Sunday, April 23, 2017 By: visalakshi

అంతరాత్మ(నువ్వే నేను)

 ఓం శ్రీ సర్వేశ్వరాయ నమో నమ: 





జ్ఞానంతో కూడిన భక్తే నిజమైన శరణాగతి. తనను తాను విచారించుకోవటం వలన జ్ఞానం లభిస్తుంది. కనుక సాధన విచారణతో ఆరంభమై, సమర్పణతో ముగుస్తుంది. భక్తి భావనతో హనుమంతుని ద్వైత ప్రయాణం శ్రీరామునితో అభేదాన్ని గుర్తించడంతో అద్వైత దర్శనంగా పరిణమించి, గమ్యస్థానాన్ని చేరుకుంది. హనుమంతుడు రామచంద్రునితో ఈ విధంగా తెలియజేశాడు.

 శ్లో"   దేహబుద్ధ్యా తు దాసో2హం జీవబుద్ధ్యా త్వదంశక: !
        ఆత్మబుద్ధ్యా త్వమేవా2హం ఇతి మే నిశ్చితా మతి: !!

" ఓ శ్రీరామా! దేహబుద్ధి కలిగి ఉన్నప్పుడు నేను నీ దాసుడను. జీవబుద్ధితో ఉన్నప్పుడు నేను నీ అంశను. ఆత్మబుద్ధియందు (అనగా 'నేను ' అనే భావన శుద్ధమై నిలిచినపుడు)' నీవే నేను ' అని తెలుసుకుంటున్నాను." ఈ విధంగా భక్తి, జ్ఞానాలు విరుద్ధమైనవి కావు అని మనకు సుస్పష్టంగా తెలియజేసినవాడు  హనుమంతుడు.

 భక్తి మార్గానికి, జ్ఞాన మార్గానికి వైరుధ్యం లేదు. వాస్తవానికి, పర్యవసానంలో రెండూ ఒకటే. భక్తితో నిజమైన నేనును అర్పిస్తే, మిధ్యా నేను పోతుంది. విచారణ ద్వారా నేను పుట్టుక స్థానాన్ని వెదికితే, ఈ మిధ్యా నేను అదృశ్యమౌతుంది.

  "నేను" అను తలపు పుట్టిన తర్వాతే ఈ "నేను"ను ఆశ్రయించుకొనే -క్షణ క్షణం మారే తలపులు పరంపరగా పుడుతున్నాయి. కనుక ఈ "నేనెవరు"? అని నిరంతరం ప్రశ్నిస్తే ఈ నేను అదృశ్యమై నిజమైన "నేను"  అనుభవం అవుతుంది.

ఆత్మ నుండి "నేను" అను ప్రధమ తలంపు పుడుతుంది. నేను పుట్టగానే తల్లిని మర్చిపోయి దేహమే తాననుకుంటోంది. కనుక "నేను" పుడుతూనే తల్లిని(ఆత్మను) హత్య చేస్తోంది. ఈ "నేను"ను పూర్ణమైన భక్తితోజగజ్జనని పాదాలముందు అర్పిస్తే ఆ జగజ్జననియే నీలో నుండి వెలుగుతుంది. ఇలా దేహమే తాను అనుకున్న వారందరూ తల్లిని చంపిన వారే. "నేను"ను చంపిన వాడే తల్లిని బ్రతికించినవాడు. 

అంతరాత్మ ప్రబోధము:    నువ్వు ఎవరో తెలుసుకో.దీనికి శాస్త్రాలూ, పాండిత్యమూ అక్కర్లేదు. 

 నిజమైన "నేను" అనేది మహామంత్రం. ఇది ఓంకారం కన్నా శక్తివంతమైనది. ఇది భగవంతుని మొదటి నామం.  "నేనెవడను"? అను ప్రశ్న ద్వారా అంతర్ముఖుడవై నీ హృదయంలోని ఆత్మను "నేను"ను అన్వేషించు. భగవంతునకు శరణాగతి చెందు.  



అనుక్షణం తన అసమర్ధతను తెలుసుకొని, "నాదేమీ లేదు. ఓ సకలేశ్వరుడా! అంతా నీదే" అని ప్రార్ధిస్తూ "నేను - నాది" పూర్తిగా భగవంతుని పాదాలకు అర్పించాలి. నీతో భగవంతుడు ఏమి చేయించదల్చుకున్నాడో అది చెయ్యటానికి సిద్ధంగా ఉండాలి. నాకు ఇది కావాలి, అది కావాలి అని గానీ నాకు ఈ రూపంతో లేక ఆ రూపంతో సాక్షాత్కారం కావాలనే కోరిక, భక్తునిలో ఉన్నంత వరకు శరణాగతి పూర్ణం కాదు.( శరణాగతి అన్న నేను మొన్న బాబాగారిని ఏ రూపంలో దర్శనమిస్తావు బాబా..) అని అడిగాను.. నా ప్రశ్నకు ఇలా సమాధానం నాచేత రాయిస్తున్నారు. నీ శరణాగతి పాక్షికమా అని నన్ను ప్రశ్నిస్తున్నారు..లేదు బాబా క్షమించండి..."నిజమైన శరణాగతి అంటే భగవంతుణ్ణి ప్రేమించడం.. అహంకారాన్ని నాశనం చేయడం అని తెలుసుకున్నాను." ఆత్మను తెలుసుకొని, ప్రారబ్ధాన్ని జయించి, పూర్ణ శరణాగతి  చెందుతున్నాను  బాబా...

 మనస్సు బయటకు వచ్చినప్పుడు విషయాలలోనూ,ఆలోచనలలోనూ చిక్కుకుంటుంది. లోపలికి మరలినపుడు అది ఆత్మగా మారిపోతుంది. లోపలికి మరలిన మనస్సునే శుద్ధ మనస్సు అంటారు. 

మనం భగవంతుని స్మరించాం అంటే అది భగవంతుడు అనుగ్రహించిన వరం అన్నమాట. అనుగ్రహం భగవంతుని గుణం కాదు. అనుగ్రహమే భగవంతుడు. దేవుని అనుగ్రహం లేనిదే దేవుణ్ణి స్మరించలేం.  




 ప్రతి ఒక్కరినీ భగవంతుడు కనిపెడుతూనే వున్నాడు. ఆయనే అందరినీ సృష్టించాడు. కొన్ని కోట్ల జీవులలో నీవూ ఒక్కడవు. అందరినీ ఆయన చూస్తున్నప్పుడు నిన్ను ఒక్కడినీ చూడకుండా ఉంటాడా? ప్రతి ఒక్కరిని భగవంతుని శక్తి లోబరుచుకొని నడుపుతోంది.అందుకే భక్తులు భగవంతునికి శరణాగతి చెంది "నీ యిచ్చయే నెరవేరు గాక" అంటూ ప్రార్ధన ముగిస్తారు. భగవంతుని యిచ్చే సర్వకాల సర్వావస్థలలోనూ నెరవేరి తీరుతుంది. మనచేత భగవంతుడు ఏ పని ఏ సమయములో జరగాలో ఆ సమయములో జరిపించి తీరుతాడు.

భగవంతుడు జగజ్జనకుడు. ఆయన సదా మనచుట్టూ, బయటా, లోపలా అంతటా ఆవరించే ఉన్నాడు. తన బిడ్డల క్షేమం తండ్రికంటే విచారించేదెవరు? మనలను సదా రక్షిస్తున్నాడన్న సత్యాన్ని హృదయపూర్వకంగా విశ్వసించాలి. భగవంతుని అనుగ్రహంతోనే ఆధ్యాత్మిక జీవిత ఆరంభమూ, ముగింపూ కూడా...........         రమణుల వారి దివ్య భాషణములు....



 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు



     












  

0 comments: