Thursday, October 21, 2021 3 comments By: visalakshi

అమ్మవారి..ఆదిశంకరుల అద్భుత లీల

 ,



#అమ్మవారితోనే పాచికలాడి #శ్రీచక్రంలో అమ్మవారిని కూర్చోబెట్టిన ఘనుడు.. ఈ కథ విన్నా, వినిపించినా కోటిజన్మల పుణ్యఫలం*


#మధుర  #మీనాక్షి అమ్మవారి ఆలయంలో శ్రీ #ఆదిశంకరులు   #శ్రీచక్రం ప్రతిష్ఠించిన ఉదంతం:


🍁 పంచశత శక్తిపీఠాల్లో  మధురమీనాక్షి ఆలయ పీఠము ప్రముఖమైనది. మీనములవంటి చక్కని విశాలనేత్రాలతో ఒకేఒక మరకతశిలతో అమ్మవారి విగ్రహము చెక్కబడినది. ఆకుపచ్చ, నీలం కలగలిపిన మరకతమణి శరీరకాంతి ఆ తల్లి యొక్క ప్రత్యేకత.


🍁 మధురనుపాలించే పాండ్యరాజులంతా ఆ తల్లిని ఆడపడుచుగా, కులదేవతగా, జగజ్జననిగా ఆరాధిస్తారు. "దేవీ భాగవతపురాణము" లో మణిద్వీపవర్ణనలా ఆ ఆలయాన్ని పాండ్యరాజులు రూపొందించారు. అంతటి సౌందర్యరాశి, చతుష్షష్టి కళానిలయమైన "మీనాక్షి" గూడా రాత్రివేళ తామస శక్తిస్వరూపిణిగా మారి ప్రాణిహింసకు పాల్పడుతుంది. ఆమెను శాంతింపచేయడానికి యావద్భారతంలోని మూలమూలలనుండి వేదపండితులను, ఋత్విక్కులను పిలిపించి యజ్ఞాలు, యాగాలు, క్రతువులు పూజలు, జపహోమాలు అన్నీ చేయించారు. వారు పూజలు చేస్తుండగా వారినీ కబళించేసింది మీనాక్షి.


🍁 పాండ్యరాజు నిస్సహాయంగా ఉండిపోయి తమ రాచరికపు కర్తవ్యంగా రాత్రివేళ నగరంలో "నర సంచారం" లేకుండా నిషేధాజ్ఞలు విధించారు. సంధ్యా సమయానికల్లా ప్రజలంతా తమతమ పనులన్నీ పూర్తిచేసుకుని రాత్రికాగానే ఎవరిగృహాల్లోవారు బందీలుగా మారిపోయారు. ఆపదొచ్చినా, అపాయం వచ్చినా, వారికి బైటకొచ్చేవీలులేదు. వచ్చారో నగర సంచారానికి బయలుదేరిన అమ్మవారి కోపాగ్నికి ఆహుతైపోవాల్సిందే!


🍁 క్షేత్రపాలకుడూ, మీనాక్షీ హృదయేశ్వరుడూ అయిన సుందరేశ్వరుడు కూడా ఈ జరుగుతున్నది అంతా సాక్షీభూతునిలా చూస్తుండిపోయారు. తన దేవేరియొక్క తామస ప్రవృత్తిని మాన్పించటానికి తనఅంశతో ఒక అవతారపురుషుడు జన్మించాలి. అప్పటిదాకా మౌనంవహించి తీరాల్సిందేతప్ప మరేమీ చేయటానికిలేదని నిర్ణయించుకున్నారు భోళాశంకరుడు.


🍁 తన శరీరంలోని అర్ధభాగమైన ఈశ్వరిని అవమానపరిస్తే , తననుతాను అవమాన పరచుకోడమే అవుతుంది. బాహ్యలోకానికి ఆమెను చులకన చేసినట్లవుతుంది. ఎలా? కాలము విచిత్రమైంది. ఏ సమయంలో, ఏప్రాణికి, ఏశిక్ష, ఏ పరీక్ష, ఏదీక్ష, ఏసమీక్ష ప్రసాదించాలో ఒక్క మహా కాలుడికే ఎరుక. ఎవరివంతుకు ఏదివస్తే అది మంచైనా, చెడైనా, జయమైనా, పరాజయమైనా అనుభవించి తీరాల్సిందే.  


🍁 ఆదిశంకరాచార్యులు మధురలో అడుగుపెట్టే నాటికి పరిస్థితలాఉంది. పాండ్యరాజు ఆది శంకరులను అత్యంత భక్తిశ్రద్ధలతో స్వాగతంపలికి తనఅంతఃపురంలో సకలసేవలుచేసాడు. అద్భుత తేజస్సుతో వెలిగిపోతున్న యువబ్రహ్మచారయిన ఆదిశంకరాచార్యులు "నేను మధురమీనాక్షి ఆలయంలో ఈరాత్రికి ధ్యానం చేసుకుంటాను" అని చెప్పాడు. ఆ మాటలువిన్న పాండ్యరాజు పాదాల కింద భూకంపమొచ్చినంతగా కంపించిపోయాడు. 


🍁 "వద్దుస్వామీ! మేము చేసుకున్న ఏపాపమో,  ఏ శాపఫలితమో చల్లనితల్లి కరుణారస సౌందర్యలహరి అయిన మా మీనాక్షితల్లి రాత్రిసమయాల్లో తామస శక్తిగామారి కంటికి కనిపించిన ప్రాణినల్లా బలి తీసుకుంటున్నది. అందుచేత అంతఃపురంలోనే మీ ధ్యానానికి ఏ భంగంరానివిధంగా సకలఏర్పాట్లు చేయిస్తాను. మీరు ఆలయంలోకి రాత్రివేళ అడుగుపెట్టద్దు .అసలు అంతఃపురంనుండి బయటకు ఎవరూవెళ్ళరు. పొరపాటుగా బయటకొస్తే వారు మరునాటికి లేనట్టే లెక్క"  అని పాండ్యరాజు వేడుకున్నాడు. 


🍁 ఆదిశంకరాచార్యులు పాండ్యరాజును శతవిధాల సమాధానపరచాడు. "సన్యాసులకు గృహస్తులభిక్ష స్వీకరించేవరకే ఉండాలికానీ తర్వాత వారు గృహస్తుల యింట ఉండరాదు. మేము ఆలయంలోనే ఉంటాము. జగన్మాత అయిన మీనాక్షి అమ్మవారిని మనసారా ధ్యానం చేసుకుంటేతప్ప నాకు సంతృప్తి కలగదు. అడ్డుచెప్పద్దు" అన్నారు.  పాండ్యరాజు హతాశుడైయ్యాడు.


🍁  దైవీతేజస్సుతో వెలిగిపోతున్న ఈ యువ బ్రహ్మచారిని "ఇకచూడనేమో?!" అని  పాండ్యరాజు ఆవేదనచెందాడు. ఆదిశంకరాచార్యను ఆలయంలోకి తీసుకువెళ్లి తిరిగి అంత:పురానికెళ్ళాడు. పాండ్య రాజుకు ఆరాత్రి నిద్రలేదు. "ఈ యువసన్యాసిని అమ్మవారు బలితీసుకుంటుదేమో ఆపాపం తన తరతరాలను పట్టిపీడిస్తుందేమో" అని నిద్రరాక అటుఇటూ పచార్లు చేయసాగాడు. 


🍁 రాత్రయింది. గర్భగుడికి ఎదురుగాఉన్న విశాలమైన మండపంలో పద్మాసనం వేసుకొని ఆదిశంకరాచార్య ధ్యానంలో కూర్చున్నాడు. మరకతశ్యామ అయిన ఆతల్లి ఆయన మనో నేత్రాలముందు ప్రత్యక్షమై భ్రుకుటిమధ్య నిలచి సహస్రారంలో ఆశీనురాలై చంద్రకాంతివంటి వెలుగులతో సుధావర్షదార కురిపిస్తోంది.


🍁 ఆ సమయంలోనే ఆలయంలోని గంటలన్నీ వాటంతటవే మోగసాగాయి. ఆలయంలో అన్ని వైపులా దీపారాధనలోని వెలుగులు దేదీప్యమానంగా వెలగసాగాయి. గర్భగుడిలో మరకతశిల అర్చనామూర్తిలో  చైతన్యమొచ్చి అమ్మవారు మెల్లగా పీఠమునుండి లేచి నిల్చుంది.  


🍁 పాదమంజీరాలు ఘల్లుమన్నాయి. సుందరేశ్వరుని వైపు తిరిగి వినమ్రంగా నమస్కరించినది. కర్ణతాటంకాలు ధగ,ధగ మెరుస్తుండగా, ఆమె ధరించిఉన్న ఎర్రనినిరంగు పట్టుచీర, బంగారు జరీఅంచులకుచ్చెళ్ళు నేలపై జీరాడుతూ, పుడమితల్లికి స్వాంతన చెప్తున్నట్టుగా, కోటివెన్నెలలు రాసిబోసినట్టున్న చిరునవ్వుతో ఆ తల్లి గర్భగుడి ద్వారంవద్దకొచ్చి లిప్తకాలమాగింది.


🍁  ఎదురుగా విశాలమైన మండపములో ధ్యాన సమాధిలోఉన్న యువయోగి ఆమె విశాలనయన దృష్టిపథంలోకొచ్చాడు. "ఎవరితడు? ఈ అద్భుత తేజస్సేమిటి?  నుదుట విభూదిరేఖలు, అందులో కుంకుమబొట్టు, మెడలో రుద్రాక్షమాలలతో "బాల శివుని"లా ఉన్న ఆయోగిని చూస్తుంటే తనలో మాతృ మమత, పెల్లుబుకుతున్నదేమిటి? ఈ వేళప్పుడు ఆలయములో ఉన్నాడేమిటి?" అని ఆశ్చర్యం కలిగింది.


🍁 క్షణకాలమే ఇదంతా! గర్భగుడి "గడప" దాటిన ఆతల్లిపై ఒకానొక ఛాయారూప "తమస్సు" ఆవరించుకుంది. ఆమెలో సాత్త్వికరూపం అంతరించి తామసికరూపం ప్రాణం పోసుకుంటోంది. మరకత శ్యామ కాస్తా కారుమబ్బు రంగులోకిమారి భయంకర దంష్ట్రాకరాళవదనంతో, దిక్కులనుసైతం మ్రింగివేసే భయంకరమైనచూపులతో అడుగుముందుకేస్తోంది మహాకాళీ స్వరూపంలా. 


🍁  ఇందాక తల్లి ఆకారం గర్భగుడిలో సాక్షాత్కరించిన సమయంలోనే ఆదిశంకరులు ధ్యాన సమాధినుండి మేల్కొని "మహాలావణ్య శేవధి" ని కళ్లారాచూసాడు. ఆయన హృదయంలో స్తోత్రం కవిత్వంరూపంలో సురగంగలా ఉరకలు వేసింది. ఆమె తామసరూపంగా మారినప్పటికీ ఆయనకు ఆ తల్లి మనోఙ్ఞరూపంగానే కన్పిస్తోంది. కన్నతల్లి అందమైనదా? కాదా?అనుకోరుకదా! కన్నతల్లి కన్నతల్లే ! అంతే !


🍁 అప్రయత్నంగా ఆయన స్తోత్రంచేసాడు. అడుగు ముందుకేస్తూ ఆయనని కబళించాలనివస్తున్న ఆ తామసమూర్తికి ఆస్తోత్రం అమృతపుజల్లులా చెవులకుసోకింది. దంష్ట్రాకరాళవదనంలో రేఖా మాత్రపు చిరునవ్వు ఉదయించింది. స్తుతిస్తున్న డింభకుని భక్తిపారవశ్యానికి ఆశ్చర్యపోయింది. అతని ఆత్మ స్థైర్యానికి, తపశ్శక్తికి  ఆశ్చర్యంగా చూచింది. నిజానికీసమయంలో తనవదనంలోకి శలభంలా వెళ్లిపోవాల్సినవాడు, మ్రింగటానికి బుద్ధి పుట్టడం లేదేమిటి? 


🍁 అర్ధనిమీళితాలైన కన్నులతో భక్తిపారవశ్యంతో వజ్రాసనంవేసి కూర్చుని స్తోత్రంచేశాడా యువయోగి పుంగవుడు. "భవానీ భుజంగ ప్రయాత స్తోత్రం" ఆ యువయోగిలోంచి కవిత్వ గంగాఝురిగా పొంగి పొరలివస్తోంది. జగజ్జనని తృళ్లిపడింది. తామస భావంతో నిండిపోయిన ఆమెహృదయంలో ఒకానొక సాత్త్వికతేజ: కిరణం తటిల్లతలా తటాలున మెరిసింది.


🌺 ఆహా! తన శక్తిపీఠస్థానము ఎంత అద్భుతంగా చెప్పాడీ యువకుడు? అవునుతాను "త్రికోణ బిందురూపిణి. శ్రీ చక్రరాజనిలయ". సహస్రారమనే మహాపద్మములో శివ, శక్తిరూపిణిగా, పరాశక్తిగా ఉండే తనఉనికిని ఎంతచిన్న శ్లోకంలో ఎంత చక్కగావర్ణించి గుర్తుచేశాడు. మరితనలో ఈ తామస భావాలేమిటి? తనసృష్టినితానే కిరాతకంగా హింసించే ఈ భావనలేమిటి? ఆలోచనలోపడింది అమ్మవారు. 


🍁 ఆదిశంకరుల ముఖకమలంనుండి, సురగంగలా వచ్చిన స్తోత్రము తరంగాలుగా ఆమె కర్ణ తాటంకాలను దాటి, కర్ణపుటలనుదాటి, ఆమె ఆలోచనల్లో సుడులు తిరుగుతుంది. "ఏమిటిది?  ఇతడు వసిన్యాది వాగ్దేవతలకు మరోరూపమా! ఏమి పదలాలిత్యము! ఏమా కవిత్వము! ఏమా కంఠస్వరం! ఏమి భక్తితత్పరత! ఏమివర్ణన? శ్రీచక్ర రాజంలోని నవావరణల్లోని దేవతాశక్తి బృందాలు, అణిమాది అష్టసిద్ధులు ఈ యువయోగికి కరతలా మలకము!"  ఆనుకుంది అమ్మవారు.


🍁 "ఎవరు నాయనా నీవు ?  నాదారికడ్డుగా కూర్చున్నావేమిటి? నేనీ సమయంలో సంహార కార్యక్రమం చేపట్టాను. నిన్నుచూచి నీస్తోత్రానికి ముగ్ధురాలినై క్షణకాలమాగానంతే. నీవుతొలగు. నిజానికి నీవీపాటికి నాకాహారం కావలసినవాడివి. నీవాక్కు నన్ను ఆకట్టుకొన్నది"అన్నది జగజ్జనని వాత్సల్యపూరిత సుధాదృక్కులతో ఆదిశంకరాచార్య వైపుచూస్తూ.


🍁 ఆదిశంకరులు సాష్టాంగ దండప్రణామము చేసాడు. "అంబా శంభవి! చంద్ర మౌళి రబలా, కాత్యాయినీ సుందరి..." గంగాఝురిలా సాగిందా స్తోత్రం. తల్లి తలపంకించింది. "నవవిద్రుమ బింబశ్రీ శ్రీన్యక్కారి రదనచ్చదా" పగడము, దొండపండు కలగలిపిన ఎర్రనిరంగును గుర్తుకుతెచ్చే ఆమె పెదవులపై వెన్నెలలాంటి నవ్వు వెల్లివిరిసి "శుద్ధ విద్యామ్ కురాకార  ద్విజపంక్తి ద్వయోజ్వలా " అన్నట్లుగా ఆ తల్లి పలువరస ఆ నవ్వులో తళుక్కుమని మెరిసింది. 


🍁 "కర్పూరవీటికామోద సమాకర్షద్దిగంతరా" అన్నట్లుగా తాంబూలసేవనంతో ఆ సువాసన దిగంతాలకు వ్యాపించింది. సరస్వతీదేవి వీణ అయిన "కచ్ఛపి"  మధురనాదాన్ని మించే సుస్వర, సుమధురనాదంతో జగన్మాత ఇలా అన్నది. "నీ స్తోత్రాలకు, నీ భక్తికీ మెచ్చాను. నీవు, నీకవిత్వం చిరస్తాయిఅయ్యేలా ఆశీర్వదిస్తున్నాను. నీనుంచి వచ్చిన ఈ స్తోత్రాలు నిత్యము పారాయణ చేయ గలిగినవారు శ్రీచక్రార్చన చేసినంతటిఫలం పొందుతారు". 


🍁 " నీకు ఏవరం కావాలోకోరుకో. ఆ వరమును ఇచ్చి నేను నాసంహార కార్యక్రమాన్ని యధావిధిగా కొనసాగిస్తాను. నిన్ను సంహరించక అనుగ్రహించడమే నీకు ఇచ్చే పెద్దవరముగా భావించు" అన్నది కించిత్ "అహం" ప్రదర్శిస్తూ తామసభావ ప్రభావంతో ఉన్న అమ్మవారు. ఆదిశంకరులు క్షణము జాగుచేయలేదు. 


🍁 "బాల్యంలో తెలిసీతెలియని వయసులోనే నేను సన్యసించానుతల్లీ, నాపేరు శంకరుడు. దేశాటనం తోనూ, వేదాంతాలకు భాష్యాలు వ్రాయడంలోనూ ఇన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. బాల్యావస్త దాటిపోయి యవ్వనం వచ్చేసింది. ఇదిగూడా ఎంత కాలం తల్లీ!"


🍁 "కానీ నా హృదయంలో నా బాల్యకోరికొకటి మిగిలిపోయింది. అది శల్యంలా నన్ను అప్పుడప్పుడూ బాధిస్తుంటుంది" అన్నాడు వినమ్రంగా ఆదిశంకరాచార్య. ముల్లోక జనని ముగ్ధ మనోహరంగా నవ్వింది. "ఏ కోరికైనా తీర్చగల సమర్థురాలిని, నీ తల్లిని, జగజ్జననిని, నేనుండగా  నీకేమికొరత నాయనా! అడుగు నీ కోరికతీర్చి, నేను నా సంహారకార్యక్రమానికి వెళ్లిపోతాను" అన్నది. ఇంకాఆమెలో తామసికవాసనాబలం తగ్గలేదు.


🍁 పసితనపు  అమాయకత్వం వదలని ఆ యువకుని కోరికకు "మందస్మితప్రభాపూర మజ్జత్కామేశమానసా" అన్నట్టుగా ఫక్కున నవ్వింది. సౌందర్యలహరికే సౌందర్యలహరిగా భాసిస్తున్నదా నవ్వు. "అమ్మా ! నాతో పాచికలాడతావా ?" అని పసి పిల్లాడు అడిగినట్టుగా అడిగాడు బాలశంకరుడు. "తప్పక ఆడతాను నాయనా! నీ స్తోత్రంతో, నీ భక్తితో, నీ వినయంతో, నీపట్ల అపార మాతృవాత్సల్యము పెల్లుబికేలా చేసావు" .


🍁  "మరి ఆట అన్నాక పందెమంటూ ఉండాలిగా! నీకు తెలుసోతెలీదో, పశుపతితో ఆడేటప్పుడు నేను ఒక నిబంధనపెడతాను. నేనుఓడిపోతే ఆయన ఆజ్ఞమేరకు సంవత్సరకాలం నడచుకుంటాను. నేనెప్పుడూ ఓడిపోలేదనుకో! ఈశ్వరుడు ఓడిపోతే నేనువేసే ప్రశ్నలకు వివరంగా, విసుక్కోకుండా సమాధానం చెప్పాలి. ఆప్రశ్నలు లౌకికమైనవికావు. ఎన్నో వేదాంతరహస్యాలు, ప్రాణికోటికి సులభతరం కావాలన్న పరోపకారధ్యేయంతో ప్రశ్నిస్తాను". 


🍁 "అట్లా ఏర్పడినవే, ఎన్నో దేవీ,దేవతాస్తోత్రాలు, కవచాలు, సహస్ర, అష్టోత్తర శతనామస్తోత్రాలు. మరి నీపందేమేమిటి నాయనా! అన్నది జగజ్జనని. ఆమెలో పశుపతినే పాచికలాటలో ఓడించే తన నైపుణ్యం తాలూకు కించిత్తు అహం తొణికిసలాడుతోంది. ఇదంతా గమనిస్తున్న సుందరేశ్వరుడు నిశ్శబ్దముగా లోలోపల నవ్వుకున్నాడు. ఆమె గెలుపు, తన ఓటమి ఎవరికోసం?లోకకల్యాణం కోసం. మౌన ముద్రలో ఉన్న సుందరేశ్వరుని జటాభాగంనుండి ఒకానొక కాంతికిరణము మెరుపులా వచ్చి ఆది శంకరునిలో ప్రవేశించడం ఆతల్లి గమనించలేదు.  


🍁  ఆదిశంకరుల శరీరము, హృదయం క్షణకాలం దివ్యానుభూతికిలోనైంది. "శివా, పరమశివా! తల్లితో ఆడేఆటలో పందెంగా ఏమికోరాలో వాక్కుప్రసాదించు సుందరేశ్వరా!" అనుకున్నాడు లోలోపల. అది భావనారూపంగా పరమశివునినుండి అందింది. "పందెమేమిటి నాయనా?" అని మళ్ళీ అడిగింది అమ్మవారు. "ఈ యువకునితో పాచికలాడి అతన్ని ఓడించి తననైపుణ్యాన్ని సుందరీశ్వరునికికూడా తెలియచేయాలి" అనే  ఉబలాటము ఆమెలో వచ్చేసింది.


🍁  "తల్లీ నేను సన్యాసిని. నాకు ధన, కనక, వస్తు, వాహనాలేవీ నాకు అక్కరలేదు. ఒకవాగ్దానాన్ని పందెపుపణంగా నేనుపెడితే నీకు అభ్యంతరమా తల్లీ?" అన్నాడు శంకరాచార్య. "తప్పకుండా, నీ వాగ్దానము ఏమిటో చెప్పేసేయ్" అన్నది వాత్సల్యము నిండిన చిరునవ్వుతో జగన్మాత. బహుశా మరింత కవితాశక్తి ప్రసాదించమని, అది మహారాజులుమెచ్చి మహాత్కీర్తి రావాలనే కోర్కెకోరుతాడని ఉహించింది"  


🍁  "తల్లీ, నీవు కరుణామయివి. నీవు తామసశక్తివై  ఈ సంహారకార్యక్రమం చేయడం నాకు బాధగాఉంది. ఆటలోనీవు ఓడిపోతే ఈ సంహారకార్యక్రమం ఆపేసి అందరినీకాపాడాలి. నేనుఓడితే మొదటగా నేనే నీకు ఆహారవుతాను". అన్నాడు దృఢచిత్తముతో ఆదిశంకరాచార్య.  


🍁 జగన్మాత నవ్వింది. "నిన్ను ఆహారంగా తీసుకోను నాయనా! నేను ఓడిపోతే, నీమాటప్రకారాం నేను ఈ సంహారకార్యక్రమం ఆపేస్తాను, సరేనా!" అన్నది. ఆమెలో తానెన్నడూ ఓడిపోననే దృఢవిశ్వాసము నిండుగాఉంది. పశుపతినే ఓడించే తనకు ఓటమి రాదు, రాకూడదు. ఈ యువకుని నిరుత్సాహ పరచకూడదు. గెలుపు అతడికే లభిస్తుంది అనిపించేలా మెల్లిగా ఆడుతూ చివరలో ఓడించి,  తన సంహారకార్యక్రమం కొనసాగించాలని  ఆలోచించింది. 


🍁  ఆదిశంకరాచార్య భక్తితో మొక్కాడు. "తల్లీ! దివ్య మహిమలుగల పాచికలు నీవే సృష్టించు. నీవు కోరిన పందెం నీకు, నేను కోరిన పందెం నాకుపడేలా ఆ పాచికలలో నీ మహత్యంనింపు. నేను ఆటలో అన్యాయమాడను, అసత్యం పలకను. నీవునాతో పాటు ఈ విశాలమండపంలో కూర్చోనవసరంలేదు. నీ గర్భగుడిలోని ఉన్నతాసనంమీద కూర్చోమ్మా!" అన్నాడు.


🍁 "ఏమిటి నాయనా ఆలోచిస్తున్నావు? ఆట మొదలుపెట్టు. పాచికలు నీవే మొదటవేయి.  చిన్నవాడివి. నీవు మొదట ఆడడమే న్యాయం" అన్నది మీనాక్షి అమ్మవారు. ఆమె హృదయంలో మాత్రము "సుందరేశ్వరా! నీఅర్ధాంగిని. నాకు ఓటమి ఉండకూడదు. నీ దగ్గరే నేను ఓటమినేనాడూ చూడలేదు. ఈబిడ్డ దగ్గర ఓడిపోతే నాకు చిన్నతనంగా ఉంటుంది.  మరి మీఇష్టము!" అన్నది.  సుందరేశ్వరుడు చిరునవ్వుతో ఆశీర్వదించాడు. 


🍁 ఆదిశంకరులు "తల్లీ నీవు సృష్టించిన దివ్య పాచికలు  ఈక్షణాన నాచేతిలో ఉన్నాయి? నీలోని దివ్యత్వము నాలోకి వచ్చినట్టేకదా! ఈ భావనే నన్ను పులకింప చేస్తోంది. అమ్మా! జగన్మాతా! ఇంతటి అదృష్టము ఎంతటి యోగులకు దక్కతుంది? మళ్లీ మళ్లీ ఈ అవకాశం రాదునాకు. పశుపతితో తప్ప మరెవరితోను పాచికలాడని తల్లివి, సాధారణ మానవుడినైన నాతో ఆడడానికి అంగీకరించావు. అందుకని ఈ రాత్రి జరుగుతున్న వర్తమానకాలం చాలా విలువైంది, మహత్తరమైంది.


🍁 నీ లలితాసహస్రనామంలోని  కొన్ని నామాలు, వాటిఅర్ధాలు ఆలోచిస్తూ  ఈక్షణాలకు ఒక అద్భుతమైన పవిత్రత, ప్రయోజకత కూడా చేకూర్చుకుంటాను. నీనామాలు పలుకుతూనే ఆటాడతాను. అభ్యంతరమా తల్లీ! అలాగని ఆటలో ఏమరుపాటు చూపను. సాక్షాత్తూ గురురూపిణివైన నీవు, నీవు తోపింపచేసే అర్ధాలతో ఆ స్తోత్రం మరింత మహత్వపూర్ణమవుతుంది". అన్నాడు భక్తితో పాచికలు చేతబట్టుకొని నమస్కరిస్తూ. తన్మయురాలైనది ఆతల్లి.


🍁 సంఖ్యాశాస్త్రప్రకారము  పావులు కదులుతూ ఉన్నాయి.  సంఖ్యలకు, అక్షరాలకు అవినాభావ సంభందముంది. అమ్మవారికి ఆటలో ఆసక్తి పెరిగింది. ఇరువురి పావులు న్యాయబద్ధంగా కదులుతున్నాయి. "తాటంక యుగళీభూత తపనోడుపమండలా" అన్నట్టు అమ్మవారు అతని న్యాయమైన ఆటకు తలూపుతోంది. 


🍁 ఆ తల్లి తాటంకాలకాంతి సూర్యచంద్రుల తేజో వలయాల్లాగా కనిపిస్తుండగా ఆదిశంకరాచార్య అమ్మవారిని స్తోత్రము చేస్తున్నాడు. "విజయావిమలా వంద్యా వందారు జనవత్సలా"! అన్నాడు. తల్లి నవ్వింది. "విజయమంటే విజయం నాదేకదా నాయనా!" అన్నది. ఆటమధ్యలో ఆపి, కించిత్ గర్వంగా.. విజయపరంపర మనిషిలో అహం పెరిగేంతటి మత్తును కలిగిస్తుంది. సృష్టి, స్థితి, లయాలను నేను నిర్వహించగలనన్న గర్వంతో ఉన్న ఆ తల్లి నయనాల్లో, చూపుల్లో ఎరుపుదనం, అహం కనిపించాయి. 


🍁 "విజయం నాదయినా, నీదయినా రెండూఒకటే తల్లీ.! నీలోనుండి నేను ఉద్భవించాను. నాలో నీవున్నావు. ఒకనాణేనికి బొమ్మా బొరుసులాగా జీవుడు, దేవుడు ఉన్నారనుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందమ్మా! విజయపుఅంచుకు చేరుకున్నవ్యక్తి లిప్తపాటులో అపజయాన్ని చవిచూస్తాడు. విజయ లక్ష్మి  చివరిక్షణంలో ఎవరిని ఉద్ధరిస్తుందో? అదే విజయరహస్యం. అందుకే నీవు గుప్తయోగినివి, గుప్తతరయోగినివి. ఆ గోప్యాన్ని తెలుసుకోగల్గిన వారికి విజయమైనా, పరాజయమైనా ఒకటేకదమ్మా.


🍁 పరాజయము నీ శక్తిస్వరూపమే. ఆ పరాజయం ఎంతటి నిరాశనిస్తుందో అంతటి పట్టుదలనిస్తుంది.  ఆ పరాజయంద్వారా పొందిన అవమానం, దైన్యం, దైవంయొక్క పాదాలను పట్టుకొనేలాచేస్తుంది. ఇది మాత్రం విజయంకాదా తల్లీ!" అన్నాడు ఆది శంకరాచార్య భక్తి పారవశ్యంతో అమ్మవారికి మ్రొక్కుతూ. అమ్మవారు దిగ్భ్రాంతి చెందినది. 


🍁 "గెలుపోటములు, ద్వంద్వాలు. సర్వమొకటిగా చూడగల దివ్య అద్వైతస్థితికి చేరుకున్న ఈ యువకుడు కారణజన్ముడు. సర్వము బోధించగల సమర్ధగురువుగా రూపొందుతాడు భవిష్యత్తులో". లోలోపల అనుకోబోయిన అమ్మవారు వాత్సల్యము పెల్లుబికిరాగా పైకనేసింది. "నాయనా! నీ ప్రతిఅక్షరం ఒక కవిత్వమై, ఆ ప్రతి కవితా స్తోత్రమై, ఆ స్తోత్రం ప్రతీదీ శృతిసమ్మతమై, వేదమై, వేదవాణి అయి అలరారుగాక. నీవు వేసే పందెం నీవు వేయి. ఇద్దరి పావుల్ని న్యాయబద్ధంగా నేను కదుపుతాను. ఆ సుందరేశ్వరునిసాక్షిగా నేను కపటం, మోసంచేయను" అన్నది అమ్మ.. "గెలుపోటములు జగన్మాతవైన నీ అధీనం కదాతల్లీ!" అన్నాడు ఆదిశంకరాచార్యులు.


🍁 ఆలయములో ఉన్న బంగారు గిన్నెలలోని పసుపు, కుంకుమ, చందనపుపొడులతో అష్టరేఖల గడులు చిత్రించాడు. అమ్మవారిపాదాలవద్దున్న పుష్పాలను తన పావులుగాను, అమ్మవారి అలంకరణ సామాగ్రిలోని మంచిముత్యాలను అమ్మవారి పావులుగాను సిద్ధముచేసాడు. జగన్మాత సంతోషించింది. దివ్యపాచికలను సృష్టించింది. ఆ యువకునితో ఆటపూర్తయ్యేవరకు  "నీకోరిక మేరకు నేను నాస్థానములో కూర్చుంటాను", అంటూ గర్భగుడిలోకి వెనక్కివెనక్కి నడిచింది. ఆ సమయంలో సర్వచరాచరకోటికి తల్లి అయిన ఆమెలో యువయోగీశ్వరునిపై మాతృమమత పెల్లుబికింది. "ఎంతచిన్న కోరిక కోరాడీడింభకుడు. ఓడించకూడదు" అనే జాలికూడా కలిగినది. 


🍁 పీఠంమీద ఆసీనురాలైన మరుక్షణంలో ఆమెలో ఇందాకున్న తామసభావము  మాయమై నిర్మలత్వం వచ్చేసినది. ఆదిశంకరులు ఆమెలో కోరుకున్న మొదటిమార్పుఇదే. తన స్తోత్రశక్తితో అది సాధించాడాయన. మనసులో సుందరేశ్వరునికి మ్రొక్కాడు. "పరమశివా! జగన్మాతతో ఆడుతున్న ఆట పర్యవసానం లోకకళ్యాణముగా మారేలా అనుగ్రహించు. గెలుపోటములు రెండూ నీదృష్టిలో సమానమైనవి. నీవు నిర్వికారమూర్తివి. ఈ ప్రాణికోటి హింస, అమ్మవారి తామసశక్తి అన్నదాగాలి. అది ఆమె మాతృత్వానికే కళంకం. ఇది అర్ధముచేసుకొని నీవు సాక్షీభూతునిగా వుండి ఈఆట నడిపించు" అని మనసారా ప్రార్ధించాడు. 


🍁 వెంటనే అతని హృదయానికి చందనశీతలస్పర్శ లాంటి అనుభూతి కలిగినది. అది ఈశ్వరకటాక్షమని అర్ధమయింది. "ధన్యుడిని తల్లీ! ధన్యుడిని. నా ప్రతి స్తోత్రములో నీవు, నీశక్తి అంతర్లీనమై నిలిస్తేచాలు. "ఆ బ్రహ్మకీటజననీ!" ఈక్షణములో "నిర్వాణ షట్కము" అనే కవితనాలో శ్లోకరూపంలో పెల్లుబికి వస్తోంది. నీ ఆశీస్సులతో అదికవిత్వంగా నా హృదయంలో రూపుదిద్దుకుంటుంది. అంటూనే నిర్వాణషట్కoలోని 5 శ్లోకాలు ఆశువుగా చెప్పేసాడు. ఆ "అహంనిర్వికల్పో! నిరాకార రూపో , విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణే , నచా సంగతం నైవముక్తిర్న బంధం, చిదానంద రూపమ్ శివోహం, శివోహం" రాచనగరులో తెల్లవారుఝాము అయింది. ఆ గుర్తుగా మేలుకొల్పు నగారా మోగింది. 


🍁 అమ్మవారు తృళ్ళిపడింది. ఈ యువయోగి మధురవాక్కుల్లో కాలమాగిపోయి, త్వరగా ఝాము గడిచింది. "తల్లీ! ఇంకాకొద్దిగా ఆట ఉంది. నీవు "విశ్వాసాక్షిణివి, సాక్షివర్జితవు" కూడా అని అన్నాడు. "విశ్వానికి సాక్షిణిని నేను. సాక్షివర్జితను ఎలా అవుతున్నానో చెప్పగలవా?!" అని అడిగింది. జగన్మాత అతని నోటివెంట ఆనామాలకు అర్ధాలు వినాలనే కుతూహలంతో. "తల్లీ! రెప్పపాటు లేనపుడు సృష్టిని కాపాడడం, రెప్పపాటు జరిగినపుడు లయం జరగడము రెండూ నీ ప్రక్రియలేగదమ్మా! సర్వవిశ్వానికి సాక్షిణివైన నీవు ప్రాణులకు కాలంతీరినపుడు, నీ సువిశాల నయనాల నల్లని కనురెప్పలను క్షణకాలం  రెప్పపాటుసాకుతో మూసుకుని సాక్షివర్జితవవుతావు. అలాచేయకపోతే నీసృష్టిలో నియమోల్లంఘన జరిగిపోతుంది. అవునా తల్లీ!"అన్నాడు.


🍁  "ఎక్కడో కదలాడుతున్న ఒక మధురానుభూతి, ఒక మాతృమమత ఈయువకుని చూసినప్పటి నుంచి తనలో కలుగుతూనే ఉంది. తనతో మూడు ఝాములు ఆడిన ఆట కేవలం వినోదమా!కాదు, కాదు. ఇంకేదో కారణముంది. విఘ్నేశ్వరుడు, షణ్ముఖునిలాగా ఏ జన్మలోనో తన బిడ్డా?" ఆట పూర్తి కాలేధీరోజు. సంహార కార్యక్రమం ఆగిపోయింది. తనలో తామసశక్తి మరుగై సాత్వికశక్తి నిండిపోయి, అపారకరుణ జాలువారుతుంది. ఇక బ్రహ్మముహూర్త కాలమొస్తుంది. ఆలయ పూజారులొస్తారు. అభిషేకాలు, పూజావిధులు నిర్వర్తిస్తారు. మరి కాసేపట్లో కాలాన్ని కచ్చితంగా అమలుపరిచే సూర్య భగవానుడొస్తాడు. "భానుమండల మధ్యస్థా" తన స్థానం. ఎంతమార్పు ఒక్కరాత్రిలో! ఈ యువకుడు ఏ మంత్రమేశాడో! అమాయకత్వంతోనే ఆకట్టుకున్నాడు. 


🍁 "తన ఆట కట్టేసాడా! తీరాతను ఆట ఓడిపోదు కదా! పశుపతినే ఓడించగలిగినతాను ఈ యువకుని చేతిలో ఓడిపోతే ఈ సంహారశక్తి ఆపెయ్యాలి". అని మనసులో అనుకుంటూ ఇక ఆటమీద దృష్టి కేంద్రీకరించింది. క్షణకాలం భయ విహ్వలతతో చలించిన ఆమె యొక్క విశాల నయనాలు చూస్తూ ఆదిశంకరులు భక్తి పూర్వకముగా నమస్కరించాడు. అమ్మవారి కుండలినీ యోగశ్లోకాలు సహస్రనామ స్తోత్రంలోనివి ("పాయసాన్న ప్రియా త్వక్ స్థా పశులోక భయాంకరీ") గానంచేస్తూ పావులు చకచకా పాచికలు కదిపాడు. అమ్మవారిలో పట్టుదలపెరిగి త్వరత్వరగా పెద్దపెద్ద పందేలుపడేలా పాచికలను వేస్తోంది. దూరంగా శివభక్తులు వచిస్తున్న నమక, చమకాలు, అమ్మవారి సుప్రభాతగానాలు ప్రారంభమయ్యాయి. ప్రతిపనికి ఒక నిర్దిష్టసమయం, సమయపాలన ఉండి తీరాలి. అదే ముక్తిపధానికి మొదటిమెట్టు. 


🍁 "నాయనా! చివరి పందెం నాది. నా పావులన్నీ మధ్య గడిలోకొచ్చాయి. నేను గెలిచాను" అంది అమ్మవారు సంతోషతరంగాలలో తేలిపోతూ. "అవునుతల్లీ! భూపురత్రయం, 4 ద్వారాల్లోకి వచ్చేశాను నేనుకూడా. 9వ ఆవరణ చేరాముతల్లీ, నీవు బిందువులో  యధాస్థానంలో జగన్మాతగా కూర్చున్నావు. నీవే గెలిచావు తల్లీ! నీచేతిలో ఓటమి కంటే నీబిడ్డకు కావాల్సిన కైవల్యమేముందమ్మా! జగన్మాతచేతిలో ఓటమికూడా గెలుపేతల్లీ, ఇలాంటి ప్రత్యక్ష  ఆట ఎవరికి దక్కుతుంది?" అన్నాడు దివ్యపాచికలు అమ్మవారిముందు పెడుతూ.


🍁 "నేను గెలిచాను. మరిమన ఒప్పందంప్రకారం నా సంహారకార్యక్రమం నేనుకొనసాగిస్తాను. జగన్మాతనైన నాతోపాచికలాడి నీ కోర్కెతీర్చుకొని, పునర్జన్మలేని మోక్షాన్ని సాధించుకున్నావు నాయనా!"అంది అమ్మవారు. "అవును తల్లీ! ఆటపరంగా విజయం నీది. కానీతల్లీ, ఆటవైపు ఒక్కసారి తేరిపారి చూడమ్మా! సంఖ్యాశాస్త్రపరంగా, అక్షరసంఖ్యాశాస్త్ర పరంగా, మంత్రశాస్త్రపరంగా గెలుపునాది" అన్నాడు దృఢస్వరముతో. అమ్మవారు "ఏమిటి? సంఖ్యాశాస్త్ర పరంగానా!" అన్నది, ఏదీ స్ఫురించని అయోమయ స్థితిలో.


🍁 *"నవావరణలతో కూడిన శ్రీచక్రరూపం. శ్రీ చక్రంలోని ఉగ్రబీజాలు మాయమై నీలో తాత్కాలికంగా ఆవహించిన తామసశక్తి మాయమైంది. శ్రీచక్రము నీదేహమైతే, సహస్ర నామావళి నీ నామము. నీ అపారకరుణతో, ఈ రాత్రంతా నాతపస్సు ధారపోసి  నేను ఏర్పరిచిన ఈ శ్రీచక్రరాజాన్ని నీవు తిరస్కరిస్తావా! నీవు చేసిన ఈ సృష్టినీ, నీఉనికిని, నీవేఅర్ధరహితమని నిరూపిస్తావా! అలాచేస్తే ఆస్తికత ఉండక, నాస్తికత ప్రబలి, సర్వసృష్టి జడత్వములోకి, తమస్సులోకి జారిపోదా!"* అంటూ క్షణకాలమాగాడు ఆదిశంకరాచార్యులు. 


🍁 దిగ్భ్రాంతిపొందిన అమ్మవారు మండపంలోకి దృష్టిసారించింది. కోటిసూర్యప్రభలతో శ్రీచక్రము అక్కడ ప్రతిష్ఠితమై ఉన్నది. తాను చతుష్షష్టికళలతో, షోడశకళలతో బిందుత్రికోణరూపిణిగా కొలువైవుంది. అద్భుతంగా తనని శ్రీచక్రంలో బంధించాడు. కాదు, కాదు కొలువు చేయించాడు. గెలుపుతనదా! కాదు కాదు ఆ యువయోగిదే. ఆదిశంకరుడు "అమ్మా! నా మీద ఆగ్రహించకు. ఆగ్రహమొస్తే నన్నొక్కడినే బలి తీసుకో. నాకు, నీకు సాక్షీభూతుడు సుందరేశ్వరుడు ఉన్నాడు. ఆ పరమశివునిగూడా పిలుద్దాము. న్యాయనిర్ణయము ఆస్వామి చేస్తారు. 


🍁 అప్పుడు చూసింది అమ్మవారు సుందరేశ్వరుని వైపు. పశుపతినే పాచికలాటలో ఓడించిన జగజ్జనని నేడు ఒకబిడ్డ చేతిలో ఓడిపోయింది. "ఒక్కసారి నీ పాదాలవద్దనుండి మండపంలో చిత్రించిన ఈఆట చిత్రంవరకు నీ  విశాలనయనాల చల్లనిదృష్టి సారించుతల్లీ!  తొమ్మిది "నవం"తో ఆట ప్రారంభించాను గుర్తుందా తల్లీ!  నీవు నాకు ప్రసాదించిన "ధారణ" శక్తితో మన ఇద్దరి పందేలు ఒక్కటికూడా తప్పుపోకుండా ఏకరువుపెడతాను తల్లీ, ఒక్కసంఖ్య, ఒక్కఅక్షరం పొల్లుపోదు. తప్పు, తడబాటు నాకురాదు. సంఖ్యలకు సరైన బీజాక్షరాలను  చూడుతల్లీ!"


🍁 44కోణాలు, 9ఆవరణలు కలిగిన శ్రీచక్రరాజ చిత్రాన్ని, ప్రతిష్టను, ఈ ఆటచిత్రంలో చూడమ్మా, "మాతృకావర్ణరూపిణి" అయిన నీవు ఒక్కసారి పరికించిచూడు. పందెపుసంఖ్య సరిగ్గా సరిపోయేలా, సాత్వికబీజాక్షరాలను సంఖ్యాశాస్త్రపరంగా మలచి, ఏపొరపాటు రానీకుండా న్యాయబద్దంగా పావుల్ని కదిపాను. ఆటలో అన్యాయము చేయలేదు. అందుకు సుందరేశ్వరుడే సాక్షి. పంచభూతాలు, సర్వదేవతా గణాలు సాక్షి. బిందువు మొదలు, భూపురత్రయంవరకు, ప్రతి ఆవరణకు ఒక ప్రత్యేక అధిష్టానదేవత, ఆ దేవతాశక్తులు పరివేష్టించి ఉన్నాయి. 


🍁 "అకారాది క్షకారాంత" దేవతాశక్తి స్వరూపాలకు వారివారి ఆహార్యాలు,ఆయుధాలు, శరీరపు రంగుతో సహా, ఆయా ఆవరణలలో పరివేష్టితులైనవారిని, ఆయా ముద్రాదేవతలను, నవరసాధిష్టాన దేవీస్వరూపాలను, యోగినీదేవతలను, చక్రీశ్వరులను, సంఖ్యాపరంగా బీజాక్షరాలతో నిలిపాను. ఒక్కసారి పరిశీలించి చూడమ్మా! షట్చక్రాల ప్రత్యక్ష, పరోక్షభోధే శ్రీచక్రార్చనగదా తల్లీ!నీ శక్తిపీఠాల్లో ప్రతిష్ఠితమైన యంత్రాల్లోని ఉగ్రబీజాలు తొలగించి, క్రొత్తగా సాత్విక బీజాక్షరాలసహిత శ్రీచక్ర ప్రతిష్ఠ చేస్తూవస్తున్నాను".


🍁  "ఆకార్యక్రమంలో భాగంగా తల్లీ, నీతో పాచికలాడాను. సంఖ్యాశాస్త్రపరంగా అక్షరాలను సమీకరించి, నిన్ను స్తోత్రముచేస్తూ, నీ ఆశీస్సులతో వాటిని ప్రాణప్రతిష్ట చేసాను. అదే నీముందున్న "బిందు, త్రికోణ, వసుకోణ, దశారయుగ్మ మన్వస్ర, నాగదళ, షోడశ పత్ర యుక్తం, వృత్తత్రయంచ, ధరణీ సదన త్రయంచ శ్రీ చక్రరాజ ఉదిత : పరదేవతాయా:" "ఏమిటీ వింత స్వామీ!" అంటూ భర్తవైపు  కించిత్ లజ్జ, కించిత్ వేదనతో  బేలగా చూసింది. మధుర మీనాక్షి. ఈయువకుడు అద్భుతరీతిలో సంఖ్యల అక్షరాలనుసంధించి యంత్రప్రతిష్ఠ చేసాడు. శ్రీచక్ర యంత్రాన్ని సర్వమానవాళికి శ్రేయోదాయకంగా ప్రసాదించాడు. 


🍁 "స్వామీ సుందరేశ్వరా! ఏది కర్తవ్యం?" అమ్మవారు ఆర్తిగాపిలిచింది. "సుందరేశా! నా యుక్తిని నీవు సమర్ధిస్తావో, క్షమిస్తావో నీఇష్టం!" అంటూ ప్రార్ధించాడు ఆది శంకరాచార్య. ఆయన హృదయంలో "సౌందర్యలహరిగా" తాను కీర్తించిన రూపము తల్లిగానూ, "శివానందలహరిగా" తాను కీర్తించిన ఈశ్వరునిరూపం తండ్రిగానూ, తనతప్పుకు క్షమాపణవేడుకుంటూ "శివ అపరాధ  క్షమాపణ స్తోత్రము" గంగాఝురిలా ఉరకలేసిందాక్షణంలో. అందాకా మౌనంగా ఉన్న నిర్వికారమూర్తి సుందరేశ్వరుడు అప్పుడు కళ్ళు తెరిచాడు. 


🍁 ఒకవైపు అహం తగ్గిపోయిన ఆర్తితో దేవేరి పిలుస్తోంది. మరోవైపు భక్తుడు కర్తవ్యము తెలుపమంటూ ప్రార్ధిస్తున్నాడు. సర్వదేవీ, దేవ గణాలు ఆస్వామి తీర్పుకోసం ఎదురుచూస్తున్నాయి. శివుడు కళ్ళుతెరిచాడు. చిరునవ్వునవ్వాడు. నందీశ్వరుడు ఒక్కసారి తలవిదిలించి రంకెవేసాడు. మధురాపట్టణమంతా మారుమ్రోగిందా రంకె. ప్రమధ గణమంతా అప్రమత్తులై స్వామివెంట కదలడానికి సిద్ధమయ్యారు. ఒక్కసారి కైలాసమే కదిలివచ్చింది. ఆలయగంటలు అదేపనిగా మోగాయి. 

 భక్త్యావేశంతో ఈశ్వరుని నక్షత్రమాలికా స్తోత్రంతో ఆదిశంకరులు స్తోత్రంచేయసాగాడు. ఆయన నోటి వెంట సురగంగ మహోధృత జలపాతంలా స్తోత్రాలు వస్తున్నాయి. ఈశ్వరుడు సర్వదేవతా ప్రమధగణ సమేతంగా మీనాక్షి ఆలయమండపంలో సాక్షాత్కరించాడు. "దేవీ!" అన్నాడు పరమశివుడు.  

మధురమీనాక్షి వినమ్రంగా లేచినిల్చుని చేతులు జోడించింది. ఇప్పుడామె "మందస్మితప్రభాపూర మజ్జత్ కామేశమానసా". తామసం మచ్చుకైనాలేని మమతాపూర్ణ. భర్తఆజ్ఞ, తీర్పు శిరోధార్యంగా భావించే సాధ్వి. సదాశివ కుటుంబిని, సదాశివ పతివ్రత. 


🍁 పరమశివుడు ఇలాఅన్నాడు. "దేవీ! నీఅహాన్ని, నీ తామసస్వభావాన్ని అదుపుచేయలేకపోయాను. ఎందరో నిర్దాక్షిణ్యముగా బలైపోయారు.  ఈప్రాణి కోటిని రక్షించేదెవరు? నీ తామసశక్తినెవరూ జయించలేరు. నేను ప్రయత్నంచేస్తే నాఅర్ధశరీరాన్ని అవమానపరచటమే అవుతుంది. అందుకని సకల దేవతలు, నేనూ సాక్షీ భూతాలుగా ఉండిపోయాము. నీ తామసశక్తిని అదుపుచేయగల యంత్రాన్ని, మంత్ర పూతంగా సిద్ధముచేయాలి. అందుకు ఒక కారణ జన్ముడు దిగిరావాలి. అతడు ముక్తసంగునిగా జన్మించి, ఏ మలినమంటని బాల్యంలో సన్యసించి, సర్వదేవతా సాక్షాత్కారంపొంది, మంత్రద్రష్టగా మారాలి. నీ అనుగ్రహానికి పాత్రుడై నిన్ను తన మాతృప్రేమతోనే జయించగల్గాలి.


🍁 అందుకే ఆ సమయంకోసం వేచిఉన్నాను. ఇతడు నాఅంశంతో జన్మించిన అపర బాల శంకరుడు. అతడి సర్వశాస్త్ర పరిజ్ఞానం, అతడి కవితాశక్తి, అతడిని ఆసేతుహిమాచలం పర్యటన సలిపేలాచేసింది. అతినిరాడంబముగా సాగించిన అతని పర్యటనయొక్క ఉద్దేశం అతని హృదయానికి, పరమశివుడనైన నాకు మాత్రమే తెల్సు. 


🍁 కాలక్రమేణా మహామంత్రద్రష్టలైన కొందరు తమ స్వార్ధపూరిత ఆలోచనలతో  తామే సర్వలోకాలకు అధిపతులు కావాలనే కోరికతో నీ పీఠాలలోని యంత్రాలకు మరింతఉగ్రరూపము సంతరించు కునేలా పూజలు, యజ్ఞాలు, హోమాలు, బలులు నిర్వహించి నీలో తామసికశక్తిని ప్రేరేపించి, ప్రోత్సహించారు. వారుచేసిన పూజలన్నీ నిశా సమయంలోనే కావడంతో నీలో రాత్రిపూట తామస శక్తి పెరిగి పోయింది. వారు పతనమైపోయారు.  బ్రష్టులయ్యారు. కానీ నీలో తామసికరూపం స్థిరపడిపోయింది. లోకకల్యాణం తప్ప మరోటికోరని ఈ శంకరాచార్య నీలో ఈ తామసికశక్తిని రూపు మాపి, నీవు మాతృమూర్తిగా సర్వప్రాణికోటిని రక్షించాలితప్ప, భక్షించకూడదని ప్రతిజ్ఞ బూనాడు. శక్తిపీఠాలలో ఉన్న శ్రీచక్రాలలో సాత్విక కళలను ప్రతిష్టించాడు. నీవు ఆటలో గెలిచినా, నైతికంగా ఓడిపోయావు. ఈ శ్రీచక్రము సర్వగృహస్తులకు శ్రేయోదాయకమైంది". అని సుందరేశ్వరుడు అన్నాడు. 


🍁 అమ్మవారు దిగ్భ్రాంతి పొందింది. "ఈ యువకుడు నిస్సందేహముగా అపరబాలశంకరుడే. భర్త శంకరునివైపు, బిడ్డలాంటి బాలశంకరునివైపు మార్చి,మార్చి చూసింది. ఆఇద్దరిలో కనిపిస్తున్న ఈశ్వరశక్తి దర్శనమైంది. అమ్మవారి ముఖంలో ప్రశాంతత చోటుచేసుకుంది. అమ్మవారు భక్తిగా పరమశివునికి శిరసా నమస్కరించి, శంకరాచార్యను మనసారా ఆశీర్వదించి చిరునవ్వులు చిందించింది. ఆసమయంలోనే పాండ్యరాజు అంత:పురములో నందీశ్వరునిరంకె విన్నాడు. మధురమీనాక్షి ఆలయ ఘంటారావాలు విన్నాడు. తెల్లవార్లు నిద్రపోక ఆందోళనగా ఉన్న ఆరాజు అమ్మవారి తామసానికి శంకరాచార్య భలైఉంటాడని భయబ్రాంతుడయ్యాడు.


🍁  రాజుతోపాటు పరివారం, అంత:పుర కాంతలు ఆలయంవైపు పరుగులుతీశారు. ఆ యువయోగి మరణిస్తే, తాను జీవించి ఉండడం అనవసరం అనుకున్నాడు. ఆ నిర్ణయానికొచ్చి, కత్తిదూసి ఆత్మాహుతికిసిద్ధమై, ఆలయప్రవేశం చేసిన మహారాజుకు, ఆదిదంపతులైన పార్వతీ పరమేశ్వరులు క్రొత్త శ్రీచక్రానికి కాస్తదూరంలో నిల్చుని ఉన్నారు. వారిని స్తోత్రముచేస్తూ తన్మయత్వంలో మునిగిఉన్న ఆదిశంకరులు కనిపించారు. పాండ్య రాజు "స్వామీ! నీవు జీవించేవున్నావా! నన్ను ఘోర నరకములో పడకుండాచేశావా!" అంటూ శంకరునికి, ఆదిదంపతులకు మ్రొక్కాడు. "తల్లీ! మరల నీసాత్వికరూపాన్ని కళ్లారా చూస్తున్నాను" అని వారి పాదాలను అభిషేకించాడు. 


🍁 సుందరేశ్వరుడన్నాడు "నాయనా పాండ్యరాజా! ఇకనీవు ఆవేదనపడద్దు. ఆదిశంకరుల శ్రీచక్రప్రతిష్ఠతో మీఇంటి ఆడపడుచైన మీనాక్షి ఇక రాత్రివేళ తామస శక్తిగామారదు. శ్రీచక్రమును దర్శించినా, స్పర్శించినా, న్యాయబద్ధమైన, యోగ్యమైన, అర్హతున్నవారికి సర్వకోరికలు నెరవేరుతాయి. ఈ తెల్లవారినుండే శ్రీచక్రార్చనకు నాందిపలుకుదాం. అమ్మవారి శ్రీచక్రము అమ్మవారి ప్రతిబింబం. శ్రీచక్రము ఎక్కడఉంటే అక్కడ అమ్మవారు కొలువైఉన్నట్టే. గృహాల్లో పవిత్రముగా ఉంచుకొని, నియమనిష్టలతోఉంటే ఫలితం కలుగుతుంది సుమా!" అన్నారు స్వామి.. పాండ్యరాజును అమ్మవారు ఆశీర్వదించినది. 


🍁 ఆదిశంకరులు చిత్రించి, ప్రాణప్రతిష్ఠచేసిన శ్రీచక్రము మధురమీనాక్షి ఆలయములో భూమిలోకి వెళ్లి ప్రతిష్ఠితమైపోయింది. ఆ యంత్రప్రభావం కోటానుకోట్ల రెట్లు పెరిగిపోయి అదృశ్యంగా నిక్షిప్తమైంది. అర్హులైన భక్తులు ఆ యంత్రప్రాంతంలో మోకరిల్లి, నమస్కరిస్తే వారిహృదయంలో ప్రకంపనలుకల్పించి ఆశీర్వదిస్తుంది ఈయంత్రం. పాండ్యరాజు తన జన్మసార్ధకమైందని ఆనందించాడు. "నాయనా! శంకరాచార్యా, నీజన్మ ధన్యమైంది, నీవు కారణజన్ముడవు. మరేదైనా వరముకోరుకో!" అన్నది అమ్మవారు. "ఏ వరమూ వద్దుతల్లీ! నా నోటివెంట నీవుపలికించే ప్రతిస్తోత్రం లోనూ, మీస్మరణ ఎడతెగకుండా అక్షరరూపమై విరాజిల్లేటట్టుగా, ఆశ్లోకాలు భక్తి శ్రద్ధలతో పఠించే  వారి జీవితాలు ధన్యమయేట్టుగా, నాకు ఈ వైరాగ్యం అచంచలముగా కొనసాగి, నా శరీరపతనం ఎప్పుడు, ఎక్కడ, ఎలా జరిగేదీ, ఎవరికీ అంతుబట్టని విధముగాఉండాలి". 


🍁 "నన్ను నీ పాదాలలో ఐక్యము అయిపోయేటట్లు ఆశీర్వదించు తల్లీ! అన్నాడు."అలాగే నాయనా! తథాస్తు" అన్నది అమ్మవారు. తెల్లవారింది. ఆలయంలో అమ్మవారు, స్వామివారు యధా స్థానాల్లో అర్చక మూర్తులుగా వెలిశారు. శంకరులు చేసిన శ్రీచక్ర నమూనాలు విశ్వకర్మలకు అందాయి.

సేకరణ...

                               🍁🍁🍁🍁

Thursday, October 14, 2021 2 comments By: visalakshi

నవనాధుల బోధ

***భాగవతం లో నవనాధుల బోధ***



కవి, హరి, అంతరిక్షుడు , ప్రబుద్ధుడు , పిప్పలాయనుడు, అవిర్హోత్రుడు , ద్రమీళుడు , చమసుడు, కరభాజనుడు. వీరు తొమ్మిదిమంది బ్రహ్మవిద్యావిశారదులయ్యారు.వీరే నవనాధులు.

 నవనారాయణాంశ సంభూతులే ఈ నవనాధులు . ఋషభ చక్రవర్తికి గల 100 మంది కుమారులలో నారాయణాంశ కలిగిన తొమ్మిది మందే ఈ నవనాథులు. సృష్టి అంతా పరమాత్మ స్వరూపమని ఎరిగి ముక్తులై అన్ని లోకాలలో సంచరిస్తుంటారు.

వీరు భాగవతము ఏకాదశ స్కందము లో చేసిన బోధ..

ఈ తొమ్మిది మంది ఒకసారి జనకుని యజ్ఞం చూడడానికి వచ్చారు. జనకుడు వారిని పూజించి, ఉచితాసనాలిచ్చి గౌరవించాడు. తర్వాత 'మీరు విష్ణుమూర్తిని ఎంతో భక్తిశ్రద్ధలతో భజించే గొప్ప తపోనిధులు,జీవన్ముక్తులు.' ఈ సంసారాలు పరమ సారం లేనివి. సామాన్య సంసారులకు ఆత్మజ్ఞానం ఎలా లభిస్తుంది?ముక్తి ఎలా పొందుతారు?అని ప్రశ్నించాడు. అప్పుడు జనక భూపాలునికి కవి ఇలా చెప్పాడు.

కవి సంభాషణ ..

అంతేకాదు సకల రకాల జంతువుల జన్మల కంటే మానవ జన్మ శ్రేష్ఠమైనది, అది ప్రాప్తించటం కష్ట సాధ్యం. అందులోనూ శ్రీమన్నారాయణుని చరణయుగళ స్మరణంమీద ఆసక్తి కలగటం మరీ కష్టం. అందువలన, శాశ్వతమైన క్షేమాన్ని గురించి అడుగ వలసి వచ్చింది. ప్రపత్తి యందు నిష్ఠగల భక్తులకు పరమేశ్వరుడు శ్రీమహావిష్ణువు సారూప్యం ఎలా ఇస్తాడు, ఈ విషయం చెప్పండి.” అని అడిగిన విదేహరాజుతో శ్రీహరి కథామృతాన్ని త్రాగి పరవశులు ఐన ఆ మునులలో కవి అనే మహానుభావుడు ఈ విధంగా చెప్పటం మొదలుపెట్టాడు.

“(1) అరిషడ్వర్గం అనే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఆరింటిలోను; ఈషణత్రయం అనే దారేషణ ధనేషణ పుత్రేషణ మూడింటిలోనూ; చిక్కుకుని మాత్సర్యంతో కూడిన మనసు కల మానవుడికి శ్రీహరి పాదపద్మాలను భజించే భాగ్యం ఎలా ప్రాప్తిస్తుంది?

(2) విశ్వము వేరు, ఆత్మ వేరు అని భావించే వాడికి భయం ఎలా లేకుండా పోతుంది?

(3) అట్లు అవిద్యాంధకారంలో మునిగితేలే వాడికి విష్ణుభక్తి ఎలా అలవడుతుంది?

(4) అటువంటి నరుడు మొదట శరీరాన్ని త్యజించి పరతత్వాన్ని ఏ విధంగా చేరుతాడు?

(5) కండ్లు మూసుకుని నడిచే మనిషి దోవలో తడబాటులు పడుతూ పోతున్నట్లుగా, విజ్ఞానంతో శుద్ధమైన హృదయంలో భక్తిభావన లేకుండా పోతే పరమపదం ఎలా సిద్ధిస్తుంది” అని అడిగావు. సమాధానాలు చెప్తాను శ్రద్ధగా విను. త్రికరణశుద్ధిగా అనగా మనసుతో, వాక్కుతో, కాయంతో చేసే ప్రతీ కర్మా “కృష్ణార్పణం” అని మనస్ఫూర్తిగా పలకటమే సుజ్ఞానము అని మహామునీశ్వరులు అంటారు. జ్ఞాన, అజ్ఞానాలలో కలత చెందుతుంటే స్మృతి వ్యత్యస్తమవుతుంది. కాబట్టి, గురువునకు దేవుడికి అనుగుణంగా నడచే బుద్ధిమంతుడైన నరుడు లక్ష్మీపతి ఐన విష్ణుమూర్తిని ఉత్తమోత్తముడైన పురుషోత్తముడిగా చిత్తంలో చేర్చి సేవించాలి. కలల యందు, కోరికల యందు, వాంఛల యందు సర్వసంకల్పాలు నాశనం అవుతాయి. కనుక, ఎట్టి పూనిక గట్టిగా నిలుబడదు. అందుచేత, వాటిని అణచుకుని ఎప్పుడూ శ్రీహరిని ధ్యానిస్తూ ఉండే వాడికి కైవల్యం చేతిలో ఉసిరికాయలాగ సులభంగా ప్రాప్తిస్తుంది. ఓ రాజా! సదా శ్రీకృష్ణ సంకీర్తనలు వీనులవిందుగా వినాలి; హరినామ కథనాన్ని సంతోషంతో ఆడుతూ పాడుతూ చెయ్యాలి; నారాయణుని దివ్యమైన నామాలను హృదయంలో సదా స్మరిస్తూ ఉండాలి; కమలనయనుని లీలలను అడవులలో చరిస్తున్నా భక్తియుక్తంగా పాడాలి; విశ్వమయుడిని వెఱ్ఱిగా కీర్తిస్తూ లోకానికి అంటీ అంటకుండా ఉండాలి; ఈ సృష్టి మొత్తం విష్ణుమయ మని తెలుసుకోవాలి; భేదబుద్ధి ఏ మాత్రమూ చూపరాదు.”అని మహాముని కవి చెప్పాడు

హరిమునిసంభాషణ ..

అంత, విదేహ (జనకమహారాజు)రాజు ఇలా అడిగాడు. “భాగవతధర్మ మేది? అది ఏ ప్రకారంగా ప్రవర్తిస్తుంది? భాగవతుల గుర్తు లేమిటి? ఇవి చెప్పటానికి మీరే తగినవారు.” దానికి వారిలో హరి అనే మహాముని ఇలా చెప్పసాగాడు. “భాగవతుడు అంటే ఆ హరి యందు భక్తీ ఆసక్తీ కలవాడు; సర్వభూతమయుడైన పద్మలోచనుడు శంఖం చక్రం దాల్చి తన ఆత్మలో ఉన్నాడనే విశ్వాసం కలవాడు. ఓ మహా రాజా విదేహ! భాగవతుడు చతుర్వర్ణాలు చతురాశ్రమాలు వాటి ధర్మాలు కర్మలు అంటూ వీటిలో మునిగిపోకుండా, భక్తిమార్గాన్ని ఆశ్రయించి, శ్రీహరి విశ్వం అంతా నిండి ఉన్నాడు అంటాడు. భాగవతోత్తముడు ఈ విధంగా సకల బంధాలను త్రెంపుకుని అన్నింటిలో పరమాత్మను గుర్తించినవాడై మెలగుతాడు. మహాప్రభువైన సూర్యుడు తన సహస్ర కిరణాలచేత ముల్లోకాలనూ పావనం చేయునట్లు, తన పాదధూళి చేత జగత్రయాన్నీ పవిత్రం చేస్తూ ఉంటాడు. దేవదానవులకు కూడా సేవింపదగిన జనార్ధునుని చరణారవిందాలకు నమస్కరించా లనే అభిలాష కలిగి ఉంటాడు. తన భక్తిని రవ్వంత కూడ చలించనీయక చంద్రుడు ఉదయించడంతో ఎండ బాధ పోయినట్లు నారాయణుని చరణకాంతుల వెన్నెలలచే భాగవతుడు హృదయతాపం పోగొట్టుకుంటాడు. ఉత్తమ భాగవతుడు తన భక్తి అనే బంధాలతో వాసుదేవుని చరణపద్మాలకు బంధించుకుని ధ్యానానందంలో పరవశిస్తూ ఉంటాడు.” ఈ విధంగా మహాముని తెలుపగా రాజు విదేహుడు ఇలా అన్నాడు. మహాత్ములారా! మీరు ఇంద్రియాలను జయించిన మహానుభావులు. మూడులోకాలను పరమ పవిత్రం చేసే, గజరాజవరదుడు శ్రీహరి గుణవిశేషాలను మనోరంజకంగా మీనుండి వినాలని నాకు వేడుక పుట్టింది.”

అంతరిక్షుసంభాషణ 

ఇలా పలికిన విదేహుని(జనకుని)తో అంతరిక్షుడు అనే మహర్షి ఇలా అన్నాడు.“పరబ్రహ్మ అన్నా; పరతత్వము అన్నా; పరమపదము అన్నా; ఈశ్వరుడు అన్నా; శ్రీకృష్ణుడు అన్నా; శ్రీమన్నారాయణుడే. ఆయనే జగద్భరితుడై ప్రకాశిస్తూ ఉంటాడు.అవ్యక్తమైన నిర్గుణ పరబ్రహ్మంనుండి తనకు ఇతరంగా కలిగే జ్ఞానాన్ని విష్ణుమాయ అంటారు. ఆ మాయ చేతనే ప్రపంచాన్ని నిర్మించి భగవంతుడు ఏ చింతా లేకుండా ఉంటాడు. ఇంద్రియాల వెంట తిరిగే చెడుబుద్ధి గలవారికి నిద్ర, స్వప్నం, మెలకువ అని మూడు అవస్థలతోపాటు పరమేశ్వరుని పొందలేకపోవటం అనే నాలుగో అవస్థ కూడ కలుగుతుంది. కలలో గ్రహింపదగినదీ గ్రహించేవాడూ గ్రహించటం అనే మూడు భేదాలుంటాయి. ఈ విధంగా అవిద్య అనే చీకటిచే చుట్టుకోబడి మూడువిధాలయ్యే కోరిక స్వప్నంలో అణిగిన విధంగా మూడువిధాలైన మాయ కూడా ఆత్మలో విలీనమవుతుంది.

పరమేశ్వరుడు మొదట పృథివి, అగ్ని, జలం ,  వాయువు ఆకాశం అనే పంచభూతాలతో నిండిన సృష్టిని కలిగించాడు. అందులో పంచభూతాత్మకమైన ఆత్మకు పదకొండు ఇంద్రియములతో భేదం పుట్టిస్తూ గుణాలచేత గుణాలను అంగీకరిస్తూ ఆత్మ యందు వ్యక్తమైన గుణాలవల్ల గుణాలను అనుభవిస్తూ ఉంటాడు. సృష్టిని తనదిగా భావిస్తాడు. శరీరధారి పూర్వకర్మ మూలంగా నైమిత్తికాలైన కర్మలు చేస్తూ వాటి ఫలితాన్ని అంగీకరించి దుఃఖానికే వశుడై వర్తిస్తుంటాడు. అనేక దుఃఖాలలో మునిగిన ఆ దేహి కర్మఫలాన్ని పొందుతూ ప్రపంచానికి జలప్రళయం వచ్చే దాకా స్వేచ్ఛను కోల్పోయి, చావుపుట్టుకలలో పడి పొరలుతుంటాడు. కల్పాంత సమయంలో ద్రవ్యగుణాల స్వరూపమైన జగత్తును ఆద్యంతాలు లేని కాలం ప్రకృతిని పొందిస్తుంది.ఆ పైన నూరేండ్లు వానలులేక భయంకరమైన ఎండల వల్ల అన్నిలోకాలు తగలబడుతాయి. అటుపిమ్మట, అధోలోకంనుండి ఆదిశేషుని ముఖం నుంచి ఆవిర్భవించిన అగ్నిజ్వాలలు వాయు సహాయంతో లేచి దిక్కులంతటా వ్యాపిస్తాయి. ఆ తరువాత సంవర్తకాలనే మేఘాలు నూరేండ్లు ధారాపాతంగా వర్షం కురుస్తాయి. వానిలో విరాడ్రూపం విలీనమవుతుంది. అప్పుడు ఈశ్వరుడు కట్టెలలో అగ్నివలె అవ్యక్తాన్ని ప్రవేశిస్తాడు. అనంతరం భూమండలం తన గంధ గుణాన్ని కోల్పోయి జలరూపాన్ని ధరిస్తుంది. ఆ జలం రసాన్ని కోల్పోయి తేజో రూపాన్ని పొందుతుంది. ఆ తేజస్సు అంధకార నిరస్తమై రూపం పోయి వాయువులో అణుగుతుంది. ఆ వాయువు స్పర్శను పోగొట్టుకుని ఆకాశ మందు సంక్రమిస్తుంది. ఆకాశం శబ్దగుణాన్నిపోగొట్టుకుని ఆత్మ యందు అణగిపోతుంది. ఇంద్రియాలు మనస్సు బుద్ధి వికారాలతో అహంకారాన్ని ప్రవేశిస్తాయి. ఆ అహంకారం తన గుణములతో కలసి పరమాత్మను చేరుతుంది. ఈ విధంగా మూడువర్ణాలు కలిగిన సృష్టి స్థితి లయాలకు కారణమైన మాయ ఇటువంటిది” అని దాని స్వరూపమూ మాహత్య్మమూ వివరించగా విని విదేహరాజు ఇలా అన్నాడు. “మీరు లోకోత్తములు. సత్యవాక్య పరిపాలకులు. కనరాని మాయను లోపల అణచివేసి అజ్ఞానులు ఏ విధంగా వైకుంఠాన్ని చేరగలుగుతారు? ఈ విషయాన్ని దయతో చెప్పండి.” ఇలా అన్న విదేహునితో ప్రబుద్ధుడు అనే మహముని ఆదర పూర్వకంగా ఇలా అన్నాడు.

ప్రబుద్ధునిసంభాషణ ..

ప్రతిదినము మానవుల ఆయువు, సూర్యుడు ఉదయించడం అస్తమించటంతో, క్షీణిస్తుంటుంది. దేహంపైనా, భార్యపైనా, స్నేహితులపైనా, సోదరులపైనా నాది, నావారు అనే మమకారంతో కట్టుబడిపోతారు. ఆ బంధం నుంచి విడివడే ఉపాయం కనపడక సంసార మనే చీకటిలో మునిగి భూత భవిష్యత్తులు తెలియక గుడ్లగూబల లాగా మానవులు పుట్టుక ముసలితనం రోగాలు ఆపదలు చావు పొందుతూ కూడ శరీరమే మేలనుకుంటూ ఉంటారు. మోహాన్ని కలిగించే మద్యపానంతో మత్తులై ఇంద్రియవిషయ ఆసక్తులై తమ్ము తాము తెలుసుకోలేక విరక్తిమార్గం తెలియక నడయాడుతుంటారు అటువంటి మూఢులైన మానవుల సమీపానికి పోవలదు. కేవలం నారాయణుని పైన భక్తిభావం గల సద్గురువును నిత్యము భజించి ఉత్తమమైన భాగవతధర్మాలను అనుష్టించాలి. ఆ ధర్మాలు ఏవంటే:

1. మూఢుల పొంతల పోకపోవుట; 2, సద్గురు ప్రతిదిన భజనము; 3. సత్త్వగుణము కలిగి ఉండటం; 4. భూతదయ; 5. హరికథామృత పానం; 6. బ్రహ్మచర్య వ్రతం; 7. ఇంద్రియ సుఖాలందు మనస్సును చేరనీయ కుండటం; 8. సాధుసంగమం; 9. సజ్జనులతో స్నేహం; 10 వినయ సంపద; 11. శుచిగా ఉండటం; 12. తపస్సు; 13 క్షమ; 14. మౌనవ్రతం; 15. వేదశాస్త్రాలను చదవటం వాటి అర్ధాన్ని అనుష్ఠించటం; 16. అహింస; 17. సుఖాన్నిగాని దుఃఖాన్నిగానీ సహించటం; 18. ఈశ్వరుడు అంతటా ఉన్నట్లు భావించటం; 19. మోక్షం పొందాలనే కోరిక; 20. కుజనుల సంగతి వదలటం; 21. వల్కలాలు మొదలైనవి కట్టడం; 22. దానంతట అది లభించిన దానితో సంతుష్టి చెందటం; 23. వేదాంతశాస్త్రాల అర్ధాలను తెలుసుకోవా లనే కుతూహలం; 24. ఇతర దేవతలను నిందించకుండా ఉండటం; 25. త్రికరణసుద్ధి; 26. సత్యమే పలకటం; 27. శమం దమం మొదలైన గుణవిశేషాలు; 28. ఇల్లు తోటలు పొలాలు భార్య సంతానం ధనం మొదలైనవాటిని పరమేశ్వరార్పణం గాభావించటం; 29. భక్తులు కాని వారిని ఆశ్రయించకుండా ఉండటం.” అని చెప్పి పిమ్మట... మహారాజ! హరిభక్తులతో స్నేహంచేస్తూ హరిలీలలను తలచుకుంటూ కన్నులలో ఆనందబాష్పాలు నిండగా ఒళ్ళు పులకరిస్తుండగా మానవుడు హరిమాయను గెలుస్తాడు.”అనగా ఆ విదేహచక్రవర్తి వాళ్ళతోఇలాఅన్నాడు. “భాగవతులారా! సమస్త లోకాలకూ ప్రభువై నారాయణుడనే నామంతో అలరారే పరమాత్ముని ప్రభావాన్ని వినాలనుకుంటున్నాను ఆనతీయండి.” అంటే పిప్పలాయను డనే మునీంద్రుడు ఇలా అన్నాడు.

పిప్పలాయనభాషణ 

“రాజా! విను నీకింపు కలిగే విధంగా లోకేశ్వరుని చరిత్ర చెబుతాను. సృష్టి స్థితి లయలకు కారణమైన పరంజ్యోతి స్వరూపం దేహేంద్రియాలలో స్థిరంగా ప్రవేశిస్తుంది మంటలు అగ్నిలోపల ప్రవేశింపలేనట్లు, ఇంద్రియాలు ఆత్మను ఆక్రమించలేవు. నాదం పిల్లనగ్రోవిని లోగొన లేదు కదా. సత్త్వము రజస్సు తమస్సు అనే గుణత్రయం మహదహంకార రూపమై చైతన్యంతో కలిస్తే జీవమంటారు. ఇదే సత్తు అసత్తు స్వరూపంగా ఎన్నబడుతుంది. ఇందుకు అతీతమైన దాన్ని పరమాత్మగా తెలుసుకుని బ్రహ్మ మొదలైనవారు స్తుతిస్తారు. ఇటువంటి పరమాత్మ స్థావరజంగమాలను అధిష్టించి వృద్ధిక్షయాలు పొందక నిమిత్రమాత్రంగా చెట్లు తీగలు మొదలైనవాని లోపల వర్తిస్తుంటాడు. సర్వేంద్రియాలచే ఆవరించబడిన ఆకారము పోగా మనస్సును వదలి శ్రుతి విరహితుడై తిరుగుతుంటాడు. నిర్మలమైన జ్ఞానదృష్టి కలవాడు సూర్యుని కాంతి పుంజం దర్శించినట్లు. సుజ్ఞాని అయినవాడు హరిభక్తిచేత గుణకర్మార్థములైన చిత్త దోషాలను నశింపజేసి ఈశ్వరుని చేరుకోగలుగుతాడు.” అంటే విని విదేహుడు ఇలా అన్నాడు. “మహర్షిపుంగవ! పురుషుడు ఏయే కర్మలను ఆచరిస్తే పుణ్యుడై పాపాలను పోగొట్టుకుని మురారి పాదాలను చేరుకోగలుగుతాడో చెప్పండి.”

ఆవిర్హోత్రుని భాషణ ..

అలా అడుగగా ఆవిర్హోత్రుడనే మహాముని విదేహప్రభువుతో ఈ విధంగా చెప్పసాగాడు. “కర్మ అకర్మ వికర్మ వీటిని ప్రతిపాదించే శ్రుతివాదులు లౌకికులు చెప్పినవి కాదు. అటువంటి వేదాలు సర్వేశుని స్వరూపాలు వాటిని పండితులు కూడ తెలుసుకోలేరు. వాటిని కర్మాచారాలు అంటారు. మోక్షంకోసం నారాయణ భజనం అన్నిటి కంటే పవిత్రమైనది. వేదం చెప్పినట్లు చేయక ఫలాలు కోరేవారు ఎన్నో జన్మలు ఎత్తుతారు. మోక్షాన్ని కోరేవారు శాస్త్రం చెప్పినవిధంగా హరిని పూజించాలి. ఆ పూజావిధానం ఎటువంటిదంటే పరిశుద్ధమైన దేహంతో భగవంతుని సన్నిధిలో పవిత్రచిత్తుడై ప్రవర్తించాలి. షోడశోపచారాలతో చక్రధరుని ఆరాధించాలి. గంథం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం అర్పించి సాష్టాంగదండప్రణామాలు చేయాలి. విశేషమైన భక్తిభావం మనసున నింపుకోవాలి. అట్టివాడు పరమాత్మను జేరుతాడు.” అని వివరించగా విని విదేహమహారాజు ఇలా అన్నాడు. “ఈశ్వరుడు ఏ లీలలు ఆచరించాడు. ఆ వివరం అంతా తెలుపవలసింది.” అనగా ద్రమిళుడనే మునివర్యుడు ఇలా అన్నాడు. రాజా ఆకాశంలోని చుక్కలను లెక్కపెట్టవచ్చు. భూమిపై గల ఇసుక రేణువులను కూడ లెక్కపెట్టవచ్చును. కానీ నారాయణుని గుణములు చరిత్రలను మాత్రం శివుడు బ్రహ్మ మొదలైనవారు కూడ వర్ణించ లేరు.

భగవంతుడు తాను సృష్టించిన పంచభూతాలతో సంభూతమైన పురమును చేసి, దానిలో తన అంశతో ప్రవేశించి పిమ్మట సగుణనిష్ఠుడై నారాయణుడు అను పేరు కల ఋషీశ్వరుడుగా విరాజిల్లాడు. ఆయన పది ఇంద్రియాలతో నిర్మితాలైన శరీరాలను దాల్చి జగత్తును సృష్టించటం రక్షించటం సంహరించటం మొదలైన కార్యాలు చేయటం వలన రజస్సత్త్వతమోగుణాలతో బ్రహ్మ, విష్ణు, రుద్రుడు అనే పేర్లతో ఒప్పుతుంటాడు. త్రిగుణాత్మకుడు అనబడే ఆ నారాయణుని చరిత్ర చెబుతాను విను.

నారయణఋషి భాషణ ..

బదరీకాశ్రమంలో ధర్ముడు దక్షపుత్రికను పెండ్లాడాడు. ఆ దంపతులకు సత్కర్ముడు పరిశుద్ధుడు ఐన నారాయణఋషి జన్మించాడు. ఆ నారాయణముని బదరికాశ్రమంలో అపారమైన నిష్ఠతో తపస్సు చేయసాగాడు ఆయన తపస్సుకు ఇంద్రుడు భయపడి తపోభంగం నిమిత్తం మన్మథుడిని అప్సరసలను పంపించాడు. ఆ ప్రకారం వారు నారాయణాశ్రమానికి అతని తపస్సును భగ్నంచేయడానికి వచ్చారు. ఆ తపోవనం మామిడి, మద్ది, మారేడు, అరటి, ఖర్జూరం, నేరేడు, నిమ్మ, చందనం, సురపొన్న, మందారం మొదలైన అనేక వృక్షాలతో నిండి ఉన్నది. పూలతో, పండ్లతో కొమ్మలు క్రిందికి వంగి ఉన్నాయి. గురువింద పొదల పూలగుత్తుల మకరందం త్రాగి మదించిన తుమ్మెదలు చేసే ఝంకారాలతో దిక్కులు నిండిపోతున్నాయి. బంగారు పద్మాలు, కలువలు, ప్రకాశించే సరస్సులలో జక్కవలు, కొంగలు, క్రౌంచ పక్షులు, హంసలు జంటజంటలుగా విహరిస్తున్నాయి. తామరతూళ్ళను తినుటం కోసం సారసపక్షులు ముక్కులతో చీల్చబడిన తామర మొగ్గలలోని కేసరాలతో సరోవరాలు భాసిస్తూ ఉన్నాయి. అటువంటి తపోవనంలో ఆ చంద్రముఖులైన అప్సరసలు నెమ్మదిగా నడుస్తూ చెమట బిందువులను కొనగోళ్ళతో చిమ్ముకుంటూ నారాయణమహర్షిని సమీపించారు. ఆ సమయంలో నారాయణఋషి మన్మథుని బాణాలకు లొంగ లేదు. ధైర్యము విడువలేదు. ఆ కాంతల వాడి చూపులకు మోహము పొంద లేదు. ఏమాత్రం చలించక తన హృదయంలో అచ్యుతుడు, అనంతుడు, జగన్నివాసుడు, రమేశుడు అయిన శ్రీహరిని నిశ్చలభక్తితో మనసున నిలుపుకుని ఉన్నాడు. ఆయన వారితో ఇలా అన్నాడు. “పద్మముఖులార! ఇంద్రుడు పంపగా మీరు వచ్చారు. ఇక్కడ విహరించాలనే కోరిక ఉంటే మీ ఇష్టంవచ్చినట్లు తిరగండి.” అనేటప్పటికి వాళ్ళంతా సిగ్గుపడి ఆ మహర్షితో ఇలా అన్నారు. “దేవమునీంద్రా! నీ దివ్యమైన చరిత్ర గ్రహించి స్తుతించటానికి ఎవరికి సాధ్యం అవుతుంది. పుత్రులు, మిత్రులు, భార్యలు మొదలైన భోగాలను వదలి తపస్సు చేసే సద్ధర్మ పరులకు విఘ్నాలు కలుగుతాయా? జగదీశ్వరుడిని కొలిచేవారికి ఆటంకాలు ఉంటాయా? కామం క్రోధం కలిగిన తాపసుల తపస్సు బురదగుంటలోని నీటి వంటిది కదా. ఓ నిర్మలాత్మా! నిన్ను వర్ణించడం మాతరం కాదు. మా తప్పులు క్షమించు.” అని నుతించారు. అంత నారాయణమహర్షి ప్రసన్నుడై తన సామర్ధ్యాన్ని తెలియజేయాలని అనుకున్నాడు.

ఆ మునిశ్రేష్ఠుడు అందరూ ఆశ్చర్యపోయేలా తన రోమకూపాల నుండి మూడుకోట్ల కన్యకలను పుట్టించాడు. అది చూసిన ఆ అప్సరసలు అత్యంత ఆశ్చర్యంతో భయంతో ఆ మహర్షిని స్తుతించారు. ఆ అందగత్తెలలో నుండి ఊర్వశి అనే ఒక సుందరాంగిని తీసుకుని వెళ్ళి జరిగినదంతా ఇంద్రునికి చెప్పారు. మునిశక్తికి వెరగుపడిన ఇంద్రుడు మిన్నకున్నాడు. అటువంటి నారాయణముని చరిత్ర వినే వాళ్ళు మిక్కిలి శుభకరమైన గుణాలను పొందుతారు.”

ఋషభునకు ఆత్మయోగాన్ని ఈవిధంగా ఉపదేశించిన అచ్యుతుడు విష్ణువు భూభారాన్ని అణచుటకు ఎన్నోఅవతారాలెత్తి పట్టుదలతో దుర్మార్గులు అయిన రాక్షసులను సంహరించాడు.

అటువంటి పరమేశ్వరుడు లీలావిలాసంగా గ్రహించిన అవతారాలు మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రఘురామ బలరామ బుద్ధ కల్కి అనే దశావతారాలే కాదు ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటిని తెలిసి స్తుతించటం బ్రహ్మదేవుడికైనా, ఆదిశేషునికైనా అలవి కాదు.” అని పలికి శ్రీహరిని ఇలా స్తుతించాడు. “నవవికసిత పద్మములవంటి కన్నుల జంట కలవాడ! హరి! పాదము మూలము లందు ఆకాశగంగ పుట్టినవాడ! వేదములచేత పొగడబడు వాడ! లక్ష్మీదేవి యొక్క కలశముల వంటి వక్షోజాలకు అలరుతుండెడి కస్తూరి పరిమళాలు అంటిన హృదయం కలవాడ! భూమిని మోసిన వాడ! బ్రహ్మదేవుడు మున్నగు దేవతలు సంస్తుతించు వాడ! నడుము నందు బంగారచేలము ధరించినవాడ! గరుత్మంతుడు వాహనముగా కలవాడ! కైలాసపతి శంకరునిచే నుతింపబడు వాడ! నిరంతర జపం చేసే వారి యందు ఆసక్తి కలవాడ! నియమబద్ధమైన చరిత్ర కలవాడ! మత్స్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ బలరామ రామ కృష్ణ కల్కి అను దశావతారములను దాల్చినవాడ! గజేంద్రవరదా! మునులు నరులు సురలు గరుడులు మున్నగు వారిచే పొగడబడు వాడ!” ఇలా హరిస్తుతి చేసి ఇలా అన్నాడు. “ఈ విధంగా ప్రవర్తిల్లిన శ్రీమన్నారాయణమూర్తి లీలావిలాసములు లెక్కపెట్టలేనన్ని ఉన్నాయి. మనోవాక్కాయకర్మలా హరిపూజ చేయకుండా విపరీత మార్గాలలో తిరుగుతూ ఉండే మూఢులకు ఏవిధంగానూ సద్గతి కలుగదు.” అని మహాముని అనగా ఆ మహారాజు ఆ పరమపురుషులతో “అటువంటి మూర్ఖులు ముక్తిపొందే ఉపాయం తెలియ జెప్పండి.” అని అడిగాడు. వారిలో చమసు డనే మునిముఖ్యుడు విదేహుడితో ఇలా అన్నాడు.

విష్ణుమూర్తి ముఖం బాహువులు తొడలు పదములు వీటి యందు వరుసగా నాలుగువర్ణాలు పుట్టాయి. అందులో స్త్రీలు శూద్రులు హరిని తలుస్తారు. కలికాలంలో విప్రులు వేద శాస్త్ర పురాణాలందు ప్రసిద్ధులై, కర్మలుచేస్తూ గర్వంతో హరిభక్తులను అపహాస్యం చేస్తారు. వారు నరకానికి పోవటం ఖాయం. స్వచ్ఛమైన పక్వాన్నం భుజించుట మాని మాంసాహారులై జీవహింసకు పాల్పడేవాడికి పాపం తగులుతుంది. శ్రీహరిని నుతింపక స్త్రీలోలు డైనవాడికి ఎప్పుడూ నరకమే నివాసం. అందుచేత, ఇండ్లు పొలాలు, సంతానం, భార్య, ధనం, ధాన్యం మున్నగు వాటిమీద వ్యామోహంతో మోక్షం కంటికి కనపడేదికాదు. కనుక లేదని నిందించే వారు; హరిభక్తి లేనివారు దుర్గతిలో కూలిపోతారు.” అని మునిశ్రేష్ఠుడు అనగా విదేహుడు ఇలా అడిగాడు.

“అవ్యయుడు, జగన్నాథుడు అయిన విష్ణుమూర్తి ఏ యుగంలో ఏ రీతిగా ఉన్నాడు? ఏ రూపం ధరించాడు? ఏ విధంగా మునులచేత, దేవతలచేత కీర్తించబడ్డాడు?”అని అడుగగా విని వారిలో కరభాజనుడనే ఋషి విదేహరాజుతో ఇలా అన్నాడు. ఎన్నో అవతారాలు; ఎన్నెన్నో రూపాలు; అనేక రకాల వర్ణాలు ధరించి రాక్షసులను సంహరించి; దుష్టశిక్షణం శిష్టరక్షణం కావించే శ్రీ మహవిష్ణువు…

కృతయుగంలో తెల్లని రంగుతో నాలుగుచేతులు కలిగి ఉంటాడు; జడలు నారచీరలు జింకచర్మం జపమాలిక దండం కమండలము దాల్చి నిర్మలమైన తపస్సు ధ్యానము అనుష్టానము గల మునిశ్రేష్ఠులచేత హంసుడు, సుపర్ణుడు, వైకుంఠుడు, ధర్ముడు, అమలుడు, యోగీశ్వరుడు, ఈశ్వరుడు, పురుషుడు, అవ్యక్తుడు, పరమాత్ముడు అనే దివ్య నామాలతో ప్రశంసింపబడుతూ ప్రసిద్ధి చెందుతాడు.

త్రేతాయుగంలో ఎఱ్ఱనిరంగుతో, నాలుగుచేతులు బంగరురంగు జుట్టు కలిగి, మూడు పేటల మేఖలలు ధరించి, మూడువేదాల ఆకృతి ధరించి, స్రుక్కు స్రువము మొదలైన ఉపలక్షణాలతో శోభిల్లుతూ; విష్ణువు, యజ్ఞుడు, పృశ్నిగర్భుడు, సర్వదేవుడు, ఉరుక్రముడు, వృషాకపి, జయంతుడు, ఉరుగాయుడు అనే పేర్లతో బ్రహ్మవాదులచేత నుతింపబడతాడు.

ద్వాపరయుగంలో నీలవర్ణంతో, పసుపుపచ్చని బట్టలు కట్టుకుని, రెండు చేతులతో, దివ్యమైన ఆయుధాలు పట్టుకుని, శ్రీవత్సం కౌస్తుభం వనమాలికల ప్రకాశిస్తూ; మహారాజ లక్షణాలు కలిగి జనార్ధునుడు, వాసుదేవుడు, సంకర్షుణుడు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, నారాయణుడు, విశ్వరూపుడు, సర్వభూతాత్మకుడు మున్నగు పేర్లతో వెలసి చక్రవర్తులచేత సన్నుతించబడతాడు.

కలియుగంలో నల్లనిరంగుతో కృష్ణుడు అనుపేరు కలిగి, భక్తులను రక్షించడానికి పుండరీకాక్షుడు యజ్ఞములందు కీర్తించబడతాడు. అప్పుడు ఆయనను హరి, రాముడు, నారాయణుడు, నృసింహుడు, కంసారి, నళినోదరుడు మున్నగు పేర్లతో బ్రహ్మవాదులైన మునీంద్రులు స్తుతిస్తూంటారు. ద్రావిడదేశంలో తామ్రపర్ణి, కావేరి, కృతమాల మొదలైన నదులలో భక్తితో స్నానంచేసి తర్పణంచేస్తే మానవులకు పుణ్యం కలుగుతుంది.

ఈవిధంగా ప్రశంసించదగిన కావేరి మున్నగు మహనదుల పావనజలాలలో స్నానం చేయటంలోను, దానాలు చేయటంలోను, విష్ణుధ్యానంలోను, హరికథామృత రసానుభవంలోను నిష్ణాతులైన భాగవతోత్తములు చెడని పరమపదాన్ని పొందుతారు” అని చెప్పారు. భగవంతుని ప్రతిబింబాలయిన పరమపురుషుల వంటి వారైన ఋషభకుమారులు, విదేహమహారాజుకి మోక్షపదంపొందే భగవద్భక్తి ధర్మాలను ఉపదేశించి అంతర్ధానమైపోయారు. మిథిలాపతి విదేహుడు జ్ఞానయోగాన్ని అంగీకరించి నిర్వాణపదాన్నిపొందాడు. ఈ విదేహ ఋషభ ఉపాఖ్యానాన్ని వ్రాసినా చదివినా విన్నా ఆయువు ఆరోగ్యము ఐశ్వర్యమూ కలిగి, పుత్రపౌత్రాభివృద్ధి కలిగి సమస్తమైన కలికల్మషాలు నశించి విష్ణులోకంలో నివసిస్తారు.” అని నారదుడు వసుదేవుడికి చెప్పి ఇంకా ఇలా అన్నాడు. “వసుదేవా! కమలలోచనుని కథలు విన్నావు కనుక, నీ పాపాలు తొలగిపోయాయి. లోకంలో నీ యశస్సు ప్రఖ్యాత మౌతుంది. అనంతరం నీకు కైవల్యం సిద్ధిస్తుంది. శ్రీకృష్ణుడు నీ కుమారుడనే మోహాన్ని విడిచిపెట్టి విష్ణువుగా తెలిసి సేవించు. అతడు నీ కొడుకై అవతరించటం వలన నీవు పరిశుద్ధుడవు అయ్యావు. అతనితో సరససల్లాపాలు జరుపుతూ చక్కని అనురాగం పెంచుకోవటంవలన నీవు పవిత్రుడవు అయ్యావు. శిశుపాలుడు, పౌండ్రకుడు, నరకుడు, మురాసురుడు, జరాసంధుడు, కాలయవనుడు వాసుదేవునితో వైరం పెట్టుకుని కూడ ముక్తిని పొందారు. బ్రహ్మదేవుడు మొదలగు దేవతలు ప్రార్థించగా, దుష్టజనులను శిక్షించడానికి; శిష్టజనులను రక్షించడానికి; శ్రీహరి భూమిమీద అవతరించాడు. ఈ విధంగా జగత్తును రక్షించటం కోసమే భగవంతుడు కృష్ణుడుగా అవతరించాడు.” అని హరిభక్తి పరాలైన ఉపాఖ్యానాలను నారదుడు చెప్పగా విని దేవకీ వసుదేవులు విస్మయం చెందారు. శ్రీకృష్ణుని పరమాత్మగా భావించారు.......సేకరణ......

               సర్వం శ్రీ సాయి నాధార్పణ మస్తు....