Saturday, November 14, 2015 By: visalakshi

భగవన్నామ మధువు మాధుర్యము

  ఓం శ్రీ పరంధామాయ నమ:

  ద్వా సుపర్ణా సయుజా సఖయా సమానం వృక్షం పరిషస్వజాతే!
 తయోరస్య: పిప్పలం స్వాద్వత్తి అనశ్నన్ అన్యో అభిచాకశీతి!!


  భా:- ఒకే చెట్టు పైన రెండు పక్షులు ఉన్నాయి. కింద కొమ్మ మీద ఉన్న పక్షి పళ్ళను తింటున్నది. అది తియ్యని పళ్ళను తిన్నప్పుడు సుఖాన్ని, చేదు పళ్ళను తిన్నప్పుడు దు:ఖాన్ని పొందుతుంది.రెండవ పక్షి ఏమీ తినకుండా ప్రశాంతంగా కూర్చొంది. సుఖదు:ఖాలకు అతీతమైన ఆత్మానందాన్ని అనుభవిస్తోంది.


  దేవదానవుల మధ్య తీవ్ర యుద్ధాలు జరుగుతున్న రోజులవి.  దేవతలు 
ఎంతో కష్టపడి దానవులపై విజయం సాధించినా ఆ ఆనందం ఎక్కువ కాలం నిలిచేది కాదు.దానవ గురువు శుక్రాచార్యుడు అసురులను మృతసంజీవని విద్యను ప్రయోగించి బ్రతికించేవాడు. ఈ కారణం చేత దేవతల సంఖ్య క్రమేణా తగ్గుతూ వస్తున్నది. 'ఇది ఇలాగే కొనసాగితే మనం అంతరించిపోతాం,ఏదైనా మార్గాన్ని అనుసరించి మనల్ని మనం రక్షించుకోవాలీ, అని దేవతలందరూ భావించారు. దేవగురువైన బృహస్పతి కుమారుడు కచుడిని శుక్రాచార్యుడి దగ్గరకు పంపాలని నిశ్చయించారు.   అతడు రాక్షస గురువు వద్ద మృతసంజీవని విద్యను నేర్చుకొని వచ్చి యుద్ధంలో చనిపోయిన దేవతలను తిరిగి బ్రతికిస్తుండాలి.ఆనాటి గురువులలో వివక్షత లేదు. దేవతల ప్రతినిధిగా వచ్చినప్పటికీ కచుడి వినయ విధేయతలు నచ్చి శుక్రాచార్యుడు కచుని శిష్యుడిగా స్వీకరించాడు. వినయ సంపదే విజ్ఞానార్జనకు మొదటి అర్హత అని చాటాడు. కచుడు గురుశుశ్రూష చేస్తున్నాడు. రోజులు గడుస్తున్నాయి.రాక్షసులు కచుడిని గమనిస్తున్నారు.అతడు దెవగురువు కుమారుడని,తమ గురువు వద్ద మృతసంజీవని విద్యను నేర్చుకొని యుద్ధంలో దానవ సమ్హారాన్ని నిరాటంకంగా కొనసాగించటానికి దేవతలు వేసిన ఎత్తుగడ అని వారికి అర్ధమైంది. ఒక రోజు కచుడు అడవిలో ఆలమందను మేపుతూ, ఒంటరిగా ఉన్నప్పుడు కచుని చంపి, శరీరాన్ని ఖండఖండాలుగా చేసి మృగాలకు ఆహారంగా వేసారు. శుక్ర తనూజ దేవయానికి కచుడంటే మహాభిమానం. కూతురంటే శుక్రాచార్యుడికి వల్లమాలిన ప్రేమ. బ్రహ్మజ్ఞాని అయిన ఆ ఋషి మనసు కుమార్తె కారణంగానే లౌకిక ప్రపంచంలో నిలిచేది. ఆ రోజు ఆవులతో పాటు కచుడు రాలేదు. దేవయాని ప్రమాదాన్ని శంకించింది. తండ్రి వద్దకు వెళ్ళి కచుడు తిరిగి రాలేదని ఏడుస్తూ చెప్పింది. ఆత్మజ రోదించడం చూడలేని ఆ సం యమి వెంటనే దివ్యదృష్టితో జరిగిన విషయాన్ని గమనించాడు. మృతసంజీవని విద్యను ప్రయోగించాడు. కచుడు జంతువుల శరీరాలను చీల్చుకుంటూ బయటకు వచ్చాడు.   ఇంకోసారి కచుడు దేవయానికి పూలను తీసుకురావటానికి అడవికి  వెళ్ళినపుడు రాక్షసులు అదే అవకాశంగా కచుడిని చంపి, శరీరాన్ని కాల్చి  ఆ బూడిదను సముద్రంలో కలిపారు. కచుడు ఆశ్రమానికి రాలేదని చూసి దేవయాని మళ్ళీ వెళ్ళి తండ్రి వద్ద మొరబెట్టుకుంది. ఈసారి కూడా అసుర గురువు తన అద్భుత విద్యతో కచుడిని బ్రతికించాడు. దైత్యులు ఇక లాభం లేదనుకొని మరోసారి కచుడు ఏకాంతంగా ఉన్నాప్పుడు అతడిని చంపి, ఆ శరీరాన్ని కాల్చి బూడిద చేసి, మద్యంలో కలిపి తమ గురువుతో తాగించారు. కచుడు కనబడకపోయేసరికి దేవయాని విచలిత మనస్కురాలైంది. కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ కచుడిని బ్రతికించమని తండ్రిని వేడుకుంది. దేవయాని కచుడిని చూడందే అన్నపానీయాలు ముట్టనని భీష్మించింది. దైత్యగురువుకి ఇక తప్పలేదు.మళ్ళీ విద్యను ప్రయోగించి, 'నాయనా కచా! లేచి రా'అన్నాడు. 'గురువర్యా నేను మీ శరీరంలోనే ఉన్నాను.' అని కచుడు బదులిచ్చాడు. శుక్రాచార్యుడికి దానవుల పన్నాగం అర్ధమైంది. మహాతపశ్శాలి ఐన ఆయన సురాపానం వలన తాను మోసపోయినట్లు గ్రహించాడు. కచుడు బయటకు వస్తే తాను  చనిపోవాల్సి ఉంటుంది. ఇక నిశాచర గురువుకి ప్రత్యామ్నాయం కనబడలేదు. కచుడికి మృతసంజీవని విద్యననుగ్రహించాడు. కచుడు గురువు శరీరాన్ని చీల్చుకొని, బయటకు వచ్చి తరువాత తాను గ్రహించిన విద్య ద్వారా గురువుని బ్రతికించాడు.ఆచార్యుడి ఋణం తీర్చుకున్నాడు.ఆదర్శ శిష్యుడనిపించుకున్నాడు. అసురాచార్యుడు జరిగిన తంతునంతా విచారించి,మధ్యపానం ఎంత అనర్ధానికి దారి తీసిందో గ్రహించి ఆగ్రహోదగ్రుడయ్యాడు. భయంకర శాపాన్ని భవిష్యత్ మధ్యపాన ప్రియులపై ప్రయోగించాడు. 'ఎవరైతే జ్ఞానవిహీనులై సురాపానం చేస్తారో వారు    ధర్మభ్రష్టులవుతారు.వారిని అందరూ చీదరించుకుంటారు. ఈసడిస్తారు. ఈ నా ఆజ్ఞను పాటించనివాళ్ళు పతనమవుతారు.అన్నాడు శుక్రాచార్యుడు.ఇది మహాభారతంలోని ఒక అద్భుత సన్నివేశం. ఈ గాధలో ఎన్నో ధర్మసూక్ష్మాలు ఉన్నాయి.       

 ఒక వ్యక్తి మద్యానికి బానిసై, గురువుతో యావజ్జీవితమూ నన్ను మత్తులో పడేసే మద్యాన్ని దయచేసి నాకివ్వండి ' అంటాడు. భగవన్నామం జపించమని ,ఆ మధువు ముందు అన్నీ దిగదుడుపేనని చెప్పి ఆ వ్యక్తిని మహా భక్తుడిగా తీర్చిదిద్దారు గురుతుల్యులు.ఈ భగవన్నామ మధువును రుచి చూడలేకపోవటం వల్లనే మనిషి చవకబారు మద్యానికి అలవాటు పడుతున్నారు.మందార పుష్పంలోని మకరంద మాధుర్యం అనుభవించే తుమ్మెద ఉమ్మెత్తపూల వైపుకి పోతుందా?'అంటాడు ప్రహ్లాదుడు.భగవన్నామ మాధుర్యమును ఆస్వాదించ లేకపోవటం వలననే మన మనస్సనే తుమ్మెద మద్యమనే ఉమ్మెత్త పూవుపైకి పోవుచున్నది. కానీ ఈ మాధుర్యాన్ని గ్రోలాలంటే ఎంత ఆధ్యాత్మిక సంస్కారం కావాలి!మధుపాన ప్రియులను, మాధవ ప్రియులుగా మార్చుటకు 'దయాస్వరూపుడైన ఆ శ్రీహరి అందరినీ సమగ్రజ్ఞానం వైపుకు నడిపించు గాక!'

 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.

0 comments: