Monday, April 17, 2017 By: visalakshi

ఆ తరాలు - అంతరాలు






 ఈ మధ్య నా నెచ్చెలి అమ్మ నాన్న గుర్తుకొచ్చారురా.. అంది. అలా ఆలోచనలో పడిన నాకు మా అమ్మ..నాన్న గుర్తు వచ్చారు. అమ్మ నాన్న వారితో మనకుండే అనుబంధం..మన పిల్లలకి మనతో ఉండే అనుబంధం ఆలోచన .  ఈ టపాకి నాంది అయింది నా ఆలోచనల పరంపర..

జన్మ నిచ్చిన తల్లి ఋణం తీర్చుకోలేము అంటారు. నిజమే! భగవంతుడు ఏర్పరిచిన మధుర బంధం.. సృష్టికి ప్రతిరూపాలు తల్లిదండ్రులు.అమ్మ ఆలనా, నాన్న పాలనా.. వారి కనుసన్నలలో పిల్లల దినదినాభివృద్ధి..పూర్వకాలంలో తల్లిదండ్రులు పిల్లలను ప్రేమతో పాటు, గౌరవ అభిమానాలను పెద్దలయందు మర్యాదాపూర్వక భయభక్తులను నేర్పేవారు. 

 చిన్నతనంలో అమ్మ సాయంత్రము వేళల్లో నాన్నగారికి పలహారం అందించి తను ఎదురుగా మల్లెపూవుల దండను కడుతూ కబుర్లు చెప్పేది. మేము పిల్లలం ఒకింత దూరంలో కూర్చుని చదువుకొనేవారము. ఆ దృశ్యము ఎప్పుడూ నా మదిలో నిలిచిపోయింది. నాన్నగారికి పనసపొట్టుకూర చాలాఇష్టం. ఆయన పనసపళ్ళు. కాయలను తీసుకువచ్చి తానే ఉదయమే పనసపొట్టును తీసి, పనసతొనలను వలిచేవారు.. ఆ ప్రహసనమునకు రెండు గంటల సమయము కాబట్టి ఆదివారము చేసేవారు. అదో జ్ఞాపకం. జామపళ్ళు తెచ్చేవారు. అమ్మ వాటిని ఒక పెద్ద పళ్ళెములో పెట్టేది.. జామపళ్ళ వాసనతో, ఆ గది బలే ఉండేది. ఇవన్నీ ఎక్కడోకాదు. హైదరాబాదు మహానగరంలోనే.. జీతం రాగానే ముందు పుల్లారెడ్డి స్వీటు, చెగోడీలు తెచ్చేవారు. అమ్మ అందరికీ పెట్టేది. నాన్నగారు వస్తున్నారు అంటే మేము మరి మాట్లాడే వాళ్ళం కాదు. స్కూలికి వెళ్ళేటప్పుడు ఆయన చేయి పట్టుకొని వెళ్ళేవారం.  అదో అపురూపం.  అప్పట్లో సందేహాలన్నీ ఉపాధ్యాయులను అడిగి తీర్చుకునేవాళ్ళం. అమ్మా నాన్నను అడగాలంటే వెరపు.  అది మా తరం.

 క్రమేణా తల్లిదండ్రుల ప్రేమలలో స్వార్ధం చోటు చేసుకొంది.తమ పిల్లల ఉన్నతస్థాయి..ఎదుటి పిల్లలకన్నా మరింత ఉన్నతంగా ఉండాలన్న ధ్యాసలో పిల్లలను స్వార్ధపూరితంగా వారి మనసులలో పోటీతత్వమును నింపుతున్నారు. తత్ఫలితం నేటి విద్యార్ధులు. రేపటి స్వార్ధహృదయులు. అన్నీ వారికే కావాలి. అన్నిటా వారే ముందుండాలి. లేకపోతే అసహనం ..కోపం. .విపరీత పరిణామాలు. అమ్మ అదిగో నాన్నగారొచ్చారు చూడు అంటూ చిన్నతనం నుండి నాన్న అంటే గౌరవముతోపాటు భయం భక్తిని తను చూపిస్తూ పిల్లలకు నేర్పించేది. నాన్న కూడా తన పిల్లలను మనసుతో దగ్గరికి తీసుకొనేవారు. కానీ పైకి గంభీరంగా విషయపాలన చేసేవారు. నాన్నగారిని ఏమైనా అడగాలంటే అమ్మద్వారానే సాధ్యం. ఆడపిల్లలను తండ్రి తల నిమిరి ఆశీర్వదించేవారు.అమ్మాయిలు ఎలా ఉంటే ఇంటా బయటా గౌరవంగా చూస్తారనేది... చిన్నప్పటి నుండి నాన్నగారు, సోదరుల అభిమానాల, అభిరుచుల, అభిప్రాయాల సమ్మేళనముతో... ఇంట్లో అమ్మ నాన్నతో మిగిలిన బంధువులతో ఎలా మసులుకుంటుందో ఎంత గౌరవ మర్యాదలను పాటిస్తుందో చిన్నప్పటినుండీ పిల్లలు గమనిస్తారు. ఆ సంస్కారము వారిలో కూడా దిన దిన ప్రవర్ధమానమౌతుంది. సమాజంలో వారు ఆ సంస్కారముతో అభివృద్ధి చెందుతారు. ఈ రోజులలో మనమే పిల్లలకు విదేశీ సంస్కృతి నేర్పుతున్నాము. సోషల్ మీడియా,  టీ.వీలు  ఈ మాధ్యమాల ద్వారా ఒకింత వేగంగా పిల్లలు మన సంస్కృతి సంప్రదాయలకు విలువలు తగ్గించేసారు. పేరుకి వాట్స్ ఆప్ లలో అన్ని పండుగలకు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారు. కానీ నిజంగా హృదయపూర్వకంగా ఆ పండగల విలువలను వాటి పారమార్ధాన్ని తెలుసుకొని ఆకళింపుచేసుకొని పాటిస్తున్నది ఎంతమంది? హాయ్! డాడ్.. హాయ్! మాం ..ఇవీ పలకరింపులు.. అమ్మా! అన్న పిలుపులో తీయదనం మిగిలిన పిలుపుల్లో వస్తుందా.. పల్లెటూళ్ళలో కొంతమంది ఇప్పటికీ ఎంతో ఆప్యాయంగా అమ్మా!, నాన్నగారండీ,అన్నయ్యా,  చెల్లీ, తమ్ముడూ, అక్కా! ఇలా పారవశ్యంగా పిలుచుకుంటారు. ఆ అనుభూతి ఎంతో హృద్యంగా ఉంటుంది. చెప్పడంలో కూడా వారిపై ప్రేమ ఆ మాటలలో కదలాడుతూ ఉంటుంది. మరి మనమో..పిలుపులు సరే!.. మనకే అధ్యాత్మిక విషయాలు అంతంత మాత్రంగా తెలుసు. చిన్న పిల్లలప్పుడు చెప్పడానికి సరైన అవగాహన లేదు. కనీసము ఇప్పుడైనా  అవే పిల్లలకి చెపుదామంటే వారికి వినే, చదివే ఆసక్తి లేదు. చెప్పాలంటే వారికి టైము సరిపోదు. ఈ ఉరుకుల పరుగుల సాఫ్ట్వేర్ ఉద్యోగాలతో వారు సతమతమవుతూ, మిగిలిన సమయాన్ని నిద్రకు సరిపెడుతున్నారు. సెలవు సమయాలలో విందు, వినోదాలకు సమయాన్ని కేటాయిస్తారు. కానీ విలువైన భక్తి విషయాలు తెలుసుకోవాలని కోరుకోరు. ఇప్పటినుండీ ఎందుకు? అన్న ఆలోచన..లైఫ్ ఎంజాయ్ చేయాలి. అన్న ఉద్దేశ్యముతో వారి విధానములలో వారు ఉంటారు. వాళ్ళు చేస్తున్నది తప్పుకాదు ఆ విధానమే కరక్టు అనుకుంటారు.  ఈ తరంలో చాలామంది తుదిదాకా పట్టువిడువకుండా ముందుకు సాగలేకపోతున్నారు. ఏవో సాకులతో నీరుగారిపోతూ ఉంటారు. ఆరంభశూరత్వంతో మధ్యలోనే విజయమార్గం నుంచి వెనుతిరుగుతూ ఉంటారు. దీనికి ప్రధానకారణం లక్ష్యసాధనలో ఏకాగ్రత కొరవడటం. పట్టుదల లేకపోవడం! 

 అమ్మా, నాన్న చెప్పేవి పాతతరం కబుర్లు.. ట్రెండు మారిపోయింది. అంటూ సినిమాల ప్రభావంతో కొత్త పదజాలాలు.. సరి కొత్త వ్యంగ్య బాణాలు.. ఇంట్లోనే మాట్లాడం ప్రారంభిస్తారు. వాటిని మనం కూడా మన పిల్లలు ఏది చేసినా ముద్దుగా పరిగణిస్తూ వారిని మరింత కలుషిత వాతావరణంలోకి నెడుతున్నాము. అన్నిటికీ కనెక్ట్ అయిపోతున్నారు. వారిని మార్చలేక మనం కూడా వారి బాటలో నడవడం ముదావహం.  




 "మానవ మేధస్సును ..అతడే సృష్టించిన కృత్రిమ మేధస్సు జయిస్తుంది." అని ఓ మహానుభావుడు చెప్పింది అక్షరాలా నిజమైంది. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ కి మనం అంతగా కనెక్ట్ అయ్యాము. ఉదయం ఫోన్   తోనే లేస్తాను.. మధ్యలో ఫోన్ చూసుకుంటాను. రోజంతా దానితోనే గడుపుతాను. అందరినీ అనే ముందు నేనే దానికి బానిసను. ఇది వైభోగమనుకుంటాము కానీ నాకైతే ఇది బలహీనత. మరి నాకే అలా ఉన్నపుడు యువతకు మరింత బలహీనత. ఎంతవరకు దాని అవసరమో అంతవరకు ఉపయోగించుకొని.. మన మానసిక దౌర్భల్యానికి లోనుకాకుండా దానికి మనకు విశ్రాంతి నివ్వడం ఎంతైనా అవసరం. 

ఇదివరకు సినిమాలు.. హాలు వరకే పరిమితం.. కానీ ఇప్పుడు ఇంట్లో, ప్రతి సంభాషణలలో ప్రతి వారి మధ్యా.. సినిమా కబుర్లు, అనుకరణలు.. ఒక్కో కుటుంబాన్ని చూస్తే ఒక సినిమా చూస్తున్న ఫీలింగ్..అలాంటి డైలాగులు ఉంటాయి వారి మాటలలో..   టు పోతోంది ఈ సమాజంలో నాగరికత.. మళ్ళీ ఎవరు వచ్చి నా సోదర సోదరీ మణులను, నా భరతమాత బిడ్డలను సంస్కరించాలి. నావంతు నేను ఏమి చేయాలి..నా పిల్లలను.. చుట్టూ ఉన్న నా అనుకున్న అందరికీ గొంతెత్తి మన సంప్రదాయాల  సంస్కృతికి , అమ్మా నాన్నలకి సముచిత గౌరవమిస్తూ, ఆధ్యాత్మికంగా మన పండగల వైశిష్ట్యాన్ని తెలియజేయడం.. నా విధి. తెలిసిన అనుసరిస్తున్న  జ్ఞానాన్ని నలుగురికీ తెలియజేయటం నా ధర్మం. మీరు  అంటే ప్రతి తల్లి,దండ్రి మీ కర్తవ్యాన్ని విస్మరించవద్దని నా మనవి.  జీవిత లక్ష్యాన్ని నిర్దేశించుకొని..ఆ లక్ష్యాన్ని సాధిస్తూ వాస్తవంలో జీవిద్దాం. యువతకు అదే నేర్పుదాం.స్పూర్తినిద్దాం.

 భరతావనికి అంజలి ఘటిస్తూ.............




4 comments:

అన్యగామి said...

నిరంతరం స్మరించుకోవలిసిన విషయాలు చక్కగా వ్రాసారు. మనలో స్వార్థబుద్ది తగ్గించుకొని పిల్లలకి ఆదర్శంగా బ్రతకడంగురించిన ప్రస్తావన బావుంది.

visalakshi said...

ధన్యవాదాలు అన్యగామిగారు..

LAKSHMI said...

DHANYA VADALU

Unknown said...

ధన్యవాదాలు