Monday, September 7, 2020 By: visalakshi

జన్మరాహిత్యం..

 



**సాలగ్రామం**


మన పూజా విధానంలో ‘సాలగ్రామ’ విశిష్టత అంతా ఇంతా కాదు. 


సాలగ్రామాన్ని విష్ణుమూర్తికి ప్రతీకగా చెబుతారు. ఎక్కడైతే సాలగ్రామముంటుందో అక్కడ శ్రీ మహావిష్ణువు కొలువుదీరి వుంటాడని చెబుతారు. 


కనుక ‘సాలగ్రామ’ పూజ సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువుకు చేసే పూజగా అభివర్ణించవచ్చు. 


సాలగ్రామ శిలయందు చరచరాత్మకాలయిన మూడు లోకాలు ఇమిడి ఉంటాయట. ఆ కారణంగా సాలగ్రామాన్ని భక్తితో పూజిస్తే కోటి యజ్ఞాలు చేసినంత పుణ్యం ఫలానికి సమానమవుతుంది. అంతేకాదు కోటి గోవులను దానం చేసినంత పుణ్యం సంప్రాప్తిస్తుంది.


 సాలగ్రామ పూజవల్ల శివకేశవులిద్దరినీ పూజించిన ఫలితం లభిస్తుందని చెబుతారు. సాలగ్రామ శిలకు షోడశోపచార విధానాలు అర్జించిన భక్తులకు యావత్ కల్పాంతం వరకూ వైకుంఠాన నివసించే భాగ్యం కలుగుతుంది. 


సాలగ్రామానికి భక్తిశ్రద్ధలతో నమస్కరించి, పూజించినచో మరుజన్మ లేకుండా ముక్తి లభిస్తుందట. సాలగ్రామాన్ని స్మరించిన, దర్శించిన, నమస్కరించిన సర్వపాపాలు ప్రక్షాళనమవుతాయని శాస్త్రాల ద్వారా అవగతమవుతుంది. సాలగ్రామ శిలయందు వుంచిన అన్ని పదార్థాలు పవిత్రములవుతాయి. దీనిని ముందుంచుకుని పితృదేవతలకు తర్పణాలు ఇచ్చినచో, పితృదేవతలకు పైలోకాలలో శాశ్వత సుఖాలు లభిస్తాయట. సాలగ్రామ తీర్థాన్ని సేవించినచో వెయ్యిసార్లు పంచామృతాన్ని సేవించిన ఫలితంకన్నా, ప్రాయశ్చిత్తములందు ఆచరించే దానాల ఫలితాలకన్నా అధిక ఫలితం కలుగుతుందంటారు. యోగాశాస్త్రం, సాంఖ్యాశాస్త్రాలు తదితర ఆధ్యాత్మిక శాస్త్రాలు తెలియకున్నా, చదవకున్నా, ఒక్కసారి సాలగ్రామాన్ని శాస్త్ర ప్రకారం పూజించి, అభిషేకిస్తే కోటి లింగాలను దర్శించినంత పుణ్యం లభిస్తుందట. 


తటాకాలందు సాలగ్రామాన్ని ఉంచి, ఆ నీటితో స్నానమాచరిస్తే సర్వతీర్థాలందు స్నానమాచరించిన పుణ్యఫలం కలిగి, సర్వదేవతలను ఆరాధించిన ఫలితం కలుగుతుందంటారు. అలాగే సాలగ్రామాన్ని అభిషేకించిన జలాలను ప్రోక్షించుకుంటే, పవిత్ర గంగాస్నానం చేసినట్లే అవుతుందట. సాలగ్రామ తీర్థం అత్యంత పవిత్రమైనది. విశేషమైన మహత్తు కలది. అలాంటి తీర్థాన్ని సేవించినవారికి పునర్జన్మ ఉండదట. విష్ణు స్వరూపమైన సాలగ్రామాన్ని విష్ణ్భుక్తుడైన సత్ బ్రాహ్మణునికి దానమిస్తే వంద యాగాలు చేసిన పుణ్య ఫలితం లభిస్తుంది. ఇంతటి విశేషాలున్న ఈ సాలగ్రామ శిలకు ఈ పద్నాలుగు లోకాలలో సరిపడే వేరొక శిల లేదని శాస్త్రాల ద్వారా అవగతమవుతోంది. సాలగ్రామంపై శుద్ధమైన మట్టితోగాని, రంగులతోగాని, కేశవ నామాన్ని రాస్తే, కోటి కల్పాల వరకూ స్వర్ణంలో నివసించే భాగ్యం కలుగుతుందట. పూజాపీఠమందు సాలగ్రామాన్ని అమరిస్తే సమస్తమైల పూజలు సక్రమంగా సాగి పరిపూర్ణమైన ఫలితాలు సొంతమవుతాయి. సాలగ్రామాలను ఆవుపాలతోగాని, పంచామృతంతోగాని శుద్ధి చేయాలి. ‘రుద్రాక్ష ధారణ’ నియమాలనే సాలగ్రామ పూజలందు పాటించాలి. ప్రత్యేక సమయాలందు, సంక్రమణ కాలాలందు, గ్రహణ సమయాలందు ఆయా సాల గ్రామాల ననుసరించి ఆయా దైవ జపాలను 1008 సార్లు చేస్తే లేదా చేయించుకుంటే అలాంటి సాలగ్రామాల శక్తి ద్విగుణీకృతమవుతుందని శాస్త్రాల ద్వారా అవగతమవుతుంది. సాలగ్రామాలందు ఉన్న చక్రాలననుసరించి వాటిని పిల్వడం జరుగుతోంది. ఏకచక్రముంటే సుదర్శనమని, రెండు చక్రాలుంటే లక్ష్మీ నారాయణమని, మూడు చక్రాలుంటే అచ్యుతుడని, నాలుగు చక్రాలుంటే జనార్థుడని, ఐదు చక్రాలుంటే వాసుదేవుడని, ఆరు చక్రాలుంటే ప్రద్యుమ్నుడని, ఏడు చక్రాలుంటే సంకర్షణుడని, ఎనిమిది చక్రాలుంటే పురుషోత్తముడని, తొమ్మిది చక్రాలుంటే నవ వ్యూహమని, పది చక్రాలుంటే దశావతారమని, పదకొండు చక్రాలుంటే అనిరుద్ధుడని, పనె్నండు చక్రాలుంటే దాదశాత్ముడని, పదమూడు చక్రాలకన్నా ఎక్కువ చక్రాలుంటే ‘అనంతమూర్తి’ అనే పేర్లతో పిల్వడం జరుగుతోంది. సర్వపాపహరమైనది, సర్వచింతనల నుంచి దూరం చేసేది, సర్వదేవతా పూజా ఫలితాలనిచ్చేది, సర్వశ్రేయస్కరమైనదని అయిన సాలగ్రామాన్ని పూజించడం, మానవుల అదృష్ట్భాగ్యంగా శాస్త్రాలు చెబుతున్నాయి. అలాంటి సాలగ్రామాన్ని భక్తితో పూజించడం భక్తిముక్తిలకు మార్గం సుగమం చేసుకోవడంగా చెబుతారు.


#శ్రీమద్భగవద్గీత.....

స్వయంగా భగవంతుడే తన గురించి, తన భక్తుని గురించి, తనపై ఉండవలసిన భక్తి గురించి చెప్పటం వల్ల మరొక మానవమాత్రునితో పనిలేకుండా మార్పులు, చేర్పులు, తీర్పులు లేకుండా స్వయం సిద్ధమై నిలిచిందీ భగవద్గీత. అసలు ఏమిటీ భగవద్గీత.. భగవద్గీతకు మనకు సంబంధం ఏమిటి.. అందులోని విషయాలను తెలుసుకోవటం వల్ల మనకు ఏం ప్రయోజనం కలుగుతుంది.. మానవజన్మను సార్థకం చేసుకొనుటకు భగవద్గీత ఎలా సాయపడుతుంది..


మీరు సరదాగా మీ బంధువులింటికి వెళ్ళాలని హైదరాబాదు వెళ్ళారు. ఒకరోజు బిర్లా మందిరానికని, ఒకరోజు పార్కుకు, జూకు వెళ్ళివస్తున్నారు. ఒక రోజున ఎవరో స్వామీజీ భగవద్గీతపై ప్రవచనములు చేస్తున్నారని అక్కడికి వెళ్ళారు. ఒక గంట సేపు ఆ ప్రవచనాలు విని ఆనందించారు. అక్కడి నుండి తిరిగి ఇంటికి వచ్చి భోజనం చేసి పడుకుంటే హాయిగా ఉండేది. కాని మధ్యలో స్నేహితుడు కనిపించి దగ్గరలో సర్కస్ ఉంది. వెళ్దాం అంటే వెళ్ళారు. జనంలో త్రోసుకొని టికెట్టు కొనుక్కొని లోపలికెళ్ళారు. స్నేహితుడు కనిపించలేదు. రెండు గంటలు సర్కస్ చూశారు.


.....


.....


తిరిగి ఇంటికి బయలుదేరారు. దారి తెలియలేదు. కరెంటు పోయింది. అయినా ముందుకెళ్ళారు. అక్కడ చిమ్మ చీకటి. కీచురాళ్ళ ధ్వనులు, భయం వేసింది. వడి వడిగా అడుగులు వేస్తున్నారు. వెనుక కుక్క మొరుగుతూ వెంట బడుతున్నట్లు అనుమానం వచ్చి పరుగు లంకించుకున్నారు. బాధ, దుఃఖం, ఆకలి, అలసట. దిక్కు తెలియక అలా వెళుతున్నారు. అలా ఎంత దూరం వెళ్ళినా మీ బంధువుల బజారు రాలేదు. కనిపించిన వారినల్లా అడ్రసు అడుగుతున్నారు. ఎవరూ తెలియదంటున్నారు. చివరకు ఒకాయన ఆ ప్రాంతాలన్నీ పరిచయమున్న వ్యక్తి తటస్థపడి "ఇదిగో ఇటు వెళ్ళు. ఒక ఫర్లాంగు వెళ్ళిన తరువాత దారి చీలుతుంది. ఎడమ వైపు తిరిగి సరాసరి వెళ్ళిపో. మీ బజారు వస్తుంది" అని చెప్పాడు. ఆ దారి వెంట వెళ్ళి ఇల్లు చేరుకున్నారు. నీ బాధలు, భయాలు తొలగిపోయి హాయిగా ఉన్నావు.


ఇదే విధంగా మనం కూడా మన స్వస్థానాన్ని పరమాత్మ స్థానాన్ని విడిచి ఈ మానవ లోకంలోకి వచ్చిపడ్డాం. ఇక్కడ ఏవోవో పనులు చేస్తూ వాటి ఫలితంగా సుఖాలు, దుఃఖాలు అనుభవిస్తున్నాం. ఈ జన్మను విడిచిపెట్టి మనం చేసిన పుణ్య కర్మల ఫలితంగా స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ అనేకమైన భోగాలు అనుభవిస్తాం. అలాగే పాప కర్మల ఫలితంగా నరకయాతనలు, భయంకరమైన దుఃఖాలు అనుభవిస్తాం. ఆ పుణ్య, పాప కర్మల ఫలితాలు అనుభవించిన తరువాత తిరిగి మళ్లీ ఈ లోకంలో కుక్కగా, నక్కగా, పిల్లిగా, బల్లిగా, పక్షిగా, పందిగా, పులిగా, ఏనుగుగా, చెట్టుగా, పుట్టగా, లేక మానవుడిగా అనేక రకాల జన్మలు ఎత్తుతూ ఉంటాం. అనేక సుఖాలు, భోగాలు, దుఃఖాలు, కష్టాలు అనుభవిస్తూ ఉంటాం. ఇలా అనంత కోటిజన్మలు. ఈ ప్రయాణం ఇలా సాగుతూనే ఉంటుంది. మనం రోజుకొక డ్రస్సు వేసుకున్నట్లు ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క దేహాన్ని తగిలించుకొని ఈ అంతులేని ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంటాం.


అయితే మనం ఎక్కడికి వెళ్ళాలో, ఎటు వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో తెలియకుండానే ఈ ప్రయాణం సాగిస్తుంటాం. "కస్త్వం క్కోహం కుత ఆయుతః".. నీవెవరు.. నేనెవరు.. ఎక్కణ్ణుంచి వచ్చాం.. (భజగోవిందం) అని పెద్దలు, శాస్త్రాలు మనను అడుగుతూనే ఉన్నారు. "మిత్రమా.. ఎక్కడి నుండి ఎక్కడకు నీ ప్రయాణం.. అని. ఏమో.. ఎక్కణ్ణించి వస్తున్నామో తెలియదు. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. గ్రుడ్డి ఎద్దు చేలో పడ్డట్టుగా, గాలి ఎటు వీస్తే అటు ఎగిరిపోయే ఎండుటాకులా ఎలాగో జీవయాత్ర సాగిస్తున్నాం. కాని మన ప్రయాణానికి ఒక గమ్యం లేదు.. ధ్యేయం లేదు.. లక్ష్యం లేదు.. "అచ్చపు చీకటింబడి".. అన్నట్లు చీకట్లో ప్రయాణం చేస్తున్నాం. మన ప్రయాణానికి పుట్టు పూర్వోత్తరాలు తెలియవు. పెద్దలు చెబుతున్నా, శాస్త్రాలు ఘోషిస్తున్నా మనం మాత్రం కుంభకర్ణ నిద్ర నుంచి మేల్కోవటం లేదు.


ఇలా దిక్కులు మరచి, దిక్కు తోచక, చీకటిలో ప్రయాణిస్తున్న మనకు అన్ని మార్గాలు తెలిసిన స్నేహితునిలాగా 'భగవద్గీత' మనం ఎక్కడి నుండి బయలుదేరామో, ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో అన్ని విషయాలను చెప్పి, మనలను చేయిపట్టుకొని మన స్వస్థానానికి నడిపిస్తుంది. సమస్త దుఃఖాలను అంతం చేసుకొని, దుఃఖంలేని ఆనంద సామ్రాజ్యంలో మనలను ఓలలాడేటట్లు చేస్తుంది. అయితే మనం ఈ భగవద్గీత అనే స్నేహితుని చేయిపట్టుకొని వదలకూడదు. ఎటునడిపిస్తే అటు నడవాలి.


ఈ విధంగా మానవుడికి తన గమ్యస్థానం ఏమిటో తెలియజెప్పి అక్కడకు చేర్చే స్నేహితుడు గనుక భగవద్గీత మానవుడికి సంబంధించినది. మనకు సంబంధించినది. మానవ జన్మను సార్థకం చేసుకొనుటకు ఉపయోగపడేది భగవద్గీత.


కనుక భగవద్గీత చెప్పే విషయాలను గ్రహించాలి. ఈ లోకం మనది కాదు. ఇక్కడి వస్తువులు మనవి కావు. ఇక్కడి దుఃఖాలు, బాధలు కూడా మనవి కావు. “ఆబ్రహ్మభువనాల్లోకాః పునరావర్తిన్కోర్జున”.. అన్నట్లు ఈ పదునాలుగు లోకాలు కూడా మన మజిలీలే. ఆ లోకం నుంచి ఈ లోకానికి, ఈ లోకం నుంచి ఆ లోకానికి ఏతం బానలాగా పైకీ క్రిందికీ తిరుగుతూ ఉండాల్సిందే...


|| ఓం నమః శివాయ ||


*శివ.....


**శివ నామస్మరణ మహిమ...


శంకర భగవత్పాదుల వారు శివ అనే రెండు అక్షరాల శక్తిని చెప్తూ.. “శివేతి దౌవర్ణౌ ఘరట్టగ్రావాణౌ భవవిటపి బీజౌఘదలనే” అన్నారు... శివ అని పలకడం నిజానికి పెద్ద కష్టం కాదు. దిత్వాక్షరాలు, దీర్ఘాక్షరాలు లేవు. ఆ రెండు అక్షరాలలో ఏదో అద్భుతమైన శక్తి ఉంది. ఆ శక్తిని అనుభవించడమే కాని వ్యాఖ్యానించలేము. 


'శి' 'వ' అనేవి రెండు తిరగలి రాళ్ళలా పని చేస్తుంటాయన్నారు. తిరగలి రాళ్ళకి ఒక లక్షణం ఉంది. ఏవైనా గింజలు అందులో వేసి తిప్పితే అవి మొత్తం చూర్ణం అయిపోతాయి. మామూలుగా గింజలు భూమి మీద వేస్తే మొలకెత్తుతాయి. కాని పిండి చేసి భూమి మీద వేస్తే మరి మొలకెత్తవు.


మనకి అనేక జన్మలు మొలకలెత్తడానికి కావల్సిన పాపపుణ్య కర్మబీజాలు చాలా ఉంటాయి. ఎన్ని జన్మలుంటాయో మనకేం తెల్సు.. జన్మలో దుఃఖం, జన్మరాహిత్యంలో ఆనందం ఉందని మనకి తెల్సు కాని అది పొందడానికి తగ్గ సాధన చేస్తున్నామో లేదో ఈశ్వరుడికే తెలియాలి.


జన్మరాహిత్యం పొందాలంటే మన దగ్గర అనేక జన్మల నుంచి పోగుచేసుకొన్న కర్మబీజాలు పోవాలి. అవి అలా వదిలేసినా మళ్లీ మొలకెత్తుతాయి. మామూలు మొలకలు కాదు క్రమంగా జన్మలనే అరణ్యాలు తయారౌతాయి. కాబట్టి ఈ కర్మబీజాలని 'శి' 'వ' అనే తిరగలి రాళ్ళలో పడేస్తే పిండైపోయి ఇక మనకి మళ్లీ జన్మ అనేదే ఉండదని ఆది శంకరుల వారు అభయమిచ్చారు. శివ నామం జన్మరాహిత్యాన్ని ప్రసాదించి పరమపదాన్ని చేర్చుతుంది...


|| ఓం నమః శివాయ ||

0 comments: