Friday, December 9, 2016 By: visalakshi

గీతామృత బోధ

శ్లో" యే యధా మాం ప్రపద్యంతే తాంస్తధైవ భజామ్యహం! 
      మమ వర్త్మానువర్తంతే మనుష్యా: పార్ధ సర్వశ:!!   (గీత 4వ అ-11శ్లో)


మానవులు ఏ మార్గాన్ని అనుసరించినా, ఏ రూపాన్ని ఆరాధించినా నన్నే పొందుతారు. పార్ధా! ఎవరు నన్ను ఎలా సేవిస్తే, నేను వాళ్ళను అలా అనుగ్రహిస్తాను. మానవులందరూ అన్ని విధాలా నన్నే అనుసరిస్తున్నారు.అని భగవాన్ శ్రీకృష్ణుడు అర్జనుడి సందేహాన్ని తీరుస్తాడు.




భగవద్గీత అంటే భగవంతుని అమృతగానం. శ్రీకృష్ణుడు గీతను అనుష్ఠాన వేదాంతంగానే అందించాడు.కృష్ణుడు చేసిన ప్రతీ చర్య వెనుక ఓ అగాధమైన అంతరార్ధమున్నది. వేదాంత వివరణమున్నది. తత్త్వ రహస్యమున్నది. జైలులో పుట్టిన నాటినుండి, రేపల్లెలో పెరిగేటపుడు, పాలకుల ప్రక్కనచేరి ఎత్తులకు పై ఎత్తులు వేయించినపుడూ ..సమయం లభిస్తేచాలు సదుపదేశాలు అందించేవాడు శ్రీకృష్ణుడు. మహాభారత సంగ్రామంలో అర్జనుడికి చెప్పే వంకతో భగవద్గీతను లోకానికుపదేశించి ఉపకారం చేశాడు శ్రీకృష్ణుడు. వేదాలసారాన్ని అర్జనుని సాకుగా పెట్టుకొని స్వామి మానవ సమాజం కోసం ఉదారంగా అందించాడు. "శ్రీరామాయణం, భారతం, భాగవతం, భగవద్గీతాదులు ప్రపంచంలోని మానవజాతికంతటికీ మార్గనిర్దేశంచేసే పవిత్ర గ్రంధాలు..ఉదాత్తమైన ఉపదేశాలు." 




మనం మాత్రం గీతను కేవలం పవిత్ర గ్రంధంగా భావించి పూజగదికి పరిమితం చేశాం. మనిషి పరిపూర్ణుడవడానికి కావలసిన అంశాలు గీతలో ఉన్నాయి. గీతలోని ధ్యాన శ్లోకాలను చదివినప్పుడు అవి ధ్యానానికి ఎంత ఉపకరిస్తాయో తెలుస్తుంది. వేదాలు అనే కామధేనువు నుండి శ్రీకృష్ణుడనే గోవులకాపరి పితికిన 'పాలు ' గీత. ఆ పాలు కేవలం పూజగదిలో పెట్టి పూజించడానికి కాదు; అవి మనం తాగడానికి ఉద్దేశింపబడ్డాయి. అప్పుడే జ్ఞానశక్తి వస్తుంది. అనేక సం"ల నుండి ఆ పాల గ్లాసును పూలతో పూజిస్తున్నాం కానీ తాగలేదు. అందుచేతనే మనం బౌతికంగా, మానసికంగా, సాంఘీకంగా బలహీనులుగా ఉన్నాం. గీత అనే పాలను తాగడం మొదలుపెడితే జాతి నూతన జవసత్వాలను సంతరించుకుంటుంది. శక్తి వంతులమవుతాము.  జాతి ఔన్నత్యాన్ని సాధిస్తుంది. దేశం ప్రగతి పధంలో ముందుంటుంది.



సాధారణంగా అన్నిరకాల బోధలు దేవాలయాలలోనో, అరణ్యాలలోనో, ప్రశాంతమైన ప్రదేశాలలోనో చెప్పబడ్డాయి. గీతాబోధమాత్రం యుద్ధరంగంలో, కల్లోలంగా ఉన్న ప్రదేశంలో బోధించబడింది. ధైర్యశాలి ఐన అర్జనుడికి ధైర్యశాలి, ధీశాలి అయిన శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశం గీత. అంటే ధైర్యశాలురైన ప్రజలకు మరింత ధైర్యం కోసం గీత అన్న ఉద్దేశ్యాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. "చక్కని పుష్పమాలవలె, మనోహర పుష్పగుచ్చంవలె క్రమపద్ధతిని సుందరంగా కూర్చబడిన ధర్మముల యొక్క సముదాయమే భగవద్గీత."  'భగవద్గీత పరమోత్కృష్ట గ్రంధరాజము.'


డిసెంబరు 10 అనగా రేపు 'గీతాజయంతి.'..సందర్భంగా మనమందరం గీతామృత బోధను, పఠనం చేసి గీతలో అంశాలను అవగాహన చేసుకొని పాటిద్దాం. పరిపూర్ణులవుదాం.  జ్ఞాన శక్తిని పొందుదాం.

  సర్వం శ్రీ సాయి నాధార్పణ మస్తు. 


0 comments: