Sunday, April 30, 2017 By: visalakshi

సాయిబాబా మాటే వేదం..

 ఓం శ్రీ సాయినాధాయ నమో నమ:




పరమాత్మ,పరంధాముడు అయిన ఆ అంతర్యామి శ్రీ బాబా 1918వ సంవత్సరం విజయదశమినాడు సమాధిలోకి వెళ్ళేముందు, తమ భక్తులందరికీ ఇలా ధైర్యం చెప్పారు. 

వీడినా యీ భౌతిక దేహమ్ము
వస్తాను పరుగున భక్తుల కోసమ్ము
అనుభవం మీద తెలుసుకొందురు
సాయి అనంతుడు, అంతర్యామి అంటారు.

భక్తులందరూ వేనోళ్ళ కీర్తించే బాబాగారు.. నా అనుభవాలలో మా కోసం మమ్ములను ఈ జీవిత మాయామోహాలనుండి నిదానంగా విముక్తి చేసే ప్రయత్నంలో ఎన్నో సమస్యలను ఎదురీదే నేర్పును, కష్టనష్టాలను తట్టుకొనే శక్తిని ఆయనే కల్పిస్తున్నారు. ఒకరకంగా చెప్పాలంటే కష్టాలకు కృంగిపోయి బాధపడ్డా..ఆనందానికి అతిగా సంతోషపడ్డా రెండూ సమతుల్యములో చూడరా..అన్నీ నీ మనస్సును బట్టే జరుగుతున్నాయి అని మరుక్షణం తెలిసేటట్లు చేస్తారు బాబాగారు.




 ఏ వ్యవహారములో నయినా విపరీతంగా ఆలోచించి..ఇలా ఎందుకు జరిగింది..ఎవరిది లోపం అని ఆలోచిస్తూ.. రాత్రి పగలూ వేదన పడి.. ఆయన సమక్షములో ధ్యానం చేసుకొని ఒక నిశ్చింతతో బయటకు రాగానే ఆ వ్యవహార కార్యక్రమము అతి సునాయసంగా మనకు తెలియకుండానే సుగమము చేస్తారు బాబాగారు. మళ్ళీ అవే సమస్యలు మరో కోణంలో మళ్ళీ వేదన.. ఇదే జీవితం...

 ఈ మాయామోహాల సుడిగుండంలో మనం దిక్కుతోచక భగవంతుడి ముందు ఆక్రోశంతో మన కోరికల చిట్టాను ఆయనకు వెల్లడి చేస్తాం.. ఒకటి తీరింది ఆనందం.. ఇంకొకటి వెంటనే మరల ఆయనముందు మోకరిల్లి మరల కోరిక... వీటికి అంతు ఉండదు. అంటే మన ఆశలకు అంతులేదు. పుడుతూనే కోరిక... అడుగడుగునా కోరిక.. మరణంలోనూ కోరిక... ఎంతటి మహానుభావుడైనా నాకెలాంటి కోరిక లేదు అనడం శుద్ధ అబద్ధం. కోరికలను వీడి భగవంతుని నిజమైన ఆర్తితో ఎప్పుడు చరణాలను పట్టుకొని శరణాగతుడైయ్యే వరకు వారి కోరికలను సన్మార్గములో తీరుస్తూ తనదరికి చేర్చుకొనే సమయముకై భక్తునకు జ్ఞానమార్గమును తెలుపుతూ నిరీక్షిస్తాడు భగవానుడు.  

కోరికలను జయించి, జ్ఞానప్రాప్తికై భగవంతుని శరణు వేడి ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించే మహాయోగులకు కూడా సంకల్పం ఉంటుంది. అదే మోక్షప్రాప్తికై వారి సంకల్పం. సంకల్ప సిద్ధులకు చరాచర వస్తువులన్నిటిలోనూ అంతర్యామియై ఈశ్వరుడు వెలుగుచున్న తత్వము గోచరించును. అది ఈశ్వర సంకల్పము.వీరు నిర్వికల్పసమాధి సులభముగా కలిగి ఉందురు. పరప్రేరణ మాత్రము చేతనే వీరు లోకోద్ధారక బుద్ధి కలిగియుండును. లేనిచో ఎల్లప్పుడు ఆత్మారాములై యుందురు. వీరు సంకల్పించిన మాత్రముచేత సర్వసిద్ధులును కలుగవలసిన ఏర్పాటు గలుగును. అణిమాద్యష్టసిద్ధులు... అణిమాది అష్టసిద్ధులు :- అణిమా సిద్ధి! లఘిమా సిద్ధి! గరిమా సిద్ధి! మహిమా సిద్ధి! ఈశిత్వ సిద్ధి! వశిత్వ సిద్ధి! ప్రాకామ్య సిద్ధి! ప్రాప్తి సిద్ధి!   వీరి సేవ కొరకు నిరీక్షించుచుండును. దు:ఖము వీరు ఎరుగరు. వీరికి బేధము సంపూర్ణముగా నశించును. వీరి వర్తనము ఏ రీతిగా ఉండునని చెప్ప సాధ్యము కాదు. నిధినిషేధములతో కూడియు కూడకయు ఉందురు. వీరే యదార్ధమైన మహాత్ములు. లోకోద్ధారకులై ఉందురు. వీరు ఎట్లుండినను జీవన్ముక్తులే. 




నిస్సంకల్పము:- నిస్సంకల్పము గలవారు విదేహముక్తులు. వీరికి దృశ్య, దర్శన, దృక్కులు ఏకమై ఉండును. ధ్యాతృ, ధ్యాన, ధ్యేయములనెడు త్రిపుటి లయించి ధ్యేయాకారమై యుందురు. వీరికి ఏ సంకల్పము ఉండదు. నిస్సంకల్పులై యుండును. వీరికి జరుగవలసిన దంతయు స్వయముగానే జరుగుచుండును. పరప్రేరణ చేతనైనను సంకల్పము కలుగదు. అణిమాది అష్టసిద్ధులు..అణిమాది అష్టసిద్ధులు :- అణిమా సిద్ధి! లఘిమా సిద్ధి! గరిమా సిద్ధి! మహిమా సిద్ధి! ఈశిత్వ సిద్ధి! వశిత్వ సిద్ధి! ప్రాకామ్య సిద్ధి!   ప్రాప్తి సిద్ధి! వీరిని సేవించుచుండును. అంతేగాక త్రిమూర్తులుగూడ వీరి కార్యములలో నియుక్తులవలె ప్రయత్నింతురు. అదే పరిపూర్ణము, శివము, అద్వైతము, అమృతము, ఆనందము, అచలము, శాంతము, సంపూర్ణసౌఖ్యము, మౌనము. వీరు బహుజన్మములలో నుండి బ్రహ్మనిష్ఠయు, గురుభక్తియు కలిగి పుణ్యకర్మానుష్ఠాన పరిపక్వత చేత వచ్చినవారు. ఇది కడసారిజన్మము. నిర్మలాకాశమునందు భాస్కరుడు ప్రకాశించుచున్నట్లు వీరు ఎల్లప్పుడున్ను స్వస్వరూపులై వెలుగుచుందురు. వీరి జన్మము వలన లోకము జ్ఞానలోకమై యుండును. సరస్సులో గల కమలములు సూర్యోదయమున వికసించునట్లు వీరి అవతారముచే భక్తుల హృదయము సంపూర్ణముగా వికసించును. జనులు కృతార్ధులగుదురు. వీరే భగవంతుని అవతార స్వరూపాలు. 


 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు 
  






0 comments: