Saturday, December 31, 2016 By: visalakshi

పరిపూర్ణత్వము

 శ్లో" ఏతావానేవ లోకే2స్మిన్ పుంసాం ని:శ్రేయసోదయ:
     తీవ్రేణ భక్తియోగేన మనో మయ్యర్పితం స్థిరం

భగవానునిపై మనస్సు సంలగ్నమైన వారలు తీవ్రమగు భక్తియోగమున నెలకొందురు. జీవితపు చరమసిద్ధిని బడయుటకు అదియే ఏకైక సాధనము.




'మనోమయ్యర్పితం' (నా యందు సంలగ్నమైన మనస్సు) మనుజుడు తన మనస్సును శ్రీకృష్ణభగవానుని యందు అత్యంత శ్రద్ధతో నిలుపవలెను. అదియే పరమోస్థితి కాగలదు. మనస్సును కృష్ణపాదారవిందముల చెంత సంలగ్నము చేయుటే ఉత్తమోత్తమ విధానము. 'సర్వధర్మాన్ పరిత్యజ్య మాం మేకం శరణం వ్రజ ' "సమస్త ధర్మములను విడిచి కేవలం నన్నే శరణు పొందుము." మన భౌతిక బంధనముల నన్నింటిని విడిచి శ్రీకృష్ణుని పాదపద్మములను ఆశ్రయించ వలెను.




 'ప్రతిఒక్కరు తమ గుణకర్మల ననుసరించి పరిపూర్ణత్వమును సాధించ వచ్చునని శ్రీకృష్ణుడు తెలిపెను.' 

 శ్లో"  యత: ప్రవృత్తిర్భూతానాం యేన సర్వమిదం తతం
           స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ: 

 "సర్వజీవులకు మూలకారణమును, సర్వవ్యాపకుడైన భగవంతుని మానవుడు తన స్వకర్మములను చేయుట ద్వారా అతడిని పూజించుటచే మనవుడు పరిపూర్ణత్వమును సాధించును."




ప్రహ్లాదుడు నరసింహ భగవానుని చేత అతని తండ్రిని  సంహరింప చేసి తన తండ్రికి గొప్ప సేవ చేసెను. శాస్త్రములలో ఎవరైన రాక్షసుడైనను భగవంతుని చేత సంహరించ బడినచో అతడు వెంటనే ముక్తిని పొందునని తెలుపబడినది. ప్రహ్లాదుడు ఇలా ఆలోచించెను: "నా తండ్రి ఎన్నో పాపకార్యములను ఒనరించెను. మరియు భగవంతుని వ్యతిరేకించెను కాబట్టి అతడు ముక్తిని పొందజాలడు" అని భావించెను. నరసింహ భగవానుడు హిరణ్యకశిపుని సంహరించిన తరువాత ప్రహ్లాదుడు ఇలా పలికెను: "శ్రీహరీ! నా తండ్రి గొప్ప నాస్తికుడు. అతడు మీ పాదపద్మముల వద్ద అనేక అపరాధములను చేసెను. అతడిని నీవు సంహరించితివి. అతడిని క్షమించి ముక్తిని ప్రసాదించుమని నేను మిమ్ములను ప్రాధేయపడుతున్నాను." నిజానికి హిరణ్యకశిపుడు వెంటనే ముక్తిని పొందాడు. కాని అతని ప్రియ పుత్రుడు తన తండ్రి ముక్తిని పొందగలిగెనా లేదా అని జిజ్ఞాసతో తెలుసుకోవాలనుకున్నాడు. ఎవరైనను శుద్ధ వైష్ణవుడై  భగవంతునికి సేవ చేసినచో వారు తమ కుటుంబమునకు అత్యున్నతమైన సేవ చేసినవారగుదురు. ఎందుకంటే ఇరవైఒక్క తరాలవారు ముక్తిని పొందుదురని భగవంతుడు నిర్ధారించెను. 




 భగవంతుని అవతారాలు ఎన్నో కలవు. కొంతమంది జనులు ఇలా ప్రశ్నిస్తుంటారు :" మీరు శ్రీకృష్ణుని పూజిస్తున్నారు. రాముని ఎందుకు పూజించరు? " నిజానికి కృష్ణునికి, రామునికి మధ్య తేడా లేదు. కాని ప్రతిఒక్కరు విభిన్నమైన ఆసక్తులను కలిగి ఉన్నారు. హనుమంతుడు ప్రత్యేకించి శ్రీరామచంద్రునికి అంకితమైనాడు. గోపికలు కేవలం శ్రీకృష్ణుడికి అంకితమైనారు. నిజానికి ఇందులో ఎటువంటి బేధము లేదు. భగవంతుడు వివిధ రూపాలతో అవతరించును. కాని అన్ని పరిస్థితులలోను అతడు భగవంతుడే. ఒకసారి గోపికల మధ్యనుండి శ్రీకృష్ణుడు అదృశ్యమై నాలుగు చేతులు గల నారాయణునిగా ప్రత్యక్షమైనాడు. కాని వారు కృష్ణుని వెతకసాగిరి. నారాయణుని రూపము పట్ల వారు పెద్దగా ఆసక్తిని కనపరచలేదు. వారు కేవలం కృష్ణుని చూడాలనుకున్నారు. నిజానికి శ్రీకృష్ణునికి, విష్ణువుకు మధ్య బేధము లేదు. కాని ప్రతి భక్తుడు ఒక ప్రత్యేకమైన ఆసక్తిని కలిగి ఉంటాడు. అందరి హృదయాలలో భగవంతుడు నిలిచి ఉన్నాడు. మనం భగవంతుని పట్ల శ్రద్ధాసక్తులను కలిగి ఉండి వారి కృపచే భక్తిలో దృఢసంకల్పులము కావలెను. 


  సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు  






0 comments: