Showing posts with label ఆధ్యాత్మికం. Show all posts
Showing posts with label ఆధ్యాత్మికం. Show all posts
Thursday, August 13, 2020 0 comments By: visalakshi

**శ్రీ దత్త గురవే నమః*

*శ్రీ దత్తాయ గురవేనమః*


*భక్తితత్వమే మహిమాన్వితం!*

సంతాపాలన్నీ సంకల్ప జనితాలు. ఆవేదనలన్నీ ఆలోచనా ఫలితాలు. విచారము లేకుండా విషాదము రాదు. భావనలోనే బాధలు పుట్టుకొస్తాయి. వర్షం కురిసింది అంటే ఆకాశంలో మేఘాలున్నట్లే. గగనంలో నిలిచియున్న మేఘాలే వర్షాలై కురుస్తాయి. మనోగగనంలో చలించే సంకల్ప మేఘాలే బ్రతుకులలో బాధల వర్షాన్ని కురిపిస్తాయి. వేదనా వడగళ్లను రాల్చుతాయి.

బాధపడటం ఎవ్వరికీ ఇష్టం లేదు. అలాగని బాధల నుండి విడిపడటం ఎవరికీ సాధ్యం కావటం లేదు. అంటే, బాధలు బ్రతుకుల్లో అంతగా పెనవేసుకుని ఉన్నాయని అర్థం. విడదీయలేని రీతిలో అతుక్కుపోయాయి. బాధలు ఇష్టం లేకపోయినా, బాధపడటం కష్టంగానేయున్నా, బాధలుపడుతూ బ్రతకడం మనిషికి అనివార్యంగా ఉంది. అలవాటుగా మారింది. ఎందుకో తెలుసా! బాధలు నాకు వద్దు అంటున్నది ఎవరో ఒక్క క్షణం ఆలోచించండి. బాధలను వరించినవారే. ఇక్కడే ఉంది చిక్కుముడి.  నేను ఇంతకాలం జీవించాను అనేవారే గాని అలా జీవించడంలో ఎంత బాధను ప్రోది చేసుకున్నాను అని ప్రశ్నించుకొనేవారు అరుదుగా ఉంటారు. ఒకనాటి బాధలు నేడు లేకపోవచ్చు. బాధానుభూతులు మనస్సుల నుండి దూరం కాలేదనే వాస్తవం తెలిసినవారెందరు? బ్రతుకులో బాధలున్నాయి. బుద్ధిలో బాధల జ్ఞాపకాలూ ఉన్నాయి. అవే బాధాస్మృతులు. మతులను చెడగొట్టేవి మనుగడను కాలరాచేవి ఈ స్మృతులే. ఎవరి మనస్సులైనా చేదు జ్ఞాపకాలతోనే చిందులేస్తూ ఉంటాయి. స్మృతులను ఆపడం మనిషికి ఎలా సాధ్యం కాదో, వాటి మధ్య హాయిగా జీవించడం కూడా అలాగే సాధ్యం కాదు. ఇక్కడే బ్రతుకు మోయలేని బండగా మిగిలిపోతోంది.

మనసేమీ బాగలేదు. అలా సినిమాకెళ్దాం. ఇలా మిత్రుల మధ్య గడుపుదాం అని పలుకుతూ ఉంటారు. అలాగే ప్రవర్తిస్తూ ఉంటారు కూడా. నిజమే.   బావుంది.. ఫలితమేమిటి? అలా చెయ్యడం వల్ల బాగలేని మనస్సు బాగుపడుతుందా? కానే కాదు. బాగుపడలేని మనస్సు, బాధపడే మనస్సు తాత్కాలికంగా బాధను మరచిపోతుంది. అంతే.  సినిమాలో ఉండేది రెండుమూడు గంటలే. బంధుమిత్రాదుల మధ్య ఎంతకాలం ఉండగలం? వాళ్లను, లేదా ఆ పరిస్థితుల్ని విడిచిపెట్టి రాగానే మళ్లీ జ్ఞాపకాలు ప్రారంభమవుతాయి. స్మృతులు కదుల్తాయి. మతులు కలవరపెడతాయి. మరొక విషయాన్ని కూడా ఇక్కడ అర్థం చేసుకోవాలి. వినోదాల మధ్య ఉన్నంత మాత్రాన జ్ఞాపకాలు రావని చెప్పలేము. సరదాగా స్నేహితుల సరసన నవ్వుతూ కాలం వెళ్లబుచ్చుతున్నా, బాధల జ్ఞాపకాలు రావచ్చు. అలాంటి సమయాల్లోనే ప్రక్కవారు ”ఏమిటి? ఉన్నట్లుండి అదోలా మారిపో యారు అని మన ఆంతర్యంలోని మూగబాధను ముఖాలలో చూసి మాట్లాడుతూ ఉంటారు. అర్థమైందా? మన గతాలు స్వగతాలుగా మారి, అనుక్షణం బుద్ధిలో స్వాగత తోరణాలను అలం కరిస్తూ ఉన్నంతకాలం బాధల నుండి విడిపడటం మనిషికి సాధ్యం కాదు. మనం మనకు జ్ఞాపకం వస్తున్నంత కాలం మనస్సు మదనపడుతూనే ఉంటుంది. మనుగడ మలినపడుతూనే ఉంటుంది.  గతాన్ని పూర్ణంగా తుడచివేయాలి. బాధానుభవాలను గూర్చి మనస్సు ఆలోచించకుండా చూసు కోవాలి. అదెలా సాధ్యం? స్మృతుల మధ్య సతమతమయ్యే మనస్సు, బాధానుభవాలలో తలదూర్చి విలపించే బుద్ధి వాటి నుండి విడిపడాలి.

అలా జరగాలి అంటే, మనస్సు మరోకోణంలో ఆలో చించడం ప్రారంభించాలి. బుద్ధి మరోవిధంగా చరించగలగాలి.  అయితే, ఒక్క సత్యాన్ని ఇక్కడ విస్మరించకూడదు. మనస్సు దేనిని గురించి ఆలోచించినా, బుద్ధి మరొక చోట సంచరించినా ఫలితం మాత్రం శూన్యంగానే ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆలోచనలన్నీ ప్రపంచానికి సంబంధించే ఉంటాయి. మన స్మృతులు అందుకు భిన్నంగా లేవు. సంబంధాలతో ముడిపడియున్న ఈ ప్రపంచంలో ఒక అనుభవం మరొక అనుభవంతో కరచాలనం చెయ్యకపోదు.  చీకటిని చీకటితో పోగొట్టలేము. (నహి తమ స్తమసో నివర్తకమ్‌) మరి బాధల వలయం నుండి ఎలా విడి వడాలి? దానికి మార్గమేమిటి? మార్గం ఉంది. అదే భక్తి. భక్తి ఏం చేస్తుంది? భక్తి వల్ల బ్రతుకులో ఏం జరుగుతుంది? భక్తి మనస్సును సం స్కరిస్తుంది. మనస్సులోని స్మృతులను శాశ్వతంగా మరుగున పడేస్తుంది. మహిమను ఆవిష్కరిస్తుంది.  పరమేశ్వరునితో మనకుండే సంబంధాన్ని భక్తి గుర్తుచేస్తుంది. భగవంతుని స్మరణతో బుద్ధిని నింపేస్తుంది. జ్ఞాపకాలతో గొడవపడే మనస్సును గోవిందునితో ముడిపడి జీవించేలా చేస్తుంది. గతం పంచే అనుభవ స్మృతుల మధ్య శోకసాగరంలో మునిగి పోతూ భగవంతుని విస్మరించాం. సదా పరమేశ్వరుని చింతించడంలో గతానుభూతుల్ని శాశ్వతంగా పాతిపెట్టి ఆనందంగా, తృప్తిగా జీవించగలు గుతాము. ఇదంతా భక్తి వలన కలిగే దివ్యమైన శక్తి.  బాధలను శాశ్వ తంగా మరుగుపరచి, మహిమతో మనస్సును ఊరేగించే స్థితి.  భక్తి ఎలా చెయ్యాలి? భక్తితో బుద్ధిని భవ్యంగా ఎలా మార్చుకోవాలి? బుద్ధిలో సదా భగవంతుడే శోభించేలాగా ఆచారాన్ని, విచారాన్ని కదలిస్తూ ఉండటమే భక్తి.

 శ్రీ దత్తస్వామి తన సంకల్పంతోనే దుష్టశిక్షణ చేయగలడు. అయినా కలియుగంలో బలహీనులు, అల్పాయుష్కులైన మానవులకు మనసును నిగ్రహించే శక్తి బహుస్వల్పమని పరమాత్మకు తెలుసు. కాబట్టే శ్రీ పాద శ్రీ వల్లభుడుగ మానవరూపముతో అవతరించుట, జగద్గురువుగా ప్రజలకు విశదపరచుట జరిగింది. ఆయన అపారదయామయుడు. తన నామస్మరణతోనే, దత్త నామస్మరణతోనే, గురు నామస్మరణతోనే రక్షణ యిస్తానని వాగ్దానం చేసినాడు.  అంతేకాదు. అనేక వేలమంది తపస్వులయొక్క తపోశక్తిని,  గురువుల ధారణాశక్తిని  ఆస్తికులైన మానవులకు అదృశ్యంగా అందించి, ప్రజలందరినీ గురుభక్తిమార్గమునందు ప్రవర్తించునట్లు చేయ సంకల్పించినారు .కలిపురుషుని కబంధహస్తాలకు గురుభక్తులైనవారు చిక్కరు. ఇది బ్రహ్మదేవుడు కలిపురుషునికి ప్రారంభంలోనే చెప్పిన నిబంధన.

     శ్రీ పాదుల సంకల్పంతో అనేక మంది గురువుల సంకల్పబలంతో ఇటీవల సర్వులకూ భక్తిమార్గం లభించింది. యాత్రలు చేయుటయందు దైవ దర్శనము చేయుటయందు అభిరుచి పెరిగింది. ఇది కలిపురుషునికి కంటగింపైనది. ఏ విధంగానైనా దైవ దర్శనాలు భక్తులకు లేకుండ చేయుటే లక్ష్యంగా ఈ *కరోనా వ్యాధి* అనే అస్త్రాన్ని ప్రయోగించి భక్తులను భయభ్రాంతులను చేయ ప్రయత్నిస్తున్నాడు. కానీ గురువుల సంకల్పము, దత్త సంకల్పము మహా శక్తివంతమైనవి.గుడిలోని దైవమే గుండెలో వున్నాడు. ప్రతి భక్తుని గుండె ఒక గుడియై నిరంతరారాధన అపారంగా జరుగుచున్నది.ఎవరింటిలో వారు వుండి మహత్తరమైన ఆరాధన చేయుచున్నారు. మనసు నిలుపుకొనుటకై ఒక రూపము అవసరమైనది. అందువలననే దేవాలయములు వెలసినవి. మహర్షులయొక్క మరియు సద్గురు శ్రీ పాద వల్లభుల పరంపర యొక్క మహాసంకల్పము చేత కలిపురుషుని ప్రభావము అణగారిపోవును.ఇది తథ్యము. గురు భక్తులారా! ప్రస్తుత పరిస్థితుల్లో నిరంతరము గురునామ స్మరణయే గురు భక్తుల చేతిలోని బ్రహ్మాస్త్రం.

నేటి మంత్రపఠనం*

#దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి - శ్రీ దత్త నామ కవచం - ఫలితాలు

దత్తపరమైన జ్ఞానం చెప్పుకోవడం, వినడం అనే క్రియవల్ల అన్ని అమంగళములు నశించి పోతాయి అంటూ దత్తుడి మహిమ చెప్పుకోవడం వల్ల వచ్చే ఫలితం చెప్తూ వేదధర్ముడు దీపకునికి ఒక 108 అద్భుత దత్తనామములు చెప్తాడు. ఆ దత్తనామాలు నిత్యానుష్టానం చేసేవాడిని కవచంలా స్వామి కాపాడతాడు.

#దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి*

ఓం శ్రీ దత్తాయ నమః
ఓం దేవదత్తాయ నమః
ఓం బ్రహ్మదత్తాయ నమః
ఓం శివదత్తాయ నమః
ఓం విష్ణుదత్తాయ నమః
ఓం అత్రిదత్తాయ నమః
ఓం ఆత్రేయాయ నమః
ఓం అత్రివరదాయ నమః
ఓం అనసూయాయ నమః
ఓం అనసూయాసూనవే నమః 10
ఓం అవధూతాయ నమః
ఓం ధర్మాయ నమః
ఓం ధర్మపరాయణాయ నమః
ఓం ధర్మపతయే నమః
ఓం సిద్ధాయ నమః
ఓం సిద్ధిదాయ నమః
ఓం సిద్ధిపతయే నమః
ఓం సిధ్ధసేవితాయ నమః
ఓం గురవే నమః
ఓం గురుగమ్యాయ నమః 20
ఓం గురోర్గురుతరాయ నమః
ఓం గరిష్ఠాయ నమః
ఓం వరిష్ఠాయ నమః
ఓం మహిష్ఠాయ నమః
ఓం మహాత్మనే నమః
ఓం యోగాయ నమః
ఓం యోగగమ్యాయ నమః
ఓం యోగాదేశకరాయ నమః
ఓం యోగపతయే నమః
ఓం యోగీశాయ నమః 30
ఓం యోగాధీశాయ నమః
ఓం యోగపరాయణాయ నమః
ఓం యోగిధ్యేయాంఘ్రి పంకజాయ నమః
ఓం దిగంబరాయ నమః
ఓం దివ్యాంబరాయ నమః
ఓం పీతాంబరాయ నమః
ఓం శ్వేతాంబరాయ నమః
ఓం చిత్రాంబరాయ నమః
ఓం బాలాయ నమః
ఓం బాలవీర్యాయ నమః 40
ఓం కుమారాయ నమః
ఓం కిశోరాయ నమః
ఓం కందర్ప మోహనాయ నమః
ఓం అర్ధాంగాలింగితాంగనాయ నమః
ఓం సురాగాయ నమః
ఓం వీరాగాయ నమః
ఓం వీతరాగాయ నమః
ఓం అమృతవర్షిణే నమః
ఓం ఉగ్రాయ నమః
ఓం అనుగ్రహరూపాయ నమః 50
ఓం స్ధవిరాయ నమః
ఓం స్ధవీయసే నమః
ఓం శాంతాయ నమః
ఓం అఘోరాయ నమః
ఓం మూఢాయ నమః
ఓం ఊర్ధ్వరేతసే నమః
ఓం ఏకవక్త్రాయ నమః
ఓం అనేకవక్త్రాయ నమః
ఓం ద్వినేత్రాయ నమః
ఓం త్రినేత్రాయ నమః 60
ఓం ద్విభుజాయ నమః
ఓం షడ్భుజాయ నమః
ఓం అక్షమాలినే నమః
ఓం కమండలధారిణే నమః
ఓం శూలినే నమః
ఓం శంఖినే నమః
ఓం గదినే నమః
ఓం ఢమరుధారిణే నమః
ఓం మునయే నమః
ఓం మౌనినే నమః 70
ఓం శ్రీ విరూపాయ నమః
ఓం సర్వరూపాయ నమః
ఓం సహస్రశిరసే నమః
ఓం సహస్రాక్షాయ నమః
ఓం సహస్రబాహవే నమః
ఓం సహస్రాయుధాయ నమః
ఓం సహస్రపాదాయ నమః
ఓం సహస్రపద్మార్చితాయ నమః
ఓం పద్మహస్తాయ నమః
ఓం పద్మపాదాయ నమః 80
ఓం పద్మనాభాయ నమః
ఓం పద్మమాలినే నమః
ఓం పద్మగర్భారుణాక్షాయ నమః
ఓం పద్మకింజల్కవర్చసే నమః
ఓం జ్ఞానినే నమః
ఓం జ్ఞానగమ్యాయ నమః
ఓం జ్ఞానవిజ్ఞానమూర్తయే నమః
ఓం ధ్యానినే నమః
ఓం ధ్యాననిష్ఠాయ నమః
ఓం ధ్యానస్ధిమితమూర్తయే నమః 90
ఓం ధూళిదూసరితాంగాయ నమః
ఓం చందనలిప్తమూర్తయే నమః
ఓం భస్మోద్ధూళితదేహాయ నమః
ఓం దివ్యగంధానులేపినే నమః
ఓం ప్రసన్నాయ నమః
ఓం ప్రమత్తాయ నమః
ఓం ప్రకృష్టార్ధ ప్రదాయ నమః
ఓం అష్టైశ్వర్యప్రదాయ నమః
ఓం వరదాయ నమః
ఓం వరీయసే నమః 100
ఓం బ్రహ్మణే నమః
ఓం బ్రహ్మరూపాయ నమః
ఓం విశ్వరూపిణే నమః
ఓం శంకరాయ నమః
ఓం ఆత్మనే నమః
ఓం అంతరాత్మనే నమః
ఓం పరమాత్మనే నమః
ఓం శ్రీ దత్తాత్రేయాయ పరబ్రహ్మణే
నమో నమః 108

 ఓం శ్రీ దత్తాయనమః ఓం దేవదత్తాయనమః తో ప్రారంభమయ్యే  ఈ దివ్య నామములు  దివ్యదృష్టితో దత్తాత్రేయ స్వామి ని  దర్శించి వేద ధర్ముడు దీపాకునికి చెప్పాడు. తరువాత ఈ నామములను కవచముగా ఎలా చేసుకొనవలెనో వివరించాడు. ఈ కవచమును ఉదయము, సాయంత్రం శ్రద్ధగా చదివిన పాపములనుంచి విముక్తి కలుగును అని శిష్యునకు కూడా చెప్పెను.

#శ్రీ దత్త నామ కవచం*

1. ఓం కారాది నమోంతానం! నామ్నామష్టోత్తరం శతమ్!
శ్రద్ధయా యః పఠేన్నిత్యం! త్రిసంధ్యం నియతః సుధీః॥

#భావము:: వేదధర్ముడు ఇలా చెప్పారు - ఓం కారంతో మొదలు పెట్టి నమః శబ్దమును చివర చేర్చి నూట ఎనిమిది నామములను విద్వాంసుడు ఏకాగ్రతతో మూడు సంధ్యా కాలములలో శ్రద్ధగా చదవాలి.

2. సర్వపాప విముక్తాత్మా! జాయతే విమలాంతరః !
భుక్త్యా యథేప్సితాన్భోగాన్! ప్రేత్య బ్రహ్మణి లీయతే ॥

#భావము:: ఈ నామములు పఠించిన చో పాపచింతనలనుండి విడివడి స్వచ్ఛమైన మనస్సు కలవాడై. కోరిన కోర్కెలు తీరి సమస్త సుఖములను అనుభవించును . పరలోకమున శ్రీ దత్తునియందు ఐక్యము చెందును.

3. భక్తరక్షాక్షణో దేవః!స్మృతః సేవా స్వవేశ్మని!
స్వభోజ్యస్యార్పణం దానం! ఫలమింద్రాది దుర్లభమ్ ॥

#భావము:: భక్తరక్షణ కొరకు ఎల్లప్పుడూ దత్తుడు సిద్ధంగా వుండును. భక్తులను రక్షించుటయే ఆయనకు ఆనందం. మన ఇంట్లోనే వుండి ఆయనను తలచినా, భోజనమునకు ముందు ఆ స్వామికి భోజనం అర్పించి తినినా, మనకు దానఫలము లభిస్తుంది. ఇంద్రాది దేవతలకు కూడా దుర్లభమైన ఐశ్వర్యమును ఇచ్చును.

4. య ఏతైర్నామభిర్దివ్యైః! కవచం ధారయేత్కృతీ!
రాజవేశ్మని కాంతారే! దుర్గాదిషు మహాభయే ॥

#భావము:: ఈ అష్టోత్తర శతనామములు ఎవరు కవచముగా ధరించెదరో వారు కృతార్థులు అగుదురు. రాజభవనము నందు , అరణ్యములందు మహాభయములందు ఈ నామములతో కవచముగా ధరించిన విజయము పొందుతారు.

5. శత్రుచోరభయాకీర్ణే! శ్మశానే ప్రేతదూషితే!
న భయం విద్యతే తస్య! దృష్ట్వా తం విద్రువేద్భయమ్॥

#భావము: శత్రువులు, దొంగలు, శ్మశానములయందు,భయములువుండు చోట ఈ నామములు కవచముగా కలిగిన వానిని చూసి భయపడి అన్ని పారిపోవును.

6. శిరో లలాటం నేత్రేచ! భ్రూమధ్యం చ భ్రువౌ తథా!
నాసే కర్ణౌ తథోష్ఠౌ చ! హనుః కంఠం కకుత్తథా ॥

#భావము:: శిరస్సు, నుదురు, నేత్రములు, కనుబొమల మధ్యభాగం, కనుబొమలు, ముక్కు, చెవులు, పెదవులు, దవడలు, కంఠము, ఈ  నామములు చెప్పుచూ తాకవలెను. అక్కడ వున్న రోగములు పోతాయి.

7 . దౌతాంఘ్రిహస్త ఆచమ్య! స్మృత్యా దత్తం న్యసేత్సుధీః!
కరాంగన్యాసౌ విన్యస్య!షడ్భిః ష్షడ్భిః తతః క్రమాత్ ॥

#భావము:: చేతులు, కాళ్ళు కడుగుకొని కేశవాది నామాలతో ఆచమనం చేసి దత్తాత్రేయుని స్మరించి ఈ అష్టోత్తర శతనామ కవచమును చదువుకొనవలెను. అంగన్యాస, కరన్యాసములు ఆరేసి నామములతో  చేయవలెను.

8. జత్రుస్తనౌ చ చక్షుశ్చ! హృదయం నాభిరేవచ!
మూలాధార స్ఫిచావూరూ! జానుజంగాశ్చ గుల్ఫయౌః ॥

#భావము:: మూపు సంధులు, వక్షస్థలము, నేత్రములు, నాభి, మూలాధార ము, పిరుదులు, కటిప్రదేశము,తొడలు, మోకాళ్ళు, పిక్కలు, గిలకలు.

9. ప్రపదౌ పాదమూలాభ్యం ! తథా పాదతలే ఉభే!
పాదాగ్రాంగుష్ఠయో శ్చైవ ! హస్తాగ్రాభ్యాం తథైవ చ ॥

#భావము: మోకాళ్ళు, పాదమూలములు , పాదప్రదేశములు, బొటనవేళ్ళు, చేతుల యొక్క అగ్రభాగములకు, నామములతో కవచము చేసుకొనవలెను. నామ ప్రభావముతో ఆయా అవయము ల రోగములు పోవును మరియు కవచము వలె రక్షణ ఇచ్చును.

10. స్కంధయోర్బుజమూలాభ్యాం ! సంధిభ్యాం కరయోః పృథక్!
అంగుల్యం గుష్ఠయోశ్చైవ! హస్తాగ్రాభ్యాం తథైవ చ ॥

#భావము: భుజస్కంధముల యందు, భుజముల మూలలయందు, హస్తముల సందులయందు, వ్రేళ్ళయందు, హస్తాగ్రములయందు .

11.హృదయాద్దస్త పాదాగ్ర! పర్యంతవ్యాపకం న్యసేత్!
దశేంద్రియాంతః కరణ! చతుష్టయధృతంన్యసేత్ ॥

#భావము:: హృదయము నుంచి హస్తాది పాదాగ్రముల వరకు ఈ నామకవచమును కప్పవలెను. పది ఇంద్రియాలందు, మనో,బుద్ధి, చిత్త, అహంకారముల యందు ఈ కవచమును ఉంచవలెను.

12. రోమస్వేకం చ హృదయం! స్పృష్ట్వా నామాని పంచ చ !
జేద్భక్త్యా స్మరన్దేవం! కృతకృత్యో భవేన్నరః ॥

#భావము: రోమమలయందు, హృదయము నందు స్పృశించి అయిదు నామములను చెప్పవలెను. ఇట్లు భక్తి తో తన అవయముల అన్నిటి అందును ఆ దేవదేవుని స్మరించుచూ ఆ స్వామి నామములను జపించవలెను.

