Tuesday, September 30, 2014 By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 69

ఓం శ్రీ సర్వాధారాయ నమ:

శ్లో"  పరీత్య భూతాని పరీత్య లోకాన్

       పరీత్య సర్వా: ప్రదిశో దిశశ్చ/

      ఉపస్థాయ ప్రధమజామృతస్యాత్మ

      నాత్మాన మభి సం వివేశ//


భా:-    ఆకాశాది పంచభూతములందు, సూర్యాదిలోకాలలోనూ, పూర్వాది నాలుగు దిక్కులందు ఆగ్నేయాది దిక్కోణములందును పరమాత్మ నిరంతరం వ్యాపించి ఉన్నాడు. ప్రతి అణువణులో అంతర్యామి రూపంలో నిండి ఉన్నాడు.ఆ భగవంతునిలోనే సృష్టి రహస్యాలన్నీ ఇమిడి ఉన్నాయి. ఆ పరమానంద మంగళరూపుడే అమృతస్వరూపుడు. అతడే మోక్షప్రదాత.


శ్రీ సాయి సగుణబ్రహ్మ స్వరూపుడు 

 భగవంతుడు నిర్గుణుడు, సగుణుడు. 

భగవంతుడు అవతారానికి రాకముందు నిర్గుణుడు.ఏ రూపం ధరించినా సగుణుడు.

రెండూ బ్రహ్మమే అయినా ఒకటి సగుణబ్రహ్మ,రెండవది నిర్గుణబ్రహ్మ.

సగుణబ్రహ్మస్వరూపము పూజ్యనీయము.

నిర్గుణబ్రహ్మస్వరూపము నిర్గుణోపాసన అనగా మనమునందు ( పరమాత్మ సమీపాన కూర్చొని ) ధ్యానించుట . 

సాయి అవతారం సగుణం. సాయితత్వం సగుణ బ్రహ్మతత్వం. 

అరూపారాధన నిర్గుణం. కాని మనస్సు రూపాన్ని కోరుతుంది. ఒక రూపం కోసం మనస్సు ఆరాటపడుతుంది. భగవంతుడు ఒక్కడే అంటూనే ఇన్ని రూపాలు కల్పించడం మనిషి బలహీనత. విగ్రహంలో సాయిని చూడడం సాయి వెనుక రహస్యం,మనస్సును దాటితే కదా హృదయంలో ప్రవేశం!హృదయంలో చివరన ఆత్మ కదలాడుతుంది. సగుణ,నిర్గుణ తత్వాలు సామాన్యులకు అర్ధమయ్యేవి కాదు.


సగుణుడు,నిర్గుణుడుకూడాసద్గురువే.సద్గురువులోరెండుఅంశాలూఉంటాయి. ఎవరు ఏది కోరితే అదే లభిస్తుంది.ఎవరికి ఏది అవసరమో దానినే పొందగలరు.

సాయిబాబా భగవంతుడా! భక్తుడా! అవతారపురుషుడా! ఎవరు ఎలా అనుకున్నా సాయి కాదనరు. బాబా తన భక్తుల కోరికను మన్నించి, వారివారి భావాన్ననుసరించి తనను పూజించుటకెట్టి అభ్యంతరము జూపేవారుకాదు.అట్టి ఒక ఉదంతము:- 

 డాక్టర్ పండిట్ అనే ఆయన తాత్యానూల్కర్ కు మిత్రుడు.బాబా దర్శనం కోసం ఒకసారి షిర్డీ వచ్చాడు. సాయిని దర్శించి కొంచెంసేపు మశీదులో కూర్చున్నాడు. కేల్కర్ అతనికి మర్యాద చేసి ఆతిధ్యమిచ్చాడు.పూజ వేళకు దాదాబూటీ మసీదుకు బయలుదేరాడు. ఆయనతో డా. పండిట్ కలిసి బయలుదేరాడు. దాదాబూటీ సాయికి పాదపూజ చేసాడు. బాబాకు చందనం పూయుటకు ఎవరికి ధైర్యము ఉండేది కాదు.మహల్సాపతి బాబా కంఠమునకు చందనం పూసేవారు. అతనికి బాబాపైన భక్తి ఎంతో చనువు  అంతే ఎక్కువ.ఆ సమయములో మహల్సాపతి మసీదులో లేరు. డా.పండిట్ దాదా చేతిలోని చందనమును తీసుకుని బాబా నుదిటిపైన త్రిపుండ్రాకారముగ వ్రాసెను.అందరూభయభ్రాంతులైనారు.కానీబాబా కిమ్మనలేదు. ఆరోజు సాయంత్రం దాదాబట్ సాయిని ప్రశ్నించాడు భయం భయంగా.

బాబా! మీరు ఎవరినీ గంధం పూయడానికి అనుమతించరు గదా! పండిట్ అంత చనువుగా మీ నుదుట మూడు రేఖలు పెట్టుటకు ఏల ఒప్పుకున్నారు?

బాబా నవ్వి అన్నారు: "ఏం చేయను, పండిట్ నాలో తన గురువును చూచుకున్నాడు.తన గురువును తాను సేవించుకుంటే నేనెలా కాదనగలను చెప్పు?"ఆతని నిష్కల్మష భక్తి నన్ను కట్టి పడవేసినది." దాదాభట్ ఆ తరువాత పండిట్ ని ప్రశ్నించగా అతడు, బాబాను తన గురువు 'కాకా పురాణిక్' గా భావించి తన గురువునకొనరించినట్లు బాబా నుదిటిపై త్రిపుండ్రమును వ్రాసితిననెను.

భక్తుల అభీష్టం నెరవేర్చడం బాబాకు ఎంతో ఇష్టం వారు సభక్తికంగా ఎలా పూజించినా ఆమోదిస్తారు.స్వీకరిస్తారు.

సాయిబాబా మరియొక భక్తుని ఎట్లు ఆశీర్వదించెనో తదుపరి...సాయి సత్యవ్రత మహిమ ...టపాలో...సశేషం 

సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు 





0 comments: