Thursday, July 2, 2020 By: visalakshi

శ్రీ సాయినామ స్మరణ...

*సాయినామ స్మరణ.....బతుకెంతో తీయన !



శ్రీ సాయితత్వం మానవ జన్మకు ఈ భూమిపైనే చరితార్థం చేయగల శక్తిపాతం. 'సాయి' నామం పావన మంత్రం. అదొక అమృత గుళిక. సాయిలీలామృతాన్ని ఒడిసిపట్టి తాగిన వారు ధన్యులు.

సాయి సచ్చరిత్ర సముద్రమంత లోతైనది. ఆకాశమంత విశాలమైనది. భక్తి, జ్ఞానమనే మణులు అందులో దాగి ఉన్నాయి.

ఎవరెంత లోతుకు వెళ్ళగలిగితే అన్ని మణులను, రత్నాలను పొందవచ్చు. వీటిని పొందాలంటే మనలోని అహంకారాన్ని తీసి బాబా పాదాలపై పెట్టాలి.

శ్రద్ధ, సహనం....దక్షిణగా సమర్పించాలి.
సాయి సచ్చరిత్రలోని ఒక్కో సత్కథ ఒక్కో సద్గతి కలిగిస్తుంది. బాబా చాటిన నీతి, ఉపదేశాలు జీవనరీతుల్ని నేర్పుతాయి.

బాబా లీలలు ఆశ్చర్యానందాలను కలిగిస్తాయి. అవి చదివినంతనే మనో విచారాలు ఎగిరిపోయి శాంతి ఆవరిస్తుంది. బాబా జీవన విధానం మనకు బుద్ధిని, జ్ఞానాన్ని అలవరుస్తుంది. ఇక, బాబా చెబుతున్నదేమిటో ఆలకిద్దాం.

"అహంకారాన్ని విడిచి నా పాదాలపై పెట్టండి. వారికి నేను మిక్కిలి సాయపడతాను. వారి జీవిత చర్యల్లోను, గృహకృత్యాల్లోనూ తోడునీడగా ఉంటాను.

అహంకారం మీ మనస్సులో మచ్చుకైనా లేని రోజున మీ హృదయాల్లోనే శాశ్వతంగా కొలువుండిపోతాను. నా లీలలు, బోధలు విన్న, ఆచరించిన భక్తులకు భక్తి, విశ్వాసాలు కుదురుతాయి. వారు

ఆత్మసాక్షాత్కారాన్ని, బ్రహ్మానందాన్ని పొందుతారు. నా నామాన్ని ప్రేమతో స్మరించే వారి కోరికల్ని తీరుస్తాను. వారిలో, భక్తి, జ్ఞాన వికాసాన్ని కలిగిస్తాను.

ఎవరైతే మనఃపూర్వకంగా నా బోధనల్లోని విషయాలను గ్రహిస్తారో వారు సంతోషగ్రస్తులవుతారు. నన్నే స్మరించి, ధ్యానించి, పూజించే వారిని జనన మరణ బంధాల నుంచి బయట పడవేస్తాను.

భక్తి శ్రద్ధలతో నా లీలల్ని చదవండి. మనసులో నిలుపుకోండి. ఉపదేశాలను ఆచరించండి. అప్పుడు గర్వం, అహంకారం నశిస్తాయి.

ఆనందానికి, తృప్తికి ఇదే మార్గం. 'సాయి...సాయి' అనే నామ స్మరణ వల్ల చెడు వినుట, చెడు పలుకుత వలన కలిగే పాపాలు పటాపంచలైపోతాయి.

నా మాటలపై నమ్మకం ఉంచిన వారు తరిస్తారు. మనసు చెదిరిపోనీయకండి. దేనికీ భయపడకండి. చలించకండి. స్థిరంగా, విశ్వాసంతో ఉండండి. నా లీలలు చదవటం కాదు, వాటిలోని నీతిని, మంచిని గ్రహించి ఆచరించటం ముఖ్యం."


"నిరాడంబరత - సాయి సందేశం*"..!!

ఎన్నోజన్మల పుణ్యఫలం వల్ల సాయి మన జీవితంలో ప్రవేశించారు. సాయి తన భక్తులను జాగ్రత్తగా కాపాడుతు ఆధ్యాత్మిక పధంలో నడిపిస్తారు. సాయి పట్ల అత్యంత భక్తిశ్రద్ధలు ఉంటే చాలు మనం ఈ భవసాగరాన్ని దాట వచ్చు. సాయి భక్తులు ఎన్నడు నిరాశకు లోనవ్వరు. వారి జీవితంలో సుఖశాంతులికి కొదవ ఉండదు. సాయి ఎల్లప్పుడూ నిరాడంబరంగా ఉండమని చెప్పారు. ఒక్కోసారి మనం దైవసేవలో కూడా ఆడంబరాలకు పోయి నిజమైన ప్రేమకు భక్తికి దూరం అవుతాము.

సాయి సమర్ధుని కృపతో దాసగణు మహారాజ్ సత్పురుషుల కథలను రచించి, ఏ కానుకలు తీసుకోకుండా కీర్తనలు చేసి ప్రసిద్ధి చెందారు. సాయి భక్తి యందు మరింత ఉత్సాహాన్ని విస్తరింపచేసారు. ఆత్మానంద సాగరం వంటి సాయి ప్రేమరసాన్ని పెంపొందించారు. దాసగణు షిర్డీకి రావడానికి కారణం నానాచందోర్కర్. నానా వల్ల సాయి భక్తి నలుదిశలా వ్యాపించింది. ఒక సారి దాసగణు మహారాజ్ షిర్డీ గ్రామంలో హరికథా కీర్తన కోసమని శరీరంపై కోటు, కండువా, తలకు పాగా కట్టి బయలుదేరారు.

బాబా ఆశీర్వాదం కోసమని వస్తే బాబా ఇలా అంటారు. వాహ్వా పెళ్ళికొడుకు లాగా అలంకరించుకుని, ఎక్కడకు వెళ్తున్నావు? అని అడుగుతారు. కీర్తన చెప్పడానికి ఇవన్నీ అవసరమా! వీనిని నా ఎదుట తీసివేయి అని చెప్తారు. అప్పటినుంచి దాసగణు మహారాజ్ ఒక్క పంచ కట్టుకొని చొక్కా లేకుండా, చేతిలో చిడతలు మరియు మేడలో మాల వేసుకొని హరికథ చెప్పేవారు. ఇదే ప్రసిద్ధమైన నారదీయ పద్దతి. బాబా ఈ నిరాడంబరతనే కోరుకునే వారు. ఇక్కడ మన ధ్యేయం అంతరంగ పరిశుద్ధత.

మీరెవరైనా ఎక్కడున్నా భక్తితో నా వైపు మళ్లితే ఎల్లప్పుడు మీతోనే ఉంటాను. ఈ శరీరం ఇక్కడ ఉన్నా మీరు సప్త సముద్రాల అవతల ఉన్నా నాకు తక్షణం తెలిసిపోతుంది. ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళండి నేను మీ వెంటే ఉంటాను. మీ హృదయంలోనే నా నివాసం. మీ హృదయంలో ఉన్న నన్ను మీరు నిత్యం ఆరాధించండి. అన్ని జీవరాసులలో నేనే ఉన్నాను నన్ను తెలుసుకున్నవారు గొప్ప భాగ్యవంతులు.

దేవుడికి ఎంత చేసినా తక్కువే, కాని బాబా ఎందుకు నిరాడంబరతకు ప్రాముఖ్యత ఇచ్చారు అంటే ఆధ్యాత్మిక సాధనలో నిరాడంబరత అవసరం ఎంతో ఉంటుంది. లేక పోతే ఈ ఆడంబర పూజలే వాసనలై చివరికి మనలను వేధిస్తాయి. ఆత్మ సాక్షాత్కారానికి నేను, నాది అనే అహంకారమే అడ్డుగా నిలుస్తుంది.

*ఓం  సాయిరాం*..

0 comments: