Thursday, October 27, 2016 By: visalakshi

సాయిభక్తి - పరమార్ధం

శ్లో" అనన్యా శ్చింతయంతోమాం ఏ జనా: పర్యుపాసతే!
   తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం!! ( 9అ ..22శ్లో) 


"నా భక్తుల ఇళ్ళలో అన్న వస్త్రాలకు లోటుండదు" అని శ్రీసాయి అభయమివ్వటం మనకు విదితం."అనన్యంగా నన్ను భజించేవారి, నిత్యమూ మనసారా నన్ను సేవించే వారి యోగక్షేమాలు నేనే చూస్తాను. ఇది నా వ్రతం" అనేది భగవద్గీతా వచనం. ఈ భగవద్గీతా వచనాన్ని ప్రమాణంగా తీసుకోమని శ్రీసాయి చెప్పేవారు.భక్తులకు అన్నవస్త్రాల కొరత ఉండదు..లౌకికంలో మానావమానాల లోభాన్ని వదిలేయండి. లోకుల ప్రశంసలకై తల ఒగ్గకండి. దేవుడి ద్వారం వద్ద గౌరవాన్ని పొందండి. ఆరాధ్యదైవం నా (సాయి) నామస్మరణలో మనస్సు లీనమగు గాక! జ్ఞాన భక్తికై దైవం ముందు చేయి చాపండి..భక్తి అనే దైవ ప్రసాదాన్ని పొందండి. అదే ధ్యేయముతో భజనలో లీనమవ్వాలి. అన్య విషయాలను విస్మరించుగాక!మనస్సు పరమశాంతికి పుట్టిల్లై తృప్తిగా నిశ్చయంగా భక్తిలో పారవశ్యం చెందు గాక!.




 సద్గురువు నా దైవం శ్రీసాయి నా భావనలలో సదా నాలోనే కదలాడే నా స్వామి నా మది తలపులలో తమ చేతిని నా తలపై ఉంచుతారు. విభూతితో పాటు ఆశీర్వాద పూర్వకంగా శిరస్సుమీద పెట్టగానే అంత:కరణ స్వానందంతో ఎగసి పడ్తుంది. కళ్ళనుండి ఆనంద భాష్పాల రూపంలో ప్రేమ కనురెప్పలు దాటి వరదలై ప్రవహిస్తుంది. గురుహస్త స్పర్శలోని కుశలత ఎంత అద్భుతమంటే ప్రళయాగ్నిలో కూడా దగ్ధం కాని సూక్ష్మదేహాన్ని ఆ హస్తస్పర్శ దహించి వేస్తుంది.(సూక్ష్మదేహం:- లింగదేహం, వాసనాయుక్త శరీరం, మనసు, బుద్ధి, పది ఇంద్రియాలూ, పంచప్రాణాలూ, ఈ పదిహేడు తత్వాలతో ఉంటుందీ దేహం. దాన్ని దగ్ధం చేస్తే ఆ జీవుడికి పునర్జన్మ ఉండదు.)





బాబా తమ కమలసుమదళంలాంటి చేతిని శిరస్సుపై పెట్టటంతోనే అనేక జన్మలనుంచీ సంతరించుకొన్న పాపాలు ప్రక్షాళనం అయిపోయి నా లాంటి సాయియొక్క ప్రేమిక భక్తులు పవిత్రులవుతారు.బాబాస్పర్శతో హృదయంలో అష్టసాత్విక భావాలు ప్రకటమవుతాయి.పారాయణ చేస్తున్నా, పురాణాలు చదువుతున్నా అడుగడుగునా బాబా కనిపిస్తారు. రాముడు కృష్ణుడు, వేంకటేశ్వరుడు....ఏ దేవాలయానికి వెళ్ళినా.. ఆ రూపాలలో బాబా దర్శనమిస్తారు.ఆహా జన్మ ధన్యము కదా!... కాయా, వాచా, మనసా శ్రీ సాయినాధునికి సాష్టాంగం చేస్తే ధర్మ అర్ధ కామ మోక్షాలనే నాలుగు పురుషార్ధాలను, కర్మ,జ్ఞాన యోగ, భక్తి- అనే నాలుగు మార్గాలతోనూ ఈశ్వరుడు ప్రాప్తిస్తాడు. మనసనే తోటలో భక్తి అనే నీటిని చల్లితే వైరాగ్యం మొలకెత్తుతుంది. జ్ఞానమనే పూలు విరగబూస్తాయి. కైవల్యమనే ఫలం లభిస్తుంది. జ్ఞానమయం విప్పారుతుంది. జనన, మరణాలు నిశ్చయంగా తప్పిపోతాయి.  

బాబా సత్య, జ్ఞాన, ఆనందయుక్తమైన మూడు స్వరూపాలుగా ఉండే పరమాత్ముడు. స్వయంసిద్ధుడు. ఏదో ఒక కారణాన్ని  నిమిత్తంగా పెట్టుకొని ఆయన తమ భక్తులకు శిక్షణ ఇవ్వటానికి పూర్ణత్వంతో జాగృతమై ప్రకటమైనారు.. "సర్వం ఖల్విదం బ్రహ్మ"(కనిపించేదంతా బ్రహ్మే) అంటే సర్వమూ  పరమాత్మ, మాయ, జగత్తు యొక్క ఐక్యతే అయి ఉంది. 





చిత్తంలో శాశ్వత సుఖశాంతులు ప్రాప్తింపచేసుకోవాలన్న ధ్యేయాన్ని పెట్టుకొని సమస్త ప్రాణుల్లోనూ పరమేశ్వరుణ్ణి చూడటమనే ఒక ఉపాసనే పరమపదప్రాప్తిని కలిగిస్తుంది.తత్వం అంటే అభేదజ్ఞానం. దాన్నే ఉపనిషత్తుల్లో బ్రహ్మజ్ఞానం అంటారు. పరమాత్ముని ఉపాసించటమన్నా అదే!, భక్తులు అనే భగవంతుడన్నా అదే! గురువు, బ్రహ్మ అని రెండు లేవు అన్న ఏకాత్మతాజ్ఞానమూ, భక్తీ కలిగాయంటే మాయను దాటటం ఎంతో సులభమవుతుంది. శ్రద్ధావంతులైన యోగ్య భక్తులు జ్ఞాన వైరాగ్యాలను ప్రాప్తింప చేసుకొని ఆత్మానందంలో నిమగ్నులౌతారు..పరమార్ధం పొందుతారు.

సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు 

0 comments: