Sunday, July 30, 2017 2 comments By: visalakshi

సుయజ్ఞోపాఖ్యానము

  శ్రీ గురుభ్యో నమ:


"నిగమములు వేయిజదివిన
 సుగమంబులు గావు ముక్తి సుభగత్వంబుల్
 సుగమంబు భాగవతమను
 నిగమంబు పఠింప ముక్తి నివసము బుధా "

ఎన్ని వేదములు చదినను అవి సులభముగా ముక్తిని ప్రసాదింపజాలవు. లౌకికసుఖములన్నియు క్షణికములు. నశ్వరములు - మోక్షము పరమానందదాయకము. 'భాగవతము' అను వేదమును భక్తిశ్రద్ధలతో పఠించి.. భక్తిజ్ఞాన వైరాగ్యములు గల్గి నిష్ఠతో ఆ దేవదేవుని సేవించినప్పుడే ఆయన అనుగ్రహము లభించును.

"భగవంతు డగు విష్ణుడు జగముల కెవ్వేళ రాక్షస వ్యధ గలుగున్
 దగనవ్వేళల దయతో   యుగయుగమున బుట్టి కాచునుద్యల్లీలన్"

భగవంతుడైన శ్రీహరి ఎప్పుడెప్పుడైతే లోకాలకు రాక్షసులవలన బాధలు కలుగుతాయో అపారకరుణతో ఆయా యుగాలలో అవతరించి తన లీలా ప్రకటనలతో లోకులను కాపాడుచుండును.

"నశించే ఈ దేహానికై శోకించకు. నశించని  శాశ్వత ఆనందాన్ని నా నుండి పొందు అంటాడు పరమాత్ముడు. "మానవ జీవితం ఏడుపుతో ఆరంభమవుతుంది. పుడుతూ, పెరుగుతూ, ఆఖరికి పోతూ ఏడుపు, పోయాక కూడా ఏడుపులే మిగిల్చి పోతుంటాడు ఈ ప్రాణి. ఏడుపు సహజం. ఆ ఏడుపుని తగ్గించే ఒక ఓదార్పు ప్రతి ప్రాణీ కోరుకుంటుంది. ఆ ఓదార్పు ఎక్కడినుండి రావాలి మనకి?శోకసాగరంలో ఈదులాడే ప్రాణకోటికి నిజమైన ఓదార్పు నిచ్చేదెవరిని గుర్తించే శక్తి ఉన్నవాడు మానవుడొక్కడే. లోకంలో ఒక్కో జన్మకీ ఒక్కో బంధువర్గం చుట్టూ ఏర్పడుతూ ఉంటుంది. ఆయా బంధువులు ఆయా సమయాల్లో మాత్రం కొంతవరకు ఓదార్పు కలిగించే ప్రయత్నం చేస్తారు. 'జీవుడికి దేహాన్ని బట్టి ఏర్పడే బంధువులు ఎంతమంది మారుతున్నారో, కానీ మారని శాశ్వతమైన బంధువు ఆ పరమాత్మ.'ఎవరికి ఎక్కడ ఏ శోకం కలిగినా దానికి శాశ్వతమైన ఆనందాన్నిచ్చే ఉపశమనం  కేవలం "శ్రీహరి " మాత్రమే ఇవ్వగలడు. 



భాగవతములో పోతనామాత్యుడు వివరించిన సుయజ్ఞోపాఖ్యానంలో సుయజ్ఞుడనే రాజు యుద్ధంలో అసువులు బాసుట.. ఆతని మరణాన్ని జీర్ణించుకోలేక ఆ శవం వద్ద అతని భార్యలు,పిల్లలు భోరు,భోరున విలపించుట పలువిధాల ఆర్తనాదాలతో సాయం సమయం వరకు వారు రోదిస్తుండగా.. యముడు బాలకరూపం ధరించి వచ్చి అచ్చటివారి నుద్దేశించి జననమరణాల గురించి తత్వోపదేశం చేస్తాడు. ఈ సుయజ్ఞుని కధను  ఒక 'ఉదాహరణముగా' హిరణ్యకశిపుడు ఆ ఉపదేశమును వివరిస్తున్నాడు..( యముడు బాలకుడు రూపం ధరంచి వివరించిన ఆ తత్వోపదేశమును మనము కధలో విశదీకరించి చెప్పుకుందము.)   అసలు హిరణ్యకశిపుడు ఎవరికి తత్వోపదేశమును 
వివరిస్తున్నాడు అన్న కధాంశ మూలాల్లోకి మనం వెళితే..ఆ సారాంశము ఇదిగో ఇలా..... 

నైమిశారణ్యంలో సూతమహర్షి శౌనకాది మహామునులకు భాగవతాన్ని ఇలా వివరిస్తున్నాడు..మహాత్ములారా! గంగాతీరమున ప్రాయోపవేశం చేస్తున్న పరీక్షిన్మహారాజు శుకయోగీంద్రుని ఈ విధంగా ప్రార్ధించాడు.

మహాత్మా! యోగీంద్రా! భగవానుడు ఆనందస్వరూపుడు. సకల భూతజాలమునకు ఆత్మీయుడు. రాగద్వేషాలకూ, త్రిగుణాలకూ అతీతుడు. ఆయనకు ద్వేషింపతగిన వాడుకానీ, ప్రేమించదగిన వాడుకానీ యుండడు. దయాస్వరూపుడు . అట్టి భగవానుడు దేవేంద్రుని కొరకు దానవులను హతమార్చుతుంటాడు. ఆయనకు దేవతల వలన కలిగే లాభమేమిటి? రాక్షసుల వలన తనకు కలిగే కీడేమిటి? ఈ నా సంశయమును తీర్చి నా మనసుకు శాంతిని కూర్చండి స్వామి అని ప్రార్ధించాడు.అందులకు శుకయోగీంద్రుడు ...నీ ప్రశ్న బాగుంది. లక్ష్మీరమణుడైన శ్రీహరి చరిత్ర మహా చిత్రంగా ఉంటుంది. వ్యాసభగవానునికి నమస్కరించి శ్రీహరి చరిత్రను వివరిస్తాను..విను.

 శ్లో" చిత్రంబులు త్రైలోక్యప, విత్రంబులు భవలతా లవిత్రంబులు స
    న్మిత్రంబులు మునిజనవన, చైత్రంబులు విష్ణు దేవు చారిత్రంబుల్.

పరమేశ్వరుడు గుణరహితుడు. ప్రకృతి ఆయన మాయ. దానికి సత్వగుణం, రజోగుణం, తమోగుణం అనే గుణాలున్నాయి. ఈ గుణాలు పెరుగుతూ తరుగుతూ ఉంటాయి. సత్వగుణం నుంచి దేవతలు, రుషులు.. రజోగుణం నుంచి అసురులు.. తమోగుణం నుంచి యక్షులు, రాక్షసులు పుట్టుకొచ్చారు. కాలరూపుడైన పరమాత్మ సత్వగుణులైన దేవతలకు మేలు, రజస్తమో గుణులైన అసురులకు, రాక్షసులకు కీడు చేస్తుంటాడు. పరీక్షిత్తూ! పూర్వం మీ తాతగారైన ధర్మనందనుడు అడుగగా నారదమహర్షి వివరించిన విషయమును చెపుతాను విను నీ  సంశయము తీరుతుంది. 

మీ తాత ధర్మరాజు రాజసూయయాగమునకు బంధు మిత్రాదులను మహర్షులనందరినీ ఆహ్వానించాడు. అందులో చేది దేశపురాజు శిశుపాలుడు కూడా వచ్చాడు. ఆ నిండు సభలో అహంకారంతో శిశుపాలుడు శ్రీకృష్ణుడిని తూలనాడాడు. ఫలితంగా భగవంతుడు వానిని తన సుదర్శనాయుధంతో సిరస్సును చేధించాడు. అప్పుడు ఆ శిశుపాలుని దేహం నుండి ఒక తేజం వెలువడి శ్రీకృష్ణునిలో లీనమయ్యింది. అది చూచి ధర్మరాజు ఆశ్చర్యపోయాడు. సభలో ఉన్న నారదుని వైపు చూస్తూ ఇలా అన్నాడు. 



మహాత్మా! తమకు తెలియని ధర్మరహస్యాలులేవు. శిశుపాలుడు   పరమ దుర్మార్గుడు. భగవద్వేషి. అట్టివానికి వాసుదేవుని సాయుజ్యం ఎలా లభించింది? పూర్వం వేనుడనే రాజు భగవంతుని ద్వేషించి బ్రాహ్మణుల శాపానికి గురై నశించాడని చెపుతారు. శిశుపాలుడు, దంతవక్త్రుడు కలిసి గోవిందుని ఎప్పుడూ తిడుతుండేవారు..వారు శ్రీకృష్ణుని ద్వేషించని దినము లేదు. అలాంటి విరోధికి విష్ణుసాయుజ్యం ఎలా కలిగింది?నాకు వివరించండి అని ప్రార్ధించాడు.నారదుడు ధర్మరాజుతో ఇలా అన్నాడు.. 

ధర్మనందనా! దూషణ, భూషణ, తిరస్కార, సత్కారాలు శరీరానికే గాని పరమాత్మకు లేవు. శరీరం మీద అభిమానం వలన ఎవరైనా కఠినంగా మాట్లాడినా, దండించినా బాధ అనిపిస్తుంది. నేను, నాది అనేభావం శరీరం వల్లనే కలుగుతుంది. ఈ అభిమానమే జీవుడిని బంధిస్తుంది. అన్ని శరీరాల లోనూ ఆత్మరూపంలో ఉన్న ఈశ్వరునికి ఏ దేహం పట్లనూ ద్వేషం గాని, అభిమానం గాని ఉండదు. అందువలన స్నేహంతో గాని, వైరంతోగాని, ఆయనకు నిమిత్తం లేదు. తనను తలచుకొన్న వారందరికీ తనలో చోటిస్తాడు.

హరిని చేరుటకు అనేక మార్గములు కలవు. అమితమైన కామంతో గోపికలు, భయంతో కంసుడు, వైరంతో శిశుపాలాది భూపాలుడు, బంధువులై వృష్ణులు, ప్రేమతో మీరు, భక్తితో మేము, శ్రీహరిని చేరుకోవచ్చునని నిరూపణ అయ్యింది. కామం, ద్వేషం, భయం, స్నేహం, సేవ - వీటిలో ఏదో ఒక భావంతో హరిని స్మరించిన వారికి చాలామందికి సద్గతి కలిగింది. వీటిలో ఏ ఒక్క గుణం లేనందున వేనుడి జన్మవ్యర్ధం అయ్యింది. కుంతీదేవి చెల్లెలి బిడ్డలైన, శిశుపాల దంతవక్త్రులు పూర్వజన్మలో విష్ణుమందిర ద్వారపాలకులు. విప్ర శాపం వలన పదభ్రష్టులై భూమిమీద పుట్టారు. అని నారదుడు చెప్పగా.. అప్పుడు నారదుడు వారి పూర్వగాధను ఈ విధంగా వివరించాడు.



ఒకనాడు బ్రహ్మమానసపుత్రులైన సనక సనందనాదులు ముల్లోకాల్లోను సంచరిస్తూ మాధవుని దర్శించాలనే కుతూహంతో ఐదారేళ్ళ పిల్లల్లా దిగంబరంగా వారి మందిరంలోకి ప్రవేశిస్తుంటే ద్వారపాలకులైన 'జయ, విజయులు' వారిని అడ్డుకొన్నారు. లోపలికి పోవుటకు అనుమతిలేదని కసురుకొన్నారు. ఆ మునులు ఆగ్రహంతో.. మమ్మల్ని అటకాయిస్తారా, మూర్ఖులారా! మదమెక్కిందా ఇంత కండకావరమా అని ద్వారపాలకులను నిందించి అసురజాతిలో పుట్టండని వారికి ఆ బాలకులు శాపమిచ్చారు. ద్వారపాలకులు వారెవరో గ్రహించి మునులారా! మా అజ్ఞానాన్ని మన్నించండి. మీరెవరో ఎరుగక పొరపాటు చేశాం. క్షమించండి. దయజూపమని బ్రతిమాలగా, ఆ మునులు కరుణించి మూడు జన్మలెత్తి మురారితో వైరం పెట్టుకొని ముక్తి పొందుతారని శాప విమోచనం చెప్పి వెళ్ళిపోయారు.   

జయ విజయులు మొదటి జన్మలో దితిగర్భాన హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపులై పుట్టారు. చిన్నవాడైన హిరణ్యాక్షుడిని శ్రీహరి వరాహరూపంలో అవతరించి సంహరించాడు. పెద్దవాడైన హిరణ్యకశిపుడిని నరసింహావతారములో వచ్చి సంహరించాడు. రెండవ జన్మలో కైకసి అనే రాక్షసికి రావణ కుంభకర్ణులై జన్మించగా వారిద్దరినీ శ్రీరామచంద్రుడుగా అవతారం దాల్చి వధించాడు. మూడవ జన్మలో శిశుపాల దంతవక్త్రులయ్యారు. కృష్ణుని చేతిలో మరణించి ఆయనలోనే ఐక్యమయ్యారు. 

అయితే హిరణ్యకశిపుడు తన కొడుకైన ప్రహ్లాదుడు ఎప్పుడూ హరినామస్మరణే చేస్తున్నాడని సంతోషించక ఎందుకు శిక్షించాడని ధర్మరాజు మరో ప్రశ్న వేయగా నారదుడిలా తెలిపాడు. తమ్ముడైన హిరణ్యాక్షుడిని హరి అంతం చేశాడని విని హిరణ్యకశిపుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. సభలో శూలం పుచ్చుకొని నిలబడి దైత్యుల్ని, దానవుల్ని ఉద్దేశించి చూశారా ఈ ఘోరం, నాకు తమ్ముడు మీకు ఆప్తమిత్రుడు అయిన హిరణ్యుని ఆ హరి అతి దారుణంగా చంపాడు. అతడిని ఇక వదిలేది లేదు.  నా తమ్ముని సం హరించిన వాని రక్తముతో నా తమ్మునికి తర్పణము ఇస్తేకాని నాకు మనోవేదన చల్లారదు. కపట స్వభావుడైన హరి నశించిన తరువాత ఇతర దేవతలందరు నశించుతారు. కాబట్టి దానవులారా!   యజ్ఞము, వేదము అతడే.  సర్వవైదిక కర్మలకు, దేవతాముని సమూహాలకు, సర్వధర్మాలకు అతడే మూలము.(అంతర్యామి గురించి, ఆయన పరాక్రమము గురించి అన్నీ తెలిసినా ఆ దానవుడు పగ విరోధముతో అహంకారమునకు లోనై తానే హరిపై ద్వేషముతో 'మాయ 'కు లోనై హరిపై నిరసన ద్వజం ప్రారంభించాడు.) .ఎక్కడ బ్రాహ్మణులు, దేవతలు సుఖంగా ఉంటారో ఎక్కడ ధర్మాలు, నియమాలు సక్రమంగా నడుస్తుంటాయో అక్కడ ఆ విష్ణువు నివాసముంటాడు. మీరు వాటినన్నింటినీ ధ్వంసం చెయ్యండి అప్పుడు వారు నివసించడానికి దగిన చోటు లేక నశిస్తారు. అని ఆజ్ఞాపించాడు. రాక్షసమూకలు భూమిపైబడి విచ్చలవిడిగా తిరుగుతూ పుణ్యక్షేత్రాలను, పుణ్యాశ్రమాలను, బ్రాహ్మణులను, గోవులను, భగవద్భక్తులను, వేద  సాంప్రదాయాన్ని నాశనం చేశారు. భూగోళమంతా కోలాహలంగా తయారైంది. ఈ భయానక దృశ్యాలను చూచి, దేవతలు స్వర్గమును వీడి అడవుల పాలైనారు. 

చక్షువుల ధరిత్రి చలితయై కానంగ బడినభంగి వికలభావరహితు
దాత్మమయుండు కంపితాంతరంగంబున గదలినట్ల తోచున్ గదలడతడు

ఈ ఈశ్వరుడు సర్వజ్ఞుడు. జీవరాసులకు ఆత్మయై వెలయువాడు. ఆత్మరూపమున ఎల్లప్పుడు తన మాయచే త్రిగుణములను కల్పించి ఆ గుణముల సంపర్కముచే పాంచభౌతిక శరీరము దాల్చి లీలానాటకములాడుచుండును. చలించుచున్న జలములో కదలని వృక్షములు కదలుచు కంపించునట్లు, తిరుగుతున్న కళ్ళకు భూమి గిర్రున తిరుగుతున్నట్లు, నిశ్చలుడైన పరమేశ్వరుడాత్మమయుడై కంపించుచున్న అంతరంగములో నుండుటచేత, తానుకూడా కదులుచున్నట్లు భ్రమ కలిగించునుగాని ఆతనికి కదలికయే లేదు. అని హిరణ్యకశిపుడు తన తల్లికి తత్త్వమును బోధిస్తున్నాడు. 

 హిరణ్యకశ్యపుడు సోదరుని మరణానికి శోకించాడు. ఉదకప్రదానం మొదలైన శ్రాద్ధకర్మలు,   తిలోదక దానాలు కావించినాడు.  హిరణ్యాక్షుని బిడ్డలైన శకుని, శంబర, కాలనాభ, మదోత్కచ ప్రముఖులను ఊరడించాడు. హిరణ్యాక్షుని భార్యలను పిలిచి పరామర్శించాడు. దు:ఖిస్తున్న తల్లి దితిని ఊరడిస్తూ ఇలా అన్నాడు. బాటసారుల్లా వస్తారు, కలుస్తారు, విడిపోతారు. ఎవరూ శాశ్వతంగా ఉండరు. ఇది సత్యం. నీ కొడుకు శూరులు పోయే త్రోవలో పోయి  వీరగతి  చెందాడు.  అతని కోసం శోకించడం ఎందుకు?    కర్మ వలన
సంయోగ వియోగాలు సంభవిస్తాయి. ఈశ్వరుని లీల అది. ఇది అర్ధం కావడానికి సుయజ్ఞోపాఖ్యానం అనే కధను చెబుతాను వినండి అని హిరణ్యకశ్యపుడు ఇలా వారికి వివరిస్తున్నాడు.  

ఉశీనర దేశంలో సుయజ్ఞుడనే రాజున్నాడు. అతడిని యుద్ధంలో శత్రువులు వధించారు. ఆతని మరణవార్త విని అతని శవం చుట్టూ చేరి భార్యలు, పిల్లలు భోరు భోరున విలపిస్తున్నారు. మాకు ఈ పిల్లలకు దిక్కెవ్వరంటూ భార్యలు, నీవు లేకుండా మేముండలేము మేము కూడా అగ్నిలో దూకు నీతో సహగమనం చేస్తాం అని ఆర్తనాదాలు చేస్తున్నారు. సూర్యాస్తమయం కావస్తోంది. వాళ్ళ ఏడుపులు ఆగలేదు. అప్పుడు అంతా గమనిస్తున్న యముడు బాలకుని రూపం ధరించి అచటికి వచ్చి అక్కడ మూగిన బంధుజనాన్ని చూచి ఇలా అన్నాడు.పుట్టిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు. నిత్యం ఎంతోమంది మరణిస్తుండడం చూస్తూ కూడా తమకు మరణం లేదన్నట్లు మరణించిన వారికై తల్లడిల్లుతారు. మరణం ఎవరూ తప్పించుకోలేరు. జనన మరణాలు ప్రాణులందరికీ సహజం. 'ప్రాణుల పుట్టుక, రక్షణ, మరణం పరమేశ్వరుడి ఆధీనంలో ఉంటాయి '. దైవం అనుకూలిస్తే వీధిలో పారేసుకొన్న ధనం చేతికొస్తుంది. అదే ప్రతికూలిస్తే భద్రంగా ఇంటిలో దాచుకొన్న ధనం కూడా రెక్కలొచ్చినట్లు ఎగిరి పోతుంది.అలాగే అడవిలో వదలివేయబడ్డ బాలుడు కూడా ఆయువు ఉంటే వర్ధిల్లుతాడు. లేకుంటే రక్షణ వలయంలో ఉన్నవాడు కూడా 'హరీ' అంటాడు. ఉండడం, పోవడం అనేది కాలాన్ని బట్టి, కర్మను బట్టి జరుగుతుంటుంది. పంచభూతాలతో నిర్మితమైన భవనం ఈ దేహం. జీవుడు పూర్వకర్మ వలన అందులో కొంతకాలముండి వెళ్ళిపోతాడు. దేహం చెడుతుంది కానీ జీవుడు చెడడు. దేహి వేరు, దేహం వేరు అని తెలుసుకోవాలి. రాజు దేహం చూస్తూ వెర్రివాళ్ళలా ఏడుస్తున్నారు. ఆ దేహంలో వినేవాడు, మాట్లాడేవాడు అక్కడ ఇప్పుడు లేడు. ఎప్పుడో వెళ్ళిపోయాడు. ప్రాణరూపంలో ఉండే గాలి మాట్లాడలేదు. వినలేదు. అందువలన ఏడ్వడం వలన ఏ ప్రయోజనము సిద్ధించదు. తల్లిదండ్రులు, బిడ్డలు, భార్యలు, బంధువులు, మిత్రులు, ఇళ్ళువాకిళ్ళు, సిరిసంపదలు కర్మానుబంధం వలన కలలో కంపించినట్లు కనిపించి కర్మ తీరినాక కనుమరుగైపోతాయి. తత్త్వం తెలిసిన వారు ఉన్నవని సంతోషించరు, పోయినవని విచారించరు. సుఖ దు:ఖాలు అజ్ఞానం నుంచి పుడుతున్నాయి. అని ఒక కధను వివరించాడు యమ బాలకుడు... 

పూర్వం ఒక అడవిలో ఒక ఎరుకు ఉండేవాడు. ఒకనాడు ప్రొద్దునే లేచి వేటకు బయలుదేరాడు.విల్లంబులు, వలలు, ఉరులు, కండెలు, చిక్కం మొదలైన సామాగ్రితో పిట్టలను కొట్టడానికి ఉద్యుక్తుడయ్యాడు. పిట్టలను పట్టి వాటి రెక్కలు విరిచి చిక్కంలో వేసుకొంటూ తిరిగాడు. ఒకచోట వాడికి కుళింగ పక్షుల జంట కనిపించింది. అందులో ఆడపిట్టను ఉరిలో వేసి పట్టుకొని చిక్కంలో వేశాడు. అప్పుడు చెట్టుమీద ఉన్న మగపిట్ట అయ్యో అడవిలో మేతమేసి, ఎవరికీ అపకారం చేయక తిరిగే మనకు బ్రహ్మలిఖితం వలన ఈ కిరాతుని పాలుకావలసి వచ్చింది అని వాపోయింది. ఇద్దరం వలలో పడితే బాగుండేది.రెక్కలురాని పిల్లలను నేనొక్కడినే ఎలా పోషించేది? తల్లికోసం దిక్కులు చూసే ఈ పిల్లలకు ఎమి చెప్పి సముదాయించాలి? ఈ బాధ నేను ఎలా భరించేది? అని విచారిస్తున్న మగపిట్టను కూడా ఆ కిరతకుడు బాణం వేసి కొట్టగా నేలమీద పడింది. కాలం సమీపిస్తే ఎవరైనా అలా కూలిపోవలసినదే. ఎవరు ఎప్పుడు పోతారో తెలియదు. పోయినవారి కోసం శోకించుట వ్యర్ధం. మీ మీ శోకానికి వారు తిరిగి రారు కదా! అని యమ బాలకుడు చెప్పగా  శవం వద్ద ఉన్నవారంతా విస్మయం చెందారు. ప్రపంచంలో ఏదీ నిత్యం కాదని గ్రహించి శోకం మాని సుయజ్ఞునికి అంత్యక్రియలు పూర్తిచేసి ఇళ్ళకు వెళ్ళారు.అని ఈతత్త్వబోధను తల్లికి,తమ్ముని భార్యలకు, చెప్పి వారిని ఊరడించాడు హిరణ్యకశిపుడు. వారు కూడా శోకమును ఆపుకొని, తత్త్వదృష్టితో జనన మరణాలు పరమేశ్వరుడి ఆధీనములో ఉన్నాయని గ్రహించినవారై ఎవరి దారిన వారు నిష్క్రమించారు.  

ఇంతటి తత్వోపదేశమును తెలియజేసి వారి దు:ఖమును  ఉపశమింపజేసిన హిరణ్యకశిపుడు మాయ చే కప్పబడిన మనస్సుతో తాను మృత్యువును జయించాలి.ముల్లోకాలుఏలాలి, శత్రువులంతా నశించాలి, సింహబలంతో సదా తాను వర్ధిల్లాలి.. అని మందర పర్వాతానికి పోయి ఘోరతపస్సునొనరించాడు. ఆతని ఉగ్ర తపానికి భూమి అదిరింది, సముద్రాలు అల్లకల్లోలమయ్యాయి. దేవతలు స్వర్గాన్ని విడిచి బ్రహ్మలోకానికి పోయి బ్రహ్మను ప్రార్ధించారు. బ్రహ్మదిగి వచ్చి  ఆతని తస్సుకు మెచ్చి వరమిచ్చుట.. ఆ వరంతో అతను తనకు మృత్యువు లేదని దేవతలను, గంధర్వులను, అందరినీ హింసించుతూ  మద గర్వంతో  రాజ్యం చేశాడు. హిరణ్యకశ్యపుడి కుమారుడు ప్రహ్లాదుడు.. ప్రహ్లాదోపాఖ్యానము అందరికీ సుపరిచితమే... 



ప్రహ్లాదుడు నరసింహ భగవానుని చేత అతని తండ్రిని  సంహరింప చేసి తన తండ్రికి గొప్ప సేవ చేసెను. శాస్త్రములలో ఎవరైన రాక్షసుడైనను భగవంతుని చేత సంహరించ బడినచో అతడు వెంటనే ముక్తిని పొందునని తెలుపబడినది. ప్రహ్లాదుడు ఇలా ఆలోచించెను: "నా తండ్రి ఎన్నో పాపకార్యములను ఒనరించెను. మరియు భగవంతుని వ్యతిరేకించెను కాబట్టి అతడు ముక్తిని పొందజాలడు" అని భావించెను. నరసింహ భగవానుడు హిరణ్యకశిపుని సంహరించిన తరువాత ప్రహ్లాదుడు ఇలా పలికెను: "శ్రీహరీ! నా తండ్రి గొప్ప నాస్తికుడు. అతడు మీ పాదపద్మముల వద్ద అనేక అపరాధములను చేసెను. అతడిని నీవు సంహరించితివి. అతడిని క్షమించి ముక్తిని ప్రసాదించుమని నేను మిమ్ములను ప్రాధేయపడుతున్నాను." నిజానికి హిరణ్యకశిపుడు వెంటనే ముక్తిని పొందాడు. కాని అతని ప్రియ పుత్రుడు తన తండ్రి ముక్తిని పొందగలిగెనా లేదా అని జిజ్ఞాసతో తెలుసుకోవాలనుకున్నాడు. విష్ణు భగవానుడిచేత సంహరింపబడి ఆ అసురుడు తన జన్మను ధన్యం చేసుకొన్నాడు. ముక్తిని పొందాడు. 

సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు




    





Friday, July 21, 2017 0 comments By: visalakshi

సుబ్రహ్మణ్యేశ్వరస్వామి (కుమారస్వామి)

ఓం శరవణ భవాయై నమ:



శివశక్తుల సంయోగం ఒక విశ్వవిజేతకు, అద్భుతపరాక్రమశాలికి, జ్ఞానప్రదాతకు  మూలకారణం  కానుంది.

 'అద్వైతం సత్యం'.నిరంజనం, నిరంతరం, నిర్గుణం, నిరామయం ఈ అద్వైత లక్షణాలు. అదే మహాపరమేశ్వర తత్వం. మహాకాలాగ్ని స్వరూపం ఈశ్వరుడు. 

'ద్వైతం కల్పితం'. సకల చరాచర సృష్టి, కదలీ కదలక కదలే కదలికలకు కారణం ఈ ద్వైతం. అదే మహాశక్తి స్వరూపం.

లోకకళ్యాణదక్షులైన వారిరువరి భావం. అర్ధనారీశ్వరతత్వం. వారు కార్యకారణ వినిర్ముక్తులు.అయినా ఒక మహాప్రయోజనం కోసం పార్వతీ పరమేశ్వరులై కళ్యాణభావం పొందారు. మనోజ్ఞమంగళమూర్తి పరమేశ్వరుడు వరుడు. ముగ్ధమనోహర సుందర సుకుమార లావణ్యరాశి పార్వతి వధువు. హిమవంతుడు కన్యాదానం చేశాడు. శుభలగ్నంలో అమ్మ కామేశబద్ధ సూత్రశోభిత అయ్యింది. సదాశివ కుటుంబం రూపుదిద్దుకుంది ఆ క్షణంలో. కుటుంబలక్ష్యం విస్తరించడం, స్వామి పితృభావం పొందాలి. సర్వమంగళ మాతృశోభ సంతరించుకోవాలి. వారి తొలి సంతానం అద్భుత ప్రతిభా సంపన్నుడైన పుత్రరత్నం, కారణజన్ముడై జన్మించాలి. వరగర్వితుడైన తారకాసుర సంహారం కేవలం ఆ వీరబాలకుడి వల్లే జరగాలి. ఇదంతా ఓ జగన్నాటకం. 





ఈ పరిణామ క్రమంలో 'పంచభూతాలు స్వామి ఆవిర్భావానికి పాత్రధారులయ్యాయి.' పృధ్వి, అగ్ని, జలం, నక్షత్రశక్తి కృత్తికలు అలౌకికమైన మహాగ్నికి కారణభూతమైన రెల్లుగడ్డి పాత్రధారులైనాయి. పార్వతీ పరమేశ్వర అంశను కపోతరూపుడైన అగ్ని ధరించాలి. ఆ  తేజస్సును  ఎక్కువకాలం భరించలేక  గంగలో వదిలాడు. గంగకూ ఆ తేజస్సు తాలూకు వేదన తప్పలేదు. ఆమె రెల్లుగడ్డిలో ఆ తేజస్సును వదిలింది. ఆ తేజస్సు త్వరితగతి బాలరూపం ధరించింది. ఆ బాలుణ్ణి తమ స్తన్యం ఇచ్చి పెంచారు కృత్తికలు. 
              
              అందుకే ఆ బాలుడు అనేకనామాలతో ప్రసిద్ధుడైనాడు. స్కందుడని,
సుబ్రహ్మణ్యుడని, షణ్ముఖుడని, రవణభవుడని, కార్తికేయుడని, కుమారస్వామి అని శాస్త్రాలు సన్నుతించాయి.వేదాలు ఈ బాలుని షణ్ముఖీనమైన సంవత్సరాగ్నిగా నుతించాయి. ఆరు ఋతువులు, ద్వాదశహస్తాలు, ఆరుముఖాలు ద్వాదశమాసాలు ... ఇవి సంవత్సరాగ్ని స్వరూపం. అందుకే స్వామిని షడాననుడని, షణ్ముఖుడని అంటారు. తమిళులు 'ఆర్ముగం' అని అంటారు.ఈ ఆరుముఖాలు స్వామిరూపంలో ఊర్ధ్వముఖం అధోముఖంగా కనిపించి పాణిద్వయం ఉత్తరాయణ దక్షిణాయనాలకు సంకేతాలు.  



ఈ ఆరుముఖాలను అరిషడ్వర్గ నాశకాలుగా సంకేతించింది మంత్రశాస్త్రం. కామ,క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు స్వామి శరణాగతి వల్ల పూర్తిగా నశిస్తాయని భక్తుల నమ్మకం. షడ్భావ విరహితం, నిత్యం, క్షయరహితం, శుద్ధం, క్షేత్రజ్ఞం, క్రియాశూన్యం, గగనాశ్రయం, స్వప్రకాశం, సృష్టికారణం, నిస్సంగం, పరిపూర్ణం, వ్యాపకం ఇవి స్వామి హస్తాల లక్షణం.

నిరంతరం సుబ్రహ్మణ్యస్వామిని "ఓం శరవణ భవాయై నమ:" అని భక్తులు స్తుతిస్తారు. "శరవణ" అంటే రెల్లుగడ్డి. రెల్లుగడ్డిలో పార్వతీ పరమేశ్వరుల అంశ అనే తేజస్సు బాలరూపం ధరించింది.. కనుక భక్తులందరూ "ఓం శరవణ భవాయై నమ:" స్తుతిస్తారు. పెరిగి కౌమారదశకు చేరుకున్న స్కందుడు పరమేశ్వర స్థానాన్ని చేరుకున్నాడు. మాతృత్వంలోని మమకారం ఆ బిడ్డకు పరిపూర్ణంగా అందించింది పార్వతి.  

అసుర సంహారానికి కాలం సమీపించింది. దేవతల కోరిక మేరకు ఆదిదంపతులు స్కందుడికి సర్వసైన్యాధ్యక్ష పదవిని ఇచ్చారు. దేవతలు సంతోషముతో ఆ బాలుడిని ముందుంచుకొని తారకుడి మీదకు యుద్ధానికి బయలుదేరారు. పార్వతీదేవి తన శక్తినంతటినీ నిక్షేపించి కుమారుడికి ఒక బల్లాన్ని ప్రసాదించింది. దేవాసుర సంగ్రామం భీకరంగా ఐదురోజులు జరిగింది. ఆరవరోజు షణ్ముఖుడు తారకుని వెంబడించి   సంహరించాడు. తారకుని తమ్ముడు శూరపద్ముడు ఒక మామిడిచెట్టుగా మారాడని ఆ చెట్టును స్వామి రెండుగా చీల్చగా శూరపద్ముడు మరణించాడని, ఆ వృక్షం రెండు భాగాలలో ఒక భాగం మయూరంగా, రెండవభాగం కుక్కుటంగా మారాయని, ఆ రెంటిని స్వామి స్వీకరించాడని అంటారు.

"శక్తి హంతం విరూపాక్షం శిఖివాహనం షడాననం
 దారుణం రిపురోగఘ్న భావయేత్ కుక్కుటధ్వజం" 

నెమలి వేగానికి, కోడి జ్ఞానానికి సంకేతం. అలా సర్వసైన్యాధ్యక్షుడై దేవకార్యాన్ని దిగ్విజయంగా విజయవంతం చేసాడు షణ్ముఖుడు. యుద్ధం నుంచి మరలివచ్చిన తర్వాత దేవేంద్రుడి కుమార్తె దేవసేనను, పెరుకుప్పంకు చెందిన నంబిరాజు కుమార్తె వల్లిని తల్లిదండ్రుల ఆశీర్వాదంతో పరిణయమాడాడు కుమారస్వామి. 'వేలా' అనే ఆయుధాన్ని ధరించడం వల్ల వేలాయుధపాణిగా పిలువబడుతున్నాడు. 

స్కందుడు అగ్నిస్వరూపుడు. అగ్నికార్యరూపమైన ఉపాసనకు అధిదేవత సుబ్రహ్మణ్యస్వామి. అలాగే జ్ఞానప్రదాతగా, సంతాన ప్రదాతగా, కరుణామూర్తిగా అందరూ అర్చిస్తారు. కుజునకు అధిష్ఠానదేవత సుబ్రహ్మణ్యేశ్వరుడనీ, ఆయనను కొలిస్తే తప్పక సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢవిశ్వాసం. 

భారతదేశంలో స్వామిని అర్చామూర్తిగా కొలిచి తరించే భక్తులు కొందరైతే సర్పరూపంగా ఆరాధించేవారు మరికొందరు. సర్పరూపంలో ఉండే కుండలినీ శక్తిని జాగృతం చేసి, ఊర్ధ్వముఖంగా ప్రయాణం జరిపించి, సహస్రార కమలాన్ని చేరుకుని అక్కడి అమృతబిందువులను ఆస్వాదించి, మోక్షస్వరూపాన్ని పొందాలనుకుంటాడు సాధకుడు. ఆ సాధకుని లక్ష్యం పునర్జన్మరాహిత్యం. అలా సాధనా సంకేతంగా సర్పరూపంగా ఈ పుణ్యభూమిలో  ఉపాసింపబడుతున్నాడు  సుబ్రహ్మణ్యేశ్వరుడు. 

 పుట్టలో పాలు పోయడం, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయదర్శనం చేయడం, ప్రదక్షిణలు చేయడం, కావడి కట్టడం..ఇవన్నీ ఆచారంగా వస్తున్నాయి. దేశవిదేశాలలో నెలకొని ఉన్న సుబ్రహ్మణ్యక్షేత్రాల్లో శివపార్వతుల గారాల తనయుడైన కుమారస్వామికి స్కందపంచమి, కుమారషష్టి మహోత్సవాలు ఆషాఢ మాసంలో నిర్వహిస్తారు.

మార్గశిరమాసంలో శుక్లపక్షం షష్టి రోజున అన్ని స్కంద దేవాలయాలలో వైభవోపేతమైన పూజలు జరుగుతాయి.  పుట్టలో పాలుపోసి ఆ పుట్టమన్ను ప్రసాదంగా తెచ్చి అందరిచేతా ధరింపజేస్తారు గృహిణులు. ప్రతి మాసంలో వచ్చే ఆరవతిధి, ముఖ్యంగా వారాలలో మంగళవారం స్వామికి అత్యంత ప్రీతిపాత్రంగా భావించబడతాయి.ఆర్తులు, శరణాగతులు, సంతానాభిలాషులు సమస్యలు ఉన్నవారందరూ స్వామిని అర్ధించి వచ్చేవారే. స్వామి సుప్రతిష్ఠుడైన ఆలయాలన్నీ "ఓం శరవణ భవాయై నమ:"అన్న శరణుఘోషతో అనునిత్యం మార్మోగుతాయి. 



తిరుత్తణి, పళని, స్వామిమలై తిరుచందూర్...ఇలా ఎన్నో అసంఖ్యాలయాలైన స్వామి సన్నిధానాలు భారతదేశంలో కనిపిస్తాయి. పళనిలో సుబ్రహ్మణ్యేశ్వరస్వామి సర్వాన్ని కైలాసార్పణం చేసి, జ్ఞానఫలం కోసం బయలుదేరి వెళ్ళాడు. అందుకు గుర్తుగా స్వామి చిన్న కౌపీనం ధరించి దర్శనం ఇస్తాడు. తిరుచందూర్ లో శూరపద్ముణ్ణి వధించాడు. తిరుత్తణిలో చెంచుల ఆడబిడ్డ వల్లిని పరిణయమాడాడని, స్వామిమలైలో తండ్రికే గురువై ప్రణవరహస్యం భోధించాడని అందుకే ఆయనను శివగురునాధుడని లేదా స్వామినాధుడని పిలుస్తారు.



ఆద్యంతం అత్యంత భక్తిభావ ప్రపూర్ణాలు సుబ్రహ్మణ్యేశ్వరస్వామి స్థలపురాణాలు. ఇష్టకామితాలను లొసగడానికి, ఇహపరాలను ఇవ్వడానికి, నమ్మినవారిని కాపాడటానికి అన్నింటా తానై, అంతటా తానై కొలిచినవారి కొంగు బంగారమై తటిల్లతలా మెరిసే స్వామి మనందరి కామితార్ధాలు తీర్చుగాక!

 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు

  






Saturday, July 1, 2017 0 comments By: visalakshi

ఆండాళ్ తల్లి - గోదాదేవి



తమిళనాడులో శ్రీవిల్లి వుత్తూరులో నిరంతరము వటపత్రశాయికి మాలా కైంకర్యము చేయు శ్రీ విష్ణుచిత్తుడు(పేరియాళ్వారు) తులసి వనమునకై భూమిని దున్నుచుండగా ఆండాళ్‌ శిశువు భూమిలో కనపడింది. ఆ పసికూనను చూసి పరమ సంతోషముతో విష్ణుచిత్తుడు ఆమెను ఇంటికి తీసుకుని వెళ్ళి పెంచమని భార్యకిచ్చాడు. ఆమె పసిబిడ్డకు గోదాదేవి అని నామకరణం చేసింది. (గోదా-భూమి, గోదాదేవి- భూమి నుండి ఉద్భవించినది)

ఆ పసిపిల్ల దిన దిన ప్రవర్ధమానమగుచు అందరిని సంతోషపెట్టుచుండెడిది. చిన్నప్పటి నుంచి శ్రీమన్నారాయణనుని మీద అమితమైన భక్తిని చూపెడుతూ,  యుక్త వయస్సువచ్చు సరికి శ్రీమన్నారాయణుని తప్ప మనుజుల నెవ్వరిని వరించబోనని తన నిశ్చయము తెలిపినది.

తండ్రి విష్ణుచిత్తుడు ప్రతిరోజు శ్రీవిల్లి వుత్తూరులో వటపత్రశాయికి మాలాకైంకర్యము చేయుచుండట చూసి గోదాదేవి పరవశించెడిది. తండ్రి కట్టిన మాలలు తండ్రికి తెలియకుండా తన కొప్పుపై ధరించి నూతిలో తన సౌందర్యము చూచుకొనుచు తిరిగి ఆ మాలలను యధాస్థానమున నుంచెడిది. ఒక నాడు తండ్రి ఇది చూశాడు. అది తప్పని భావించాడు. నిర్మాల్యమైందని ఆనాడు వటపత్రశాయికి పూమాలలు సమర్పించలేదు. గోదాదేవిని సున్నితముగ మందలించాడు. అమ్మా! స్వామికి నిర్ణయింపబడిన పూలదండ నీవు ముందర ధరించుట అపచారమమ్మా! అని చెప్పాడు. గోదాదేవి తన కొప్పులో ముడిచిన పూలదండలు సమర్పించకుండుటకు విష్ణుచిత్తుని కలలో వటపత్రశాయి అగుపడి కారణమడిగాడు. విష్ణుచిత్తుడు తన తనయ యెనరించిన చిన్ని అపరాధమును వివరించి అందుచే మీకు మాలలను సమర్పించలేకపోయితిని. క్రొత్తవి తయారు చేయుటకు సమయము లేకపోయింది అని విన్నవించుకున్నాడు.



వటపత్రశాయి చిరునగవుతో విష్ణుచిత్తుని చూసి నీవు చింతించవలదు. సందేహించవలదు. గోదాదేవి తాను ముందు దాల్చిన మాలికయే మేము కోరదగినది. ఆమె కొప్పులో దాల్చని మాలికలు మాకు వద్దు. ఆమె విషయము మీకు తెలియదు. లక్ష్మీదేవియే ఈ లీలా విభూతి యందు భూలోకమున గోదాదేవిగా అవతరించింది అని చెప్పాడు.

గోదాదేవి యుక్త వయస్సు నొందగానే గోపికలు కృష్ణుని యందు చూపిన అనురక్తి ఆమెయందు పొడసూపింది. గోపికలు తమకముతో శ్రీకృష్ణుని కొరకు కాత్యాయన వ్రతమాచరించిరని వినగా ఆమెకు కూడా వటపత్రశాయి యందు అటువంటి అనురక్తి కలిగింది. కృష్ణుడున్న మధుర యమునలో జలక్రీడలాడుట ఇవన్నీ మనస్సులో ఊహించుకొని భోగిపండుగకు ముప్పై రోజుల ముందునుంచి ప్రారంభమయ్యే ధనుర్మాసంలో రోజుకొక పాశురం(శ్లోకం) చొప్పున 30 పాశురాలు రచించారు గోదాదేవి.  ధనుర్మాసములో తోడి బాలికలతో స్నానము చేసి వటపత్రశాయి దేవాలయము శ్రీకృష్ణుని గృహముగను, తోడి చెలులు గోపికలుగను, వటపత్రశాయి శ్రీకృష్ణునిగను, తాను ఒక గోపాంగనగ భావించి వటపత్రశాయికి ధూప, దీప , నైవేద్యములతో దినమున కొక్క పాశురమును ద్రావిడ భాషలో (తమిళములో)వ్రాసి వటపత్రుని సన్నిధిని పాడుచూ చెలులతో కాత్యాయనీ వ్రతము చేసింది.

1 వ పాశురమును "మార్గళిత్తంగళ్..........."అని మొదలు పెట్టిన శ్లోక భావార్ధం...
అనేక సంపదలతో తులతూగుతున్న వ్రేపల్లెలో భగవంతుని సేవలు చేయడమే మా సంపద అని భావిస్తూ అటువంటి సేవయే ఆభరణములుగా ధరించిన ఓ బాలికలారా! మనం ధనుర్మాస వ్రతం ప్రారంభించడానికి తిధి, వార వర్జ్యాలు చూసుకొని మనమీ వ్రతాన్ని ప్రారంభించడం లేదు. మార్గశిరమాసం నిండు పున్నమి రోజులు. సంకల్ప క్షణమే  వ్రతం మొదలు పెట్టాలి అని దివ్యమైన సందేశాన్ని ఆండాళ్ తల్లి మనకు ఈ మొదటి పాశురంలో అందిస్తోంది. భగవంతుని నామస్మరణ చేతనే సకల విధ  శుభ ఫలములు వాటంతట అవే కలుగుతాయని గోదాదేవి యొక్క ప్రధాన మనోగతం. అందుకే ప్రతి పాశురం చివరలో 'మేము చేయు వ్రతమునకు రండి జనులారా!' అని ఆండాళ్ తల్లి అందరిని నామస్మరణతో తరించమని చెప్తున్నారు. "మాసానాం - మార్గాశీర్షోహం" అని సాక్షాత్తూ గీతాచార్యుడు తానే సాక్షాత్తుగా మార్గశిరమాసమును. అని చెప్పాడు. ఎంతటి పుణ్యమాసమో కదా! మా..అంటే అమ్మ. శుభప్రధ మైన లక్ష్మీ కటాక్షం అపారంగా ప్రవహించే మాసమిది. మార్గళి అను పదంలోనే లక్ష్మీ నారాయణులిద్దరినీ స్మరిస్తూ తిరుప్పావైని ప్రారంభించింది ఆండాళ్ తల్లి.

 ఒక రోజున తన తండ్రిని 108 దివ్యతిరుపతలలోని మూర్తుల కళ్యాణగుణములను చెప్పవలసిందిగా కోరింది. పేరియాళ్వారు చక్కగా వివరించి చెప్పాడు.

ఆ వర్ణనలను వింటూంటే శ్రీరంగమున వేంచేసి యున్న శ్రీరంగనాయకుని మహాదైశ్వర్యవిభూతి సౌందర్యమునకు ముగ్ధురాలైంది. ఆయనను వివాహమాడ దలచింది. గోదాదేవికి శ్రీరంగనాథునికి వివాహ మెట్లు జరుగుతుందని విష్ణుచిత్తుడు వ్యాకులపడ్డాడు. వటపత్రశాయికి మొరపెట్టుకున్నాడు. వటపత్రశాయి నీకుమార్తెను శ్రీరంగనాథుని సన్నిధికి కొనిపొమ్ము అని ఆదేశించాడు. శ్రీరంగనాథుడు అరోజు రాత్రి విష్ణుచిత్తుని కలలో కనిపించి నేను నీ పుత్రికను వివాహమాడెదను. సిద్ధముగా నుండుము అని చెప్పాడు. మరుసటి దినమున శ్రీరంగనాథుని అజ్ఞమేరకు ఆయన భక్తులు, అర్చకులు మేళతాళములతో విష్ణుచిత్తుని వద్దకు వచ్చి గోదాదేవిని విష్ణుచిత్తుని శ్రీరంగనాథుని కోరికపై పల్లకిలో శ్రీరంగమునకు తీసుకొని వెళ్లిరి.



ఆ దినమున స్వామి ఆజ్ఞ చొప్పున శ్రీరంగనాథుని అర్చావిగ్రహమునకు గోదాదేవినిచ్చి వివాహము చేసిరి. గోదాదేవి స్వామిని సేవించుట అందరూ చూచుచుండగా శ్రీరంగనాథుని గర్భాలయములోనికి పోయి శ్రీరంగనాథునిలో లీనమైపోయింది.

శ్రీరంగనాథుడు విష్ణుచిత్తుని చూసి నీవు దిగులొందకు అని ఆయనకు గౌరవ పురస్కారముగా తిరుప్పరి పట్టము, తోమాల, శ్రీ శఠకోపము యిచ్చి ఇతర సత్కారములొనర్చి పంపాడు.

గోదాదేవికి ఆండాళ్‌ ( భక్తుల మేలుకొనునది), చూడి కొడుత్తామ్మాల్‌ (స్వామికి తాను ముడుచుకుని పూమాలలు ఇచ్చునది) అని పేర్లు వచ్చాయి.

గోదాదేవిని 12 మంది ఆళ్వారులలో చేర్చినారు. ధనుర్మాసంలో ఆమె ప్రతిరోజు రచించి పాడిన తిరుప్పావై పాశురములు జగత్‌ విఖ్యాతినంది అన్ని వైష్ణవదేవాలయాలలోను ధనుర్మాసమందు ప్రతియేటా అత్యంత భక్తితో ప్రజలందరు ముప్పది రోజులు పాశురములను పాడుచు లోకోత్తరముగ సేవలు చేయుచున్నారు. ఆమె తిరుప్పవై (30 పాశురములు), నాచ్చియారు తిరుమొళి (143 పాశురములు) జగత్‌ విఖ్యాతమై అందరి చేత నుతింపబడుచున్నవి. తిరుప్పావై దివ్య ప్రభందమే. 30 రోజులు పాడినవి మేలుపలుకుల మేలుకొలుపులు.

 ఆండాళ్‌ తల్లి అపర జానకీ మాతను గుర్తుకు తెస్తుంది. జనక మహారాజు యజ్ఞ శాల నిమిత్తము భూమిని దున్నుచుండగా దొరికినది సీత. ఆండాళ్‌ తల్లి కూడా తులసి వనము నిమిత్తమై విష్ణుచిత్తుడు దున్నుచుండగా ఆ భూమిలో దొరికినది. ఇద్దరూ అయోనిజలే. సీతలేని రామాలయముండదు. గోదాదేవి లేని వైష్ణవాలయముండదు. సీతమ్మ శ్రీరాముని (శ్రీ మహావిష్ణువు)ను వివాహమాడింది. అట్లే ఆండాళ్‌ శ్రీరంగనాథుని (శ్రీ మహావిష్ణువు)ను వివాహమాడింది.



గోదాదేవి పూర్వజన్మ వృత్తాంతము :

చూడి కొడుత్త నాచ్చియార్‌ జన్మ గురించి ఒక భగవత్‌గాథ ప్రాచుర్యంలో ఉంది. పురుషోత్తమక్షేత్రంగా ప్రసిద్ధిచెందిన పూరీలో వసంతాచార్యులనే భక్తాగ్రేసరుడు జగన్నాథుని ఆలయంలో ప్రథమ అర్చకుడిగా సేవలందించేవాడు. ఎక్కడాలేని విధంగా దైవం పక్కన శ్రీలక్ష్మి లేకపోవడం ఆయనకు వెలితిగా ఉండేది. శ్రీకృష్ణావతారంలోని సుభద్ర ఎందుకు వెలసిందో అనే అనుమానం ఆయనను వేధిస్తూండేది. ఒక పర్యాయం అదే ప్రశ్నకు సమాధానాన్ని వివరించమని ఆయన తన తండ్రిని కోరాడు. శ్రీకృష్ణావతారం సందర్భంగా ఆ అవతారపురుషుని అసమాన సౌందర్యం చెల్లెలు సుభద్రనూ సమ్మోహపరచిందనీ, అందుకే స్వయంభూ అయిన పూరీ క్షేత్ర జగన్నాథుడు సుభద్రకు తన పక్కన ఈ క్షేత్రంలో చోటుకల్పించాడని తండ్రి వివరించాడు.

ఈ వివరణతో సంతృప్తిపడని వసంతాచార్యులు శ్రీలక్ష్మికి లభించాల్సిన న్యాయమైన స్థానం కోసం దగ్గరలోని వనానికి వెళ్లి దైవాన్ని ధ్యానిస్తూ అన్నపానాదులను విడిచి వ్రతం ప్రారంభించాడు. ఆలయంలో ప్రధాన అర్చకుడు లేని కారణంగా జగన్నాథుని పూజాదికాలు సక్రమంగా జరగకపోవడంతో జగన్నాథుడు- వసంతాచార్యుని అనుమానం తీర్చేందుకు వసంతుని ముందు ప్రత్యక్షమయ్యాడు. తాను లౌకిక సంబంధ బాంధవ్యాలకు అతీతుడనీ, అందరిలోనూ అన్నింటా ఉంటూ అనన్య భావం కలిగి ఉంటానని వివరించాడు. కనీసం శ్రీలక్ష్మితోనైనా జగన్నాథుడు తనకు కనిపించాలని వసంతుడు పట్టుబట్టడంతో దైవం ఆ భక్తునికి వరం ప్రసాదిస్తూ 'వసంతా! నీవు వీక్షించడానికి ఆరాటపడే శ్రీలక్ష్మి నీకు మరుజన్మలో కూతురిగా లభిస్తుంది. నీవు నిర్వహించిన అర్చన సేవల కారణంగా మరుజన్మలో నీవు శ్రీవిల్లిపుత్తూరులో విష్ణుచిత్తునిగా జన్మించి శ్రీరంగనాథుని భక్తునిగా ప్రఖ్యాతి చెందుతావు. నీ భక్తినే నాపై అనురక్తిగా చేసుకొని నీ కూతురిగా పెరిగిన శ్రీలక్ష్మి నన్ను కీర్తిస్తూ ప్రబంధాన్ని రచించి తరిస్తుంది' అని తెలిపాడు. అలా ఒక భక్తుని ఆరాటాన్ని తొలగించడంకోసం చూడికొడుత్త నాచ్చియార్‌ అవతరించిందని చెబుతారు. ఆండాళ్‌ (చూడికొడుత్త నాచ్చియార్‌) పసివయస్సులోనే పరిమళించిన వికసిత భక్తి కుసుమం.

 తెలుగు పండగలు- దేవుళ్ళు అనే బ్లాగు సౌజన్యంతో నా ఈ టపా....

 సర్వం శ్రీసాయినాధార్పణ మస్తు