Thursday, December 24, 2020 By: visalakshi

మాహేశ్వర సూత్రాలు...

 

#మాహేశ్వర సూత్రాలు:


పూర్వం పరమశివుడు నాట్యం చేస్తూ తన ఢమరుకాన్ని పదునాలుగు పర్యాయాలు మ్రోగించగా,ఆ శబ్దం నుండి పుట్టిన అక్షరాలను ‘పాణిని’ అనే ఋషి గ్రహించి,పదునాలుగు వ్యాకరణ సూత్రాలుగ రచించాడు. ఈ సూత్రాలే  "మాహేశ్వర" సూత్రాలుగ పిలువబడుతున్నాయి, ఆ సూత్రాలే అక్షరాల పుట్టుకకి ముఖ్య భూమికలు. ఈ శ్లోకం చూడండి. " నృత్తావసానే నాటరాజ రాజో / ననాద ఢక్కాం నవ పంచవారం"

(నవ=తొమ్మిది. పంచ=ఐదు కలిపితే =14)

ఉద్ధర్తు కామః సనకాది సిద్ధాన్ /ఎతద్విమర్శే శివ సూత్రజాలం// అక్షరాలని సృష్టించి సూత్రీకరించింది పాణిని ఐతే, వాటికి వార్తీకం వ్రాసినది ‘వరరుచి’. వివరణాత్మకమైన భాష్యాన్ని వ్రాసినది ‘పతంజలి మహర్షి.’ అందుకనే "“వాక్యకారం వరరుచిం/ భాష్యకారం పతంజలిం/పాణినిం సూత్రకారంచ/ ప్రణతోస్మి మునిత్రయం// అని ముందుగా పైముగ్గురు మునులకి నమస్కరించి, పూర్వం  వ్యాకరణాన్ని, తద్వారా భాషని అభ్యసించేవారు. పదునాలుగు సూత్రాలని తెలుసుకొందాం.  ఇవి పరమేశ్వరుడు చేసిన ఢమరుక శబ్దం నుండి గ్రహింపబడినవి.


1‘అ ఇ ఉ ణ్’ (అకార, ఇకార, ఉకారాలు)

2‘ఋ లు క్’ (ఋకార అలుకారాలు)

3‘ఏ ఓం గ్’ ( ఏకార, ఓకారాలు)

4‘ ఐ ఔ చ్’ (ఐ కారము, ఔ కారము)

5‘హ య వ ర ట్’ (హకార, యకార, వకార, రకారాలు.)

6‘ల ణ్’ (లకారం)

7‘ఙ, మ, ఞ, ణ నం’ ( వర్గల యొక్క చివరి ఐదు అక్షరాలు )

8‘ఝ, భ య్’ ( ఝాకార, భకారాలు)

9‘ఘ,ఢ,ధ ష్’ ( ఘకారం, ఢ కారం, ధకారం)

10‘జ, బ, గ, డ ద శ్’ ( ఐదు అక్షరాలు )

11‘ఖ ఫ ఛ ఠ థ చ ట త వ్’ ( ఎనిమిది అక్షరాలు)

12‘క ప య్’ (క & ప )

13‘శ ష స ర్’( శకార, షకార,సకారాలు )

14‘హల్’ ( హకారం)

 



ఈ పదునాలుగు మహేశ్వరుని సూత్రాలు.


ప్రతి సూత్రం చివరఉన్న పొల్లు హల్లులు సులభంగా పలకడానికి నిర్దేశించబడినవి. అట్లే అచ్చులు, హల్లులు కూడ ప్రత్యాహార సంజ్ఞతో సులభంగ అర్థమయే రీతిలో నిర్దేశించబడినవి. అవి తొలి సూత్రములోని మొదటి అక్షరం ‘అ’ నాల్గవ సూత్రములోని చివరి హల్లు ‘చ్’ కలిపితే ‘అచ్’ సంజ్ఞ ఏర్పడి, వాటిమధ్య ఉండే అక్షరాలని ‘అచ్చులు’ అని వ్యవహరిస్తారని, ఐదవ సూత్రములోని మొదటి అక్షరం ‘హ’ని గ్రహించి పదునాల్గవ సూత్రములోని చివర ఉన్న ‘ల్’ అనే పొల్లుతో కలిపితే ‘హల్’అనే సంజ్ఞ ఏర్పడి వాటి మధ్య ఉండే అక్షరాలని ‘హల్’ అనే పేరుతో పిలుతురని పాణిని స్పష్టంగా సూచించాడు.   ఇట్టి సూత్రములతో ఎనిమిది అధ్యాయాలలో పాణిని  మహర్షిచే రచించబడిన తొలి వ్యాకరణ గ్రంథానికి “అష్టాధ్యాయి” అని పేరు. ఈ సూత్రాలకే ‘వరరుచి’ వార్తికాలని, “పతంజలి”భాష్యాన్ని రచించి లోకానికి ప్రసాదించారు.  ఇప్పటికీ ఇదే గొప్ప ప్రామాణిక గ్రంథము.


---వరకాల మురళీమోహన్ గారి సౌజన్యంతో

0 comments: