Wednesday, December 14, 2016 By: visalakshi

స్వాధ్యాయం

సమస్త ధర్మాలకు ఉత్పత్తి స్థానం వేదమే. చక్కని రీతిలో ధర్మశాస్త్రాలను అధ్యయనం చేయడమే స్వాధ్యాయం. ఆత్మ కళ్యాణం కొరకు ఆత్మచింతన చేయడం, ఈశ్వరభక్తి, ప్రణవ జపమందు శ్రద్ధ కలిగి ఉండడం మొదలైనవన్నీ స్వాధ్యాయంలోకి వస్తాయి. 




ముక్తి లేకుండా జీవిత పరమార్ధం లేదు. పరమార్ధం లేని జీవనం వ్యర్ధము. సుఖశాంతులతో త్యాగభావాలతో పూర్ణాయువు పొంది తొడిమ నుండి ఫలం వేరైనట్లుగా యోగి తన దేహం నుండి తనుకోరుకున్నాప్పుడు ఐచ్చికంగా ఆత్మను వేరుచేసే స్థితిని యోగధర్మంతో సాధించాలి. స్వాధ్యాయ తపస్సుల ద్వారా పొందే పూర్ణ ఫలమిదే.




 బాబాగారు ఒక సన్యాసికి ఏ విధంగా ముక్తిని ప్రసాదించారో సత్చరిత్రలో 31 అధ్యాయములో వారికి సద్గతిని ఎలా ఇచ్చారో వర్ణిస్తాను ....

ఓసారి మద్రాసులో నివసించే విజయానందుడనే సన్యాసి మద్రాసునుంచి మానససరోవరానికి వెళ్ళాలని, ఉప్పొంగే ఉల్లాసంతో బయలుదేరాడు. ఓ జపాను ప్రయాణీకుడి వద్ద మానససరోవరం మాప్ ని చూసి ఆ సరోవరం ను తప్పక దర్శించాలని దృఢనిశ్చయం చేసుకొన్నాడు. దారిలో శిరిడీ గ్రామం తగిలింది; సాయిబాబాకున్న దైవశక్తి గురించిన కీర్తిని విని ఉన్నాడు కనుక ఆయనని దర్శించుకోవాలన్న తీవ్ర ఇచ్చతో ఆ ప్రదేశాన్ని వెతుక్కుంటూ ఆ గ్రామానికొచ్చాడు. ఆ సమయంలో శిరిడీలో హరిద్వార్ కి చెందిన సోమదేవ్ స్వామీజీ.. భక్తబృందంతో ఉన్న ఆ సన్యాసిని సహజంగా కలవటం జరిగింది.అప్పుడు విజయానందుడు ఆ సన్యాసిని మానవ సరోవరం ఇక్కడికి ఎంత దూరముందని అడిగాడు. దానికా స్వామీజీ "గంగోత్రికి పైన యాభై మైళ్ళదూరం(ఎనభై కి.మీ) ఉంటుంది. అక్కడ బాగా మంచు కురుస్తుంది. ప్రతీ యాభై క్రోసులకీ భాష మారుతుంది. భూటాన్ లో ఉండే ప్రజల అనుమానాలతో పరదేశీయులకు చాలా బాధలు కలుగుతాయి." స్వామి నోటి ద్వారా ఈ సమాచారాన్ని విన్న సన్యాసికి  నిరుత్సాహం కలిగింది. అతని మనసు వికలమై చింతలో పడిపోయాడు.అప్పుడు సన్యాసి సాయిబాబా దర్శనం చేసుకొన్నాడు.వారి పాదాలకు సాష్టాంగం చేశాడు.మనసు ప్రశాంతిని పొందగా అతను అక్కడే ఆసనం వేసుకొని కూచుండిపోయాడు.భక్తులు బాబాకి చేస్తున్న సేవను చూస్తున్నాడు.అది ఉదయం వేళ జరిగే దర్బారు.మశీదులో భక్తులు కిటకిటలాడిపోతున్నారు.భక్తులు తీసుకొచ్చిన పూజాసామాగ్రినీ, విధిపూర్వకంగా వాళ్ళు బాబాకి చేసే పూజను చూసి అతను విస్మయం చెందాడు. బాబావారి పాదాలను జలముతో కడిగి, ఆయన కాలి బొటనవ్రేలిని ఉద్ధరిణిలోని నీటిలో ముంచి ఆ నీటిని తీర్ధంగా తీసుకొని శుద్ధభావంతో వాళ్ళు త్రాగుతున్నారు. కొందరు గంధం, సుగంధ ద్రవ్యాలను ఆయన దేహానికి పూస్తున్నారు. బాబా ఆ సన్యాసిని చూస్తూ కోపంతో "ఈ సన్యాసిని తరిమెయ్యండి. ఇతని సాంగత్యం పనికిరాదు "అన్నారు.బాబా అలా కోపంగా మాట్లాడినప్పటికీ సన్యాసికి ఆయన పట్ల ప్రేమ పెల్లుబికింది.తాను కూచున్నచోటునుంచి లేవలేదు. అ ప్రకారంగా ఆ సన్యాసి శిరిడీలో రెండు రోజులున్నాడు.అంతలో అతనికి తన తల్లి జబ్బుతో ఉన్నట్లు ఉత్తరమొచ్చింది. చాలా దు:ఖంతో తల్లిని కలవాలని అతని మనసుకనిపించి తన ఊరికి తిరిగి వెళ్ళాలని బాబా అనుజ్ఞకై జాబు చేత పట్టుకొని మశీదుకెళ్ళాడు. 

 "సమర్ధ సాయిమహారాజా! అమ్మని కలవాలని మనసు పీకుతోంది. దయతో నా ప్రయాణానికి అనుమతినిచ్చి నామీద కృపచూపండి"అంటూ సన్యాసి బాబా చరణాలు పట్టుకొన్నాడు.ఆమె అంతిమచూపు నాకు దక్కే అనుమతి ఇవ్వండి అని వేడుకొన్నాడు.




అయితే సాయి సమర్ధులు సర్వజ్ఞులు. సన్యాసికి ఆయువు తీరిపోయిందని ఆయనకు తెలుసు. కనుక అతనితో ఆయన...."తల్లిపై అంత ప్రేమున్నవాడివి ఈ సన్యాసి వేషం ఎందుకేసుకున్నావు? ఈ వేషానికి అహంకారము, మాయ, మమకారాలు శోభించవు.దు:ఖించకు. మనసులో ధైర్యం పెట్టుకో శరీరం ఎప్పటికీ నశ్వరమే. మరణం మన వెన్నంటే ఉంటుందని తెలుసుకొని శాస్త్రాల్లో చెప్పినది నీ ఆచరణలో పెట్టు. ఈ లోకంలో దేహం, భార్య, పిల్లలు మొదలైన విషయాల్లో నేను, నాది అన్న అభిమానం ఉంటుంది. దానివల్ల మూడు రకాల దు:ఖాలు ఉత్పన్నమౌతాయి.వీటిని ఐహిక అనర్ధాలంటారు. రెండవ అనర్ధం పారలౌకికమైనది. అంటే ఆముష్మికం. లోకులు కోరుకునే ఆ పరలోకం కూడా మోక్షాన్ని ప్రాప్తింప చేసుకోవటంలో అవాంతరాలను తీసుకొస్తుంది. సదా అధోముఖంగా ఉంటుంది. పరలోకంలో పుణ్యాన్ని సంపాదించలేము. పరలోక ప్రాప్తిలో నిర్భయత్వం ఉండదు. ఎందుకంటే పుణ్యం పూర్తయిపోతే అక్కడ్నుంచి కూడా కింద ఈ లోకంలో పడిపోయే భీతి ఉంటుంది. కనుక వాటిని పూర్తిగా త్యాగం చేస్తేనే అవి ఆనందాన్ని ఉత్పన్నం చేయటానికి ముఖ్య కారణాలవుతాయి. సంసార వైరాగ్యం పొంది, హరి చరణాల్లో స్థిరంగా లీనమై హరి భజన, నామస్మరణల్లో నిమగ్నమైపోతే ఆయన సంకటాలను పోగొట్టి మనలను రక్షిస్తాడు.నీ పూర్వజన్మ పుణ్యం చాలా గొప్పది. కనుకే ఈ స్థలం మీది ప్రీతితో నీవిక్కడకొచ్చావు. నీ జన్మని సార్ధకం చేసుకో. రేపట్నుంచి శ్రీమద్భాగవత పురాణాన్ని మనస్పూర్తిగా స్వాధ్యయనం చేయి. త్రికరణశుద్ధిగా మూడు సప్తాహాలు పారాయణ చేయి. కోరికలన్నింటినీ త్యజించి మళ్ళీ మళ్ళీ లోతుగా పరిశీలించాలన్న తపనతో ఈ గ్రంధాన్ని శ్రద్ధగా చదువు. అప్పుడు భగవంతుడు ప్రసన్నుడై సమస్త దు:ఖాలను అంతం చేస్తాడు. మాయామోహాలు శాంతిస్తాయి. నీకు ప్రపంచంలో ఆసక్తి తొలగిపోతుంది."  అని అన్నారు.






మరునాడు ఉదయాన సన్యాసి విజయానందుడు కాలకృత్యాలు తీర్చుకొని,స్నానాదికాలు పూర్తిచేసి బాబాకి దోసెడు పూలు సమర్పించి ఆయన చరణ ధూళిని తలపై ధరించాడు. తరువాత సంస్కృత భాషలోని శ్రీమద్భాగవత పురాణ గ్రంధాన్నితీసుకొని లెండీబాగ్ లోని చక్కని ప్రదేశంలో ఆసనం వేసుకొని బాబాని స్మరించి పారాయణ ప్రారంభించాడు. రెండు సప్తాహాలు భక్తితో పూర్తి చేశాడు. మూడవ సప్తాహం చేస్తున్నప్పుడు ఒక్కసారిగా అతనికి అస్వస్థత కలిగింది. శక్తి లేక సప్తాహం అలాగే అసంపూర్తిగా వదిలేసి అతను వాడాకి తిరిగి వచ్చేశాడు. అతికష్టం మీద రెండు రోజులుండి, మూడవరోజు ఉదయం ఆ సన్యాసి అస్తమించాడు. శారీరక, ఐహిక విషయాలపై ఆసక్తి నశించిపోయి దేహ ముక్తుడైనాడు. సన్యాసి మరణం గురించి బాబాకి తెలిపినప్పుడు ఆయన భక్తులతో ఆతని దేహాన్ని రోజంతా ఉంచండి. అని చెప్పారు. ప్రభుత్వ అధికారుల విచారణ అనంతరం యధావిధిగా ప్రేత సంస్కారం అయిపోయింది. సరైన స్థలంలో అది పాతిపెట్టబడింది. సన్యాసికి సద్గతి ఇవ్వటం అనే సాయిబాబా కార్యం పూర్తయింది. సాయి సమర్ధులు సనాతన బ్రహ్మ. ఆయన మాటలు ఖచ్చితంగా నిశ్చయపూర్వకమైనవి.  


 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.


0 comments: