Saturday, July 18, 2026 0 comments By: visalakshi

సర్వ పరిపూర్ణుడు..



 

దక్షిణామూర్తి స్వయంగా వచ్చాడు. మనం గురువునందు ఆయనను భావించాలి. ఆయనే గురువై వస్తే ఎంత విశేషం! అందుకు ఆయన “ముద్రాం భద్రార్థ ధాత్రీం”- ఆ ముద్ర భద్రమైన అర్థాన్ని చెప్తుంది.


"ముద్రాం భద్రార్థ ధాత్రీం"అనేది శ్రీ దక్షిణామూర్తి స్తోత్రంలోని ప్రసిద్ధ శ్లోక పాదం.

మంగళకరమైనది, ఆత్మజ్ఞానం లేదా పరమ సత్యాన్ని అనుగ్రహించేది అయిన చిన్ముద్రను ధరించినవాడు అని భావం.

సాధారణంగా ఈ పదం దక్షిణామూర్తి స్వామి యొక్క దివ్య హస్తాన్ని వర్ణించడానికి ఆయన శిష్యులకు మౌనంగానే ఆత్మజ్ఞానాన్ని అందించే చిన్ముద్ర విశిష్టతను తెలపడానికి ఉపయోగిస్తారు.

భద్రమైన అర్థం అంటే భద్రం ఏది? కైవల్యమే భద్రం. ఆత్మయే భద్రం. దేహానికీ, ప్రాణానికీ, బుద్ధికీ భద్రం లేదు. నీలో భద్రంగా ఉన్నది నీ ఆత్మ. ఆ ఆత్మని అందించీ, ఆత్మని ప్రయోజనంగా చూపించే ఆత్మని అర్థంగా అందించే ముద్ర అది. అందుకే ముద్రాం భద్రార్థ ధాత్రీం అన్నారు.

అందుకే శంకరులు ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్తోత్రం చివరిలోకి వెళ్ళేటప్పటికి “యో ముద్రయా భద్రయా” అన్నారు. భద్రమైన ముద్రతో అని అదే మాట అక్కడ వేశారు మహానుభావుడు. కనుక ఆ ముద్రకి అంత ఉన్నదండీ. కరకలిత చిన్ముద్ర మానంద రూపం. ఇదొక విశేషం.


అంతేకాదు మొత్తం పరమేశ్వరునియొక్క లక్షణం అంత కూడా ఐదువేళ్ళల్లోనే ఉందిట. ఈ అయిదు వేళ్ళు ఏమిటి? చెప్తున్నాడు. ఈ జగత్తులో మనం చూసేది ముందు నామం, రూపం. వీటి వెనకాల ఉండే అస్తి, భాతి, ప్రియం అనేవి ప్రధానములు. బ్రహ్మ లక్షణం అది. అస్తిభాతిప్రియములు బ్రహ్మవి.


నామరూపం జగత్తు. జగత్తువి అంటే జగత్తు నుండి ఆయన వేరుగా ఉన్నాడా? అది మళ్ళీ వేరే విషయం. జగత్తుకు వేరుగా లేడు. నామరూపములతో భాసిస్తూ ఉన్న జగత్తుయందు లీనమైయున్నాడు. కానీ ఆయనకి నామం, రూపం, లేవు.


నామరూపాత్మకమైన జగత్తును చూస్తున్నాం కానీ జగత్తుకు ఆధారమైన అస్తి,భాతి, ప్రియం అంటే ఉనికియైన వాడు, ప్రకాశస్వరూపుడు, ఇష్టమైన వాడు అంటే ఆనందస్వరూపుడు. ఇష్టం అంటే మరేంటో కాదండీ ఆనందమే ఇష్టం. సృష్టిలో ఏది ఇష్టం అంటే నాకు ఆ తిండి ఇష్టం, ఆ బట్ట ఇష్టం అంటే అది ఎందుకు ఇష్టం దానివల్ల నీకు ఆనందం కలుగుతోంది కనుక ఇష్టం కదా! మనకు వస్తువు ఇష్టం కాదు. ఆనందం ఇష్టం. కనుక ఇష్టమైనది ఏమిటి? ఆనందం.


అస్తి, భాతి, ప్రియం అంటే సత్తు, చిత్తు, ఆనందం. ఇది ఎప్పుడూ మారదు. మారేవేమిటి? నామం రూపం. మారుతున్నాయా లేదా? మొన్న మన పేరు ఫలానా, ఇప్పుడు నిజానికి మారదు. కానీ అప్పుడు కుర్రాడా అని పిలిచారు, ఇప్పుడు ముసలోడా అని పిలుస్తున్నారు. మారిందా లేదా? కనుక నామం రూపం మారుతూ ఉంటాయి వ్యవహారంలో. ఈ దేహంతో రామయ్య అయితే మరొక దేహంతో పుల్లయ్య. లేకపోతే పుల్లమ్మ. ఇవీ మారిపోతున్నాయి. కనుక నామం రూపం మారుతున్నాయి కానీ మారకుండా ఉండేవి అస్తి భాతి ప్రియములు.


అది నువ్వు ఎప్పుడు చూస్తావు? నువ్వు నామ రూప దృష్టిని ఉపసంహరించి తదంతర్గతమైన ఆధార చైతన్యాన్ని ధరిస్తే మనం ఇటునుంచి లెక్కపెట్టడం జీవుడి లక్షణం. అటు నుంచి చూడడం ఈశ్వర దృష్టి. అందుకు మనం అటు నుంచి చూడాలి. (చిటికెన వేలునుంచి లెక్కిస్తే) అస్తి, భాతి, ప్రియం, నామం, రూపం - (బొటన, చూపుడు). నీకు లక్ష్యం ఏమిటి? - అస్తిభాతిప్రియములు. అందుకు ఏం చేయాలి అంటే నామరూపములను ఉపసంహరించి అస్తిభాతిప్రియములను(చిటికెన, ఉంగరంవేలు, మధ్య వేలు) చూడు. ఇదీ ఆంతర్యం. ఒక్క చేతిలో ఎన్ని చెప్తున్నాడండీ.


అన్నీ వాళ్లకి స్ఫురించాయి. వాళ్లకి స్ఫురించాయి అంటే అర్థం స్ఫురింప జేసే స్ఫురణశక్తియైన చైతన్యమే ఎదురుగా రూపం ధరించి అనుగ్రహంతో కూర్చుంది గనుక ఆ చేతినుండి అన్ని వెళ్ళాయి


వాళ్లకి, వెళ్ళి ఆ జీవబ్రహ్మైక్య అనుభవాన్ని పొందారు. ఇన్ని అర్థములున్నాయి ఆ ఒక్క హస్తంలో. అందుకే ‘ముద్రాం భద్రార్థ ధాత్రీం కరకలిత చిన్ముద్ర మానంద రూపం’. స్వాత్మారామం-తనయందు తాను ఆనందించువాడు, అది ఆయన స్వభావం. స్వాత్మా రాముడు – తనయందు తను రమించువాడు అంటే ఆనందించు వాడు, క్రీడించువాడు. జగతి అవసరం లేదు. పరిపూర్ణుడికి దేని అవసరం కావాలి? కడవలో నీళ్ళుపోస్తాం అది నిండేవరకు. నిండిపోయాకకూడా పోస్తే ఇమడదు, ప్రయోజనం కూడా లేదు. పరిపూర్ణుడికేం కావాలి? అందుకు సర్వ పరిపూర్ణుడాయన.


"సర్వపరిపూర్ణునకు వెలి ఏడ? లోనేడ?" అంటారు అన్నమాచార్యులు. సర్వమూ తానైన పరిపూర్ణునికి వెలుపల, లోపల ఏమున్నది? అంతా తానైనప్పుడు ఎవరికండీ ఆనందంకోసం ఆరాటం ఉంటుంది? తన లోపల లేదు అనుకుంటే బయట నుంచి కావాలి అనుకుంటే తాపత్రయాలన్నీ ఉన్నాయి.


కొలత, కొరత ఎవరికి ఉంటుందో వాడు ఆనందం కోసం వెంపర్లాడతాడు. కానీ కొలత లేని వాడు, కొరత లేని వాడు పరిపూర్ణుడైనటువంటి అప్రమేయుడు గనుక స్వాత్మారామం. ముదిత వదనం-అంత ఆనందం స్వభావమే కాదు రూపం స్వీకరించినప్పుడు కూడా ప్రతి అణువు ఆయనలో ఆనందాన్ని ప్రకటీకరిస్తోంది. అందులో ముఖ్యంగా ముఖం భావస్థానం కనుక పైగా రుద్రయత్తే దక్షిణం ముఖం అన్నాం గనుక ఆ ముఖంలో ఏం కనిపిస్తోంది ‘ముదిత వదనం ఆనందమయమైనటువంటి వదనం. అటువంటి దక్షిణామూర్తి మీడే!!


"వటవిటపి సమీపే భూమిభాగే నిషణ్ణం

సకలముని జనానాం జ్ఞానదాతార మారాత్

త్రిభువన గురుమీశం దక్షిణామూర్తి దేవం

జనన మరణ దుఃఖచ్ఛేద దక్షం నమామి!!"


ఇక్కడ దక్షిణామూర్తి శబ్డంలో దక్షిణ అనే శబ్దానికి నిర్వచనం ఇస్తున్నారు గురువుగారు. దక్షిణ అనగా సమర్థత. ఏ సమర్థత? - జనన మరణ దుఃఖాన్ని సమూలంగా ఛేదింపడమనే దక్షత. అది ఎవ్వడి దగ్గరా లేదు. అది దక్షిణామూర్తి ఒక్కరి దగ్గరే ఉన్నది. ఆయన తప్ప ఏ ఒక్కరూ మోక్షాన్ని ఇవ్వలేరు. ఆ మోక్షం ఆయనే ఇవ్వాలి. జనన మరణ దుఃఖచ్ఛేద దక్షతే దక్షిణ - అందుకోసమే ఈమూర్తి ధరించాడు కనుక


దక్షిణామూర్తి. చిత్రం-ఎంత ఆశ్చర్యం! మొట్టమొదట ఆశ్చర్యం. ఆశ్చర్యమే పరమాత్మ. "చిత్రం వట తరోర్మూలే వృద్ధాః శిష్యాః గురుర్యువా – ఎంత గొప్పగా మాట్లాడారండి ఇక్కడ. వట తరోర్మూలే – వటతరువుట ఇక్కడ. చాలా ఆంతర్యం కనిపిస్తుంది ఇక్కడ.


వట తరువు అంటే విస్తరించుకుపోతే వట తరువు. మన బ్రతుకే పెద్ద వటవృక్షం. బ్రతుకు అంటే పుట్టుక, చావు మధ్య మాత్రమే కాదు. అది ఇప్పుడు మనకు కనిపించే ఊడ మాత్రమే. కానీ జీవుడు అవిద్య అనే దుంపలోంచి ఎన్ని ఊడలు చించుకున్నాడో, ఎన్ని జన్మలెత్తాడో? కనుక వీడి విస్తారమైన జన్మపరంపర అంతా వటవృక్షం.


ఇంత పెరుగుతున్నది అంటే చైతన్యం ఆధారంగానే పెరుగుతున్నది. కానీ వీడి అవిద్య వల్ల ఇంత విస్తరిస్తున్నది. దానిలో జీవుడు ఇంతకాలం తిరిగి తిరిగి ఎంతటివాడో? జీవభావం అనే పరిమితత్వంతో ఆలోచిస్తే వృద్ధుడే జీర్ణించుకుపోయే లక్షణంలో తిరిగాడు కనుక వాడు ముసలివాడు. వీడు ముసలి వాడే కానీ ఎవడి వల్ల ఇదంతా నడిచిందో ఆయన యువకుడే. వాడిని చూడు ఆ లోపల. కనుక అంతవరకూ విస్తరించుకు పోయావే మర్రి చెట్టుని.


ఇంత మర్రిచెట్టుకీ మూలమైన ఈశ్వర చైతన్యాన్ని దర్శించు. ఏది అధిష్ఠాన చైతన్యమై ఉన్నదో దానిని దర్శించు. అందుకు నీలోని తలపులన్నీ కూడా నిరంతర చింతనతో, విచారణతో, సాధనతో పండి ఈ చింతనలే మహర్షులు. మహర్షులు అంటే దర్శన శక్తి కలవారు. మన ఆలోచనలే మహర్షులు. మన బ్రతుకే వటవృక్షం. దీనికి మూలంలో ఉన్న అధిష్ఠాన చైతన్యమే దక్షిణామూర్తి.


అటువైపు ఈ ఆలోచనలన్నీ వెళితే అక్కడ జరామరణ మర్జితుడైనటువంటి, నిత్య యౌవనుడైనటువంటి, పూర్ణ బ్రహ్మము అయినటువంటి ఆయన సాక్షాత్కరిస్తున్నాడు. అది చిత్రం-ఆశ్చర్యం! "ఆశ్చర్యవ త్పశ్యతి కశ్చి దేనం"-అని మనకి ఉపనిషత్తులు, గీత చెప్తున్నాయి. ఆశ్చర్యం అనే మాట నుంచి శంకరులు


"చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యా గురుర్ యువా.

గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు ఛిన్న సంశయాః"


ఆయనను ఆశ్రయించినప్పుడు ఉపన్యాసాలు లేవు. ఎందుకంటే అఖండమైన ఆత్మత్వమ్ ఆనందానుభూతి. అంతేకానీ దీపం వెలిగించి నాకు వెలుగునిమ్ము అని ప్రార్థించక్కరలేదు. ఆయన ఇచ్చేదే అది. ఈశ్వర సాక్షాత్కారానభవంతో నాకు జ్ఞానమివ్వు. అని అనక్కరలేదు. జ్ఞానమే ఆయన.


"గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం!

నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః!!"


"ఓం నమః ప్రణవార్థాయ శుద్ధఙ్ఞానైకమూర్తయే!

నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః!!"


కేవల జ్ఞానమే ఆయన మూర్తి. మనకి మూర్తి వేరు, జ్ఞానం వేరు. భగవంతునికి జ్ఞానమే మూర్తి. జ్ఞానమే మూర్తీభవిస్తే దక్షిణామూర్తిగా గోచరిస్తున్నాడు అని చెప్పి స్తోత్రం 

చేస్తున్నారిక్కడ. అయితే దీనిని స్తోత్రం అని ఎందుకన్నామంటే ఆయనే అన్నారు ’అముష్మిన్ స్తవే"-ఈ స్తోత్రమునందు అని. కానీ నిజానికి స్తోత్రం అంటామా అంటే దీనిలో చెప్పబడేదంతా ఆత్మతత్త్వ విచారణే. ఈ స్తోత్రాన్ని ఎలా అనుసంధానం చేయాలో చివరి శ్లోకంలో చాలా చక్కగా వివరించారు. దానిని బాగా మననం చేసుకుంటే ఈ స్తోత్రాన్ని అనుసంధానం చేయవలసిన విధానం పూర్తిగా గమనించవచ్చు.


"తేనాస్వ శ్రవణాత్తదర్థ మననాద్ధ్యానాచ్చ సంకీర్తనాత్!" ఈ స్తోత్రాన్ని వినడం, దాని అర్థాన్ని మననం చేయడం, మననం చేసిన దాన్ని బుద్ధియందు ఏకాగ్రంగా ఎల్లవేళలా నిలపడం, ఏకాగ్రతవల్ల కలిగిన అనుభూతితో దానినే నిరంతరం స్మరిస్తూ ఉండడం ఏదైతే ఉందో అది సంకీర్తనం. ఇలా చేస్తే "సర్వాత్మత్వమహావిభూతి సహితం స్యాదీశ్వరత్వం స్వతః"-వాడు ఈశ్వరునితో తాదాత్మ్యం చెందుతాడు. సర్వాత్మకత్వాన్ని స్ఫుటీకరించే స్తోత్రమిది అన్నారు.


అంటే ఈ స్తోత్రం యొక్క లక్షణం ఏమిటి? ఏవిధంగా దీనిని అనుసంధానించాలో చెప్పారు. అంటే మందిచ్చేవాడు ఆ మందు వల్ల యేజబ్బు పోతుందో చెప్పి మందు ఎలా పుచ్చుకోవాలో చెప్తాడు కదా!


అలా ఇక్కడ ఈ తొమ్మిది శ్లోకాల ఔషధాన్ని తయారుచేసి ఈ మందు purpose ఏంటి? అంటే సర్వాత్మత్వ స్ఫుటీకృతం. సర్వమూ ఒకటే ఆత్మ అది తెలుసుకోవాలి. రెండవది లేదు. ఉన్నది ఒక్కటే ఆత్మ. ఏమిటండీ నాముందు లక్ష కనపడుతున్నాయి. అదే కదా సమస్య! అందుకు కదా సాధన, స్తోత్రం, గీత, ఉపనిషత్తు మనకి. సర్వాత్మత్వాన్ని స్ఫుటీకృతం స్పష్టం చేయడానికై ’అముష్మిన్ స్తవే - ఈ స్తోత్రంలో ప్రతిపాదించారు సత్యాన్ని. చదివినంత మాత్రాన తెలిసిపోతోందా. కాదు. శ్రవణాత్- శ్రవణం చేయాలి.


శ్రవణం ఎలా చేయాలో శివపురాణంలో శివుడు చెప్తాడు. "ప్రియుడు ప్రియురాలి గురించి కబుర్లు వినడానికి ఎంత అటెన్షన్ పే చేస్తాడో నా విషయం వినడానికి అంత ఆసక్తి చూపడాన్ని" శ్రవణం అంటారు అన్నాడు. ఎంత చక్కటి ఉపమానం చెప్పాడో శివుడు.


అలా చెప్తే కానీ మనకు అర్థం కాదు. ఎందుకంటే నిత్యజీవితంలో అనుభూతులవన్నీ కూడా. Sweet Nothings అంటారు. ఏమీ ఉండదు కానీ తీయగా  ఉంటుందిట. ప్రియుడు ప్రియురాలి మాటలు వినడానికి ఎంత ఆసక్తి చూపిస్తాడో భగద్విషయాలు వినడానికి శ్రద్ధాళువు అంత ఆసక్తి చూపిస్తాడట. మనం అది తప్ప మిగిలిన వాటియందు అంత ఆసక్తి చూపిస్తాం.


శ్రవణం తరువాత తదర్థం మననాత్-అర్థాన్ని మననం చేయాలి. మననం చేసినదాన్ని ధ్యానించాలి. ధ్యానించాక కలిగే ఆనందపు అనుభూతిని వ్యక్తీకరించడమే సంకీర్తన. మద్దెలలు, హార్మోనియం పట్టుకొని పాడడం కాదు సంకీర్తన అంటే. సంకీర్తనా గీతం అనే మాటకి శాస్త్రీయమైన అర్థం ఏంటంటే ఆనందానుభూతితో పలికే వ్యక్తీకరణ. అది జరిగితే అప్పుడు ఆ సర్వాత్మకుడైన ఈశ్వరునితో తాదాత్మ్యం చెంది జీవుడనబడే నేను ఈశ్వరుడికి వేరు అనే భావం పోయి "ఈశ్వరత్వం తథః" దానిని పొందుతాడు సుమా! అని purpose చెప్పేశాడు ఆయన. Densified చేసి ఒక్క capsule గా ఇస్తే దానిని గమనించి తత్త్వం తెలుసుకోవడం అంటే అంత తేలికా?


అందుకు ఇప్పుడు మనం శ్రవణం, మననం వీటన్నిటి ద్వారా కేవలం శ్రవణం అంటే నేను శ్లోకాలు చదివేస్తే మీరు వినేస్తే అయిపోలేదు కదా! ఏమి చెప్పారో మనస్సుకు పట్టడానికి ఆ ఆత్మతత్త్వాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం.


                 🙏 శ్రీ దక్షిణామూర్త యే నమః🙏


                              ఓం నమః శివాయ 🙏

Thursday, January 8, 2026 0 comments By: visalakshi

దేవి బీజాక్షరాలు..

 


                       ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః...


ఉమాదేవి బీజాక్షర వివరణ చేసిన గణపతిముని...


ఉమాసహస్రంలో శ్రీ కావ్యకంఠ గణపతిముని 

దేవి బీజాక్షరాలపై గొప్ప వివరణ నిచ్చారు.

ఈదర్శనం అంతా నవమ శతకంలో ముప్ఫైమూడవ స్తబకంలో ‘’వంశస్థ వృత్తాలు‘’లో మనోహరంగా, మనోజ్ఞంగా ఆరాధనా భావ బంధురంగా రచించి అమ్మవారి పరిపూర్ణ కటాక్షసిద్ధి పొంది , మనలనూ ఆ అనుభూతిని పొందమన్నట్లు చేశారు.


మొదటి శ్లోకంలోనే..!

‘’సుధాం కిరంతో ఖిల తాప హరిణీం,తమో హరంతః పటలేన రోచిషాం –శ్రియం దిశంతో దిశి దిశ్య సంక్షయాం ,జయంతి శీతాద్రి సుతాస్మితాంకురాః’’


తాపత్రయాన్ని ,వేడిని హరించే అమృతాన్ని వెదజల్లుతూ కాంతిపుంజంతో చీకటిని అజ్ఞానాన్ని నశింప జేస్తూ అన్నిదిక్కులలోను అక్షయమైన శోభను,సంపదను ప్రదర్శిస్తున్న ఉమాదేవి మందహాసాలు గొప్పగా విరాజిల్లుతున్నాయి అని కీర్తించారు.


నాలుగవ శ్లోకంలో..!

‘’మనః ప్రతాపస్య భవ త్యసంశయం ప్రవర్ధనం వైదిక మంత్రం చింతనం –ప్రశస్యతే ప్రాణమహః ప్రదీపనే దయాన్వితే తాంత్రిక మంత్రం సేవితా ‘’


దయామయీ ! ఋషులు దర్శించిన ‘’తత్స వితుః మొదలైన మంత్రాల ధ్యానంతో మన మనస్సు ప్రభావం పెరుగుతుంది.

ఇందులో సందేహమే లేదు.

శ్రీ విద్య మొదలైన తాంత్రిక మంత్రోపాసన వలన 

ప్రాణ తేజస్సు వృద్ధి చెందుతుంది అన్నారు.

వేదం మంత్రాలు తాంత్రిక మంత్రాలకంటే 

అర్ధ ప్రాధాన్యం కలిగి ఉంటాయని,

ఆమంత్రార్ధ విచారణ వల్ల జ్ఞానం కలుగుతుందని , 

హ్రీం కారం మొదలైన బీజాక్షరాలు ఉండే 

తాంత్రిక మంత్రాల పునశ్చరణ వలన 

ప్రాణనాడి శుద్ధి జరిగి నాదం అభివ్యక్తమౌతుందని 

దానివలన ప్రాణప్రభావం పెరుగుతుందని భావం.


తాంత్రిక మంత్రాలను ఉపాశించేవారినుండి విద్యుత్తుతో సమానమైన తేజస్సు బయటికి వచ్చి ప్రపంచమంతా వ్యాపిస్తుందని తర్వాతి శ్లోకంలో చెప్పారు ముని.

తాంత్రిక మంత్రోపాసకులకు మనస్సు వికారం చెందదని వారి దృష్టి ,బుద్ధి విషయ వాసనలకు లోను కాదని, వారి దేహంలో రోగాలు ప్రవేశించలేవని మరో శ్లోకంలో వివరించారు.


ఏడవ శ్లోకంలో..!

‘’స్మరన్తి మాయాం గగనాగ్ని  శాంతి భిః స్సహాచ్చ భాసా సాహితాభి రంబికే –తదా రసజ్నాం ద్రుహిణాగ్ని శాన్తిభి ర్భణంతి  దోగ్ధ్రీం తుఖషస్ట బిన్దుభిః’’


అమ్మా! పూర్ణ చంద్రుడితో కూడిన ఆకాశ -అగ్ని , శాంతులతో మాయా బీజాన్ని ,

చంద్రునితో కూడిన బ్రహ్మ –

అగ్ని శాంతులతో రసనా బీజాన్ని ,

ఆకాశ –షష్ఠ స్వర బిందువులతో ధేనుబీజాన్ని చెప్పటం లోకంలో అలవాటుగా ఉంది.

దీనికి వివరణ తెలుసుకోవాలి.

పూర్ణ చంద్రుడు అంటే పూర్ణానుస్వారం..అంటే 

నిండు సున్నా.

ఆకాశం అంటే హకారం అగ్ని అంటే రేఫం.

శాంతి అంటే ఈ కారం.

పూర్ణానుస్వారంతో కూడిన హకార ,రకార ,

ఈ కారాలతో ‘’హ్రీం ‘’అనే బీజాక్షరం ఏర్పడుతుంది.

దీన్ని మాయా బీజం అంటారు.


బ్రహ్మ అంటే క కారం .అగ్ని రకారం .శాంతి ఈకారం .

పూర్ణానుస్వారంతో కూడిన కకార,రకా,ఈకారాలతో ఏర్పడేదే’’క్రీం’’అనే బీజాక్షరం.

దీన్నే రసనాబీజం అంటారు.

ఆకాశం అంటే ఖ .హకారం షష్ఠ స్వరం,అంటే 

ఆరవ స్వరం ఊ కారం.

వీటన్నిటితో బిందువు సున్నాతో ఏర్పడిన ‘’హూం ‘’ 

అనే బీజాక్షరం ఏర్పడుతుంది.

దీనికే ధేనుబీజం అని పేరు.

ఈ మూడు మహా మంత్రాలు.


తరువాత గణపతి ముని ఈమహామంత్రం దేవతలను వివరించారు.


‘’అభాన్య తాడ్యాభువనేశ్వరీ బుధై  రనంతరా మాత రగాది కాళికా-ప్రచండ చండీ పరికీర్తితా పరా ,త్రయోష్యమీ తేమనవో మహా ఫలాః ‘’


దేవీ ! మొదటిది అయిన హ్రీంకార మాయాబీజంకు దేవత భువనేశ్వరి!

రెండవది అయిన క్రీం కార రసనాబీజానికి  దేవత 

కాళికా దేవి!

మూడవది అయిన హూం కార మనే  దేనుబీజానికి దేవత ప్రచండ చండి!

అని మంత్రం వేత్తలు చెప్పారు.

ఈ మూడు మంత్రాలూ మహా సిద్ధిదాయకాలే .

ప్రచండ చండికే మరో పేరు ‘’చిన్న మస్త ‘’లేక ‘

’వజ్ర వైరోచని ‘’అంటారు .


మరికొంచెం వివరణ ఇస్తూ తరువాతిశ్లోకాన్ని రచించారు.

‘’ఉపాధి భూతం శుచి నాభసం రజో దధాతి సాక్షా ద్భువనేశ్వరీపదం-తదాశ్రయా వ్యాపక శక్తి రర్భుతా,మనస్వినీ కాచన కాలి కేరితా ‘’


దేనితోను సంబంధంలేని స్వతస్సిద్ధంగా అందరికి ఉపాదానమైన ఆకాశరేణువే భువనేశ్వరి.

ఆ ఆకాశరేణువును ఆశ్రయింఛి ప్రాజ్న అయి ,

ఆశ్చర్య కరి అయి ,

మాటలతో వర్ణించటానికి వీలులేని సర్వవ్యాపకశక్తియే కాళికాదేవిగా చెప్పబడింది అని ముని అభిప్రాయం . 

అంటే సూక్షంగా చెప్పాలంటే  ఆకాశరేణువే భువనేశ్వరి అని సర్వవ్యాపిని అయిన చిచ్చక్తియే కాళీ అని అర్ధం .


తరువాత –

‘’అమర్త్య సామ్రాజ్య భ్రుతః ప్రవర్తికా ,విశాల లోకత్రయ రంగ నర్తికా –పరాక్రమాణా మది నాయికోచ్యతే ,ప్రచండ చండీతి  కలా సవిత్రి తే’’


‘’దేవతలా రాజు ఇంద్రుడిని ప్రపంచ వ్యవహారాలకు నియమించి మూడు లోకాలలోనూ ,

అప్రతి హతంగా విహరిస్తూ ,

వివిధ పరాక్రమాలకు అది దేవతవు అయిన 

నీ కళయే ప్రచండ చండిగా లోకంలో ప్రసిద్ధమైంది .

దీని వలన నీకు శచి ,,ఇంద్రాణి అనే పేర్లు సార్ధకాలైనాయి .

కొంచెం లోతుకు వెళ్లి విచారిస్తే –

ప్రచండ చండికి క్రియాశక్తి ముఖ్యం .

కాళికి వ్యాపించటం జ్ఞాన శక్తి  ముఖ్యం .

అయితే ఈ రెండిటికి మూలం భువనేశ్వరీ మాతయే .


ఈరకంగా దేవియొక్క మూడు మహామంత్రం 

దేవతా విభూతులను గణపతి ముని ప్రతిపాదించారు .

అలాంటి భువనేశ్వరిని అర్చించేవారికి ఏమిఫలం లభిస్తుందో తరువాతి శ్లోకాలలో చెప్పారు .


‘’స్మరన్ మానుం రోదితి భక్తిమాం స్తవ ,ప్రగృహ్య పాదం ముని రంబ లంబతే –ఫలం చిరాయ ప్రధమః సమాప్నుయాత్ ,పరో మరందం పద ఏవ విన్దతి ‘’


‘’తల్లీ ! నీ మంత్రాన్ని ధ్యానించే భక్తుడు ఏడుస్తూ  చాలాకాలానికి కాని ఫలాన్ని పొందలేదు .

కాని నీ పాదాల్ని ఆశ్రయించిన మౌని మాత్రం వెంటనే ఫలసారాన్ని పొందుతాడు .

అంటే మంత్రం జపిస్తే ఎప్పుడో కాని ఫలితం రాదు. 

అదే పాదాలను ఆశ్రయిస్తే వెంటనే ఫలితాన్ని పొందుతాడు అని భావం .


పదహారవ శ్లోకంలో..!

‘’అహం (నేను )అనే పదం యొక్క అర్ధం జ్ఞానం అనే 

తీగ అయితే ,

అది అంటే అహంకార పదార్ధం దేనుబీజం అయిన ‘’హూం ‘’అనే మంత్రార్ధం కంటే వేరైనది ఎలా అవుతుంది?

అహం అనేది ప్రాణధ్వనియొక్క వైఖరి అయితే దేనుబీజం అయిన హూం ఆ ప్రాణ ధ్వని వైఖరి కాదు 

అని చెప్పటానికి వీలే లేదు .

ఇంకొంచెం వివరంగా –

అహం శబ్దం ప్రాణ ధ్వనియే .

హూమ్కారమూ ప్రాణ ధ్వనే .

కనుక శబ్దంలో ఈ రెండిటికి భేదం ఉంది

కాని అర్ధంలో భేదం లేదని కావ్య కంఠుల అభిప్రాయం


మరో శ్లోకంలో..!

‘’పారేతు యాం చేతన శక్తి మామన ,న్త్యభాణి సా కుండలి నీతి తాన్త్రికైః-విలక్షణా  నామ చమత్రుతి ర్జడాన్ ,ప్రతారయత్యాగమ సార దూరాన్ ‘’


కొందరు తంత్ర వేత్తలు  చేతన శక్తి ఉన్నదాన్నే కుండలిని అన్నారు .

ఈ అసాధారణ చమత్కారం  మంత్రం శాస్త్రం  తెలియని మంద బుద్ధులను వంచించటానికే కదా అని ప్రశ్నించారు .

అంటే తాంత్రికులు చిచ్చక్తిని కుండలిని అన్నారు .

ఇది విలక్షణమైన చమత్కారం .

కుండలిని అంటే పాము అని సామాన్యులు భయపడతారు.

కాని కుండలిని అని వారికీ చప్పున స్పురించదు .

దీనివలన మోహం జరిగే ప్రమాదం ఉంది అని అంటారు .


‘’మతిః పరాచీ వ్యవహార కారణం ,భావేత్ప్రతీచీ పరమార్ధ సంపది –ఉభౌ దిశే యస్య మతి ర్విగాహతే ,

పదా చ మూర్ధ్నా చ స సిద్ధి ఇష్యతే ‘’బహిర్ముఖం 

అయిన బుద్ధి బయటి ప్రపంచ వ్యవహారానికి కారణం అవుతుంది .

అంతర్ముఖం అయిన బుద్ధి పరమ పురుషార్ధం అయిన మోక్షానికి కారణం అవుతుంది .

బహిర్ముఖం అంతర్ముఖం అయిన బుద్ధి గల యోగి 

పాదం చేతా ,శిరస్సు చేతా సిద్దుడౌతాడు .

ఇక్కడ పాదం అంటే హృదయం అనే ఆకాశం .

మూర్ధం అంటే సహస్రారం .

అంటే  హృదయం చేత సిద్దుడైనవాడు ప్రత్యేక దృష్టి సిద్ధుడు అవుతాడు .

సహస్రారం చేత సిద్ధుడైనవాడు పరాక్ దృష్టి సిద్దుడవుతాడు .

అందరికి పరాగ్ దృష్టి అంటే బాహ్య దృష్టి అవకాశం కలుగుతుంది .

కాని ప్రత్యక దృష్టి అంటే అంతర్ దృష్టి కలవాడికి 

బాహ్య దృష్టి అదుపులో ఉంటుంది .

జీవన్ముక్తుడు అయిన పురుషుడు మాత్రమే అంతర్ముఖంగా ప్రజ్ఞను విడవకుండా బాహ్య వ్యవహారాలూ నిర్వహించే సమర్ధుడు అవుతాడు..అని అంతరార్ధంగా వివరించారు. వ్యాఖ్యాతలైన కపాలి శాస్త్రి, పన్నాల రాధా కృష్ణ గార్లు .


బుద్ధికి లక్ష్యమైన స్థానం హృదయం అని హృదయంలో ఎల్లప్పుడూ దృఢంగా ఉన్నవాడు 

బుద్ధి బయటి ప్రపంచం విషయాల్లో తిరుగుతున్నా ,

చిచ్వరూపిణి అయిన దేవియందు నిమగ్నుడయ్యే ఉంటాడు .

కనుక జనన మరణ భయం అలాంటివారికి ఉండదని తరువాతి శ్లోకంలో చెప్పారు .

ధ్యానంలో అద్భుతమైన ధ్యాన శక్తిగా ,

దర్శనంలో దీప్తం అయిన దర్శన శక్తిగా ,

ప్రవచనం చేసేటప్పుడు శ్రేష్టమైన ప్రవచన శక్తిగా 

దేవిని దర్శించే నైష్టిక పురుషుడు బాహ్య విషయాల చేత బంధింపబడడు అని తరువాతి శ్లోకంలో వివరించారు . 

ఆశ్రితుల భయాన్ని పోగొడుతూ పండితుల చేత ప్రస్తుతింపబడే పరమేశ్వరి కనిపించేవాటియందు’ ’సంగం’’(బంధం ) వదిలి దర్శన కర్మ ను చూసే 

క్రాంతదర్శి అయిన కవి దృష్టిలో నిత్యం సన్నిహితం గా ఉంటుంది అన్నారు.


చివరి శ్లోకం లో..!

‘’అయం భయానాం పరిమార్జక స్సతాం సమస్త పౌపేఘ నివారణ క్షమః –మనోజ్ఞ వంశస్థ గణో గణేషితు-,ర్మనో మహేశాబ్జ దృశో దినోత్పలం ‘’


సజ్జనులకు భయహరంగా ,

సమస్త పాపాలకు నివారణగా గణపతి కవి 

‘’వంశస్త వృత్తం‘’లలో రచించిన 

ఈరమణీయ శ్లోక బృందం ఉమాదేవికి పరమానందం కలిగించుగాక అని చెప్పి ముగించారు.

                  *ఓం శ్రీ మాత్రే నమః*