Saturday, October 31, 2015 0 comments By: visalakshi

ముభావం

 "ముభావం" ఒక భావం, ఏమిటాభావం?  ఒక వ్యక్తితో మాట్లాడడం మానేసి ఆ వ్యక్తిపై మనకున్న అయిష్టాన్ని కనబరచడమే ' ముభావం ' .

 మనం ఇతరులతో ముభావంగా ఉన్నప్పటికంటే ఇతరుల ముభావానికి మనం లోనైనప్పుడు మనసుకు చాలా కష్టంగా  ఉంటుంది.నేటి సమాజంలో ' ముభావం ' వలన కలిగే విపరీత పరిణామాలు అందరికీ విదితమే!

  " ముందు మనకు మనం మంచిగా ఉంటే అప్పుడు మన చుట్టూ ఉన్న లోకమంతా మంచిగా కనిపిస్తుంది.ఇతరులలో ఉండే మంచిని మాత్రమే అప్పుడు మనం చూస్తాము. మనం చూసే బాహ్య ప్రపంచం మన ప్రతిబింబమే.ఇతరులను తప్పు పట్టే అలవాటు మానుకుంటే మనల్ని ద్వేషిస్తున్న వారు కూడా మనల్ని స్వీకరించడం మనం చూస్తాం. మన మానసిక స్థితిని బట్టి,మానసిక పరిపక్వతను బట్టి ఇతరులు మనతో మెలగుతారు."

             స్వామి వివేకానంద జీవితంలో ఒక సంఘటన:-

 నరేంద్రుడు (స్వామి వివేకానంద) శ్రీరామకృష్ణుల ప్రియతమ శిష్యుడని అందరికీ విదితమే. అతడు తరచూ దక్షిణేశ్వరం వెళ్ళకపోతే రామకృష్ణులు తల్లడిల్లిపోయేవారు.కొన్ని సమయాలలో స్వయంగా ఆయనే నరెంద్రుణ్ణి వెతుకుతూ వెళ్ళేవారు, నరేంద్రుణ్ణి చూస్తే చాలు భావపారవశ్యం పొందేవారు. కానీ ఒకసారి ఈ పరిస్థితి తలక్రిందులైంది. నరేంద్రుడు వచ్చినప్పుడల్లా శ్రీరామకృష్ణులు ముభావంగా ఉండేవారు. అతని రాకను పట్టించుకోనట్లే ఉండేవారు. అయినప్పటికీ నరేంద్రుడు శ్రీరామకృష్ణులకు ప్రణమిల్లి ఆయన ముందు కూర్చునేవాడు. శ్రీరామకృష్ణులు నరేంద్రుణ్ణి కనీసం కన్నెత్తి కూడా చూసేవారు కాదు.  

 ఈ విధంగా ఒక నెలకు పైగా గడిచింది. నరేంద్రుడు మామూలుగానే దక్షిణేశ్వరానికి వస్తూవుండడం గమనించిన శ్రీరామకృష్ణులు చివరకు ఒక రోజు అతణ్ణి పిలిచి "ఏం నాయనా! నేను నీతో ఒక్క మాట కూడా మాట్లాడడంలేదే!అయినప్పటికీ నువ్వెందుకు నావద్దకు వస్తున్నావు?"అని అడిగారు. అందుకు నరేంద్రుడు,"మీమాటలు వినడానికా వస్తున్నాను? నేను మిమ్మల్ని అభిమానిస్తున్నాను.మిమ్మల్ని చూడాలని అనిపిస్తుంది. అందుకే వస్తున్నాను."అని జవాబిచ్చాడు. దానికి శ్రీరామకృష్ణులు "నిన్ను పరీక్షించి చూసాను.నీలాంటి దృఢచిత్తులే ఇంత అవమానాన్ని,ముభావాన్ని దిగమింగుకోగలరు.మరొకరైతే ఎప్పుడో పలాయనం చిత్తగించేవారు" అన్నారు 

  మనం నిత్యం ఎంతోమందితో కలిసిమెలిసి మెలగవలసి ఉంటుంది, పనిచేయవలసి ఉంటుంది.కాబట్టి ఒకరికొకరు ఎడముఖం-పెడముఖంగా ఉంటూ అస్తమానం అలుగుతూ ఉంటే ఏపనీ సవ్యంగా చేయలేము. భగవంతుడు పెట్టే పరీక్షలో మనం నెగ్గాలంటే మానసిక పరిపక్వతతో కూడిన ' గురుభక్తి-ఇష్టనిష్ఠ ' అలవరచుకోవాలి.

 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు
Sunday, October 11, 2015 0 comments By: visalakshi

నారాయణ ఉపనిషత్ భావము

ఓం శ్రీ నారాయణాయ నమో నమ: 





 1.నారాయణుడే ఆది పురుషుడు. ఇది సత్యము.నారాయణునకు ప్రజలను సృష్టించవలెనను కోరిక కలిగినది .అపుడు మొదటగా నారాయణుని నుండి ప్రాణము(ప్రాణవాయువు)ఉద్భవించినది.ఆ తరువాత మనస్సు,ఇంద్రియములు,మరియు ఆకాశము,వాయువు, అగ్ని,జలము,భూమి వీటన్నింటికీ అధారమైన విశ్వము ఉద్భవించినవి. నారాయణుని నుండి బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు ప్రజాపతులు ఉద్భవించిరి.నారాయణుని నుండి ఆదిత్యులు(12) రుద్రులు(11)  వసువులు(8) ఉద్భవించిరి.మరియు వేద చందస్సు ఉద్భవించినది. ఇవన్నియూ నారాయణుని యందే పుట్టుచున్నవి.ప్రవర్తిల్లుచున్నవి. నారాయణునియందే విలీనమగుచున్నవి. ఇది ఋగ్వేద ఉపనిషత్తు.

 2.నారాయణుడు శాశ్వతుడు. నారాయణుడే బ్రహ్మ. నారాయణుడే శివుడు. నారాయణుడే ఇంద్రుడు. నారాయణుడే కాలుడు(మృత్యుదేవత).నారాయణుడే ఉర్ధ్వ-అధోదిక్కులు.లోపల వెలుపల (శరీరములోనున్న-బయటనున్న)ఉన్నది నారాయణుడే. సర్వము నారాయణుడే.ఇది సత్యము. భూతభవిష్యత్ వర్తమానములు నారాయణుడే. విభాగములు లేక ఒక్కటిగా నున్నది నారాయణుడే. 
సర్వమునకు ఆధారభూతుడు,దోషరహితుడు,భావింపశక్యముకానివాడు,వర్ణింపనలవికానివాడు, పవిత్రుడు, దివ్యుడు అయిన దేవుడు నారాయణుడు ఒక్కడే. ఆ నారాయణుడే విష్ణువు. ఆ నారాయణుడే సర్వవ్యాపి అయిన విష్ణువు. ఇది యజుర్వేద ఉపనిషత్తు.

3."ఓం" అని మొదటగా ఉచ్చరించవలెను. తరువాత "నమ:" అని ఉచ్చరించవలెను.తరువాత "నారాయణాయ" అని ఉచ్చరించవలెను."ఓం" అనునది ఏకాక్షరము."నమ:"అనునది రెండక్షరములు. "నారాయణాయ"అనునది ఐదక్షరములు.ఈ విధముగా నారాయణుడు "ఓం నమో నారాయణాయ"అను అష్టాక్షరి మంత్రముగా రూపుదిద్దుకొనినాడు.

ఈ అష్టాక్షరి మంత్రమును పఠించుట వలన సర్వారిష్టములు తొలగును.సంపూర్ణ ఆయురారోగ్యములు సిద్ధించును.

సంతానము, యశస్సు, ధనము, గోగణములు వృద్ధి చెందును. ఆ తరువాత అమృతత్వము(ముక్తి)సిద్ధించును.ఇది సత్యము. ఇది సామవేద ఉపనిషత్తు. 





4.పురుషుడైన నారాయణుని ప్రణవస్వరూపమైన ఓంకారమును పఠించుట వలన సంపూర్ణమైన ఆనందం కలుగును.ఓంకారము అకార,ఉకార,మకారములతో ఏర్పడినది.ఎవరు సదా ఓంకారమును ఉచ్చరింతురో వారు(యోగి)జన్మసంసార బంధముల నుండి విముక్తులగుదురు."ఓం నమో నారాయణాయ" అను అష్టాక్షరీ మంత్రమును ఎవరు ఉపాసింతురో వారు శ్రీమన్నారాయణుని వైకుంఠమునకు చేరుదురు.అది పరమ పురుషుని హృదయకమలం.అది ఇంద్రియాతీతమైన విజ్ఞానముతో నిండియున్నది. కారణముచే ప్రకాశించుచున్నది.

దేవకీపుత్రుడైన శ్రీకృష్ణుడు బ్రహ్మము. మధువు అను రాక్షసుని చంపిన విష్ణువు బ్రహ్మము. పుండరీకాక్షుడు బ్రహ్మము; అచ్యుతుడు బ్రహ్మము.ఓంకారమే బ్రహ్మము. సర్వభూతములలో ఒక్కడుగా నున్నది నారాయణుడే. కారణరూపమైన అకారపరబ్రహ్మమే ఓంకారము.ఇది అధర్వణవేద ఉపనిషత్తు.


నారాయణ ఉపనిషత్తును ఉదయ,మధ్యాహ్న,సాయం సమయముల ఎప్పుడైనను పఠింతురో వారు పంచమహాపాతకములనుండి ,ఉపపాతకముల నుండి విముక్తులగుదురు.మరియు వారికి సర్వవేదములు పారాయణ చేసిన పుణ్యము లభించును.నారాయణ సాయుజ్యము(మోక్షము) లభించును.ఇది సత్యము.అని ఉపనిషత్తు ఉపదేశించుచున్నది.

నారాయణుడు అవ్యక్తము కంటే అతీతుడు. అవ్యక్తమునుండే ఈ బ్రహ్మాండము పుట్టినది. ఈ బ్రహ్మాండములోనే పదునాల్గు లోకములు, సప్తద్వీపములు,భూమి ఉన్నాయి.

ఓం శాంతి: శాంతి: శాంతి:.

సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు  




Friday, October 9, 2015 0 comments By: visalakshi

నా ఆత్మకు ( To my soul )

నా ఆత్మకు 


 స్వామి వివేకానంద ' భావజాలం ' ఈ కవిత. స్వామీజీ ఈ కవితను 1899 నవంబరు లో అమెరికానందు ఒకరి ఇంట్లో ఉన్నప్పుడు ఆంగ్లములో వ్రాసారు. ఈ ' మహాత్మ ' ను మన హృదయాల్లో పదిలపరచుకొని, దివ్యత్వాన్ని పొందుదాం.



  
వర్తమానం చీకటిగా ఉన్నా
భవిష్యత్తు ఆశావిహీనంగా కనిపించినా
ధీర హృదయమా
ఈ జీవనభారాన్ని విడువకు
ఓపికతో ఒకింత నిరీక్షించు.


  
ఒకప్పుడు
పర్వతాల నెక్కుతూ దిగుతూ
మరొకప్పుడు
అరుదైన సముద్రాలను సులభంగా దాటుతూ
నువ్వూ నేనూ కలిసి
ఈ ప్రయాణం మొదలుపెట్టి
ఎన్నో యుగాలైంది అని అనిపిస్తుంది.



నా మనస్సులో ఆలోచనలు 
మసలడానికి ఎంతో ముందే 
నువ్వు నాకు
అత్యంత దగ్గరివాడివై
ప్రకటించుతావు.  


ప్రతి ఆలోచనను ప్రతిబింబిస్తూ
నాతో పరిపూర్ణంగా ఐక్యమైన
నిజమైన అద్దానివి నువ్వే.  


 సాక్షీ!
ఇప్పుడు మనం ఇద్దరం విడిపోవడం 
ఉచితమా! చెప్పు?
నిజమైన నేస్తానివి,నమ్మకస్తుడివి
నువ్వొక్కడివే.


నాలో 
దురాలోచనలు చెలరేగుతున్నప్పుడు
అనలసుడవై హెచ్చరించావు
నీ హెచ్చరింపులను
నిర్లక్ష్యం చేసినా
నన్ను విడిచిపోని 
శుభమైన నిజమైన 
మిత్రుడవు నువ్వే!   సాగిపో... నేస్తమా!---- స్వామి వివేకానంద  


 


భక్తి రసామృతము

  ఓం శ్రీ పురుషోత్తమాయ నమో నమ:

  ప్రార్ధన:---

 పద్మలోచన! కృష్ణ! భక్తాభయప్రద

           వినుము సంసారాగ్ని వేగుచున్న

 జనుల సంసారంబు సం హరింపగ నీవు

             దక్క నన్యులు లేరు తలచి చూడ 

 సాక్షాత్కరించిన సర్వేశ్వరుండవు

              ప్రకృతికి నవ్వలి ప్రభుడ వాద్య

 పురుషుండవగు నీవు బోధముచే మాయ

              నడతువు నిశ్శ్రేయసాత్మ యందు

 మాయచేత మునిగి మనువారలకు కృప

              చేసి ధర్మముఖ్య చిహ్నమైన

 శుభము సేయు నీవు సుజనుల నవనిలో

         గావ పుట్టుదువు జగన్నివాస!



కృష్ణా!  "సంసారజ్వాలల్లో తపించిపోతున్న జనుల కష్టాన్ని పోగొట్టడం నీకు తప్ప మరొకరికి శక్యం కాదు. నీవు సాక్షాత్తూ సర్వేశ్వరుడవు.ఈ ముల్లోకాలకూ ఆవలివాడవు! ఆది పురుషుడవైన ప్రభుడవు! నీవు ముముక్షువులకు జ్ఞానాన్ని ప్రసాదించి, మాయను మటుమాయం చేస్తావు. నీవు మాయాజాలంలో మునిగిన వారికి ధర్మసమ్మతమైన తేజస్సును అనుగ్రహిస్తావు. ఓ జగన్నివాసా! శిష్టరక్షణ కోసమే నీవు ఈ జగత్తులో జన్మిస్తావు" .



   ఏ జీవియు ఇటు భోగములను అనుభవించుటలోనో, అటు భోగములను త్యాగము చేయుటలోనో స్థిరముగా నుండలేడు. దీనికి కారణము: జీవుడు తన నిజ స్వభావము వలన ఈ రెంటిలో ఏ దశలోను నిజమైన ఆనందములను అనుభవింప లేకుండుట. 

   ఒక సాధారణ గృహస్తు రాత్రింబగళ్ళు కష్టపడి తన కుటుంబ సభ్యులకు సర్వసౌఖ్యములను చేకూర్చి, తద్ద్వారా ఒక విధమగు రసమును అనుభవింపవచ్చును. కాని తాను సాధించిన ఈ ఐహిక భోగమంతయు తన జీవితము ముగిసి దేహత్యాగము చేయుటతో అంతమైపోవును.భక్తుడు భక్తియుక్త సేవ ద్వారా భగవంతుని సాక్షాత్కరింప జేసికొనగా, నాస్తికుడు మాత్రము మృత్యువు రూపములో భగవంతుని దర్శించును.జీవితములో రాజకీయ, సాంఘీక, జాతీయ, అంతర్జాతీయ కార్యరంగములలో దేనిలోనైనను స్వయంకృషి వలన సాధించు ఫలితములన్నియు మృత్యువుతో అంతరించిపోవుట నిశ్చయము.

   అయితే - భగవంతునికి చేయు ఆధ్యాత్మికమైన భక్తియుక్త సేవ వలన అనుభూతమగు 'భక్తిరసము ' మాత్రము మరణముతో అంతరించిపోదు.అది శాశ్వతముగా నిలిచియుండును.అందుకే దానిని అమృతము (మృతిలేనిది,నిత్యమైనది) అందురు. ఈ జన్మలో మనము చేయు కర్మలమీద మన పునర్జన్మ ఆధారపడిఉండును. 'దైవము ' అను ఒక ఉన్నతాధికారి - భగవంతుని ప్రతినిధి - జీవుల కర్మలను పర్యవేక్షించుచుండును.మామూలు వాడుక భాషలో దైవమునకు ' విధి ' అని అర్ధము. దైవము 84 లక్షల దేహములలో ఏదో ఒక దేహమును జీవునికి ఒసంగును.ఆ ఎన్నిక మన ఇష్టానిష్టముల పై ఆధారపడి యుండదు.' విధి 'నిర్ణయమును అనుసరించి అది జరుగును.భగవంతుని భక్తియోగ మార్గమున మానవుడు భక్తి రసాస్వాదనను అవలంబించినచో సమస్త సన్మంగళములతో కూడిన జీవిత మారంభమగును."ముక్తికంటె ఉన్నతమైన ఆధ్యాత్మిక జీవనమును ప్రసాదించుటయే ' భక్తి రసామృతము ' ".

సర్వం శ్రీ సాయికృష్ణార్పణ మస్తు
Wednesday, October 7, 2015 2 comments By: visalakshi

సహృదయం

 ఓం శ్రీ హృదయాలయాయ నమ: 

  ఓం సహృదయం సాం మనస్యం
  అవిద్వేషం కృణోమి వ:!
  అన్యో అన్య మభిహర్యత
  వత్సం జాత మివాఘ్న్యా!!          (అధర్వ వేదం 3-30-1)

 మానవులందరూ ధర్మాను వర్తనులై, సత్యమందు శ్రద్ధా భావంతో ఒకే అభిప్రాయాన్ని కలిగి, సద్భావనతో ద్వేషాన్ని విడిచి ప్రేమ భావంతో ఒకరి మంచి కోసం మరొకరు జీవించాలని ఈ వేద మంత్రం స్పష్టం  చేస్తుంది.








మంచి హృదయంతో, నిర్మల మనస్సుతో, విరోధ భావం లేకుండా కేవలం
 ప్రేమ భావంతో ఒకరితో ఒకరు పరస్పర స్నేహ సౌజన్యాలతో జీవించాలి.
ఆ ప్రేమ, శ్రద్ధ అప్పుడే పుట్టిన లేగదూడను తల్లిఆవు ఎంతగా ప్రేమిస్తుందో,
అంత చక్కగా ఉండాలి. మానవులు పరస్పరం   ప్రేమమయజీవితాన్ని
గడపాలని ఈ మంత్రాభిప్రాయం.

 తల్లి తన సంతానాన్ని ప్రేమించినట్లే, ఆవు తన దూడను కూడా అత్యధికంగా ప్రేమిస్తుంది. ఒక స్త్రీ ప్రసవిస్తుందంటే ఇతర స్త్రీలు సం రక్షిస్తారు. కానీ ప్రసవించిన గోవు వద్ద ఎవరూ ఉండరు. ప్రేమ ఒక్కటే దాని దగ్గర ఉంటుంది. అదే గొప్ప సాధనం. మన శరీరంలోని నాలుక అన్ని ఇంద్రియాలకంటే పవిత్రమైనది. ఏవైనా చెడు పదార్ధాలుంటే వాటిని పరీక్షించడానికి చేతితో తాకుతాం, ముక్కుతో వాసన చూస్తాం.కాని నాలుకతో మాత్రం దానిని మనం తాకం. నాలుక అంత పవిత్రమైన ఇంద్రియం. కాని ఆవు అంత పవిత్రమైన నాలుకతో అప్పుడే పుట్టిన లేగదూడ శరీరంపై నున్న మైలను శుభ్రం చేస్తుంది.ఆవు దూడను అట్లా శుభ్రం చేయకపోతే దూడకు జబ్బుచేసి చనిపోవచ్చును.  తరువాత  లేగదూడకు  ఆహారం  కావాలి. 

అప్పుడు తల్లిఆవుకు ప్రేమ పాలరూపంలో ప్రకటమౌతుంది. అప్పుడే పుట్టిన ఆ లేగదూడను ఆవు భూమిపై నుండి లేపి పొదుగు దగ్గరకు తీసుకొని వచ్చి పాలిస్తుంది. ఆ దూడ పాలు త్రాగేంత వరకు తల్లి ఆవుకు స్థిమితం ఉండదు.అలాంటి ప్రేమనే మానవులంతా పరస్పరం ప్రీతి భావంతో పొందాలని ఈ ఆవు దూడ  ఉపమానంతో భగవంతుడు మనకు ప్రేమ సూత్రాన్ని తెలియజేస్తున్నాడు. ఆవు సాధుజంతువని మనకు తెలుసు.
ఆవులో ప్రేమతత్వం, ఇతరులకు ఉపయోగపడే విశేషగుణం ఉంది.
అందుకే భారతీయులు ఆవును తల్లిగా,భావించి పూజిస్తారు.  

 అఘ్న్యా:- అంటే కొట్టకూడదు. గోవును కొట్టకూడదు. హింసించకూడదు. చంపకూడదు. మనం నిత్యం ప్రాత:సాయం సంధ్యా సమయాలలో చేసే భగవత్ ప్రార్ధనలో

  "యో  అస్మాన్  ద్వేష్టి  యం  వయం  ద్విష్మ:  తం  వో  జంభేదధ్మ:"!

 హే భగవన్! మమ్మల్ని ఎవరు ద్వేషిస్తున్నారో, మేము ఎవరిని ద్వేషిస్తున్నామో , ఈ పరస్పర ద్వేషాలు రెండింటిని నీకర్పిస్తున్నాము. నీ అనంతశక్తితో ఆ ద్వేషాలను, ద్వేష భావాలను నాశనం చెయ్యమని ప్రార్ధిస్తాం. సృష్టిలో మానవులు తప్ప ఇతర ప్రాణులు సహజంగా చాలా వరకు కలిసి జీవించడానికి ఇష్టపడతాయి.

  సహృదయంలో ప్రేమ,కరుణ,దయ,పరహిత చింతన మొదలైన శుభలక్షణాలుండాలి.హృదయం కేవలం గుప్పెడు మాంసపు ముద్దకాదు. అది జీవాత్మ, పరమాత్మ, మనస్సు అనే మూడు ఆధ్యాత్మిక తత్వాల సంగమ స్థానం.పరమేశ్వరుడు అనంత ప్రేమ మయుడు. ఆ ప్రేమను స్వయంగా గ్రహించగలిగిన అవకాశం జీవునకు కేవలం హృదయస్థానంలో మాత్రమే కలుగుతుంది. దానినే "ఉపాసన" అంటాం. అసూయ, రాగద్వేషాలు మనకు ప్రధాన శత్రువులు వాటిని మనం జయించాలి. కామ,క్రోధ,లోభ,మోహ మద మాత్సర్యాలనే అరిషడ్వర్గాలకు అతీతంగా, మానవాతీతమైన దైవీ సంపదను గూర్చి మనం ఆలోచించాలి. అవే ఆత్మకోవిదులు చెప్పే సుభాషితాలు."సర్వే భవంతు సుఖిన:"! మంచి మనస్సుతో స్వార్ధాన్ని త్యాగం చేసి, పరుల    శ్రేయస్సు కోసం పరితపించాలి. దీనికి సహృదయం కావాలని వేదం బోధిస్తోంది. 

   శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం హృదయం. హృదయం అనే మూడక్షరాలను ప్రజాపతి, బ్రహ్మము,సర్వము అని బృహదారణ్యక ఉపనిషత్ లో మహర్షి యాజ్ఞవల్క్యుడు వ్యాఖ్యానించారు. 

1)' హృ ' ఇదొక అక్షరం. ' హృ ' ధాతువునకు హరించుట, స్వీకరించుట దగ్గరకు తీసుకొని వచ్చుట అనే అర్ధముంది.

హృదయమే పరమాత్ముడని గ్రహించిన వారు సమస్త పదార్ధాలు పరమాత్మునివే అని భావిస్తారు.

2) ' ద ' ఇది రెండవ అక్షరం.' ద 'ధాతువునకు ఇచ్చుట-సమర్పించుట అనే అర్ధముంది.

హృదయమే భగవంతుడని తెలిసినవారు ఆ సర్వేశ్వరునికి సర్వము సమర్పిస్తారు.

3) 'య ' ఇది మూడవ అక్షరం(ఇణ్ గతౌ)అనే ధాతువునకు య అంటే వెళ్ళుట అనే అర్ధముంది.

హృదయమే ఈశ్వరుడని విశ్వసించిన వారు స్వర్గానికి వెళతారు. అంటే విశేషమైన సుఖాలను,దేహాన్ని పొందుతారని భావం.

   మానవజన్మ ముఖ్య ప్రయోజనం ఈశ్వరాజ్ఞలను పాలించి సహృదయంతో జీవించాలి. శుభకార్యాలను ఆచరించాలి. జీవితాన్ని చరితార్ధం చేసుకోవాలి.

సర్వం శ్రీ సాయిశివార్పణ మస్తు 




Thursday, October 1, 2015 0 comments By: visalakshi

భక్తుడి మాట భగవంతుడి బాట

  ఓం శ్రీ భక్తవత్సలాయ నమో నమ:

 శ్లో" క్షి ప్రం భవతి ధర్మాత్మా శశ్వచ్చాంతిం నిగచ్చతి !
       కౌంతేయ! ప్రతిజానీహి న మే భక్త: ప్రణశ్యతి !! ( 9 అ" 34 శ్లో ) 



భగవంతుడు తన భక్తుడి మాటకోసం ఏమైనా చేస్తాడు.తన దాసుడి మాట నిజం కావాలి. తన మాట ఏమైనా ఫరవాలేదు. ఇది భగవంతుడి యొక్క అభిప్రాయం. భక్తుడి మాట భగవంతుడి బాట.    

భగవంతుడితో సకలవిధ బాంధవ్యమూ ఉందన్న విశ్వాసం మనలో ఏర్పడితే చాలు.  


"నా అనుగ్రహాన్ని పొందించే శాస్త్రాన్ని అతిక్రమించని సదాచారము వానిలో నిండేటట్టు చేస్తా! అంటే నన్ను చేరటానికి, విశ్వసించటానికి ఆటంకంగా ఎదురయ్యే పాపరాశినంతటిని కూడా మసి చేసి పారవేస్తా. దాని వలన మనసు లోపలి దోషములు పూర్తిగా తొలగిపోతాయి.
'శ్రీకృష్ణుడు ఆ విషయాన్ని ప్రతిజ్ఞ చేసాడు.' నా మీద ఏర్పడ్డ ప్రేమ విశ్వాసం స్థిరపడేటట్టుగా చేసేస్తాను. కుసంస్కారాలు తొలగి, నా మీద ప్రేమ మనసులో నిండుట అనే శాంతి కలిగేటట్టుగా చేస్తాను."వాడు ధర్మాత్ముడౌతాడు.లోకం ఎంత బాగా ఆరాధిస్తుందంటే 'తిరుప్పాణి అని ఒక ఆళ్వారు .ఆయన మాలదాసరిగా జన్మించినా భగవత్ భక్తి,విశ్వాసం పరిపూర్ణంగా అతడిలో నిండేసరికి భగవంతుడు అతడిని కొండంతగా ప్రేమించాడు.  ఆయనంటాడూ.."నాలో ఉండే లోపాల్ని తొలగించి నీ ఆంతరంగిక కైంకర్యాన్ని ప్రసాదించేటంత ఔన్నత్యాన్ని కల్గించావా తండ్రీ!"అని.

 హే! కౌంతేయా! కుంతీపుత్రా! నీవు ప్రతిజ్ఞ చేయవయ్యా!ఏం చెయ్యమంటావు కృష్ణా! అని అడిగాడు అర్జునుడు.నా భక్తుడు ఎన్నటికీ చెడడు.అంటే కృష్ణ భక్తుడు ఎన్నటికీ చెడడని ప్రతిజ్ఞపూను.నేనెందుకయ్యా ప్రతిజ్ఞ చేయడం? నీ భక్తుడు చెడడని కావాలంటే నీవు చెప్పు అని అన్నాడు అర్జునుడు.

"అర్జునా! విను..రామావతారంలో నేను ప్రతిజ్ఞ చేస్తే నిలబడతా! కానీ కృష్ణావతారంలో , నా ప్రతిజ్ఞకంటే భక్తుడి మాటకే నేను ఎక్కువ ప్రాధాన్యమిస్తాను అన్నాడు. భీష్ముడు ఒక ప్రతిన పూనాడు. కృష్ణుడు ఒక ప్రతిన పూనాడు. 'ఆయుధం పట్టనన్నాడు కృష్ణుడు.' పట్టిస్తానన్నాడు భీష్ముడు దుర్యోధనుడి దగ్గర. ఇద్దరూ దుర్యొధనుడి దగ్గరే చేస్తారు ఈ ప్రతిజ్ఞలు.దానికతడే సాక్షి. అది తెలిసి శ్రీ కృష్ణుడు "భీష్ముడి మాట నిజం చేయడమే తన కర్తవ్యం"అనుకున్నాడు.అందుకోసమే భారత సంగ్రామం జరిగేటప్పుడు ఎన్నో సందర్భాలలో ఆయుధం పట్టాడు. జయద్రధ   సం హారం చేయించడం కోసం తాను చక్రం పట్టాడు. 

భీష్ముడు యుద్ధంలో 11 వ రోజున అతి తీవ్రమైన పోరుసల్పుతుంటే అర్జునుడు నిర్వీర్యుడైపోతే, ఆ అర్జనుడిని కాపాడే వంకతో చక్రం చేతపట్టి ఒక్కసారి దూకాడు. ఆవేళ భీష్ముడు "కృష్ణా! నేను గెలిచాను" అన్నాడు ఆయన. ఎందుకని? ఎందుకంటే "స్వనిగమమపహాయ ప్రతిజ్ఞాం    ఋతమధికర్తుం అవప్లుతో రధస్థ:"నేను నిన్ను చక్రం పట్టిస్తాను అని అన్నానని నా మాట నిజం చేయడం కోసం నీమాటను వదిలేసుకొని చక్రం చేతపట్టి క్రిందకు దూకావా తండ్రీ! అని ప్రార్ధన చేస్తాడు.

 అనుక్షణం నా భక్తులను కాపాడుకుంటూ ఉంటాను. "అర్జునా! నీవు ప్రతిజ్ఞ చేయి. ఈ లోకంలో నీ ప్రతిజ్ఞను నిలబెట్టటం కోసం నేను ఏవైనా చేస్తాను." భగవంతుడి యొక్క రక్షణ దీక్ష అంత గొప్పది. ఆయనయొక్క శాశ్వతమైన రక్షణ మనకు నిరంతరం ఉంటుందని స్వామి ప్రతిన పూనారు. ఆయన ప్రతినను విశ్వసిద్దాం. భక్తి ప్రపత్తులతో భగవంతుడి బాటలో నడుద్దాం...


 సర్వం శ్రీ సాయి కృష్ణార్పణ మస్తు