Friday, November 4, 2016 By: visalakshi

జ్ఞానప్రాప్తి

 శ్రీసాయిబాబా స్వయంగా భక్తులకు వర్ణించిన, శ్రోతలకెంతో శ్రేయస్కరమైన మధుర వృత్తాంతాన్ని హేమాడ్పంత్ ఇలా వివరిస్తున్నారు. 

  ఓసారి బాబాగారు అడవిలో ఉన్నప్పుడు ఆయనకి అనుకోకుండా గురుదర్శనమైంది.గురువు చేతలు నిజంగా ఎంత అద్భుతంగా ఉంటాయో ఈ కధ తెలుపుతుంది. ఈ కధ విన్న వారికి అది భక్తి,శ్రద్ధలను పెంచి వారికి జననమరణాలనుంచి ముక్తి ప్రసాదిస్తుందని సాయిబాబా స్వయంగా పలికారు.తమ గురుదర్శనం గురించి సాయిబాబా నోటినుంచి జాలువారిన కధామృతం....గురుకృప లేకుండా జ్ఞానప్రాప్తి రాదు.




ఊర్ధ్వమూల మధశ్శాఖ ప్రాహు రవ్యయం!
చంధాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్!!   అ.15లో 1వ శ్లో 

ఆ వృక్షానికి మూలం పైన బ్రహ్మ లేక పరమాత్మ లోనూ దాని శాఖలు క్రింద (పృధ్వి మీద మానవాదికాలు) ఉంటాయి. దాన్ని అవినాశి అంటారు.వేదాలు దాని ఆకులు. అలాంటి (సంసారమనే) అశ్వత్థవృక్షాన్ని తెలుసుకొన్నవారు వేదవేత్తలు. అంటే జ్ఞానులు. అలాగే ఖఠోపనిషత్తులో "ఊర్ధ్వమూలో వాక్షాఖ్ ఏషో శ్వత్థసనాతన".  

ఈ బ్రహ్మ అన్నిటికీ ఆధారమూ, సత్యమూ అయి ఉంది. అయితే ఈ జగత్తు స్వప్నం లాగా మిధ్య. దానికి 'ఆది ' లేదు. 'అంతం ' లేదు.  దానికి ఏ విధమైన ఆధారం కూడా ఉండదు. మరి మధ్యలో అది ఎలా ఉండగలదు? దానికోసం (బ్రహ్మ) మహాత్ములు అనురక్తులౌతారు. ముముక్షువులు కోరుతారు.సాధకులు ఇష్టపడుతారు. దాన్ని ప్రాప్తింపచేసుకోవాలనుకొనేవారు మహాత్ములను శరణనాలి. మనసుని మూటకట్టి, బుద్ధిని దూరంగా నెట్టేసి, మాయ,మమకారాలను పూర్తిగా త్యాగం చేసి గురుచరణాల్లో చక్కగా నిమగ్నం కావాలి. దీనికి సంబంధించిన గురువచనమనే ఓ మధురసుధారసధార  గా..  బాబాగారు స్వయంగా చెప్పిన కధ..

ఒకసారి మేము నలుగురం పురాణాలు చదివి జ్ఞానం ప్రాప్తించాక బ్రహ్మ గురించి చర్చించసాగాం. ఒకడు "ఉద్ధరేదాత్మనాత్మానాం"(తమని తామే ఉద్ధరించుకోవాలి అన్న భగవద్గీత ఆరవ అధ్యాయంలోని 5వశ్లోక) అన్న మాటలు తీసుకొని ఇతరులపై ఆధారపడి ఉండటం అన్ని విధాలా అయోగ్యం అని వివరణ ఇవ్వసాగాడు. దానికి రెండవవాడు ఇలా సమాధానం చెప్పాడు. "మనసుని స్వాధీనంలో ఉంచుకొనే వారే ధన్యులు. ఊహలను, సందేహాలను వదిలేసి తాను తప్ప జగత్తులో ఇంకెవరూ అస్థిత్వంలో లేరన్న భావనతో ఉండాలి." మూడవవాడు  "మార్పుకి లోనయే వస్తువు అనిత్యం అంటే నాశవంతం.మార్పుకి లోనవని వస్తువు నిత్యం.కనుక నిత్యానిత్యాల గురించి విచారిస్తూ ఉండాలి." అన్నాడు. నాలుగవవాడికి కేవలం పుస్తక జ్ఞానం ఇష్టం లేదు. అతనిలా అన్నాడు, "శాస్త్రాలచే నిర్దేశింపబడిన ఆచరణ చేస్తూ, గురుచరణాలకు శరీరమూ, వాక్కుతో సహా పంచప్రాణాలనూ సమర్పించాలి. గురువు ప్రత్యక్షంగా పరమాత్మే. ఆయన సమస్త చరాచర వస్తువులకు బయటా, లోపలా  నిండిపోయి  ఉన్నాడన్నభావం  తమలో స్థిరపడటానికి అపారమైన నిష్ట ఉండాలి. అక్కడ కేవలం పరిశుద్ధమైన మనసూ, భక్తి, యుక్త, అంత:కరణా  ఉన్న  శ్రద్ధావంతులే  కావాలి."




 అలా మా నలుగురం ఆ బ్రహ్మని శోధించాలని బయలుదేరాం. మాలో ముగ్గురికి మన స్వబుద్ధితో, స్వేచ్చతో, నిశ్చిత మనసుతో బ్రహ్మను వెతకాలన్న కోరిక ఉంది. తరువాత మేము వనంలో యధేచ్చగా తిరుగుతుంటే దారిలో ఓ వణజారి (ఇతర గ్రామాల నుంచి ధాన్యం, ఉప్పు, పప్పు మొదలైనవి ఎద్దులమీద మోసుకొచ్చి అమ్మేవాడు. కనుక వనంలోని అన్ని మార్గాలు బాగా తెలిసినవాడు) కలిసి మమ్మల్నిలా అడిగాడు, "చాలా ఎండగా ఉంది.ఎక్కడికి వెళ్తున్నారు? అసలెందుకు వెళ్తున్నారు?" మేము జవాబిచ్చామిలా, "మేము వనాన్ని లోపలా బయటా వెతుకుతున్నాం." దానికి ఆ వణజారి ..మీరింతగా ఎందుకు వెతుకుతున్నారు?.. అప్పుడు మేము "రహస్యాన్ని బయటికి చెప్పడం సరికాదు."అని మేము నలుగురం అలా పరిగెత్తడం చూసి ఆ వణజారి ప్రాణం తల్లడిల్లింది. "వనంలో తిరగటం కష్టం తిరగాలంటే మార్గదర్శి ఉండాలి. మీ రహస్యం నాకు చెప్పద్దులెండి కానీ కాసేపు కూచుని కొంచెం రొట్టెముక్క తిని నీళ్ళు తాగి తరువాత వెళ్ళండి మానవులు ఓర్పుగా ఉండాలి"అని చెప్పినా ఆతని విన్నపాన్ని లెక్క చేయకుండా ముందుకు నడిచి చివరికి మార్గంలో ఎంతో అలసిపోయాము. మేము తెలివైనవాళ్ళం. మా మార్గాన్ని మేమే వెతుక్కోవాలి అన్న గర్వం మా మనసులో మాకెంతో ఉంది. కానీ దట్టంగా ఉన్న ఆ అడవి ఎంతో దూరం వ్యాపించి, ఎత్తైన పెద్ద పెద్ద వృక్షాలతో నిండిపోయింది. అలాంటిచోట వెతుక్కోవతం ఎలా? దిశల గురించి తెలీక తికమకపడి దారితప్పి మేము అటూ  ఇటూ    వ్యర్ధంగా  తిరుగుతూ  ఉండిపోయాము.  కానీ  దైవం ఎంత గొప్పవాడంటే  తిరిగి  తిరిగి  మళ్ళీ  అదే  ప్రదేశానికి  వచ్చాం.   అదృష్టవశాత్తూ వెళ్ళిన మార్గానికే తిరిగి వచ్చినప్పుడు మళ్ళీ ఆ వణజారి మాకు కలిశాడు.  "పొరపాటున తప్పు దారిలో పోయారు..మార్గం చూపేవారు ఉండాలి. ఖాళీ కడుపుతో ఏదీ అన్వేషించకూడదు.ఎవరైనా తినడానికి రొట్టెముక్క ఇస్తే దాన్ని పూర్తిగా శుభశకునంగా భావించాలి. అపుడా కార్యం ఏ అవాంతరాలు లేకుండా అయిపోతుంది. ఇప్పుడు ఫలహారాన్ని తిని కొంచెం ధైర్యం పెట్టుకోండి" అని చెప్పినా ఆ అలోచన ముగ్గురికీ నచ్చలేదు. వాళ్ళు మళ్ళీ ఏమీ తినకుండా వెళ్ళిపోయారు.నాలుగోవాడినైన నాకు ఆకలేసింది. దాహంతో నా గొంతెండిపోయింది. వణజారి అలౌకిక ప్రేమను చూసి నాకు చాలా ప్రీతి కలిగింది.ఆతని మనసులో ఎంత స్వాభావిక ప్రేమ ఉంది..ఏదీ ఆశించకుండా రొట్టె,కూర తినమని..అలా ప్రేమించిన వాళ్ళే నిజమైన జ్ఞానులు. అతన్ని ఆదరించడమే అదే నేను విద్యను సంపాదించగల ఉపాయమని అనిపించింది. కనుక అతను ఇచ్చిన ఒక పావు రొట్టెముక్కను ఆదరపూర్వకంగా తిని నీరు త్రాగాక ఒక అద్భుతం జరిగింది. 

 ఊహించని విధంగా అక్కడికి గురుమహారాజు వచ్చి ఇలా అన్నారు. "వాదవివాదాలెందుకు చేస్తున్నారు?" ఆయనతో నేను జరిగిన వృత్తాంతమంతా చెప్పాను. అప్పుడాయన "నాతోపాటు వస్తావా? నీకు వెంటనే మీరు వెతికిన ఆచూకీ పట్టిస్తాను. కానీ నేను చెప్పినట్లు వింటేనే కోర్కె నెరవేరుతుంది."  ఇతరులు ముగ్గురూ మాట వినలేదు. కానీ నేను ఆదరపూర్వకంగా దానికంగీకరించాను. గురుమహారాజు నన్నుతీసుకొని ఒక బావి దగ్గరకు వెళ్ళారు. నా రెండు కాళ్ళనూ ఆయన త్రాడుతో కట్టి పాదాలను పైనా, తలను క్రిందా పెట్టి తలకిందులుగా నన్ను నీటిలో మునగకుండా నీటిమీదుగా వ్రేలాడదీశారు. నీటికి నా చేతులు తగలకుండా, నీరు కూడా నా నోట్లోకి పోకుండా గురువు నన్ను బావిలో వ్రేలాడదీశారు.బావి గట్టు వద్ద ఓ చెట్టుంది. దానికి తాడు రెండవ కొసను కట్టి గురువుగారు నిర్దాక్ష్ణ్యంగా ఎక్కడికో వెళ్ళిపోయారు. నాలుగున్నర గంటలు గడిచాక ఆయన తిరిగి వచ్చ్హారు. నన్ను గబుక్కున పైకి లాగి"బావున్నావా" అన్నారు. నేను "ఎంతో ఆనంద పారవశ్యంలో ఉన్నాను. మీ ప్రేమామృత రసధారలవల్ల నేనభవించిన అపార సుఖాన్ని నేనెలా వర్ణించగలను" నా మాటలు విన్న గురుమహారాజు నా దేహాన్ని తమ చేత్తో నిమిరి ఆయన నన్ను తమ వద్దే ఉంచుకొన్నారు. గురువుగారు బాబాని సమాధి అవస్థలోకి తీసుకెళ్ళారు. బాబాని బావి అనే సంసారంలో నీరు అనే విషయాలవద్ద పెట్టారు. అదే సమయంలో ఆ నీరు చేతికి అందనంత దూరంలో బాబాని వ్రేలాడదీశారు. తలకిందులుగా వ్రేలాడదీయటంవల్ల ఇంద్రియాలన్నీ లోపలా బయటా సహస్రార చక్రం దగ్గరకు లాగబడి బాబాకి సమాధి స్థితి కలిగింది. అందుకే ఆ నాలుగున్నర గంటలూ బాబా భగవత్ ప్రేమామృత వర్షంలో తడిసిపోయి పారవశ్యపు స్థితిలో ఉన్నారు.  అప్పుడు గురువుగారు నన్ను తమ పాఠశాలకు తీసుకెళ్ళారు. నా గురువు నాపై నిష్కల్మష ప్రేమను కుంభవృష్టిలా వర్షించారు. నాకు గురువే అన్నీ అయిపోయారు. మనసుతో సహా ఇతర జ్ఞానేంద్రియాలన్నీ తమ స్థానాన్ని వదిలేసి ధ్యానం చేయాలన్న ప్రవృత్తికోసం ఏకాగ్రంగా కనుపాపల్లోకి వచ్చేశాయి. గురువు తప్ప నాకు వేరే ఏదీ కనిపించేది కాదు. దాన్నే "అనన్య అవధానం" అంటారు. ఆ ప్రకారంగా నాచేత ఉపాసన చేయించి నాకు బ్రహ్మజ్ఞాన నిధిని చూపించారు నా గురువు.బ్రహ్మజ్ఞానాన్ని స్వీయ అనుభవంతోనే ప్రాప్తింప చేసుకోవలసి ఉంటుంది.




సరే, ఆ నలుగురు పండితులూ దేని గురించి అన్వేషణ సాగించారూ..అంటే వారి వారి పుస్తక జ్ఞానాన్ని ప్రదర్శించుకొంటున్నప్పుడు దైవం గురించిన ప్రస్తావన వచ్చింది. తమకున్న జ్ఞానంతో దైవమెలా ఉంటాడు, ఏ పద్ధతిలో ,ఏ మార్గంతో, ఏ ఉపాయంతో తమకు ఆయన వెంటనే కలుస్తాడు ..ఇదే వారి మనసుల్లోని ఆలోచన. ఆ ప్రబుద్ధుల్లో శ్రీసాయి తనని కూడా ఒకరిగా కలుపుకొన్నారు.  ఆయన వైరాగ్యమూర్తి, వివేక సంపన్నులు. ఆయన సాక్షాత్తూ పరబ్రహ్మ తత్వమే. అప్పుడాయన ఆ విచారాన్ని స్వీకరించడం కేవలం లోకానికి ఆదర్శంగా మాత్రమే. భక్తులను ఉద్ధరించగల సాయి సమర్ధులకు ఆ అల్పత్వాన్ని ఎలా ఆపాదించగలం! స్వయంగా తాము అవతార పురుషులై ఉండి ఒక వణజరిని పూజ్యుడుగా భావించి,నిశ్చయపూర్వకంగా అన్నబ్రహ్మను స్వీకరించి దాని మహిమను కీర్తించారు. అలాగే ఆ అన్నాన్ని అనాదారం చేసేవారు ఎలా నష్టపోతారో చెప్పి గురువు లేకుండా జ్ఞానం ఎవరికీ ప్రాప్తించదని ఆ విషయానికి  సంబంధించిన  ప్రబుద్ధుల  కధను  చెప్పారు.  

తల్లి, తండ్రి, ఆచార్యుడు -వీరి ఉపదేశం లేకుండా ధర్మానికి సంబంధించిన జ్ఞానాన్ని పొందలేం. తల్లి,తండ్రి, గురువులను దైవస్వరూపంగా భావించి, వారికి సదా నమస్కరిస్తూ, వారిని సేవిస్తూ, వారి ఆజ్ఞలను పాటిస్తూ,వారి ఆశీర్వాదం పొందవలసి ఉంటుంది. మరియు యజ్ఞ,వేదపఠన,దానధర్మాలు చేయటం - ఇవి జనన, మరణాలను ఆపటానికి సులభసాధనలు-ఇవన్నీ చిత్తశుద్ధికి సాధనలు. శరీరం, ఇంద్రియాలు, మనసు, బుద్ధి, ఇవన్నీ కూడా దేన్ని తెలుసుకోలేవో, అలాంటి తెలుసుకోవటానికి కష్టమైన ఆత్మ స్వరూప సాక్షాత్కారం  గురుకృపతోనే  జరుగుతుంది.  




 సర్వం శ్రీసాయినాధార్పణ మస్తు















1 comments:

వెంకట రాజారావు . లక్కాకుల said...


సాయి మందిరాలు సమతకు నిలయాలు
కులము మతము లచట నిలువ రావు ,
మూర్తి పాద పద్మ ములు తాకి పులకించు
ఫలము పొంది రిచట భక్తులెల్ల .

సాయిని 'తన'వాడని 'ప్రతి
సాయి ప్రభుని గొల్చు వాడు ' సతతము తలచున్ ,
సాయియు 'ప్రతి భక్తుని' తన
చేయారగ 'దరికి' దీసి చెలువము జూపున్ .

సకల దేవతలను సాయి రూపున జూచి
భజన చేయు విథము ప్రబలె నిపుడు ,
సాయి మందిరాలు సకల దేవతలకు
పూజలందు క్షేత్ర ములయి వెలిగె .

మందిరాన వెలయు మహిమాన్వితామూర్తి
పాద పూజ చేసి పరవశించు
భాగ్య మిచట దొరుకు,భక్తుల కింకేమి
కావలయును? శాంతి గన్న పిదప !

సాయి మనకు ప్రభువు - సన్మార్గ దర్శియై
మనల నడిపి బ్రతుకు మనుపు చుండె ,
అండ నిలిచి పలికి అభయ హస్తమ్మిచ్చి
కష్ట కాలమందు కాయుచుండె .