Monday, February 6, 2017 By: visalakshi

ఆధ్యాత్మిక గురువులు - మహర్షులు

 ఓం శ్రీ గురుభ్యో నమ:




 శ్లో" ప్రకృతిం స్వా మవష్టభ్య విసృజామి పున: పున:
     భూతగ్రామ మిమం కృత్స్న మవశం ప్రకృతే ర్వశాత్   (భగవద్గీత 9అ-8 శ్లో)


 ఈ సమస్త జగత్ విధానమును నా ఆధీనమున ఉన్నది. నా సంకల్పము ననుసరించి ఆ ప్రయత్నముగా అది మరల మరల వ్యక్తమగుచు నా సంకల్పము ననుసరించియే అది చివరకు లయము పొందుచున్నది. 

 ఓ వ్యక్తి జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని సాధనతో భగవదనుగ్రహంతో ఆధ్యాత్మికంగా పరిణితిని పొంది, తను పొందిన పరిణితిని నలుగురులోకి తీసుకురావాలన్న తపనతో ...నాకు సాయిబాబా కృప వలన ఆత్మసాక్షాత్కార అనుభూతి కలిగింది. నేను ఇంతటి వాడినయ్యాను. అని చెప్పినా ఆ వ్యక్తిని కొంతకాలం పిచ్చివాడిలా చూసి ఊరుకున్నారు. కానీ నిజమైన సాయి భక్తులు కొందరు ఆయనను గుర్తించి వారికి శిష్యులై ఆయనను స్వామీజీని చేశారు. ఆ క్రమములో ఆయన జ్ఞాన సంపద రూపంలో బాబా ఆశీర్వాదంతో వారి శైలిలో పుస్తకాలను ప్రచురించి భక్తులకందించారు. క్రమేణా వారి ప్రసంగాలు జనాలని ఆకట్టుకొని భక్తజన సందోహం ఆయనను కొనియాడింది. వారికి శిష్యులూ పెరిగారు. యజ్ఞాలు, యాగాలు ఊరూరా మొదలుపెట్టారు. అన్ని ఊళ్ళలో ఆయన ప్రసంగాలకు, వారి గానానికి జనం హర్షం వ్యక్తం చేశారు. ఇంతవరకు చాలాబాగా జరుగుతున్నది. ఆ స్వామీజీ ఇంకో మెట్టు ఎక్కి జనాలకు 'శక్తిపాతం' చేస్తారని ప్రచారం...వారు దానికి ఇంత అని ఖరీదు పెట్టడము జరిగింది. జనాలు 'శక్తిపాతం' అంటే తెలుసుకోవాలన్న ఆశక్తితో మరింత శ్రద్ధగా వెళ్ళారు..వెళుతున్నారు. వారి అనుభవాలు చెపుతున్నారు. కొంతమంది మాకు భగవంతుడు కనిపించాడు. ప్రశాంతంగా ఉంది. గాలిలో తేలుతున్న అనుభుతి ఉంది.. అంటారు. కొంతమంది ఏమో మాకేమీ తెలియదు అంటారు.అవి వారి వారి అనుభవాలు. అన్నిటినీ గౌరవించాలి.   ఓ వ్యక్తిని ఒక్కసారిగా స్వామీజీని చేసి, మహర్షిగా బిరుదిచ్చి ఆయనకు ప్రజలు బ్రహ్మరధం పట్టారు. ఆ రాజ మర్యాదలకు ఆయన ఒకింత మైమరచి ఒక ఇంటర్వ్యూలో సాటి ఆధ్యాత్మిక గురువులను విమర్శనాత్మకంగా, కఠువుగా మాట్లాడడము, తారాస్థాయిలో రాముడిని, కృష్ణుడిని విమర్శించడము చేశారు.   

 సాయి భగవానుడు అందరిలో నన్ను చూడండి అని చెప్పారు. రాముడిగా కృష్ణుడుగా దర్శనమిచ్చారు. అలాంటప్పుడు రూపాన్ని విమర్శలలో గుప్పించి ఆ ఎదుటి స్వాములను అవహేళన చేయరాదు. వారు మూర్ఖంగా మాట్లాడితే సంయమనం పాటించాల్సిన స్వామీజీ మరింత మూర్ఖంగా మాట్లాడడం బాధాకరం. మహర్షిగా పేరుగాంచిన ఈ స్వామీజీని  ఓ చానెల్ వా రు మర్యాద లేకుండా తీవ్రపదజాలంతో వారిని విమర్శించడం, తూలనాడడం జనాలలో వారిని అభ్యంతరకరంగా మాట్లాడడం ఎంతవరకు సమంజసం. 'శక్తిపాతం ఇలా చేశారు..వారు జనాలను మోసం చేస్తున్నారు ' అని కొందరు భక్తులు వాపోవడం వలన ఆయన గుట్టు రట్టు చేయడానికి సంకల్పించామని చెపుతున్నారు. జనులు, భక్తులు అంత పిచ్చివారు కారు కదా! ఆయనలో ఏదో ప్రత్యేకించి భగవంతుడు అనుగ్రహించిన దివ్య అనుభవాలు చూసే కదా! వారిని స్వామీజీని, మహర్షిని చేసింది. పేరు ప్రఖ్యాతలతో పాటు అసూయాద్వేషాలు. అందువల్ల మనమే మనవారిని ప్రతి విషయానికి, ప్రతి వ్యాఖ్యకి తప్పుపట్టి అందరిలోనూ అవమానిస్తాము. ప్రతి హిందూ ధర్మాన్ని మనమే పరమార్ధాన్ని గ్రహింపక వేలెత్తి చూపుతుంటే అవకాశం ఇతరులకు మనమిచ్చి ఆహ్వానిస్తున్నాం. బాహాటంగా హిందూ ధర్మాలకు వర్గ చిచ్చు పెట్టి, ఇతర మార్గాలను ప్రవేశపెట్టే ద్వారాన్ని తెరిచి స్వాగతిస్తున్నాం. ఒకే కుటుంబంలో వేరు వేరు స్వభావాలుగలవారు ఉన్నట్లే సమాజంలో కూడా మేధావివర్గం, పాలకవర్గం, ఆర్ధికసుస్థిరత చేకూర్చేవర్గం, శారీరకశక్తిని ఉపయోగించే శ్రామికవర్గం ఉన్నారు. కాబట్టి ఎవరికి ఇవ్వవలసిన ప్రాధాన్యతలను వారికిచ్చి వారిని గౌరవించడం మన సామాజిక బాధ్యత. 

ఆధ్యాత్మికపరంగా ఆలోచిస్తే.. పరమాత్ముణ్ణి ఆరాధించినప్పుడు ముందు పాదాలకు నమస్కరిస్తాము. ప్రణమిల్లుతాము. పుష్పాలను ఆయన పాదాలవద్ద సమర్పిస్తాము. ఆ పరమాత్మ రూపం నుండి సృష్టించబడిన మనుషులం మన మధ్య వివక్షతలు...ఒకరినొకరు నిందాపూర్వక సంభాషణలు ఎందుకు? అంతర్యుద్ధాలు, అభిప్రాయభేదాలు ఎందుకు?



 భగవత్ చింతనలో జీవించేవారు, భగవంతుని అనుగ్రహం పొందినవారు, బ్రాహ్మీస్థితిలో ఉండేవారే భగవంతుని దృష్టిలో అగ్రవర్ణానికి చెందినవారు. భగవంతుని అనుగ్రహం పొందడానికి గుణం ప్రధానం అని నిరూపించిన మహోన్నతులకు నిలయం మన భారతావని. మనమంతా బేధభావనలను విడచి భగవంతుని దృష్టిలో అంతా సమానులే అనే భావంతో జీవించడం అలవరచుకోవాలి.  

 ఆధ్యాత్మిక గురువులకు; నిస్వార్ధ స్వామీజీలకు ఉన్నతస్థానం ఇవ్వాలి. వారుకూడా ఆ స్థానానికి గౌరవమిచ్చి వారి జ్ఞానసంపదను ప్రజలకు పంచాలి. ప్రతి చిన్న విషయాన్ని విపరీతార్ధాలకు తావునిచ్చి ఫలానా గౌరవం తగ్గిపోయింది అని మనకు మనమే స్పర్ధలు పెంచుకొని, వారి గౌరవం తగ్గించి వారిని సమాజంలో కించపరచవద్దు. వారే స్థాయిలో ఉన్నారో ఆ స్థాయికి గౌరవం ఇవ్వండి. ప్రతీ వ్యక్తిలోనూ కొన్ని బలహీనతలుంటాయి. అన్నీ శ్రవణానందకరంగా విని..ఒక తప్పునెంచి నిలదీయడం సబబు కాదు. పూజ్యులను గౌరవిద్దాం. శాస్త్రాలను..ధర్మాలను పరిరక్షిద్దాం.   

 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు..






0 comments: