Tuesday, November 8, 2016 By: visalakshi

సీతాన్వేషణ - మూడవభాగం

 రామలక్ష్మణులు మతంగాశ్రమం నుంచి బయల్దేరి, పంపాసరస్సును చుట్టి అవతలి వైపుకు వెడుతున్నారు. ఆ సరోవరం తీరం వసంతశోభతో కలకలలాడుతోంది. సరోవరంలో పద్మాలూ, కలువలూ పుష్కలంగా ఉన్నాయి. నీటిలో అనేకరకాల చేపలు మిలమిలలాడుతూ  కదుల్తున్నాయి. పక్షులూ, జంతువులూ ఉత్సాహంతో జతలు కడుతున్నాయి. 

ఆ రమణీయమైన ప్రకృతిని చూస్తూ రాముడు విషాదానికి లోనయ్యాడు. రాముడికి తామరపూవులను చూస్తే సీతమ్మ ముఖం జ్ఞాపకం వచ్చింది. కలువపూవులను చూస్తే సీతమ్మ కళ్ళు గుర్తుకొచ్చాయి. కదిలే చేపలను చూస్తే ఆమె చూపులు గుర్తుకొచ్చాయి...పురివిప్పి ఆడుతున్న మగనెమలిని చూసి రాముడికి మరింత దు:ఖం వచ్చింది. 'అవునులే దాని భార్యను రాక్షసుడు ఎత్తుకుపోలేదు. అది ఆనందంగానే ఉంటుంది.' అన్నాడు. క్రమంగా విరహవేదన ఆయన బుద్ధిని కప్పివేసింది. 




 లక్ష్మణుడు రాముణ్ణి ఓదార్చి కర్తవ్యం జ్ఞాపకం చేసాడు." రామా! ఎంత ప్రేమించిన వారినైనా వియోగం ఏర్పడినప్పుడు నిరంతరం అదే పనిగా జ్ఞాపకం చేసుకోవడం మంచిది కాదు. అతిస్నేహం అతిదు:ఖానికి దారితీస్తుంది. ఆలోచన క్రమంగా ఉండదు. ఆత్మవిశ్వాసం  తగ్గుతుంది. ఉత్సాహమే  బలం.
ఆత్మవిశ్వాసమున్నఉత్సాహవంతుడు సాధించలేనిదిలేదు. ఓటమిఉండదు.
త్సాహంతో సీతమ్మను తెచ్చుకునేందుకు ప్రయత్నిద్దాం.రావణుడు పాతాళంలో ఉన్నా, ఇంకే లోకాలలో ఉన్నా వాడు చేసిన పనికి మరణించక తప్పదు. వాడు నీకు సీతనైనా అప్పగించాలి. ప్రాణాన్నైనా అప్పగించాలి. మనస్సును కుదుట పర్చుకో. ధైర్యాన్ని అవలంభించు. కామప్రకోపం కలిగించే ఊహల్ని పక్కకు నెట్టు. నువ్వెంత మహాత్ముడివో జ్ఞాపకం చేసుకో. 

 రాముడు శోకమోహాలు వదిలిపెట్టాడు. వారు ముందుకు సాగారు. ఋశ్యమూక పర్వతాన్ని సమీపిస్తుంటే సంన్యాసి వేషంలో ఉన్న హనుమంతుడు వారికి ఎదురయ్యాడు. వారు సుగ్రీవుడికై వెదుకుచుండగా..వారెవరో తెలుసుకోమని సుగ్రీవుడు తనమంత్రిని పంపాడు. వెదకబోయిన తీగ కాలికి తగిలింది. హనుమంతుడు నెమ్మదిగా రామలక్ష్మణుల వద్దకు వెళ్ళి వినయంగా వాళ్ళకు నమస్కరించి మృదుమధురంగా..మహాత్ముల్లారా ! మీరు చూట్టానికి దేవతల్లా ఉన్నారు. మీ ముఖవర్చస్సు చూస్తే రాజర్షుల్లా కనిపిస్తున్నారు. మునుల వేషంలో ఉన్నారు. ధనుస్సు,బాణాలు,ఖడ్గము ధరించారు.మీరు ఎవరు? అని పలువిధాల వారిని శ్రేష్ఠులుగా అభివర్ణిస్తూ..ఓ నరశ్రేష్ఠులారా ! నేను ఇంతసేపు మాట్లాడినా మీరు బదులు చెప్పరేమి? సరే. నేనే విషయానికొస్తాను.. ధర్మాత్ముడు, వీరుడు అయిన సుగ్రీవుడు అనే వానరరాజు ఉన్నాడు. అతడు తన అన్నగారైన వాలిచేత అవమానింపబడి దేశం నుండి వెళ్ళగొట్టబడ్డాడు. అతడు ఈ పర్వతంపై తల దాచుకుంటున్నాడు. నేనుకూడా వానరాన్నే . నా పేరు 'హనుమంతుడు ' సుగ్రీవుడు పంపగా వచ్చాను. రాముడు మహదానందం పొందుతూ లక్ష్మణా! చూసావా మనం ఏ వానరరాజైన సుగ్రీవుణ్ణి వెతుక్కుంటూ వచ్చామో, అదే సుగ్రీవుడి మంత్రి అయిన ఈ హనుమంతుడు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఈ వానరుడు మంచి మాటకారి. స్నేహపాత్రుడు. శత్రుసంహారం చేయగల శక్తీ, నేర్పు రెండూ ఉన్నాయి.అటువంటి ఈ హనుమంతునితో స్నేహంగానూ, మధురంగానూ మాట్లాడు. అన్ని వేదాలూ చదివిన వేదవిదుడిలా కనిపిస్తున్నాడు.ఈతని పలుకు వ్యాకరణబద్ధంగా ఉంది. 




 రాముని మాటలు విన్న లక్ష్మణుడు.. హనుమంతునితో ఓ బుద్ధిమంతుడా మేము రామలక్ష్మణులం..మహాత్ముడైన సుగ్రీవుని గుణాలను గూర్చి మేము ఎరుగుదుము. మేము సుగ్రీవుని మైత్రికై వచ్చాం. సత్పురుషులలో శ్రేష్ఠుడవైన ఓ హనుమంతుడా! మేము సుగ్రీవుడు కోరినట్లు అతడితో స్నేహం చేయడానికి వచ్చాం.

 రామసుగ్రీవులు అగ్నిసాక్షిగా మిత్రులయ్యారు. ఒకరి కధ ఒకరికి చెప్పుకున్నారు. రాముడు వాలిని చంపుతానని ప్రతిజ్ఞ చేసాడు. సీతమ్మ ఎక్కడున్నా వెదికించి ఆమెను తిరిగి పొందడానికి సహాయం చేస్తానని సుగ్రీవుడు ప్రతిజ్ఞ చేసాడు. రాక్షసుడొకడు ఒక స్త్రీని బలవంతంగా పట్టుకుని ఆకాశమార్గంలో దక్షిణదిశకు తీసుకువెడుతుంటే తాము చూసామని సుగ్రీవుడు చెప్పాడు. ఆమె రామా! రామా! లక్ష్మణా! లక్ష్మణా! అని ఏడ్చిందన్నాడు. ఆమె కూడా తమను చూసి, కొన్ని నగలు పట్టుబట్టలో కట్టి తామున్న చోటుకి విసిరిందనీ, ఆ మూట అలాగే భద్రపరిచామనీ చెప్పాడు. ఆ మూట తీసుకువచ్చి రాముడికిచ్చాడు. 




ఆ పట్టుబట్టను గుర్తించిన రాముడి కళ్ళు జలపాతాలైపోయాయి. చూపు మసకబారింది. లక్ష్మణుణ్ణి ఆ ఆభరణాలు చూడమన్నాడు. లక్ష్మణుడు చెప్పిన సమాధానం:...

'నాహం జానామి కేయూరే నాహం జానామి కుండలే,
 నూపురే త్వభిజానామి నిత్యం పాదాభివందనాత్.


సోదరా! ఆమె భుజాలకు ధరించే అలంకారాలు గాని, చెవులకు ధరించే కుండలాలుగాని నేనెపుడూ చూడలేదు. ఎందుకంటే తలెత్తి నేనెపుడూ సీతమ్మను చూడలేదు. నిత్యం ఆమె పాదాలకు నమస్కరించడం వలన ఆమె పాదాలకుండే నూపురాలను మాత్రం గుర్తించగలను అన్నాడు. ఆ భావాన్ని భక్తిభావమనవచ్చు .  

 వాలి సుగ్రీవుల వైరానికి గల కారణాలు తెలుసుకున్న రాముడు ఇచ్చిన మాట ప్రకారం వాలిని వధించాడు. సుగ్రీవుడు వానర సామ్రాజ్యానికి ప్రభువయ్యాడు.రాజ్యాభిషిక్తుడైన సుగ్రీవుడు రాముని అనుమతి పొంది కిష్కింధా నగరానికి వెళ్ళాడు. తరువాత రామలక్ష్మణులు ప్రస్రవణ పర్వతంపై నివసించాలనుకున్నారు. అక్కడికి కిష్కింధ కూడా దగ్గర్లోనే ఉంది. అప్పటికి వర్షాకాలం ప్రారంభమౌతోంది. ఆ కాలం సీతాన్వేషణకు అనువైనది కాదు కనుక నాలుగు నెలల తరువాత ఆ ఏర్పాట్లు చేయమని రాముడు సుగ్రీవునకు ఆదేశించాడు. రామలక్ష్మణులు ప్రస్రవణపర్వతం మీద ఒక విశాలమైన గుహలో ఉన్నారు.

రాముడు సుగ్రీవాదుల సహాయం ఎలా వినియోగించుకున్నాడు....తదుపరి భాగంలో....  


సర్వం శ్రీసాయిరామార్పణ మస్తు.








0 comments: