Thursday, November 10, 2016 By: visalakshi

సీతాన్వేషణ - చివరిభాగం

జాంబవంతుడు ప్రేరేపించగా మహాబలశాలి అయిన హనుమంతుడు సీతాదేవిని వెతికి చూడాలన్న కాంక్షతో దేవతలు, చారణులు సంచరించే ఆకాశమార్గంలో ప్రయాణం చేసి లంకాపట్టణాన్ని చేరాలని సంకల్పించాడు.తూర్పు దిక్కుగా తిరిగి తండ్రి అయిన వాయుదేవుని స్మరించి ఆశీస్సులు కోరి దక్షిణ దిక్కుగా వెళ్ళేందుకు హనుమంతుడు శరీరాన్ని మేరుపర్వతమంత పెద్దదిగా పెంచాడు. శత యోజన విస్తీర్ణ సాగరాన్ని దాటి సీతాన్వేషణ చేయడానికి పూనుకున్నాడు. సముద్ర ఉల్లంఘన సమయంలో హనుమకు పర్వత రూపంలో ఉన్న మైనాకుడు సముద్రుడి ఆదేశంపై మానవరూపంలో వచ్చి పర్వతశిఖరంపైన నిలిచి ఆకాశంలో ఉన్న హనుమంతుడితో ..ఎవ్వరికీ సాధ్యంకాని పని చేపట్టావు. వానరోత్తమా కొద్దిసేపు నా శిఖరంపై విశ్రమించు. నీకు సహాయం చేయడం ద్వారా రఘువంశ రాజైన రాముడికి సేవ చేసినట్లవుతుందని నా భావన. నా ఆతిధ్యం స్వీకరించి నన్ను కృతార్ధుణ్ణి చెయ్యి.అన్నాడు.




 హనుమంతుడు ఓ మైనాకుడా! నీ ప్రియమైన మాటలు నాకు సంతోషము కలిగించాయి   చాలు. ఇప్పుడు నేను మీ ఆతిధ్యాన్ని స్వీకరించలేను. ఎక్కడా ఆగకుండా లంకాపట్టణాన్ని చేరుతానని నా స్నేహితుల వద్ద ప్రతిజ్ఞ చేశాను. అందువలన నీ మాట మన్నించలేకపోతున్నాను అని వారిని చేతితో తాకి వారికి ఆనందాన్ని కలిగిస్తూ ముందుకు సాగిపోయాడు. సురస, సింహికల రాక్షస మాయలు అడ్డుగా నిలిచినా ప్రలోభాలకూ, ప్రతిబంధకాలకూ లొంగక హనుమంతుడు కార్యదీక్షాపరుడై లంకాపట్టణం చేరుకున్నాడు.మహాబలశాలి అయిన వానరశ్రేష్ఠుడు నగరంలోనికి ప్రవేశిస్తూ ఉండగా లంకానగరం స్త్రీరూపంలో హనుమంతుని అడ్డుకుంది. హనుమంతుడి ధాటికి భయపడింది. దీనస్వరంతో ఓ మహానుభావా! నేనే సాక్షాత్తూ లంకానగరాన్ని. నన్ను నీ పరాక్రమంతోజయించావు.ఇక బ్రహ్మవాక్కు నిజమవబోతోంది.  దురాత్ముడైన రావణుడు సీతను అపహరించి తెచ్చాడు. దాంతో అతడికి, మిగిలిన రాక్షసులందరికీ వినాశకాలం దాపురించింది.వానరశ్రేష్ఠుడా! నీవు ఈ లంకాపట్టణానికి  ఏయే పనులు చక్కపెట్టటానికి వచ్చావో, ఆ పనులన్నీ పూర్తి చేసుకో! ఈ పట్టణమంతా స్వేచ్చగా సంచరించు. మహా పతివ్రత అయిన సీతను అన్వేషించు. అంది.

 హనుమంతుడు రావణుని అంత:పురంలోకి రహస్యంగా ప్రవేశించి,  రావణుని మందిరాలలో సీతకై వెదుకుతున్నాడు. రాక్షస ప్రముఖుల ఇళ్ళన్నీ గాలించాడు. వారి ఐశ్వర్య సమృద్ధిని చూసి హనుమ ఆశ్చర్యపోయాడు.  రావణుని అంత:పుర భవన సముదాయాలలో పుష్పక విమాన గృహంలో రావణుడు నివసిస్తూ ఉంటాడు. ఆ నివాసంలో కూడా నిద్రించే స్త్రీలను పరిశీలించి సీతమ్మ కానరాక దిగులుచెందాడు. మరల ఒకసారి వెదుకుతుండగా దివ్యమైన పడకగదిలో వీరుడైన రావణుడు నిద్రించుచున్నాడు. అచటికి దూరంగా ఏకాంత శయ్యపైన ఒక సుందరాంగి ఒంటరిగా నిద్రిస్తోంది. అతిరూప సౌందర్యవతి అయిన మండోదరిని చూసి మొదట ఆమెయే సీతాదేవి అనుకున్నాడు. ఆమె సీతాదేవి కాదని తెలుసుకున్నాడు. సీతమ్మ రాముని వియోగముతో కంటిమీద కునుకులేక శోకవనితలా ఉంటుంది. రాముడు తప్ప పరపురుషుని కన్నెత్తి కూడా చూడదు. అలంకారాలు చేసుకోదు కాబట్టి ఈమె సీత కాదు అనుకొని ఆమె మండోదరి అని తెలుసుకొన్నాడు.   తిరిగి అన్వేషణ ప్రారంభించాడు. పానశాలలో వెదికాడు.అయినా సీతాదేవి కనిపించలేదు. సీత మరణించినదేమోనన్న అలోచనతో బాధగా పుష్పకవిమాన గృహం నుండి క్రిందికి దిగి రాముని తలుచుకొని..అనేక విధాలుగా అలోచిస్తూ..సీతాదేవి కనిపించేవరకు వెదుకుతాను అని శపధంచేసుకుంటూ వస్తూండగా ఎదురుగా పెద్దపెద్ద వృక్షాలతో అశోకవనం కనిపిస్తోంది. ఇంకా ఈ వనంలో వెదకలేదు ఇప్పుడు సీతాదేవి కోసం ఆ వనంలో ప్రవేశిస్తాను. పరమపూజ్యురాలు అయిన సీతాదేవి ఇప్పుడు నాకు కనపడు గాక! అని మనస్సులోనే ప్రార్ధన చేసుకున్నాడు.  




 హనుమంతుడు అశోకవనంలోకి ప్రవేశించాడు. ఆ అశోకవనం అనేక ఉపవనాలతో కూడిన వనసమూహం. హనుమంతుడు అక్కడ కొన్ని బంగారు వృక్షాలు చూశాడు. అక్కడొక శింశుపావృక్షం ఉంది. మహాబలశాలియైన హనుమంతుడు ఆ శింశుపావృక్షం చిటారు కొమ్మపైన కూర్చుని సీతాదేవి ఎక్కడైనా కనిపిస్తుందేమోనన్న ఆశతో నాలుగు ప్రక్కలా కలయ చూశాడు. హనుమంతుడు అలా అశోకవనంలో ఒక వృక్షం నుండి, మరోవృక్షంపైకి దూకుతూ, ఒకానొక వృక్షాగ్రం నుండి పరికించి ఒక భవనం చూసాడు .ఆ భవనం కైలాసంలా తెల్లగా మెరిసిపోతోంది. ఆ భవనాన్ని వెయ్యి స్తంభాలపైన కట్టారు. హనుమ ఒక్క గెంతుతో ఆ భవనం పైకి దూకాడు. అక్కడ ఒక యువతిని చూసాడు.  ఆహారం లేనందున ఆమె శరీరం కృశించిపోయి ఉంది. శరీరంపై ఎక్కడా ఏవిధమైన అలంకారాలూ లేక దీనురాలై వున్న ఆ యువతి సీతయే అయిఉండవచ్చని హనుమంతుడు భావిస్తున్నాడు.  రాముడు చెప్పిన అలంకారాలన్నీ అంటే ఆమె చెవులకున్న కుండలాలు,గాజులు,మణులతో పొదిగిన హారాలు అన్నీ రాముదు వర్ణించి చెప్పినట్లే కనబడుతున్నాయి. కాకపోతే కాస్త మాసిపోయి ఉన్నాయి. సందేహం లేదు ఆమె తన ఉత్తరీయంలో మూట కట్టిపడేసిన నగల్ని మేమంతా చూశాం. ఆ నగలు మూట కట్టిన ఉత్తరీయమూ ఇప్పుడు ఈమె ఒంటిపై ఉన్న వస్త్రమూ ఒకేమాదిరిగా ఉన్నాయి. రాముడు చెప్పిన నగల గుర్తులను బట్టి, ఈమె ధరించిన వస్త్రం, నగల ఉత్తరీయం అన్నివిధాలా ఒక్కటిగానే ఉండడం వల్ల ఈమె రాముని సఖి సీతయేనని నా మనస్సు కచ్చితంగా చెబుతోంది.అనుకున్నాడు. 


  ఈమె సీత అని నిర్ధారణ చేసుకున్న హనుమంతుడు ఆనందాశ్రువులతో రాముని స్థుతించి, నమస్కరించాడు. హృదయం అంతా ఆనందం నిండి ఆ చెట్టు ఆకుల మధ్య పొంచి కూర్చున్నాడు. రావణుడు అశోక వనానికి వచ్చి సీతను చూడాలనే కాంక్షతో సీతాదేవి దగ్గరగా వచ్చాడు. హనుమంతుడు ఆ కొమ్మపై కూర్చుని అక్కడినుండి అన్నీ పరిశీలనగా చూస్తున్నాడు. రావణుని చూడగానే సీతాదేవి భయపడింది.రావణుడు సీతను బ్రతిమాలుతూ తన మనోభావాల్ని తెలియజేస్తూ, ప్రలోభపెట్టాలని చూశాడు.సీత తనపై గల మనస్సును భార్యలపైకి మరల్చుకోమనీ, ఐశ్వర్యము, ధనము చూపి నన్ను ప్రలోభపెట్టాలని చూడకు. కాంతి సూర్యుని నుండి ఎలా వేరు కాదో అలాగే నేను రాముడి నుండి వేరు కాను. నీవు జీవించి ఉండాలన్నా, నీ రాజ్యాన్ని నీవు పాలించాలన్నా పురుషశ్రేష్ఠుడైన రాముని శరణు కోరుకో .ఆ మహాత్ముడు నిన్ను క్షమించి విడిచిపెడతాడు. రావణా నేను చెప్పిన హితాన్నిపెడచెవిన పెడితే నీవు మరణించడం తధ్యం! అని నిందించింది.

  రావణుడు సీతమాటలన్నీ అప్రియంగా ఉన్నా విని, కోపం వచ్చినా ఆమె పట్ల మోహం చేత తనకు వశమవ్వడానికి సీతకు రెండు మాసాల గడువు ఇస్తాడు.ఇలాంటి చులకన స్వభావంకల రావణుడు రెండు నెలల గడువు నివ్వడం విని శింశుపావృక్షం వద్దకు పోయి విలపించి, రాముని తలపులతో ప్రాణాలు విడవాలని సీత నిశ్చయించుకుంది. సీత ధర్మాన్ని ఆలోచించి ఆత్మహత్యను పాపకార్యంగా భావించి ఆలోచిస్తుండగా ఆమెకు అనేక శుభశకునాలు కనిపించాయి. హనుమంతుడు సీత పడుతున్న ఆవేదన అంతా స్వయంగా విన్నాడు. త్రిజట స్వప్న వృత్తాంతమంతా అత్యంత ఆసక్తితో ఆలకించాడు. సీతాదేవిని చూడగలిగాడు. రామకార్యం సగం పూర్తి అయింది గదా! అని సంతోషించాడు.సీతకు వినబడే విధంగా రాముణ్ణి మధురాతి మధురంగా కీర్తించాడు. హనుమంతుడి మాటలు వినబడిన దిక్కుగా తలపైకెత్తి చూసింది. అతణ్ణి చూసి కలవరపడింది. ఆశ్చర్యపడింది. వానరుడి రూపం భయంకరంగా ఉండడంతో స్పృహతప్పినట్లయింది. చేష్టలుడిగిన సీతాదేవి వానరుని గురించి ఆలోచించుతుండగా హనుమంతుడు సీతాదేవికి వినయంగా శిరస్సు వంచి రెండుచేతులతో నమస్కరిస్తాడు. నీకు సర్వ శుభాలు కలగాలని కోరుకుంటున్నాను. జనస్థానం నుండి రావణుడు అపహరించిన సీతాదేవివి కదా! నీ దైన్య స్థితి చూస్తే నీవు రాముని భార్యవని నాకు అనిపిస్తోంది అన్నాడు. సీత హనుమంతునికి తన వృత్తాంతము చెప్పి, నిజానికి నీవు వానరుడవా..లేక మాయా రూపంలో వచ్చిన రావణుడివా అని సందేహపడ్తుంది. ఓ దేవీ! నీవు సందేహపడినట్లుగా నేను రావణుడను కాను. నా మాటలు విశ్వసించు. అని అనేక విషయాలను గుర్తుచేస్తూ నేను రామదూతగా వచ్చాను.ఇదిగో! ఆ ఉంగరాన్ని చూడు.  రామ ముద్రికతో ఉన్న ఈ ఉంగరము  మహాత్ముడైన రాముడు నీకిమ్మన్నాడు. నీకు ఇకపై అన్నీ శుభాలే అన్నాడు. జానకి భర్త పంపిన ఉంగరాన్ని తీసుకొని రాముడిదేనని గుర్తించి, భర్త సందేశాన్ని హనుమ ద్వారా విని సంతోషించింది. హనుమంతుణ్ణి ప్రత్యక్షదైవంగా భావించి ప్రశంసించింది.

   కానీ హనుమతో వెళ్ళడానికి నిరాకరించింది." ఓ హనుమంతుడా! ఈ కార్యం  నెరవేరరడానికి అంటే ఈ చెరనుండి విడిపించడానికి, రామప్రభువు నా దు:ఖం పోగొట్టడానికి నీవే కర్తవు కావాలి. నీ ద్వారానే ఆ మహానుభావుడు నన్నుతీసుకెళ్ళే ప్రయత్నం చేస్తాడు. నా భర్తతో ఈ మాట మరీ మరీ చెప్పు. " ఓ రామప్రభూ! నేను ఇంకా ఒక్క మాసమే జీవించి ఉంటాను. నేను శపధం చేసి చెప్తున్నాను. పాపాత్ముడైన రావణునిచే అపహరింపబడిన నన్ను రామప్రభువే తీసుకొనిపోవాలి."తరువాత తన చీర కొంగునుండి సుందరమైన దివ్యమైన చూడామణిని తీసి రాముడికి తన ఆనవాలుగా ఇమ్మంది. హనుమంతుడు ఆ చూడామణిని తీసుకొని తన వేలుకి ధరించాడు. సీతమ్మ దర్శనం అయింది; రామకార్యం సిద్ధించింది. అని సంబరంతో సీతాదేవి అనుమతితో చూడామణిని తీసుకొని కిష్కింధకు ప్రయాణమయ్యాడు. కానీ రావణాదులు బంధించడంతో... రామదూతగా వచ్చానని చెప్పినా.. ఆలకించకపోవటంతో తోకకు నిప్పు పెట్టినా.. తనకు ఏమీ కాకపోయినా, అగ్ని ఆవహించి ఉన్నాడు. ఆయనకు ఏదైనా హోమద్రవ్యాన్ని సమర్పించి ఆయన్ని తృప్తి పరుస్తాను అనుకొని రాక్షస భవనాలకు, లంకా పట్టణానికి నిప్పు పెట్టి లంకాదహనం గావించాడు. సీతాదేవి క్షేమంగురించి భయపడి మరల సీతాదేవిని దర్శించాడు. హనుమంతుడు సీతాదేవిని శింశుపావృక్షానికి దగ్గరలో కూర్చొని ఉండడం చూసాడు. మనస్సులోని భయాలు తొలగిపోగా మహదానందపడిపోయాడు. ఆమెకు నమస్కారం చేసి .. నీవు క్షేమంగా ఉండటం చూసి ఆనందంగా బయలుదేరుతున్నాను నీ అనుమతితో అని భయంకరంగా గర్జిస్తున్న సముద్రాన్ని దాటి  ఉత్తరపు దిక్కున ఉన్న ఒడ్డుకు చేరుకునేందుకు హనుమ ఆకాశంపైకి ఎగిరాడు. సముద్రతీరాన హనుమంతుడు ఎప్పుడు వస్తాడా అని చూస్తున్న వానరయోధులకు హనుమంతుని సింహనాదం వినిపించింది. జాంబవంతుదు వానరయోధులారా! హనుమంతుడు విజయలక్ష్మితో తిరిగి వస్తున్నాడు. అని అన్నాడు. హనుమంతుడు వాయువేగంతో సెలయేటి గట్టున దిగాడు. 




 గురువుకు నమస్కరించి, పెద్దలకు,జాంబవంతుడికి నమస్కరించి.. వారందరినీ ఉద్దేశించి "సీతమ్మను చూసాను" అన్నాడు.హనుమంతుడు లంకా విశేషాలను వివరించాడు."లంకాదహన ఘట్టం అంతరార్ధాన్ని పరిశీలిస్తే లంకా పదాన్ని తిరగేస్తే కాలం అవుతుంది. కాలం అంటే నలుపు అని అర్ధం. అది తమో గుణానికి సంకేతం. రాక్షసత్వం తమోమయం. ఆ తమోగుణాన్ని సాధకుడు తన కృషితో దహించివేయాలి."  విభీషణుడు జ్ఞాని.  హనుమ విభీషణుడి మందిరంవైపు వెళ్ళలేదు. సాత్విక గుణసంపన్నులైన మండోదరి, త్రిజటల మందిరాలవైపు చూడలేదు. వారికి ఎటువంటి హానీ కలిగించకుండా ఆయన లంకానగర దహనకాండ కొనసాగించాడు. సాధించిన విజయంతో  తన ఆనందాన్ని కపివీరులతో పంచుకున్నాడు. వారితో కలిసి కిష్కింధ చేరుకొని సీత వృత్తాంతాన్ని రామునికి తెలిపాడు. సీతమ్మ ఇచ్చిన 'చూడామణి 'ని శ్రీరామచంద్రుడికి అందజేసి సంతోషపరిచాడు. పరమాత్మను ఆనందభరితుణ్ణి చేశాడు. ప్రకృతి శక్తుల సమాహారమే జీవాత్మ. జానకీ మాత ప్రకృతి. శ్రీరాముడు పరమాత్మ. జీవాత్మను పరమాత్మతో జతచేయడమే హనుమంతుడి కర్తవ్యం. జీవాత్మ, పరమాత్మల ఆనందాన్ని చూసి బ్రహ్మానందభరితుడయ్యాడు. హనుమంతుడి విజయం లోకకల్యాణకారకమైంది. ఆయన శ్రీరాముడి ఆలింగన భాగ్యాన్ని పొందాడు.


 సర్వం శ్రీ సాయిరామార్పణ మస్తు













0 comments: