Wednesday, October 7, 2015 By: visalakshi

సహృదయం

 ఓం శ్రీ హృదయాలయాయ నమ: 

  ఓం సహృదయం సాం మనస్యం
  అవిద్వేషం కృణోమి వ:!
  అన్యో అన్య మభిహర్యత
  వత్సం జాత మివాఘ్న్యా!!          (అధర్వ వేదం 3-30-1)

 మానవులందరూ ధర్మాను వర్తనులై, సత్యమందు శ్రద్ధా భావంతో ఒకే అభిప్రాయాన్ని కలిగి, సద్భావనతో ద్వేషాన్ని విడిచి ప్రేమ భావంతో ఒకరి మంచి కోసం మరొకరు జీవించాలని ఈ వేద మంత్రం స్పష్టం  చేస్తుంది.








మంచి హృదయంతో, నిర్మల మనస్సుతో, విరోధ భావం లేకుండా కేవలం
 ప్రేమ భావంతో ఒకరితో ఒకరు పరస్పర స్నేహ సౌజన్యాలతో జీవించాలి.
ఆ ప్రేమ, శ్రద్ధ అప్పుడే పుట్టిన లేగదూడను తల్లిఆవు ఎంతగా ప్రేమిస్తుందో,
అంత చక్కగా ఉండాలి. మానవులు పరస్పరం   ప్రేమమయజీవితాన్ని
గడపాలని ఈ మంత్రాభిప్రాయం.

 తల్లి తన సంతానాన్ని ప్రేమించినట్లే, ఆవు తన దూడను కూడా అత్యధికంగా ప్రేమిస్తుంది. ఒక స్త్రీ ప్రసవిస్తుందంటే ఇతర స్త్రీలు సం రక్షిస్తారు. కానీ ప్రసవించిన గోవు వద్ద ఎవరూ ఉండరు. ప్రేమ ఒక్కటే దాని దగ్గర ఉంటుంది. అదే గొప్ప సాధనం. మన శరీరంలోని నాలుక అన్ని ఇంద్రియాలకంటే పవిత్రమైనది. ఏవైనా చెడు పదార్ధాలుంటే వాటిని పరీక్షించడానికి చేతితో తాకుతాం, ముక్కుతో వాసన చూస్తాం.కాని నాలుకతో మాత్రం దానిని మనం తాకం. నాలుక అంత పవిత్రమైన ఇంద్రియం. కాని ఆవు అంత పవిత్రమైన నాలుకతో అప్పుడే పుట్టిన లేగదూడ శరీరంపై నున్న మైలను శుభ్రం చేస్తుంది.ఆవు దూడను అట్లా శుభ్రం చేయకపోతే దూడకు జబ్బుచేసి చనిపోవచ్చును.  తరువాత  లేగదూడకు  ఆహారం  కావాలి. 

అప్పుడు తల్లిఆవుకు ప్రేమ పాలరూపంలో ప్రకటమౌతుంది. అప్పుడే పుట్టిన ఆ లేగదూడను ఆవు భూమిపై నుండి లేపి పొదుగు దగ్గరకు తీసుకొని వచ్చి పాలిస్తుంది. ఆ దూడ పాలు త్రాగేంత వరకు తల్లి ఆవుకు స్థిమితం ఉండదు.అలాంటి ప్రేమనే మానవులంతా పరస్పరం ప్రీతి భావంతో పొందాలని ఈ ఆవు దూడ  ఉపమానంతో భగవంతుడు మనకు ప్రేమ సూత్రాన్ని తెలియజేస్తున్నాడు. ఆవు సాధుజంతువని మనకు తెలుసు.
ఆవులో ప్రేమతత్వం, ఇతరులకు ఉపయోగపడే విశేషగుణం ఉంది.
అందుకే భారతీయులు ఆవును తల్లిగా,భావించి పూజిస్తారు.  

 అఘ్న్యా:- అంటే కొట్టకూడదు. గోవును కొట్టకూడదు. హింసించకూడదు. చంపకూడదు. మనం నిత్యం ప్రాత:సాయం సంధ్యా సమయాలలో చేసే భగవత్ ప్రార్ధనలో

  "యో  అస్మాన్  ద్వేష్టి  యం  వయం  ద్విష్మ:  తం  వో  జంభేదధ్మ:"!

 హే భగవన్! మమ్మల్ని ఎవరు ద్వేషిస్తున్నారో, మేము ఎవరిని ద్వేషిస్తున్నామో , ఈ పరస్పర ద్వేషాలు రెండింటిని నీకర్పిస్తున్నాము. నీ అనంతశక్తితో ఆ ద్వేషాలను, ద్వేష భావాలను నాశనం చెయ్యమని ప్రార్ధిస్తాం. సృష్టిలో మానవులు తప్ప ఇతర ప్రాణులు సహజంగా చాలా వరకు కలిసి జీవించడానికి ఇష్టపడతాయి.

  సహృదయంలో ప్రేమ,కరుణ,దయ,పరహిత చింతన మొదలైన శుభలక్షణాలుండాలి.హృదయం కేవలం గుప్పెడు మాంసపు ముద్దకాదు. అది జీవాత్మ, పరమాత్మ, మనస్సు అనే మూడు ఆధ్యాత్మిక తత్వాల సంగమ స్థానం.పరమేశ్వరుడు అనంత ప్రేమ మయుడు. ఆ ప్రేమను స్వయంగా గ్రహించగలిగిన అవకాశం జీవునకు కేవలం హృదయస్థానంలో మాత్రమే కలుగుతుంది. దానినే "ఉపాసన" అంటాం. అసూయ, రాగద్వేషాలు మనకు ప్రధాన శత్రువులు వాటిని మనం జయించాలి. కామ,క్రోధ,లోభ,మోహ మద మాత్సర్యాలనే అరిషడ్వర్గాలకు అతీతంగా, మానవాతీతమైన దైవీ సంపదను గూర్చి మనం ఆలోచించాలి. అవే ఆత్మకోవిదులు చెప్పే సుభాషితాలు."సర్వే భవంతు సుఖిన:"! మంచి మనస్సుతో స్వార్ధాన్ని త్యాగం చేసి, పరుల    శ్రేయస్సు కోసం పరితపించాలి. దీనికి సహృదయం కావాలని వేదం బోధిస్తోంది. 

   శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం హృదయం. హృదయం అనే మూడక్షరాలను ప్రజాపతి, బ్రహ్మము,సర్వము అని బృహదారణ్యక ఉపనిషత్ లో మహర్షి యాజ్ఞవల్క్యుడు వ్యాఖ్యానించారు. 

1)' హృ ' ఇదొక అక్షరం. ' హృ ' ధాతువునకు హరించుట, స్వీకరించుట దగ్గరకు తీసుకొని వచ్చుట అనే అర్ధముంది.

హృదయమే పరమాత్ముడని గ్రహించిన వారు సమస్త పదార్ధాలు పరమాత్మునివే అని భావిస్తారు.

2) ' ద ' ఇది రెండవ అక్షరం.' ద 'ధాతువునకు ఇచ్చుట-సమర్పించుట అనే అర్ధముంది.

హృదయమే భగవంతుడని తెలిసినవారు ఆ సర్వేశ్వరునికి సర్వము సమర్పిస్తారు.

3) 'య ' ఇది మూడవ అక్షరం(ఇణ్ గతౌ)అనే ధాతువునకు య అంటే వెళ్ళుట అనే అర్ధముంది.

హృదయమే ఈశ్వరుడని విశ్వసించిన వారు స్వర్గానికి వెళతారు. అంటే విశేషమైన సుఖాలను,దేహాన్ని పొందుతారని భావం.

   మానవజన్మ ముఖ్య ప్రయోజనం ఈశ్వరాజ్ఞలను పాలించి సహృదయంతో జీవించాలి. శుభకార్యాలను ఆచరించాలి. జీవితాన్ని చరితార్ధం చేసుకోవాలి.

సర్వం శ్రీ సాయిశివార్పణ మస్తు 




2 comments:

భారతి said...

Nice post.
Chaalaa chakkagaa vivarinchaaru.

visalakshi said...

dhanyavaadaalu bhaarati gaarU!