Friday, October 17, 2008 By: visalakshi

సంప్రదాయాన్ని గౌరవించిన జ్యోతిష విద్వన్మణి ; ఖానాదేవి.

అమృత వాహిని లో నాలుగు నెలల క్రితం చదివినప్పటినుండి
ఆలోచింప చేసిన, జరిగిన సంఘటన. భారతావని అందించిన అత్యుత్తమ జ్యోతిశ్శాస్త్రవేత్తల్లో ఒకరు- ఖానాదేవి. మహోన్నత మహిళల గురించి మాట్లాడినపుడల్లా స్వామి వివేకానంద ఆమె పేరును ప్రస్తావించేవారు .జ్యోతిష, ఖగోళ శాస్త్రాల్లో వరాహదేవుడు గొప్ప నిపుణుడు .ఉజ్జయినికి చెందిన విక్రమార్క చక్రవర్తి ఆస్థానంలో నవరత్నాలుగా ప్రసిధ్దికెక్కిన వారిలో ఆయన ఒకరు.
వరాహదేవుడు ,ధరణీ దేవి దంపతులకు మిహిరుడు జన్మించాడు. మిహిరుడు జ్యోతిశ్శాస్త్రంలో గొప్ప విద్వాంసుడిగా పేరుగాంచాడు. శ్రీలంక రాజకుమారి అయిన ఖానాదేవిని అతడు వివాహమాడాడు. ఆమెకి కూడా చిన్నప్పటినుండి జ్యోతిశ్శాస్త్రం పత్ల అపారమైన మక్కువ .పెరిగి పెద్దవుతున్న కొద్దీ జ్యోతిషంలో ఆమె దిట్టగా మారింది.
విక్రమార్క చక్రవర్తి మిహిరుని నైపుణ్యం తెలిసి ఆయనను తన ఆస్థాన జ్యోతిష్యునిగా నియమించాడు. రాజసభలో పలువురు అడిగిన ప్రశ్నలకు మిహిరుడు,వరాహదేవుడు సమాధానాలు ఇచ్చేవారు. కొన్ని క్లిష్టమైన సమస్యలకి వారు ఖానాదేవిని ఆంతరంగికంగా సంప్రదించి ఆపైన రాజసభలో వాటికి బదులిచ్చేవారు .విక్రమాదిత్యుడికి ఈ సంగతి తెలిసింది. ఖానాదేవిని కూడా రాజసభకు తీసుకురావాలనీ ,ఆమె విజ్ఞానం ద్వారా ప్రజలు లభ్ధి పొందే వీలు కల్పించాలనీ ఆయన మిహిరుడ్ని కోరారు.
చక్రవర్తి అభ్యర్ధన విని తండ్రీ, కొదుకులిద్దరూ దిగ్బ్ర్హాంతి చెందారు .కుటుంబ సాంప్రదాయం, గౌరవాల రీత్యా ఆయన అభ్యర్ధనను పాటించలేక ,వారి మాటను తిరస్కరించలేక, చర్చల అనంతరం వారు ఓ ఘోరమైన నిర్ణయం తీసుకున్నారు. మిహిరుడు జరిగిన విషయం ఖానాదేవికి వివరించాడు. ఆమెను నిండు సభకు పంపడం సరి కాదని వాదించాడు. మాట్లాడగలిగితేనే కదా, సభకు పిలిచి మాట్లాడేది .అసలు మాట్లాడడానికి వీలు లేకుండా చేస్తే1 ఈఆలోచనతో తండ్రి ఆదేశం మేరకు మిహిరుడు,ఖానాదేవి నాలుకను కత్తిరించాలని భావించాడు.
ఆమె నిశ్చల చిత్తంతో భర్త దగ్గరకు వెళ్ళి, మామగారు చెప్పినట్టుగా నాలుక కోసివేయాల్సిందిగా పేర్కొంది. మిహిరుడు అలాగే చేయడంతో, ఆమె వీర నాయికగా మరణించింది. పరుల కోసమే జీవిస్తూ, కుటుంబ సంప్రదాయం, గౌరవాలను కాపాడేందుకు జీవితాన్నే త్యాగం చేసిన ఖానాదేవికి భారతీయ మహిళా మణిదీపాలులో స్థానం కల్పించారు, స్వామి వివేకానంద.
ఇప్పుడు ఇది రాస్తూ కూడా ఒళ్ళు గగుర్పొడిచింది. ఇంత ఖఠినంగా ఉండే వారా అని.

10 comments:

Ramani Rao said...

వేద గారు: నిన్న గాక మొన్న స్త్రీ స్వాతంత్ర్యం, సాహిత్యాభిలాష గురించి మాట్లాడిన మీరు ఒక్కసారిగా ఒక కథ గురించి చెప్తూ ఒళ్ళు గగుర్పొడిచింది అన్నారు. శ్రీ రాముడు ఎవరో మాట విని సీతని అనుమానించినప్పుడు సీత మౌనంగా అవమానాన్ని భరించి అడవులకి వెళ్ళకుండా, శ్రీరముడిని "నన్ను అనుమానిస్తావా అని చెంపమీద కొట్టి అడగాల్సింది" అని అన్నారు ఎవరో! కాని ఈ కథ లో పిరికితనం జయించింది.
మీరు చెప్పిన కథలోకి వద్దాము. వివేకానదుడు ఏమన్నాడు అనేకన్నా ఈ కథ ద్వారా మీరే సందేశం ఇవ్వదల్చుకొన్నారు అన్నది నాకు కావాలి. స్త్రీ బయటికి రాకూడదు కబట్టి భర్త, తండ్రి ఇద్దరు మధనపడిపోయారు ఇది సరె, దారుణాతి దారుణంగా మామగారి మాటకి నిలబడి భర్త చేత నాలుక తెగగోయించుకోడం ఈ తరానికి వంటబట్టే విషయమా? భర్త, అత్తమామలు మాటలు ఎంత తెలివైన వారయినా, ఎంత జ్ఞానం ఉన్నవారినైనా సరే వినాల్సిందే అని ఈ కథ చెప్తున్నట్లుగా ఉంది. భర్త ఏమన్నా /ఏమి చేసినా బార్య కట్టుబడి ఉండాలి అన్నది మరో అంశం గా ఉంది.
నాకిక్కడ వళ్ళు గగుర్పొడచలేదు. నిజానికి ఖాందేవి దయనీయ పరిస్థితికి బాద గా ఉంది. తప్పయితే చర్చించుకొనే సహృదయత బార్య భర్తలిద్దరి మధ్యా ఉండాలి. భర్త తప్పు చేస్తే ఇది తప్పు అని చెప్పగలిగే ధైర్యం (ఎందుకో కూడా) బార్యకి ఉండాలి. అలాగే బార్య తప్పుచేస్తే భర్త చెప్పగలగాలి (చెప్పాలి, మార్చగలగాలి, హింస అనేది మార్పుకు ప్రత్యామ్నాయం కాదు).
కథ చెప్పారు కాని అసలు ఈ కథపై మీ అభిప్రాయం ఏంటి అనేది నాకు తెలియడం లేదు. కాస్త వివరించగలరు.
మనకై మనం సృష్టించుకొన్న ఈ ఆచారాలు, సాంప్రదాయాలు మనుషుల్ని హింసించేవిగా ఉన్నవి అయితే నేను వాటికి వ్యతిరేకమే. అప్పట్లో భర్త మాటకి కట్టుబడేవిగా అయి అలా నాలుక కోసుకోడం, సతీ సహగమనాలు చెల్లాయి. ఇప్పుడు పెద్దలని అంటే భర్తని, భర్త తరుపువారిని గౌరవించడం అనేది మన గౌరవాన్ని, మన మర్యాదని తెలియజేస్తాయి. కాని ఇలాంటి కథలు చదువుకొంటూ పతివ్రత, సాధ్వీమణి అంటే ప్చ్! మనసు అంగీకరించడం లేదు.

Kottapali said...

హాయి గొల్పినప్పుడే కాదు, భయవేసినప్పుడూ, గొప్ప జుగుప్స కలిగినప్పుడు కూడా వొళ్ళు గగుర్పొడుస్తుంది.

teresa said...

'ఓసి వెర్రిఖానా' అనే వాడుక ఈ కథ నించే వచ్చిందా?

visalakshi said...

స్పందన: సీతాదేవి, ఖానాదేవి లాంటి నాటి తరం మహిళా మణి దీపాల సహనం, ఓర్పు, స్వాభిమానం నుండి మరియు వారి కష్టాల నుండి ఉద్భవించిందే స్త్రీ స్వాతంత్ర్యం.
అంతటి జ్యోతిశ్శాస్త్ర పండితురాలు ,తర్కానికి తావులేని స్థితిలో వరాహదేవుని, మరియు మిహిరుని హేయమైన చర్యకు ప్రతిఘటించలేని పరిస్థితిలో తలవంచింది. కుటుంబ కట్టు బాట్లతో అణిచి వేయబడిన ప్రజ్ఞావంతులు ఇంకా ఎంతమంది ప్రాణత్యాగం చేసారో? '"నాటి సీతా,సావిత్రీ వంటి నారీమణుల జీవితాలు కాల పరీక్షకు నిలిచి ఈనాటికీ చెరగని కీర్తితో భాసిల్లుతున్నాయంటే వారి దీక్షాదక్షతల్లో ఎంత మహత్యం దాగి ఉందో అర్ధం చేసుకోవాలి.ఆలోచనా వికాసమే ఆధునికత...ఆధునిక యువతులు ఏదో పొందాలన్న తపనతొ ఏం పోగొట్టుకుంటున్నారో తెలుసుకోలేకపోతున్నారు."ఇవి వివేకానందస్వామి పలుకులు.
"నా జీవితంలో ఇద్దరి ఋణం ఎన్నటికీ తీర్చుకోలేనిది. ఒకరు అనురాగాన్ని ,ఆదర్శాన్ని గోరుముద్దలుగా కలిపి తినిపించిన అమ్మ. ; ఒకరు చేతి బంగారు గాజులు అమ్మి నా పై చదువులకు డబ్బు కట్టిన మా అక్క. నేను సాధించిన విజయాలన్నీ వారి పాదాల వద్ద వినమ్రంగా అర్పిస్తాను . అన్నారుట భారతరత్న అబ్దుల్ కలాం.'"
ప్రపంచం మొత్తంలో మహిళలను గౌరవించడంలో స్కాండినేవియన్ దేశాలు చిన్నవైనా ముందు వరుసలో ఉన్నాయి. అగ్రరాజ్యాలైన అమెరికా ,రష్యా వెనుక వరసలో నిలిచాయి. యత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర రమంతే దేవతాః అంటూ ఉపదేశాలు వల్లించే భారతీయులు కూడా చివరి స్థానంలో ఉన్నారు. మన సమాజం తలదించుకోవాల్సిన కఠోర వాస్తవమిది.ఇవి కూడా చదివి తెలుసుకున్న పుస్తక పరిజ్ఞానంతో రాస్తున్నాను.

Ramani Rao said...

వేద గారు: మీరు పుస్తక పరిజ్ఞానం తో రాస్తున్నారు. నేను బయట తిరిగి నలుగురిని చూసిన లోకజ్ఞానంతో రాస్తున్నాను. మీరు నా ప్రశ్నకి సమాధానం చెప్పలేదు.

ఇప్పటి అధునిక స్త్రీలు సహనంతో, స్వాభిమానంతో, ఓర్పుతో ఉండమనా మీ కోరిక. ఒకవేళ అలా ఉంటే స్త్రీ స్వాతంత్ర్యానికి అర్ధం?? స్వాతంత్ర్యం అంటే సహనం,ఓర్పు, స్వాభిమానం కాదు కదా. నాకు తెలిసి సొంత ఆలోచన, సొంత వ్యక్తిత్వం, సొంత నమ్మకం. ఇవి ఉన్నాయా మీరు చెప్పిన ఖానాదేవిగారికి? అప్పటి కథని పురావృతం చేయడంవల్ల, ఇప్పటి స్త్రీ సాధించేది ఏమిటి? భర్త ఇగో ని తృప్తిపరచడం తప్పితే.

అమ్మ, అక్క, చెల్లి ఈ బంధాలు తెలిసిన వాళ్ళు ఒక్క అబ్దుల్ కలాం గారికే కాదు, వారి వారి సోదర సోదరీమణులకి ఇలాంటి త్యాగాలు చేస్తూనే ఉన్నారు. వాళ్ళందరూ, మీరన్నారే కొన్ని కుటుంబ కట్టుబాట్ల వల్ల బయటికి రాలేకపోతున్నారు.

ఆలోచనే వికాశమే అధునికత: ఇది నేను అంగీకరిస్తాను. ఏదో పొందాలన్న తాపత్రయంతో ఏమి పొగొట్టుకొంటున్నరో తెలియడం లేదు అంటే దాని అర్ధం సీతా సావిత్రి లాంటి పతివ్రతల లాంటి పేర్లు కాదు,వారికున్న స్వాభిమానం, ఓర్పు, సహనం అంతకన్నా కాదు. కుటుంబ ప్రేమకి, ఓ అనుబంధానికి దూరమవుతోంది స్త్రీ. ఆలోచన లేక కాదు, ఆలోచించే టైం లేక, హడావిడి జీవితాలవల్ల. అంతే కాని సీతా దేవి, ఖాన దేవి లాంటి వాళ్ళ కట్టుబాట్లకి సంభందించిన జాలి లాంటి గౌరవం కాదు స్త్రీ కోరుకొనేది.

స్త్రీలని గౌరవించడం: స్త్రీ తెలివిని గౌరవించండి, స్త్రీ నమ్మకాన్ని గౌరవించండి, ఆమేని ప్రోత్సహించండి, ఇలాంటి పిరికి పతివ్రత కథలు మాత్రం చెప్పి కాదు. ప్రతిఒక్కరికి ఉన్నాయి కుటుంబ కట్టుబాట్లు, అవి ఇలాంటి హేయమైనవి అయితే తిరగబడడంలో తప్పులేదు.

యత్ర నార్యస్తు పూజ్యంతే తత్ర రమంతే దేవతాః అంటూ ఉపదేశాలు వల్లించే భారతీయుల్లారా: ఇలాంటి పతివ్రతల కథలు చెప్పి మటుకు స్త్రీ ని జాలితో కూడిన మీ గౌరవాలు మాకొద్దు. స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం అంటే ఇది కాదు.

కొత్త పాళీ said...

ఇది మీబ్లాగు, ఇందులో మీ ఆలోచనలు నిరభ్యంతరంగా రాసేసుకోవచ్చు. బ్లాగులో ఒకలాంటి భావాలే మాట్లాడాలి, దానికి భిన్నమైనవి మాట్లాడకూడదు అనేం లేదు. అదీకాక, మీరు బ్లాగ్లోకంలోకి కొత్తగా వచ్చారు. అందుకని కూడా మీరీ టపాలోను, తరవాత ప్రతిస్పందనలోనూ వెలిబుచ్చిన భావాల్ని మరీ తీవ్రంగా వ్యతిరేకించడానికి నాక్కొంచెం సంకోచంగా ఉంది.

ఎటొచ్చీ, మన ఆలోచన ఎప్పుడైనా మౌఢ్యాన్నీ, కరుడుగట్టిన భావాల్నీ పటాపంచలు చేసేదిగానూ, వెలుగు ప్రసరించేదిగానూ ఉండాలి. అలాగని ప్రతీదాని మీద తిరగబడమనీ, అర్ధం లేని కలలు కంటూ గాలి మేడలు కట్టమనీ అనడం లేదు. మనం ఒక పాత్ర సృష్టించామంటే, ఒక సన్నివేశం కల్పించామంటే, ఒక నిరూపణ ప్రతిపాదించామంటే - అవి ఎటువంటి విలువలకి వత్తాసు పలుకుతున్నాయి, ఎటువంటి విలువల్ని దిగదీస్తున్నాయి అని మనకి స్పష్టంగా తెలియాలి. అప్పుడే ఆ రచన ఇంకోరికి ఏమన్నా పనికి వచ్చేది. ఆలోచించండి.

Kathi Mahesh Kumar said...

ఈ కథ ఏంచెబుతోంది? అనేప్రశ్నకొచ్చేముందు కథలోని అతిశయోక్తుల్ని అర్థం చెసుకుందాం. ఉజ్జయిని(ప్రస్తుత మధ్యప్రదేశ్) అప్పట్లో దాటలేమనుకునే వింధ్య,సత్పుర పర్వతాల అవతల ఉంది. శ్రీలంక హిందూమహాసముద్రంలో ఉన్న ఒక మాతృస్వామిక వ్యవస్థకలిగినద్వీపం.ఈ రెంటికీ ముడిపెట్టి ఒక కథ. దాంట్లో మనం స్త్రీజాతిని గురించి నేర్చుకోవల్సిన "ఆదర్శం".

ఖానాదేవి ఏమగాడికంటా పడకుండా,పబ్లిక్ ప్లేసుల్లో కనిపించకుండా సముద్రందాటి,పర్వతాలు ఎగిరొచ్చి ఉజ్జయినిలోని అంత:పురంలో వాలింది. ఈవిడగారు సభలో కనబడితే వంశప్రతిష్టకు భంగమని నాలుకకోసి ప్రాణం తీసారు. పాపం ఖానాదేవి willing victim of patriarchy అయ్యింది. దానికి మనం గర్వించాలి. ఈ విషయం మనకు వివేకానందుడు చెప్పాడు...

ఇంతకంటే మంచి జోకు మరోటిలేదు. ఇదే మీ స్త్రీజనోద్ధరణ మూస అయితే,మీ ఇదివరకటి టపా మాత్రమే ఇంతకుమించిన జోకవుతుంది. నా అభినందనలు. మంచి జోకుల బ్లాగు మొదలెట్టినందుకు.

visalakshi said...

కొత్త పాళీ గారు ,నా భావాల్ని మీరూ వ్యతిరేకిస్తున్నారు అంటే నేను వివరణ ఇవ్వక తప్పదు. రమణి గారు ఆవేశంగా ఈ కధ యెప్పటిదో అని ఆలోచించకుండ అది ఈ తరంలో కుటుంబ వ్యవస్థకి ముడి పెట్టి, తీవ్ర వ్యతిరేకత వెలిబుచారు.
భారతీయ మహిళా మణి దీపాలు: ఆంగ్ల మూలం: డాక్టర్ ఎస్ రమణి అనువక్త:రెంటాల జయదేవ .1.తెల్ల వాడి గుండెల్లో నిదురించిన తరుణి రాణి లక్ష్మీ బాయి ,2. విషాదాలకు తలొగ్గని వనితారత్నం అహల్యా బాయి. 3.సుగుణాల కల్పవల్లి సీతమ్మ తల్లి సీత .4,రాజనీతి తెలిసిన రమణీ -తార. తార .మరియు ఖానాదేవి. వీరంతా క్రీ .శ. (1735-1858) నాటి మహిళలు. ఆరోజుల్లో ఆచారం ప్రకారం స్త్రీని అంతః పురంలో ఉంచి ఆమె తెలివితేటలను మాత్రము ఉపయోగించేవారు. స్త్రీల ప్రజ్ఞాపాటవాలను అణగతొక్కేవారు. ఆనాటి మహిళల గాధలు వెలికితీసి వారిని వీరనాయికలన్నారు స్వామి వివేకానంద. ఆవిధంగా ఖానాదేవి గురించి రాసినపుడు ఆమెపట్ల భర్త, మామగార్ల దుశ్చర్యకు జుగుప్సతో ఒళ్ళు గగుర్పొడిచింది, అన్నాను. ఆ తరువాత అబ్దుల్ కలాం గారి కి స్తీలపట్ల ఉన్న గౌరవం వగైర రాసాను,ఆనాటి చరిత్రలే నేటి పురోగతికి సోపానాలు.ఆనాటి స్రీలలో ఉన్న విశిష్ఠతను గుర్తించమన్నాను. తెలియక యేదైనా తప్పుగా రాస్తే క్షమించండి.

Kathi Mahesh Kumar said...

@వేద: చరిత్రకూ పుక్కిటిపురాణాలకూ నక్కకూ నాగలోకానికీ ఉన్నంత తేడా ఉంది. చరిత్రప్రకారం విక్రమార్కుడనే రాజేలేడు. ఉన్నదల్లా,విక్రమాదిత్యుడే! అతన్నే విక్రమార్కుడని కొందరు వ్యవహరిస్తారు.అతనుకూడా క్రీ.శ 9-12 వశతాబ్దంలో నివసింఛాడని చరిత్ర చెబుతోంది. కానీ మీరు ఉదహరించిన తారీఖులు ఇల్ టుట్ మిష్ ఉజ్జయినిపైదాడి(1234 AD)తరువాతవి.

ఆ సమయం తరువాత అక్బర్ మాండుని రాజధానిగా చేసుకుని ఉజ్జయినిని పాలిస్తున్న బాజ్ బహదూర్ నుంచీ లాగేసుకుని తన సామ్రాజ్యంలో కలిపేసుకున్నాడని మీకు తెలియదనుకుంటాను.

"ఆనాటి చరిత్రలే నేటి పురోగతికి సోపానాలు.ఆనాటి స్రీలలో ఉన్న విశిష్ఠతను గుర్తించమన్నాను" అనిచెబుతూ, ఒక నిస్సహాయురాలైన స్త్రీకి ఇలా ఆదర్శాన్ని అంటగట్టడమే ఆశ్చర్యంగా ఉంది.

Bolloju Baba said...

post and comments are thought provoking

bollojubaba