దక్షిణామూర్తి స్వయంగా వచ్చాడు. మనం గురువునందు ఆయనను భావించాలి. ఆయనే గురువై వస్తే ఎంత విశేషం! అందుకు ఆయన “ముద్రాం భద్రార్థ ధాత్రీం”- ఆ ముద్ర భద్రమైన అర్థాన్ని చెప్తుంది.
"ముద్రాం భద్రార్థ ధాత్రీం"అనేది శ్రీ దక్షిణామూర్తి స్తోత్రంలోని ప్రసిద్ధ శ్లోక పాదం.
మంగళకరమైనది, ఆత్మజ్ఞానం లేదా పరమ సత్యాన్ని అనుగ్రహించేది అయిన చిన్ముద్రను ధరించినవాడు అని భావం.
సాధారణంగా ఈ పదం దక్షిణామూర్తి స్వామి యొక్క దివ్య హస్తాన్ని వర్ణించడానికి ఆయన శిష్యులకు మౌనంగానే ఆత్మజ్ఞానాన్ని అందించే చిన్ముద్ర విశిష్టతను తెలపడానికి ఉపయోగిస్తారు.
భద్రమైన అర్థం అంటే భద్రం ఏది? కైవల్యమే భద్రం. ఆత్మయే భద్రం. దేహానికీ, ప్రాణానికీ, బుద్ధికీ భద్రం లేదు. నీలో భద్రంగా ఉన్నది నీ ఆత్మ. ఆ ఆత్మని అందించీ, ఆత్మని ప్రయోజనంగా చూపించే ఆత్మని అర్థంగా అందించే ముద్ర అది. అందుకే ముద్రాం భద్రార్థ ధాత్రీం అన్నారు.
అందుకే శంకరులు ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్తోత్రం చివరిలోకి వెళ్ళేటప్పటికి “యో ముద్రయా భద్రయా” అన్నారు. భద్రమైన ముద్రతో అని అదే మాట అక్కడ వేశారు మహానుభావుడు. కనుక ఆ ముద్రకి అంత ఉన్నదండీ. కరకలిత చిన్ముద్ర మానంద రూపం. ఇదొక విశేషం.
అంతేకాదు మొత్తం పరమేశ్వరునియొక్క లక్షణం అంత కూడా ఐదువేళ్ళల్లోనే ఉందిట. ఈ అయిదు వేళ్ళు ఏమిటి? చెప్తున్నాడు. ఈ జగత్తులో మనం చూసేది ముందు నామం, రూపం. వీటి వెనకాల ఉండే అస్తి, భాతి, ప్రియం అనేవి ప్రధానములు. బ్రహ్మ లక్షణం అది. అస్తిభాతిప్రియములు బ్రహ్మవి.
నామరూపం జగత్తు. జగత్తువి అంటే జగత్తు నుండి ఆయన వేరుగా ఉన్నాడా? అది మళ్ళీ వేరే విషయం. జగత్తుకు వేరుగా లేడు. నామరూపములతో భాసిస్తూ ఉన్న జగత్తుయందు లీనమైయున్నాడు. కానీ ఆయనకి నామం, రూపం, లేవు.
నామరూపాత్మకమైన జగత్తును చూస్తున్నాం కానీ జగత్తుకు ఆధారమైన అస్తి,భాతి, ప్రియం అంటే ఉనికియైన వాడు, ప్రకాశస్వరూపుడు, ఇష్టమైన వాడు అంటే ఆనందస్వరూపుడు. ఇష్టం అంటే మరేంటో కాదండీ ఆనందమే ఇష్టం. సృష్టిలో ఏది ఇష్టం అంటే నాకు ఆ తిండి ఇష్టం, ఆ బట్ట ఇష్టం అంటే అది ఎందుకు ఇష్టం దానివల్ల నీకు ఆనందం కలుగుతోంది కనుక ఇష్టం కదా! మనకు వస్తువు ఇష్టం కాదు. ఆనందం ఇష్టం. కనుక ఇష్టమైనది ఏమిటి? ఆనందం.
అస్తి, భాతి, ప్రియం అంటే సత్తు, చిత్తు, ఆనందం. ఇది ఎప్పుడూ మారదు. మారేవేమిటి? నామం రూపం. మారుతున్నాయా లేదా? మొన్న మన పేరు ఫలానా, ఇప్పుడు నిజానికి మారదు. కానీ అప్పుడు కుర్రాడా అని పిలిచారు, ఇప్పుడు ముసలోడా అని పిలుస్తున్నారు. మారిందా లేదా? కనుక నామం రూపం మారుతూ ఉంటాయి వ్యవహారంలో. ఈ దేహంతో రామయ్య అయితే మరొక దేహంతో పుల్లయ్య. లేకపోతే పుల్లమ్మ. ఇవీ మారిపోతున్నాయి. కనుక నామం రూపం మారుతున్నాయి కానీ మారకుండా ఉండేవి అస్తి భాతి ప్రియములు.
అది నువ్వు ఎప్పుడు చూస్తావు? నువ్వు నామ రూప దృష్టిని ఉపసంహరించి తదంతర్గతమైన ఆధార చైతన్యాన్ని ధరిస్తే మనం ఇటునుంచి లెక్కపెట్టడం జీవుడి లక్షణం. అటు నుంచి చూడడం ఈశ్వర దృష్టి. అందుకు మనం అటు నుంచి చూడాలి. (చిటికెన వేలునుంచి లెక్కిస్తే) అస్తి, భాతి, ప్రియం, నామం, రూపం - (బొటన, చూపుడు). నీకు లక్ష్యం ఏమిటి? - అస్తిభాతిప్రియములు. అందుకు ఏం చేయాలి అంటే నామరూపములను ఉపసంహరించి అస్తిభాతిప్రియములను(చిటికెన, ఉంగరంవేలు, మధ్య వేలు) చూడు. ఇదీ ఆంతర్యం. ఒక్క చేతిలో ఎన్ని చెప్తున్నాడండీ.
అన్నీ వాళ్లకి స్ఫురించాయి. వాళ్లకి స్ఫురించాయి అంటే అర్థం స్ఫురింప జేసే స్ఫురణశక్తియైన చైతన్యమే ఎదురుగా రూపం ధరించి అనుగ్రహంతో కూర్చుంది గనుక ఆ చేతినుండి అన్ని వెళ్ళాయి
వాళ్లకి, వెళ్ళి ఆ జీవబ్రహ్మైక్య అనుభవాన్ని పొందారు. ఇన్ని అర్థములున్నాయి ఆ ఒక్క హస్తంలో. అందుకే ‘ముద్రాం భద్రార్థ ధాత్రీం కరకలిత చిన్ముద్ర మానంద రూపం’. స్వాత్మారామం-తనయందు తాను ఆనందించువాడు, అది ఆయన స్వభావం. స్వాత్మా రాముడు – తనయందు తను రమించువాడు అంటే ఆనందించు వాడు, క్రీడించువాడు. జగతి అవసరం లేదు. పరిపూర్ణుడికి దేని అవసరం కావాలి? కడవలో నీళ్ళుపోస్తాం అది నిండేవరకు. నిండిపోయాకకూడా పోస్తే ఇమడదు, ప్రయోజనం కూడా లేదు. పరిపూర్ణుడికేం కావాలి? అందుకు సర్వ పరిపూర్ణుడాయన.
"సర్వపరిపూర్ణునకు వెలి ఏడ? లోనేడ?" అంటారు అన్నమాచార్యులు. సర్వమూ తానైన పరిపూర్ణునికి వెలుపల, లోపల ఏమున్నది? అంతా తానైనప్పుడు ఎవరికండీ ఆనందంకోసం ఆరాటం ఉంటుంది? తన లోపల లేదు అనుకుంటే బయట నుంచి కావాలి అనుకుంటే తాపత్రయాలన్నీ ఉన్నాయి.
కొలత, కొరత ఎవరికి ఉంటుందో వాడు ఆనందం కోసం వెంపర్లాడతాడు. కానీ కొలత లేని వాడు, కొరత లేని వాడు పరిపూర్ణుడైనటువంటి అప్రమేయుడు గనుక స్వాత్మారామం. ముదిత వదనం-అంత ఆనందం స్వభావమే కాదు రూపం స్వీకరించినప్పుడు కూడా ప్రతి అణువు ఆయనలో ఆనందాన్ని ప్రకటీకరిస్తోంది. అందులో ముఖ్యంగా ముఖం భావస్థానం కనుక పైగా రుద్రయత్తే దక్షిణం ముఖం అన్నాం గనుక ఆ ముఖంలో ఏం కనిపిస్తోంది ‘ముదిత వదనం ఆనందమయమైనటువంటి వదనం. అటువంటి దక్షిణామూర్తి మీడే!!
"వటవిటపి సమీపే భూమిభాగే నిషణ్ణం
సకలముని జనానాం జ్ఞానదాతార మారాత్
త్రిభువన గురుమీశం దక్షిణామూర్తి దేవం
జనన మరణ దుఃఖచ్ఛేద దక్షం నమామి!!"
ఇక్కడ దక్షిణామూర్తి శబ్డంలో దక్షిణ అనే శబ్దానికి నిర్వచనం ఇస్తున్నారు గురువుగారు. దక్షిణ అనగా సమర్థత. ఏ సమర్థత? - జనన మరణ దుఃఖాన్ని సమూలంగా ఛేదింపడమనే దక్షత. అది ఎవ్వడి దగ్గరా లేదు. అది దక్షిణామూర్తి ఒక్కరి దగ్గరే ఉన్నది. ఆయన తప్ప ఏ ఒక్కరూ మోక్షాన్ని ఇవ్వలేరు. ఆ మోక్షం ఆయనే ఇవ్వాలి. జనన మరణ దుఃఖచ్ఛేద దక్షతే దక్షిణ - అందుకోసమే ఈమూర్తి ధరించాడు కనుక
దక్షిణామూర్తి. చిత్రం-ఎంత ఆశ్చర్యం! మొట్టమొదట ఆశ్చర్యం. ఆశ్చర్యమే పరమాత్మ. "చిత్రం వట తరోర్మూలే వృద్ధాః శిష్యాః గురుర్యువా – ఎంత గొప్పగా మాట్లాడారండి ఇక్కడ. వట తరోర్మూలే – వటతరువుట ఇక్కడ. చాలా ఆంతర్యం కనిపిస్తుంది ఇక్కడ.
వట తరువు అంటే విస్తరించుకుపోతే వట తరువు. మన బ్రతుకే పెద్ద వటవృక్షం. బ్రతుకు అంటే పుట్టుక, చావు మధ్య మాత్రమే కాదు. అది ఇప్పుడు మనకు కనిపించే ఊడ మాత్రమే. కానీ జీవుడు అవిద్య అనే దుంపలోంచి ఎన్ని ఊడలు చించుకున్నాడో, ఎన్ని జన్మలెత్తాడో? కనుక వీడి విస్తారమైన జన్మపరంపర అంతా వటవృక్షం.
ఇంత పెరుగుతున్నది అంటే చైతన్యం ఆధారంగానే పెరుగుతున్నది. కానీ వీడి అవిద్య వల్ల ఇంత విస్తరిస్తున్నది. దానిలో జీవుడు ఇంతకాలం తిరిగి తిరిగి ఎంతటివాడో? జీవభావం అనే పరిమితత్వంతో ఆలోచిస్తే వృద్ధుడే జీర్ణించుకుపోయే లక్షణంలో తిరిగాడు కనుక వాడు ముసలివాడు. వీడు ముసలి వాడే కానీ ఎవడి వల్ల ఇదంతా నడిచిందో ఆయన యువకుడే. వాడిని చూడు ఆ లోపల. కనుక అంతవరకూ విస్తరించుకు పోయావే మర్రి చెట్టుని.
ఇంత మర్రిచెట్టుకీ మూలమైన ఈశ్వర చైతన్యాన్ని దర్శించు. ఏది అధిష్ఠాన చైతన్యమై ఉన్నదో దానిని దర్శించు. అందుకు నీలోని తలపులన్నీ కూడా నిరంతర చింతనతో, విచారణతో, సాధనతో పండి ఈ చింతనలే మహర్షులు. మహర్షులు అంటే దర్శన శక్తి కలవారు. మన ఆలోచనలే మహర్షులు. మన బ్రతుకే వటవృక్షం. దీనికి మూలంలో ఉన్న అధిష్ఠాన చైతన్యమే దక్షిణామూర్తి.
అటువైపు ఈ ఆలోచనలన్నీ వెళితే అక్కడ జరామరణ మర్జితుడైనటువంటి, నిత్య యౌవనుడైనటువంటి, పూర్ణ బ్రహ్మము అయినటువంటి ఆయన సాక్షాత్కరిస్తున్నాడు. అది చిత్రం-ఆశ్చర్యం! "ఆశ్చర్యవ త్పశ్యతి కశ్చి దేనం"-అని మనకి ఉపనిషత్తులు, గీత చెప్తున్నాయి. ఆశ్చర్యం అనే మాట నుంచి శంకరులు
"చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యా గురుర్ యువా.
గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయాః"
ఆయనను ఆశ్రయించినప్పుడు ఉపన్యాసాలు లేవు. ఎందుకంటే అఖండమైన ఆత్మత్వమ్ ఆనందానుభూతి. అంతేకానీ దీపం వెలిగించి నాకు వెలుగునిమ్ము అని ప్రార్థించక్కరలేదు. ఆయన ఇచ్చేదే అది. ఈశ్వర సాక్షాత్కారానభవంతో నాకు జ్ఞానమివ్వు. అని అనక్కరలేదు. జ్ఞానమే ఆయన.
"గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం!
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః!!"
"ఓం నమః ప్రణవార్థాయ శుద్ధఙ్ఞానైకమూర్తయే!
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః!!"
కేవల జ్ఞానమే ఆయన మూర్తి. మనకి మూర్తి వేరు, జ్ఞానం వేరు. భగవంతునికి జ్ఞానమే మూర్తి. జ్ఞానమే మూర్తీభవిస్తే దక్షిణామూర్తిగా గోచరిస్తున్నాడు అని చెప్పి స్తోత్రం
చేస్తున్నారిక్కడ. అయితే దీనిని స్తోత్రం అని ఎందుకన్నామంటే ఆయనే అన్నారు ’అముష్మిన్ స్తవే"-ఈ స్తోత్రమునందు అని. కానీ నిజానికి స్తోత్రం అంటామా అంటే దీనిలో చెప్పబడేదంతా ఆత్మతత్త్వ విచారణే. ఈ స్తోత్రాన్ని ఎలా అనుసంధానం చేయాలో చివరి శ్లోకంలో చాలా చక్కగా వివరించారు. దానిని బాగా మననం చేసుకుంటే ఈ స్తోత్రాన్ని అనుసంధానం చేయవలసిన విధానం పూర్తిగా గమనించవచ్చు.
"తేనాస్వ శ్రవణాత్తదర్థ మననాద్ధ్యానాచ్చ సంకీర్తనాత్!" ఈ స్తోత్రాన్ని వినడం, దాని అర్థాన్ని మననం చేయడం, మననం చేసిన దాన్ని బుద్ధియందు ఏకాగ్రంగా ఎల్లవేళలా నిలపడం, ఏకాగ్రతవల్ల కలిగిన అనుభూతితో దానినే నిరంతరం స్మరిస్తూ ఉండడం ఏదైతే ఉందో అది సంకీర్తనం. ఇలా చేస్తే "సర్వాత్మత్వమహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః"-వాడు ఈశ్వరునితో తాదాత్మ్యం చెందుతాడు. సర్వాత్మకత్వాన్ని స్ఫుటీకరించే స్తోత్రమిది అన్నారు.
అంటే ఈ స్తోత్రం యొక్క లక్షణం ఏమిటి? ఏవిధంగా దీనిని అనుసంధానించాలో చెప్పారు. అంటే మందిచ్చేవాడు ఆ మందు వల్ల యేజబ్బు పోతుందో చెప్పి మందు ఎలా పుచ్చుకోవాలో చెప్తాడు కదా!
అలా ఇక్కడ ఈ తొమ్మిది శ్లోకాల ఔషధాన్ని తయారుచేసి ఈ మందు purpose ఏంటి? అంటే సర్వాత్మత్వ స్ఫుటీకృతం. సర్వమూ ఒకటే ఆత్మ అది తెలుసుకోవాలి. రెండవది లేదు. ఉన్నది ఒక్కటే ఆత్మ. ఏమిటండీ నాముందు లక్ష కనపడుతున్నాయి. అదే కదా సమస్య! అందుకు కదా సాధన, స్తోత్రం, గీత, ఉపనిషత్తు మనకి. సర్వాత్మత్వాన్ని స్ఫుటీకృతం స్పష్టం చేయడానికై ’అముష్మిన్ స్తవే - ఈ స్తోత్రంలో ప్రతిపాదించారు సత్యాన్ని. చదివినంత మాత్రాన తెలిసిపోతోందా. కాదు. శ్రవణాత్- శ్రవణం చేయాలి.
శ్రవణం ఎలా చేయాలో శివపురాణంలో శివుడు చెప్తాడు. "ప్రియుడు ప్రియురాలి గురించి కబుర్లు వినడానికి ఎంత అటెన్షన్ పే చేస్తాడో నా విషయం వినడానికి అంత ఆసక్తి చూపడాన్ని" శ్రవణం అంటారు అన్నాడు. ఎంత చక్కటి ఉపమానం చెప్పాడో శివుడు.
అలా చెప్తే కానీ మనకు అర్థం కాదు. ఎందుకంటే నిత్యజీవితంలో అనుభూతులవన్నీ కూడా. Sweet Nothings అంటారు. ఏమీ ఉండదు కానీ తీయగా ఉంటుందిట. ప్రియుడు ప్రియురాలి మాటలు వినడానికి ఎంత ఆసక్తి చూపిస్తాడో భగద్విషయాలు వినడానికి శ్రద్ధాళువు అంత ఆసక్తి చూపిస్తాడట. మనం అది తప్ప మిగిలిన వాటియందు అంత ఆసక్తి చూపిస్తాం.
శ్రవణం తరువాత తదర్థం మననాత్-అర్థాన్ని మననం చేయాలి. మననం చేసినదాన్ని ధ్యానించాలి. ధ్యానించాక కలిగే ఆనందపు అనుభూతిని వ్యక్తీకరించడమే సంకీర్తన. మద్దెలలు, హార్మోనియం పట్టుకొని పాడడం కాదు సంకీర్తన అంటే. సంకీర్తనా గీతం అనే మాటకి శాస్త్రీయమైన అర్థం ఏంటంటే ఆనందానుభూతితో పలికే వ్యక్తీకరణ. అది జరిగితే అప్పుడు ఆ సర్వాత్మకుడైన ఈశ్వరునితో తాదాత్మ్యం చెంది జీవుడనబడే నేను ఈశ్వరుడికి వేరు అనే భావం పోయి "ఈశ్వరత్వం తథః" దానిని పొందుతాడు సుమా! అని purpose చెప్పేశాడు ఆయన. Densified చేసి ఒక్క capsule గా ఇస్తే దానిని గమనించి తత్త్వం తెలుసుకోవడం అంటే అంత తేలికా?
అందుకు ఇప్పుడు మనం శ్రవణం, మననం వీటన్నిటి ద్వారా కేవలం శ్రవణం అంటే నేను శ్లోకాలు చదివేస్తే మీరు వినేస్తే అయిపోలేదు కదా! ఏమి చెప్పారో మనస్సుకు పట్టడానికి ఆ ఆత్మతత్త్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం.
🙏 శ్రీ దక్షిణామూర్త యే నమః🙏
ఓం నమః శివాయ 🙏
.jpg)
.jpg)