Showing posts with label సాయి లీలలు. Show all posts
Showing posts with label సాయి లీలలు. Show all posts
Monday, October 16, 2017 0 comments By: visalakshi

శ్రీశ్రీశ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం-మానవజన్మ ప్రాముఖ్యము



ఈ విశ్వానికే అధిపతి అయిన భగవంతుడు కోటానుకోట్ల జీవులను సృష్టించినప్పటికీ ఆయనకు సంతృప్తి కలుగలేదు. భగవానుని అనంత శక్తిని అవి గ్రహించలేకపోయాయి. అందుచేత భగవంతుడు ప్రత్యేకముగా మానవుని సృష్టించి వానికి జ్ఞానమనే ప్రత్యేక శక్తిని ప్రసాదించాడు. జ్ఞానము సహాయముననే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు.ఈ కారణము చేతనే దేవతలు సైతము మానవజన్మను ఈర్ష్యతో చూచెదరు. వారు కూడా భూమిపై మానవజన్మమెత్తి మోక్షమును సాధించవలెనని కోరెదరు. శరీరముండుట చేతనే మానవుడు తన దేహము యొక్క జగత్తు యొక్క అనిత్యత్వమును గ్రహించి ఇంద్రియ సుఖముల పట్ల విరక్తి పొంది నిత్యానిత్యవివేకముతో కడకు భగవత్సాక్షాత్కారమునుపొందుచున్నాడు.  
మానవుడు భగవంతుని లీలలను, అద్భుతకార్యములను, మహత్యాలను జూచి పరవశమొందినప్పుడు భగవంతుడు మిక్కిలి సంతుష్టి జెంది ఆనందించును. అందుచే  మానవ జన్మ లభించుట  జన్మ సార్ధకము.



మానవ జన్మ యొక్క విలువను గ్రహించి ఈ దేహము నశ్వరమని..దేహానికి మరణం అనివార్యమని గ్రహించి జీవిత పరమావధిని సాధించుటకై విసుగు,విరామములేక రాత్రింబగళ్ళు కృషిచేసి ఆత్మసాక్షాత్కారమును సంపాదించవలెను. అహోరాత్రములు ఆత్మయందే ధ్యానము నిలువవలెను. ఈ మన ధ్యేయము సత్వరము ఫలించాలంటే సద్గురువు సాయినాధుని సాంగత్యములో అది సాధ్యము. ఆధ్యాత్మిక ఉపన్యాసములు ఎన్ని విన్ననూ, ఆధ్యాత్మిక గ్రంధములెన్ని చదివినను..తెలియరాని ఆత్మసాక్షాత్కారము సద్గురువు సాయినాధుని సాంగత్యములో సులభముగా పొందవచ్చును. ఆ జ్ఞానమునంతయు సద్గురువు చెప్పగలరు. వారి చర్యలు..సామాన్య సంభాషణలే మనకు మౌనప్రబోధములు. శాంతి, క్షమ, వైరాగ్యము, దానము, ధర్మము, మనోదేహములను స్వాధీనమందుంచుకొనుట, అహంకారము లేకుండుట మొదలగు శుభలక్షణములను సద్గురువు ఆచరణలో చూచి భక్తులు నేర్చుకొందురు. సాయిబాబా వారి పావనచరితములు భక్తుల మనములకు ప్రబోధము కలుగచేసి వారిని పారమార్ధికముగా ఉద్ధరించును. సద్గురువు సాయినాధుడు అట్టి మహా పురుషుడు. వారెప్పుడూ ఆత్మానుసంధానము నందే నిమగ్నులగుచుందురు. వారు స్థిరచిత్తులు. వారి చర్యలు నిగూఢములు. బాబావారి ప్రేమానురాగములు కొలువరానివి. స్వామి అనుగ్రహము ఇంతయని చెప్పుటకు అలవికానిది. బాబా వారి ఆదేశములలో అద్భుతమైన సందేశాలుంటాయి. అవి తెలుసుకున్నవారు ధన్యులు. 



 భక్తుల కొరకు మానవరూపమున అవతరించిన భగవతత్త్వమే సాయిబాబా. వారి కరుణ, అనుగ్రహము అద్భుతములు. వారే కరుణతో మన వంటి భక్తులను తమ వద్దకు చేర్చుకొనకుండిన వారి మహత్యమును తెలుసుకొనగల శక్తి యెవరికి గలదు? బాబావారు శుద్ధచైతన్యస్వరూపులు. విరాగులు, ముక్తులు, పరిపూర్ణులు. బాబా ఎల్లప్పుడు తమ ఆత్మస్వరూపమునందే లీనమై సర్వులకు హితము చేయుటయందు నిమగ్నమై యుండువారు. శ్రీసాయిబాబాను భక్తిప్రేమలతో స్మరించుటయే జీవన్మరణరూపమైన సంసారమనెడు చిక్కుముడిని విప్పు తరుణోపాయము. ఈ సాధనలో వ్యయప్రయాసలు లేవు. మన దేహేంద్రియములలో పటుత్వమున్నంత వరకు ప్రతి నిమిషమును ఈ సాధనమును అనుష్ఠించుటకు గురు సన్నిధిలో సద్గురువు చరణములను నమ్మి కొలువవలెను. మనయొక్క అంతరంగమున గల భక్తిప్రేమలను బట్టి సద్గురువు మనకు జ్ఞానమును, శాశ్వతానందమును ప్రసాదించును.



ద్గురువు సాంగత్యమున కలుగు మహిమ చాలా అద్భుతము. అది మన అహంకారమును, దేహాభిమానమును నశింపజేయును. చావుపుట్టుకలనే బంధములను కూడా నశింపజేయును. కేవలము హృదయ పూర్వకంగా సద్గురువును వంటి మహాత్మునాశ్రయించిన వారు మనలను భవసాగరము నుండి తరింపజేయుదురు. పూర్వజన్మ సుకృతము వలన శ్రీ  సాయిబాబా పాదములనాశ్రయించు భాగ్యము మాకు లభించినది. మసీదుగోడ కానుకొని  ఊదీమహాప్రసాదమును తనభక్తుల యోగక్షేమములకై పంచి పెట్టు సుందరస్వరూపుడు, ఈ ప్రపంచము యొక్క అభావమును చింతించువాడు, సదా పూర్ణానందములో మునిగియుండు వాడునగు శ్రీ సాయి పాదములకు సాష్టాంగనమస్కారములు చేయుచూ ...పరబ్రహ్మ స్వరూపులైన సాయినాధుడి కృప అందరికీ కలగాలని కోరుకుంటూ....



సర్వం శ్రీసాయినాధార్పణ మస్తు 








   
Friday, March 31, 2017 0 comments By: visalakshi

సాయి సత్సంగంలో బాబా ధర్మబోధ

  ఓం శ్రీసాయికృష్ణ పరబ్రహ్మణే నమ:

 శ్లో" యదా తే మోహకలిలం బుద్ధిర్వతితరిష్యతి!
    తదా గంతాసి నిర్వేదం శ్రోతవ్యస్య శ్రుతుస్య చ!! అ 2-52శ్లో


 భా:- ఎప్పుడు నీయొక్క మనస్సు అజ్ఞానమనెడు కల్మషమును దాటగలదో అప్పుడు వినదగిన అర్ధమునుండియు, విన్న అర్ధము నుండియు అనగా కర్మవిషయమునందు విరక్తిని పొందెదవు.






 సాధకుడు ప్రకృతికి పరమగు బ్రహ్మపదమును ఎందువలన పొందలేదో అది ఈ శ్లోకములో తెలుపబడినది. సాధకుని మనస్సు ఎంతవరకు ప్రాకృత విషయమనెడు మాలిన్యమును దాటలేదో, అనగా ప్రకృతికి పరమగు తురీయపదమును పొందలేదో ..అంతవరకు అతడు బద్ధుడే. ఎప్పుడు విషయవాసన నశించి నిర్విషయస్థితి గలుగునో అప్పుడే ఇదివరలో గురువులవలన లేక శాస్త్రముల వలన శ్రవణము చేసిన దాని యొక్క అర్ధము బోధపడును. అప్పుడు ఈ జ్ఞానస్థితికన్న అన్యముగా వినవలసినది మరియొకటి లేదని బోధ కలుగును. అనగా ప్రకృతి రహిత మగువరకు తత్వబోధము కలుగదు. 




 అనుభవపూర్వకంగా తెలుసుకున్న ఈ సత్యాన్ని.. నా అనుభవ వివరణ.....

 ఆగస్టు 2010 లో సాయిబాబావారి ఆశీర్వాదంతో సాయిప్రియ సత్సంగం మొదటి సత్సంగం సాయిప్రియ గృహమునందు ఏర్పాటు చేయుటకు మా, వారి.. కుటుంబాలు నిశ్చయించాము. అప్పుడు బాబాగారు సత్సంగమంటే ఎలా ఉండాలో తెలియజేసారు.  సాంప్రదాయ దుస్తులు ధరించాలి. సెల్ ఫోన్లు వాడరాదు. శభ్దము చేయరాదు. భక్తితో శ్రవణము చేయండి అని తెలిపారు. ఆరోజు సాయంత్రము 6 గ"లకు బాబాగారి సాయంసంధ్యా పూజతో, ఆరతులతో సత్సంగం మొదలయింది. భక్తులు ఒక 30 మందిదాకా వచ్చారు. ఓపెన్ హాలులో బాబాగారి చిత్ర పఠమును ఉంచి పూజ గావించి తదుపరి ముందు టపాలో నేను వ్రాసిన "కాణిపాక వరసిద్ధి వినాయకుని వృత్తాంతము"ను మా శ్రీవారు అందరికీ వివరించారు. అందరూ శ్రద్ధగా విన్నారు...బాబాగారి మహిమలను..లీలలను వారికి వివరిస్తున్నాము. ఇంతలో అందరూ చూస్తుండగా పవర్ పోయి ఆ ప్రదేశము చీకటిగా మారింది. ఇంతలో  బాబాగారి చిత్ర పటమునుండి పెద్ద వెలుగు.అందరూ విభ్రాంతితో చూస్తుండగా వెంటనే మరల పవర్ వచ్చింది. కాసేపు ఆ అద్భుతలీల గురించి భక్తులు పదే పదే చెప్పుకున్నారు. "ఒక పెద్ద వయసావిడ నేను అసలు సత్సంగానికి రాను అన్నాను.. మా అబ్బాయి రా పిన్నీ! అని తీసుకువచ్చాడు.. నా జన్మ తరించింది.. సాయిబాబాను ఇలా చూసే అవకాశం కలిగింది." అని ఆనందభాష్పాలతో చెప్పారు. సత్సంగములో ఒక అధ్యాయము బాబాగారి సచ్చరిత్రలో పఠించిన తదుపరి రెండవ సత్సంగమును మా గృహమునందు జరుపుటకు బాబా అనుమతిని తీసుకొని..బాబాగారికి అరిటాకులో పలహార నైవేద్యము గావించితిమి. మందిరము తలుపు తెరిచి చూసేసరికి   మందిరములో ఉన్న కాణిపాక వినాయకస్వామి మూర్తి అరిటాకులో ప్రత్యక్షం ...వారి చెంత బాదుషా.. బాదుషాలు ఆరతి సమయములో నైవేద్యము పెట్టాము. ఆ బాక్స్ లో బాదుషా... వినాయకస్వామి  వారి చేతి వద్ద.. ప్రసాదాల మీద సాయి విభూతి... భక్తులందరూ ఆ విషయమై ఆసక్తిగా చర్చించుకొనుచూ ఆ ప్రసాదాలను స్వీకరించి స్వామికి మోకరిల్లి ఆనందపారవశ్యముతో ఇళ్ళకు మరలారు. శ్రీవారు   కాణిపాక వినాయకస్వామి వృత్తాంతమును తెలియజేసారు కాబట్టి ఆ అద్భుత మహత్యం జరిగిందని మేము తలంచాము. 

 అలా ప్రతి సంర్భంలోనూ బాబాగారి మహత్యాలను అనుభవిస్తున్న నేను ఆ ఆనందపారవశ్యంలో అవగాహన లేక పరమార్ధాన్ని అందుకోలేకపోయాను. బాబాగారు ఏం చెబుతారా అని ఎదురు చూడడమే గాని చెప్పిన విషయాలలోని నిగూడార్ధాన్ని గ్రహించలేకపోయాను. 



ఆ వెలుగు మాకు జ్ఞానదీపమని.. మాలోని అజ్ఞానమనే చీకటిని పారద్రోలి జ్ఞానమనే వెలుగును సద్గురువు ప్రసాదించారనీ తెలుసుకోవడానికి నాకు దాదాపు  సం"లు పట్టింది. ఆ జ్ఞానదీపమనే నేత్రాలు ఇప్పుడిప్పుడే తెరిచాను. అందులకు బాబావారి దివ్య చరణములకు నా గౌరవ పూర్వకములైన ప్రణామములర్పిస్తున్నాను. "భగవంతుడు దివ్యత్వముగల  జ్ఞానస్వరూపుడు కావున జ్ఞానదృష్టితో చూడగలము."  బాబాగారి అనుగ్రహము వలన ఆ జ్ఞానదృష్టి  ప్రకాశమై  ఆ దివ్యత్వమును సందర్శించే భాగ్యమును కలుగజేసి ధన్యతను ప్రసాదించారు. 

 స్త్రీలలో భగవదంశము ఏడుపాళ్ళధికము గలదని శ్రీకృష్ణుడు భగవద్గీతలో ఉపదేశించాడు. అన్నీ నేనే ఐ ఉన్నాను అని తెలిపాడు.  భగవంతుడుపదేశించిన 1. కీర్తి, 2. శ్రీ, 3. వాక్, 4.స్మృతి, 5. మేధ, 6. ధృతి, 7. క్షమ...ఈ ఏడు గుణములను స్త్రీలు సంరక్షించుకొనవలెను. మేధాశక్తి, పుణ్యబుద్ధి, ధర్మబుద్ధి స్త్రీలు కలిగి ఉన్నారని భగవంతుడే ఉపదేశించగా పురుషులెట్లు లేదని చెప్పుచున్నారో తెలియకున్నది.  స్త్రీలకు జ్ఞానము వికసించుటకు తగిన విద్యయు, యౌవనకాలమువరకు బ్రహ్మచర్యము, బ్రహ్మనిష్ఠయు కలిగి యుండినగదా..స్త్రీలకు జ్ఞానయోగము. అట్టి అవకాశము లేక బాల్య వివాహములతో సంసారభారముతో ఆమెను బంధించి స్త్రీకి జ్ఞానములేదని వ్యర్ధపు మాటలు చెప్పిన ప్రయోజనమేమి? ఈ కలి యుగములో  మన సాయికృష్ణుడు  ప్రత్యక్ష పరమాత్ముడై మన అందరి హృదయాలలో, అంతా నేనే ఐ ఉన్నాను. అని తెలిపారు. స్త్రీలను అమ్మా అని సంబోధించేవారు. స్త్రీ ఎంత గౌరవంగా నడుచుకోవాలో బోధించారు. నిష్కల్మషంగా అందరినీ ప్రేమతో దయతో ఆదరించమని ప్రబోధించారు. విష్ణు, లలితా సహస్రనామ పారాయణ చేయించారు..శ్రావణలక్ష్మిని నేనే అని తెలిపి శ్రావణమాసపు వరలక్ష్మి వ్రతమును చేయించారు. స్త్రీ సహనంతో, ఓర్పుతో జ్ఞానమును కలిగి ఉండాలని ఉపదేశించారు.మన జీవనయాత్రలో విద్య, శ్రేష్ఠుల సాంగత్యం అనివార్యం. ఇవే భవసాగరం నుండి తప్పించి - మోక్షమార్గం వైపు నడిపిస్తాయి. 



 సత్సంగం ద్వారా జ్ఞానము, వివేకము కలిగి నిర్లిప్తంగా, విషయ వాసనలకు చిక్కుకోకుండా, మోహాన్ని త్యజించి మనస్సును నిర్మలంగా నిశ్చలం చేసుకొని మనస్సును పరమాత్మయందు లగ్నం చేయమని మొదటి సత్సంగంద్వారా బాబాగారు మాకు ఉపదేశించారని అర్ధమైంది. 

 సత్సంగం ద్వారా సర్వదా మహాత్ముల ప్రబోధాలను విని ఆకళింపు చేసుకొని ఆచరించాలి. మాయామోహాలనుండి విముక్తులై సద్గురువులను దర్శించి, స్మరించి, వారిని సేవించి..వారి ఉపదేశాలను పాటించి సదా పరమాత్మతత్వంతో భాసిల్లాలి.  




   లోక కళ్యాణార్ధం కర్తవ్యపాలనతో భక్తి, ధర్మ,తత్వ ప్రచారం చేస్తూ ధార్మిక పరమైన విలువలతో కూడిన సందేశాలను సత్సంగం ద్వారా ప్రబోధించమని బాబాగారి ఆదేశం. ఆ ఆదేశాన్ని నిర్వర్తించడంలో ఒక రెండేళ్ళపాటు అంతరాయాలు కలిగినా..సత్సంగం మాత్రం నిరంతరం హృదయాంతరంగాలలో  ప్రతినిత్యం  మాలో జరుగుతుంది .  మరల సత్సంగాలతో జనుల ముందుకు బాబా అదేశపాలనతో, ఆశీస్సులతో  మేము రానున్నాము. "శుభమస్తు" అన్న బాబాగారి ఆశీర్వాదముతో శ్రీ హేవళంబి నామ సంవత్సరంలో ఆషాడమాసం నుండి మరల సత్సంగాలు జరుపుటకై  శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం నిర్ణయం. 

 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు 






Tuesday, January 31, 2017 0 comments By: visalakshi

శరణం - స్మరణం

శ్లో"  కాయ వాంజ్మన:  కార్యముత్తమం 
       పూజనం జప  శ్చింతనం క్రమాత్.  (రమణ మహర్షి)


 భావం:- భగవంతుడు అనుగ్రహించిన దేహాన్ని పూజకీ, వాక్కుని జపానికీ, మనస్సుని ధ్యానానికీ వినియోగించాలి. ఇవన్నీ క్రమంగా ఒకదానికన్నా తరువాతది ఉత్తమం.




సిద్ధపురుషుల లక్షణాలు సాధకుల సాధనాలు అవుతాయి. అవి సంపాదించడానికి గొప్ప ప్రయత్నంతో అభ్యాసం చేయాలి. పాల కడుపులో నెయ్యి ఉంటుంది. కానీ దాన్ని తోడు పెట్టకపోతే మజ్జిగ ఉండదు. వెన్న కూడా ఉండదు. దానికి కొంత అవసరమైన ప్రక్రియ చేయవలసి ఉంటుంది. మజ్జిగ చిలకకపోతే వెన్న లభించదు. దాన్నైనా అగ్నిమీద కాచకపోతే రుచికరమైన నెయ్యి లభించదు. అలాగే సాధకులకు మొదట సంస్కారబలం కావాలి. తరువాత పూర్వాభ్యాసంతో లభించిన బుద్ధికుశలత కావాలి. అభ్యాసం లేకుండా చిత్తశుద్ధి కలుగదు. చిత్తశుద్ధి లేకుండా ఆత్మజ్ఞాన ప్రాప్తి కష్టమౌతుంది. కనుక స్వరూపస్థితి చేతికి చిక్కనంతవరకూ సాధకులు భగవద్భక్తిని వదలకూడదు. ఆత్మజ్ఞానమనే మందిరాన్ని నిర్మించటానికి, నాలుగు రకాల ముక్తులనే కలశాలు తళతళ మెరవటానికి, విరక్తి అనే పతాకం ఎగరటానికి భగవద్భక్తి అనే పునాది అవసరం.

స్వధర్మాచరణ అనే తపస్సు సాధనతో మానవదేహంలో చిత్తశుద్ధి కలుగుతుంది. అఖండ బ్రహ్మసిద్ధి కలుగుతుంది. సాధు సేవే ముక్తికి ఇల్లు. 

చక్కటి సద్వర్తనతో కేవలం శరీరపోషణకై భుజిస్తూ అన్య విషయాల్లో ఏ విధమైన ఆకాంక్ష లేకుండా భగవదనురక్తితో చరించు భగద్భక్తులు ధన్యులు. సాయిబాబా నామస్మరణను నిరంతరం ధ్యానించేవారి  అనుభవంలోని అపూర్వత, మహత్యం చూడండి.బాబా వారికి ఋణపడి వారిని గుర్తు పెట్టుకుంటారు.  స్వయంగా గురువు కూడా భక్తుల స్మరణ చేస్తారు. 

 సాయిబాబా నామం యొక్క అఖండ ఆవర్తనే మనకి నియమం, తపము, దానము. పదే పదే శిరిడీ వెళ్ళటమే మన తీర్ధాటన. ఆయనకి అనన్యంగా శరణు అనటం, "సాయి సాయి" అనే మంత్రాన్ని స్మరించటం, అనుష్టానం చేయటమే మన ధ్యానము, పురశ్చరణ. నిష్కపటంగా ప్రేమతో అనుసంధానాన్ని పెట్టుకొని ఆయన్ని పూజించి చూడండి. ఆయన అతర్క్యలీలలను హృదయంలో అనుభవించి చూడండి.

 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు



Wednesday, December 14, 2016 0 comments By: visalakshi

స్వాధ్యాయం

సమస్త ధర్మాలకు ఉత్పత్తి స్థానం వేదమే. చక్కని రీతిలో ధర్మశాస్త్రాలను అధ్యయనం చేయడమే స్వాధ్యాయం. ఆత్మ కళ్యాణం కొరకు ఆత్మచింతన చేయడం, ఈశ్వరభక్తి, ప్రణవ జపమందు శ్రద్ధ కలిగి ఉండడం మొదలైనవన్నీ స్వాధ్యాయంలోకి వస్తాయి. 




ముక్తి లేకుండా జీవిత పరమార్ధం లేదు. పరమార్ధం లేని జీవనం వ్యర్ధము. సుఖశాంతులతో త్యాగభావాలతో పూర్ణాయువు పొంది తొడిమ నుండి ఫలం వేరైనట్లుగా యోగి తన దేహం నుండి తనుకోరుకున్నాప్పుడు ఐచ్చికంగా ఆత్మను వేరుచేసే స్థితిని యోగధర్మంతో సాధించాలి. స్వాధ్యాయ తపస్సుల ద్వారా పొందే పూర్ణ ఫలమిదే.




 బాబాగారు ఒక సన్యాసికి ఏ విధంగా ముక్తిని ప్రసాదించారో సత్చరిత్రలో 31 అధ్యాయములో వారికి సద్గతిని ఎలా ఇచ్చారో వర్ణిస్తాను ....

ఓసారి మద్రాసులో నివసించే విజయానందుడనే సన్యాసి మద్రాసునుంచి మానససరోవరానికి వెళ్ళాలని, ఉప్పొంగే ఉల్లాసంతో బయలుదేరాడు. ఓ జపాను ప్రయాణీకుడి వద్ద మానససరోవరం మాప్ ని చూసి ఆ సరోవరం ను తప్పక దర్శించాలని దృఢనిశ్చయం చేసుకొన్నాడు. దారిలో శిరిడీ గ్రామం తగిలింది; సాయిబాబాకున్న దైవశక్తి గురించిన కీర్తిని విని ఉన్నాడు కనుక ఆయనని దర్శించుకోవాలన్న తీవ్ర ఇచ్చతో ఆ ప్రదేశాన్ని వెతుక్కుంటూ ఆ గ్రామానికొచ్చాడు. ఆ సమయంలో శిరిడీలో హరిద్వార్ కి చెందిన సోమదేవ్ స్వామీజీ.. భక్తబృందంతో ఉన్న ఆ సన్యాసిని సహజంగా కలవటం జరిగింది.అప్పుడు విజయానందుడు ఆ సన్యాసిని మానవ సరోవరం ఇక్కడికి ఎంత దూరముందని అడిగాడు. దానికా స్వామీజీ "గంగోత్రికి పైన యాభై మైళ్ళదూరం(ఎనభై కి.మీ) ఉంటుంది. అక్కడ బాగా మంచు కురుస్తుంది. ప్రతీ యాభై క్రోసులకీ భాష మారుతుంది. భూటాన్ లో ఉండే ప్రజల అనుమానాలతో పరదేశీయులకు చాలా బాధలు కలుగుతాయి." స్వామి నోటి ద్వారా ఈ సమాచారాన్ని విన్న సన్యాసికి  నిరుత్సాహం కలిగింది. అతని మనసు వికలమై చింతలో పడిపోయాడు.అప్పుడు సన్యాసి సాయిబాబా దర్శనం చేసుకొన్నాడు.వారి పాదాలకు సాష్టాంగం చేశాడు.మనసు ప్రశాంతిని పొందగా అతను అక్కడే ఆసనం వేసుకొని కూచుండిపోయాడు.భక్తులు బాబాకి చేస్తున్న సేవను చూస్తున్నాడు.అది ఉదయం వేళ జరిగే దర్బారు.మశీదులో భక్తులు కిటకిటలాడిపోతున్నారు.భక్తులు తీసుకొచ్చిన పూజాసామాగ్రినీ, విధిపూర్వకంగా వాళ్ళు బాబాకి చేసే పూజను చూసి అతను విస్మయం చెందాడు. బాబావారి పాదాలను జలముతో కడిగి, ఆయన కాలి బొటనవ్రేలిని ఉద్ధరిణిలోని నీటిలో ముంచి ఆ నీటిని తీర్ధంగా తీసుకొని శుద్ధభావంతో వాళ్ళు త్రాగుతున్నారు. కొందరు గంధం, సుగంధ ద్రవ్యాలను ఆయన దేహానికి పూస్తున్నారు. బాబా ఆ సన్యాసిని చూస్తూ కోపంతో "ఈ సన్యాసిని తరిమెయ్యండి. ఇతని సాంగత్యం పనికిరాదు "అన్నారు.బాబా అలా కోపంగా మాట్లాడినప్పటికీ సన్యాసికి ఆయన పట్ల ప్రేమ పెల్లుబికింది.తాను కూచున్నచోటునుంచి లేవలేదు. అ ప్రకారంగా ఆ సన్యాసి శిరిడీలో రెండు రోజులున్నాడు.అంతలో అతనికి తన తల్లి జబ్బుతో ఉన్నట్లు ఉత్తరమొచ్చింది. చాలా దు:ఖంతో తల్లిని కలవాలని అతని మనసుకనిపించి తన ఊరికి తిరిగి వెళ్ళాలని బాబా అనుజ్ఞకై జాబు చేత పట్టుకొని మశీదుకెళ్ళాడు. 

 "సమర్ధ సాయిమహారాజా! అమ్మని కలవాలని మనసు పీకుతోంది. దయతో నా ప్రయాణానికి అనుమతినిచ్చి నామీద కృపచూపండి"అంటూ సన్యాసి బాబా చరణాలు పట్టుకొన్నాడు.ఆమె అంతిమచూపు నాకు దక్కే అనుమతి ఇవ్వండి అని వేడుకొన్నాడు.




అయితే సాయి సమర్ధులు సర్వజ్ఞులు. సన్యాసికి ఆయువు తీరిపోయిందని ఆయనకు తెలుసు. కనుక అతనితో ఆయన...."తల్లిపై అంత ప్రేమున్నవాడివి ఈ సన్యాసి వేషం ఎందుకేసుకున్నావు? ఈ వేషానికి అహంకారము, మాయ, మమకారాలు శోభించవు.దు:ఖించకు. మనసులో ధైర్యం పెట్టుకో శరీరం ఎప్పటికీ నశ్వరమే. మరణం మన వెన్నంటే ఉంటుందని తెలుసుకొని శాస్త్రాల్లో చెప్పినది నీ ఆచరణలో పెట్టు. ఈ లోకంలో దేహం, భార్య, పిల్లలు మొదలైన విషయాల్లో నేను, నాది అన్న అభిమానం ఉంటుంది. దానివల్ల మూడు రకాల దు:ఖాలు ఉత్పన్నమౌతాయి.వీటిని ఐహిక అనర్ధాలంటారు. రెండవ అనర్ధం పారలౌకికమైనది. అంటే ఆముష్మికం. లోకులు కోరుకునే ఆ పరలోకం కూడా మోక్షాన్ని ప్రాప్తింప చేసుకోవటంలో అవాంతరాలను తీసుకొస్తుంది. సదా అధోముఖంగా ఉంటుంది. పరలోకంలో పుణ్యాన్ని సంపాదించలేము. పరలోక ప్రాప్తిలో నిర్భయత్వం ఉండదు. ఎందుకంటే పుణ్యం పూర్తయిపోతే అక్కడ్నుంచి కూడా కింద ఈ లోకంలో పడిపోయే భీతి ఉంటుంది. కనుక వాటిని పూర్తిగా త్యాగం చేస్తేనే అవి ఆనందాన్ని ఉత్పన్నం చేయటానికి ముఖ్య కారణాలవుతాయి. సంసార వైరాగ్యం పొంది, హరి చరణాల్లో స్థిరంగా లీనమై హరి భజన, నామస్మరణల్లో నిమగ్నమైపోతే ఆయన సంకటాలను పోగొట్టి మనలను రక్షిస్తాడు.నీ పూర్వజన్మ పుణ్యం చాలా గొప్పది. కనుకే ఈ స్థలం మీది ప్రీతితో నీవిక్కడకొచ్చావు. నీ జన్మని సార్ధకం చేసుకో. రేపట్నుంచి శ్రీమద్భాగవత పురాణాన్ని మనస్పూర్తిగా స్వాధ్యయనం చేయి. త్రికరణశుద్ధిగా మూడు సప్తాహాలు పారాయణ చేయి. కోరికలన్నింటినీ త్యజించి మళ్ళీ మళ్ళీ లోతుగా పరిశీలించాలన్న తపనతో ఈ గ్రంధాన్ని శ్రద్ధగా చదువు. అప్పుడు భగవంతుడు ప్రసన్నుడై సమస్త దు:ఖాలను అంతం చేస్తాడు. మాయామోహాలు శాంతిస్తాయి. నీకు ప్రపంచంలో ఆసక్తి తొలగిపోతుంది."  అని అన్నారు.






మరునాడు ఉదయాన సన్యాసి విజయానందుడు కాలకృత్యాలు తీర్చుకొని,స్నానాదికాలు పూర్తిచేసి బాబాకి దోసెడు పూలు సమర్పించి ఆయన చరణ ధూళిని తలపై ధరించాడు. తరువాత సంస్కృత భాషలోని శ్రీమద్భాగవత పురాణ గ్రంధాన్నితీసుకొని లెండీబాగ్ లోని చక్కని ప్రదేశంలో ఆసనం వేసుకొని బాబాని స్మరించి పారాయణ ప్రారంభించాడు. రెండు సప్తాహాలు భక్తితో పూర్తి చేశాడు. మూడవ సప్తాహం చేస్తున్నప్పుడు ఒక్కసారిగా అతనికి అస్వస్థత కలిగింది. శక్తి లేక సప్తాహం అలాగే అసంపూర్తిగా వదిలేసి అతను వాడాకి తిరిగి వచ్చేశాడు. అతికష్టం మీద రెండు రోజులుండి, మూడవరోజు ఉదయం ఆ సన్యాసి అస్తమించాడు. శారీరక, ఐహిక విషయాలపై ఆసక్తి నశించిపోయి దేహ ముక్తుడైనాడు. సన్యాసి మరణం గురించి బాబాకి తెలిపినప్పుడు ఆయన భక్తులతో ఆతని దేహాన్ని రోజంతా ఉంచండి. అని చెప్పారు. ప్రభుత్వ అధికారుల విచారణ అనంతరం యధావిధిగా ప్రేత సంస్కారం అయిపోయింది. సరైన స్థలంలో అది పాతిపెట్టబడింది. సన్యాసికి సద్గతి ఇవ్వటం అనే సాయిబాబా కార్యం పూర్తయింది. సాయి సమర్ధులు సనాతన బ్రహ్మ. ఆయన మాటలు ఖచ్చితంగా నిశ్చయపూర్వకమైనవి.  


 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.


Saturday, December 10, 2016 0 comments By: visalakshi

ధ్యాన యోగము

శ్లో" సుహృన్మి త్రార్యుదాసీన  మధ్యస్థద్వేష్యబంధుషు
     సాధుష్యపి  చ  పాపేషు  సమబుద్ధి  ర్విశిష్యతే  ..( భగవద్గీత 6వ అ..9శ్లో )

రుజువర్తనులైన శ్రేయోభిలాషులను, ప్రేమయుక్తులైన మిత్రులను, తటస్థులను, మధ్యవర్తులను, ఈర్ష్యాపరులను, చుట్టములను, సాధువులను, పాపులను కూడా సమబుద్ధితో చూచు వ్యక్తి మిక్కిలి విశిష్టుడుగా పరిగణింపబడును. 



 శ్లో" యోగీ యుణ్జీత సతత మాత్మానాం రహసి స్థిత:
     ఏకాకీ యతచిత్తాత్మా నిరాశీ రపరిగ్రహ:    ( 6వ అ-10వశ్లో )

దివ్యజ్ఞాని తన ఆత్మమనోదేహములను సర్వదా భగవత్సేవయందు వినియోగింపవలెను. అతడు ఏకాంతప్రదేశమున ఒంటరిగా నివసించుచు మనస్సును ఎప్పుడును శ్రద్ధతో నిగ్రహింపవలయును. అతడు కోరికలనుండియు, వస్తువులను కలిగియుండ వలెనను భావము నుండియు దూరముగా నుండవలయును. 


  

కృష్ణుడు బ్రహ్మముగను, పరమాత్మగను, దేవాదిదేవుడుగను వివిధ పరిమాణములలో గుర్తింపబడును. కృష్ణచైతన్యమనగా సంక్షేపముగా దివ్యమును ప్రేమయుక్తమును అయిన భగవంతుని సేవయందు ఆసక్తి కలిగి యుండుట. ప్రత్యక్షముగా కృష్ణచైతన్యము కలవాడు బ్రహ్మము అనినను, పరమాత్మ అనినను ఏమో తెలిసికొన్నవాడగుటచే దివ్యజ్ఞానముతో శ్రేష్ఠుడగును. అతనికి పరమసత్యమును గూర్చి కల జ్ఞానము సంపూర్ణమైనది. కృష్ణునియం దెల్లప్పుడు మనస్సును స్థిరముగా నుంచుట దివ్యజ్ఞాని యొక్క ప్రధమ ధర్మము. ఎల్లరూ కృష్ణునే ధ్యానించుచు ఆతని నొక్క క్షణమైనను విస్మరింపరాదు. భగవంతునియందు మనస్సు నేకాగ్రముగా నుంచుటయే సమాధి యనబడును.మనస్సును ఏకాగ్రముగా నుంచుటకు ఎవరైనను ఏకాంత స్థలమునుండి బాహ్యవిషయములవలన అంతరాయములను పరిహరింపవలయును. అతడు తన ఆత్మానుసంధానమునకు అనుకూల పరిస్థితులను గ్రహించి, అనుకూలములు కానివానిని త్యజించుట యందు మిక్కిలి శ్రద్ధ వహించవలెను. సంపూర్ణ నిశ్చయముతో వస్తువులను కలియుండవలెనను భావమునందు తన్ను బంధించు అనవసర భౌతిక విషయములకై అతడు ప్రాకులాడరాదు. ప్రత్యక్ష కృష్ణచైతన్యమనగా ఆత్మత్యాగమని అర్ధము. అందు భౌతికవస్తువులను కలిగియుండవలెనను భావమునకు అవకాశమే లేదు. 



20 - 23 శ్లోకాల భావార్ధం ను పరిశీలిస్తే...యోగాభ్యాసముచే మానవుడు భౌతిక భావముల నుండి క్రమముగా దూరుడగును. ఇదే యోగ సిద్ధాంతము యొక్క ప్రధాన లక్షణము. దీని తరువాత అతడు సమాధిలో నుండిపోవును. అనగా యోగి ఆత్మను పరమాత్మగా గుర్తించు భ్రాంతులేమియు లేకుండ దివ్యమైన మనస్సు చేతను బుద్ధి చేతను పరమాత్మను అనుభవించును. పతంజలిముని యోగసూత్రములో "పురుషార్ధశూన్యానాం గుణానాం ప్రతిప్రసవ: కైవల్యం స్వరూపప్రతిష్ఠా వా చితిశక్తిరితి" అని ప్రకటించారు. ఈ చిత్తిశక్తి లేక అంతరశక్తి దివ్యమైనది. పురుషార్ధములనగా భౌతిక, మత తత్పరత, ఆర్ధికాభివృద్ధి, ఇంద్రియ సంతృప్తి, చిట్టచివరికి భగవంతునితో ఏకమగుటకు చేయు ప్రయత్నము అని అర్ధము. ఈ భగవదైక్యమునే అద్వైతి "కైవల్య"మని చెప్పును. జీవిని తన నిజస్థితిని యెరుంగజేయు అంతరమైన లేక దివ్యమైన శక్తియే కైవల్యము.  

 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు. 
Friday, December 9, 2016 0 comments By: visalakshi

గీతామృత బోధ

శ్లో" యే యధా మాం ప్రపద్యంతే తాంస్తధైవ భజామ్యహం! 
      మమ వర్త్మానువర్తంతే మనుష్యా: పార్ధ సర్వశ:!!   (గీత 4వ అ-11శ్లో)


మానవులు ఏ మార్గాన్ని అనుసరించినా, ఏ రూపాన్ని ఆరాధించినా నన్నే పొందుతారు. పార్ధా! ఎవరు నన్ను ఎలా సేవిస్తే, నేను వాళ్ళను అలా అనుగ్రహిస్తాను. మానవులందరూ అన్ని విధాలా నన్నే అనుసరిస్తున్నారు.అని భగవాన్ శ్రీకృష్ణుడు అర్జనుడి సందేహాన్ని తీరుస్తాడు.




భగవద్గీత అంటే భగవంతుని అమృతగానం. శ్రీకృష్ణుడు గీతను అనుష్ఠాన వేదాంతంగానే అందించాడు.కృష్ణుడు చేసిన ప్రతీ చర్య వెనుక ఓ అగాధమైన అంతరార్ధమున్నది. వేదాంత వివరణమున్నది. తత్త్వ రహస్యమున్నది. జైలులో పుట్టిన నాటినుండి, రేపల్లెలో పెరిగేటపుడు, పాలకుల ప్రక్కనచేరి ఎత్తులకు పై ఎత్తులు వేయించినపుడూ ..సమయం లభిస్తేచాలు సదుపదేశాలు అందించేవాడు శ్రీకృష్ణుడు. మహాభారత సంగ్రామంలో అర్జనుడికి చెప్పే వంకతో భగవద్గీతను లోకానికుపదేశించి ఉపకారం చేశాడు శ్రీకృష్ణుడు. వేదాలసారాన్ని అర్జనుని సాకుగా పెట్టుకొని స్వామి మానవ సమాజం కోసం ఉదారంగా అందించాడు. "శ్రీరామాయణం, భారతం, భాగవతం, భగవద్గీతాదులు ప్రపంచంలోని మానవజాతికంతటికీ మార్గనిర్దేశంచేసే పవిత్ర గ్రంధాలు..ఉదాత్తమైన ఉపదేశాలు." 




మనం మాత్రం గీతను కేవలం పవిత్ర గ్రంధంగా భావించి పూజగదికి పరిమితం చేశాం. మనిషి పరిపూర్ణుడవడానికి కావలసిన అంశాలు గీతలో ఉన్నాయి. గీతలోని ధ్యాన శ్లోకాలను చదివినప్పుడు అవి ధ్యానానికి ఎంత ఉపకరిస్తాయో తెలుస్తుంది. వేదాలు అనే కామధేనువు నుండి శ్రీకృష్ణుడనే గోవులకాపరి పితికిన 'పాలు ' గీత. ఆ పాలు కేవలం పూజగదిలో పెట్టి పూజించడానికి కాదు; అవి మనం తాగడానికి ఉద్దేశింపబడ్డాయి. అప్పుడే జ్ఞానశక్తి వస్తుంది. అనేక సం"ల నుండి ఆ పాల గ్లాసును పూలతో పూజిస్తున్నాం కానీ తాగలేదు. అందుచేతనే మనం బౌతికంగా, మానసికంగా, సాంఘీకంగా బలహీనులుగా ఉన్నాం. గీత అనే పాలను తాగడం మొదలుపెడితే జాతి నూతన జవసత్వాలను సంతరించుకుంటుంది. శక్తి వంతులమవుతాము.  జాతి ఔన్నత్యాన్ని సాధిస్తుంది. దేశం ప్రగతి పధంలో ముందుంటుంది.



సాధారణంగా అన్నిరకాల బోధలు దేవాలయాలలోనో, అరణ్యాలలోనో, ప్రశాంతమైన ప్రదేశాలలోనో చెప్పబడ్డాయి. గీతాబోధమాత్రం యుద్ధరంగంలో, కల్లోలంగా ఉన్న ప్రదేశంలో బోధించబడింది. ధైర్యశాలి ఐన అర్జనుడికి ధైర్యశాలి, ధీశాలి అయిన శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశం గీత. అంటే ధైర్యశాలురైన ప్రజలకు మరింత ధైర్యం కోసం గీత అన్న ఉద్దేశ్యాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. "చక్కని పుష్పమాలవలె, మనోహర పుష్పగుచ్చంవలె క్రమపద్ధతిని సుందరంగా కూర్చబడిన ధర్మముల యొక్క సముదాయమే భగవద్గీత."  'భగవద్గీత పరమోత్కృష్ట గ్రంధరాజము.'


డిసెంబరు 10 అనగా రేపు 'గీతాజయంతి.'..సందర్భంగా మనమందరం గీతామృత బోధను, పఠనం చేసి గీతలో అంశాలను అవగాహన చేసుకొని పాటిద్దాం. పరిపూర్ణులవుదాం.  జ్ఞాన శక్తిని పొందుదాం.

  సర్వం శ్రీ సాయి నాధార్పణ మస్తు. 


Thursday, December 8, 2016 0 comments By: visalakshi

యజ్ఞోపవీతం

యజ్ఞోపవీతం పరమం పవిత్రం 
ప్రజాపతేర్యత్ సహజం పురస్తాత్!
ఆయుష్యమగ్ర్యం ప్రతిముంచ శుభ్రం
యజ్ఞోపవీతం బలమస్తు తేజ:!!            (పారస్కర గృహ్య సూత్రం 2-2-10)

యజ్ఞమనే సత్కార్యాన్ని చేసేందుకు ధరించే దీక్షా సూత్రం ఈ యజ్ఞోపవీతం. 



యజ్ఞోపవీతం అంటే - మంచిపనులు చేసేందుకు సమీపంగా చేర్చేది, అర్హతను యోగ్యత కలిగించేదని అర్ధం. 

పరమం పవిత్రం - మానవుని పవిత్రంగా ఉంచే దివ్యమైన సాధనం యజ్ఞోపవీతం. 

 శ్లో" అద్భిర్ గాత్రాణి శుద్ధ్యంతి
      మన: సత్యేన శుద్ధ్యతి !
      విద్యాతపోభ్యాం భూతాత్మా
      బుద్ధిర్ జ్ఞానేన శుద్ధ్యతి !!   (మనుస్మృతి 2-97)

 జలంతో శరీరం,.. సత్యాచరణ, సత్యభాషణ వలన మనస్సు,.. విద్యా, ధర్మాచరణ వలన ఆత్మ,.. జ్ఞానంతో బుద్ధి పవిత్రమవుతాయని మహర్షులు తెలుపుతున్నారు.

ప్రజాపతేర్యత్ - సమస్త ప్రాణులకు పరమాత్ముడే ఆధారం. ఆయనే పతి, పాలకుడు, తండ్రి, రక్షకుడు, మనం చేసే శుభాశుభకర్మలకు న్యాయరూప ఫలాన్ని ఇచ్చేది పరమాత్ముడే. అతడు ఆనందస్వరూపుడు. పూర్ణసుఖస్వరూపుడు. మానవుడు అల్పబుద్ధితో ఇంద్రియాలకు వశుడై భౌతిక సుఖాలవెంట పరుగెత్తి అలసిపోతున్నాడు. అవి లభిస్తే సుఖాన్ని పొందుతున్నాడు. లేకుంటే రాగద్వేషాలకు లోనై దు:ఖాన్ని అనుభవిస్తున్నాడు. 

సహజం పురస్తాత్ - శిశువు జన్మించడానికి ముందే, తల్లి గర్భంలో శిశువుకు ఈ ఉపవీతం సహజంగా ఉంటుంది. తల్లి గర్భంలో బిడ్డకు, బొడ్డు త్రాడు రస, ప్రాణాలనిచ్చి రక్షిస్తుంది. అట్లాగే యజ్ఞోపవీతం, మానవులకు వేదోపదేశ అమృత రూప రస ప్రాణాలనిచ్చి జీవితాంతం కాపాడుతుంది.

 ఆయుష్యం - గర్భాధారణ మొదలు మరణకాలం వరకు మధ్య ఉండేకాలాన్ని ఆయువంటారు. ఆయుష్యమంటే ఆయువును వృద్ధి చేసేదని అర్ధం. అందుకే మానవుడు పురుషార్ధాలతో పూర్ణాయువును కోరుకోవాలి. శక్తిని అర్ధించాలి. ఇంద్రియాలు బలంగా దృఢంగా శక్తివంతంగా వుండాలని పరమాత్ముని కోరుకోవాలి.

అగ్ర్యం - ఈ యజ్ఞోపవీతం మానవునకు ఉత్తమమైన మార్గదర్శిని. శుభకార్యాలకు ప్రేరణనిస్తుంది. అవి చేసేవారిని రక్షిస్తుంది. వారిని సమాజంలో అగ్రస్థానంలో వుంచుతుంది. 

ప్రతిముంచ శుభ్రం - ప్రతి ముంచ అంటే ధరించడమని అర్ధం. శుభ్రం అంటే తెల్లని శుద్ధమైన యజ్ఞోపవీతాన్ని ధరించాలి. ఈ సూత్రం ఎప్పుడు శుచిగా ఉండాలి. శుచిగా లేకుంటే అది తీసి నూతన యజ్ఞోపవీతాన్ని ధరించాలి.  

యజ్ఞోపవీతం - అలాంటి దివ్యగుణాలు కలిగిన యజ్ఞోపవీతం

బలమస్తు తేజ: - ఇది తేజోవంతమయిన యశస్సును, ఆత్మశక్తిని ప్రసాదిస్తుంది. యజ్ఞమయ జీవితాన్ని గడపాలనే జిజ్ఞాస కలిగిన స్త్రీ పురుషులందరు దీని ఉద్దేశ్యాన్ని, ప్రయోజనాన్ని తెలుసుకుని, యజ్ఞోపవీతాన్ని ధరించాలి.  



శ్లో" న శూద్ర సమాస్త్రియ: నహి శూద్రయోనౌ
     బ్రాహ్మణ క్షత్రియ వైశ్యా: జాయంతే
     తస్మాత్ చందసాం స్త్రియ: సంస్కార్యా: !!  (హారీత ధర్మ సూత్రాలు)

స్త్రీలు శూద్ర సమానులు కారు. శూద్ర యోనులందు బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు జన్మింపరు. స్త్రీలు చందస్సులను (వేదాలను) పఠింపయోగ్యులని ప్రాచీన ఋషులు ప్రభోదించారు. ఈ వ్రతసూత్రం వైదిక సంస్కృతికి పరమ పవిత్రమైన ప్రతీక. ఆచార ధర్మాలను పాటించేవారు, శ్రద్ధ, శిష్టాచారం గల అన్ని వర్ణాల స్త్రీ పురుషులు నిష్ఠగా ఈ యజ్ఞోపవీతాన్ని ధరించవచ్చు అని   కొందరు ఋషులు, ఆచార్యుల అభిమతం. నీతివంతమైన జీవితాన్ని అభిలషించేవారెవరైనా ఈ ధర్మ సూత్రాన్ని ధరించి, గాయత్రీ మంత్రోపదేశం పొందవచ్చుననెడిది  శాస్త్రకారుల  నిశ్చిత  అభిప్రాయం. 



 సమస్త జీవరాసులలో మానవజన్మ అమూల్యమైనది. మనం ఈ జన్మలో అనుభవించే సుఖదు:ఖాలకు కారణం గత జన్మలలో చేసిన మంచి చెడుకర్మల ఫలమే. మానవులు చిత్తశుద్ధితో సత్కార్యాలను ఆచరించాలి. జన్మించిన ప్రతి మనుష్యునకు మూడు ఋణాలుంటాయి.. అవి పితృఋణం, దేవఋణం, ఋషిఋణం. యజ్ఞోపవీతం ఈ మూడు ఋణాలను తీర్చేబాధ్యతను తెలియజేస్తుంది. అందుకు ఈ వ్రతాన్ని స్వీకరించాలని యజ్ఞసూత్రం గుర్తుచేస్తుంది. శారీరక, మానసిక ఆత్మికబలాన్ని ప్రసాదిస్తుంది ఈ యజ్ఞోపవీతం. 

 సర్వం శ్రీసాయినాధార్పణ మస్తు


  
Wednesday, December 7, 2016 0 comments By: visalakshi

ఏకనాధస్వామి -దత్తుని అనుగ్రహం

నిరంతరము భగవన్నామామృత పానచిత్తులై అతిధి అభ్యాగతులను సేవిస్తూ అరిషడ్వర్గములను అంతమొందించి, భగవత్సాన్నిధ్యమును పొంది తరించిన భాగవతోత్తములలో సంత్ ఏకనాధస్వామి సదా స్మరించ దగిన ధన్యాత్ములు.




గోదావరీ పుణ్యనదీతీరంలో పైఠనపుర మను గ్రామము కలదు. ఆ గ్రామములో సూర్యాజీరావు, రుక్మాబాయి అను దంపతులుండేవారు. ఆదర్శగృహస్థ జీవనమును సాగిస్తూ జీవించేవారు. కానీ వారి హృదయాలలో పున్నామనరకము నుండి కాపాడి సద్గతిని ప్రసాదించే కుమారుడు లేడన్నవ్యధ చోటుచేసుకొని ఉన్నది. నిరంతరము పాండురంగని సేవచేస్తూ, తమ అభీష్టము ననుగ్రహించమని ప్రార్ధించేవారు. పాండురంగని ఆశీస్సులు ఆ పుణ్యదంపతులకు లభించాయి. వారికి కుమారుడు కలిగాడు. ఆ బాలునికి ఏకనాధ్ అని నామకరణం చేశారు. భగవదనుగ్రహంతో జన్మించిన ఏకనాధుడు బాల్యమునుండి ఆధ్యాత్మిక విషయములందు ఆసక్తి చూపుతుండేవాడు. ఆసక్తి పెరిగి పెరిగి ఆశయసిద్ధికి అన్వేషణగా పరిణమించింది. బాహ్యవిషయములందు అనురక్తి కలగడంలేదు. నిరంతరం వైరాగ్యజనిత మనస్కుడై ఉదాసీనంగా కనిపించేవాడు. ఏదో పోగొట్టుకున్నట్లు అతని నేత్రాలు వెతుకుతున్నట్లు గోచరమయ్యేవి. భగవంతునికి దూరమైన బ్రతుకు నిరర్ధకమని ఆ పసిహృదయం ఆరాటపడసాగింది.




 ఒకనాడు అతని స్నేహితులు ఆటలకు రమ్మని పిలువగా...ఆటలయందు ఆసక్తి లేకపోయినను మిత్రుల ప్రోద్బలంపై బయలుదేరుతాడు. ఆటలాడుతుండగా ఏకనాధుడు ఓడిపోయాడంటూ మిత్రులందరూ కేరింతలు పెడతారు. ఏకనాధుడు ఆలోచిస్తూ అవును వారు చెప్పినది నిజమే భగవానుని మరచి జీవనము కొనసాగించు నేను అపజయానికి మారుపేరు. నేను తప్పక గెలుస్తాను. భగవంతుని గెలుచుకుంటాను. అని చింతిస్తూ వైరాగ్యము హృదయమునుండి పెల్లుబుకుచుండ ఒక వృక్షచాయలో ఆశీనుడై అంతర్ముఖుడయ్యాడు. అంతరాత్మలో రమించసాగాడు. ఆట ముగియగానే స్నేహితులందరూ ఏకనాధుని అన్వేషిస్తూ ఆ ప్రదేశానికి అరుదెంచారు. అచ్చట అద్భుత దృశ్యాన్ని గాంచి నిశ్చేష్టులయ్యారు. ఏకనాధస్వామి ధ్యానస్థితిలో యుండ త్రాచుపాము అతని మెడను చుట్టి తన పడగతో స్వామి శిరస్సుకు గొడుగు పట్టినట్లు నిలచి యుండుట చూస్తారు. వారి అలికిడికి సర్పము ఏకనాధుని వదలి దూరంగా వెళ్ళిపోయింది. ఏకనాధస్వామి దృష్టి బహిర్ముఖమైంది. స్నేహితులందరూ స్వామిని చుట్టుముట్టి జరిగిన విషయమంతా చెప్పారు. ఏకనాధస్వామి అలా ఉండటాన్ని గూర్చి ప్రశ్నించసాగారు. 




 స్వామి ప్రసన్నవదనంతో స్నేహితులను సమీపించి వారితో మిత్రులారా! "నాకు ఆంతర్యంలో భగవానుని దర్శనం లభించింది. భగవానుని అమృతవాక్కు నాకు హృదయంలో వినిపించింది. దౌలతాబాద్ నగర నివాసియైన జనార్దనపంత్ ని గురువుగా స్వీకరించి సేవించమని ఆదేశము అందినది.నేను గురు సాన్నిధ్యమును పొందుటకు బయలుదేరుతున్నాను." అని మిత్రబృందమును కౌగలించుకొని, వారినుండి వీడ్కోలు తీసుకొని వెనుదిరిగి చూడకుండా దౌలతాబాద్ చేరాడు. గురు జనార్ధన పంత్ గృహస్థుడు. తాను సంసారములో యున్నను తనలో సంసారము లేకుండా జీవించిన మహాజ్ఞాని. దత్తాత్రేయ ఉపాసకులు.ప్రతి గురువారము తాను ఒక అరణ్యప్రదేశమునకు వెళ్ళి అక్కడ దత్తాత్రేయులవారి దర్శనము పొంది తృప్తి చెందేవాడు. తన దరిచేరు జిజ్ఞాసువులకు మార్గమును చూపి నడిపిస్తుండేవాడు. అట్టి గురుజనార్ధనుల వారిని సేవించి, ధన్యత నొందమని హృదయాంతర్యామియైన భక్తవత్సల భగవానుడు ఏకనాధస్వామిని ఆదేశించాడు.ఏకనాధుడు దౌలతాబాద్ చేరి గురు జనార్ధుని పాదాలను ఆశ్రయించారు. జనార్ధనుడు ఏకనాధుని శిష్యుడుగా స్వీకరించాడు. ఆతనిని గమనిస్తూ మంత్రదీక్ష ఇవ్వకుండా తమ ఇంటి ఖర్చుల పద్దులను ఒక పుస్తకములో వ్రాస్తుండమని చెప్పెను. సద్గురుని ఆదేశానుసారము వ్రాయుచుండెడివాడు. క్రమముగా ఏకనాధుని ఏకాగ్రతను, బుద్ధిసూక్ష్మతను గ్రహించి జనార్ధనుడు తృప్తి చెందుతాడు. " కుమారా! ఏకనాధా! ఈశ్వరార్పణ బుద్ధితో ఆచరింపబడిన కర్మలు మానవునికి ఆధ్యాత్మికోన్నతిని కల్గిస్తాయి. గృహపద్దులను సరిచేయుటకు నీవు ఉపయోగించిన ఏకాగ్రతను భగవానునిపై వినియోగించినచో అనిర్వచనీయానందమును పొందగలవు." అని పరోక్షంగా జ్ఞానోపదేశము చేశారు గురు జనార్ధనులు. గురుబోధ ఏకనాధునిలో నిద్రాణమైయున్న ఆధ్యాత్మిక శక్తిని ప్రజ్వలింపచేసింది. భగవద్దర్శనము కొరకు తపించిపోసాగాడు.




గురుజనార్ధనుడు గురువారమునాడు యధావిధిగా దత్తాత్రేయులవారి దర్శనమునకై అరణ్యమునకేగుచు ఏకనాధస్వామిని వెంటబెట్టుకొని వెళ్ళారు. "ఏకనాధా! ఈనాడు నీకు దత్తాత్రేయులవారి దర్శనము కాగలదు. వారు ఏ రూపములోనైనను కనిపించవచ్చును. భ్రాంతికి లోనుగాకుము. అని చెప్ప ధ్యానస్థితిలో ఆశీనులైరి. కొంతసేపటికి ఒక వికృత రూపధారి అచ్చట కరుదెంచెను. జనార్ధనుడు ఆ వ్యక్తి పాదాలపై బడి ప్రణమిల్లెను. ఏకనాధుడు ఆ వ్యక్తిని చూసి అసహ్యించుకుంటాడు. జనార్ధునుని ఆశీర్వదించి ఆ వ్యక్తి అదృశ్యమవుతాడు. జనార్ధనుడు "వత్సా! ఏకనాధా! ఎంత అపచారము చేసితివి. ఆ వచ్చిన వ్యక్తి ఎవరోకాదు. అతడే అనసూయా పుత్రుడైన  దత్తాత్రేయులవారు.  త్రిమూర్త్యాత్మక   శక్తి స్వరూపము. చేతికందిన అపూర్వ అవకాశమును జారవిడుచుకొంటివి" అని తెలియజేయగానే ఏకనాధుడు దు:ఖవదనుడై విలపించసాగాడు. శిష్యుని పరితాపమును గాంచి..దిగులు చెందకు ఈ రోజుతో నీలో నున్న కొద్దిపాటి అజ్ఞానము పటాపంచలైంది. వచ్చే గురువారము నాడు నీవు దత్తాత్రేయులవారి దర్శనమును పొంది, వారి అనుగ్రహమునకు కూడా పాత్రుడవయ్యెదవు అని ఆశీర్వదించాడు.




మరుసటి గురువారము ఏకనాధుని వెంటనిడుకొని అరణ్యానికి ప్రయాణమయ్యారు గురు జనార్ధనులు. ఒక వృక్షచాయలో ఆసీనులై ధ్యానము చేయుచుండగా మెరుపు మెరుస్తుంది. ఒక దివ్యకాంతి వలయం గోచరిస్తుంది. నేత్రాలు తెరుస్తారు. దత్తాత్రేయులవారు ఒక ఫకీరు వేషములో దర్శనమిస్తారు. ఆతని చుట్టూ నాలుగు కుక్కలుంటాయి. ఆరు మేకలుంటాయి. వారు ఏకనాధుని దగ్గరకు పిలిచి అతని చేతికి ఒక ఖడ్గము నిచ్చి తనతో ఉన్న ఆరు మేకలను ఖండించమని చెబుతారు. ఏకనాధస్వామి భగవదాజ్ఞను శిరసావహించి మేకలను ఖండిస్తాడు. వెంటనే అక్కడ గోచరిస్తున్న దృశ్యమంతా అదృశ్యమైంది. ఫకీరుస్థానే దత్తాత్రేయులవారు ప్రసన్నవదనంతో దర్శనమిస్తారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల రూపములతో మూడు శిరస్సులు, ఆరుచేతులతో దర్శనమిస్తారు. శంఖ, చక్ర, గదా,పద్మ, త్రిశూలముతో అద్భుత దర్శనమిచ్చి అనుగ్రహించారు. ఫాలభాగమున విభూతి ధారణచేసి, తులసిమాలను, పుష్పహారములను కంఠమునందు ధరించి, పాదుకలు పాదములయందు ధరించి, కామధేనువు వెనుక నిలబడియుండగ దేదీప్యమానంగా దర్శనమిచ్చి అభయప్రదానం చేశారు. 




 ఏకనాధస్వామి దత్తాత్రేయులవారికి సాష్టాంగ నమస్కారము చేసి తన కన్నీటితో స్వామి పాదాలకు అభిషేకం చేస్త్తాడు. దత్తాత్రేయులవారు "ఏకనాధా! నీవు ఖండించిన మేకలు ఏమిటో తెలుసా? అవియే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములనెడి అరిషడ్వర్గములు. నీవు అరిషడ్వర్గములను అంతమొందించి అంత:కరణ శుద్ధిని పొందావు. ఇక నీ శేషజీవితమును హరిసేవకు వినియోగించుము. హరిగుణములను అభంగరూపముగా రచించి గానము చేయుచు తరించుము. వాల్మీకి విరచితమైన శ్రీమద్రామాయణకావ్యము, వేదవ్యాస ప్రణీతమైన శ్రీమద్భాగవత గ్రంధములు సంస్కృత భాషలో యున్నవి. నీవు రామాయణ, భాగవత కావ్యములను ప్రాకృతమైన మరాఠీ భాషయందు రచించుము. అని అమృత సందేశమునిచ్చిఅంతర్ధానమయ్యెను.భాగవతులందరు గృహస్థాశ్రమములోనే తరించారు. నీవు నా ఆజ్ఞానుసారము గృహస్తుడవై ఆదర్శమార్గమున చరించి,భక్తిమార్గములో తరించి, లోకాన్ని తరింపజేయుము అని గురు జనార్ధనులవారు దీవించిరి. ఏకనాధస్వామి తల్లిదండ్రుల ఆదేశానుసారము  సద్గుణ సంపన్నురాలైన గిరిజాబాయి అను కన్యను వివాహమాడెను. వారికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు సంతానము కలిగిరి. ఏకనాధస్వామి నిరంతరము జపధ్యానాదులతో, భగవద్గుణ సంకీర్తనాదులతో తన్మయత్వ జీవనముతో కాలము గడుపుచుండెను. ఒకనాడు పాండురంగ భగవానుడు ఏకనాధస్వామికి స్వప్న దర్శనమిచ్చి "ఏకనాధా! వాల్మీకి విరచిత శ్రీమద్రామాయణ కావ్యమును   సులభశైలిలో సంస్కృతము తెలియనివారు చక్కగా చదివి అర్ధం చేసుకొనునట్లు మరాఠీభాషలో రచించుము" అని తెలియజేసెను. ఏకనాధస్వామి మేల్కొని దిగ్భ్రాంతి చెందెను. దత్తాత్రేయులవారి ఆశీర్వాదముతో, మరియు పాండురంగని అనుజ్ఞను హృదయములో గురుదేవులను కూడా ప్రార్ధించి రామాయణ రచనను రమ్యముగా సాగించి పూర్తి చేసెను. పరమ భాగవతమూర్తి ఐన ఏకనాధస్వామి తనకు ప్రాణమైన భాగవత గ్రంధమును కూడా మరాఠీ భాషలోకి అనువదిస్తూ భక్త సమూహమునకు వివరించెడివారు. ఏకనాధుని భక్తిప్రపత్తులకు సంతసించిన ద్వారకాపతి శ్రీకృష్ణుడు బ్రాహ్మణరూపంలో వచ్చి ఏకనాధస్వామి ఇంట్లో వంట చేయు శ్రీ ఖంఢ్వాగా 12 సం"లు ఆయనవద్ద ఉండి సేవ చేసెను. ఆయనను శ్రీకృష్ణ పరమ్మాత్మ అవతారములో చూసిన ఏకనాధుడు భగవాన్ నన్ను కరుణించావా తండ్రీ! అంటూ శ్రీఖండ్వా పాదములపై పడెను. చూస్తుండగానే శ్రీఖండ్వా అదృశ్యమయ్యెను. కృష్ణా తెలియక నీచే వండించుకొని తృప్తిగా 12సం"లు భోజనం చేశాను. నీవు తిన్నావా అని ఒక్కనాడైనా అడుగలేదు అని విలపించెను. వాసుదేవుడు మధురమైన వాణితో ఏకనాధా! నీవు నా ఆంతరంగిక భక్తుడవు. నీవు నా కృపకు పాత్రుడవయ్యావు. నిన్ను త్వరలోనే నాలో ఐక్యము చేసుకొంటాను" అని చెప్పి అంతర్ధానమయ్యెను. ఏకనాధుడు  కొద్ది రోజులకు భక్తులకు నమస్కరించి, గోదావరీ పుణ్యతీర్ధములోదిగి నీటిలోనుండి భక్తజనులకు నమస్కరిస్తూ వాసుదేవుని చైతన్యములో లీనమయ్యెను.భాగవత ధర్మమును ప్రచారము చేసి, భాగవతులకు ఆదర్శమై నిలిచిన ఏకనాధస్వామి సదా స్మరణీయుడు, సర్వ సంపూజ్యుడు. దత్తాత్రేయులవారి ఆజ్ఞతో రచించిన ఏకనాధ రామాయణము, ఏకనాధ భాగవతములను... దత్తుని ఐదవ అవతారధారి శ్రీ షిర్డీసాయిబాబా సమక్షమున భక్తులు ఆ గ్రంధములను బాబావారి చేతికిచ్చి బాబా పవిత్రము చేసిన పిమ్మట వానిని పుచ్చుకొనేవారు. ఆ పవిత్ర గ్రంధములను బాబాగారి సమక్షములో పారాయణ చేసేవారు. 



 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.









Tuesday, December 6, 2016 4 comments By: visalakshi

శ్రీగురుడు -దత్తాత్రేయస్వామి..

 బ్రహ్మ మానసపుత్రులు సప్తఋషులు. వారిలో అత్రిమహాముని ఒకరు. అనసూయ కర్దమ ప్రజాపతి, దేవహూతుల పుత్రి. అత్రిమహాముని అనసూయను చేబట్టి గృహస్థధర్మములు నెరవేర్చుతూ తపస్సు చేసిరి. అనసూయ మహా పతివ్రత. ఆమెను వేదములు ప్రశంసించినవి. ఆమెను జగదంబగా అభివర్ణించవచ్చు. ఆ సాధ్వి నిత్యమును పతిసేవాపరాయణ. ఆమె మహిమ తెలిసిన ఇంద్రాది దేవతలు స్వర్గసంపదను హరించునేమోయని తలచి భయపడిరి. అంతట వారు త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను శరణు వేడుకొనుచు ఆ సాధ్వి ఖ్యాతిని నివేదించిరి.  ఇంద్రుని మాటలు విని ఆమెను త్రిమూర్తులు పరీక్షింప వచ్చిరి. అనుష్ఠానమునకు నదీతీరమునకు వెళ్ళిన ముని రాకకు ముందే త్రినాధులు అతిధుల రూపంలో భోజనము పెట్టుమని అనసూయను కోరిరి. ఆ సాధ్వి వడ్డన చేయబోగా వివస్త్రవై వడ్డన చేయవలెనని వారనిరి. ఆమె తపోబలమున త్రిమూర్తులను పసిబిడ్డలను జేసి పాలిచ్చినది. ఎన్నో యజ్ఞములు చేసినను తృప్తి చెందనట్టి ఆ త్రినాధులు అనసూయమాత స్తన్యముగ్రోలి తృప్తిచెందిరి.అనసూయాసతితో సమానమైన సాధ్విలేదు. భువనత్రయము నందును ఆమె త్రిమూర్తులకు మాతగా ప్రసిద్ధి గాంచెను. ఇంతలో అరుదెంచిన అత్రిమహర్షి దివ్యదృష్టితో సర్వము తెలిసికొనెను. 





అత్రి అనసూయా దంపతులకు త్రిమూర్తి స్వరూపుడై అవతరించినవారు శ్రీ దత్తాత్రేయస్వామి. త్రిమూర్తులు వరమిచ్చుటచే ఆ బిడ్డల రూపంలో బ్రహ్మ చంద్రుడుగను, విష్ణువు దత్తాత్రేయుడుగను, మహేశ్వరుడు దుర్వాసుడుగను ప్రసిద్ధులయిరి. ప్రజ్ఞావంతులైన చంద్ర దుర్వాసులు మాత అనసూయా సాధ్విని సెలవీయ గోరిరి. దుర్వాసుడు తల్లి అనుమతితో తపస్సుకై తీర్ధయాత్రలకు వెడలెను. చంద్రుడు మాతనుజ్ఞతో చంద్రమండలము చేరెను.  త్రిగుణాత్మకు డయిన శ్రీదత్తుడనసూయా గృహమున నిలిచెను.. ఈ విధముగా స్వాయభువమన్వంతరములో మార్గశిర శుద్ధ పౌర్ణమి బుధవారము ప్రదోష సమయమున శ్రీ దత్తులు అవతరించిరి. దత్తుని అవతారము గురురూపము. వీరు కుమారస్వామికి; ప్రహ్లాదునకు; యదువునకు; సాంకృతమునికి; కార్తవీర్యునకును జ్ఞానముపదేశించిన మహర్షులు. అవధూత మార్గము ఈ స్వామి వలన ఏర్పడినదే. చారిత్రకముగా సిద్ధనాగార్జునుడు, ఆదిశంకరుడు, జ్ఞానేశ్వరుడు, ఏకనాధుడును దత్తోపాసకులే. దత్తుడు స్మరణ మాత్రముననే సంతుష్ఠుడగును. 




పీఠికాపురమందు క్రీ"శ" 1320 ప్రాంతమున శ్రీదత్త భక్తులయి ఆపస్తంబశాఖీయులగు అప్పలరాజు సుమతి అను దంపతులకు భాద్రపద శుద్ధ చతుర్ధినాడు శ్రీదత్తులు శ్రీపాద శ్రీవల్లభులయి అవతరించిరి. బాల్యమందే వీరు విశేషమహిమ చూపి 16 సం"ల ప్రాయమున విరాగియై భక్తులను ఉద్ధరించుటకు జ్ఞానము నుపదేశించుచు దేశాటనకు బయలుదేరిరి. ఆ సమయమున పుత్రునిపై వ్యామోహము విడువజాలని తల్లిదండ్రులకు తమ దత్తాత్రేయ దివ్యరూపమును దర్శింపజేసిరి. నాటినుండి పిఠాపురమునందు భక్తులు స్వామిని సేవించి తరించుచుండిరి. ఇది శ్రీ దత్తాత్రేయుల ద్వితీయావతారము. 




అంబయను భక్తురాలికి మహారాష్ట్ర దేశమునందు కరంజయా అను గ్రామము నందు శ్రీగురువు తృతీయావతారమై వెలిసారు. ఈ అవతారమందు శ్రీగురువు శ్రీ  నృసిం హ సరస్వతిగా ప్రసిద్ధిచెంది ఎందరో దీనులను ఉద్ధరించిరి. భక్తులకు అనేక లీలలు చూపిరి. శిష్యులకు అవతారమునకు ధ్యేయమైన జ్ఞానప్రబోధము చేసి యున్నారు. కృష్ణపంచ గంగా సంగమమందలి నరసోబావాడియందు వీరు కొంతకాలము నివసించి అచట నిర్గుణపాదుకలను స్థాపించిరి. కృష్ణానదీతీరమందు సాంగ్లీజిల్లాలో ఔదుంబర క్షేత్రమున, భీమా అమరజాసంగమ స్థానమందున్న గాణుగాపురము లేక గంధర్వనగరమందును వీరు కొంతకాలముండి మనోహర పాదుకలను స్థాపించిరి. తరువాత శ్రీశైలమందలి కదళీవనమున పుష్పాసనముపై ఆసీనులయి అంతర్ధానమయిరి. శ్రీ నృసిం హ  సరస్వతులు నేటికిని తమ భక్తులకు దర్శనమిచ్చుచునేయున్నారు. పిఠాపురము, కరంజియా, కురుపురము, నరసోబావాడి, గాణుగాపురము, ఔదంబరమును ప్రసిద్ధ దత్త క్షేత్రములు. వీటిలో పిఠాపురము మూలక్షేత్రము. శ్రీ కుక్కుటేశ్వర దేవాలయమందు నైఋతిమూలగా శ్రీదత్తులు శిలావిగ్రహమున వెలసియున్నారు.  

  అక్కల్ కోట మహరాజ్  ,మాణిక్ ప్రభు అవతారాలను శ్రీగురువు  నాలుగవ అవతారంగా తెలుపబడింది. గుల్బర్గానుండి 45మైళ్ళదూరాన కలదు. శ్రీఅక్కల్ కోట మహారాజు తపస్సు చేసి సిద్ధి పొందిన పెద్ద జాగృతి స్థానము. ఈయన అపరదత్తావతారమని భక్తులు కొలుస్తారు.  మాణిక్యనగర్ గుల్బర్గానుండి 40కి.మీ హుమ్నాబాద్ దగ్గర కలదు. శ్రీమాణిక్య ప్రభువులవారి సమాధి క్షేత్రం. 




  ఐదవ అవతారంగా పరబ్రహ్మస్వరూపుడైన భగవాన్ షిర్డీ సాయిబాబాగా దత్తుని పంచమావతారము .అపరదత్తావతారముగా హిందువులచే, మహమ్మదీయులచే అన్ని మతముల వారు కొలవబడుచున్న స్వామి దివ్యక్షేత్రము. తన్నాశ్రయించిన వారందరినీ కాపాడుచున్న సాయి యొక్క బహు గొప్పదైన జాగృతి స్థానము.  త్రిమూర్తులే గురురూపముగ అవతరించి, మానవులకు గురుకృపలేక జీవితము పరిపూర్ణము గాదని, గురు అనుగ్రహమువలననే జీవుడు ఇహపరములను సాధించగలడని పరమానందప్రాప్తిని పొందగలడని దత్తావతారముల ద్వారా శ్రీ గురుడు మనకు అవగతం చేసి కృతార్ధులను చేశాడు.

 యోగమే ఆనందంగా విలసిల్లుచు, యోగమాయను ధరించి యోగిరాజులకు అధిరాజయిన దత్తాత్రేయునకు మంగళము.   


 జై గురుదేవ దత్త 





Friday, November 18, 2016 0 comments By: visalakshi

బాబా ఆశీర్వాదం

సాయి సత్యచరిత్ర 13వ అధ్యాయములో బాబా ఆశీర్వాదం భక్తుల యందు అనన్యంగా ఉంది. భక్తుల రోగాలను తమ కేవల వచనాలతో, ఆశీర్వాదంతో బాబా ఎలా నయం చేసేవారో మనకు తెలుస్తుంది.   అప్పుడప్పుడూ ఆయన ఉపాయం విచిత్రంగానూ, బాధాకరంగానూ ఉండేది. అయినప్పటికీ కూడా భక్తులకు రోగం నయమయ్యేది. తాత్పర్యం, గుణం ఔషధంలోనో లేదా ఉపాయంలోనో కాక బాబా చేతిలో, ఆశీర్వాదంలో ఉంది.  



  ఈ జగత్తులో మానవప్రాణులకు దేవుడు బుద్ధి ఇచ్చినప్పటికీ దాన్ని వాడుకుని మనసులో నిశ్చయించుకొన్నట్లు తమ ఇష్టమొచ్చినట్లు వ్యవహరించలేరు. వారి వెనుక కర్మ తంత్రం పట్టుకొని వుంటుంది.  జన్మల పర్యంతం చేసిన కర్మల సంస్కారం, వాటి ప్రారబ్ధాల పరిణామం, వారిని చెడుమార్గంవైపు లాక్కెళతాయి. ' శ్రద్ధ పుణ్యంవైపు పోతే పాదాలు పాపాలవైపు లాక్కెళతాయి. సత్కర్మను శోధిస్తూపోతుంటే కుకర్మలు అడ్డుగా వస్తాయి.' కనుక సత్కర్మలు చేసి పరమార్ధం సాధించటంకోసం మానవులు గొప్ప ప్రయత్నం చేయవలసివుంటుంది. ఇంతే కాదు సద్గురువుని ఆశ్రయించవలసి వుంటుంది.



మానవులు సుఖం కోసం అహోరాత్రులూ ప్రయత్నం చేసినప్పటికీ పూర్వకర్మల ఫలాలుగా దు:ఖాలు వారి మెడకు చుట్టుకొంటాయి. నెట్టిపారేద్దామనుకొంటే మరింతగా పెనవేసుకొంటాయి. ఇదంతా జీవుల వ్యర్ధశ్రమ. అవి అనుభవించక గత్యంతరం లేదు.  వేరే ఉపాయలతో ఆపివేసినా, మళ్ళీ   జన్మించి ఆ కర్మలను అనుభవించవలసి వుంటుంది. జీవన్ముక్తులకి అంటే జీవించి ఉండగానే ఆత్మజ్ఞానం కలిగి ముక్తులైన వార్ని కూడా ప్రారబ్ధభోగం వదిలిపెట్టదు. అప్పుడు ఇలాంటి దు:ఖాలను సహించటానికి  మానవులు  తయారుగా  వుండాలి. 



 అలాంటి దు:ఖాలను నివారించుకోవటానికి ఒక ఉపాయం మాత్రం వుంది. అదేమిటంటే సద్గురువుని శరణనటం. వారి కృపాదృష్టి పడితే మానవులు దు:ఖాన్ని సహజంగా ఏ యాతనలూ లేకుండా అనుభవించగలరు. సద్గురువు అనుభవించగల ధైర్యాన్నిస్తారు. 'అదృష్టవశాత్తూ మహాత్ముల దర్శనం అయితే అదే వ్యాధికి ఒక ఉపశమనం. వ్యాధిగ్రస్తులపై వారి కరుణా దృష్టి ప్రసరింపజేస్తారు. అప్పుడు వ్యాధిని దు:ఖం లేకుండా సహజంగా సహిస్తారు.' 



ప్రతి ఒక్క సందర్భంలోనూ మనసులో ఉండే బాబా తమ దైవీ శక్తిని ఉపయోగించి భక్తుల దు:ఖాల నన్నిటినీ కలిపి ఒక్కసారిగా అనుభవింపజేసి వారిని వెంటనే వాటినుంచి విడుదల చేస్తారు. ఆ దు:ఖాన్ని తమ మీదకు తీసుకొంటారు. ఈ అధ్యాయంలో భక్తులు బాబాకి తమ కృతజ్ఞతను ఎలా వ్యక్తం చేయాలో ఆ బోధ మనకి కలుగుతుంది. సద్గురువులకు తమ భక్తులపై "లాభం కోరని ప్రీతి" వుంటుంది. వారి ఉపకారానికి కృతజ్ఞతగా శిరస్సు వంచి, రెండు చేతులూ జోడించి అనన్యశ్రద్ధతో, దృఢవిశ్వాసంతో ప్రణామములర్పించాలి. అదితప్ప సాయినాధులకు మరోటి అవసరం లేదు.

 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.




Thursday, November 17, 2016 0 comments By: visalakshi

మేఘశ్యాముడి భక్తిఫలం

 సాయి సత్యచరిత్ర 28వ అధ్యాయములో మేఘుడు..ఆతని శివభక్తిని గూర్చి తెలుసుకుందాం..

ఒక గుజరాతీ బ్రాహ్మణుడు (మేఘుడు) రావుబహదూర్ సాఠె వద్ద పని చేసేవాడు. సాఠె అతన్ని నిత్యపూజలకోసం శివాలయంలో పూజారిగా పెట్టాడు. తరువాత సాఠె శిరిడీకి వచ్చాడు. అక్కడ సాయిమహరాజు సాన్నిధ్యం లభించింది. సాఠె మేఘుడికి గాయత్రీమంత్రం ఉపదేశించి, మంచిమార్గంలో ప్రవేశపెట్టాడు. మేఘుడు సాఠెని గురువుగా భావించేవాడు.  సాఠె బాబాను గురువుగా కొలిచేవాడు. ఓసారి సహజంగా మేఘుడితో మాట్లాడుతూ బాబాగారి గొప్పతనం గురించి చెఫ్ఫేటప్పుడు సాఠె హృదయంలో ప్రేమ ఉప్పెనలా పొంగి, "బాబాకి గంగాజలంతో స్నానం చేయించాలని నా మనసులో తీవ్రంగా కోరిక కలిగింది. అందుకు నిన్ను నేను శిరిడీ పంపుతున్నాను. నీ అనన్య సేవ చూసాక నాకేమనిపిస్తోందంటే, ఆ సద్గురువుతో నీకు సాంగత్యం ఏర్పడాలి. ఆయన చరణాల్లో నీకు భక్తి కలగాలి. వెళ్ళి కాయా, వాచా, మనసా నువ్వు ఆ సద్గురువు పాదాలు పట్టుకో. నీ జన్మ సార్ధకమౌతుంది . మేఘుడు ఎవరా సద్గురువు జాతి ఏమిటి? అని అడిగాడు. నిజం చెప్పాలంటే సాఠెకి కూడా ఆ విషయం తెలియదు. "మశీదులో ఉంటారు కనుక ఆయన్ని ముస్లిం అంటారు." ముస్లిం అన్న పదం వినగానే మేఘుడి మనసు తల్లడిల్లిపోయింది. అతను మనసులో ఆయన గురుత్వం ఎంతటిది? కాదు అంటే సాఠె కోపిస్తాడు. సరే అందామంటే తను ఖచ్చితంగా దుర్గతిపాలౌతాడు. మేఘుడికి ఏంచెయ్యాలో తోచలేదు. కానీ సాఠె ఎంతో బలవంతం చేయటం వల్ల అతను బాబాని దర్శనం చేసుకోవాలని శిరిడీ వచ్చాడు. మశీదు ప్రాంగణం చేరుకున్నాడు.    అతను మశీదు మెట్లెక్కేటప్పుడు "ఖబద్దార్! ఇంకో అడుగు వేసావంటే చూడు.గుర్తుంచుకో ఇది ముస్లింలుండే స్థానం. నీవు బ్రాహ్మణుడివి. నేను నీకు అంటరానివాణ్ణి వెళ్ళు. " ఉగ్రంగా ఉన్న బాబా రూపంసాక్షాత్తూ ప్రళయకాలంలోని రుద్రుడి స్వరూపమే. మేఘుడు గజగజ కంపించిపోయాడు. బాబాకి నా మనసులోని విషయాలెలా తెలుసు అని నిర్ఘాంతపోయాడు. ముందుకెళ్ళే ధైర్యం లేక కొద్దిరోజులు శిరిడీలో ఉండిపోయాడు. బాబా కోపతాపాలు చూసాడు. సేవ చేశాడు. కానీ దృఢవిశ్వాసం మాత్రం కలగలేదు. తరువాత అతను ఇంటికి వెళ్ళిపోయాడు. అక్కడ విపరీతమైన జ్వరంతో బాధపడి, బాబాపై గాలి మళ్ళగానే తిరిగి శిరిడీ వచ్చేశాడు. 




 అతనికి సాయిబాబా చరణాలపై భక్తిభావం కుదిరింది. సాయికి అనన్య భక్తుడిగా అయ్యాడు. బాబా అంటే ప్రత్యక్షంగా శంకర భగవానుడే అన్న భావన అతనికి కల్గింది. శిరిడీలో బిల్వవృక్షం లేదని, నాలుగు కిలోమీటర్ల దూరం నడచి వెళ్ళి.బిల్వపత్రాలతో బాబాని కొలిచేవాడు. ప్రేమపూర్వకంగా బాబా ఆసనానికి నమస్కరించటం, బాబా పాదాలు నొక్కటం, కడగటం, ఆయన చరణతీర్ధాన్ని త్రాగటం - ఇదే అతని నిత్యక్రమం.  మేఘుడు శిరిడీలో గ్రామ దేవతలను పూజించి, మశీదుకు వెళ్ళేవాడు. ఒకరోజు అతని నియమం తప్పిపోయింది. ఎంత ప్రయత్నించినా ఖండోభా తలుపులు తెరుచుకోలేదు. పూజకు అంతరాయం కలిగింది. అలాగే మేఘుడు హారతి తీసుకొని మశీదుకు వచ్చాడు. బాబా అతనితో నీ పూజకు అంతరాయం కలిగింది. సర్వదేవతల పూజను చేసావు కానీ ఒకదైవం పూజ చేయలేదు. వెళ్ళు తలుపులు తెరచివున్నాయి ..అది పూర్తి చేసి ఇక్కడికి రా అన్నారు. అతని మనసులో అశాంతి తొలగిపోయింది. మేఘుడు ఖండోబాని పూజించి, గంధపుష్పాది ఎనిమిది ఉపచారాలతో బాబాని పూజించాడు. 




ఒక మకరసంక్రాంతి నాడు  మేఘుడు తనకు శివుడైన బాబాకు అభిషేకము చేసితీరవలెనని పట్టుబట్టెను. మేఘశ్యాముడు 8 క్రోసుల దూరమునున్న నదీతీరము నుండి గంగాజలము తెచ్చి  బాబా వద్దకు వచ్చి మరల అభిషేకమునకై అడుగగా.. సమ్మతించి క్రిందికి దిగి పీటపై కూర్చుండి తల ముందుకుసాచి ..ఓ మేఘా శరీరమునకు తల ముఖ్యము కావున తలపైనే నీళ్ళు పోయుము. శరీరమంతటిపై పోసినట్లగును" సరే అని మేఘుడు భక్తిపారవశ్యమున 'హరగంగే, హరగంగే' అనుచు శరీరమంతటిపై నీళ్ళు పోసెను. బాబా వైపు చూడగా అతని ఆశ్చర్యానందములకు మేరలేదు. బాబా తల మాత్రమే తడిసి, శరీరమంతయు పొడిగా నుండెను. ఇదే సాయి భక్తియొక్క సారం. ఆ భక్తి అంటూ ఏర్పడితే అప్పుడు ఆ భక్తులు దేన్నైనా ప్రాప్తింపచేసుకోగలరు.

 మేఘశ్యాముడు బాబాను రెండుచోట్ల పూజించుచుండెను. మశీదులో ప్రత్యక్షంగా, సాఠెవాడాలో నానాసాహెబ్ చాందోర్కర్ ఇచ్చిన పటమును పూజించుచుండెను. ఒకనాడు వేకువఝామున మేఘుడు తనశయ్యపై పడుకొని కండ్లుమూసుకొని లోపల ధ్యానము చేయుచు బాబా రూపమును చూసెను. బాబా అతనిపై అక్షతలు చల్లి "మేఘా! త్రిశూలము గీయుము"! అని చెప్పి అదృశ్యుడయ్యెను.ఇది కలా నిజమా అని చూడగా అక్కడ అక్షతలు పడియుండెను. బాబా వద్దకు వెళ్ళి త్రిశూలం సంగతి అడుగగా..నా మాటలు వినలేదా? త్రిశూలము గీయి. దృశ్యము కాదు నేనేచెప్పాను. నేను ప్రవేశించడానికి తలుపులు అవసరం లేదు. నాకు ఆకారమూ లేదు విస్తరణా లేదు. నేను సర్వదా అంతటా వ్యాపించి వున్నాను. మేఘుడు వాడాలో బాబా పటము వద్ద గోడపై త్రిశూలమును ఎర్రరంగుతో గీసెను. ఆ మరునాడు ఒక రామదాస భక్తుడు పూనా నుంచి వచ్చి బాబాకు నమస్కరించి ఒక లింగమును సమర్పించెను. అక్కడ మేఘుడు కూడా ఉండెను. "చూడు శంకరుడు వచ్చినాడు! జాగ్రత్తగా పూజింపుము!" మేఘుడు త్రిశూలము గీసిన వెంటనే లింగము వచ్చుట చూసి ఆశ్చర్యపడెను. వాడాలో కాకాసాహెబ్ దీక్షిత్ స్నానము చేసి సాయిని తలచుకొనుచుండగా తన మనోదృష్టి యందు లింగము వచ్చుట గాంచెను. అతడాశ్చర్యపడుచుండగా మేఘుడు వచ్చి, బాబా తనకు లింగము కానుకగా ఇచ్చెనని చూపెను. కాకాసాహెబ్ కి ఈ లింగం విశిష్టతను చూసి ఆశ్చర్యంతో పాటు ఆనందం కలిగింది. ఒక క్షణం ముందర ఎవరి ఆకారమూ, చిహ్నమూ ధ్యానంలో వచ్చాయో అదే లింగాన్ని చూసి దీక్షిత్ మనసు సుఖించింది. ఈ ప్రకారంగా గోడమీద త్రిశూల ఆకారం గీయించి, తన చిత్రం పక్కన శివలింగస్థాపన చేయించారు బాబా. మేఘుడికి శంకరుని పూజ అంటే ఇష్టమని అతనికి శివలింగాన్నిచ్చి అతని శివభక్తిని బాబా దృఢం చేశారు.











  ఈ మేఘుడు బ్రహ్మచారి. ప్రతిరోజు ఉదయాన్నే చన్నీటి స్నానం చేసి దేహమంతా భస్మం పూసుకొని మృగచర్మంపై కూచునేవాడు. ఫాలభాగంపై అడ్డుగా విభూతిరేఖలు దిద్దుకొని తెల్లటి చందనం పెట్టుకొనేవాడు. తన దేహంలో తపోబలాన్ని మరొక జలంధరుడులా ప్రతిబింబించేవాడు. నిజంగానే మేఘుడి తపస్సు గొప్పది. అతను బాబా హారతి కూడా ఒంటికాలిమీదే నిలబడి చేసేవాడని అంటారు. బాబాకి అతనితో ఏదో ఋణానుబంధం ఉండి ఉంటుంది. లేకపోతే అతన్ని రావ్ బహదూర్ సాఠె ద్వారా శిరిడీకి లాగి, శంకరుడు సాక్షాత్తూ తానే అన్నట్లు అతని భక్తి పట్లా, తపశ్చర్య పట్లా ప్రసన్నులై బాబాగారు క్రీ.శ 1912వ సంవత్సరంలో శిరిడీలో తమ వద్ద మేఘుడు మరణించినప్పుడు స్వయంగా అతని శ్మశాన యాత్రలో తాము ఉండి, అతని దేహంపై పూలు జల్లి, అతనికి సద్గతిని ప్రసాదించారు. మేఘుడు అదృష్టవంతుడు. మేఘుడు జన్మ ధన్యం. మేఘుడు తన జీవితాన్ని సార్ధకం చేసుకొన్నాడు. గురుకృప ఉన్నప్పటికీ సాధకులు తమ సాధన తామే స్వయంగా చేసుకోవాలి. గురువు కేవలం మార్గదర్శనం చేస్తూ వారి  సాధనను నడిపిస్తారు. బాబాఇలా చెప్పారు. " మీరు తీవ్రంగా ప్రయత్నించండి! ప్రతిఫలాపేక్షను పూర్తిగా వదిలేయండి. మీకు ఫలాన్నివ్వటానికి మీ వెనక నేను నిలబడి ఉన్నాను."



   సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు