయానికి ముందే లేచి తన దినచర్యలన్నీ పూర్తి చేసిన తరువాత స్వామిని ఆరాధిస్తాడు. సూర్యదేవుణ్ణి సరైన ఆచారాలతో పూజిస్తారు. పండ్లు , మరియు వివిధ రకాల వంటకాలు స్వామికి అర్పిస్తారు.


భక్తుడు  సప్తమిలో మాత్రమే పండ్లు తినాలి మరియు స్వీట్లు తినడం ద్వారా అష్టమిపై ఉపవాసం ముగించాలి. ఈ ఉపవాసం పాటించడం ద్వారా భక్తుడు దీర్ఘాయువు పొందుతాడు. ఈ రోజున సూర్యరశ్మిని గ్రహించడం చాలా పవిత్రమైనదిగా భావిస్తారు.


#మిత్రా సప్తమి యొక్క ప్రాముఖ్యత*


పూజా కార్యక్రమంలో కుటుంబ సభ్యులందరూ పాల్గొనాలి. స్వామిని ఆరాధించడానికి పండ్లు , పాలు , వర్మిలియన్ , బాదం , జీడిపప్పు మొదలైనవి *మిత్రా సప్తమి* రోజున తయారుచేస్తారు. హిందూ ఆచారాలలో ఇది చాలా పవిత్రమైన మరియు ఫలవంతమైన ఉపవాసంగా పరిగణించబడుతుంది. ఇది భక్తులకు శ్రేయస్సు మరియు సంపదను ఇస్తుంది.

ఫేస్బుక్ సౌజన్యంతో..ఈ బ్లాగులో ఈ టపా...

Friday, November 20, 2020 0 comments By: visalakshi

డాక్టర్ ఆధ్యాత్మిక వికాసం...



డాక్టర్ ఇనామ్‌దార్ ఆధ్యాత్మిక వికాసం*

సత్పురుషుని యొక్క అనుగ్రహం పొందడం అంత తేలిక కాదని తరచూ చెప్తూ ఉంటారు. బజారుకు వెళ్లి, కిరాణకొట్టులో తీసుకుని వచ్చేదికాదు సత్పురుషుల అనుగ్రహం. భక్తి, విశ్వాసాలు కలిగి ఉంటే సమయం వచ్చినప్పుడు సత్పురుషులే తమ అనుగ్రహాన్ని భక్తుని మీద కురిపిస్తారు.

డా.ఇనామ్‌దార్ దైవానుగ్రహం పొందిన వ్యక్తి. చిన్నవయసులోనే వైరాగ్యాన్ని సాధించడమే కాకుండా బాబా అనుగ్రహాన్ని పొందాడు. దురదృష్టవశాత్తు అతని పూర్తి పేరు, ఊరు తెలియలేదు. ఆయన వృత్తాంతాన్ని గిర్‌గాఁవ్ కి చెందిన రజని బార్కే అనే భక్తుడు ఇలా వివరించారు:

  

డా.ఇనామ్‌దార్ బాబా దైవత్వము గురించి, ఘనకీర్తి గురించి వినడమే కాకుండా చదివాడు కూడా. అందువలన, "అంతటి గొప్ప సత్పురుషుని పాదాలకు శరణు వేడాలి. ఆయన అనుగ్రహిస్తే నా ఈ మానవజన్మ యొక్క ఆధ్యాత్మిక లక్ష్యం నెరవేరుతుంది. కాబట్టి నేను వెంటనే శిరిడీ వెళ్లి బాబా దర్శనం చేసుకోవాలి" అని అతను అనుకున్నాడు. వెంటనే, 'ఏదో ఒకనాడు బాబా కరుణతో తనపై దృష్టి సారించి, ఉపదేశించి, ఆధ్యాత్మికోన్నతికి తోడ్పడతార'నే తలంపుతో శిరిడీ వెళ్ళాడు. శిరిడీలో వారంరోజులు ఉన్నాడు. అంతలో అతని చంచల మనస్సు, "ఎంతకాలం నేను ఇక్కడ ఉండాలి? బాబా నాకు మార్గదర్శనం చేయడం లేదు. అనవసరంగా నేనిక్కడ నా సమయాన్ని వృధా చేసుకుంటున్నాను. నా మనస్సు యొక్క చంచలత్వాన్ని అణిచివేసి, నాకు సరియైన మార్గం చూపే వేరొక సత్పురుషుణ్ణి చూసుకోవాలి" అని కలవరపడసాగింది.

మరుసటిరోజే డాక్టర్ బాబా అనుమతి తీసుకుని సతమ్ మహారాజ్‌ను కలవాలన్న ఆశతో ధానోలికి ప్రయాణమయ్యాడు. సతమ్ మహరాజ్ తన మనసుకు శాంతి ప్రసాదించి, ఉపదేశిస్తారని చాలా ఉత్సుకతతో ధానోలి చేరుకుని, సతమ్ మహరాజ్ ఎక్కడ ఉంటారో, ఆయనని ఎప్పుడు కలవాలో విచారించాడు. కానీ ఆ విషయంలో ఎవరూ అతనికి సహాయం చేయలేకపోయారు. ఎందుకంటే, సతమ్ మహరాజ్ ఒకేచోట ఎక్కువ కాలం ఉండటం చాలా అరుదు. డాక్టర్ ధానొలీలో రెండురోజులు ఉన్న తరువాత మళ్ళీ అతని చంచల మనస్సు కలవరపెట్టసాగింది. అతను ఒక ఎత్తైన కొండపైకి వెళ్లి కూర్చుని, "ఇంకా ఎన్ని రోజులు నేను ఇక్కడ నా సమయాన్ని వృధా చేసుకోవాలి?" అని ఆలోచనలోపడ్డాడు. మరుక్షణం సతమ్ మహరాజ్ అతని ముందు ప్రత్యక్షమై, "నీకు ఏ ఒక్క సత్పురుషుని మీదా  దృఢమైన విశ్వాసం  కలగలేదు. మరలాంటప్పుడు ఏ సత్పురుషుడైనా నీ పట్ల ఎలా ప్రసన్నులవుతారు? నీ చంచల మనస్సు పలువిధాలుగా పరుగులు తీస్తోంది. మరి ఆయన ఎలా నీకు ఆశ్రయమిస్తారు? నీ భక్తిలో సంపూర్ణ శరణాగతి లేదు. ముందు నీ మనస్సులో భక్తి నింపుకొని సర్వేంద్రియాలను ఒక్క సత్పురుషుని మీద కేంద్రీకరించు. అప్పుడు ఖచ్చితంగా నీ ఆధ్యాత్మిక లక్ష్యాన్ని చేరుకుంటావు" అన్న భావంతో ఉన్న ఒక అభంగాన్ని నిదానంగా గానం చేశారు. తరువాత సతమ్ మహరాజ్ డాక్టరును ఆశీర్వదించి, "తక్షణమే శిరిడీకి తిరిగి వెళ్ళమ"ని చెప్పారు.

తరువాత డాక్టర్ శిరిడీ చేరుకుని మసీదుకు వెళ్ళాడు. అతనిని చూస్తూనే బాబా నవ్వి, "భగవంతుడు పేరు వున్న ప్రతి ఒక్కదానిలో ఉన్నాడు. ఆయన సర్వవ్యాపి" అన్నారు. ఆ మాట వింటూనే అతను, "సత్పురుషులిద్దరూ ఒకే అంతర్‌దృష్టి కలిగి ఉన్నారు. ఇద్దరూ చెప్పే మాట ఒక్కటే!" అని ఆశ్చర్యపోయాడు. అదే డాక్టర్ జీవితంలో పెద్ద మలుపు. ఆ క్షణం నుండి డాక్టర్ బాబాకు అంకిత భక్తుడయ్యాడు. క్రమంగా అతని విశ్వాసం దృఢమవుతూ బాబా యందే అతని మనస్సు కేంద్రీకృతమయ్యింది. అతని విశ్వాసం బలపడేకొద్దీ ఇతర విషయాల పట్ల పూర్తి నిర్లిప్తత ఏర్పడి అంతరాంతరాలలో బాబాపట్ల భక్తి నిండిపోయింది. అలా బాబా అతన్ని అనుగ్రహించారు. బాబా ఆజ్ఞతో అతను తన మొత్తం జీవితాన్ని ఆయనకు సమర్పణ చేసుకున్నాడు. సౌరాష్ట్ర ప్రాంతమంతా బాబా మహిమను గానం చేస్తూ తిరిగాడు. చివరికి పోరుబందరును అతని స్వస్థానముగా చేసుకుని సౌరాష్ట్రలో 'గోంగ్డీవాలే బాబా'(the sadhu with a sheep’s blanket)గా ప్రసిద్ధిగాంచాడు.

                 సర్వం శ్రీసాయినాథార్పణమస్తు
Thursday, November 12, 2020 0 comments By: visalakshi

పద పల్లవులు

 


 తెలుగు సాహిత్యంలో ఎంతో ప్రసిద్ధి పొందిన పదపల్లవాలలో ఇవి కొన్ని. వీటిని ఎవరు రాశారో  చూద్దాం...


1. ‘‘నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు 

నా ఇచ్ఛయేగాక నాకేటి వెఱపు’’ 

*దేవులపల్లి కృష్ణ శాస్త్రి*


2. ‘‘కప్పివుంచితే కవిత్వం 

విప్పి చెబితే విమర్శ’’

*డా.సి.నారాయణరెడ్డి*


3. ‘‘ఉదయం కానేకాదు అనుకోవడం నిరాశ 

ఉదయించి అట్లానే వుండాలనుకోవడం దురాశ’’ 

*కాళోజి*


4. ‘‘గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్‌’’ 

*నన్నయ*


5. ‘‘అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతినాపలేరు’’ 

*సుబ్బారావు పాణిగ్రాహి*


6. ‘‘రాజే కింకరుడగు 

కింకరుడే రాజగు’’ 

*బలిజేపల్లి లక్ష్మీకాంతం*


7. ‘‘వలపెరుంగక బ్రతికి కులికి మురిసేకన్న 

వలచి విఫలమ్మొంది విలపింపమేలురా’’ 

*బసవరాజు అప్పారావు*


8. ‘‘నిఖిలలోకమెట్లు నిర్ణయించినగాని తిరుగులేదు విశ్వనరుడ నేను’’ 

*గుర్రం జాషువా*


9. ‘‘అత్తవారిచ్చిన నీవు కోరగ వ్రాసి ఇచ్చినాను’’ 

*కాళ్ళకూరినారాయణరావు*


10. ‘‘గాయపడిన కవి గుండెల్లో వ్రాయబడని కావ్యాలెన్నో’’ 

*దాశరధి*


11. ‘‘ప్రజకు రక్షలేదు పత్రికలేనిచో’’ 

*నార్ల వెంకటేశ్వర రావు*


12. ‘‘బావా, ఎప్పుడు వచ్చితీవు’’ 

*తిరుపతి వెంకట కవులు*


13. ‘‘తాంబూలాలిచ్చేశాను, తన్నుకు చావండి’’ 

*గురజాడ*


14. ‘‘మాకొద్దీ తెల్ల దొరతనము’’ 

*గరిమెళ్ళ సత్యనారాయణ*


15. ‘‘పరమేశా గంగ విడుము పార్వతి చాలున్‌’’ 

*శ్రీనాథుడు*


16. ‘‘ఇందు గలడందు లేడని సందేహము వలదు... ఎందెందు వెదకిచూచిన అందందే గలడు’’ 

*పోతన*


17. ‘‘నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లెమ్మా తోడబుట్టిన రుణం తీర్చుకుంటనే చెల్లెమ్మా’’ 

*గద్దర్*


18. ‘‘తాజ్‌మహల్‌ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలెవ్వరు’’ 

*శ్రీ శ్రీ*


19. ‘‘చిరునవ్వుల వరమిస్తావా చితినుంచి లేచొస్తాను మరుజన్మకు మాటిస్తావా ఈ క్షణమే మరణిస్తాను’’ 

 *వెన్నలకంటి*


20. ‘‘రావోయి బంగారి మావా నీతోటి రాహస్యమొకటున్నదోయీ’’ 

*కొనకళ్ల వెంకటరత్నం*


21. ‘‘వనిత తనంత తా వలచివచ్చిన చుల్కన కాదె యేరికిన్‌’’

*అల్లసాని పెద్దన*

 

22. ‘‘ఏ గతి రచియించిరేని సమకాలము వారలు మెచ్చరేగదా?’’ 

*చేమకూరి వేంకటకవి*


23. ‘‘ఎందరో మహానుభావులు అందరికీ వందనములు’’ 

*త్యాగయ్య*


24. ‘‘రాజుల్‌ మత్తులు, వారిసేవ నరకప్రాయంబు......’’ 

*ధూర్జటి*


25. ‘‘ఎప్పుడు సంపద కలిగిన అప్పుడు బంధువులు వత్తురు’’ 

*బద్దెన*


26. ‘‘భూమినాదియనిన భూమి ఫక్కున నవ్వు దానహీను జూచి ధనము నవ్వు’’ 

*వేమన*


27. ‘‘నను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లీ’’ 

*కంచర్ల గోపన్న*


28. ‘‘పల్లెటూరి పిల్లగాడా పసులగాసే మొనగాడా’’ 

*సుద్దాల హనుమంతు*


29. ‘‘నువ్వు ఎక్కదలచుకున్న రైలు ఎప్పుడూ ఒక జీవితకాలం లేటు’’ 

*ఆరుద్ర*


30. ‘‘తల్లి ఒక్కతె మనకు తెలుగోడా సవతిబిడ్డల పోరు మనకేలా’’ 

*వేముల శ్రీ కృష్ణ*


31. ‘‘వీరగంధము తెచ్చినారము, వీరుడెవ్వడొ తెల్పుడీ’’ 

*త్రిపురనేని రామస్వామి*


32. ‘‘మాదీ స్వతంత్రదేశం మాదీ స్వతంత్ర జాతి’’ 

*బాలాంత్రపు రజనీ కాంతరావు*


33. ‘‘ఉప్పొంగిపోయింది గోదావరీ తాను తెప్పున్న ఎగిసింది గోదావరీ’’ 

*అడవి బాపిరాజు*


34. ‘‘కూర్చుండ మా యింట కురిచీలు లేవు’’

*కరుణశ్రీ*

 

35. ‘‘ఊరు మనదిరా ఈ వాడ మనదిరా పల్లె మనదిరా ప్రతి పనికి మనమురా నడుమ దొర ఏందిరో వాని దూకుడేందిరో’’ 

*గుడ అంజయ్య*


36. ‘‘తను శవమై - ఒకరికి వశమై తనువు పుండై - ఒకరికి పండై ఎప్పుడూ ఎడారై - ఎందరికో ఒయాసిస్సై’’ 

*అలిసెట్టి ప్రభాకర్*


37. ‘‘మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే మమ్మల్ని విభజించి పాలిస్తోంది’’ 

*సావిత్రి*


38. ‘‘నేను పుట్టకముందే దేశద్రోహుల జాబితాలో నమోదై వుంది నా పేరు’’ 

*ఖాదర్ మొహియుద్దీన్*


39. ‘‘నా దేశాన్ని గూర్చి పాడలేను నీ ఆదేశాన్ని మన్నించలేను 

*బాలగంగాధర తిలక్*


40. ‘‘ఎక్కువ కులజుడైన హీనకులజుడైన నిక్కమెరిగిన మహానిత్యుడే ఘనుడు’’ 

*అన్నమయ్య*


41. ‘‘ఆరంభింపరు నీచ మానవులు విఘ్నాయాససంత్రస్తులై’’ 

*ఏనుగు లక్ష్మణ కవి*


42. ‘‘అమ్మదొంగా నిన్ను చూడకుంటే నాకు బెంగ’’ 

*పాలగుమ్మి విశ్వనాథం*


43. ‘‘క్రిష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ.. ప్రపంచపు బాధ అంతా శ్రీశ్రీ బాధ 

*చలం*


44. ‘‘వంటింటి సామ్రాజ్యానికి మా అమ్మే రాణి అయినా, గిన్నెలన్నిటిపైనా మా నాన్న పేరే’’

*విమల*

 

45. ‘‘గుండె గొంతుకలోన కొట్లాడుతాది కూకుండనీదురా కూసింతసేపు’’ 

*నండూరి సుబ్బారావు*


46. ‘‘మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు మచ్చుకైనా కానరాడు మానవత్వం ఉన్నవాడు’’ 

*అందెశ్రీ*


47. ‘‘చెరువులో దూకనా చెరువయ్యిపోదునా ఉరిపోసుకొందునా ఉరితాడు అవుదునా’’

*చెరబండరాజు*

 

48. ‘ఎంత చక్కనిదోయి ఈ తెలుగుతోట! ఎంత పరిమళమోయి ఈ తోటపూలు!’ 

*కందుకూరి రామభద్రరావు*


49. నాగేటి చాల్లల్ల నా తెలంగాణ నవ్వేటి బతుకుల్ల నా తెలంగాణ 

*నందిని సిధారెడ్డి*


50. ‘‘రాతిబొమ్మల్లోన కొలువైన శివుడా రక్తబంధం విలువ నీవు ఎరుగవురా’’

*మిట్టపల్లి సురేందర్*


"తెలుగదేలయన్న దేశంబు తెలుగేను 

తెలుగు వల్లభుండ.........

దేశభాషలందు తెలుగు లెస్స".(శ్రీకృష్ణదేవరాయలు...).....from F.B...

Thursday, November 5, 2020 3 comments By: visalakshi

దేవుడు..సద్గురువు.. శ్రీ సాయిబాబా

ఓం శ్రీ భగవత్స్వరూపాయ నమః



సాయితత్వం అంటే ప్రేమతత్వం.సద్గురువు తన శిష్యులకు జ్ఞాన మార్గాన్ని చూపించి వారిని తనతో పాటు ఆధ్యాత్మిక మార్గం లో నడిపిస్తూ దైవానికి దగ్గర చేస్తాడు.శిష్యుల అజ్ఞానాంధకారాన్ని పటాపంచలు చేసి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు.. దేవుడు మానవరూపం ధరిస్తే దాన్ని అవతారం అంటారు. అవతార మూర్తికి పంచతత్వాలపై నియంత్రణ ఉంటుంది. సాయి లో ఈ రెండు లక్షణాలూ స్పష్టంగా మనకు కనబడతాయి.. అందుకే సాయి కొందరికి సద్గురువు. కొందరికి దేవుడు.

సాయి బోధనలయిన జీవకారుణ్యం, సర్వమత సమానత్వం, సామాజిక సౌభ్రాతృత్వం మొదలైనవన్నీ మన ఆధునిక సమాజానికి ఉపయుక్తమైనవి.అందుకే ఆయన ప్రవచించిన ప్రేమతత్వం ఆయన సమాధి చెందిన ఇన్నేళ్ల తర్వాత కూడా ఖండఖండాంతరాల్లోనూ వ్యాప్తి చెందుతోంది. ఆయన సద్గురువా..దేవుడా.. అనే మీమాంస వీడి సాయి ప్రవచించిన విలువలను పాటించాలి.

 శరణు..శరణు..సాయి! సమర్థ సద్గురు సాయీ*

శరణు..శరణు..సాయి!

సమర్థ సద్గురు సాయీ! నీకు సాష్టాంగ నమస్కారం.

జీవ జంతువుల్లోనూ, జీవంలేని వస్తువుల్లోనూ నువ్వే ఉన్నావు.

పురుగు మొదలు పరబ్రహ్మ స్వరూపం వరకూ అంతా నువ్వే, అంతటా నువ్వే నిండి ఉన్నావు.

పర్వతాలు, నేల, ఆకాశం, గాలి, నీరు...అన్నిటిలోనూ నువ్వే ఉన్నావు.

సమస్త జీవరాశిలో నువ్వే వ్యాపించి ఉన్నావు.

భక్తులందరూ నీకు సమానమే.

నీకు ఇష్టమైనవి, అయిష్టమైనవి లేవు.

నిన్నే సదా స్మరిస్తూ, నీ చరణారవిందాల చెంతనే సదా  'శరణు శరణు సాయీ!' అంటే చాలు మా కోరికలన్నీ తీరుస్తావు. మా జీవిత పరమావధిని నెరవేరుస్తావు.

సంసారం మహాసముద్రం. దీనిని దాటటం చాలా కష్టం. విషయ సుఖాలనే కెరటాలు దురాలోచన అనే ఒడ్డును బలంగా తాకుతూ ధైర్యమనే వృక్షాలను పడగొడుతూంటాయి. అహంకారమనే గాలి రయ్యిన వీస్తూ మహా సముద్రాన్ని అల్లకల్లోలం చేస్తుంది. అలజడి రేపుతుంది. కోపం, అసూయ, ద్వేషాలనే మొసళ్లు నిర్భయంగా సంచరిస్తూంటాయి.

మరోపక్క 'నేను', 'నాది' అనే స్వార్థాల వంటి సుడిగుండాలు గిర్రున తిరుగుతూంటాయి. మంచితనం, వివేకం అనేవి ఆ సుడిగుండంలో పడి కొట్టుకుపోతూంటాయి. పరనింద, అసూయ, ఓర్వలేని తనం అనే చేపలు అక్కడక్కడా తిరుగాడుతూంటాయి."

ఇలాంటి మహాసముద్రమనే సంసారాన్ని దాటటం కష్టమే అయినా, మనకు సమర్థ సద్గురువైన సాయిబాబా అండగా ఉన్నారు. బాబా మహర్షులలో అగస్త్యుని వంటి వారు.    వ్యామోహాలు భౌతికవాంఛలపై ఆసక్తిని నశింపచేసే వారు.

బాబా ప్రకాశాలలో సూర్యుని వంటి వారు. సూర్యుడు జ్ఞానానికి సంకేతం. బాబా తన జ్ఞాన ప్రకాశాలతో భక్తుల మదిలో అలముకున్న అజ్ఞానపు చీకట్లను తొలగిస్తారు.

బాబా లీలలు దీపస్తంభాలు. అవి ఈ భవసాగరాన్ని సురక్షితంగా దాటించే వెలుగుదివ్వెలు.

బాబా! మా మనసులు చెదిరిపోనివ్వకుండా స్థిరంగా ఉంచు. మేము నిన్ను తప్ప మరేమీ  కోరము. నీ ఉపదేశాలను నిత్యం ఆచరిస్తాం. నీ లీలల్ని సదా గానం చేస్తాం. మా బుద్ధులు నీవు చూపిన దారిలో పయనించేలా చూడు" అని ప్రార్థిస్తే బాబా మనల్ని చేయిపట్టి నడిపిస్తారు.

దైవమెప్పుడవతరించినా ఆ రూపం ఎంతో సమ్మోహనపరుస్తుందట. దత్తావతారమైన సాయి రూపం కూడా అలానేఉండేదట. శ్రీసాయిబాబానుసన్నిహితముగాను,వాస్తవముగాను సేవించిన వారు బాబాను భగవదవతారముగా ఇప్పటికీ కొలుచుచున్నారు.  

బాబావారి సహచరులలో ఒకరు ఇలా వ్రాసారు: "బాబా సశరీరులుగా ఉన్నపుడు వారొక రూపుదాల్చిన భగవత్స్వరూపంగా తమ భక్తులకు భాసిల్లుతూ, తమ లీలాప్రబోధాల ద్వారా సాధకుల మార్గమును ప్రకాశింపజేయుచుండెడివారు. వారినశ్వరమైన దేహము మాయమైపోయినది గాని , దానిలో అప్పుడుండిన 'బాబా' మాత్రము ఇప్పటికిని అనంతశక్తి వలె నిలిచి  వారు సమాధి చెందకముందు భక్తులకు తోడ్పడినట్లే ఇప్పటికిని వారినాశ్రయించు అసంఖ్యాక భక్తులకు నిశ్శబ్దంగా సహాయపడుచున్నారు."

శ్రీ సాయి మా గృహమునందు ప్రకటితమై వారి దివ్య లీలలతో, ప్రబోధాలతో మమ్ములను అనుగ్రహించారు. మాలో కొలువై ఉండి సదా మమ్ములను ఆధ్యాత్మిక దారిలో నడిపించు "దేవుడు" శ్రీ సాయిబాబా. బాబా మాకు దేవుడు, గురువు, తండ్రి..అన్నీ తానే అయిమాకుటుంబంకు....ఆత్మబంధువులకు మార్గనిర్దేశం చేయుచున్నారు. 

మన చుట్టూ ఉన్న వారు విభిన్న మనస్తత్వాలతో ,భిన్న అభిప్రాయాలతో..భిన్న అభిరుచులతో ఉంటారు. అందరికీ అన్నీ తెలుపలేము.  "స్వానుభవంతో , సాధనతో భగవంతుని" తెలుసుకోగలగాలి తప్ప వాద ప్రతివాదాలు మనలో మూర్ఖత్వాన్ని పెంచి పోషిస్తాయి. 

దత్తావతారమైన శ్రీ సాయినాధుని అందరూ సద్గురువు గా కొలుస్తారు..శ్రీ సాయి కూడా ఎప్పుడూ తను ఒక ఫకీరు నని..గురువునని చెప్పేవారు. భక్తులకు మాత్రం వారు కొలిచే దైవంగా దర్శనమిచ్చారు. మాకు కూడా "లక్ష్మీ నృసింహ స్వామి" గా దర్శనమిచ్చారు.శ్రీ కృష్ణుడు విశ్వరూపం ని చూపినట్లు తనలో అందరినీ చూపారు బాబా. అలా బాబాతో మా అనుభవాల అనుభూతులు మాకే ఇంత అద్భుతంగా ఉంటే.. వారితో ఉండి వారి దర్శన అనుభవాలు.. సాయికి సేవ చేసే భాగ్యం..కలిగిన వారి సహచర భక్తుల జన్మ ధన్యం.


                    ●||ఓం సాయి రామ్ ||●

Tuesday, October 27, 2020 0 comments By: visalakshi

శివకేశవులు...

 


శివకేశవులకు భేదం లేదు. శివుణ్ణి పూజిస్తే విష్ణువును పూజించినట్టే.శివుణ్ణి ద్వేషిస్తే శ్రీహరినీ ద్వేషించినట్టే.ఈ పరమార్థాన్ని చెప్పేవే పంచారామాలు. శివరాత్రి నేపథ్యంలో మనరాష్ట్రంలోని ఈ అయిదు పవిత్ర క్షేత్రాల గురించీ.. మనుషులు సులభంగా మోక్షాన్ని పొందే మార్గం చెప్పమని ఓ సారి పార్వతీదేవి పరమ శివుణ్ణి అడిగిందట. అప్పుడు ముక్కంటి...


‘‘ శ్రీరామరామరామేతి రమేరామే మనోరమే 

సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ’


అని చెబుతూ.. ‘రామ నామాన్ని మించినది మరొకటి లేదు. ఈ ఒక్క శ్లోకాన్నీ చదివితే సహస్ర నామాలు చదివిన ఫలితం వస్తుంది’ అని సెలవిచ్చాడట.శివ, కేశవులు వేరు కాదనే సత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పడానికే పరమేష్ఠి అలా చెప్పాడట.ఇదొక్కటే కాదు..మన పురాణేతి హాసాలు ఎన్నో సందర్భాలు ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. 

శివకేశవులకుభేదం లేదనీ స్కందపురాణంలోనూ ఉంది.


‘ శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే 

శివస్య హృదయం విష్ణుర్విష్ణోశ్చ హృదయం శివః’


అంటే ... శివుని రూపమే విష్ణువు , విష్ణువు రూపమే శివుడు అన్నమాట. అలాంటి శివకేశవుల ఏకత్వానికి ప్రతీకలు పంచారామాలు.


నేను సంహరించలేను: తారకసురుడు పరమశివభక్తుడు తపస్సు చేసి శివుడి ప్రాణలింగాన్ని సంపాదించాడు. ఆ వర గర్వంతో దేవలోకం పైకి దండయాత్ర చేసి, ఇంద్రుణ్ణి ఓడిస్తాడు. దాంతో దేవతలంతా శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్లి తారకాసురుణ్ణి సంహరించమని కోరారు. అప్పుడు శ్రీహరి...‘తారకుడు శివభక్తుడు. శివుడి ప్రాణలింగాన్ని సంపాదించినవాడు. అందువల్ల నేను వధించలేను. మీరు శివుణ్ణే ఆశ్రయించండి’అని చెప్పాడు. అప్పుడు దేవతలు శివుడి వద్దకు వెళ్లి శరణువేడారు. ‘ నా ప్రియ భక్తుడైన తారకుణ్ణి నేనుచంపలేను. అలాగని మిమ్మల్ని కాదనలేను. అందుకే... కుమార స్వామి తారకుణ్ణి వధిస్తాడు’ అని చెప్పాడు శివుడు.


షణ్ముఖుడు దేవసేనకు సారథ్యం వహించాడు. తారకుడితో యుద్ధం చేశాడు. కానీ సంహరించలేకపోయాడు. కుమారస్వామి తన బలహీనతను తండ్రికి విన్నవించాడు. ‘తారకుడి కంఠంలో నా ప్రాణ లింగం ఉన్నంతవరకూ అతడు చావడు’అని రహస్యాన్ని చెప్పాడు శివుడు. అప్పుడు కుమారస్వామి తారకుడితో మళ్లీ తలపడి, అతడి గొంతులోని శివలింగాన్ని బాణంతో బద్దలుకొట్టాడు. శివలింగం అయిదు ముక్కలైంది. ఆ శకలాలు గోదావరి, కృష్ణా తీరాల్లో పడ్డాయి.ఆ ప్రాంతాలే పంచారామాలయ్యాయి. అవే అమరారామం, సోమారామం, క్షీరారామం, ద్రాక్షారామం, కుమారారామం.


ఈ కథలో శివకేశవుల ఏకత్వం కనిపిస్తుంది. అందుకే శివుడి ప్రాణలింగాన్ని కలిగిన తారకాసురుణ్ణి చంపడానికి శ్రీహరి అంగీకరించడు.శైవక్షేత్రాలైన ఈ పంచారామాల్లో దాదాపు అన్నింటికీ క్షేత్రపాలకుడు విష్ణుమూర్తే కావడం మరో విశేషం.


ద్రాక్షారామం శివాలయం, విష్ణ్వాలయం రెండింటితో పాటు శక్తిపీఠం కూడా ఉన్న ద్రాక్షారామం దివ్య క్షేత్రం. ఇక్కడ అమ్మవారు మాణిక్యాంబ.పురాణ కథ ఆధారంగా ఇది దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన చోటు. తారకుడి సంహారానంతరం శివలింగ భాగం ఇక్కడ పడిన తరవాత ఈ విషయాన్ని తెలుసుకున్న సప్తర్షులు.. సప్త గోదావరి తీర్థంలో భీమేశ్వరుడికి సుప్రభాత అభిషేకం చేయాలనుకున్నారు. మార్గమధ్యంలో తుల్యరుషి యజ్ఞం చేస్తున్నాడు. రుషులు తెస్తున్న గోదావరులు తన యజ్ఞాన్ని ముంచేస్తాయనుకున్నాడు. రుషులనూ, గోదావరులనూ వారించాడు. ఉభయపక్షాల మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఇంతలో తెల్లవారిపోయింది. శివలింగానికి సూర్య భగవానుడు ప్రథమ సుప్రభాత అభిషేకం చేశాడు. తరవాత వ్యాసమహర్షి వచ్చారు. రుషులను ఓదార్చి.. తాను అంతర్వాహినిగా సప్తగోదావరులను ఒక పుష్కరిణిలో చేర్చాననీ అది ‘సప్తగోదావరి’గా పిలవబడుతుందనీ, ఈ తీర్థంలోనే స్వామికి నిత్యాభిషేకం జరుగుతుందనీ చెప్పారు.


ద్రాక్షారామ భీమేశ్వరలింగం 2.5 మీటర్ల ఎత్తులో నలుపు, తెలుపు రంగుల్లో ఉంటుంది. అందుకే ఆలయం రెండు అంతస్తుల్లో ఉంది. అభిషేకాదులు పై అంతస్తులోని లింగభాగానికి చేస్తారు. ఈ ఆలయం తూర్పు చాళుక్యుల కాలంలో క్రీ.శ 892-922 మధ్య నిర్మితమైంది. ఆలయ స్తంభాలు,గోడలపై 800 కు పైగా శాసనాలున్నాయి.ఆలయ బాహ్య ప్రాకారం నాలుగు ప్రవేశద్వారాలు గల ఎతైన రాజగోపురాలతో నిర్మితమైంది. బాహ్య ప్రాకారంలో కాలభైరవాలయం త్రికూటాలయం ఉన్నాయి. ఆలయ తూర్పుగోపుర మార్గంలో ధ్వజస్తంభం ముందు రావి, వేప వృక్షాలున్నాయి. ఆ చెట్లనీడలో ఒక శివలింగం, ఒక విష్ణు విగ్రహం ఉన్నాయి. రెంటినీ శంకరానారాయణ స్వాములు అని పిలుస్తారు. భీమేశ్వరాలయానికి క్షేత్రపాలకులు లక్ష్మీనారాయణులు. ద్రాక్షారామ ఆలయంలో ఒక మసీదు కూడా ఉంది. ఇది సయ్యద్‌ షాఖాజీ అనే ముస్లిం గురువుది. భీమేశ్వరాలయం కాకినాడకు 28 కి.మీ దూరంలో ఉంది.


కుమారారామం కుమారారామం తూర్పుగోదావరి జిల్లా సామర్లకోటలో ఉంది. ఇక్కడ బాలా త్రిపుర సుందరీదేవి సహిత సోమేశ్వరుడు ఉన్నాడు. ఈ స్వామిని కుమారస్వామి ప్రతిష్ఠించాడు. శ్రీదేవీ భూదేవీ సమేత జనార్దునుడు ఇక్కడ క్షేత్రపాలకుడు. క్రీ.శ 892 నుంచి 922 వరకూ పాలించిన తూర్పుచాళుక్యులు సామర్లకోటలో కుమారారామ భీమేశ్వరాలయాన్ని నిర్మించారు. ఇందులో సుద్దరాయితో తయారైన లింగం కింది అంతస్తు నుంచి రెండో అంతస్తు వరకూ ఉంటుంది. ఆలయంలో కాలభైరవుడు, చంద్రమౌళీశ్వరుడు, ఉమాసమేత మృత్యుంజయ లింగం,నవగ్రహాల గుడి ఉన్నాయి. సామర్లకోట రాజమండ్రి నుంచి సుమారు 60 కి.మీ దూరంలో ఉంది.


క్షీరారామం ఇది పాలకొల్లులో ఉంది. ఇక్కడి శివుడు... క్షీరారామలింగేశ్వరుడు. ఒక కథనం ప్రకారం పంచారామాల్లోని మిగతా నాలుగు క్షేత్రాల్లో శివలింగ శకలాల ప్రతిష్ఠ ఒకే ముహూర్తాన వివిధ దేవతలతో జరిగింది.క్షీరారామంలో లింగాన్ని మాత్రం త్రేతాయుగంలో శ్రీరాముడు ప్రతిష్ఠించాడట. ఈ ఆలయ క్షేత్రపాలకుడు జనార్దనుడు. ఆలయ విశేషాల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది రాజగోపురం. 9 అంతస్తులతో 120 అడుగుల ఎత్తులో ఉంటుంది. చివరి అంతస్తు దాకా వెళ్లడానికి లోపలి నుంచి మెట్లు ఉన్నాయి. తెల్లగా ఉండే ఇక్కడి శివలింగం రెండున్నర అడుగుల ఎత్తుంటుంది. ఏటా ఉత్తరాయణ, దక్షిణాయన ప్రారంభంలో సూర్యోదయ సమయంలో సూర్యుని కిరణాలుపెద్ద గోపురం రెండో అంతస్తు నుండి శివలింగం పై పడతాయి. ఈ క్షేత్రం ఏలూరు నుంచి సుమారు 110 కి.మీ దూరంలో ఉంది.

సోమారామం ఇది భీమవరానికి రెండు కి.మీ దూరంలోని గునిపూడిలో ఉంది. ఈ ఆలయాన్ని సోమేశ్వర జనార్దన స్వామి ఆలయం అంటారు. తూర్పు చాళుక్యరాజైన చాళుక్య భీముడు ఈ దేవాలయాన్ని మూడో శతాబ్దంలో నిర్మించాడు. ఇక్కడి శివలింగానికి ఓ ప్రత్యేకత ఉంది. మామూలు రోజుల్లో తెలుపు రంగులో ఉండే శివలింగం అమావాస్యరోజు వచ్చేసరికి గోధుమరంగులోకి మారుతుంది. తిరిగి పౌర్ణమి నాటికి యథారూపంలోకి వచ్చేస్తుంది. ఇక్కడి స్వామిని చంద్రుడు ప్రతిష్ఠించాడు కాబట్టి దీనికి సోమారామం అని పేరు వచ్చింది. ఈ ఆలయం రెండు అంతస్తులుగా ఉంటుంది. సోమేశ్వరుడు కింది అంతస్తులోనూ,అన్నపూర్ణాదేవి పై అంతస్తులోనూ ఉంటారు. ఇలా శివుడి పైన అమ్మవారు ఉండటం దేశంలో మరెక్కడా లేదని చెబుతారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడు జనార్దన స్వామి.


అమరారామం శివుడి ఆదేశం ప్రకారం ఇంద్రుడు శివలింగ శకలం పడిన చోటుకు చేరుకున్నాడు. పెరిగిపోతున్న ఆ శివలింగాన్ని కృష్ణాతీరాన అమరావతిలో ప్రతిష్ఠించాడు. ఇక్కడి స్ఫటికలింగం ఎత్తు 16 అడుగులు.శివలింగం చుట్టూ రెండు అంతస్తుంలుంటాయి. అభిషేకాదులు రెండో అంతస్తులోనే చేస్తారు.అమరావతి ఆలయం మూడు ప్రాకారాలతో నిర్మితమైంది. మొదటి ప్రాకారంలో ప్రణవేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, ఉమామహేశ్వరుడు, అగస్త్యేశ్వరుడు, పార్థివేశ్వరుడు, సోమేశ్వరుడు, కోసలేశ్వరుడు, వీరభద్రుడు, త్రిపురసుందరీ దేవి ఆలయాలు , కల్యాణ మండపం, కృష్ణానదికి తోవ ఉన్నాయి. రెండో ప్రాకారంలో విఘ్నేశ్వరుడు,కాలభైరవుడు, కుమారస్వామి ఆలయాలు,నవగ్రహ మండపం,యజ్ఞశాల ఉన్నాయి. మూడో ప్రాకారంలో శ్రీశైల మల్లేశ్వరుడు, కాశీ విశ్వేశ్వరుడు, సూర్యడి ఆలయాలు ఉన్నాయి. ఇక్కడ క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి.ఈ ఆలయం గుంటూరుకు సుమారు 35 కి.మీ దూరంలో ఉంది.


               🍈🍈 మహాశివరాత్రి🍈🍈


#శివరాత్రి సందర్భంగా పరమ శివుని మహత్యం, విశేష కధనాలు*


‘శివ ఏవ కేవలః’ సృష్టికి పూర్వం నిరాకారము, నిర్గుణము, నామరూప రహితము అగు ‘సత్’ పదార్థమొక్కటి ఉన్నదని, అది శివుడని తెలుపుతున్నాయి, వేద మంత్రములు. సృష్టి, స్థితి లయములనే ధర్మముల వలన ఆయనకు బ్రహ్మ, విష్ణు, శివ అనే నామములు ఏర్పడ్డాయి. శివునికి ఉన్న నామ రూపములలో, ఒకానొక ప్రత్యేకత విశిష్ఠత ఉంది. పరమశివుని రూపములు రెండు. ఒకటి పురుష రూపం, రెండవది ‘లింగ’ రూపం.

🔥🔥🔥🔥🔥

*శివ శబ్దార్థం*


‘శం’ అంటే నిత్య సుఖం, ఆనందం, ‘ఇ’ కారము పరమ పురుషుడు, ‘వ’ కారం అమృత స్వరూపిణి యగు ‘శక్తి’. ఈ మూడింటి సమ్మేళనమే ‘శివ’ అవుతుంది. అనగా, ఆనందమయమైన శివశక్తి సంయోగమే శివ శబ్దార్థము.


సకల విధ కర్మలను తన వశంలో ఉంచుకొనేవాడు ‘వశి’ అని పిలువబడుతాడు. ‘వశి’యే ‘శివ’ అయింది. అనగా జితేంద్రియత్వం. కనుక ‘శివ’ అంటే జితేంద్రియుడని అర్థము. జితేంద్రియుడైన శివుణ్ణి ఆరాధిస్తే, అభిషేకిస్తే, ఉపాసిస్తే మనం కూడా జితేంద్రియుల మవుతాం. ఇంద్రియాల్ని జయించే శక్తిమంతుల మవుతాం అని పేర్కొన్నది శివపురాణం.


*‘శమయతీతి శివః’ అందరినీ బ్రహ్మానందంలో శమింపచేసే వాడు శివుడు*.


*‘శేతే సజ్జన మనస్సు ఇతి శివః’ సజ్జనుల మనస్సులో శయనించి ఉండేవాడు - శివుడు*.


*‘శివం వేదః తద్యోగాత్’ శివమనగా వేదము*.


‘ఓం శ్శాంతి శ్శాంతి శ్శాంతిః’ అని ఈ విశ్వానికి శాంతి మార్గాన్ని చూపి, ప్రపంచాన్ని శాంతింపజేయు, చేయగల వేదము శివమవుతుంది. దీని యోగము గలవాడు శివుడు.


‘శివప్రదత్వాత్ శివః’ మంగళములను శుభములను ఇచ్చేవాడు శివుడు.


*చతుర్దశి నాడే ఎందుకు చేయాలి?*


మహా శివరాత్రి మాఘ మాసంలోనే ఎందుకు చేయాలి? చతుర్దశి నాడే ఎందుకు ఆచరించాలి? మఖా నక్షత్రంలో పౌర్ణమికి సంబంధం గల మాసం - మాఘ మాసం. మానవుని అఘములను అనగా పాపములను హరించే మాసం, మాఘమాసం. త్రిమూర్త్యాత్మకుడైన సూర్య భగవానుని జయంతి మాఘమాసంలోనే వస్తుంది. మఖా నక్షత్రం సింహరాశిలో ఉంటుంది. సింహరాశికి అధిపతి రవి. మాఘ శుద్ధ సప్తమి నాడు సూర్యుడు మొదటిసారిగా భూమి మీదతన కిరణములను ప్రసరింప చేశాడని పురాణాలు చెప్తున్నాయి. చతుర్దశి, అమావాస్యలలో సూర్యుడు చంద్రుడు కలిసి ఉంటారు.


‘చంద్రమామనసో జాతః’ చంద్రుడు మనస్సుకు కారకుడు, అధిదేవత. చంద్రకళలు కృష్ణ పక్షంలో దినదినం క్షీణించి చతుర్దశి నాడు కేవలం ఒక కళే ఉంటుంది. అలాగే మనసుకు చేరిన పదహారు మాలిన్యములలో (అష్టమదములు -8, అరిషడ్వర్గములు -6, మనస్సు -1, అహంకారం -1) ఒక్కటే మిగిలి ఉంటుంది. ఆ శేషించి ఉన్న ఒక్క మాలిన్యాన్ని దూరం చేసికోవటానికి మాఘకృష్ణ చతుర్దశి శ్రేష్ఠమైన తిథిగాను, ఆ రాత్రి జ్ఞాన వెలుగునిచ్చే మహా శివరాత్రిగాను చెప్పబడింది.


*ఉపవాసము*:


*‘ఉప’ అనగా సమీపము. వాసము అంటే ఉండటము. ఈశ్వరునికి సమీపముగా ఉండటమే ఉపవాసమంటే*. అనగా ఆ రోజంతా దైవచింతనలో ఉండటం.

అభిషేకములు, బిల్వార్చన: ఈశ్వరుడు అభిషేక ప్రియుడు, విష్ణువు అలంకార ప్రియుడు, సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు. కనుక నమక చమకములతో మహన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం, వివిధ రకములైన అభిషేక ద్రవ్యములతోనూ, పంచామృతములతోనూ ఆచరిస్తారు. ‘త్రిగుణం త్రిదళాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం, ఏకబిల్వం శివార్పణం’ అంటూ బిల్వార్చన చేస్తారు. మానవులను ప్రభావితం చేసే సత్వ రజో తమో గుణములకు, త్రికాలములకు, తాపత్రయములకు మూడు దళములతో కూడిన బిల్వపత్రము బిల్వదళము - శ్రీ మహాలక్ష్మీ కటాక్షం. పుష్పించకుండా ఫలించే వృక్షం - మారేడు వృక్షం. ఈ శరీరమే ‘బిల్వదళము’ త్రిగుణముల ఏకత్వాన్ని సాధించినప్పుడే భగవంతుని అర్పణకు అర్హతను పొందుతుంది. ఏకత్వాన్ని తెలియపరచేదే ఈ బిల్వదళం. ఐదు జ్ఞానేంద్రియములు, ఐదు కర్మేంద్రియములు మనస్సు వెరసి పదకొండు తత్వాలు, మానవుని విషయ వాసనల్లోకి దింపి బంధములకు కారణభూతులౌతాయి. వాటిని మన అధీనంలో ఉంచుకోవటానికి ఏకాదశ రుద్రాభిషేకం*.


🌘 *జాగరణ*

జాగరణ అంటే నిద్రను జయించటం. ఏ విధంగా జయించాలి? నిరంతన భగవత్ చింతన, నామ సంకీర్తనములతో రాత్రి అంతా సత్కాలక్షేపము, సద్గోష్ఠితో గడుపుటయే జాగరణ. లక్ష్మణుడు అరణ్యవాస దీక్షను జాగరణతోనే గడిపాడు. పరబ్రహ్మ స్వరూపుడు, నాద సుధారస స్వరూపుడు అయిన ధర్మమూర్తి శ్రీరామచంద్రుని, చేతనా చేతన జీవరాశికి ప్రతీక అయిన లోకపావని సీతామాతను సేవిస్తూ గడిపి తరించాడు.

🔥🔥🔥🔥🔥

 


*మహాశివరాత్రి రోజున జాగారం(జాగరణ) చేస్తే పునర్జన్మంటూ ఉండదట!*


శివుడికి సంబంధించిన పండుగలన్నింటినిలోనూ ముఖ్యమైనది, పుణ్యప్రదమైనది మహాశివరాత్రి. ప్రతినెలా కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధశి తిథిని మాస శివరాత్రి అంటారు. మాఘ మాసంలోని కృష్ణ పక్షంలో వచ్చే చతుర్ధశికి మహాశివరాత్రి అని పేరు. శివరాత్రి పండుగను జరుపుకోవడంలో ప్రధానమైన విషయాలు మూడు ఉన్నాయి.


శివార్చన, ఉపవాసం, జాగరణం. శివరాత్రి రోజున సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి, స్నాన సంధ్యాది కార్యక్రమాలు పూర్తి చేసుకుని, శివలింగాన్ని షోడశోపచారాలతో పూజించాలి.


శివభక్తులను పూజించి వారికి భోజనం పెట్టాలి. శివాలయానికి వెళ్లి, శివదర్శనం చేసుకోవాలి ఇది శివార్చన. ఇక రెండోది ఉపవాసం. ఉపవాసమంటే శివరూపాన్ని ధ్యానిస్తూ, శివనామస్మరణం చేయడం మాత్రమే. కానీ ఉపవాసమంటే ఆహారం తీసుకోకుండా శరీరాన్ని బాధపెట్టడం కాదని వరాహోపనిషత్తు తెలియజేస్తోంది.


మూడోది జాగారం. శివరాత్రి నాటి సూర్యాస్తమయం మొదలు మర్నాడు సూర్యోదయం వరకు-నాలుగు జాములు నిద్రపోకుండా మేల్కొని ఉండటం. ఈ విధంగా జాగారం చేసిన వారికి మళ్లీ తల్లిపాలు తాగే అవసరం పునర్జన్మ నెత్తడం ఉండదని స్కాంద పురాణం చెబుతోంది. శివరాత్రి రోజున భగవన్నామ స్మరణం సమస్త పాపాలను నశింపజేస్తుంది.


శివరాత్రి నాడు చేసే జాగారాన్ని వ్యర్థ ప్రసంగాలతూనో, ఎటువంటి ప్రయోజనమూ లేని వాటిని చూస్తునో కాకుండా శివనామాన్ని స్మరిస్తూ, శివగాధలను చదువుకుంటూ శివలీలలను చూస్తూ చేసినట్లైతే కాలాన్ని సద్వినియోగం చేసుకున్నట్లవుతుంది. ఇంకా పుణ్యమూ, పురుషార్థమూ రెండూ లభిస్తాయని పురోహితులు చెబుతున్నారు.


పూర్వం గుణనిధి అనే దుర్మార్గుడు శివరాత్రి నాటి రాత్రి ఆకలితో ఒక శివాలయంలోకి వెళ్లాడు. నైవేద్యం కోసం ఉంచిన అన్నాన్నీ పిండి వంటలనూ కాజేద్దామనుకున్నాడు. తెల్లవార్లూ కునుకులేకుండానే ఉన్నాడు. దీప జ్వాల కొండెక్కుతుంటే వత్తిని ఎగదోశాడు. ఉత్తరీయం అంచును చించి, దారపు పోగులను వత్తిగా చేసి, ఆవునెయ్యిపోసి వెలిగించాడు.


ఆ వెలుతురులో అన్నపు గిన్నెను కాజేసి, పరిగెత్తుతూ తలారి వేసిన బాణపు దెబ్బవల్ల మరణించాడు. ఈ పుణ్యానికే ఆ గుణనిధి మరుజన్మలో కళింగ దేశాధిపతియైన అరిందముడికి దముడు అనే కుమారుడిగా జన్మించాడు.


ఆ జన్మలో మహారాజై, అనేక శివాలయాల్లో అఖండ దీపారాధనలు చేయించి, ఆ పుణ్యం వలన ఆ పై జన్మలో కుబేరుడిగా జన్మించి ఉత్తర దిక్పాలకుడైనాడు. ఇలా పరమేశ్వరుడికే ప్రాణసఖుడైనాడని పురణాలు చెబుతున్నాయి. అందుచేత మహాశివరాత్రి రోజున మనం కూడా ముక్కంటిని భక్తి శ్రద్ధలతో పూజించి పుణ్యఫలాల్ని పొందుదాం..!


ఓం  హర హర మహదేవ

🔥🔥🔥🔥🔥: 🔥🔥🔥🔥🔥


*అసలైన శివరాత్రి*


సృష్టి, స్థితి, లయము,చరాచర ప్రపంచములో నిత్యము జరిగే క్రియలు, 


*"ఒకే పరమాత్మ" పై మూడు శక్తుల రూపంతో పనిచేయుచున్నప్పుడు సృష్టి - అనగా సృజింపు, స్థితి - వ్యాపకత్వము (విస్తరించుట, నిలచి ఉండుట), లయము (నశించుట, కోల్పోవుట), ఇవి జీవ ధర్మములు*. 


*ఈ మూడు శక్తులకు అధిదేవతలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు - అందులో లయశక్తి కారకుడు పరమ శివుడు. శివరాత్రి సందర్భంలో శివుని పూజించి ఉపవాస జాగరణలతో పండుగ జరుపుతుంటారు.*


ఈ ఉపవాస జాగరణలు గురించి శ్రీ రామకృష్ణులు ఇలా శలవిచ్చారు. 


*గురువును విశ్వసించి, సాధన వల్ల భగవత్ కృపను పొందటమే జాగరణ*. 


అంటే అవిద్యను తొలగించుకొనడము. 


*రమణుల భాషలో చెప్పాలంటే నేను, నాది అనే భావన తొలగించుకోటము* -


* *ఉపవాసము గురించి 'ఉప' దగ్గిరగా “వాసము' అంటే నివశించటము. అంటే దగ్గరగా నివశించటము. దేవుని దగ్గరగా మనస్సును నిలిపి ఉంచటము*. 


*'ఆహారం' అనే మాటకు ఆదిశంకరులు మరొక అర్ధం యిచ్చారు - హరం అంటే అపహరణ, కన్నులు* 

మొదలైన జ్ఞానేంద్రియాలతో మనస్సు తీసుకొనే విషయజ్ఞానం ఆహారం అవుతుంది*. 


అసలు యింద్రియాలు పనిచేయకపోతే జీవించటం అసంభవం. కనుక ఆవశ్యకతమేరకు ఇంద్రియాలకు పని కల్పించి, బయటి విషయాలను, ఆకర్షణలను అరికట్టుకోటమే ఆహారము తీసుకోకుండా వుండే ఉపవాసంలోని అంతరార్థము.


జాగరణ - మేలుకొని వుండటము. ఏమరుపాటు కలిగివుండటము. జాగ్రత్తత కలిగివుండటము, అంటే ఈ పాంచభౌతిక దేహము అశాశ్వతమైనదనే భావనను సదా మనసులో నిలుపుకోగలగడమే “జాగరణ'లోని అంతరార్ధము.


ఆస్తికులు పై విషయాలను అనుభవములోనికి తెచ్చుకోటానికి,  శివరాత్రి వ్రతము చేసుకుంటారు.


 అందువలననే ప్రతినెల కృష్ణచతుర్ధశిని - మాస శివరాత్రిగా భావించి పూజ చేస్తారు. 


శివ పురాణంలో శివరాత్రి మహాత్యానికి సంబంధించిన ఒక కధ వుంది


, సుందర సేనక అనే నిషాదరాజు తన కుక్కతో వేటకోసము అడవికి పోతాడు. వేటలో జంతువులు దొరకక, ఆకలి దప్పులతో బాధపడతాడు. ఆకలిచే నిద్రరాక ఒక చెట్టుపైన ఆ రాత్రి అంతా మేల్కొంటాడు. చెట్టుపై వున్నప్పుడు అటు ఇటు కదలిన కదలికలకు చెట్ల ఆకులురాలి క్రిందపడతాయి. ఇంటివద్దనున్న తన భార్యాబిడ్డలగురించి దుఃఖించునప్పుడు అతని కన్నీరు క్రిందపడుతుంది. ఇంతకు 'ఆ చెట్టు క్రింద వున్నది శివలింగము, అతను ఎక్కిన చెట్టు బిల్వవృక్షము. ఆ రోజు కృష్ణ చతుర్ధశి (మహాశివరాత్రి) తెలియక, అమంత్ర పూర్వకముగా, అతను ఉపవాసము, జాగరణ, బిల్వపూజ, అభిషేకము చేసినందువల్ల శివలోక ప్రాప్తి కలిగింది.


తెలియక చేసిన ఆరాధనకే అంత ఫలిత ముంటుందని చెప్పిన అర్ధము. తెలిసి చేసుకుంటే ఇంకా మంచిదనే  సత్యాన్ని ఎరుక పరచుకోవాలి.

అవగాహనతో  మనము మన పండగలను జరుపుకోవాలి అన్నది ఆచార్యులవాణి .

"తెలిసి జరుపుకుంటే పండుగ లేకుంటే దండుగ"


ఇట్టి మహా శివరాత్రిని సధర్మాచరణతో గడిపి శివకృపకు  పాత్రులమవుదాం.

🔥🔥🔥🔥🔥

ఓం నమః శివాయl: 🔥🔥🔥🔥🔥

*ఏక బిల్వం శివార్పణం*


పరమ శివుని పూజించుకునేటప్పుడు మనం "ఏక బిల్వం శివార్పణం" అంటూ మారేడు దళాలను సమర్పించుకుంటూ పూజించుకుంటాము.


*ఙ్ఞానస్వరూపమయిన పరమాత్ముడే పరమశివుడు. మనలోని అఙ్ఞానాన్ని రూపుమాపి, ఙ్ఞానజ్యోతిని వెలిగించి, మన మనసులను పవిత్రం చేసి, నిర్మలమైన జీవనాన్ని కలిగించమని, ఙ్ఞానస్వరూపమైన మారేడు దళాలను స్వామికి సమర్పించుకుంటూ ఉంటాము*.


*మారేడు దళాలను పరిశీలించినప్పుడు మూడు దళాలు కలిసి ఒక్క కాండానికే ఉండాటాన్ని గమనించగలము. అందుకే, దీనికి బిల్వము అనే పేరు వచ్చింది.* 


 *ఈ మూడు రేకులకు ఆధ్యత్మికంగా పూజకుడు-పూజ్యము- పూజ / స్తోత్రము - స్తుత్యము- స్తుతి/ ఙ్ఞాత - ఙ్ఞ్యేయము - ఙ్ఞానము అనే అర్ధాలను చెబుతున్నారు. ఇలాగ ముడిటిని వేరు వేరుగా భావించటమే త్రిపుటి ఙ్ఞానము*.


*ఒక వృక్షానికి కొమ్మలు వేరు వేరుగా కనిపించి నప్పటికి, ఆధారకాండము ఒకటే అయినట్లు , సృష్టి, స్థిథి, లయ కారకుడైన ఆ మహదేవుడు మారెడు దళాలతో " మూడు పత్రాలుగా వేరు వేరు ఉన్నట్లు గోచరిస్తున్నాడు. కాని ఆయన సర్వాంత్రయామి!

బిల్వపత్ర దర్శనం వలన అత్యంత పుణ్యం లభిస్తుంది.వాటిని స్పృసించడంవలన వలన సర్వ పాపాలు నశిస్తాయి*.


ఓక బిల్వ పత్రాన్ని శివునికి భక్తిశ్రద్ధలతో అర్పించతం వలన, ఘోరాతిఘోరమైన పాపాలు సైతం తొలగిపోతూ ఉంటాయి. అటువంటి త్రిగుణాలుగల బిల్వ దళ్ళాన్ని స్వామికి అర్పించుకుంటే ఆయన అనుగ్రహం సులభంగ కలుగుతుంది.


"పూజకుడవు నీవే ,పూజింబడేది నీవే" - అనే భావంతో శివుని పూజించుతయే ఉత్తమమైన భావం. ఈ ఙ్ఞానరహస్యాన్ని తెలుసుకుని - బిల్వపత్రరూపంతో ' త్రిపుటి ఙ్ఞానాన్ని ' నీ పాదాల చెంత నేను సమర్పిస్తున్నాను అని స్వామికి విన్నపించుకుని " శివోహం, శివోహం " అనే మహావాక్య ఙ్ఞానాన్ని స్థిరపరిచేదే బిల్వార్చన అవుతుంది.


పవిత్రమైన ఈశ్వర పూజకు " బిల్వపత్రం " సర్వశ్రేష్టమైనది. శివార్చన కు మూడు రేకులతోనున్న పూర్తి బిల్వదళాన్ని ఉపయోగించాలి.

బిల్వదళాలు వాడిపోయినప్పటికి పూజర్హత కలిగి ఉంటాయి.


ఏక బిల్వ పత్రంలోని మూడు ఆకులలో ఎడమవైపునున్నది బ్రహ్మ అని, కుడి వైపు ఉన్నది విష్ణువు అని, మధ్యన ఉన్నది శివుడు అని చెప్పబడుతోంది.


ఇంకా బిల్వదళంలోని ముందు భాగం లో అమృతము, వెనుక భాగంలో యక్షులు ఉండటo చేత బిల్వపత్రం యొక్క ముందు భాగాన్ని శివుడి వైపుకు ఉంచి పూజ చెయ్యాలి.


బిల్వవనం కాశి క్షేత్రంతో సరిసమానం అని శాస్త్రవచనం. మారేడు చెట్ట్లు ఉన్న చోట శివుడు నివసిస్తాడు. ఇంటి ఆవరణ లో , ఈశన్యభాగంలో మారేడు చెట్టు ఉంటే , ఆపదలు తొలగి, సర్వైశ్వర్యాలు కలుగుతాయి!


తూర్పున ఉంటే సుఖప్రాప్తి కలుగుతుంది.

పడమర వైపు ఉంటే సుపుత్రసంతాన ప్రాప్తి, దక్షిణ వైపు ఉంటే యమబాధలు ఉండవు!


హర హర పార్వతి పతయే మహ దేవ 


🔥🔥🔥🔥🔥


*శివరాత్రి అంటే ?శివరాత్రి పూజావిధానం ఎలా ?*


 

వేదాలు ఇతిహాస పురాణాలలో ముఖ్యమైనవి. ఋగ్వేదం చాలా గొప్పది. ఇందులో ఉన్నటువంటి రుద్రం ఇంకా గొప్పది. పంచాక్షరీలోని శివ అనే రెండక్షరాలు మరీ గొప్పవి. శివ అంటే మంగళమని అర్థం. పరమ మంగళకరమైనది శివస్వరూపం. ఆ పరమ శివుని అనుగ్రహం పొందటానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి. పురాణాలలో చెప్పినటువంటి ఈ మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్థశినాడు జరుపుకుంటాం.


*శివరాత్రులు ఎన్ని ?*

 

శివరాత్రి వైదిక కాలం నాటి పండుగ. ఏడాదిలో వచ్చే *శివరాత్రులు మొత్తం అయిదు*. అవి : 

*నిత్య శివరాత్రి , పక్షశివరాత్రి , మాసశివరాత్రి , మహాశివరాత్రి , యోగశివరాత్రి.* వీటిలో *పరమేశ్వరుడి పర్వదినం మహాశివరాత్రి. మార్గశిరమాసంలో బహుళ చతుర్థి , అర్ద్ర నక్షత్రం రోజున శివుడు లింగోద్భవం జరిగింది*. శివునికి అతి ఇష్టమైన తిథి అది. అందుకే ఈరోజున శివుడ్ని లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా సరై పురుషోత్తముడు అవుతాడని పురాణాల మాట. ఈ రోజున శివ ప్రతిష్ట చేసినా లేక శివకళ్యాణం చేసినా ఎంతో శ్రేష్టం. మహాశివరాత్రి రోజు తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టులవుతారని శివుడు చెప్పడాన్ని బట్టి ఈ విశిష్టత ఏంటో అర్థం చేసుకోవచ్చు. త్రయోదశినాడు ఒంటిపొద్దు ఉండి చతుర్థశినాడు ఉపవాసం ఉండాలి. అష్టమి సోమవారంతో కూడి వచ్చే కృష్ణ చతుర్థశి నాటి మహాశివరాత్రి మరింత శ్రేష్టమైందంటారు.

 

లింగోద్భవ కాలం ప్రకారం జన్మాష్టమి నుంచి 180 రోజులు లెక్కిస్తే శివ రాత్రి వస్తుంది. రూపరహితుడైన శివుడు , జ్యోతిరూపంలో , లింగాకారంగా అవిర్భవించిన సమయం కనుక శివరాత్రిని లింగోద్భవకాలం అంటారు. ఈ పరమేశ్వరుడి 64 స్వరూపాలలో లింగోద్భవమూర్తి చాలా ముఖ్యమైనది. అర్థరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భవ సమయమని పురాణాలలో చెప్పారు. ఋగ్వేదం ప్రకారం భక్తజనులు ఆరోజు నిద్ర పోకుండా మేల్కొని ఉపవాసముండి , మహాలింగ దర్శనం చేస్తారు. ఉపవాస దీక్ష స్త్రీలు , పురుషులు కూడా ఆచరించదగినదే. ప్రపంచమంతా శివ శక్తిమయమని తెలుసుకోవాలి. శివలింగానికి ప్రణవానికి సామ్యముందంటారు.


ఆ పంధాలో చూస్తే ఈ శివలింగం ఆరువిధాలు ఇలా ఒక్కొక్క విధానంలో ఆరేసి లింగాలు ద్వివిదా ద్వాదశలింగాలుగా చెప్పబడుతున్నప్పటికీ , శివాగమాలరీత్యా మాత్రం ఆచార గర్వాది లింగాలే సరియైనవి కనుక ఈ ఆరులింగాలనే అనుదినం ఆరాధించాలి. పరమశివుడు శివరాత్రి పర్వదినమున ఎన్నో విధాలుగా ఆలంకరింపబడతాడు. ఆ స్వరూపాలలో విభూతిధారణ ఒకటి. విభూతి అంటే ఐశ్వర్యం. అది అగ్నిలో కాలిన శుద్ధమైన వస్తువు. ఈశ్వరుడు ఒంటి నిండా విభూతి అద్దుకుంటాడు. రెండవది రుద్రాక్ష. *రుద్రాక్ష అంటే శివుని మూడవ కన్ను*. అందరు దేవతలలో ఫాలభాగంలో కన్ను గలవాడు ఆయన ఒక్కడే.


మూడవది పంచాక్షరి జపం. *పంచాక్షరీ మంత్రోపదేశం లేనివారు శివనామాం జపిస్తే చాలు. నాలుగవది మారేడు దళాలతో శివున్ని పూజించడం. శివునికి మూడు దళాలుంటాయి. అయిదవది అంతరంగంలో శివ స్వరూపాన్ని ఎల్లవేళలా స్మరిస్తూ ఉండాలి. శివరాత్రి రోజున సాయంకాల సమయాన్ని ప్రదోషం అంటారు. త్రయోదశి వాటి సంధ్యాకాలం మహా ప్రదోషం. ప్రదోష సమయంలో శివస్మరణ , శివదర్శనం విధిగా చెయ్యాలి. వేదాలన్నింటికీ తాత్పర్యం ఓంకారం. ఆ ఓంకార స్వరూపమే పరమేశ్వరుడు. *‘శివ’* శబ్దాన్ని దీర్ఘంతీస్తే *‘శివా’* ఆవుతుంది. అది అమ్మవారి పేరు ఈ స్వరూప ధ్యేయమే జగత్తుకు తల్లిదండ్రులు. పార్వతీపరమేశ్వరులు , సూర్యుడు , అగ్ని ఈ మూడింటిలోను శివుడుంటాడు. పరమ శాంతినిచ్చేది శివనామస్మరణమే. శివస్మరణకు అందరూ అర్హలే. పరమ శివునికి చాలా ప్రీతికరమైనటువంటి తిథి నక్షత్రాలలో ఏకాదశి. ఈ తిథి నెలలో రెండుసార్లు వస్తుంది.


*ఒకసారి పార్వతీదేవి పరమశివుని దగ్గర శివరాత్రి గురించి ఆడుగుతుంది. అప్పుడు శివుడు శివరాత్రి ఉత్సవం తనకెంతో ఇష్టమనీ , ఇంకేమి చేయకుండా ఆ రోజు ఒక్క ఉపవాసమున్నాసరే తానెంతో సంతోషిస్తానని చెబుతాడు. ఆయన చెప్పిన దాని ప్రకారం , ఆ రోజు పగలంతా నియమనిష్ఠతో ఉపవాసంతో గడిపి , రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతో , తర్వాత పెరుగుతో , ఆ తర్వాత నేతితో , ఆ తర్వాత తేనెతో అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుంది. మరునాడు బ్రహ్మవిధులకు భోజనం పెట్టి తాను భుజించి శివరాత్రి వ్రత సమాప్తి చేయాలి. దీనిని మించిన వ్రతం మరొకటి లేదంటాడు పరమశివుడు. మామూలుగానైతే ఏ మాసమైనా కృష్ణపక్ష చతుర్దశిని శివరాత్రిగా భావిస్తారు. కానీ , ఫాల్గుణ మాసపు చతుర్దశికి ప్రత్యేకమైన మహత్తు ఉంటుంది. అందుకే శివరాత్రిని ఆ రోజున బ్రహ్మాండంగా చేసుకుంటారు. మహాశివుడంటే అందరికి తెలుసు. కాని , రాత్రి అంటే ప్రత్యేకార్థము చాల మందికి తెలియదు. *“రా” అన్నది దానార్థక ధాతు నుండి “రాత్రి”* అయిందంటారు. సుఖాన్ని ప్రదానం చేసేదాన్నే రాత్రి అంటారు. ఋగ్వేద – రాత్రి సూక్తం తాలూకు యూప మంత్రంలో రాత్రిని ప్రశంసిస్తూ ఇలా చెప్పబడింది – హే రాత్రే ! 

అక్లిష్టమైన తమస్సు మా దగ్గరికి రాకుండుగాక !… వగైరా –


*‘ఉప మాపేపిశత్తమః కృష్ణం వ్యవక్తమస్థిత్!*


*ఉష ఋణేవ యాతయ||’*


నిజంగానే రాత్రి ఆనందదాయిని అన్నింటికి ఆశ్రయం ఇవ్వగలది. అందుకే రాత్రిని ప్రశంసించటం జరిగింది. మహాశివరాత్రి వ్రతాన్ని రాత్రిపూటే జరుపుకుంటారు. అందువల్ల కృష్ణపక్ష చతుర్దశి రోజు వచ్చిన రాత్రికి ఓ ప్రత్యేకత వుంది. చతుర్దశి రోజు ఎవరైతే శివపూజను చేస్తారో , ఆ రాత్రి జాగరణ వహిస్తారో వారికి మళ్ళీ తల్లి పాలు తాగే అవసరం రాదు. అంటే ఆ భక్తుడు జీవన్ముక్తుడు అవుతాడని స్కందపురాణంలో స్పష్టంగా చెప్పబడింది. అంతటి మహిమాన్వితమైనది శివపూజ.


*‘శివంతు పూజయత్వా యోజా గర్తిచ చతుర్దిశీం!*


*మాతుః పయోధర రసం నపిబేత్ స కదాచన!!’*


అందుకేనేమో గరుడ , స్కంద , పద్మ అగ్ని మొదలైన పురాణాల్లో దీనిని ప్రశంసించడం జరిగింది. వర్ణనలలో కొంత తేడా వుండొచ్చు. ప్రముఖ విషయం ఒకటే. ఏ వ్యక్తి అయితే ఆ రోజు ఉపవాసం చేసి , బిల్వ పత్రాలతో శివపూజ చేస్తారో , రాత్రి జాగరణ చేస్తారో వారిని శివుడు నరకాన్నుండి రక్షిస్తాడు. ఆనందాన్ని , మోక్షాన్ని ప్రసాదిస్తాడు. వ్రతం చేసే వ్యక్తి శివమయంలో లీనమైపోతాడు. దానము , తపము , యజ్ఞము , తీర్థయాత్రలు , వ్రతాలు లాంటివెన్ని కలిపినా మహాశివరాత్రికి సరితూగలేవు. మహాశివరాత్రి రోజు ఉపవాసము , జాగరణ శివపూజ ప్రధానమైంది. అసలు వీటికి తాత్విక అర్థాలెన్నో ఉన్నాయి. అసలు వ్రతం గురించి భిన్న భిన్న గ్రంథాల్లో భిన్నార్థలు గోచరిస్తున్నాయి. వైదిక సాహిత్యంలో దీని అర్థం – వేద బోధితమని , ఇష్ట ప్రాపకర్మ అని వుంది. దార్శనిక గ్రంథాల్లో *‘అభ్యుదయ ‘ మని , ‘ నిః శ్రేయస్సు ‘ కర్మ అని , అమరకోశంలో వ్రతమంటే నియమమని వుంటే పురాణాల్లొ మాత్రం ధర్మానికి పర్యాయవాచిగా ఉపయోగించబడింది. అన్నింటిని కలుపుకుంటే – వేదబోధిత అగ్నిహోత్రాది కర్మ , శాస్త్ర విహిత నియమాది , సాధారణ లేక అసాధారణ ధర్మమే వ్రతమని చెప్పవచ్చు. సులభంగా చెప్పుకోవాలంటే కర్మ ద్వారా ఇష్ట దేవుడి సామీప్యాన్ని పొందటమే అని అనవచ్చు.


మహాశివరాత్రి వ్రతం రోజు ఉపవాసానికి చాలా ప్రాముఖ్యత నిచ్చారు. అలా అని *‘తిథితత్వం'* లో చెప్పబడింది. ఈ గ్రంథంలో భగవాన్ శంకరుడు ఇలా అన్నట్లు వుంది. – *‘ మీరు స్నానం చేసినా , మంచి వస్త్రాలు ధరించినా , ధూపాలు వెలిగించినా , పూజ చేసినా , పుష్పాలంకరణ చేసినా వీటన్నిటికంటే కూడా ఎవరైతే ఉపవాసం చేయగలరో వారంటేనే నాకిష్టం'* అంటాడు శివుడు.


*ఉపవాసం అంటే ఏమిటి ?*


దగ్గర వసించటం , నివశించటం , ఉండటాన్ని ఉపవాసమంటారు. వ్రతం చేసేవారి ఇష్టదైవం దగ్గర ఉండటమే ఉపవాసం – ఉపవాసమంటే ఇంతేనా అని పెదవి విరిచే వారికోసమే ఈ శ్లోకం.


*‘ఉప – సమీపే యో వాసః జీవాత్మ పరమాత్మనోః*


*ఉపవాసః సవిఘ్నేయ సర్వభోగ వసర్జిత్: ||’ (వరాహోపనిషత్తు)*


*భవిష్య పురాణంలో కూడా అలాగే చెప్పబడింది.*


*ఉపావృత్తస్య పాపేభ్యోయస్సు వాసో గుణైః సహా!*


*ఉపవాసః స విఘ్నేయ సర్వభోగ వివర్జిత్: ||*


మహాశివరాత్రి వ్రతంలో జాగరణ అవసరము. వ్రతానికి యోగ్యమైన కాలము రాత్రి. ఎందుకంటే రాత్రిపూట భూత , శక్తులు , శివుడు తిరిగే సమయమన్నమాట. చతుర్దశి రాత్రి ఆయనను పూజించాలి. భగవాన్ శ్రీకృష్ణుడు గీతలో ఇలా స్పష్టంగా చెప్పాడు. *‘సమస్త ప్రాణుల నిగ్రహ పురుషుడు రాత్రి కాలంలో మేల్కొని తిరుగుతుంటాడు. అతనిలోని ప్రాణులన్నీ జాగృతంగా ఉంటాయి. అంటే భోగ , సంగ్రహంలో మునిగి ఉంటారు. తత్వాన్ని అర్థం చేసుకోగల మునులు దృష్టిలో రాత్రి  అది*.


*‘యానిశా సర్వ భూతానం తస్యాం జాగర్తి సమ్యమీ*


*యస్యాం జాగృతి భూతాని సానిశాపశ్యతో మునే ‘*


విషయాసక్తుడు నిద్రలో వుంటే అందులో నిగ్రహస్తుడు ప్రబుద్ధంగా ఉన్నాడు. అందువల్ల శివరాత్రి రోజు జాగరణ ముఖ్యమన్నమాట. శివునితో ఏకీకరణమవటమే నిజమైన శివ – పూజ. ఇంద్రియాభిరుచుల్ని నిరోధించి పూజించటమే శివవ్రతము.

శివరాత్రి ఎలా చేసుకోవాలంటే – గరుడ పురాణంలో ఇలా వుంది – త్రయోదశి రోజునే శివ – సన్మానము గ్రహించి , వ్రతులు కొన్ని ప్రతిబంధకాల్ని గమనించాలి. అంటే కొన్ని నియమాల్ని మనసులో నిర్ధారించుకుని పాటించాలి. మీ ప్రకటన ఇలా ఉండాలి – *‘హే మహాదేవా ! నేను చతుర్దశి రోజు జాగరణ చేస్తాను. నా భక్తి సామర్ధ్యాన్ని బట్టి దాన , తప , హోమాన్ని చేయగలను. నేను ఆ రోజు నిరాహారిగా ఉంటాను. రెండవరోజు మాత్రమే తింటాను. ఆనంద , మోక్షాలను అనుగ్రహించు శివా !”*


వ్రతం చేశాక గురువు దగ్గరికి వెళ్ళాలి. పంచామృతంతో పాటు పంచగవ్యాలును (ఆంటే అయిదు విధములైన గో సంబంధిత వస్తువులు – ఆవు పేడ – ఆవు పంచకం , ఆవుపాలు , ఆవు పెరుగు , ఆవునెయ్యి) శివలింగాన్ని అభిషేకం చేయించాలి. అభిషేకం చేస్తున్న సమయంలో *‘ఓం నమః శివాయ‘* అనుకుంటూ జపించాలి. చందన లేపనంతో ప్రారంభించి అన్ని ఉపాచారాలతో పాటూ శివపూజ చేయాలి. అగ్నిలో నువ్వులు , బియ్యము , నెయ్యితో కలిపిన అన్నము వేయాలి. ఈ హోమం తర్వాత పుర్ణాహుతి నిర్వహించాలి. అందమైన శివకథలు వినవచ్చు. వ్రతలు మరోకసారి రథరాత్రి మూడవ , నాల్గవ ఝాములో ఆహుతులను సమర్పించాలి. సూర్యోదయం అయ్యేంతవరకూ మౌన పాఠం చేయదలచినవారు *‘ఓం నమః శివాయ* అంటూ భగవాన్ శివుని స్మరిస్తూ ఉండాలి. ఆయనను భక్తులు కోరుకునేది ఏమిటంటే – *'పరమాత్మా ! మీ అనుగ్రహంతో నేను నిర్విఘ్న పూజ కొనసాగించి పూర్తి చేసాను. హే లోకేశ్వరా ! శివ – భవా ! నన్ను క్షమించు. ఈ రోజు నేను అర్జించిన పుణ్యమంతా , మీకు అర్పితం గావించినదంతా మీ కృపతోనే పూర్తి చేశాను. హే కృపానిధీ ! మా పట్ల ప్రసన్నులు కండి ! మీ నివాసానికి వెళ్ళండి. మీ దర్శనమాత్రము చేతనే మేము పవిత్రులం అయ్యాము.


అటు తర్వాత శివ భక్తులకు భోజనము. వస్త్ర , ఛత్రములు ఇవ్వాలి. నిజానికి లింగోద్భవమైన అర్థరాత్రి సమయం ప్రతిరోజూ వస్తుంది కనుక ప్రతిరోజూ శివరాత్రే. ప్రతిక్షణం శివస్మరణయోగ్యమే. అయితే *కృష్ణపక్ష చతుర్దశి శివునికి ఇష్టమైన రోజు కనుక ప్రతినెలా వచ్చే ఆ రోజును మాసశివరాత్రి అన్నారు. అందులోనూ మాఘ బహుళ చతుర్దశి ఆయనకు మరీ మరీ ప్రీతి కనుక ఆ రోజున మహా శివరాత్రి జరుపు కుంటున్నాం. ఆ రోజు ఉదయం స్నానాదికాలం తర్వాత వీలైన శివాలయాన్ని దర్శించి , అవకాశం లేకపోతే , ఇంటివద్దే ఉమామహేశ్వరులను శివప్రీతికరమైన పువ్వులతో , బిల్వదళాలతో అర్చించాలనీ , శక్తికొలదీ పాలు , గంగోదకం , పంచామృతాదులతో లింగాభిషేకం చేయాలనీ , ఉపవాస , జాగరణ శివస్మరణలతో రోజంతా గడిపి మరునాడు ఉత్తమ విప్రులకు , శివభక్తులకు భోజనం పెట్టాలని వ్రత విధానన్ని బోధించారు.*

 


*శివరాత్రికి లింగోద్భవకాలమని* కూడా పేరు. ఆ రోజు అర్థరాత్రి జ్యోతిర్మయమైన ఒక మహాలింగంగా శివుడు ఆవిర్భవించాడు. పరమేశ్వరుడు లోకానికి తన స్వరూప దర్శనం చేయించి జగత్తంతా దేదీప్యమానం చేసిన ఆ సమయంలో మనం నిద్రపోవడంలో అర్థం లేదు. అందుకే శివరాత్రి జాగరణకు అంత ప్రాధాన్యం. ఆ రోజు అభిషేకాదులతో శివుని పూజించి ఉపవాసముండి రోజంతా శివనామస్మరణంతో గడపడంలోని ఉద్దేశం మన తనువునూ , మనసునూ కూడా శివార్పితం , శివాంకితం చేయడానికే. *శివమంటే జ్ఞానమే. జన్మ పరంపర శృంఖాలాలను తెంచి నిత్యానంద ప్రదమైన మోక్షాన్ని అందించే శక్తి ఆ జ్ఞానానికే ఉంది.


శివరాత్రినాడు పధ్నాలుగు లోకాలలోని పుణ్యతీర్థాలు  *'బిల్వ'* మూలంలో ఉంటాయనీ , శివరాత్రినాడు ఉపవసించి ఒక్క బిల్వమైన శివార్పణ చేసి తరించమని శాస్త్రం చెబుతోంది. కనీసం జన్మకొక్క శివరాత్రి అయినా చేయమని పెద్దలు చెబుతుంటారు. సమస్త ప్రాణికోటిలో సూక్ష్మజ్యోతిరూపంలో ఉండే శివుడు భూమిపై పార్థివలింగంగా ఆర్చింపబడుతుంటాడు. శివరాత్రినాడు ఫలం , ఒక తోటకూర కట్ట అయినాసరే శివార్పణం అని దానం చేయడం ముక్తిదాయకం. కలిగినవారు వారి వారి శక్తి అనుసారం బంగారం , వెండి కుందులలో ఆవునేతి దీపం వెలిగించి ఓ పండితునికి సమర్పిస్తే అజ్ఞానంధకారం నశిస్తుందని పెద్దలవాక్కు. శివరాత్రినాడు ఉపవసించి త్రికరణ శుద్ధిగా శివుని ఆరాధిస్తే , ఒక సంవత్సర కాలం నిత్యం శివార్చన చేసిన ఫలం కలుగుతుందని సాక్షాత్తు శంకరుడు బ్రహ్మదేవునికి చెప్పినట్లు పెద్దలవాక్కు*.


*ప్రదక్షణ విధులు* 


*శివాలయములో ప్రవేశించిన తర్వాత నందికి ఏ ప్రక్కనుంచి లోపలకు వెళ్తారో ఆ ప్రక్కనుంచి మాత్రమే , వెనక్కి రావాలి. శివలింగం , నందీశ్వరుల మధ్య నుంచి రాకూడదు. ఇలావచ్చినా పుణ్యం రాదు సరి కదా పూర్వ జన్మలోని పుణ్యం కూడా పోతుంది.*


*బిల్వ దళం ప్రాముఖ్యత:*


*బిల్వం లేదా మారేడు దళం అంటే శివుడికి మహా ఇష్టం. బిల్వ దళం మూడు అకుల్ని కలిగి ఉంటుంది. ఇందులో కుడి ఎడమలు విష్ణు , బ్రహ్మలైతే మధ్యలో ఉండేది శివుడు. మారేడుకే శివప్రియ అని మరోపేరు ఉంది. బిల్వదళం పొరబాటున కాలికి తగిలితే ఆయష్షు క్షీణిస్తుందంటారు. ఇది శివుడి అజ్ఞ. బిల్వం ఇంటి అవరణంలోని ఈశాన్యంలో ఉంటే ఐశ్వర్యం. తుర్పున ఉంటే సౌఖ్యం. పశ్చి మాన ఉంటే సంతానాభివృద్ధి. దక్షినాన ఆపదల నివారణ. వసంతం , గ్రీష్మంలో బిల్వంతో శివున్ని పూజిస్తే అనంతకోటి గోదాన ఫలితం కలుగుతుంది.*

              **ఓం నమో శివకేశవాయ నమః**