Wednesday, November 10, 2021 By: visalakshi

భావదాస్యం..

 #దయచేసి ఈ వ్యాసాన్ని అందరూ చదవండి...🙏🙏🙏 #ప్రస్తుత కాలానికి ఎంతో అవసరమైనది.... 

#వీలైనంత మందికి కూడా షేర్ చేయండి... 

#ఇంత గొప్ప వ్యాసాన్ని ప్రచురించిన ఋషిపీఠం వారికి నమో నమః🙏🙏


బొట్టు జారిపోతోంది...

'కట్టు' మారిపోతోంది!


కూరుచున్న కొమ్మలను 

కూలదోయుచున్న దెవరు? 

మూలం తెలియక మాయల 

జాలంలో పడినవారు.... 

మారీచుని భూతం కని 

మదనుడన్న వారెవరు? 

ఎంగిలి చదువుల ముంగిట 

చతికిల పడి ఉన్న వారు! 


గలగలా కబుర్లు చెప్పుకుంటూ వారు నలుగురూ బస్ స్టాప్ వద్దకు నడచి వచ్చారు. బహుశా ఆ నలుగురూ ఒక జట్టు కావచ్చు! పసితనం ఇంకా తొలగని మిసిమితనం వారి వదనారవిందాలలో ప్రస్ఫుటిస్తోంది. సందేహం లేదు, వారంతా ఇంటర్మీడియట్ విద్యార్ధినులే. ఇలాంటి జట్లు బస్ స్టాప్ సమీపంలో చాలా కనిపిస్తున్నాయి. కళాశాలల నుంచి ఇళ్లకు బయలుదేరిన వారంతా అక్కడ చేరిపోయారు. 


ఆ నలుగురూ ఒక 'శీతల పానీయశాల' వద్దకు వచ్చి నిలబడినారు. కొట్టువాడు రెండు పెద్ద గ్లాసులు నిండా 'పెప్సీ' పానీయం పోశాడు. ఇద్దరు అమ్మాయిలకు అందించాడు. ఇద్దరు బాలికలే కొన్నారు. మిగిలిన ఇద్దరి వద్ద పైసలు లేవేమో? ఉన్న డబ్బు 'పానీపూరీ' కొనడానికో 'బేల్పూరీ' తినడానికో ఖర్చు పెట్టేశారేమో? లేదా 'పెప్సీ' కొనడం వారిద్దరికీ ఇష్టం లేదేమో.... 'పెప్సీ' గ్లాసులు అందుకున్న అమ్మాయిలిద్దరూ నిలబడినారు. అందుకోని పిల్లలు ఇద్దరూ బెంచిమీద కూచున్నారు. ఒక అమ్మాయి గ్లాసులోని పానీయం కొంచెం తాగింది. ఆ తరువాత చాలా జాగ్రత్తగా ఆ గ్లాసును కూర్చున్న బాలికకు అందించింది. ఆమె కూడ కొంచెం తాగి, పక్కనున్న నాలుగవ అమ్మాయికి అందించింది. ఆ నాలుగవ బాలిక కూడ తాగి మళ్లీ మొదటి అమ్మాయికి ఇచ్చింది. అలాగే పానీయం కొన్న రెండవ అమ్మాయి కూడ కొనని ఇద్దరికీ తన ఎంగిలి పానీయం రుచి చూపింది. వారు తాగిన దాన్ని మళ్లీ తాను తాగుతోంది.... 


ఇలా ఒకరి ఎంగిలి మరొకరు తాగడం, తినడం ఇప్పుడు భలే ఫ్యాషనైపోయింది. ఇలా చేయడం "ఆత్మీయత"కు చిహ్నంగా, స్నేహానికి పరాకాష్ఠగా ప్రచారం జరిగిపోతోంది. "అయినా! ఎంగిలి ఏమిటి?? ఎక్కడుంది?? " అని ఎదురు ప్రశ్నలు కూడ దూసుకొని వస్తున్నాయి. 


"రెండు గ్లాసుల పానీయాన్ని నాలుగింటిలో పంచుకొని తాగవచ్చు కదా?" అని అడిగి చూడండి "అదంతా పూర్వ కాలం నాటి మూఢాచారం. ఇది కంప్యూటర్ యుగం..." అన్న సమాధానం కూడ వచ్చేస్తుంది! 


బస్సు ఎక్కిన వారంతా 'ఎంగిలి టిక్కెట్లు' కొనడం తప్పని సరి. మొదట నోటిలో వేలుపెట్టుకున్న తరువాత మాత్రమే కండక్టర్ గారు మనకు టిక్కెట్టు చింపి ఇస్తాడు. ఘరానా హోటళ్ళలో 'సాంబారు'ను 'సీజనింగ్' చేసే 'కిచెన్ మాస్టర్' (వంటవాడు అనడం అవమానకరం) గరిటెలో పులుసును తీసుకొని చేతిలో పోసుకొని నాకుతాడు. చెయ్యి కడగడు. ఒక్కొక్కసారి, మిగిలిన ఎంగిలి సాంబారును 'స్టైల్' గా పొయ్యిమీద ఉన్న పులుసు గిన్నెలోకి విదిలించి పారేస్తాడు! కళాశాలల హాస్టల్ల మెస్లలోకి సైతం ఇప్పుడిప్పుడే ఈ 'ఎంగిలి సాంబార్' దిగుమతి అవుతోంది మరి. 


ఇతర దేశాల నుంచి దిగుమతి అయిన మతాలవారు. ఆ విదేశీయ మతాలను స్వీకరించిన మనవారు శతాబ్దుల పాటు ఇలా "సామూహిక ఉచ్ఛిష్ట" పద్ధతులను పాటించారు. పాటిస్తే పాటిస్తారు. కానీ స్వజాతీయ మతాలవారికి సైతం 'ఎంగిలి పద్ధతి అంటురోగంలా వ్యాపించి పోతోంది. సనాతన ధర్మ నిబద్ధులు విజాతీయ మ్లేచ్ఛ సంప్రదాయాల పట్ల ఎందుకు మోహం పెంచుకుంటున్నారు?


"వేలుపులటె నాకంటెను

వేలుపు మరి ఎవ్వడంచు వికవిక నగి, మా 

వేలుపుల గోడపై ఓ 

హేలావతి! నీతనూజు డెంగిలిపూసెన్!" 

అంటూ ఆనాడు, ద్వాపర యుగంలో గోపకాంతలు యశోదమ్మ దగ్గర వాపోయారు. చిన్ని కృష్ణుని 'ఆగడాల' లో ఇలా 'ఎంగిలి పూయడం' ఒకటి. "పసిపిల్ల వాడు కదా. ఎంగిలి పూస్తే పూశాడులే!" అని గోపెమ్మలు ఎందుకు ఊరుకోలేదు? ఎందుకంటే, 'ఎంగిలి' ని 'మంగళం'గా స్వీకరించడం భారతీయతకు వ్యతిరేకం కాబట్టి! తండ్రీ కొడుకులు, తల్లీ కూతుళ్లు సైతం ఒకరి 'ఎంగిలి' మరొకరు తినడం, తాగడం భారతదేశంలో అనాదిగా నిషిద్ధం! 


ఒక పల్లె నుండి కొంత మంది జానపదులు ఒక పట్టణానికి వెళ్లారు. మధ్యాహ్నమైంది. ఆ గ్రామీణులు భోజనం చేయడానికై ఒక 'హోటల్' కు వెళ్లారు. ఒక 'టేబిల్' చుట్టూ కూచున్నారు. భోజనం చేయడం ఆరంభించారు. కానీ పక్కన ఉన్న మరో బల్ల వద్ద కనిపించిన దృశ్యం చూసి వాళ్ళకు డోకు వచ్చిందట. వాంతి అవుతుందేమోనని భయపడినారు. వారంతా అర్ధాంతరంగా లేచివచ్చేశారట - బిల్లు చెల్లించి! 


పక్క టేబిల్ వద్ద వారికి కన్పించిన దృశ్యం ఏమిటి? నలుగురు వ్యక్తులు ఆ టేబిల్ వద్ద కూర్చున్నారు. వారంతా విదేశీయ మతం స్వీకరించిన వారు. ఆ విధర్మీయులు నలుగురూ తమ కంచంలోనుండి తింటున్నారు. ఒకరు, మిగిలిన ముగ్గురి కంచాలలోని పదార్థాలను సైతం తింటున్నారు. ఒకరి ఎంగిలి కంచంలో నుండి మరొకరు మెక్కుతున్నారు. బల్లమీదంతా ఈ 'సామూహిక ఉచ్ఛిష్ట భక్షణ అవశేషాలు' నిండిపోయాయట. అది వారి మతం, వారి పద్ధతి. ఈ విదేశీయ మ్లేచ్ఛ ఆచారం ఆ జానపదులకు నచ్చలేదు. అసహ్యం వేసింది. ఎందుకంటే, ఆ గ్రామీణులంతా హిందువులు.


ఆ జానపదులలోని ఒక వృద్ధుడు ఇంకా ఇలా వివరించాడు ".....మనం ఒకరి ఎంగిలి మరొకరు తినము. అంతేకాదు ఒకరి ఎంగిలిని మరొకరు తింటూ ఉంటే చూడలేం కూడ! బిచ్చగాడికి సైతం మనం ఎంగిలి అన్నం పెట్టం, కుక్కకు కూడా ఎంగిలి కూడు వెయ్యం...." ఇలా 'ఎంగిలి'ని నిరసించిన వారు వేద పండితులు కాదు, విదేశీయమైన 'ఎంగిలి' చదువులు వంట బట్టని సామాన్య గ్రామీణులు, సాదా సీదా హిందువులు!


దేవుడికి నైవేద్యం పెట్టిన తరువాత భూత యజ్ఞం చేయడం కూడ హిందూ జీవన పద్ధతి. సనాతన ధర్మం నిర్దేశిస్తున్న పంచయజ్ఞాలలో భూతయజ్ఞం ఒకటి. ఇది నిత్యవిధి. 'బలిహరణం' పెట్టడం కూడ భూతయజ్ఞమే. ఈ 'బలిహరణం' కుక్కకు, అవుకు, జలచరాలకు, పక్షులకు వేయవచ్చు. ఇప్పుడు ఇలా భూతతృప్తి చేసిన తరువాతనే మనం భోజనం చేయాలన్న సనాతన ఆచారాన్ని నగరాలలోని అత్యధిక హిందువులు మరచిపోయారు. కొంతమంది కేవలం పండుగలప్పుడు మాత్రం 'బలిహరణం' పెడుతున్నారు. బూట్లు కట్టుకొని టేబుల్ ముందు కూచోని నడుము వంగకుండా చెంచాలతో ఆరగించే నవ నాగరికులు మనవన్నీ మరచిపోతున్నారు.


విదేశీయమైన ఎంగిలి సంప్రదాయాలను 'కల్చర్' అనుకొని మురిసి పోతున్నారు. అలా 'బలిహరణం' వేయడం మనం తినక పూర్వం జరిగే నిత్యవిధి. ఈ 'బలిహరణ' ఓదనం 'ఎంగిలి ముద్ద' కాదు, కారాదు. అన్నం పెట్టలేక పోతే గోధుమలను బియ్యపు గింజలను సైతం ఒక గుప్పెడు పక్షులకు బలిహరణం పెట్టవచ్చు. పొలాలలో బువ్వతినే రైతన్నలు, గ్రామీణులు మాత్రం నిత్యం భూతయజ్ఞం చేస్తున్నారు. చూసివస్తే తెలుస్తుంది. మొదటి ముద్దను తుంచి (ఎంగిలి కాకపూర్వం) ఎదురుగా ఉండే కుక్క ముందుకు విసురుతారు. లేదా దూరంగా పక్షులకు విసిరివేస్తున్నారు. మరోసారి కుక్కకు పెట్టాలనుకుంటే 'బుట్ట' లోని 'ఎంగిలికాని' ముద్దలను పెడతారు కానీ, తాము తింటున్న 'తట్ట'లోని ఎంగిలి ముద్దలు వేయరు. ఇలా 'ఉచ్ఛిష్ట భోజన' నిషేధం అక్షరాలురాని జానపదులలో సైతం అనాదిగా అభివ్యాప్తమై ఉంది. కానీ అక్షరాలు నేర్చిన వారు ఈ సనాతన పద్ధతులకు దూరమైపోతున్నారు. ఇదంతా చెబితే చాలా మందికి బ్రహ్మాండమైన కోపం కూడ వచ్చేస్తుంది. 


ఒకే 'టిఫిన్' డబ్బాలోని అన్నాన్ని ఒకరి తరువాత మరొకరు తింటున్నవారు ఆగ్రహించక ఏం చేయగలరు?


మంగళకర భావాలను పరస్పరం పంచుకోవడం, మంచి సంస్కారాలను సమష్టిగా ఆచరించడం సనాతన ధార్మిక జీవన రీతి. కాని ఎంగిలి తినడం కాదు! ఒక వ్యక్తి తన ఎంగిలి అన్నాన్ని సైతం మరోసారి తినరాదని వేద శాస్త్ర పురాణాలు చెబుతున్నాయి. "సహ నౌ భునక్తు" "ఇద్దరం కలిసి తిందాం" అన్న ఆత్మీయతను నేర్పించిన సంస్కృతికి "సకల లోకాల సుఖం కోరిన" జాతీయ రీతికి స్నేహం గురించి, మమకారం గురించి విదేశీయులు నేర్పించాలా? మ్లేచ్చుల 'ఎంగిలి'ని, ఎంగిలి పద్ధతిని మనం స్వీకరించాలా? నీరు లేక శౌచక్రియలు జరుపుకోలేని ఎడారులలో పుట్టిన మతం, నీళ్ళు ఉన్నా చలికి భయపడి శౌచక్రియలు జరుపని ప్రాంతాలలో పుట్టిన మతం ఇలాంటి విదేశీయ మతాలవారు ఎంగిలి తిన్నారు. తింటున్నారు. స్వజాతీయ మతాల వారికి అదంతా 'ఫ్యాషన్' కావడం ఈ దేశపు దౌర్భాగ్యం. 


"యదుచ్ఛిష్టం, అభోజ్యం యద్వాదుశ్చరితం మమ సర్వం పునంతు మాం ఆపః...." అనేది భారతీయుని జీవన పద్ధతి. "ఎంగిలి తిన్నందువల్ల, తినకూడనిది తిన్నందువల్ల, తెలియక చేసిన ఇతర చెడ్డ పనుల వల్ల వచ్చిన పాపం నుంచి నీరు నన్ను విముక్తిణ్ని చేయుగాక...." 


బాలుడికి ఉపనయనం చేసేటప్పుడు తల్లి, కుమారుడు ఒకే పళ్లెంలో భుజిస్తారు. పిల్లవాడు తల్లి ఎంగిలి తినడం కూడా అదే చివరి సారి. రజస్వల అయిన బాలికలు, పెళ్లయిన బాలికలు తల్లి ఎంగిలిని సైతం తినరు. పది పదిహేనులోపు వయసున్న బడిపిల్లలు సైతం ఒకరి ఎంగిలి మరొకరు తినరు. నిన్న మొన్నటి వరకు సజీవంగా ఉండిన ఈ సనాతన తత్వం నేడు పాశ్చాత్య నాగరికతా గ్రస్తమైపోతోంది. 'పదార్థ మోహం'తో బాల్య చాపల్యంతో పిల్లలు 'కాకెంగిలి' తినేవారు. ఒక మిఠాయిని కాని, తిను బండారాన్ని కాని పిల్లలు చేతితో తుంచలేనప్పుడు ఆ పదార్ధం చుట్టూ గుడ్డ చుట్టి కొరకడం, ముక్కలు చేయడం "కాకి ఎంగిలి". అది చిన్న పిల్లలు మాత్రమే ఈ పని చేసేవారు. ప్రస్తుతం కాకిని తోలేసి పెద్దలంతా 'ఎంగిలి'ని తినేస్తున్నారు. వారిని చూసి పిల్లలు కూడ నేర్చుకుంటున్నారు. మళ్లీ ఎప్పుడో.... "ఎంగిలి తినడం, తాగడం ప్రమాదకరం, రోగాలు వ్యాపిస్తాయి సుమా!" అంటూ పాశ్చాత్య దేశాలలో శాస్త్రీయ ప్రచారం మొదలైపోతుంది. అప్పుడు కానీ మన విద్యావంతులు ఎంగిలి తినడం మానరేమో! మన ఉత్కృష్ట సంస్కృతిని ఉచ్ఛిష్ట నాగరికత మింగివేస్తోంది! 


రైల్లో బస్సుల్లో ఆసీనులైన వారు 'ఉర్లగడ్డ ఉప్పేరి' (పొటాటో చిప్స్) ప్లాస్టిక్ పాకెట్లను నోటితో కొరికి చింపుతున్నారు. తరువాత ఆ ఎంగిలిని అందరికీ పంచుతున్నారు. సంప్రదాయ భోజన పదార్ధాలను మరచి "బ్రెడ్ బటర్ జామ్, పఫ్, వేఫర్స్" లను మరిగినవారు ఇళ్లలోనే చాలా 'స్టైల్'గా "బ్రేక్ఫాస్టు"లు చేస్తున్నారు. ఈ "బ్రేక్ఫాస్ట్"ల సమయంలో కొందరు మహిళలు "బ్రెడ్డుకు బట్టర్" రాస్తూ మధ్యలో వెన్నను నాలుకలకు సైతం రాసుకుంటున్నారు. ఆ ఎంగిలి వేళ్ళతోనే బ్రెడ్డును అందరికీ 'సర్వ్' చేస్తారు.


ఎవడైన పల్లెటూరి అతిథి వచ్చాడనుకోండి వాడికి అక్కడ 'నరకం' కనిపిస్తుంది. నగరాలలో నిగనిగలాడిపోతున్న నాగరికత ఇది!


అదిగో అక్కడ చూడండి! అల్ట్రా మోడరన్ టీ కొట్టువాడు, బహిరంగంగానే పాల పాకెట్టులను నోటితో కొరికి చింపి పాలను గిన్నెలోకి పట్టిస్తున్నాడు....


ఎంగిలి తినడమే కాదు, ఎంగిలి పద్ధతులెన్నో మన జాతీయ జీవనంలో తిష్టవేసుకొని ఉన్నాయి. బ్రిటిష్ దుండగుల పెత్తనం ద్వారా సంక్రమించిన 'ఎంగిలి' పద్ధతులు ఎన్నెన్నో ఉన్నాయి. మన విద్యా విధానం, రాజ్యాంగ వ్యవస్థ, సామాజిక మరో వ్యవహారాలు - ఇవన్నీ బ్రిటిష్ వారి ఉచ్ఛిష్టా వశేషాలే. గుడి ముందు రోడ్డు పై నడచి వెళుతున్నవారు, బస్సులో వెళుతున్నవారు, ఇతర వాహనాలనెక్కి వెళుతున్న వారు భక్తిని ప్రకటిస్తున్నారు. ఎలా? చేతిని పెదవులకు ఆనించి ఎంగిలి చేయడం ద్వారా మాత్రమే తమ భక్తిని వారు వెల్లడిస్తారు. రెండు చేతులు జోడించడం లజ్జాకరమట!! 


ఈ ఎంగిలి భక్తి ఎక్కడిది?? సీమల ఆవల నుండి మన దేశంలోకి చొరబడి వచ్చిన మ్లేచ్ఛుల ఆచారమిది! ఇప్పుడు మరో 'ఫ్యాషన్' వచ్చింది. అబ్బాయిలు ఎప్పుడో బొట్టు పెట్టడం మానేశారు. బొట్టు పెట్టుకుంటే మగపిల్లలు పిరికి వారై  పోతారని కొంతమంది తల్లులు సైతం నిర్ధారించారట. ఇప్పుడు విద్యాలయాలకు వెళుతున్న ఆడపిల్లలు సైతం నుదుట బొట్టు పెట్టుకొనడం మానేస్తున్నారు. కనుబొమ్మల మధ్య కనిపించకుండా అతిచిన్న చుక్కను పెట్టుకుంటున్నారు "అస్తినాస్తి విచికిత్సా హేతువులు" ఇప్పుడు ఆడపిల్లల బొట్టులు. నుదుట నుంచి జారిపోయి ఆ బొట్టు కనుబొమల మధ్యకు చేరింది. వేద ధర్మం నుండి జారిపోయినవారు, దిగజారిపోయినవారు మ్లేచ్ఛులు. మరి సనాతన ధర్మ నిబద్ధమైన బొట్టు జారిపోతూ ఉంది, కట్టు మారిపోతూ ఉంది. మనమంతా హిందూ పేర్లు మాత్రమే కలిగిన మ్లేచ్ఛులుగా జీవిస్తున్నామా?


ప్రముఖ సంస్కృత పండితుడు బ్రహ్మశ్రీ తెలకపల్లె విశ్వనాథశర్మ ఇలా వివరించారు. "ఫాలభాగం మధ్యలో - నుదుటి మధ్యలో - చర్మం వెనుక అతి సన్నని బెజ్జం ఉంది. ప్రతి వ్యక్తికీ ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఆ రంధ్రం అతి సున్నితమైనది, సూక్ష్మమైనది. బయటి వాతావరణ దుష్ప్రభావానికి ఆ రంధ్రం గురికారాదు. అందువల్ల నుదుటి మధ్యలో చందనంతో కాని కస్తూరితో కాని కుంకుమతో కాని బొట్టు పెట్టుకోవాలి." కానీ ఆ బొట్టు ఉండవలసిన చోట ఉండడం లేదు జారిపోయింది....


మన సంప్రదాయాలు సశాస్త్రీయమా? ఆశాస్త్రీయమా? తర్కబద్ధమా? అంధవిశ్వాస బద్ధమా? అన్న ప్రశ్నలు వేరే శాస్త్రం. కానీ హిందువులు - ఈ దేశంలో అనాదిగా జాతీయులైన సనాతనులు - విదేశీయ 'ఎంగిలి' సంప్రదాయాలను ఎందుకు స్వీకరించాలి. ఆ విదేశీయ పద్ధతులు తర్కబద్ధమా? శాస్త్రీయమైనవా? అని చర్చ చేసి స్వీకరిస్తున్నమా? భావ దాస్యంతో 'స్వ'భావాన్ని కోల్పోతున్నామా?


'తరం' తప్పితే చాలు

చతికిల పడు ఆచారం,

సదాచార ధ్వంసంతో

అధః పతనమౌ చిత్తం!

చిత్తవృత్తి చెడిపోయిన 

జాతికి తప్పదు దాస్యం,

దాస్యభావ 'గ్రహణం'పై

దాడిచేయుటే ధర్మం....!


#అక్టోబర్ 2007 ఋషిపీఠం మాస పత్రికలో 'హెబ్బార్ నాగేశ్వరరావు' గారు రచించిన ప్రత్యేక రచన".From..FB..

0 comments: