Wednesday, March 23, 2022 By: visalakshi

"నీలోకి నీవు"

              ఓం శ్రీ సాయి నాధాయ నమో నమః

                   

శ్లో" శ్రవణాయాపి బహుభిర్యో న లభ్యః

          శృణ్వన్తో2పి బహవో యం న విద్యుః !

        ఆశ్చర్యో వక్తా కుశలో2స్య లబ్ధా

                ఆశ్చర్యో జ్ఞాతా కుశలానుశిష్టః !!


భా...దేనిని గురించి వినడానికి అనేకులచే సాధ్యపడదో , విన్నప్పటికీ ఎందరో దేనిని అర్థం చేసుకోలేరో , ఆ ఆత్మను గురించి ఉపదేశించేవాడూ అరుదు , వినేవాడూ అరుదు. అంతటి అరుదైన వ్యక్తి ఉపదేశాలను పాటించి దానిని తెలుసుకున్నవాడు కూడా అరుదే.




మనం ఎలాంటి సంపదను కూడగట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాం, ఇక్కడ వదిలిపెట్టేదా లేక మనం వెంట తీసుకువెళ్లగలిగేదా ?

నిజమైన సంపద...

ఒక ఫకీరు రోజూ చెట్టు కింద కూర్చుని ధ్యానం చేసుకుంటూ ఉండేవాడు. రోజూ అక్కడకు ఒక కట్టెలు కొట్టేవాడు వచ్చి, కొన్ని చెక్కలను కొట్టుకుని తనతో తీసుకెళ్లేవాడు. ఒకరోజు అతనితో ఆ ఫకీరు ఇలా అన్నాడు, "నాయనా నువ్వు రోజంతా కష్టపడి ఈ కలప కొట్టుకుని, తీసుకెళ్తావు. అది నీకు రెండు పూటలా తిండికే సరిపోదు. ఇంకొంచెం ముందు వెళ్ళావంటే అక్కడ ఒక పెద్ద గంధపు చెట్ల అడవి ఉంది. నువ్వు అక్కడ ఒక్కరోజు కలపను నరికితే, అది నీకు ఏడు రోజులకు సరిపడా సంపాదన ఇస్తుంది."


పేదవాడైన ఆ చెక్కలు కొట్టేవాడు నమ్మలేకపోయాడు, ఎందుకంటే ఈ అడవి గురించి తనకు తెలిసినంతగా మరెవరికీ తెలియదని అతను అనుకున్నాడు. అతను తన జీవితమంతా అడవిలో కట్టెలు కొట్టడంలోనే గడిపాడు. రోజూ కేవలం చెట్టుకింద కూర్చునే ఈ ఫకీరుకి ఏమి తెలుసు? అని అనుకుని మొదట అతను అంగీకరించడానికి ఇష్టపడలేదు, కానీ వెళ్లి చూడడం వల్ల వచ్చే నష్టమేమిటనే నిర్ణయానికి వచ్చాడు. ఏమో ఎవరికి తెలుసు, అతను చెప్పింది సరైనది కావచ్చు కదా ! పైగా, ఇతను అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది ?

చాలా  ప్రశాంతంగా, నిశ్శబ్దంగా ఉన్న వ్యక్తిలా కనిపిస్తున్నాడు, తన లోకంలో తాను సంతోషంగా ఉన్నట్లుగా ఉన్నాడు. ఇంతకు ముందు ఎప్పుడూ ఏమీ మాట్లాడలేదు. కాబట్టి అతను స్వయంగా వెళ్లి చూడాలని నిర్ణయించుకున్నాడు.

అలా ముందుకు వెళ్ళాడు. 

వెనక్కి తిరిగి వచ్చి, నమస్కరించి, ఫకీరు పాదాలపై పడి ఇలా అన్నాడు: "దయచేసి నన్ను క్షమించండి ! ఈ అడవి నా కంటే బాగా ఎవరికి తెలుసు అని అనుకునేవాడిని. కానీ చందనాన్ని ఎలా గుర్తించాలో నేను తెలుసుకున్నాను. 

నా తండ్రి కూడా కట్టెలు కొట్టేవాడు; అతని తండ్రి కూడా అంతే. కానీ మేమందరం రోజుల తరబడి ఈ కట్టెలు కొట్టుకుంటూనే ఉన్నాం, మాకు ఆ గంధం చెట్ల గురించిగాని, సరిగ్గా గంధం అంటే ఏమిటో తెలియలేదు? గంధపు చెక్క దొరికినా, దాన్ని కోసి మామూలు చెక్కలాగానే బజారులో అమ్మేసేవాళ్ళం. మీరు దాని గుర్తింపును, దాని వాసనను, దానిని ఎలా గుర్తించాలో నాకు వెల్లడించారు. నేను ఎంత దురదృష్టవంతుడిని ! నాకు ముందే ఇది తెలిసిఉంటే బాగుండేది." 


దానికి ఫకీరు "బాధపడకు నాయనా, ఇప్పుడు నీకు తెలిసింది కదా" అన్నాడు.

ఆ తర్వాత కట్టెలు కొట్టేవాడు తన రోజులను ఎంతో ఆనందంగా గడపడం ప్రారంభించాడు.

 ఒక్కరోజు అడవికి వచ్చి కట్టెలు కొట్టుకునేవాడు, ఆపై ఏడెనిమిది, లేదా పది రోజులకి కూడా రావాల్సిన అవసరం వచ్చేది కాదు.

ఒక రోజు, ఫకీరు అతనితో ఇలా అన్నాడు, " సోదరా, నీకు కొంత తెలివి వస్తుందని నేను అనుకున్నాను, ముందుకు వెళ్లకుండా నీ జీవితమంతా ఇక్కడే కట్టెలు కొట్టుకుంటూ ఉండిపోయావు. ఇప్పుడు కూడా, ఈ చందనాన్ని మించి విలువైనది ఇంకేదైనా ముందుఉందేమోనని నువ్వు అనుకోవట్లేదు."

కట్టెలు కొట్టేవాడు,"నేను అది కనీసం ఆలోచించలేదు. చందనానికి మించినది ఏదైనా ఉందా ?", అని అడిగాడు.


"గంధపు చెక్కను దాటి ముందుకు వెళ్ళు, అక్కడ ఒక వెండి గని ఉంది, ఈ కట్టెలు కొట్టుకోవడం వదిలేయ్. ఈ వెండిని ఒకసారి తెచ్చుకుంటే,  రెండు నుండి నాలుగు నెలల వరకు సరిపోతుంది", అని అన్నాడు.


ఇప్పుడు అతను ఫకీరును నమ్ముతున్నాడు. దాంతో ఒక్కసారిగా పరిగెత్తాడు. ఇప్పుడు అతని మనసులో ఎలాంటి సందేహాలు తలెత్తలేదు. వెండి గనిని కనిపెట్టాడు! ఇప్పుడు జీవితం విలాసవంతంగా గడుస్తోంది. ఇప్పుడు నాలుగైదు నెలలు వరకు కనిపించడం లేదు. ఒకరోజు వచ్చి, మళ్లీ కనిపించకుండా పోయేవాడు. కానీ మనిషి మనస్సు చాలా మూర్ఖంగా ఉంటుంది, ఇంతకు మించినది మరొకటి ఉంటుందని అతను గ్రహించలేదు.


మళ్ళీ ఒకరోజు ఆ ఫకీరు అతనితో ఇలా అన్నాడు, "నువ్వు అసలు ఎప్పటికైనా మేల్కొంటావా ? లేదా నేను నిన్ను మళ్ళీ లేపాలా? ఎదురుగా బంగారు గని ఉంది, మూర్ఖుడా ! నీ వైపు నుండి నీకు ఏలాంటి ప్రశ్నలూ, ఉత్సుకత, ఏమీ ఉండదా ? ముందు ఇంకేముందో  చూడాలా ? ఇప్పుడు ఆరు నెలలుగా నువ్వు స్థబ్దుగా ఉన్నావు, ఇంట్లో పనిలేదు, ఖాళీగా ఉన్నావు, అడవిలో ఇంకా ముందుకెళ్లి చూద్దాం అని ఎప్పుడూ అనుకోలేదు..?"


దానికి కట్టెలు కొట్టేవాడు, "నేను చాలా నిదానంగా ఉన్నాను, నేను దాని గురించి కూడా ఆలోచించలేదు ! వెండే ఆఖరిది అని నేను నమ్మాను, ఇంతకు మించి ఏమి ఉంటుంది అనుకున్నాను! పేదవాడిని, నేను ఎన్నడూ బంగారం చూడలేదు, దాని గురించి కేవలం విన్నాను అంతే." 

ఫకీరు, "ఇంకా ముందుకు వెళ్తే బంగారు గని ఉంది" అని జవాబిచ్చాడు.


 కథ ఇలా సాగుతుంది. ఆపై, మరింత ముందుకి వజ్రాల గని ఉంది. ఈ కథ ఇలా చాలా సంవత్సరాలు సాగింది. 


ఒక రోజు ఫకీరు ఇలా వ్యాఖ్యానించాడు, "నువ్వు చాలా అజ్ఞానివి, ఇప్పుడు నువ్వు వజ్రాల దగ్గర ఆగిపోయావా ?" 


ఇప్పుడు కట్టెలు కొట్టేవాడు కూడా సంపన్నుడు అయ్యాడు, అతనికి స్వంతగా భవనాలు ఉన్నాయి. "ఇక వదిలెయ్, నన్ను ఇబ్బంది పెట్టకు. ఇంక వజ్రాల తర్వాత ఏముంటుంది" అన్నాడు అహంకారంతో.


ఫకీరు ఇలా అన్నాడు, "వజ్రాలను దాటి, నేను ఉన్నాను, ఈ వ్యక్తి ఇక్కడే కూర్చుని ఉన్నాడని, ఇతనికి వజ్రాల గని గురించి తెలిసి కూడా, వజ్రాలను ఎందుకు సేకరించడం లేదని నీవు ఎప్పుడూ ఆలోచించలేదు.. అంటే అంతకన్నా విలువైనది అతనికి దొరికి ఉండాలి... అది వజ్రాలను మించి ఉండాలి కదా... అన్న ఈ ప్రశ్న నీ మనసులో ఎప్పుడూ తలెత్తలేదా?"


ఆ మనిషి ఏడవడం మొదలుపెట్టాడు. అతను ఫకీరు పాదాలపై పడి, తన తలని పాదాలకేసి కొట్టుకుంటూ, ఇలా అన్నాడు: "నేను ఎంత మూర్ఖుడిని ! ఈ ప్రశ్న ఎప్పుడూ నా మనసులోకి రాలేదు! మీరు చెప్పినప్పుడు మాత్రమే నేను దీని గురించి ఆలోచిస్తున్నాను. నా జీవితంలో వజ్రాల కంటే ఎక్కువ సంపద మీ వద్ద ఉందని నేను ఊహించలేకపోయాను. .

 దయచేసి మీ వద్ద ఉన్న నిజమైన సంపదను పొందే మార్గం చూపండి !"


ఫకీరు ఇలా అన్నాడు, "ఆ సంపదే ధ్యానం, ఇప్పుడు నీ వద్ద చాలా డబ్బు ఉంది, ఇంక నీకు డబ్బు అవసరం లేదు. ఇప్పుడు ఇంక నీ అంతరంగంలో ఉన్న గనిని త్రవ్వు, అది అన్నింటికంటే మించినది."


ఈ ప్రశ్న మనందరికీ కూడా - 


మనం ముందుకు సాగాలి ..... అనుభవాలన్నీ నిశ్శబ్దం అయ్యే వరకు ముందుకు సాగుతూ ఉండాలి .... 


భగవంతుని అనుభూతి కొనసాగుతున్నంత వరకు, ద్వంద్వత్వం ఇంకా ఉనికిలో ఉన్నట్లుగానే సూచిస్తుంది -

దర్శించువారు - దృశ్యం రెండూ ఉన్నట్లే.


ఆ అనుభవం కూడా పోయినప్పుడు సమాధి స్థితి లభిస్తుంది. అప్పుడు దృశ్యము లేదు, దర్శించువారు లేరు, ఏమీ ఉండదు. ఒక నిశ్శబ్దం ఉంది,  ఆ శూన్యంలో, అవగాహన యొక్క దీపం ప్రకాశిస్తుంది. అదే అంతిమ స్థితి, అదే సమాధి.




ధ్యానంలో, మనం మొదట స్వీయ-సంతృప్త స్థితికి చేరుకుంటాము, తరువాత ఆత్మతో సన్నిహితంగా రావడం ద్వారా, శాంతి యొక్క వాస్తవ అనుభవాన్ని మొదటిసారిగా పొందుతాం.

                  స్మరణం.. ధ్యానం..తపస్సు,  అంతర్గత ప్రకాశాన్ని పెంచుతాయి, ఆత్మను సుసంపన్నం చేస్థాయి. భగవత్సాక్షాత్కారం లభింంపజేస్తాయి.


‘నీలోకి’ నీ ప్రయాణం ..


వేదాంతంలో కస్తూరీ మృగం గురించిన ప్రస్తావన ఉంటుంది.


కస్తూరి మృగం అంటే ఏమిటి? అదెలా ఉంటుంది?కస్తూరి మృగం ఒకరకమైన జింక. సీజన్‍ వచ్చినపుడు దాని బొడ్డు ప్రాంతం నుంచి ఒకరకమైన ద్రవం ఊరుతూ ఉంటుంది. అది మదపు వాసనగా ఉంటుంది. అప్పుడు ఆ వాసన ఎక్కడి నుంచి వస్తున్నదా అని ఆ జింక వెదకడం మొదలుపెడుతుంది. ఆ వాసన తన వద్ద నుంచే వస్తున్నదని అది ఎంతకీ గ్రహించలేదు. ఆ అన్వేషణలో అలా అడవి అంతా తిరిగీ తిరిగీ చివరికి ఏదో ఒక పులి నోట్లో అది పడిపోతుంది. ప్రాణాలు కోల్పోతుంది. వేదాంత గ్రంథాలలో ఉన్న ఈ కథ చాలా కొద్దిమందికి మాత్రమే తెలుసు


మనిషి కూడా తనలోనే ఉన్న ఆత్మను తెలుసుకోలేక లోకమంతా ఇలాగే వ్యర్థంగా తిరుగుతూ ఉంటాడు. పుణ్యక్షేత్రాలనీ, తీర్థయాత్రలనీ అనవసరంగా తిరిగి డబ్బునీ, కాలాన్ని వృథా చేసుకుంటూ ఉంటాడు. నిజానికి వీటివల్ల పెద్దగా ఆధ్యాత్మిక ఉపయోగం అంటూ ఏమీ ఉండదు.


పాండవులు తీర్థయాత్రలకు వెళ్తూ కృష్ణుడిని కూడా తోడు రమ్మని పిలుస్తారు. సాక్షాత్తు భగవంతుడైన కృష్ణునికి తీర్థయాత్రల అవసరం ఏముంది? ఆ సంగతి మాయా మోహితులైన పాండవులకు తెలియదు. కనుక కృష్ణుడిని కూడా తమలాగే మామూలు మానవుడిగా వారు భావించి తీర్థయాత్రలకు రమ్మని ఆహ్వానిస్తారు. ఆయన చిరునవ్వు నవ్వి వారికి ఒక దోసకాయ ఇస్తాడు.


‘నా ప్రతినిధిగా దీనిని తీసుకుని వెళ్లి మీరు మునిగిన ప్రతి గంగలోనూ దీనినీ ముంచండి’ అని కృష్ణుడు పాండవుల చేతిలో దోసకాయ పెడతాడు. వారు అలాగే చేసి తీర్థయాత్రలు ముగించి తిరిగి వస్తారు.


అప్పుడు ఏర్పాటు చేసిన విందులో అదే దోసకాయతో వంటకం చేయించి వారికి వడ్డింప చేస్తాడు కృష్ణుడు. ఆ వంటకం పరమ చేదుగా ఉంటుంది.

‘అదేంటి బావా! ఇది చేదు దోసకాయ. కటిక విషంలాగా ఉంది. ఇలాంటి వంటకం చేయించావేమిటి?’ అని పాండవులు కృష్ణుడిని అడుగుతారు.

దానికి కృష్ణుడు నవ్వి, ‘బావా ఎన్ని గంగ లలో మునిగినా దీని చేదు పోలేదు చూశావా?’ అంటాడు.


ఎన్ని తీర్థయాత్రలు చేసినా మనిషిలో మౌలికంగా ఎటువంటి మార్పూ రాదని కృష్ణుడు ఈ సంఘటన ద్వారా వారికి సూచించాడు. ఆధ్యాత్మిక జీవితంలో ఇది అత్యున్నతమైన సత్యం.


మనిషి ప్రయాణం బయటకు కాదు. లోపలకు జరగాలి. యాత్ర అనేది బయట కాదు. అంతరంగిక యాత్రను మనిషి చెయ్యాలి. ప్రపంచమంతా తిరిగినా చివరకు మనిషి ఆధ్యాత్మికంగా ఏమీ సాధించలేడు. అదే తనలోనికి తాను ప్రయాణం చేస్తే ఉన్న గదిలో నుంచి కదలకుండా జ్ఞానాన్ని పొందవచ్చు.


పాతకాలపు మహర్షులు దేశాలు పట్టుకుని ఎప్పుడూ తిరగలేదు. ఒకచోట స్థిరంగా కూర్చుని తపస్సు చేశారు. జ్ఞానసిద్ధిని పొందారు.


జ్ఞానం ఎక్కడో బయట దొరికే వస్తువు కాదు. అది మనలో అంతర్లీనంగా ఉన్న శక్తి. దానిని గుర్తించి, కనిపెట్టి మసులుకునే వారే విజ్ఞులు.


భగవాన్‍ రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, ఇంకా ఎందరో మహా యోగులు ఉన్న చోట నుంచి కదల కుండానే అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించారు. అరుణాచలమే తన ఆశ్రమంగా చేసుకుని రమణ మహర్షి జ్ఞానసిద్ధి పొందారు.


జ్ఞాన మార్గాన్ని చూపిన మన పూర్వికులు మంచి మార్గాన్ని ఉపదేశించారు మనకు ఆత్మసాక్షాత్కారాన్ని పొందిన యోగుల ఉన్నారు.


ప్రయత్నం చేస్తే మనమూ అలా కాగలం. కానీ, మనపై మనకు నమ్మకం తక్కువ. ఇంకా జ్ఞానం, దేవుడు.. ఎక్కడో ఉన్నారని నమ్ముతూ దేశాలు తిరిగే అమాయకత్వం మనది.

ఆత్మ , దానిని గ్రహించడం వంటి విషయాలు అంత సులభతరం కావు. నిరంతర సాధన అనుష్ఠానాల ప్రయత్నం తక్షణమే ఫలితం కానరాని స్థితిలో ఓర్పు, పలువురు దీనిని సాధించారు కనుక నేను కూడా చేయగలననే ఆత్మవిశ్వాసం ఉండాలి.

       సర్వం శ్రీ సాయి నాధార్పణ మస్తు...



4 comments:

భారతి said...

నిజానికి చాలా కాలం తర్వాత ఓ మంచి పోస్ట్ చదివాను. అద్భుతః

sri said...

chaalaa chaalaa baavundi

రుక్మిణిదేవి said...

VS garu..emi vraasinaa adi చిన్నదిగా ఉంటుంది..సరిపోదు..అందువల్ల ఒక వాస్తవాన్ని చూపించిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు..

Vanitavanivedika.blogspot.com said...

శ్రీ గారూ, రుక్మిణి గారూ, భారతి...మీ చక్కటి స్పందనలకు నా ధన్యవాదములు...