Saturday, April 15, 2017 By: visalakshi

పరమాత్మ- అంతర్యామి

 ఓం శ్రీ సాయినాధాయ నమో నమ: 

తమాదిదేవం కరుణానిధానం, తమాలవర్ణం మహితావతారం !
అపారసంసారసముద్రసేతుం, భజామహే భాగవత స్వరూపం !!               
                                                                          - (పద్మపురాణం)

 దేవాదిదేవుడైన శ్రీమహావిష్ణువు కృపానిధి - తమాల వృక్షమువలె శ్యామవర్ణశోభితుడు, లోకకల్యాణార్ధము పెక్కు అవతారములను దాల్చినవాడు. అపారమైన ఈ సంసారసాగరమునుండి తరింపజేయునట్టి దివ్యసేతువై భాసిల్లుచుండెడివాడు. ఆ పరమాత్ముని దివ్యస్వరూపమే భాగవతము.

పలికెడిది భాగవతమట ! పలికించెడివాడు రామభద్రుండట నే
బలికిన భవహరమగునట ! పలికెద వేరొండుగాధ పలుకంగ నేలా..

అని మదితలంచి పూర్తిగావించిన తన భాగవత గ్రంధాన్ని శ్రీహరి అవతారమైన శ్రీరామునకు అంకితం గావించాడు పోతనామాత్యులు.  



 సంసార భవబంధాలను పోకార్చేది, ముక్తిని ప్రసాదించేది అయిన ఈ భాగవత మహాపురాణమును ఆదిదేవుడైన శ్రీమన్నారాయణుడు తన నాభికమలమున ఉద్భవించిన చతుర్ముఖ బ్రహ్మకు సృష్టికి పూర్వం బోధించాడు. బ్రహ్మదేవుడు తన మానస పుత్రుడైన నారదుడు కోరగా ఆయనకు బోధించాడు. వ్యాసమునీంద్రునకు నారదమహర్షి ఆ భాగవతమును బోధించి దీనిని కలియుగ మానవుల ఉద్ధారకార్ధం రచించమని ప్రోత్సహించాడు.వ్యాసమహర్షి భాగవతమును రచించి తన కుమారుడైన శుకునకు బోధించాడు.

వేదాలనే కల్పవృక్షానికి కాచిన భాగవతమనే పండును వ్యాసమహర్షి తెచ్చి కుమారుడైన శుకుని కిచ్చాడు. ఆయన నోటిలోని అమృతంతో కలిసి అది లోకానికి అందింది. భక్తితో భాగవతం వినేటటువంటి నిర్మలహృదయులకు భగవంతుడు చిక్కుతాడు. కార్యకారణాలకు అతీతమైనది ఆత్మతత్వం. దానినే ఆధ్యాత్మం అంటారు. అట్టి ఆధ్యాత్మాన్ని తెలియజేసే దీపం వంటిది భాగవత పురాణం. అది సకలవేదాల సారాంశం.  గాఢమైనటువంటి సంసారమనే అంధకారాన్ని పోగొట్టుకొనదలచినవారికి శుకుడు దయతో ఈ జ్యోతిని ప్రసాదించాడు. కనుక శుకుడికి, వ్యాసుడికి నమస్కరించి, నరనారాయణులకు, సరస్వతీదేవికి మ్రొక్కి సూతమహర్షి భాగవత పురాణం చెప్పడం ప్రారంభించాడు. 




ఎందులో కృష్ణుని ప్రసక్తి ఉంటుందో ఏ విధంగా ఆత్మ ప్రసన్నమవుతుందో ఏ రూపంలో హరిభక్తి కలుగుతుందో అది మానవులకు పరమధర్మం. వాసుదేవునిపై భక్తి వలన వైరాగ్యం కలుగుతుంది. విజ్ఞానం లభిస్తుంది.తత్వ జిజ్ఞాస అంటే ధర్మజిజ్ఞాస. కొందరు ధర్మమే తత్వమని అంటారు. ఆ తత్వాన్నే బ్రహ్మమని, పరమాత్మ అని, భగవంతుడని కూడా వ్యవహరిస్తారు. వేదాంతశ్రవణంవల్ల కలిగిన జ్ఞానంతో, జ్ఞాన వైరాగ్యాలతో కూడిన భక్తి చేత ఆత్మలో పరమాత్మను చూస్తారు. కృష్ణపరమాత్మ తన కధలు విన్నవారి హృదయాలలో నివసించి వారిచేత మంచిపనులు చేయిస్తాడు. చెడు జరగకుండా చూస్తాడు. ఆ విధంగా వారిలో నిశ్చలభక్తి ఏర్పడుతుంది. భక్తివలన సత్త్వగుణం ప్రకాశిస్తుంది. రజోగుణం, తమోగుణం కారణంగా పుట్టే కామం, క్రోధం, మోహం, లోభం, మదం, మాత్సర్యం తొలగిపోయి చిత్తం నిర్మలమవుతుంది. అటువంటి మనిషి రాగద్వేషాలనే బంధనాలనుంచి విముక్తుడవుతాడు. అతనికి తత్వజ్ఞానం సిద్ధిస్తుంది. భగవత్సాక్షాత్కారం లభిస్తుంది. అహంకారం నశిస్తుంది. సంశయాలు విచ్చిన్నమవుతాయి. కర్మలు నశిస్తాయి. అందుచేత తెలివిగలవారు అంత:కరణాలను భక్తిచేత శుద్ధిచేసి భగవానునికి సమర్పిస్తారు.  

 మోక్షమిచ్చేది నారాయణుడు కాబట్టి అందరూ ఆయన్ని సేవించాలి. వేదం, యాగం, యోగం, జ్ఞానం, తపస్సు ఇవన్నీ వాసుదేవుని అధీనంలో ఉండే ధర్మాలు. పరమేశ్వరుడు నిర్గుణుడు. కానీ సత్త్వరజస్తమోగుణాలతో కూడిన తన మాయచేత విశ్వాన్ని సృష్టించి, గుణాల రూపంలో అందులో ప్రవేశించి ప్రకాశిస్తాడు. అంతర్యామి రూపంలో సమస్త జీవరాసులలోనూ నివసిస్తాడు. దేవతలలోను, మనుష్యులలోను, పశు, పక్ష్యాది ఇతరజాతులలోను కూడా అవతరించి, లోకాలను రక్షిస్తాడు. అవతారాలన్నింటికీ మూలం శ్రీమన్నారాయణుడు. 



 పరమేశ్వరుడైన శ్రీమన్నారాయణుడు లెక్కించుటకు సాధ్యకానన్ని   అవతారాలెత్తాడు.  వాటిలో ముఖ్యమైన కొన్ని అవతారాలు.....మొదట సనక, సనంద, సనత్సుజాత, సనత్కుమారులనే రూపాలు ధరించి, అఖండ బ్రహ్మచర్యాన్ని పాలించి అతికష్టమైన బ్రహ్మచర్యాన్ని ఆచరించి బ్రహ్మచర్యము యొక్క ప్రాముఖ్యతను చూపాడు.

 రెండవ అవతారము "వరాహావతారము"భూమి మొదట పాతాలగతమై ఉండినది. దానిని పైకి తెచ్చి యధాస్థితిలో నిలిపితేగానీ, సృష్టిని ప్రారంభించుటకు వీలుగాదు.  రెండవసారి వరాహరూపమెత్తి భూమిని రసాతలము నుంచి పైకెత్తి రక్షించాడు. 

మూడవసారి నారదుడను అవతారము  దేవరుషిగా జన్మించి ముక్తికి మంత్రమైన వైష్ణవ మంత్రాన్ని ఉపదేశించాడు.కర్మ నిర్మూలమైన మార్గమును తెలియజేయు భక్తిమార్గమును బోధించి ప్రచారము చేసినాడు.   

నాల్గవసారి నరనారాయణుడనే పేరుతో పుట్టి ఘోరమైన తపస్సు చేసాడు.తపస్సు సిద్ధించవలయునంటె "శమము దమము" మొదలగునవి ఎంతో అవసరము. అందువలన నరనారాయణుల రూపములలో అవతరించి శమదమాదుల యొక్క ఆవశ్యకతను లోకాలకు తెలియజెప్పాడు. 



 ఐదవ అవతారంలో కపిలుడనే సిద్ధుడుగా జన్మించి  జ్ఞాన వైరాగ్యాలతో కూడిన  సాంఖ్య శాస్త్రాన్ని బోధించాడు.  జ్ఞాన వైరాగ్యాలతో కూడిన భక్తికి చలనముండదు.

 దత్తాత్రేయావతారము ఆరవది.పైనచెప్పిన ఐదుగుణములు వరుసగా బ్రహ్మచర్యము, సంతోషము, భక్తి, తపస్సు, జ్ఞాన వైరాగ్యములు కలిగి అత్రిమహర్షి అనసూయాదేవికి భగవంతుడు దత్తాత్రేయుడుగా జన్మించాడు. కాలక్రమేణా అంతరించిన తత్త్వ విచారణమును తిరిగి ఉద్ధరించాడు. అలర్కునకు, ప్రహ్లాదునకు, హైహయరాజునకు ఆత్మ విద్యను ఉపదేశించాడు. 

 యజ్ఞావతారము ఏవది. కాలము గడిచే కొద్దీ లోకపాలనా వ్యవస్త అస్తవ్యస్తమైనది. అపుడు భగవంతుడు 'రుచి ' అను మహర్షీఆకూతి ' అనే దంపతులకు జన్మించి, యజ్ఞుడను పేర ప్రసిద్ధుడై యమాది దేవతలతో కూడి స్వయంభూమన్వంతరమును పరిపాలించి లోకపాలనా వ్యవస్తను కాపాడినాడు. 

 ఋషభావతారము ఎనిమిదవది. భగవంతుడు మేరుదేవికి, నాభికి ఉరుక్రముడనే పేరుతో జన్మించి పరమహంస మార్గాన్ని ప్రకటించాడు. 

 తొమ్మిదవ అవతారము పృధురాజావతారము. పృధుచక్రవర్తియై భూమిని ఆవుగా చేసి దాని పొదుగునుంచి సమస్త వస్తువులను పిదికాడు. ఆహారపదార్ధాలను మొలిపించి, పోషించి, వాటితో ప్రజలు జీవించే మార్గాన్ని బోధించాడు.జీవరాశికి ఆహారాన్ని సమకూర్చిన కారణాన ఈ అవతారము విశిష్టమైనది.

 పదవ అవతారం మత్యావతారము. మీనావతారం దాల్చి వైవస్వత మనువును మహీరూపమైన నావనెక్కించి ఉద్ధరించాడు.

పదకొండవ అవతారము కూర్మావతారము. క్షీరసాగరమధనకాలంలో తాబేలుగా అవతరించి మందరపర్వతాన్ని నీట మునగకుండా తన వీపున నిలిపాడు. తరువాత క్షీరసాగరమధనం సక్రమంగా జరిగింది. అమృతసిద్ధి కలిగింది.

 12వ అవతారము ధన్వంతరి అవతారము. క్షీరసాగరం మధ్య నుండి అమృతకలశాన్ని  హస్తమున ధరించి ధన్వంతరినారాయణునిగా పాలసముద్రమునుండి ఆవిర్భవించాడు.  

 13వ అవతారము మోహినీ అవతారము. అమృతకలశమును దేవతల వద్దనుండి రాక్షసులు లాక్కున్నారు. దేవతలు విష్ణువుకు మొరపెట్టుకున్నారు.  అప్పుడు భగవంతుడు మోహినీ వేషంలో అసురులను మోహవివశులను  జేసి  దేవతలకు  అమృతాన్ని  పంచాడు.  

14వ అవతారము నరసింహావతారము. నరసింహరూపం ధరించి హిరణ్య కశిపుని సంహరించినది.  భక్త ప్రహ్లాదుని తండ్రిని నరసింహ రూపంలో స్థంభము నుండి వెలువడి వధించిన వైనం అందరికీ విదితమే. బ్రహ్మ వరాల కతీతమైన రూపమే నరసింహావతారము. 

  

 15వ అవతారము  వామనావతారము. కపట వామనుడై బలిచక్రవర్తిని మూడడుగుల భూమిని దానమడిగి ముల్లోకాలనూ ఆక్రమించాడు.శరణార్ధి ఐన దేవేంద్రుడు దేవలోకాధిపతియైనాడు.పరమధార్మికుడు భక్తుడు అయిన బలిచక్రవర్తిని శక్తితో కాక యుక్తితో జయించాడు.  

 16వ అవతారము పరశురామావతారము. పరశురాముడు త్రేతాయుగ మధ్యకాలంలో బ్రాహ్మణద్రోహులైన క్షత్రియులను భూభాగమంతయు 21 సార్లు తిరిగి దుర్మార్గులైన రాజులందరినీ వధించి క్షత్రియులను రూపుమాపి ధర్మాన్ని పునరుద్ధరించాడు.   

 17వ అవతారము వ్యాసావతారము.కలియుగములో జనులు మందమతులై వేద ధర్మాలను చక్కగా గ్రహించలేరని, భగవంతుడు పరాశరుని వలన సత్యవతికి జన్మించి, వ్యాసుడనే నామముతో ప్రసిద్ధుడై, ఖ్యాతి పొందాడు.   వేద సమూహములను విభజించి, ఋగ్-యజుర్-సామ-అధర్వణ వేదములుగా నామములిడి, వాటిని వ్యాప్తి పరిచెను. వేదాలకు శాఖలు ఏర్పరచి అష్టాదశపురాణాలను, ఉపపురాణాలను, భారతమును, భాగవతమును రచించి సులభమైన మార్గంలో ధర్మమును బోధించాడు.

 18వ అవతారము  శ్రీరామావతారము. భగవంతుడు శ్రీరాముడుగా అయోధ్యపతియైన దశరధమహారాజుకు కౌసల్యయందు జన్మించి, లోకాలకు రాక్షస బాధను బాపినాడు. శ్రీరామచంద్రుడు సాక్షాత్తుగా ధర్మావతారుడు. లోకాలకు ఆదర్శపురుషుడు. లొకాలలో జనులు ఆచరించవలసిన ధర్మాలన్నిటిని ఆచరించి మార్గదర్శకుడైనాడు. సముద్రమును  నిగ్రహించి సేతువును గట్టి లంకకుపోయి దశకంఠుని సంహరించి, లోకాలకు రాక్షస బాధను బాపినాడు.

19,20.. బలరామ శ్రీకృష్ణ అవతారములు. ద్వాపర యుగాంతములో రాజ్యాధిపతులు రాక్షసాంశమును జన్మించారు. అధర్మం పెచ్చు పెరిగింది. భగవంతుడు బలరామ,శ్రీకృష్ణులుగా యదువంశంనందు  అవతరించి, పాపాత్ములను సంహరించి భూమి భారాన్ని నివారించారు. ధర్మాన్ని ఉద్ధరించారు.

 21 వ అవతారము బుద్ధావతారము. భాగవత రచన జరిగే నాటికి బుద్ధావతారము సంభవించలేదు. వ్యాసులవారు తన దివ్యజ్ఞానము ద్వారా కనుగొని చెప్పిన అవతారము. బుద్ధుడు మహావైరాగ్యపురుషుడు, త్యాగి, ఆనాటి కాలపరిస్థితికి అనుకూలముగా ధర్మమును బోధించాడు.

 22 వ అవతారము కల్కావతారము. కలియుగాంతమున యుగసంధికాలములో పాలకులు ధర్మాన్ని వదలి, పరదారాపహరణమునకు, పరధనాపహరమునకు వడిగట్టుతారు, అధర్మముతో లోకం అతలాకుతలమవుతుంది. అప్పుడు భగవంతుడు విష్ణుయశుడను బ్రాహ్మణునికి కుమారుడుగా జన్మించి,కల్కియను పేరుతో ధర్మాన్ని ఉద్ధరించుతాడు.

 సరస్సు నుండి పలురకాలుగా కాలువలు ప్రవహించునట్లు విశ్వశ్రేయస్సుకొరకు అనేకావతారాలు శ్రీమన్నారాయణుని నుండి ఆవిర్భవిస్తూ ఉంటాయి. విష్ణువు అంశలుగా అవతారాలు పెక్కులు. కలియుగములో వేంకటేశ్వరస్వామిగా తిరుమలలో అనంతకోటి జనాలతో పూజలందుకుంటూ కోరినవారి కొంగుబంగారమై అలరారుతున్నాడు. షిర్డీసాయి అవతారముగా భగవంతుడు.. సాయీ! అంటే ఓయీ అంటూ షిర్డీసాయినాధుడు భక్తులకు కోరిన వరాలిస్తూ భక్తకోటి నీరాజనాలందుకుంటున్నాడు.



 ఎన్నో అవతారములు దాల్చి..మనకై వేదోపనిషత్తులు అందించి మనల్ని ధర్మ మార్గంలో నడిచేటట్లు ప్రబోధిస్తున్న పురాణ ఇతిహాసాలను మనము చదివి గ్రహిస్తున్నాము. శ్రీరాముడు, శ్రీకృష్ణుడు దర్శనమిచ్చి భక్తులను అనుగ్రహించిన నిదర్శనాలనూ చదివాము. మైమరచాము. అవి మనకి కూడా జరిగినంత అనుభూతితో ఇప్పటికీ పరవశిస్తాము.    ఆ పారవశ్యంతో పాటు శ్రీ షిర్డీ సాయినాధుడుగా భగవంతుడు మాకు ప్రత్యక్షంగా.. ఎన్నో మహత్యాలను మాకు అనుగ్రహించి.. ఇంటి ఇలవేల్పు అయిన శ్రీ లక్ష్మీ నరసిం హ అవతారములో మాకు దర్శనమిచ్చి, ప్రణవం యొక్క అంతరార్ధమును తెలియజేసి.. ఓంకారము నేనే ...పరమాత్ముడను ..అంతర్యామిని అన్నీ అన్నిటా నేనేయై ఉన్నాను.సర్వాంతర్యామిని..త్రిగుణాలను నేనే. జగన్మాతను నేనే." మూడున్నర అడుగుల, అంగుళాల మానవదేహం నాది కాదు" అని అందుకే ఈ ఆత్మదర్శనం అని ప్రబోధించి నిష్కల్మష మనస్కులై భగవంతుడి చరణాల సన్నిధిలో శరణాగతి చేయుమని...ఈ అల్పులను ప్రేమతో,దయతో స్వామి అనుగ్రహించారు. విష్ణుసహస్ర నామ పారాయణ: హనుమాన్ చాలీసా, కీర్తనం శ్రవణం ధ్యానం చేయమని ఉపదేశించారు..మేము చూసి, అనుభవించి తరించిన ఈ సాయినాధ పరబ్రహ్మ అవతారము మాకు అత్యంత విశిష్ఠమైన అవతారము. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాధునికి మనసారా దివ్య ప్రణామములతో వారి చరణములకు శతకోటి అభివందనములు ...  

  సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు 


   






1 comments:

Anonymous said...

సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు . 🙏🙏