Monday, February 20, 2017 By: visalakshi

కాణిపాకం వరసిద్ధి వినాయకుడు

ఓం శ్రీ గణపతయే నమ:


కాణిపాకం గ్రామము చిత్తూరునకు అనతి దూరమున కలదు. ఆ గ్రామమునందు శ్రీవరదరాజస్వామి వారి ఆలయము, శ్రీ మణికంఠేశ్వరస్వామి వారి ఆలయము శ్రీ వరసిద్ధి వినాయకుల వారి ఆలయములు కలవు. 

శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమును రచించిన  శ్రీ శంకరభట్టుగారు వారి అనుభవాలను చెపుతూ కాణిపాకం వినాయకుని వృత్తాంతం తెలియజేశారు.

 శంకరభట్టు వరసిద్ధి వినాయకుని దర్శనం చేసుకొని బైటకు రాగా ఒక ఎత్తైన కుక్క అక్కడ నిలబడి యుండెను. ఆయనకు భయము వేసి మరల వినాయకుని ఆలయంలోనికి వెళ్ళెను. కొంతసేపు దైవధ్యానము చేసుకొని బయటకు రాగా ఈసారి అంతే పరిమాణము గల మరియొక కుక్క ఉండెను. ఈ రోజున యీ కాలభైరవుల చేత కరవబడుట ఖాయమని భయము వేసి మరల తిరిగి వరసిద్ధి వినాయకుని ఆలయములోనికి వచ్చినాడు. ఆలయ పూజారికి ఆతని ప్రవర్తన వింతగా తోచి, "అయ్యా" మీరు మాటిమాటికీ బయటకు పోవుచూ, లోపలికి వచ్చుచున్నారు. కారణమేమిటి? అని అడిగెను. శంకరభట్టు తన భయమును గూర్చి చెప్పగా..ఆ పూజారి "అవి నిష్కారణముగా ఎవ్వరినీ ఏమీ చేయవు. అవి తిరుమలదాసు అనే రజకుని వద్ద నుండు కుక్కలు. ఆతను దత్తభక్తుడు. శ్రీపాద శ్రీవల్లభ నామదేయమున శ్రీ దత్తులవారు భూమిమీద అవతరించిరని ఆ రజకుడు చెప్పును. అతడు ఆలయమునకు రాడు. తన నాలుగు కుక్కలను పంపును. నేను స్వామి ప్రసాదమును మూటకట్టి వాటికి ఇచ్చెదను. మిగతా రెండు కుక్కలు వచ్చినవేమో చూచెదము అనెను. వారిరువురు బయటకు వచ్చుసరికి నాలుగు కుక్కలుండెను. పూజారి ప్రసాదము మూటకట్టి వాటికిచ్చెను. ఆ నాలుగు కుక్కలు శంకరభట్టు నాలుగు వైపులా చుట్టుముట్టినవి. పూజారి "ఆ కుక్కల అభీష్టము మేరకు నీవు ఆ రజకుని యొద్దకు పోవుము. నీకు శుభమగును." అని పలికెను. శంకరభట్టు ఇలా తలంచుచున్నాడు...  

"నా జీవితమునందలి సంఘటనలు శ్రీవల్లభుల నిర్దేశములో జరుగుచున్నవని తెలుసుకొంటిని. ఇంతకు మునుపు జరిగిన సంఘటనము లననుసరించి కులమత బేదములు పెద్దగా పట్టించుకొనవసినది లేదని నాకు తోచినది. మరుజన్మమున చండాలుడు బ్రాహ్మణుడుగా జన్మింపవచ్చును. బ్రాహ్మణుడు చండాలుడుగా పుట్టవచ్చును. జీవి తను చేసుకొనిన పాపపుణ్యములను మూటకట్టుకొని జన్మజన్మాంతరములవరకు కర్మప్రవాహమున  పడిపోవుచుండునని  తెలుసుకొంటిని. "

పూజారి ఆదేశానుసారము శంకరభట్టు రజకుడు నివసించు చోటుకు వెళ్ళాడు. తిరుమలదాసు అను ఆ రజకుడు 70 సం"ల వయస్సు కలిగిన వృద్ధుడు.అతడు తన గుడిశెనుండి బయటకు వచ్చి శంకరభట్టును ఆదరముగా మంచముపై కూర్చుండబెట్టెను. శంకరభట్టులో బ్రాహ్మణ అహంకారము చాలాభాగము నశించెను. శ్రీపాద శ్రీవల్లభుల భక్తులు ఎవరైనను ఆయనకు చాలా ఆత్మీయులుగా కనిపించసాగిరి. వరసిద్ధి వినాయకుని ప్రసాదమును తిరుమలదాసు ఇవ్వగా ఆ ప్రసాదమును స్వీకరించాడు శంకరభట్టు. తిరుమలదాసు ఇట్లు చెప్పుచుండెను....

 'అయ్యా! ఈ రోజు ఎంతయో సుకృతము! నాకు మీ దర్శనభాగ్యము కలిగినది. మీరు నా వద్దకు ఎప్పుడు వచ్చెదరా? మాల్యాద్రిపుర విశేషాలను, పీఠికాపుర విశేషాలను ఎప్పుడు మీకు తెలియజేయుదునాయని తహతహలాడుచుంటిని. నాయనా! శంకరభట్టు! వరసిద్ధి వినాయకుని ప్రసాదము గైకొనినావు. నీవు ఈరోజుననే శ్రీపాద శ్రీవల్లభ చరితామృతమునకు శ్రీకారము చుట్టుము. కురువపురమునందు నీకు శ్రీవల్లభుల వారి ఆశీర్వాదము లభించును. నేను పూర్వజన్మమున గొప్ప వేదపండితుడను. పరమలోభిని. నా అవసాన సమయమున అప్పుడే జన్మించిన గోవత్సము పాత గుడ్డపీలికను నములుట గమనించి దానిని జాగ్రత్తపెట్టుకోవలసినదని నా కుమారులకు సూచించితిని. అవసానకాలమున మలిన వస్త్రముపై దృష్టి సారించి ప్రాణము విడుచుటచేత నేను రజక జన్మమునొందితిని. "జన్మావసానమున ఏ సంకల్పములతో ప్రాణము విడువబడునో తదనుగుణమైన మరు జన్మము లభించును".

 నా పూర్వపుణ్య వశమున గర్తపురీ(గుంటూరు)మండలాంతర్గతమగు పల్లెనాడు ప్రాంతమున మాల్యాద్రిపురము నందు జన్మించితిని. ఆ మాల్యాద్రిపురమే కాలక్రమమున మల్లాది అను గ్రామమాయెను. ఆ గ్రామమునందు మల్లాది అను గృహనామము గల రెండు కుటుంబములుండెను. ఒకరు మల్లాది బాపన్నావధానులు అను పేరు గల మహాపండితులు. వారు హరితస గోత్ర సంభవులు. రెండవ వారు శ్రీధర అవధానులు అను పేరు గల మహాపండితులు. వారు కౌశికస గోత్ర సంభవులు. శ్రీధర అవధానుల వారి సోదరి అయిన రాజమాంబను బాపన్నావధానులు గార్కి ఇచ్చి వివాహము చేసిరి. గోదావరీ మండలాంతర్గతమైన "అయినవిల్లి" అను గ్రామములో జరిగిన స్వర్ణగణపతి మహాయజ్ఞమునకు మహాపండితులైన బావ బావమరుదులిద్దరూ వేంచేసిరి. శాస్త్రము ప్రకారము ఆఖరి హోమమును గణపతి తన తొండముతో అందుకొనవలెననియూ, స్వర్ణమయకాంతులతో  గణపతి దర్శనమీయవలెననియూ, కొందరు పండితులువాదము చేసిరి. మహాయజ్ఞ నిర్వాహకులుగా ఉన్న బావ బావమరుదులిద్దరూ తాము మహాగణపతిని ప్రత్యక్షపరచ గలమనియూ వేదోక్తముగా సమస్తమునూ జరిపించగలమనియు ప్రతిజ్ఞ చేసిరి. "యజ్ఞాంతమున స్వర్ణమయకాంతులతో గణపతి దర్శనమిచ్చి ఆఖరి ఆహుతిని తన తొండముతో స్వీకరించి, అనతికాలములోనే వారు గణేశచతుర్ధినాడు సర్వకళలతో శ్రీపాద శ్రీవల్లభ రూపమున అవతరించెదనని ఆనతిచ్చిరి. " యజ్ఞమునకు హాజరయిన వారందరునూ ఆశ్చర్యచకితులైరి. ఆ సభలో ముగ్గురు నాస్తికులుండిరి. వారు కనుపించునదంతయును ఇంద్రజాలమో, మహేంద్రజాలమో గాని గణపతి మాత్రము కాదు. నిజమైన మరియొక పర్యాయము నిదర్శనమీయవలయును, అని వాదించిరి. 

అప్పుడు హోమగుండము నందలి విభూతి మానవాకారము ధరించినది. తదుపరి అది మహాగణపతిగా రూపొందినది. ఆ మహాగణపతి రూపము "మూర్ఖులారా! త్రిపురాసురుని వధించు సమయమునందు శివుడునూ, బలిచక్రవర్తిని నిగ్రహించుటకు పూర్వము విష్ణుమూర్తియునూ, శివుని యొక్క ఆత్మలింగమును కొనిపోవుచున్న రావణుని నిరోధించుటకు విష్ణుమూర్తియునూ, మహిషాసురుని వధించు సమయమున పార్వతీదేవియునూ, భూభారమును వహించుటకు ముందు ఆదిశేషువునూ, సమస్త సిద్ధులూ సిద్ధించుటకు సిద్ధమునులునూ, ప్రపంచమును జయించు నిమిత్తము మన్మధుడునూ, ఇదే విధముగా సమస్త దేవతలునూ, నన్ను ఆరాధించియే అభీష్టములను పొందిరి. సమస్త శక్తులకు నిలయుడను నేనే. నేను సర్వశక్తిమంతుడను. అన్ని విఘ్నములకు కర్తను నేనే. అన్ని విఘ్నములను హరించువాడను కూడా నేనే. దత్తాత్రేయుడనగా ఎవరనుకొంటిరి? హరిహర పుత్రుడైన ధర్మశాస్త్రయే. విష్ణురూపంలో బ్రహ్మరుద్రులు విలీనమయిన అది దత్తరూపము. దత్తుడెల్లప్పుడునూ త్రిమూర్త్యాత్మకుడు. " శ్రీపాద శ్రీవల్లభ రూపము నందు మహాగణపతి యున్నాడనుటకు నిదర్శనముగా శ్రీపాద శ్రీవల్లభులు గణేశచతుర్ధి  నాడు అవతరించిరి."  సుబ్రహ్మణ్యతత్వము వలన వారిది కేవలము జ్ఞానావతారము. ధర్మశాస్త్రతత్వము వలన వారిది సమస్త ధర్మకర్మలకు ఆదియునూ, మూలమునూ అని గమనించగలరు. రాబోవు వారి అవతారము  మాతాపితల  సంయోగ   ఫలితము కాదు. జ్యోతి స్వరూపము మానవాకృతి చెందును.

 ఇదే మీకు శాపమిచ్చుచున్నాను. సత్యస్వరూపమును కంటితో చూచియూ అసత్యము పలికినందులకు మీలో ఒకడు గ్రుడ్డివాడుగా పుట్టును. వాక్కులతో ప్రస్తుతింపక అవహేళన చేసిన కారణమున మీలో ఒకడు మూగవాడుగా పుట్టును. ఇంతమంది సత్యసంధులులయిన భక్తులు సత్యమును గురించి చెప్పుచున్ననూ పెడచెవిన పెట్టిన కారణమున మీలో ఒకడు చెవిటివాడుగా పుట్టును. మీ ముగ్గురును అన్నదమ్ములుగా జన్మించి నా స్వయంభూ మూర్తిని దర్శించిన తదుపరి మీరు దోషరహితులగుదురు. అని పలికెను.





నాయనా! వారు ముగ్గురూ ఈ కాణికాపురమున సోదరులుగా జన్మించిరి. వీరు ముగ్గురూ ఒక "కాణి" భూమిని ఈ గ్రామమునందే సాగుచేసుకొనుచుండిరి. ఆ పొలములో ఒక దిగుడుబావి కలదు. దీనినుండి ఏతము సహాయమున నీరు పెట్టుకొనెడివారు. ఒకానొక సంవత్సరమున అనావృష్టి కలిగినది. భూమిలోని నీరు అడుగంటినది.ఒకరోజున నీరంతయు ఖర్చుకాగా, పారతో ఇసుకను తోడు ప్రయత్నములోనుండిరి. ఆ నీటి అడుగునున్న రాతికి పార తగిలి రక్తము పైకి చిమ్మినది. ఆ రక్తము చేతికి తగులగానే వారిలోనున్న మూగవానికి మాట వచ్చెను. నీరు యధావిధిగా బావిలో నిండుచుండెను. నీటి స్పర్శవలన చెవిటివానికి వాని దోషము హరించినది. మూడవవాడైన గ్రుడ్డివాడు ఆ నీటిలోని రాతిని స్పృశించుటచే అతని గ్రుడ్డితనము పోయునది. ఆ రాయి స్వయంభూవినాయకుని మూర్తి. ఆ రాతి విగ్రహము తలమీద పార తగిలి పెచ్చు విరిగుటచే  అక్కడ నుండి రక్తము స్రవించింది.

 ఆ వరసిద్ధి వినాయకుని ప్రతిష్ఠచేయుటకు సత్యఋషీశ్వరులైన బాపన్నావధానులును, వారి బావమరిది అయిన శ్రీధరావధానులును ఈ గ్రామమునకు విచ్చేసిరి. వరసిద్ధి వినాయకుడు వారితో " మహాభూమినుండి ఈ లోకములోనికి వచ్చినాను. ఫృధ్వితత్వములో అవతరించితిని. ఈ తత్వము కాలక్రమమున అనేక మార్పులను చెందును. జలతత్వములోను, అగ్నితత్వములోను, వాయుతత్వములోను, ఆకాశతత్వములోను నా అవతరణ ఇదివరకే జరిగినది. అయినవిల్లిలో మీరొనరించిన మహాయజ్ఞములోని ఆ హోమభస్మమే ఈ రూపమును ధరించినది. తదుపరి కర్తవ్యమును ఆదేశించుచున్నాను. శ్రీశైలమునందు కళలు తక్కువగా ఉన్నవి. సూర్యమండలాంతర్గతమైన తేజస్సును మీరు అచ్చట శక్తిపాతము చేయవలెను. మీరు శ్రీశైలములో శక్తిపాతము చేసిన రోజుననే గోకర్ణమునందును, కాశీయందును, బదరీయందును, కేదారమునందును కూడ ఏకకాలములో నా అనుగ్రహ విశేషమున శక్తిపాతము జరుగును. శ్రీపాద శ్రీవల్లభుల అవతరణమునకు సమయము ఆసన్నమగుచున్నది. శ్రీధరా! మీ ఇంటిపేరును శ్రీపాద నామముగా మార్చుచున్నాను. కౌశికస గోత్రీకులయిన మీ వంశస్థులు ఇకనుండి శ్రీపాద గృహనామమున వర్ధిల్లెదరుగాక!"అనెను....





తిరుమలదాసు  శంకరభట్టుతో"నాయనా! శంకరా! మాల్యాద్రిపురము నుండి బాపన్నావధానులును, శ్రీధరావధానులును పీఠికాపురమునందు నివసించుటకు వలసపోయిరి. నేను శ్రీపాదశ్రీవల్లభుల బాల్యలీలలను ఎన్నింటినో చూచితిని. రేపు అవన్నియు వివరించగలను. నేను శ్రీపాదుల ఆజ్ఞవలన కాణిపురములోనే ఉండిపోయి నా రెండ  భార్యతోనూ, నా సంతానముతోనూ కులవృత్తి ననుసరించి జీవించుచున్నాను. నీవు శ్రీ పీఠికాపురమున(పిఠాపురం) ఎందరో మహానుభవులను కలిసికొందువు. నీవు రచించు శ్రీపాద శ్రీవల్లభుల చరిత్రను శ్రీచరణులు ఆశీర్వదించెదరు. అని తెలిపెను.  

(ఆ పుణ్యఫలము అణువంత నాకు లభించి ఉంటుంది. అందుకే ఆ ఇంటిపేరు గల 'శ్రీపాదపేరిశాస్త్రి' గారి ప్రధమ పుత్రికనయ్యాను. కానీ     ఇసుమంత కూడా ఆపాటి జ్ఞానము లభించలేదు..సాధనలోన....అన్నట్లుగా..కొద్దిపాటి ఆధ్యాత్మిక   బాటలో ఉన్నాను. ) 


 శ్రీపాదరాజం శరణం ప్రపద్యే 

















6 comments:

Zilebi said...



కథ బాగుందండీ


జిలేబి

భారతి said...

వేద,
నాకు తెలియని చాల చక్కటి విషయాలను నీ బ్లాగ్ ద్వారా తెలుసుకుంటున్నాను. ధన్యవాదములు మిత్రమా.
కాణిపాకం వినాయకుని ఆవిర్భవం గురించి చక్కగా తెలియజేశావు. తదుపరి టపాకై నిరీక్షణ ...

visalakshi said...

మీ స్పందనకు ధన్యవాదాలు జిలేబిగారు!...

visalakshi said...

శ్రీపాద శ్రీవల్లభ చరితములో కాణిపాక వినాయకుని వృత్తాంతము ఉందిరా..అదే వివరించాను. తప్పకుండా త్వరలో మరో పోస్ట్ రాస్తాను.ధన్యవాదాలు భారతీ!

ranivani said...

మంచి విషయాలు తెలియచేసారండీ!వేదశ్రీ ఎంత చక్కటిి పేరు.

visalakshi said...

ధన్యవాదాలు నాగరాణిగారూ!