Friday, October 9, 2015 By: visalakshi

భక్తి రసామృతము

  ఓం శ్రీ పురుషోత్తమాయ నమో నమ:

  ప్రార్ధన:---

 పద్మలోచన! కృష్ణ! భక్తాభయప్రద

           వినుము సంసారాగ్ని వేగుచున్న

 జనుల సంసారంబు సం హరింపగ నీవు

             దక్క నన్యులు లేరు తలచి చూడ 

 సాక్షాత్కరించిన సర్వేశ్వరుండవు

              ప్రకృతికి నవ్వలి ప్రభుడ వాద్య

 పురుషుండవగు నీవు బోధముచే మాయ

              నడతువు నిశ్శ్రేయసాత్మ యందు

 మాయచేత మునిగి మనువారలకు కృప

              చేసి ధర్మముఖ్య చిహ్నమైన

 శుభము సేయు నీవు సుజనుల నవనిలో

         గావ పుట్టుదువు జగన్నివాస!



కృష్ణా!  "సంసారజ్వాలల్లో తపించిపోతున్న జనుల కష్టాన్ని పోగొట్టడం నీకు తప్ప మరొకరికి శక్యం కాదు. నీవు సాక్షాత్తూ సర్వేశ్వరుడవు.ఈ ముల్లోకాలకూ ఆవలివాడవు! ఆది పురుషుడవైన ప్రభుడవు! నీవు ముముక్షువులకు జ్ఞానాన్ని ప్రసాదించి, మాయను మటుమాయం చేస్తావు. నీవు మాయాజాలంలో మునిగిన వారికి ధర్మసమ్మతమైన తేజస్సును అనుగ్రహిస్తావు. ఓ జగన్నివాసా! శిష్టరక్షణ కోసమే నీవు ఈ జగత్తులో జన్మిస్తావు" .



   ఏ జీవియు ఇటు భోగములను అనుభవించుటలోనో, అటు భోగములను త్యాగము చేయుటలోనో స్థిరముగా నుండలేడు. దీనికి కారణము: జీవుడు తన నిజ స్వభావము వలన ఈ రెంటిలో ఏ దశలోను నిజమైన ఆనందములను అనుభవింప లేకుండుట. 

   ఒక సాధారణ గృహస్తు రాత్రింబగళ్ళు కష్టపడి తన కుటుంబ సభ్యులకు సర్వసౌఖ్యములను చేకూర్చి, తద్ద్వారా ఒక విధమగు రసమును అనుభవింపవచ్చును. కాని తాను సాధించిన ఈ ఐహిక భోగమంతయు తన జీవితము ముగిసి దేహత్యాగము చేయుటతో అంతమైపోవును.భక్తుడు భక్తియుక్త సేవ ద్వారా భగవంతుని సాక్షాత్కరింప జేసికొనగా, నాస్తికుడు మాత్రము మృత్యువు రూపములో భగవంతుని దర్శించును.జీవితములో రాజకీయ, సాంఘీక, జాతీయ, అంతర్జాతీయ కార్యరంగములలో దేనిలోనైనను స్వయంకృషి వలన సాధించు ఫలితములన్నియు మృత్యువుతో అంతరించిపోవుట నిశ్చయము.

   అయితే - భగవంతునికి చేయు ఆధ్యాత్మికమైన భక్తియుక్త సేవ వలన అనుభూతమగు 'భక్తిరసము ' మాత్రము మరణముతో అంతరించిపోదు.అది శాశ్వతముగా నిలిచియుండును.అందుకే దానిని అమృతము (మృతిలేనిది,నిత్యమైనది) అందురు. ఈ జన్మలో మనము చేయు కర్మలమీద మన పునర్జన్మ ఆధారపడిఉండును. 'దైవము ' అను ఒక ఉన్నతాధికారి - భగవంతుని ప్రతినిధి - జీవుల కర్మలను పర్యవేక్షించుచుండును.మామూలు వాడుక భాషలో దైవమునకు ' విధి ' అని అర్ధము. దైవము 84 లక్షల దేహములలో ఏదో ఒక దేహమును జీవునికి ఒసంగును.ఆ ఎన్నిక మన ఇష్టానిష్టముల పై ఆధారపడి యుండదు.' విధి 'నిర్ణయమును అనుసరించి అది జరుగును.భగవంతుని భక్తియోగ మార్గమున మానవుడు భక్తి రసాస్వాదనను అవలంబించినచో సమస్త సన్మంగళములతో కూడిన జీవిత మారంభమగును."ముక్తికంటె ఉన్నతమైన ఆధ్యాత్మిక జీవనమును ప్రసాదించుటయే ' భక్తి రసామృతము ' ".

సర్వం శ్రీ సాయికృష్ణార్పణ మస్తు

0 comments: