Sunday, June 28, 2020 By: visalakshi

సాయినాధ గురు సాన్నిధ్యం - ప్రార్ధన...

    ఓం శ్రీ సాయినాధాయ నమో నమః




మనసే మందిరంగా చేసి సాయిని ఆరాధిద్దాం
సాయిబాబాకు ఆర్భాటాలు, ఆడంబరాలు అక్కర్లేదు. నిండైన మనసు చాలు. మనసునే మందిరంగా చేసి సాయిని ఆరాధిద్దాం.
సాయిబాబా పాదాలను ఆశ్రయించడమే ఆరాధన. మనసులో నిరంతరం బాబాను తల్చుకోవడమే నివేదన.
సాయిబాబాకు భక్తుల గురించే ధ్యాస. మనని భవబంధాలనుండి ఎలా విముక్తుల్ని చేయాలి, అశాశ్వతమైన అనుబంధాల నుండి ఎలా బయట పడేయాలి, ఆధ్యాత్మిక చింతన పెంచి జీవితాన్ని సార్ధకం చేయాలి అనే ఆయన చింత. భగవంతుడు మనిషికి అవసరమైనవన్నీ ఇచ్చి భూమ్మీదకు పంపాడు. మరి అలాంటప్పుడు భగవంతుడు తాను ఇచ్చిన ఆస్తులను, మానవులు సవ్యంగా ఖర్చు పెట్టాలని ఆశిస్తాడు కదా. కనుక మనం దేన్నీ దుర్వినియోగం చేయకూడదు. మనకు ఉన్న ఆస్తులను సద్వినియోగం చేసుకుంటూ, తోటివారికి ఉపయోగపడుతూ, జీవితాన్ని సార్ధకం చేసుకోవాలి.

వివిధ సందర్భాల్లో సాయిబాబా అన్న మాటలు గుర్తుచేసుకుందాం...

"ప్రజల్ని సన్మార్గంలో పెట్టమని భగవంతుడు నన్ను పంపాడు. కానీ, ఈ రోజుల్లో ప్రజలు కాస్తయినా దేవుడిపట్ల భక్తిశ్రద్ధలు లేకుండా కాలం గడుపుతున్నారు. క్షణికమైన మొహావేశాల్లో పడి కొట్టుకుపోతున్నారు. సత్సంగాలపై ధ్యాస, నమ్మకం లేవు. సత్యం మాట్లాడుతూ, ధర్మాన్ని ఆచరించమంటే, అసత్యాలు చెప్తూ, అధర్మంలో తేలుతున్నారు. భక్తిభావన నిలుపుకుంటే మీకే శ్రేయస్కరం. నా ప్రయత్నాన్ని నేను చిత్తశుద్ధితో చేస్తాను."



పుడుతున్నాం. తింటున్నాం. కాలయాపన చేస్తున్నాం. పుట్టడం, ఆయుష్షు ఉన్నంతవరకు జీవించడం - ఇదేనా జీవితం? ఇందులో ఏమైనా జీవితపరమార్ధం ఉందా? మన జీవితానికి గమ్యం అంటూ ఉండనవసరం లేదా? సరైన, నిర్దుష్టమైన గమ్యాన్ని నిర్ణయించుకుని దాన్ని చేరేందుకు ప్రయత్నించాలి. మనిషి తనను తాను తెలుసుకోలేనంతవరకూ, గమ్యాన్ని నిర్దేశించుకునేంతవరకు జ్ఞానం లేనట్లే. గమ్యం తెలిసివాడే జ్ఞాని. సద్గురువు బోధనలు వింటే, వాటిని పాటిస్తే జీవితం సార్ధకమౌతుంది.

పుట్టినవారు గిట్టకమానరు. అందరూ మట్టిలో కలిసిపోవలసిందే. అయితే, చావుపుట్టుకల మధ్య ఉన్న జీవితాన్ని సార్ధకం చేసుకోవాల్సిన బాధ్యత మనమీద ఉంది. తోటివారితో వీలైనంత వినయవిధేయతలతో మాట్లాడాలి.  , విలాసాలకు దూరంగా నిరాడంబరంగా గడపాలి.

''ఇంద్రియాలను అదుపులో ఉంచుకో..సౌశీల్యాన్ని, సౌజన్యాన్ని అలవర్చుకో..ఎక్కువగా మాట్లాడకు..ఎదుటివారు చెప్పేది విను..
సుఖదుఃఖాలను సమానంగా స్వీకరించు..దంతులు, వాదులాలు వద్దు..
అహంకారాన్ని విడిచిపెట్టు..కోపతాపాలకు దూరంగా ఉండు..
దేనిమీదా ఇష్టాన్ని పెంచుకోకు..దేన్నీ ద్వేషించకు..మనోవికారాలకు దూరంగా,నిర్వికారంగా ఉండటం అలవర్చుకో..శ్రద్ధ, సబూరీలను సమర్పించు
ఇదే నిజమైన గురుదక్షిణ''

సాయిబాబా సదానంద స్వరూపం. మోక్షాన్ని ప్రసాదించే సాధనం. శాంతికి మారుపేరు. సర్వ విజ్ఞాన ఖని.




బాబా మాటలు అమూల్యమైన హితోక్తులు. ఆయన బోధనలు అమృత జల్లులు..బాబా మనమధ్య తిరిగినప్పుడు ఎన్ని అద్భుతాలు చేసి చూపాడో, సమాధి స్థితిలోనూ చూపుతున్నాడు. ..బాబా మనకు మార్గదర్శకుడు.

బాబా అడుగులతో పునీతమైన షిర్డీ నేల పుణ్యక్షేత్రం అయింది. షిర్డీ వెళ్ళి వస్తే చాలు తమ కష్టాలు తీరుతాయని నమ్ముతారు భక్తులు. షిర్డీ క్షేత్రానికి వెళ్ళి, ప్రశాంత చిత్తంతో వెనుతిరిగి వస్తుంటారు. 

సాయి భక్తులు వీలైనపుడల్లా షిర్డీ వెళ్ళి వస్తుంటారు.

చిన్నాపెద్దా, పేదాధనిక తేడా లేకుండా బాబా అందర్నీ కాపాడుతాడు. కష్టాలను ఎదుర్కొనే శక్తి సామర్ధ్యాలను అందిస్తాడు.

బాబా సిద్ధపురుషుడు అయ్యుండీ సామాన్యుడిలా జీవించాడు. నలుగురి మధ్యా సాధకునిలా జీవించి ఎన్నెన్నో జీవనసత్యాలను అరటిపండు వలిచి నోట్లో పెట్టినట్లు అర్ధం చేసి చెప్పాడు.


లోకమంతా నిద్రలో ఉంటే జగద్రక్షకుడిగా బాబా మెలకువగా ఉండేవాడు. అందరూ మేల్కొని ఉన్నప్పుడు ఆయన యోగనిద్రలో ఉండేవాడు.

మనల్ని ఎల్లవేళలా కంటికి రెప్పలా కనిపెట్టుకుని ఉండే బాబా ఉండగా మనకెందుకు చింత? నిశ్చింతగా, నిబ్బరంగా ముందుకు సాగుదాం. జీవన మాధుర్యాన్ని ఆస్వాదిద్దాం.....ఓం సాయిరాం



ప్రార్ధన..ఓం సాయిరాం ..


ప్రేమతో ,భక్తితో పిలిస్తే పలకని ,తలిస్తే తరింపచేయని దైవం ఉంటారా ?


భక్తుల ప్రార్ధనలోని వేడుకోలు అనే వెచ్చదనానికి భగవంతుని హృదయం వెన్నలా కరగకుండా ఉంటుందా ?


ద్రౌపదిని వస్త్రాభరణం నుంచికాపాడింది ప్రార్ధనే!

గజేంద్రుడికి ప్రాణభిక్ష పెట్టింది ప్రార్థనే !
మార్కండేయుడిని యమగండం నుంచి తప్పంచింది ప్రార్థనే !
ప్రహ్లాదుడిని భక్తిముక్తిదాయకుడిని చేసింది ప్రార్దనే!

శ్యామాను పాముకాటు నుంచి రక్షించి౦ది ,తాత్యాకు ప్రాణభిక్ష పెట్టింది ప్రార్దనే !


ఈ కాలంలో ప్రార్ధనకు అర్ధం మారిపోయింది.

దేవుడితో బేరసారాలు ఆడటమే ప్రార్ధనల పరమావధి అయింది .'నా కోరిక తీర్చు...నీ చెంతకొస్తా'.....'ఫలానా పనయ్యేలాచెయ్యి... ''నీకు కానుకలిస్తా ''ఇంకా ఇలాంటివే మన ప్రార్ధనలన్ని !
ఏదిఏమైనా భగవంతుడు అందరివాడు అందరిలోనూ ఉన్నాడు .

ప్రార్ధన స్వభావం ఏదైనా భగవంతుడు వెంటనే కదులుతాడు.అందుకే మనం చేసే ప్రతి ప్రార్ధనకు ప్రతిఫలం ఉంటుంది .


కీర్తి ,ప్రతిష్ట ,గౌరవం,ఐశ్వర్య౦,ఆరోగ్యం .....ఏదడిగిన కాదనకుండా భగవంతుడు మనకు కోరినవన్నీ ప్రసాదిస్తాడు .మనం కోరకునేవన్ని కూడా అవే !

మనం చేసే ప్రార్ధనలో 'దేవుడిలా కావాలని ' చేసే ప్రార్ధన ఒకటి ఉండదు .జ్ఞానాన్ని ప్రసాదించమని 'ఒక్కరూ భగవంతుడ్ని వేడుకోరు .

ఒకసారి కుంతిదేవితో శ్రీకృష్ణుడు ''అత్తా !ఏదైనా వరం కోరుకో ''అన్నాడట .


''నాపై దయ ఉంటే నాకు ఎడతెగని కష్టాలు ప్రసాదించు ''అందట కుంతిదేవీ .


''అదేమిటి ?అందరు భోగభాగ్యాలు ,సుఖసంతోషాలు కోరుకుంటే నువ్వేమో కోరికష్టాలను ఇవ్వమంటావు?''అని కృష్ణుడు ఆశ్చర్యపోయాడు .
''కష్టాలలో ఉంటేనే కదా నిరంతరం భగవంతుడు గుర్తుండేది .సుఖాలకు మరిగితే ఇక నీ అవసరం ఉండదు .నాకు భగవంతుని సాంగత్యమే ఇష్టం .అందుకే నేను భగవంతుడినే ఎల్లప్పుడూ ధ్యానించాల౦టే నాకు కష్టాలనే ఇవ్వు ''. భగవంతుడు చెంతనే ఉంటే మాత్రం కోరి కష్టాలను వరించటం ,మనసును కష్ట పెట్టుకోవటం ఎవరికీ మాత్రం ఇష్టం .మరి ,మన కోరికలను తీర్చుకుంటునే భగవంతుడుని ఎలా ధ్యానించాలి ?నిత్యం భగవంతుడిని మనసు మందిరంలో ఎలా ప్రతిష్టించుకోవాలి ?అసలు మనం భగవంతుడిని కోరుకోవాల్సినవి ఏమిటి ?ఇవన్ని భక్తుడిని సందిగ్ధంలో పడవేసే ప్రశ్నలు .చాలా వరకు సులభరీతిలో సమాధానం దొరకనివి కూడా!




ఈ క్రమంలోనే మానవజన్మకు భూమిపైనే చరితార్థం చేయగల సులభోపాయాలు ,సరళబోధలు ,..నీతిసూత్రాలు , చక్కని ఉపదేశాలతో జ్ఞానమార్గాన్ని చూపటానికి ఓ దివ్య అవతారం వెలసింది .మానవాళి ఉద్ధరణకు మానవ రూపంలో అవతరించిన ఆ దైవమే షిరిడిసాయినాధుడు .అరవై ఏళ్ళ పాటు ఈ నేలపై నడయాడి మనుషుల పాప కర్మలని ,కష్టాల్ని తనపై వేసుకుని ,తననుభవించి మానవ జీవితాలను పావనం చేసిన సాయినాధుడు భక్తసులభుడు. మనిషి నడవడిక ఎలా ఉండాలో బాబా స్వయంగా ఆచరించి చూపారు.ఆదర్శజీవన  విధానానికి బాటలు వేశారు .ఆ అడుగుజాడలే ఇవి....ఆసాయిపధ౦ ఇది .......ఆ బాటలో నడవండి!ముక్తులుకండి! జీవితాల్ని ధన్యంచేసుకోండి.

ఇక సర్వం శ్రేయస్సులు మీవే!.......Fb సౌజన్యంతో..

సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు


0 comments: