Saturday, December 15, 2018 0 comments By: visalakshi

ఆత్మవిశ్వాసం

 ఓం శ్రీ గురుభ్యో నమ: 

శ్లో"మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే!
    యతతామసి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వత:!!

భా-వేలకొలది మనుష్యులలో ఒకానొకడు పూర్వపుణ్య విశేషముచే ఆత్మజ్ఞానసిద్ధి కొరకు ప్రయత్నము చేయుచుండును. అట్లు ప్రయత్నము చేయుచు సిద్ధిని పొందిన వారలలో సహితము ఏ ఒక్కడో నన్ను యధార్ధముగా తెలిసికొనుచున్నాడు.   



ఎల్లప్పుడూ బాబా స్మరణతో ఉంటూ ఆధ్యాత్మిక స్ఫురణలో   "ఆత్మవిశ్వాసం"
అనే ఈ కధనాన్ని అందరికీ పంచుతున్నాను.. రమణ మహర్షులను తెలియనివారుండరు.. కానీ వారి భక్తుల గురించి కొందరికే తెలియవచ్చును.
రమణమహర్షి ముఖ్య ఉపదేశం:-

"లోనికి చొచ్చుకుపో నిర్విరామంగా ఆలోచనలను అల్లే మనస్సు యొక్క మూలాన్ని అన్వేషించు, ఎగసిపడే భావాలని తిరస్కరించి అన్నిటికీ మూల భావంపై ధ్యాస నిలుపు. ఆ మౌనంలో విశ్రమించు. నీ ప్రయత్నం అంతవరకే. ఆ పైన జరిగేదే అనుభవం, సాక్షాత్కారం. అది మాటలకు అందదు." ఆ ఆనందధామాన్ని ఆత్మవిశ్వాసంతో కొద్దిమందే చేరారు.


రమణాశ్రమంలో మహర్షి భక్తురాలు ఒకామెని అందరూ ఎచ్చెమ్మాళ్ అంటారు. ఆమె అసలుపేరు లక్ష్మీ అమ్మాళ్. అతిచిన్న వయసులోనే ఆమే శోకమయ జీవితాన్ని అనుభవించారు. 25సం"లు వచ్చేసరికి ఒకరి తరువాత ఒకరుగా భర్త, కొడుకు, కూతురు పోయారు. తగిలిన దెబ్బలవలన ఆమె మనస్సు అస్తవ్యస్తమయింది."తన" గురించి ఆలోచించుకునే శక్తిని కోల్పోయింది. ఆమెకు ఎటు చూసినా నిరాశే,అంధకారమే. ఆమె మనశ్శాంతి కోసం ఎందరో సాధువులను కలుసుకుంది. కానీ ఎవ్వరూ ఆమె దు:ఖభారాన్ని తీసేయలేకపోయారు. మహాయోగుల అనుగ్రహం పొందాలన్న ఆమె మానసిక వ్యధను గమనించిన ఆమె బంధువులు,హితులు తిరువణ్ణామలైలో కొండపై ఉన్న యువకుడి గురించి చెప్పారు. వయసులో చిన్నవాడేఅయినా గొప్పయోగి అనీ, మౌనస్వామి అని, విశ్వాసంతో ఆయనను దర్శించుకున్న వారెందరో లబ్ధిపొందారనీ ఈమె కూడా ఆయనను దర్శించుకుంటే తిరిగి రాకపోవచ్చుననీ..ఈమాటలు విన్న ఎచ్చమ్మాళ్ తిరువణ్ణామలైకి ప్రయాణమయింది. ఒక స్నేహితురాలితో కొండెక్కి మహర్షిని చూసింది. ఆయన పలుకకుండా నిశ్చలంగా కూర్చుని యున్నారు. ఆయన సమక్షాన ఒక గంటసేపు మౌనంగా నిలబడింది. ఆ ఆశ్రమాన్ని విడవాలనిపించలేదు. ఎట్టకేలకు బలవంతంగా అక్కడ నుండి బయటపడి కొండ దిగువన ఉన్న స్నేహితురాలి ఇంటికి చేరుకుంది. మహర్షి అనుగ్రహం వల్ల తనని పీడిస్తున్న శోకం మాయమైందని స్నేహితురాలితో చెప్పింది. ప్రతిరోజూ ఆమె ఆశ్రమానికి వెళ్తుండేది. కొన్నాళ్ళకి గతించిన తన వారిగురించి, కన్నీరు కార్చకుండా..మనస్సులో విషాదచ్చాయలైనా లేకుండా మాట్లాడగలిగేది. తనలో ఆ శోకసముద్రం ఎలా పోయిందో, తన అంతరంగంలో ప్రశాంతత ఎలా నెలకొన్నదో ఆమె చెప్పలేకపోయేది. ఆమెకి తెలిసిందల్లా ఒక్కటే. అదంతా కొండమీద నెలకొన్న మహర్షి అనుగ్రహంవల్ల, కరుణ వల్ల మాత్రమే!.

 "మహర్షిని నేను అభిమానిస్తాను, గౌరవిస్తాను, ఆరాధిస్తాను" అని మాత్రమే అనగలిగేది ఆమె. అప్పటినుండి ఆమె ప్రతిరోజూ మహర్షికీ, ఆయనను దర్శించటానికి వచ్చేవారికి భోజనం వండి కొండమీద వారెక్కడున్నా వెళ్లి వారికి సమర్పించి, వారు తినగా మిగిలిన దానిని అతి భక్తితో స్వీకరించేది. తన రక్షకుడు మహర్షి అని ఆయనను వీడరాదని నిశ్చయించుకుంది.తండ్రి సోదరుడూ పంపిన పైకాన్ని నిస్సంకోచంగా ఆమె మహర్షి కొరకూ,వారి అనుగ్రహం కొరకూ వెచ్చించింది.ఆమె లేమిలో గడిపినా సర్వస్వమూ ధారపోసింది. మహర్షి భక్తులకు,అతిధులకు ఆమె నివాసం ఆశ్రయమయింది. ప్రతిఫలంగా ఆమెకు మనశ్శాంతి. ప్రగాఢమయిన విశ్వాసము లభించాయి. తనకి సంభవించిన మంచి చెడులను ఆమె మహర్షికి విన్నవించుకొనేది.వారు ఆమె భక్తిని మెచ్చుకొనేవారు. సుఖదు:ఖాలకు స్పందించేవారు. తననాశ్రయించిన భక్తులందరిపట్ల ఆయన అలాగే ఉండేవారు...



మహర్షి అనుమతితో ఆమె సెల్లమ్మాళ్ అనే ఒక అమ్మాయిని పెంచుకొంది.ఆ అమ్మాయికి వివాహం చేసి మనవడు పుట్టినపుడు ఎంతో సంబరపడింది. ఆ పసివాడికి 'రమణ' అని మహర్షి పేరునే పెట్టుకొంది. కాని విధివశాత్తూ ఆమె కూతురు మరణవార్త తంతి ద్వారా అల్లుడు తెలిపాడు. ఏ అస్వస్థత లేకుండా కూతురు హఠాత్తుగా మరణించడం అన్న వార్త ఆశనిపాతంలా తగిలింది. దు:ఖాన్ని దిగమింగుకొని కొండపైకి వెళ్ళి తంతిని మహర్షికి చూపింది. దానిని చదివి కంట తడి పెట్టుకున్నారాయన. ఎచ్చమ్మాళ్ గ్రామానికి వెళ్ళి కూతురు అంత్యక్రియలు జరిపి మనవడు రమణను తీసుకొని వచ్చింది. తనకీ తన మనవడికీ ఆశ్రయం మహర్షే. ఆయన చేతుల్లో మనవడిని పెట్టింది. ఆమె ఎలా గుండె నిబ్బరం చేసుకుందో గ్రహించారాయన. ఇప్పుడామె మహర్షిపైనే ఆశలన్నీ పెట్టుకుంది. పూర్వం వలె దు:ఖపు తుఫాను ఆమెను పెకిలించివేయలేదు. ఆమెకు గల ఆత్మ విశ్వాసానికి ప్రతిఫలమే ఆమె  తేరుకోగలగటం. మనశ్శాంతిని పున:ప్రతిష్ఠించుకోగలగటమూను!.


 ఇక ఎచ్చమ్మాళ్ ఆధ్యాత్మిక ప్రగతికి వస్తే - నిస్వార్ధమైన సేవద్వారా తనకి మోక్షప్రాప్తి జరుగుతుందని ఆమె 'దృఢవిశ్వాసం'. యోగాభ్యాసంలో ఒక గురువు ఆమెకు మనస్సుని ఏదో ఒక భావంపై కేంద్రీకరించడం ఎలాగో నేర్పారు. ఆ ప్రక్రియలో కొంత సాధన చేసిందామె. తన నాసికపై కేంద్రీకరించటం అలవర్చుకున్నది. కాంతిపుంజమేదో తనకి మనోదృశ్యంగా తోచేది. దానిపైనే మనసు నిల్పి కొన్ని రోజులపాటు ఆ దృశ్యాన్నే ధ్యానించేది.ఒక్కొక్కసారి దేహస్పృహ లేకుండా 24గంటలూ ఆమె నిశ్చలంగా ఉండగలిగేది.ఈ సంఘటనలన్నీ మహర్షికి ఎవరో చెప్పేవారు.వారు మిన్నకుండేవారు. చివరికి ఆమే తన అనుభవాలని చెప్పగా ఆయన ఆ అభ్యాసాలను మానమని చెప్పారు. "నీకు కనబడే ఆ జ్యోతులు నీ గమ్యం కావు. నీవు నీ నిజతత్వాన్ని తెలుసుకోటానికే ప్రయత్నించాలి గానీ అంతకంటే తక్కువదేమీ కాదు"

 'మన ఆలోచనలన్నీ మౌనం దాల్చి భావరాహిత్య స్థితిని చేరుకోవాలి.మన ప్రధాన్యతలూ ఇష్టాఇష్టాలు మన ముందుకు రాకూడదు. మనకు లభించిన అంతరాదేశాల ప్రకారం నడుచుకుంటే అదే యోగం. అపుడా జీవితమంతా యోగమే అవుతుంది. మనలో మనది కాని ఏదో శక్తి మనద్వారా పనిచేయడం గమనంలోకి వస్తుంది. ఒక విధమైన నిశ్చలతత్వం,ఆనందం మనకు అనుక్షణం అనుభూతం అవుతాయి. అందుకే అంతటా ప్రశాంతంగా మౌనంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. సమర్పితభావంతో ఆత్మ విశ్వాసంతో నీలో నన్ను సాక్షాత్కారం పొందు ' అని మన హృదయవాసి చెప్పకనే చెప్పాడు.
 ఫలితంగా తనకి సంతోషదాయకమైన యోగాభ్యాసాలను ఆమె విరమించుకొంది. మహర్షి నిర్దేశించిన లక్ష్యాన్ని ఆమె చేరుకోలేకపోయినా ఆయన తనకు రక్షకుడన్న అకుంఠిత విశ్వాసమూ,ఆయన గురించి నిరంతర చింతా ఆమెకుండేవి అలా మహర్షిని ఎప్పుడూ తలచుకోవటం వల్ల కొన్ని ఆధ్యాత్మిక అనుభూతులు ఆమెకు కలుగుతుండేవి. 



 మహర్షి దర్శనార్ధమై ఒక పండితుడు వచ్చాడు. విరూపాక్ష గుహవద్ద ఈ పండితుడు మహర్షితో మాట్లాడుతుండగా ఎచ్చమ్మాళ్ వణుకుతూ అచటికి వచ్చి నిలిచింది. కారణమేమిటని ప్రశ్నించగా ఆమె తనకు అప్పుడే కలిగిన అనుభవాన్ని వివరించింది.సద్గురు స్వామి గుహ ప్రక్కగా ఆమె కొండనెక్కవలసి వచ్చింది. ఆమె అలా నడుస్తూ వెనుకకు తిరిగి చూసినప్పుడు ఆమెకిద్దరు మనుష్యులు కనబడ్డారు. అందులో ఒకరు రమణమహర్షి,రెండవ ఆయన అపరిచితుడు.ఆమె కొండనెక్కడం కొనసాగిస్తుండగా ఆమెకొక వాణి వినిపించింది. "ఇక్కడ ఉండగా, పైకి ఎక్కటమెందుకు?"అని. వారు కనబడ్డ ప్రదేశం వైపు ఆమె తిరిగి చూడగా అక్కడగానీ,ఆ పరిసరాలలో గానీ ఎవ్వరూ లేరు.ఆమెకు భయం కంగారు కలిగి వణికిపోతూ కొండనెక్కి మహర్షి ఆశ్రమాన్ని చేరుకుంది. ఎచ్చమ్మాళ్ చెప్పిన ఈ వివరాలకి ఆ పండితునకు ఎంతో అసూయ కలిగి  "స్వామీ ఇక్కడ నాతో మాట్లాడుతూనే ఉండి,మీరు ఆమెకు మీ రూపాన్ని దర్శనమిచ్చ్హారు. మీ అనుగ్రహ చిహ్నమేమీ నాకు ఇప్పించలేద"న్నాడు. మహర్షివారు ఆమె ఎల్లప్పుడూ (మహర్షి)తన గురించే చింతిస్తూండడంవల్ల అటువంటి మనోదృశ్యం ఆమెకు గోచరించిందని చెప్పారు. మహర్షి పైనే ధ్యాస గల అనేకమంది భక్తులకు ఇటువంటి అనుభవాలు కలుగుతూనే ఉండేవి. అందరికీ ఆయన ఒకే హెచ్చరికను సలహాను ఇచ్చేవారు. 'అటువంటి అనుభూతులలో లీనమైపోకూడదనీ, వాటి గురించి సంతోషముతో ఉప్పొంగిపోకూడదనీ జీవిత పరమావధి ఆత్మజ్ఞానము ఒక్కటే! 'నిజతత్వాన్ని మరువకుండా "నేనెవరిని" అన్న ప్రశ్న వేసుకోవడమే మానసిక సంకల్పం వల్ల జరుగుతుంది.   నేను ఈ దేహాన్ని,మేధనీ, కోర్కెలనీ కాను అని గ్రహిస్తే .. 
ఆ శోధన  చెయ్యాలన్న దృక్పధమే నీ అంతరాంతరాలలో నుంచి సమాధానాన్ని చెప్పిస్తుంది. అప్పుడు సత్యం నీలోనుండి సూర్యరశ్మి వలె ప్రకాశిస్తుంది. "నేను"అనుభవంలోకి వచ్చి అనుభూతి చెందడం స్వామి ఉపదేశించిన   సాక్షాత్కారం. 

 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు 




  





    
Thursday, September 6, 2018 2 comments By: visalakshi

మధుర భక్తి

                                                ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమ:





భక్తిలో "భగవత్ప్రేమ" అనేది పరాకాష్ట. భగవద్దర్శనమైన తర్వాత భక్తుడు భగవంతుని విరహాన్ని క్షణకాలం కూడా సహింపజాలడు. ఈ వియోగము భగవత్ప్రేమ ద్వారా వెల్లడి యై ప్రకాశిస్తుంది. గోపికలు భగవంతుడైన శ్రీకృష్ణుని ఆత్మేశ్వరునిగా భావించి అనిర్వచనీయమైన నిర్మలభక్తిని చాటారు. గోపికలు కృష్ణ విరహమును ఒక్క తృటికాలమైననూ సహింపలేకపోయేవారు. గోపికలు అంటే జీవులు....కృష్ణుడంటే పరమేశ్వరుడు. రాసక్రీడ అంటే జీవాత్మ పరమాత్మల తాదాత్మ్యమే. గోపికా విరహమంటే ఈశ్వర సాయుజ్యం కోసం జీవుడు పడే వేదన.  శ్రీకృష్ణుడు నిష్టూరాలాడడం, దాగిఉండడం, ఏడిపించడం ఇవన్నీజీవునికి పరమేశ్వరుడు పెట్టే పరీక్షలు. సగుణ భక్తులు నిర్మల భక్తులుగా కావడానికి భగవంతుడు వారికి చేసే దోహదము.  శ్రీకృష్ణ లీలలన్నీ  ఆధ్యాత్మికరహస్య భావనలతోనే అర్ధం చేసుకోవాలి. గోపికా వస్త్రాపహరణమంటే ....శరీరమే ఆత్మ అనే అపోహ, దేహంపై అభిమానాన్ని లేకుండా చేయడం కోసం ప్రయత్నించమని చెప్పడానికి సంకేతం. "ఈశ్వరస్సర్వ భూతానా" మనే పరమసత్యాన్ని వస్త్రాపహరణమనే సంకేతం ద్వారా  తెలుపుచున్నాడు. 

భగవంతునికి సంబంధించిన తత్వములో బాహ్యార్ధము అపహాస్యంగా తీసుకోరాదు. సాధారణ కవి కూడా భగవత్కధలలో శృంగార వర్ణనము కేవలము బాహ్యార్ధంతో చేయడు. ప్రతి కధనం యొక్క ప్రయోజనము మోక్షప్రాప్తియే. కావున ఈ గోపికా కృష్ణలీలలన్నీ జీవ పరమేశ్వర సంకేతాలే. భారత సంస్కృతిలో మధుర భక్తి భావనకు పరాకాష్ఠ ఈ గోపికా కృష్ణలీలలు.  భక్తి పరాకాష్ఠ పొందిన భక్తుని విరహం భగవంతుని కొరకు ఇలాగే ఉంటుంది. జయదేవుని గీత గోవిందంలోని వర్ణనలు కూడా ఈ కోవకు చెందినవే. మొదట లౌకిక దృష్టితో అర్ధం చేసుకున్నా చివరికి బుద్ధి వికసించి అలౌకికమైన దివ్య సోపానాలకు ద్వారం తెరుస్తుంది. ఈ గోపికలు హరి పూజార్ధము భూమిమీద జనియించిన సుందర సురకన్యలే కదా! 



దేహింద్రియ మనోబుద్ధులు అన్నీ కలిసినప్పుదే మనకు భక్తి భావన కలుగుతుంది. మనసులో నామము జపము చేస్తూనే దేహముతో భగవంతుని సూత్రాలకు విరుద్ధంగా ఉండే పనులు చేయడం బుద్ధితో వక్ర పనులను చేయడం ఇవన్నీ భక్తి భావనకు భంగం కలుగజేస్తాయి. పూజాగృహములో కొంతసేపు జపము చేసి బయట అందరినీ మోసం చేసే పనులు చేయటం భక్తి అనిపించుకోదు. భక్తుడు దేహ ఇంద్రియ మనోబుద్ధులతో భగవంతుని ధ్యానిస్తూ ఉంటాడు. దేహము కానీ, బుద్ధిగానీ, మనస్సుగానీ ఏ ఒక్కటి సహకరించకపోయినా భక్తి కుదరదు. విభక్తము కానిది భక్తి. భగవంతుడు ప్రతి సాధకునికి 35 సూత్రాలను భక్తుని లక్షణాలుగా చెప్పాడు. 



నిర్దేషుడు, సర్వభూతాలకు మిత్రుడు, కరుణాళువు, నిర్మోహము కలవాడు, నిరహంకారుడు, సుఖ దు:ఖములను సమానంగా చూసేవాడు, సహనశీలుడు, నిత్యసంతుష్టుడు, యోగయుక్తుడు ఆత్మనిగ్రహము కలవాడు, దృఢనిశ్చయము కలవాడు, మనోబుద్ధులను అర్పించినవాడు, ఎవరి వలన లోకములో బాధ జనింపదో లోకముచే ఎవడు బాధపడడో అటువంటివాడు,...ఇత్యాది లక్షణాలతో...

బృందావనంలో ‘రాధాకృష్ణుల రాసలీలలు కన్నుల పండుగగా జరుగుతుంటాయి! పదహారు వేలమంది గోపికలతో, రాధతో యమున ఒడ్డున బాలకృష్ణుడు ‘రాసలీల’ జరిపి గోపికలను ఆనందపరవశులను చేయడం, ఆత్మ - పరమాత్మల సమ్మేళనలోని అంతరార్థాన్ని తెలియచేసేందుకై ఆయన ఈ బృందావనాన్ని రంగస్థలంగా చేసుకొన్నాడు. రాసక్రీడను నిమిత్తమాత్రంగా చేసుకుని, గోపికల్లోని శారీరక మోహావేశాన్ని, ఈర్ష్యాసూయల్ని గోపాలుడు నావాడే అన్న స్వార్థాన్ని, అహంకారాన్ని తొలగించి శాశ్వతమైన పరతత్వంలో మమేకం కావడం అంటే ఏమిటో తెలియజేయడమే ఈ రాసలీలల్లోని అంతరార్థం.

యోగమాయ సహకారంతో ప్రతి వొక్క గోపికకి ఒక్కో కృష్ణుని సృష్టించి గోపాలుడు తనకే స్వంతం అనే భావనను కలుగజేసి ఆనందంలో ముంచెత్తడంతో వైష్ణవ భక్తకవులు, జయదేవుడు, సూరదాసు స్వామి హరిదాసు, గోవిందస్వామి మొదలైనవారంతా శ్రీకృష్ణ పరమాత్మ ప్రవచించిన తాత్విక సారాన్ని భక్తజనులకు సరళమైన రీతిలో గీతాల రూపంలో  అందించారు. కాళీయమర్దనం, పూతనవధ, దామోదరలీలలు ... ఇలాంటి శ్రీకృష్ణుని లీలలను మనసార స్మరించుతూ  కృష్ణనామాన్ని జపించినవారు శ్రీ కృష్ణ సాయుజ్యాన్ని పొందుతారు.









      











     


Friday, August 31, 2018 14 comments By: visalakshi

నామకరణం



ఓ ...
వ్యక్తి, వృక్షం, పుష్పం, ఫలం, పత్రం, పక్షి, జంతువు, తిధి, నక్షత్రం, వారం, పక్షం, మాసం, సంవత్సరం ... ఒకటని ఏముందీ .....  ఎవరిని గుర్తించాలన్న, దేనిని గుర్తించాలన్న, వారికి, వాటికి ఓ పేరు అత్యావశ్యకం.  
అందుకే మన పూర్విజులు చాలావరకు అన్నింటికీ పేర్లు పెట్టారు. 
మనం - పశుపక్ష్యాదులు, వృక్షాదులకంటే, మేధ మనోబుద్ధ్యాది స్థాయిలో భిన్నం కాబట్టి, మన మన సంతతికి మనల్నే నామకరణం చేయమనే సంప్రదాయకంను నిర్ధేశించారు. 

సమాజహితం కై భారతీయ సంస్కృతిలో కొన్ని సంప్రదాయాలు నిర్ధారించబడ్డాయి. ఆ సంప్రదాయాలన్నీ మనల్ని సంస్కరించాడానికే. అందుకే ఈ సంప్రదాయాలనే సంస్కారాలుగా  ఋషులు తెలిపారు. 
సంస్కారమంటే - 
సంస్ర్కియతే జ్ఞానయోగ్యతామాపాద్యతే / పురుషస్య చిత్తమనేనేతి సంస్కారః
చిత్తదోషాలను శమింపజేసి, ఆ చిత్తాన్ని ఆత్మతత్వజ్ఞానానికి అర్హమైనదిగా చేయడమే సంస్కారం.
సంస్కారస్య గుణాధానేన వా స్యాద్దోషాపనయనేన వా ...
సంస్కారాలలో కొన్ని దోషాలను పోగొట్టేవి, మరికొన్ని దోషనివృత్తి, గుణ సంపాదనకై ఉన్నాయని శంకర భాష్యంలో శంకరాచార్యులవారు తెలిపారు.

ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగడానికి ఎన్నెన్నో అవరోధాలు. ఆ అవరోధాలకు కారణం అనేకం. అందులో కొన్ని ప్రారబ్ధానుసారం ప్రాప్తించేవి. మునుపటి జన్మల పాపాలు ఈ జన్మలో ప్రతిబంధకాలు కావొచ్చు. అందుకే అటువంటి ప్రతిబంధకాలను చాలావరకు నివారించడానికి, మనల్ని సంస్కరించడానికి కొన్ని సంస్కారాలను ప్రతిపాదించారు. మన స్మృతికారులు ఈ సంస్కారాలను షోడశ (పదహారు) సంస్కారాలుగా పేర్కొన్నారు. అందులోనివే జాతకర్మ, నామకరణం సంస్కారాలు. సాంప్రదాయబద్ధంగా వేదవిహితంగా సంస్కార విధులలో చెప్పినవిధంగా ముందుగా శిశువునకు జాతకర్మ ( దీనినే బాలసారె గా కొందరు వ్యవహరిస్తారు) చేయడం జరుగుతుంది.
జాతకర్మ -
మంత్రోచ్ఛారణ జరుగుతుండగా శిశువుల నాలుకకు బంగారంతో అద్దిన నెయ్యిని, తేనెను తండ్రి తాకిస్తాడు. ఈ జాతకర్మ సంస్కారం వలనపుట్టుకతో సంక్రమించిన బాలారిష్టాది దోషాలు, తల్లి తండ్రుల స్థూల శరీరముల నుండి కలిగిన అనేక (వాత కఫ మున్నాది దోషాలు) దోషాలు తొలగిపోవును.ఈ సంస్కార నిర్వాహణ ప్రభావముచే శిశువులకు దీర్ఘ యుష్యం, సర్వవిధ సంపత్సమృద్ధి ప్రాప్తించునని శాస్త్ర వచనం. 

నామకర్మ -
వామాఖిలస్య వ్యవహార హేతః శుభావహం సుభాగ్య హేతుః
నామ్నైవ  కీర్తిం లభతే మనుష్యస్తతః ప్రశస్తం ఖలు నామ కర్మః 
వ్యవహార హేతువు, శుభావహమైనది, కీర్తికారక మగు నామకర్మ ప్రశస్తమైనది. 

జాతకర్మ అనంతరం, గణపతిపూజ, పుణ్యాహవాచనమైన తరువాత నామకరణ సంస్కారంను ప్రారంభిస్తారు. ఓ పళ్లెంలో బియ్యం పోసి, తండ్రిచే దక్షిణ దిశనుంచి ఉత్తరదిశకు మూడు గీతలు గీసి, ముందు శ్రీకారం రాయించిమొదటిగడిలో బిడ్డ పుట్టిన మాసము ప్రకారం వచ్చిన పేరును, రెండవ గడిలో నక్షత్రంను బట్టి వచ్చిన పేరు, మూడవ గడిలో వ్యావహారిక నామం రాయపించి, నామకరణ విధి మంత్రాల నడుమ "అగ్నిరాయుష్మాన్... కరోమి" (అగ్ని సమిత్తులచే, చంద్రుడు ఓషదుల రసరూపమైన అమృతముచే, యజ్ఞము దక్షిణలచే, బ్రహ్మము బ్రాహ్మణులచే, దేవతలు అమృతముచే ఆయుర్దాయము కలవారైరి. అటువంటి ఆయుర్ధాయ మంత్రంచే  దీర్గాయుష్మంతునిగా ఆశ్వీరదిస్తూ ) మంత్రాన్ని జపిస్తూ, శాస్త్రోక్తముగా పూజా, జప, హోమ, దానాదులుతో  ఈ రెండు సంస్కారాలను శాస్త్రోక్తంగా వేద పురోహితులవారి ఆధ్వర్యమున నిర్వర్తిస్తారు.   

ఈ నామకరణ సంస్కారమెందుకంటే - 
తస్మాత్పుత్రస్య జాతస్య నామ కుర్యాత్, పాప్మానమే వాస్య తదపహన్తి
అపి ద్వితీయం తృతీయం, అభిపూర్వ మేవాస్య తత్పాప్మాన మపహన్తి 
అని శ్రుతి చెప్పింది. 

నామకరణ ప్రయోజనం :- 
ఆయుర్వచోభివృద్ధిశ్చ సిద్ధిర్వ్యవహృతే స్తథా 
నామకర్మ ఫలంత్వే తత్ సముద్దిష్టం మనీషిభిః 
ఆయుష్షు, వర్చస్సు, వ్యవహారసిద్ధి కలిగేందుకు ఈ సంస్కారాన్ని చేస్తారు. జన్మించిన దగ్గర నుండి కొన్ని మాలిన్యాలు శిశువుకు అంటుకునే ఉంటాయి. ఈ సంస్కారాలవలన  జన్మాంతర దోషాలు తొలగి మానవ జీవిత లక్ష్యం సిద్ధిస్తుంది.
అందుచే నామకరణోత్సవం జరుపుతారు.