జపమునకు ముందు చేయవలసిన ధ్యాన శ్లోకం:::

#పీతాంబరాలంకృత పృష్టభాగం! భస్మావగుంఠామలరుక్మ దేహమ్!
విద్యుత్సదాపింగ జటాభిరామం! శ్రీ దత్తయోగీశమహంనతోస్మి ॥

భావము:: పట్టు వస్త్రాలు కట్టుకొన్న, విభుతితో పూయబడిన బంగారపు శరీరము కలవాడు, మెరుపు తీగ వలె పచ్చనైన జడలతో మనోహరమైన శ్రీ దత్తయోగీశ్వరునికి అన్నివేళలా వంగి వంగి నమస్కరిస్తాను.....(from FB)

        *శుభమస్తు*

🙏సమస్త లోకా సుఖినోభవంతు🙏

శ్రీ గురు రాఘవేంద్రస్వామి

**శ్రీ గురు రాఘవేంద్రస్వామి*



శ్రీ గురు రాఘవేంద్ర స్వామి(1595-1671)హిందూ మత ద్వైత సిద్ధాంతానికి సంబంధించిన ఒక ప్రముఖమైన గురువు. 16వ శతాబ్దంలో జీవించారు. ఇతను వైష్ణవాన్ని (విష్ణువుని కొలిచే సిద్ధాంతం) అనునయించారు, మరియు మధ్వాచార్యులు బోధించిన ద్వైతాన్ని అవలంబించారు. ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు. తమిళనాడులోని కుంభకోణం మధ్వమఠాన్ని 1624 నుండి 1636 వరకూ మఠాధిపతిగా పాలించి ఆపై ఉత్తరానికి యాత్రలు చేసారు. ఇతను శ్రీమూల రాముడి మరియు శ్రీ పంచముఖ ముఖ్యప్రాణదేవరు (పంచముఖ హనుమంతుడు) యొక్క పరమ భక్తులు. ఇతను పంచముఖిలో తపస్సు చేశారు, ఇచ్చట పంచముఖ హనుమంతుణ్ణి దర్శించారు.(హనుమంతుని పంచముఖ దర్శనం శ్రీరామ చంద్రులు తర్వాత దర్శించినది శ్రీ రాఘవేంద్ర తీర్ధులు మాత్రమే) మంత్రాలయం లో తన మఠాన్ని స్థాపించారు, మరియు ఇక్కడే జీవ సమాధి పొందారు . వేలకొలదీ భక్తులు తరచూ మంత్రాలయ దర్శనానికి వస్తుంటారు. రాఘవేంద్రస్వామి వెంకణ్ణ భట్టుగా తమిళనాడులోని భువనగిరిలో తిమ్మణ్ణభట్టు మరియు గోపికాంబ అనే కనడ భట్టు రాజులు రెండవ సంతానంగా 1595లో జన్మించారు. జన్మ సంవత్సరం 1598 లేదా 1601 కూడా కావచ్చు అనే వాదనలున్నాయి. వేంకటేశ్వర స్వామి వారి అనుగ్రహంతో పుట్టినందుకు ఈతణ్ణి చిన్నప్పుడు వేంకటనాథుడనీ, వేంకటాచార్య అని కూడా పిలిచేవారు. తన బావ లక్ష్మీనరసింహాచార్ వద్ద మదురైలో ప్రాథమిక విద్యను అభ్యసించాక, వేంకటనాథుడ్ని కుంభకోణంలోని శ్రీమఠంలో విద్యార్థిగా చేరి, ఆపై రాఘవేంద్ర తీర్థులుగా సన్యసించారు. 1614లో మదురై నుండి తిరిగి వచ్చినపుడు సరస్వతీ బాయితో వీరికి వివాహమయింది. వీరి కొడుకు లక్ష్మీనారాయణాచార్య అదే సంవత్సరంలో పుట్టాడు. ఆ తర్వాత కుటుంబమంతా కుంభకోణం చేరుకుంది. శ్రీమఠంలో రాఘవేంద్ర స్వామి సుధీంద్రతీర్థుల వద్ద అభ్యసించడం మొదలుపెట్టారు. అనతికాలంలో గొప్ప విద్యార్థిగా ఉద్భవించి, అన్ని వాదోపవదాల్లో తర్కాలలో తనకంటే పెద్దవారిని సైతం ఓడించారు. సంస్కృత మరియు వైదికశాస్త్రాల్లో నిష్ణాతుడై ఇతరులకు బోధించడం మొదలుపెట్టారు. రాఘవేంద్రస్వామి సంగీతంలో కూడా నిష్ణాతులే, ఆయన కాలంలో ఆయనో గొప్ప వైణికుడు కూడా. గురువు తరువాత మఠం బాధ్యతలు స్వీకరించి ఆపై దక్షిణభారత దేశమంతా విజయం చేయటానికి బయలుదేరారు. మార్గంలో ఎన్నో అద్భుతాలను తన శిష్యబృందానికి చూపిస్తూ మధ్వప్రోక్త ద్వైత సిద్ధాంతానికి బాగా ప్రచారం చేసారు. 1671 లో తన శిష్యబృందంతో రాబోయే 800 సంవత్సరాలు జీవించే ఉంటానని చెప్పి మంత్రాలయంలో జీవసమాధి పొందారు. శ్రీ గురు రాఘవేంద్ర స్వామి చరిత్ర శ్రీరాఘవేంద్రులు జ్ఞాన సంపన్నుడు, సిద్ధ పురుషుడు. మంత్రాలయంలోని బృందావన సన్నిధానంలో భక్తులు పొందే శాంతి సంతృప్త్తుల మాటలకందనివి. అలజడి, అశాంతి, ఆందోళనలతో నిండిన నేటి నాగరిక సమాజానికి అటువంటి సత్పురుషుల సాహిత్యం, సాన్నిహిత్యం, సాన్నిధ్యం ఎంతో అవసరం. అది నిరంతరం వెలిగే అఖండ జ్యోతి.

గురు రాఘవేంద్రస్వామి చరిత్ర శ్రీ రాఘవేంద్రస్వామి 1571లో కాంచీపురం సమీపంలోని భువనగిరిలో నిరుపేద కుటుంబంలో తిమ్మన్నభట్టు , గోపికాంబ దంపతులకు జన్మించాడు. తల్లిదండ్రులుపెట్టిన పేరు వెంకటనాధుడు. వీరి తాతగారు శ్రీకృష్ణ్ణదేవరాయల ఆస్థాన వైణికుడిగా వుండేవారు. వెంకటనాథుడి బాల్యంలోనే తల్లిదండ్రులు గతించారు. బావగారైన లక్ష్మీనారాయణ చేరదీశాడు. బావగారి పెంపకంలోనే వెంకటనాథుడు సర్వశాస్త్ర పారంగతుడయ్యాడు. యుక్తవయసు రాగానే సరస్వతి అనే కన్యతో వివాహమైంది. ఓ పిల్లవాడు కూడా పుట్టాడు. కాని వెంకటనాధునికి దరిద్రం దావాలనంలా చుట్టుముట్టింది. ఆదుకునేవారెవరు లేరు. నిస్సహాయ స్థితిలో వెంకటనాధుడు భార్యాబిడ్డలతో కలిసి కుంభకోణం చేరుకున్నాడు. అనూహ్యంగా అక్కడ తాత్కాలికంగా బసచేసిన సుధీంద్ర తీర్థులవారి ఆశ్రయం లభించింది. గురు సాంగత్యం సుధీంద్రుడు కొత్త శిష్యుడైన వెంకట నాధుని ఎంతో ప్రేమగా ఆదరించాడు. శిష్యుని అసమాన్య ప్రజ్ఞాపాటవాలకు ఆశ్చర్యపోయాడు. అతని మేథాశక్తిని, శాస్త్ర జ్ఞాన ప్రావీణ్యాన్ని అభినందించకుండా ఉండలేకపోయాడు. జ్ఞాన వరిష్టుడైన వెంకటనాధుని వినయ విధేయతలు చిత్తశుద్ధీ గురువైన సుధీంద్ర యతీంద్రులను బాగా ఆకర్షించాయి. వయోభారంతో వున్న సుధీంద్రులు శిష్యుడైన వెంకటనాధుని ఒకరోజు పిలిచి "వెంకటనాథా! నేను వృద్ధాప్యంలో ఉన్నాను. ఈ శరీరం నేడోరేపో అన్నట్టుగా ఉంది. రామచంద్రమూర్తి ఆరాధన నిరంతరాయంగా కొనసాగించేందుకు నా తర్వాత ఈ పీఠాధిపత్యం నీవు వహించాలి" అని తన మనసులోని కోరికను బయటపెట్టాడు. తనకు భార్యాబిడ్డలున్నారని కుటుంబ పోషణ చేసి వారిని సుఖపెట్టడం తన బాధ్యత అని చెప్పాడు వెంకటనాథుడు. గురువుగారి కోరికను తీర్చలేకపోతున్నందుకు వ్యాకులపడుతూ ఇంటికి చేరుకున్నాడు. భార్యకేమీ చెప్పలేదు. ఆ రాత్రి కలలో సరస్వతీదేవి ప్రత్యక్షమై "నాయనా వెంకటనాథా! నీవు కారణ జన్ముడవు. నీ అద్భుత మేధా సంపత్తితో సద్గురువువై దారి తప్పిన జనాలకు దారి చూపు! అంతేకాదు వ్యతిరేక వర్గాల ఎదురు దాడులనుంచి మధ్వ సిద్ధాంతాన్ని మధ్వ సాంప్రదాయాన్ని రక్షించగల సమర్ధుడవు నీవే. లే! ఆలోచించక నీ గురువు చెప్పినట్టు చెయ్యి" అని పలికింది. మేల్కొన్న వెంకటనాథుడు పరుగు పరుగున గురువు సన్నిధికి చేరుకున్నాడు. సుధీంద్రులు వెంకటనాథుని తంజావూరులోని తన ఆశ్రమానికి తీసుకునిపోయి శాస్త్రోక్తంగా సన్యాస దీక్షనిచ్చి పీఠాధిపత్యం అప్పగించాడు. దీక్షానామం రాఘవేంద్రస్వామి. 40 ఏళ్ల పవిత్ర జీవనం సన్యాస దీక్ష తీసుకునేనాటికి రాఘవేంద్రుల వయసు 23 ఏళ్లు. తదుపరి 40 ఏళ్లు అతి పవిత్ర జీవనం గడిపి నియమ నిష్టలతో నిత్య సైమిత్తికాలతో మూలరాముని ఆరాధించాడు. ఈ 40 ఏళ్ల కాలంలో సాధించిన విజయాలు, జరిగిన సంఘటనలు, మహిమలు వారి సోదరి కుమారుడు నారాయణాచార్‌ రాఘవేంద్ర విజయమ్‌ అన్న గ్రంథంలో నిబద్ధం చేశారు. ఆనాటి నవాబు ఒకరు రాఘవేంద్రులను పరీక్షింపదలచి రెండు బుట్టలతో మాంసం పంపాడు. భక్తులు శిష్యులు ఆ బుట్టలు తెరిచి చూడగా పళ్లు, పువ్వులు అందులో ఉన్నాయి. ఒకసారి మృతి చెందిన బాలుడికి ప్రాణం పోశారు. నిరక్షరాస్యుడైన వెంకన్నను ఆదోనిలోని గవర్నరు వద్ద దివాను స్థాయికి పెంచడం, సిద్ధి మస్సానెత్‌ఖాన్‌ మంత్రాలయం గ్రామాన్ని రాఘవేంద్రులకు రాసి ఇవ్వడం (మద్రాస్‌ డిస్ట్రిక్ట్‌ గెజిటీర్‌ పునర్ముద్రణ 1916 చాప్టర్‌ 15 ఆదోని తాలూకా పేజీ 213) వంటివి జరిగాయి. మద్రాసు గవర్నర్‌ ధామస్‌ మన్రోకు రాఘవేందస్వ్రామి చూపిన అద్భుతాలు బళ్లారి జిల్లా గెజిటీర్‌లో చూడవచ్చు. రాఘవేంద్రుల యశశ్చంద్రికలు దశదిశలా పాకాయి.  బృందావనిలో జీవ సమాధి.. పీఠాధిపత్యం వహించి నలభై ఏళ్లు పూర్తి కావస్తున్న సందర్భంలో శిష్యుడైన వెంకన్నను పిలిచి విషయమంతా సేకరించి తుంగభద్రా తీరాన మంత్రాలయంలో తాను జీవ సమాధి కావడానికి అందమైన బృందావనం నిర్మించమని కోరాడు. చెప్పిన ప్రకారం వెంకన్న చక్కని బృందావన మందిరాన్ని నిర్మించాడు. శ్రీ రాఘవేందస్వ్రామి నిత్య నైమిత్తికాలు పూర్తి చేసుకుని శుచియై చేతిలో వీణను పట్టుకుని సమాధిలో ప్రవేశించాడు. శ్వాసని నిలిపివేసి మనోలయం చేశాడు. 1200 సాలిగ్రామాలతో బృందావన సమాధిని మూసివేశారు. సమాధి గతుడైన తర్వాత ఆయన చూపిన మహిమలు, చేసిన అద్భుతాలు కోకొల్లలు. 700 సంవత్సరాలు సూక్ష్మరూపంలో బృందావనంలో ఉండి తన భక్తులను అనుగ్రహిస్తానని ఆయన చేసిన ప్రకటన సత్యాతి సత్యం. ఆయన ప్రియశిష్యుడు అప్పణాచార్యులు తుంగభద్ర ఆవలి తీరాన వుండేవారు. గురువు సమాధి ప్రవేశం చేస్తున్నాడని తెలిసి నదిని దాటి పరుగున బృందావనానికి చేరుకున్నాడు. అప్పటికే అంతా ముగిసింది. అప్పణాచార్యులు కవి కన్నీటి పర్యంతం అయ్యాడు. తాను వస్తూ దారిలో అల్లుకుంటూ వచ్చిన శ్లోకంలో ఏడక్షరాలు ముగింపులో కొరవడ్డాయి. వ్యధ చెందుతున్న శిష్యుడిని తృప్తిపరిచేందుకు ఆ ఏడక్షరాలు సమాధిలోంచి వెలువడ్డాయి. ఆ శ్లోకమీనాటికీ బృందావనంలో ప్రార్ధనలో పఠిస్తారు. అసమాన శేముషీదురంధరుడైన రాఘవేంద్రునికి టిప్పణాచార్య చక్రవర్తిగా బిరుదు లభించింది. వ్యాకరణ శాస్త్రంలో ఆయన ప్రజ్ఞా పాటవాలకు మెచ్చి మహా భాష్యకార బిరుదంతో సన్మానించారు.

ఆయన స్వతంత్ర రచనల్లో జైమిని పూర్వ మీమాంస సూత్రాలకు రాసిన భాష్యం భట్ట సంగ్రహం భారతీయ తత్వశాస్త్రానికి అపురూపమైన కానుక. వివిధ భాషలకు సులభంగా వ్యాఖ్యానాలు రచించి మధ్వ సిద్ధాంత ఔన్నత్యాన్ని ప్రతిపాదించాడు. ఐతరేయోపనిషత్తు మినహా తొమ్మిది ప్రధాన ఉపనిషత్తులకు వ్యాఖ్యానాలు రచించారు. వ్యాసతీర్థల చంద్రికకు ప్రకాశిక పేరుతో చేసిన పరిమళ వ్యాఖ్యానంతో పరిమళాచార్యుడుగా వాసికెక్కాడు.  శ్రీ రాఘవేంద్ర స్వామి వారి మహిమలు శ్రీ గురురాయ రాఘవేంద్ర యతీంద్రులు కారణ జన్ములు.ఆయన బృందావన ప్రవేశానికి ముందు , బృందావన ప్రవేశం తరువాత కుడా ఎన్నో మహిమలు భక్తులకు అనుభవమవుతునే ఉన్నాయి.వాటిలోని కొన్ని లీలలను స్మరించుకుందాం. శ్రీ స్వామి ని ఒక బ్రహ్మచారి చాలకాలంగా సేవించు కుంటూ ఉండేవాడు కొంతకాలానికి అతనికి పెళ్ళి చేసుకోవాలనే ఆశ కలిగింది. శ్రీ గురువుల ఆశీర్వచనం తీసుకొని వెళదామని స్వామి చెంతకు వచ్చాడు.ఆసమయం లో శ్రీ రాఘ వేంద్రులు మృత్తికా శౌచము చేసుకుంటున్నారు. ఆమృత్తిక నే ఒక పిడికెడు యిచ్చి, పో ,నీకు మంచి జరుగుతుందని దీవించి పంపారు. ఆ యువకుడు ప్రయాణం చేస్తూ, మార్గమధ్యం లో ఒక రాత్రి ఒక కరణం గారి ఇంటిముందు పడుకున్నాడు. అర్ధరాత్రి సమయానికి ఒక బ్రహ్మ రాక్షసుడు బిగ్గరగా అరుపులు కేకలతో వాణ్ణి నిద్రలేపాడు.." నాకు దారి ఇవ్వమని. నీ తలపాగ లో అగ్ని ఉందని, దాన్ని తీసిపారేయమని "అరవసాగాడు.. విషయం అర్ధమైన ఆ యువకుడు " నీకు దారిస్తే నాకేంటి ప్రయోజనం "అని అడిగాడు. అందుకు బ్రహ్మరాక్షసుడు ఒక బంగారు పళ్ళాన్ని బహుకరించగా. ఆ యువకుడు తలక్రింద పెట్టుకున్న , స్వామి ఇచ్చిన మృత్తిక ను కొద్ది గా తీసి రాక్షసుని మీదకు విసిరాడు. వెంటనే ఆ బ్రహ్మరాక్షసుడు భగభగ మండి మాడి మసై పోయాడు. ఈ గలాటా అంతా విని భైటకొచ్చిన ఇంటి యజమాని ,ఇన్నాళ్లు తనకు పుట్టిన బిడ్డలను తినేస్తున్న బ్రహ్మరాక్షసుని పీడ విరగడైనందుకు సంతోషించాడు. అందుకు కారకుడైన ఆయువకుని ఆదరించి తన చెల్లెలినిచ్చి వివాహం చేశాడు. ఇటువంటి గాథలెన్నో శ్రీవారి మృత్తికామహిమలను గూర్చి, శిష్యులయెడ గురువుల అనుగ్రహాన్ని గూర్చి తెలియజేస్తున్నాయి. మాంసపు ముక్కలను పట్టువస్త్రం తో కప్పి, కానుకగా పంపించిన ఆదోని నవాబుకు జ్ఞానోదయమయ్యేటట్టు ,మంత్రించిన జలంతో మాంసపు ఖండాలను ఫల పుష్పాలుగా మార్చి, క్షమాపణ కోరిన నవాబు నుండి మంచాల గ్రామాన్ని జాగీరు గా పొందారు. ఆవుల కాపరి వెంకన్న అనే వ్యక్తి స్వామి అనుగ్రహం తో విద్వాంసుడై, మఠాన్ని నిర్మించి, సేవించి. తరించాడు. పాము కాటుకు గురైన రాజకుమారుని బ్రతికించాడు. గడపకు తల తగిలి మరణించిన భక్తునిపై మంత్రోదకం చల్లి బ్రతికించాడు. తంజావూరు రాజ్యం లో కరువు కాటకాలు పెచ్చరిల్లడం తో ఆ రాజు కోరిక మేరకు రాజధాని లో ప్రవేశించి, ధాన్యపు కొట్టుపై శ్రీ అనే బీజాక్షరాన్ని సంస్కృతం లో వ్రాసి, అదే బీజాక్షరాన్ని నిత్యము వ్రాస్తూ, జపం చేయమని ఆజ్ఞాపించారట. కొద్దికాలం లోనే కుండపోత గా వర్షాలు పడి, పంటలు పండి, క్షామనివారణ జరిగింది. స్వామివారి మృత్తికా స్పర్శ చే పిశాచాలు పారి పోతాయి.. మంత్రాక్షతలు ఆరోగ్యవంతుల్ని చేస్తాయి. స్వామి సమాధిస్ధు లైన 150 సంవత్సరాలకు సమాథి నుండి లేచి వచ్చి, మంత్రాలయం ఆస్తులను పరిశీలించ వచ్చిన అప్పటి మద్రాసు గవర్నర్ థామస్ మన్రో తో స్వయం గా మాట్లాడి, అక్షతలిచ్చారట. అతడాశ్చర్య చకితుడై ఆ మంత్రాక్షతలను ఆనాడు వండెడి బియ్యంలో కలిపి వండించుకొని భుజించాడు. ఈ విషయం మద్రాసు రివ్యూ ఎనిమిదవ సంపుటము 280 వ పేజిలో వ్రాయబడింది. ఈ విషయాన్ని ఎత్తి బళ్ళారి జిల్లా గెజిటీరు మొదటి సంపుటం లో 15 వ ప్రకరణం లో ఆదోని తాలూకా ను గురించి 213 -వ పేజీలో ప్రచురించబడింది. శ్రీ గురు రాఘవేంద్రుల వారి పాదాలను స్మరించుకుంటూ భక్తి ప్రపత్తులతో గురుస్తోత్రాన్ని పఠించే వారికి దుఖాలు దూరమౌతాయి. గురువుల ఆనుగ్రహం కలుగుతుందని చెప్పబడుతోంది..శ్రీ గురు రాఘవేంద్ర యతీంద్రుల అనుగ్రహం మనందరిపై వర్షించాలని ఆశిస్తూ ... పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మ రతాయచ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమః శ్రీ రాఘవేంద్ర తీర్థులు కలియుగ కల్పవృక్షం మంత్రాలయంలో వెలసిన శ్రీ రాఘవేంద్రతీర్థులు. భక్తకోటికి కష్టాలు కడ తేరుస్తూ మంత్రాలయం మహర్షిగా భక్తుల పూజలు అందుకుంటున్నారు. మంత్రాలయ ఋషి రాఘవేంద్రులు మానవ కళ్యాణంకోసం వెలిసిన మహిమాన్విత మహనీయుడు శ్రీరాయలు. భక్తులు రాఘవేంద్రస్వామిని శ్రీరాయలు అని పిలుచుకుంటారు. బృందావనం నుంచే సజీవుడిగా వుండి భక్తుల మొర ఆలకిస్తున్న దేవుడు రాఘవేంద్రస్వామి. ‘‘నేను, దేవుడు ఒకటి కాము మేమిరువురము వేరువేరు. అతడు ఈశుడు, నేనాతని దాసుడను మాత్రమే'' అని చెప్పే ద్వైత సిద్ధాంతంను ప్రవచించిన మద్వాచార్యుల బోధనల వ్యాప్తికోసం ప్రచారంచేసిన వారే శ్రీ రాఘవేంద్రస్వామి. మద్వా సిద్ధాంతం ప్రకారం మంత్రాలయం రాఘవేంద్రస్వామి మఠంలో పూజలు సాగుతున్నాయి. మద్వ ప్రచారం సాగిస్తూ మానవ కళ్యాణంకోసం యోగిగా మారిన మహానుభావుడు శ్రీ రాయలు.

అలాంటి మహనీయుడైన శ్రీ రాఘవేంద్రులు క్రీ.శ.1595 సంవత్సరం, మన్మనాథ సంవత్సరం ఫాల్గుణ శుద్ధ సస్తమీ మృగశిరా నక్షత్రంలో తిమ్మన్నభట్టు, గోపాంబ దంపతులకు కలిగిన సంతానమే సన్యాసం తీసుకున్న తరువాత రాఘవేంద్రునిగా మారిన రాజయోగి. తల్లిదండ్రులు వెంకటనాధునిగా నామకరణం చేసారు. వెంకటనాథుడు చిన్నతనం నుంచి అన్ని విద్యలలో ఏకసంథాగ్రాహి. గురువుల అనుగ్రహాన్ని పొందినవాడు. వెంకటనాధుని తెలివితేటలు గురించి అందరూ పొగిడేవారే. తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. వెంకటనాధుడు మధురలోని బావ లక్ష్మీనరసింహాచార్యులవద్ద వేదమంత్రాలు చదవటంలో మెలకువలు నేర్చుకున్నారు. తమ వంశపార్యపరంగా వచ్చే వీణావాయిద్యాయిని కూడ వేంకటనాధుడు నేర్చుకున్నారు. వెంకటనాధుడు చదువు కొనసాగిస్తున్న ఆయన మనస్సు మాత్రం మఠంలో మూల రాముల పూజలు చేయటానికే మనస్సు తహతహలాడుతూ వుండేది. శ్రీ సుదీంద్ర తీర్థుల వద్ద శిష్యునిగా చేరి టీకా, తాత్పర్యాలు వ్రాసి పరిమళచార్యునిగా గురువుచేత బిరుదు పొందాడు. అమరకోశం కంఠస్తంగా వుండేది. సంస్కృతం, నిఘంటువులు వెంకటనాథుని నోట్లోనే వుండేవి. చదువులు ముగిసిన అనంతరం యవ్వనంలో వున్న వెంకటనాథునికి సరస్వతీ అనే అపూర్వ అందమైన అందాల రాశితో వివాహం జరిగింది. వీరి వివాహం ఎంతో వైభవంగా సాగింది. ఒక పుత్రుడు జన్మించాడు. వెంకటనాథుని జీవితంలో కడు దారిద్య్రం దాపురించింది. చివరికి భార్య అనుమతి తీసుకొని గురువుతోపాటు దేశ సంచారం సాగిస్తూ వేదాంత చర్చలు జరిపి ఎందరినో మెప్పించారు. గురుసుదీంద్ర తీర్థులు వెంకటనాధునికి మహాభాష్యాచార్యుడని బిరుదు ఇచ్చారు. సాటిలేని పండితునిగా వేంకటనాథుడు గురువు సన్నిధిలో పెరిగాడు. తన తరువాత మఠంకు వారసుడు వెంకటనాథుడని గురువు సుదీంద్రులు భావించారు. అంతేకాకుండా ఒక రోజు కలలో శ్రీ మూలారాములు సుదీంద్రులకు వచ్చి తన అనంతరం పీఠం ఎక్కే అర్హత వెంకటనాథునికి మాత్రమే వుందని చెప్పారు. ఈ విషయాన్ని వెంకటనాథునికి గురువు సుదీంద్రులు వివరించారు. సన్యాసం స్వీకరించే విషయం మీమాసంలో వున్న వెంకట నాథునికి సరస్వతీదేవి కలలో కనిపించి మఠం పీఠాధిపతిగా సన్యాసం స్వీకరించి మద్వా సిద్ధాంతాన్ని లోకాన్ని విస్త్తరింపచేయాలని సెలవిచ్చింది. సరస్వతీదేవి కోరిక కూడా ఇదే కావటంతో వెంకటనాథుడు సన్యాసం స్వీకరించటానికి సిద్ధమై గురువు సుదీంద్రులకు తన అభిప్రాయాన్ని తెలిపారు. తంజావూరు పాలకుడు రఘునాథ భూపాలుని ఆధ్వర్యంలో క్రీ.శ.1621, ఫాల్గుణశుద్ధ ద్వితీయలో ప్రజల సమక్షంలో పీఠాధిపతిగా పట్ట్భాషేకంగావించి సన్యాసం స్వీకరించారు. గురువు సుదీంద్రతీర్థులు వెంకటనాథునికి రాఘవేంద్ర తీర్థులు అని నామకరణం చేసారు. గురు సుదీంద్రతీర్థులు మూల విగ్రహాలైన మూల రామచంద్రుని విగ్రహం, దిగ్విజయరాముల విగ్రహం, జయరాముని విగ్రహం, వేదాంత గ్రంథాలు, శివతఛత్రం, వింజామరలు, స్వర్ణపల్లకి, మఠం కార్యక్రమాలు అన్ని కూడ శ్రీ రాఘవేంద్రతీర్థులకు అప్పగించారు. 1623లో గురువు సుదీంద్రతీర్థులు హంపీవద్ద గల నవ బృందావనం అనే ప్రాంతంలో బృందావనస్థులైనారు. శ్రీ రాఘవేంద్ర తీర్థులు తంజావూరు, వెల్లూరు, శ్రీరంగం, రామేశ్వరం, మధుర మొదలగు ప్రాంతాలలో పర్యటన చేసి మద్వప్రచారం గావించి వేదాంత చర్చలు జరిపి అనేకమంది పండితులను ఓడించాడు. రాఘవేంద్ర తీర్థులు శ్రీ వ్యాస తీర్థులు వ్రాసిన ‘చంద్రిక' అనే గ్రంథానికి ‘ప్రకాశం' అనే వివరణ వ్రాసారు. న్యాయముక్తావళి, ‘తంత్రీ దీపిక' సుధ, పరిమళ అనే మున్నగు గ్రంథాలను వ్రాసారు. భక్తులకు అనేక మహిమలు కూడ చూపాడు. ఆదోని పర్యటనలో స్వామి వున్నప్పుడు, ఆదోనిని పాలించే సిద్ధిమసూద్‌ఖాన్ అనే రాజు రాఘవేంద్రుని సభకు ఆహ్వానించారు. స్వామిని పర్యవేక్షించటానికి పళ్ళెంలో మాంసం ముక్కలు పెట్టి దానిపై గుడ్డకప్పి స్వీకరించమని చెప్పారు. స్వామి వెంటనే ఆ పళ్ళెంపై మంత్రపు జల్లులతో చల్లగా మాంసం పూవ్వులుగా మారాయి. దాంతో సిద్దిమసూద్‌ఖానే స్వామి మహత్యం తెలుసుకొని రాఘవేంద్రుని కోర్కె మేరకు ‘మంచాల' గ్రామాన్ని దత్తతగా ఇచ్చారు. మంచాలమ్మ దేవత కొలువై వున్న మంచాల గ్రామంలోనే శ్రీ రాఘవేంద్రులు మఠం ఏర్పాటుచేసుకొని భక్తులకు మహిమలు చూపుతూ, మరోవైపు మధ్వప్రచారం సాగిస్తూ శ్రీ రాఘవేంద్రులు క్రీ.శ.1671, విరోధికృత్ శ్రావణ బహుళ ద్వితీయరోజున రాఘవేంద్రులు సశరీరంతోనే బృందావనం ప్రవేశం చేసారు. స్వామి బృందావనం చేసిన మంచాల గ్రామం మంత్రాలయ నేడు ఒక మహా పుణ్యక్షేత్రంగా వెలుగొందుతోంది. ఆనాటి నుంచి ఈ బృందావనం నుంచే స్వామి భక్తుల కోర్కెలు తీర్చుతూ రాఘవేంద్రస్వామిగా పూజలు అందుకుంటున్నాడు. భక్తుల కోర్కెలు తీర్చే స్వామిగా, సాహితీవేత్తగా, మహిమలు చూపే మహనీయుడుగా పూజలు అందుకున్న రాఘవేంద్రులు భక్తుల హృదయాలలో కొలువై వున్నాడు. కలియుగ కల్పవృక్షంగా భక్తులు కొలుస్తారు. అందుకే ఆయన దేవుడయ్యాడు రాఘవేంద్రస్వామి సన్యాసాశ్రమం తీసుకోవడానికి ముందు, అంటే వేంకటనాథుడుగా ఉన్న రోజుల్లో తన ఇంట్లోనే కొంతమంది పిల్లలకు వేదం చెబుతూ ఉండేవాడు. అయితే అందుకు ఆయన దక్షిణ కూడా తీసుకునేవాడు కాదు. దాంతో ఆ విద్యార్థుల తల్లిదండ్రులు ఇంటి అవసరాలకి సంబంధించిన ధాన్యం, కూరగాయలు ఇస్తూ ఉండేవారు. అలా వచ్చిన వాటితో ఆయన భార్య సరస్వతి కుటుంబాన్ని నెట్టుకొస్తూ ఉండేది. అలాంటి పరిస్థితుల్లో ఓ పశువుల కాపరి కొడుకు వీధి అరుగుపై కూర్చుని స్వామి చెప్పే పాఠాలను శ్రద్ధగా వింటూ ఉండేవాడు. అది గమనించిన స్వామి ఆ పిల్లవాడిని లోపలికి పిలుస్తాడు. భయపడుతూనే లోపలి వచ్చిన ఆ పిల్లవాడు, తనకి చదువుకోవాలని ఉందని చెబుతాడు. తన దగ్గరున్న శిష్యులకన్నా అ కుర్రవాడు చకచకా పాఠాలను అప్పగించడం చూసిన స్వామి ఆశ్చర్యపోతాడు. ఇక నుంచి అందరితో పాటు ఆ పిల్లవాడికి చదువు చెప్పాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న మిగతా విద్యార్ధినీ విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహావేశాలను వ్యక్తం చేస్తారు. ఆ పిల్లవాడితో కలిసి తమ పిల్లలు చదువుకోరనీ, అతనికి పాఠాలు చెప్పాలనే ఆలోచన విరమించుకోమని అంటారు. అందుకు స్వామి నిరాకరించడంతో, వాళ్లు తమ పిల్లలను పంపించడం మానేస్తారు. అంతమంది పిల్లలు పాఠాలు చెప్పించుకోవడానికి రాకపోతే ఇల్లు గడవడం కష్టమవుతుందేమోనని సరస్వతి ఆందోళన వ్యక్తం చేస్తుంది. భగవంతుడు తనని నమ్మిన వారిని ఎప్పుడూ ఉపవాసం ఉండనీయడనీ, ఆ విషయం గురించి కంగారు పడవద్దని స్వామి ధైర్యం చెబుతాడు. ఆ రోజు నుంచి ఆయనకి అనేక రకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నా, ఆ పిల్లవాడికి పాఠాలు చెప్పడం మాత్రం ఆపలేదు. అలా ఆ రోజుల్లోనే కులమతాలకు అతీతంగా వ్యవహరించిన రాఘవేంద్రస్వామి, నేటికీ అన్ని వర్గాల వారి హృదయ పీఠాలను అధిష్ఠించి కనిపిస్తుంటాడు....from FB..

 ఓం శ్రీ గురుభ్యో నమ:
Monday, September 30, 2019 0 comments By: visalakshi

ఆత్మశక్తి-దైవ ఆరాధన...


ఓం శ్రీ సాయినాథాయ నమో నమః


   
స్వభావరీత్యా మానవునకు ప్రేమానురక్తులను ఆశించడం పరిపాటి. ఆ ఆశలను అందుకోవడంలో విఫలమైనప్పుడు ఆవేశపూరితుడవుతాడు. కానీ ఆలోచిస్తే ఆ ఆశ అన్న భావాన్ని మనసునుండి తొలగించుకునే ప్రయత్నంలో అతను సాధు స్వభావుడవుతాడు.

మహాత్ముల స్వరూపం సదా ఆనంద దీపికలు వెలిగిస్తూ ఉంటుంది. దైవదృష్టికి పరిమితి లేదు. "ఏయధా మాం ప్రపద్యంతే తాంస్తధైవ భజామ్యహం" (నా పట్ల ఎలాంటి భక్తిని కలిగిఉంటే వారికి వారి భక్తి ననుసరించి అలాంటి ప్రతిఫలమిస్తాను) అయితే మహాత్ముల అంత:కరణ వారిని నిందించిన వారిపై కూడా కారుణ్యం కురిపిస్తుంది. బాబా ఎన్నోసార్లు "ఇతరుల మనసుకి కష్టం కలిగేలా మాట్లాడితే అవి నా హృదయాన్నే తూట్లు పొడుస్తాయి. నా అత్యంత సున్నితమైన భాగానికి గుచ్చుకుంటాయని తెలుసుకోండి. ఇతరులను   బాధాకర మాటలతో కోపం కలిగేలా మాట్లాడితే అవి నన్నే బాధిస్తాయి. కానీ వాటిని శాంతంగా సహించే వారే నాకు బాగా తృప్తి కలిగిస్తారు". అని చెప్పి ఉన్నారు. అలా సాయిబాబా జీవులన్నింటా లోపలా, బయటా నిండి ఉన్నారు .ఆ మహా మంగళప్రదమైన ప్రేమమయి సర్వవ్యాపకుడై  భక్తుల హృదయనివాసుడైనాడు...ఓం సాయిరాం.... 





దృఢమైన మనసుతో భగవానుని కొరకు లోకమందలి స్వజన సంబంధములు మరియు మిత్ర పరిచయముల వంటి సమస్త సంబంధములకు ఋణములన్నీ తీర్చుకోవలెను. ఋణవిముక్తులవ్వాలంటే ఆధ్యాత్మిక జీవనమనే సాధు సాంగత్యముతో విష్ణు ఆరాధనలో భక్తిభావ సమన్వితులై భగవచ్చరణారవిందములను ఆశ్రయించడం ద్వారానే మనం ఋణము లనుండి విముక్తులవుతాము.

 సుఖదు:ఖములు తాత్కాలికము. వాటి రాక పోకలు శీతగ్రీష్మ అనుభవముల వంటివి. జీవితానుభవముల వలన అవి కలుగుచుండును. కావున కలత పొందక వాటిని సహింపవలెను. నిజానికి సుఖదు:ఖములనేవి మనస్సు వలన కలుగునన్నది మనకు విదితము. కాబట్టి మనసును దైవ ఆరాధనలో నిమగ్నం చేసి  ప్రశాంతతను అలవరచుకోవాలి....ఓం సాయిరాం...,




బాబా తమ కమలసుమదళంలాంటి చేతిని శిరస్సుపై పెట్టటంతోనే అనేక జన్మలనుంచీ సంతరించుకొన్న పాపాలు ప్రక్షాళనం అయిపోయి నా లాంటి సాయియొక్క ప్రేమిక భక్తులు పవిత్రులవుతారు. బాబాస్పర్శతో హృదయంలో అష్టసాత్విక భావాలు ప్రకటమవుతాయి. పారాయణ చేస్తున్నా, పురాణాలు చదువుతున్నా అడుగడుగునా బాబా కనిపిస్తారు. రాముడు కృష్ణుడు, వేంకటేశ్వరుడు....ఏ దేవాలయానికి వెళ్ళినా.. ఆ రూపాలలో బాబా దర్శనమిస్తారు. ఆహా జన్మ ధన్యము కదా!... కాయా, వాచా, మనసా శ్రీ సాయినాధునికి సాష్టాంగం చేస్తే ధర్మ అర్ధ కామ మోక్షాలనే నాలుగు పురుషార్ధాలను, కర్మ,జ్ఞాన యోగ, భక్తి- అనే నాలుగు మార్గాలతోనూ ఈశ్వరుడు ప్రాప్తిస్తాడు. మనసనే తోటలో భక్తి అనే నీటిని చల్లితే వైరాగ్యం మొలకెత్తుతుంది. జ్ఞానమనే పూలు విరగబూస్తాయి. కైవల్యమనే ఫలం లభిస్తుంది. జ్ఞానమయం విప్పారుతుంది. జనన, మరణాలు నిశ్చయంగా తప్పిపోతాయి.."ఓం సాయిరాం..."





" మా మనస్సును అంతర్ముఖము చేయుము. దానిని లోపలివైపు పోవునట్లు చేయుము. నిత్యానిత్యములకు గల తారతమ్యమును తెలిసికొను శక్తిని కలుగజేయుము. ప్రపంచ వస్తువులందు మాకు గల ఆసక్తిని పోగొట్టి మాకు ఆత్మసాక్షాత్కారము కలుగునటుల చేయుము. మేము మా శరీరమును ప్రాణమును సర్వమును నీకు సమర్పించెదము. సుఖదు:ఖానుభవములు కలుగకుండునట్లు మా నేత్రములు నీవిగా చేయుము. మా శరీరమును మనస్సును నీ స్వాధీనమందుంచుకొనుడు... మా చంచల మనస్సు నీ పాదముల చెంత విశ్రాంతి పొందుగాక!"...ఓం సాయిరాం...

"తడిసిన కట్టెలకు నిప్పు సెగను పెట్టగానే తేమ పోయినట్లు, సాధు సా౦గత్య౦ వల్ల  లౌకికుల హృదయాల్లోని లోభ మోహాలనే తేమ పోతు౦ది."


"ఒక దీపాన్ని, మరో దీప౦ వెలిగిస్తు౦ది. అ౦తమాత్ర౦ చేత వెలిగి౦చే దీప౦ వెలుగు తగ్గిపోదు. అలాగే ఇతరులకు బోధి౦చే కొద్దీ మీ జ్ఞాన౦ పెరుగుతు౦దే కానీ తరగదు." .."ఓం సాయిరాం".


సర్వం శ్రీ సాయి నాధార్పణ మస్తు









Friday, September 27, 2019 0 comments By: visalakshi

శ్రీ సుబ్రహ్మణ్యుడే సుబ్బారాయుడు గా నిజరూప దర్శనం....


               ఓం శ్రీ సుబ్రహ్మణ్యస్వామి నమోనమ:



500 ఏళ్ళ క్రితం జరిగిన అద్భుత సంఘటన -
శ్రీ సుబ్రహ్మణ్యుడే శ్రీ  సుబ్బారాయుడుగా వెలసిన క్షేత్రం ,
శ్రీ సుబ్బారాయుడి నిజరూప దర్శనం.................................... ఫేస్ బుక్ సౌజన్యంతో ఈ టపా.....

పాణ్యం మండలం సుబ్బరాయుడు కొత్తూరు భిన్నమైన ఆచారాన్ని పాటిస్తోంది. ఆదివారం అందరికీ సెలవు. ఆ పల్లెకూ సెలవే. కానీ మిగిలినవారికంటే కాస్త ఎక్కువ సెలవు. ఆదివారం మాంసాహారం ముట్టకపోవడం, అంత్యక్రియలు నిర్వహించకపోవడం ఈ పల్లెలో అనాదిగా వస్తున్న ఆచారం. మిగిలిన రోజుల్లో మాంసాహారం తినాలన్నా.. ఆ ఊరిలో దొరకదు. ఆరు కిలోమీటర్లు వెళ్లి తెచ్చుకోవాల్సిందే. ఆసక్తి కలిగించే ఈ ఆచారం వెనుక సుబ్రహ్మణ్య స్వామి ఆలయ స్థల పురాణ నేపథ్యం ఉంది.

*ఏమిటా కథ..?*
500 ఏళ్ళ క్రితం కొత్తూరు గ్రామానికి చెందిన బీరం చెన్నారెడ్డి అనే రైతు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. గట్టెక్కే మార్గం చూపాలని ఓ బ్రాహ్మణుడిని ఆశ్రయిం చాడు. మాఘ శుద్ధ షష్ఠి రోజున పొలం దున్నితే కష్టాలు తొలగుతాయని బ్రాహ్మణుడు సూచించాడు. దీంతో చెన్నారెడ్డి కాడెద్దులను నాగలికి కట్టి పొలం దున్నడం ప్రారంభిస్తాడు. ఆ సమయంలో నాగలికి ఉన్నట్లుండి భూమిలో ఏదో అడ్డుతగులుతుంది. ఆ క్షణంలోనే ఆకాశంలో 12 తలల నాగుపాము రూపం ప్రత్యక్షమౌతుంది. ఆ తేజస్సుకు రైతు కంటిచూపు కోల్పోతాడు.

కాసేపటి చుట్టు పక్కల రైతులు వచ్చి నాగలిని వెనక్కులాగి చూస్తారు. అక్కడ 12 శిరస్సుల నాగేంద్రుడి విగ్రహం బయట పడుతుంది. ఒక బాలుడు ప్రత్యక్షమై తాను సుబ్బరాయుడినని(సుబ్రహ్మణ్యేశ్వస్వామి), మూడు రోజుల పాటు తనకు క్షీరాభిషేకం చేస్తే చెన్నారెడ్డికి చూపు వస్తుందని చెబుతాడు. అలా పూజలు చేయగానే చెన్నారెడ్డికి కంటిచూపు వస్తుంది. దీంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి గుడి కట్టాలని గ్రామస్థులు నిర్ణయించుకుంటారు. స్వామివారిని వేడుకుంటారు. ‘రాత్రి రోకలిపోటు తరువాత మొద లుపెట్టి.. తెల్లవారు జామున కోడి కూతకు ముందే గుడి నిర్మాణం పూర్తి చేయాలి’ అని స్వామి సెలవిస్తాడు. లేదంటే ఏడుగురు బలి అవుతారని హెచ్చరి స్తాడు. స్వామివారి స్వయంభు విగ్రహాన్ని నేలపైనే పెట్టి గుడి నిర్మాణం ప్రారంభిస్తారు. కోడి కూతలోగా ప్రహరీ మాత్రమే పూర్తవుతుంది. పైకప్పులేని ఆలయం సిద్ధమౌతుంది. అప్పటిదాకా ఆ గ్రామం పేరు కొత్తూరు కాగా.. స్వామి వెలసిన తరువాత సుబ్బరాయుడు కొత్తూరుగా మారింది. ఇదీ స్థల పురాణం.

*ఆదివారం సెలవెందుకు..?*
సుబ్రహ్మణ్య స్వామికి ప్రీతిపాత్రమైన రోజు ఆదివారం. ఎస్‌ కొత్తూరు గ్రామానికి ప్రతి ఆదివారం ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తులు తరలి వస్తారు. కేవలం ఆదివారం రోజే 6 నుంచి 8 వేల మంది భక్తులు స్వామిని సందర్శిస్తారు. ఆ ఒక్కరోజే సుమారు మూడు వందల అభిషేకాలు జరుగుతాయి. స్వామిని పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. తమను చల్లాగా చూస్తున్న స్వామి కోసం ఆదివారం ఆచారాన్ని ఆలయం నిర్మించిన సమయంలోనే ప్రారంభించారు గ్రామస్థులు. ఆదివారం వస్తే మాంసాహారం వండరు, తినరు. గ్రామంలో మాంసాహార దుకాణాలు లేవు. మామూలు రోజుల్లో కావాలన్నా.. గ్రామానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న నందివర్గం వెళ్లి తెచ్చుకోవాల్సిందే. ఇక పండుగ మరుసటి రోజున మాంసాహారంతో కర్రిపండుగ నిర్వహించడం సాధారణం. ఆ పండుగ ఆదివారం వస్తే.. సోమవారానికి వాయిదా పడుతుంది.

*ఆ మూడు మాసాల్లోనూ అంతే..*
ఏడాది పొడవునా ఆదివారాలతోపాటు కార్తీకం, మాఘం, శ్రావణ మాసాల్లో గ్రామస్థులు మాంసాహారం ముట్టరు. ఈ కట్టుబాటును ఎవ్వరూ మీరింది లేదు. ఆదివారాలతో కలిపి ఇలా ఏడాదిలో సుమారు నాలుగు నెలల పాటు మాంసా హారానికి దూరంగా ఉంటూ గ్రామస్థులు స్వామిపై తమకున్న భక్తిని చాటుకుం టున్నారు. ప్రతి ఆదివారం వేలాదిగా వచ్చే భక్తులకు దేవస్థానం ఆధ్వర్యంలో అన్నదానం నిర్వహిస్తున్నారు.

*అంత్యక్రియలకూ సెలవే....*
కొత్తూరులో 220 కుటుంబాలు ఉన్నాయి. జనాభా సుమారు 900. ఆదివారం గ్రామస్థుల్లో ఎవరైనా చనిపోతే అంత్యక్రియలు నిర్వహించరు. మరుసటిరోజు వరకూ మృత దేహాన్ని ఇంటివద్దే ఉంచుతారు.సోమవారం అంత్యక్రియలు నిర్వహి బస్తారు. ఇందుకూ స్వామిపై ఉన్న అపార మైన భక్తే కారణం. గ్రామానికి ఆదివారం వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు వస్తారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అలాంటి పవిత్రమైన రోజున మృతదేహాన్ని తీసుకువెళితే భక్తులకు అసౌకర్యం కలుగుతుందని గ్రామస్థులు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు. మృతదేహంతో వెళితే భక్తులకు అంటు తగులుతుందని తమకు తామే కట్టడి చేసుకున్నారు.

*ఎలా చేరుకోవచ్చు...?*
బనగానపల్లె మండలం నందివర్గం నుండి S.కొత్తూరు 5 కి.మీ దూరంలో కలదు.ఇక్కడ నుండి ఆటో సదుపాయం కలదు.

 ఓం నాగేంద్రాయ నమ:




Thursday, June 13, 2019 0 comments By: visalakshi

అమ్మ దీవెనలు

 ఓం శ్రీసాయినాధాయ నమ:

మాణిక్యవీణా ముపలాలయంతీం మదాలసాం మంజుల వాగ్విలాసాం
మాహేంద్రనీలద్యుతికోమలాంగీం మాతంగ కన్యాం మనసా స్మరామి
చతుర్భుజే చంద్రకళావతంసే కుచోన్నతే కుంకుమరాగశోణే
పుండ్రేక్షుపాశాంకుశ పుష్పబాణ హస్తే నమస్తే జగదేకమాత:!!
  



 అమ్మలగన్నయమ్మ  ముగురమ్మలమూలపుటమ్మ చాలపెద్దమ్మ లలితమ్మ..జగతికి మూలమైన శక్తి స్వరూపిణి. సమస్త చరాచర జగత్తు యొక్క రూపము తానే అయి ఉన్న తల్లికి నమస్కారము.  జగత్తును ధరించి పోషించు  అమ్మవారిని బహు రూపాలలో పలు నామాలతో అర్చిస్తాము. ఏ పేరుతో పిలిచినా చల్లని వరాలను కురిపించే కరుణామయి నా దుర్గమ్మ తల్లి.
మంగళకరమైన స్వరూపముగల తల్లి భద్రకాళీమాత.. ఓరుగల్లు{వరంగల్} భద్రకాళీ అమ్మవారి క్షేత్రములో అమ్మ దీవెనలు భక్తులకు ప్రతిక్షణం అందుతాయనుటకు నిదర్శనం ఆ అద్భుతమైన అమ్మ వీక్షణ కరుణాకటాక్షాలు...భక్తుల భక్తి యందు ప్రియము గల తల్లి..నిష్కల్మషమైన భక్తిద్వారా ఆ తల్లి అనుగ్రహమును పొంది తరించగలము.


శ్లో" సర్వభూతహితేదేవి సర్వసంపత్ ప్రదాయిని
     పద్మమాలాధరేదేవి నారాయణి నమోస్తుతే!!

వేదమాత గాయత్రి.."గాయత్రిని మించిన మంత్రం లేదు. తల్లిని మించిన దేవత లేదు".మాతృరూపంలో,పితృరూపంలో గాయత్రీ దివ్యశక్తిగా తన    భక్తులకు,
ఆరాధకులకు లోకకళ్యాణదృష్ట్యా ఆ తల్లి సద్గుణ సర్వస్వాన్నీ ప్రసాదిస్తుంది.
జన్మజన్మాంతరాల కర్మపాశాలనుండి విముక్తుల్ని చేస్తుంది.



 లక్ష్మీమాత ధనవైభవశక్తులకు అధిష్ఠాత్రి. ఈతల్లి భక్తులకు ధన వైభవ ఐశ్వర్య సంపద పదవీ మొదలగు సమస్త భౌతిక సుఖసాధనలను ప్రసాదిస్తుంది.

"ఓం మహాలక్ష్మ్యై చ విద్మహే, విష్ణు పత్న్యైచ ధీమహీ తన్నో లక్ష్మీ: ప్రచోదయాత్."



 .
రాధాదేవి ప్రేమశక్తికి అధిష్ఠాత్రి. భక్తులకు యదార్ధమైన ప్రేమభావాన్ని కలుగజేసి అసూయా ద్వేష  భావాదులను  దూరం  చేస్తుంది.


"ఓం వృషభానుజాయ విద్మహే. కృష్ణప్రియాయ ధీమహీ, తన్నో రాధా ప్రచోదయాత్."



 .
సరస్వతీమాత జ్ఞానశక్తికి అధిష్ఠాత్రి. జ్ఞాన, వివేక దూర దర్శిత్వం, బుద్ధిమత, విచారశీలత్వాదులను ప్రసాదిస్తుంది.


"ఓం సరస్వత్యై చ విద్మహే. బ్రహ్మ పుత్ర్యై చ ధీమహీ తన్నో దేవీ ప్రచోదయాత్."




 .
దుర్గామాత దమనశక్తికి అధిష్ఠాత్రీదేవి. సమస్త విఘ్నబాధలపై విజయాన్ని ప్రసాదిస్తూ దుష్టులనూ, శత్రువులనూ నాశనం చేస్తూ భక్తులకు సమస్త ప్రకారాలైన శక్తి సామర్ధ్యాలను ప్రసాదిస్తుంది.


"ఓం గిరిజాయై చ విద్మహే. శివప్రియాయై చ ధీమహీ తన్నో దుర్గి:ప్రచోదయాత్."




 .
సీతామాత తపశ్శక్తికి అధిష్ఠాత్రీదేవి. నిర్వికారంగా పవిత్రభావంతో సాత్త్వికవృత్తితో అనన్య భావాలతో తపో నిష్ఠులనుగా తన భక్తులను తయారుచేసి ఆధ్యాత్మికోన్నత మార్గానికి మనలను ప్రేరితులను చేస్తుంది.


"ఓం జనక నందిన్యై చ విద్మహే.భూమిజాయై చ ధీమహీ తన్నో సీతా ప్రచోదయాత్."




 .
హంసదేవత వివేక శక్తికి అధిష్ఠాత. హంస యొక్క క్షీరనీరవివేకం జగత్ ప్రసిద్ధమైనది.సదసద్వివేకాన్నీ, దూరదర్శిత్వాన్నీ, సత్సంగతినీ ఉత్కృష్ఠాహారాన్నీ, ఉజ్వల యశస్సంతోషాది గుణాలనూ ఈ దేవత ప్రసాదిస్తుంది.


"ఓం పరమహంసాయ విద్మహే. మహా హంసాయ ధీమహీ, తన్నో హంస: ప్రచోదయాత్"




 .
తులసీదేవి సేవాశక్తికి అధిష్ఠాత్రి. సత్కార్యాలలో ప్రేరణ, ప్రాణిమాత్రులను సేవించాలన్న ప్రవృత్తి, ఆత్మశాంతి, పరదు:ఖ నివారణ, పవిత్రనిష్ఠాది ఫలాలను ప్రసాదిస్తుంది.


"ఓం శ్రీ తులస్యై విద్మహే. విష్ణు ప్రియాయై ధీమహీ తన్నో బృందా ప్రచోదయాత్."




శృంగేరి శారదా మాతను వీక్షించే కన్నుల్లో.. అలౌకిక ఆనందానుభవం మాటలకందనిది.



 .
 " అమ్మా!" అని నిష్కపటంగా నిరహంకారంగా శ్రద్ధాభక్తులతో మనం ఏ రూపాన్ని స్మరించినా పిలిచినా చాలు అమ్మ తన భక్తులను దీవిస్తుంది ఉద్ధరిస్తుంది.


"ఓం శ్రీ మాత్రే నమ:"


Saturday, December 15, 2018 0 comments By: visalakshi

ఆత్మవిశ్వాసం

 ఓం శ్రీ గురుభ్యో నమ: 

శ్లో"మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే!
    యతతామసి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్వత:!!

భా-వేలకొలది మనుష్యులలో ఒకానొకడు పూర్వపుణ్య విశేషముచే ఆత్మజ్ఞానసిద్ధి కొరకు ప్రయత్నము చేయుచుండును. అట్లు ప్రయత్నము చేయుచు సిద్ధిని పొందిన వారలలో సహితము ఏ ఒక్కడో నన్ను యధార్ధముగా తెలిసికొనుచున్నాడు.   



ఎల్లప్పుడూ బాబా స్మరణతో ఉంటూ ఆధ్యాత్మిక స్ఫురణలో   "ఆత్మవిశ్వాసం"
అనే ఈ కధనాన్ని అందరికీ పంచుతున్నాను.. రమణ మహర్షులను తెలియనివారుండరు.. కానీ వారి భక్తుల గురించి కొందరికే తెలియవచ్చును.
రమణమహర్షి ముఖ్య ఉపదేశం:-

"లోనికి చొచ్చుకుపో నిర్విరామంగా ఆలోచనలను అల్లే మనస్సు యొక్క మూలాన్ని అన్వేషించు, ఎగసిపడే భావాలని తిరస్కరించి అన్నిటికీ మూల భావంపై ధ్యాస నిలుపు. ఆ మౌనంలో విశ్రమించు. నీ ప్రయత్నం అంతవరకే. ఆ పైన జరిగేదే అనుభవం, సాక్షాత్కారం. అది మాటలకు అందదు." ఆ ఆనందధామాన్ని ఆత్మవిశ్వాసంతో కొద్దిమందే చేరారు.


రమణాశ్రమంలో మహర్షి భక్తురాలు ఒకామెని అందరూ ఎచ్చెమ్మాళ్ అంటారు. ఆమె అసలుపేరు లక్ష్మీ అమ్మాళ్. అతిచిన్న వయసులోనే ఆమే శోకమయ జీవితాన్ని అనుభవించారు. 25సం"లు వచ్చేసరికి ఒకరి తరువాత ఒకరుగా భర్త, కొడుకు, కూతురు పోయారు. తగిలిన దెబ్బలవలన ఆమె మనస్సు అస్తవ్యస్తమయింది."తన" గురించి ఆలోచించుకునే శక్తిని కోల్పోయింది. ఆమెకు ఎటు చూసినా నిరాశే,అంధకారమే. ఆమె మనశ్శాంతి కోసం ఎందరో సాధువులను కలుసుకుంది. కానీ ఎవ్వరూ ఆమె దు:ఖభారాన్ని తీసేయలేకపోయారు. మహాయోగుల అనుగ్రహం పొందాలన్న ఆమె మానసిక వ్యధను గమనించిన ఆమె బంధువులు,హితులు తిరువణ్ణామలైలో కొండపై ఉన్న యువకుడి గురించి చెప్పారు. వయసులో చిన్నవాడేఅయినా గొప్పయోగి అనీ, మౌనస్వామి అని, విశ్వాసంతో ఆయనను దర్శించుకున్న వారెందరో లబ్ధిపొందారనీ ఈమె కూడా ఆయనను దర్శించుకుంటే తిరిగి రాకపోవచ్చుననీ..ఈమాటలు విన్న ఎచ్చమ్మాళ్ తిరువణ్ణామలైకి ప్రయాణమయింది. ఒక స్నేహితురాలితో కొండెక్కి మహర్షిని చూసింది. ఆయన పలుకకుండా నిశ్చలంగా కూర్చుని యున్నారు. ఆయన సమక్షాన ఒక గంటసేపు మౌనంగా నిలబడింది. ఆ ఆశ్రమాన్ని విడవాలనిపించలేదు. ఎట్టకేలకు బలవంతంగా అక్కడ నుండి బయటపడి కొండ దిగువన ఉన్న స్నేహితురాలి ఇంటికి చేరుకుంది. మహర్షి అనుగ్రహం వల్ల తనని పీడిస్తున్న శోకం మాయమైందని స్నేహితురాలితో చెప్పింది. ప్రతిరోజూ ఆమె ఆశ్రమానికి వెళ్తుండేది. కొన్నాళ్ళకి గతించిన తన వారిగురించి, కన్నీరు కార్చకుండా..మనస్సులో విషాదచ్చాయలైనా లేకుండా మాట్లాడగలిగేది. తనలో ఆ శోకసముద్రం ఎలా పోయిందో, తన అంతరంగంలో ప్రశాంతత ఎలా నెలకొన్నదో ఆమె చెప్పలేకపోయేది. ఆమెకి తెలిసిందల్లా ఒక్కటే. అదంతా కొండమీద నెలకొన్న మహర్షి అనుగ్రహంవల్ల, కరుణ వల్ల మాత్రమే!.

 "మహర్షిని నేను అభిమానిస్తాను, గౌరవిస్తాను, ఆరాధిస్తాను" అని మాత్రమే అనగలిగేది ఆమె. అప్పటినుండి ఆమె ప్రతిరోజూ మహర్షికీ, ఆయనను దర్శించటానికి వచ్చేవారికి భోజనం వండి కొండమీద వారెక్కడున్నా వెళ్లి వారికి సమర్పించి, వారు తినగా మిగిలిన దానిని అతి భక్తితో స్వీకరించేది. తన రక్షకుడు మహర్షి అని ఆయనను వీడరాదని నిశ్చయించుకుంది.తండ్రి సోదరుడూ పంపిన పైకాన్ని నిస్సంకోచంగా ఆమె మహర్షి కొరకూ,వారి అనుగ్రహం కొరకూ వెచ్చించింది.ఆమె లేమిలో గడిపినా సర్వస్వమూ ధారపోసింది. మహర్షి భక్తులకు,అతిధులకు ఆమె నివాసం ఆశ్రయమయింది. ప్రతిఫలంగా ఆమెకు మనశ్శాంతి. ప్రగాఢమయిన విశ్వాసము లభించాయి. తనకి సంభవించిన మంచి చెడులను ఆమె మహర్షికి విన్నవించుకొనేది.వారు ఆమె భక్తిని మెచ్చుకొనేవారు. సుఖదు:ఖాలకు స్పందించేవారు. తననాశ్రయించిన భక్తులందరిపట్ల ఆయన అలాగే ఉండేవారు...



మహర్షి అనుమతితో ఆమె సెల్లమ్మాళ్ అనే ఒక అమ్మాయిని పెంచుకొంది.ఆ అమ్మాయికి వివాహం చేసి మనవడు పుట్టినపుడు ఎంతో సంబరపడింది. ఆ పసివాడికి 'రమణ' అని మహర్షి పేరునే పెట్టుకొంది. కాని విధివశాత్తూ ఆమె కూతురు మరణవార్త తంతి ద్వారా అల్లుడు తెలిపాడు. ఏ అస్వస్థత లేకుండా కూతురు హఠాత్తుగా మరణించడం అన్న వార్త ఆశనిపాతంలా తగిలింది. దు:ఖాన్ని దిగమింగుకొని కొండపైకి వెళ్ళి తంతిని మహర్షికి చూపింది. దానిని చదివి కంట తడి పెట్టుకున్నారాయన. ఎచ్చమ్మాళ్ గ్రామానికి వెళ్ళి కూతురు అంత్యక్రియలు జరిపి మనవడు రమణను తీసుకొని వచ్చింది. తనకీ తన మనవడికీ ఆశ్రయం మహర్షే. ఆయన చేతుల్లో మనవడిని పెట్టింది. ఆమె ఎలా గుండె నిబ్బరం చేసుకుందో గ్రహించారాయన. ఇప్పుడామె మహర్షిపైనే ఆశలన్నీ పెట్టుకుంది. పూర్వం వలె దు:ఖపు తుఫాను ఆమెను పెకిలించివేయలేదు. ఆమెకు గల ఆత్మ విశ్వాసానికి ప్రతిఫలమే ఆమె  తేరుకోగలగటం. మనశ్శాంతిని పున:ప్రతిష్ఠించుకోగలగటమూను!.


 ఇక ఎచ్చమ్మాళ్ ఆధ్యాత్మిక ప్రగతికి వస్తే - నిస్వార్ధమైన సేవద్వారా తనకి మోక్షప్రాప్తి జరుగుతుందని ఆమె 'దృఢవిశ్వాసం'. యోగాభ్యాసంలో ఒక గురువు ఆమెకు మనస్సుని ఏదో ఒక భావంపై కేంద్రీకరించడం ఎలాగో నేర్పారు. ఆ ప్రక్రియలో కొంత సాధన చేసిందామె. తన నాసికపై కేంద్రీకరించటం అలవర్చుకున్నది. కాంతిపుంజమేదో తనకి మనోదృశ్యంగా తోచేది. దానిపైనే మనసు నిల్పి కొన్ని రోజులపాటు ఆ దృశ్యాన్నే ధ్యానించేది.ఒక్కొక్కసారి దేహస్పృహ లేకుండా 24గంటలూ ఆమె నిశ్చలంగా ఉండగలిగేది.ఈ సంఘటనలన్నీ మహర్షికి ఎవరో చెప్పేవారు.వారు మిన్నకుండేవారు. చివరికి ఆమే తన అనుభవాలని చెప్పగా ఆయన ఆ అభ్యాసాలను మానమని చెప్పారు. "నీకు కనబడే ఆ జ్యోతులు నీ గమ్యం కావు. నీవు నీ నిజతత్వాన్ని తెలుసుకోటానికే ప్రయత్నించాలి గానీ అంతకంటే తక్కువదేమీ కాదు"

 'మన ఆలోచనలన్నీ మౌనం దాల్చి భావరాహిత్య స్థితిని చేరుకోవాలి.మన ప్రధాన్యతలూ ఇష్టాఇష్టాలు మన ముందుకు రాకూడదు. మనకు లభించిన అంతరాదేశాల ప్రకారం నడుచుకుంటే అదే యోగం. అపుడా జీవితమంతా యోగమే అవుతుంది. మనలో మనది కాని ఏదో శక్తి మనద్వారా పనిచేయడం గమనంలోకి వస్తుంది. ఒక విధమైన నిశ్చలతత్వం,ఆనందం మనకు అనుక్షణం అనుభూతం అవుతాయి. అందుకే అంతటా ప్రశాంతంగా మౌనంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. సమర్పితభావంతో ఆత్మ విశ్వాసంతో నీలో నన్ను సాక్షాత్కారం పొందు ' అని మన హృదయవాసి చెప్పకనే చెప్పాడు.
 ఫలితంగా తనకి సంతోషదాయకమైన యోగాభ్యాసాలను ఆమె విరమించుకొంది. మహర్షి నిర్దేశించిన లక్ష్యాన్ని ఆమె చేరుకోలేకపోయినా ఆయన తనకు రక్షకుడన్న అకుంఠిత విశ్వాసమూ,ఆయన గురించి నిరంతర చింతా ఆమెకుండేవి అలా మహర్షిని ఎప్పుడూ తలచుకోవటం వల్ల కొన్ని ఆధ్యాత్మిక అనుభూతులు ఆమెకు కలుగుతుండేవి. 



 మహర్షి దర్శనార్ధమై ఒక పండితుడు వచ్చాడు. విరూపాక్ష గుహవద్ద ఈ పండితుడు మహర్షితో మాట్లాడుతుండగా ఎచ్చమ్మాళ్ వణుకుతూ అచటికి వచ్చి నిలిచింది. కారణమేమిటని ప్రశ్నించగా ఆమె తనకు అప్పుడే కలిగిన అనుభవాన్ని వివరించింది.సద్గురు స్వామి గుహ ప్రక్కగా ఆమె కొండనెక్కవలసి వచ్చింది. ఆమె అలా నడుస్తూ వెనుకకు తిరిగి చూసినప్పుడు ఆమెకిద్దరు మనుష్యులు కనబడ్డారు. అందులో ఒకరు రమణమహర్షి,రెండవ ఆయన అపరిచితుడు.ఆమె కొండనెక్కడం కొనసాగిస్తుండగా ఆమెకొక వాణి వినిపించింది. "ఇక్కడ ఉండగా, పైకి ఎక్కటమెందుకు?"అని. వారు కనబడ్డ ప్రదేశం వైపు ఆమె తిరిగి చూడగా అక్కడగానీ,ఆ పరిసరాలలో గానీ ఎవ్వరూ లేరు.ఆమెకు భయం కంగారు కలిగి వణికిపోతూ కొండనెక్కి మహర్షి ఆశ్రమాన్ని చేరుకుంది. ఎచ్చమ్మాళ్ చెప్పిన ఈ వివరాలకి ఆ పండితునకు ఎంతో అసూయ కలిగి  "స్వామీ ఇక్కడ నాతో మాట్లాడుతూనే ఉండి,మీరు ఆమెకు మీ రూపాన్ని దర్శనమిచ్చ్హారు. మీ అనుగ్రహ చిహ్నమేమీ నాకు ఇప్పించలేద"న్నాడు. మహర్షివారు ఆమె ఎల్లప్పుడూ (మహర్షి)తన గురించే చింతిస్తూండడంవల్ల అటువంటి మనోదృశ్యం ఆమెకు గోచరించిందని చెప్పారు. మహర్షి పైనే ధ్యాస గల అనేకమంది భక్తులకు ఇటువంటి అనుభవాలు కలుగుతూనే ఉండేవి. అందరికీ ఆయన ఒకే హెచ్చరికను సలహాను ఇచ్చేవారు. 'అటువంటి అనుభూతులలో లీనమైపోకూడదనీ, వాటి గురించి సంతోషముతో ఉప్పొంగిపోకూడదనీ జీవిత పరమావధి ఆత్మజ్ఞానము ఒక్కటే! 'నిజతత్వాన్ని మరువకుండా "నేనెవరిని" అన్న ప్రశ్న వేసుకోవడమే మానసిక సంకల్పం వల్ల జరుగుతుంది.   నేను ఈ దేహాన్ని,మేధనీ, కోర్కెలనీ కాను అని గ్రహిస్తే .. 
ఆ శోధన  చెయ్యాలన్న దృక్పధమే నీ అంతరాంతరాలలో నుంచి సమాధానాన్ని చెప్పిస్తుంది. అప్పుడు సత్యం నీలోనుండి సూర్యరశ్మి వలె ప్రకాశిస్తుంది. "నేను"అనుభవంలోకి వచ్చి అనుభూతి చెందడం స్వామి ఉపదేశించిన   సాక్షాత్కారం. 

 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు 




  





    
Thursday, September 6, 2018 2 comments By: visalakshi

మధుర భక్తి

                                                ఓం శ్రీ కృష్ణ పరబ్రహ్మణే నమో నమ:





భక్తిలో "భగవత్ప్రేమ" అనేది పరాకాష్ట. భగవద్దర్శనమైన తర్వాత భక్తుడు భగవంతుని విరహాన్ని క్షణకాలం కూడా సహింపజాలడు. ఈ వియోగము భగవత్ప్రేమ ద్వారా వెల్లడి యై ప్రకాశిస్తుంది. గోపికలు భగవంతుడైన శ్రీకృష్ణుని ఆత్మేశ్వరునిగా భావించి అనిర్వచనీయమైన నిర్మలభక్తిని చాటారు. గోపికలు కృష్ణ విరహమును ఒక్క తృటికాలమైననూ సహింపలేకపోయేవారు. గోపికలు అంటే జీవులు....కృష్ణుడంటే పరమేశ్వరుడు. రాసక్రీడ అంటే జీవాత్మ పరమాత్మల తాదాత్మ్యమే. గోపికా విరహమంటే ఈశ్వర సాయుజ్యం కోసం జీవుడు పడే వేదన.  శ్రీకృష్ణుడు నిష్టూరాలాడడం, దాగిఉండడం, ఏడిపించడం ఇవన్నీజీవునికి పరమేశ్వరుడు పెట్టే పరీక్షలు. సగుణ భక్తులు నిర్మల భక్తులుగా కావడానికి భగవంతుడు వారికి చేసే దోహదము.  శ్రీకృష్ణ లీలలన్నీ  ఆధ్యాత్మికరహస్య భావనలతోనే అర్ధం చేసుకోవాలి. గోపికా వస్త్రాపహరణమంటే ....శరీరమే ఆత్మ అనే అపోహ, దేహంపై అభిమానాన్ని లేకుండా చేయడం కోసం ప్రయత్నించమని చెప్పడానికి సంకేతం. "ఈశ్వరస్సర్వ భూతానా" మనే పరమసత్యాన్ని వస్త్రాపహరణమనే సంకేతం ద్వారా  తెలుపుచున్నాడు. 

భగవంతునికి సంబంధించిన తత్వములో బాహ్యార్ధము అపహాస్యంగా తీసుకోరాదు. సాధారణ కవి కూడా భగవత్కధలలో శృంగార వర్ణనము కేవలము బాహ్యార్ధంతో చేయడు. ప్రతి కధనం యొక్క ప్రయోజనము మోక్షప్రాప్తియే. కావున ఈ గోపికా కృష్ణలీలలన్నీ జీవ పరమేశ్వర సంకేతాలే. భారత సంస్కృతిలో మధుర భక్తి భావనకు పరాకాష్ఠ ఈ గోపికా కృష్ణలీలలు.  భక్తి పరాకాష్ఠ పొందిన భక్తుని విరహం భగవంతుని కొరకు ఇలాగే ఉంటుంది. జయదేవుని గీత గోవిందంలోని వర్ణనలు కూడా ఈ కోవకు చెందినవే. మొదట లౌకిక దృష్టితో అర్ధం చేసుకున్నా చివరికి బుద్ధి వికసించి అలౌకికమైన దివ్య సోపానాలకు ద్వారం తెరుస్తుంది. ఈ గోపికలు హరి పూజార్ధము భూమిమీద జనియించిన సుందర సురకన్యలే కదా! 



దేహింద్రియ మనోబుద్ధులు అన్నీ కలిసినప్పుదే మనకు భక్తి భావన కలుగుతుంది. మనసులో నామము జపము చేస్తూనే దేహముతో భగవంతుని సూత్రాలకు విరుద్ధంగా ఉండే పనులు చేయడం బుద్ధితో వక్ర పనులను చేయడం ఇవన్నీ భక్తి భావనకు భంగం కలుగజేస్తాయి. పూజాగృహములో కొంతసేపు జపము చేసి బయట అందరినీ మోసం చేసే పనులు చేయటం భక్తి అనిపించుకోదు. భక్తుడు దేహ ఇంద్రియ మనోబుద్ధులతో భగవంతుని ధ్యానిస్తూ ఉంటాడు. దేహము కానీ, బుద్ధిగానీ, మనస్సుగానీ ఏ ఒక్కటి సహకరించకపోయినా భక్తి కుదరదు. విభక్తము కానిది భక్తి. భగవంతుడు ప్రతి సాధకునికి 35 సూత్రాలను భక్తుని లక్షణాలుగా చెప్పాడు. 



నిర్దేషుడు, సర్వభూతాలకు మిత్రుడు, కరుణాళువు, నిర్మోహము కలవాడు, నిరహంకారుడు, సుఖ దు:ఖములను సమానంగా చూసేవాడు, సహనశీలుడు, నిత్యసంతుష్టుడు, యోగయుక్తుడు ఆత్మనిగ్రహము కలవాడు, దృఢనిశ్చయము కలవాడు, మనోబుద్ధులను అర్పించినవాడు, ఎవరి వలన లోకములో బాధ జనింపదో లోకముచే ఎవడు బాధపడడో అటువంటివాడు,...ఇత్యాది లక్షణాలతో...

బృందావనంలో ‘రాధాకృష్ణుల రాసలీలలు కన్నుల పండుగగా జరుగుతుంటాయి! పదహారు వేలమంది గోపికలతో, రాధతో యమున ఒడ్డున బాలకృష్ణుడు ‘రాసలీల’ జరిపి గోపికలను ఆనందపరవశులను చేయడం, ఆత్మ - పరమాత్మల సమ్మేళనలోని అంతరార్థాన్ని తెలియచేసేందుకై ఆయన ఈ బృందావనాన్ని రంగస్థలంగా చేసుకొన్నాడు. రాసక్రీడను నిమిత్తమాత్రంగా చేసుకుని, గోపికల్లోని శారీరక మోహావేశాన్ని, ఈర్ష్యాసూయల్ని గోపాలుడు నావాడే అన్న స్వార్థాన్ని, అహంకారాన్ని తొలగించి శాశ్వతమైన పరతత్వంలో మమేకం కావడం అంటే ఏమిటో తెలియజేయడమే ఈ రాసలీలల్లోని అంతరార్థం.

యోగమాయ సహకారంతో ప్రతి వొక్క గోపికకి ఒక్కో కృష్ణుని సృష్టించి గోపాలుడు తనకే స్వంతం అనే భావనను కలుగజేసి ఆనందంలో ముంచెత్తడంతో వైష్ణవ భక్తకవులు, జయదేవుడు, సూరదాసు స్వామి హరిదాసు, గోవిందస్వామి మొదలైనవారంతా శ్రీకృష్ణ పరమాత్మ ప్రవచించిన తాత్విక సారాన్ని భక్తజనులకు సరళమైన రీతిలో గీతాల రూపంలో  అందించారు. కాళీయమర్దనం, పూతనవధ, దామోదరలీలలు ... ఇలాంటి శ్రీకృష్ణుని లీలలను మనసార స్మరించుతూ  కృష్ణనామాన్ని జపించినవారు శ్రీ కృష్ణ సాయుజ్యాన్ని పొందుతారు.