Thursday, April 20, 2017 By: visalakshi

ఆది వరాహస్వామి అవతార వైశిష్ట్యం

  ఓం నమో భగవతే వాసుదేవాయ నమో నమ:

 పరమాత్మ-అంతర్యామి పోస్ట్ లో రెండవ అవతారమును వివరించమని ఇద్దరు మిత్రులు కోరారు..వారి అభీష్టము మేరకు నా ఈ వివరణ....

 భూమి మొదట పాతాలగతమై ఉన్నది. దానిని పైకి తెచ్చి యధాస్థితిలో నిలిపితేగానీ సృష్టిని ప్రారంభించుటకు వీలుగాదు. భగవంతుడు వరాహావతారమెత్తి భూమిని ఉద్ధరించినాడు. "వర" అనగా శ్రేష్ఠమైనది. "అహము " అనగా దినము అని అర్ధము. "వరాహము" అనగా శ్రేష్ఠమైన దినము అని అర్ధము. ఏ దినమున సత్కర్మ జరుగునో, భగవద్గుణము ఏ రోజున హృదయమునకు హత్తుకొనునో ఆ దినమే శ్రేష్ఠమైన దినము. లోభగుణమును హరించేవాడు వరాహమూర్తి.






 శ్రీమహావిష్ణువు ఆదివరాహస్వామిగా అవతరించి భూదేవిని రక్షించి తిరుమలలో నిలిచాడు.  తిరుమల క్షేత్రంలో వెలసిన మొట్టమొదటి దైవం శ్రీ వరాహస్వామి. అందువల్లనే "తిరుమల" ఆదివరాహక్షేత్రమని ప్రసిద్ధి పొందింది. తిరుమలలో శ్రీస్వామి పుష్కరిణికి వాయువ్యమూలలో తూర్పుముఖంగా శ్రీవరాహస్వామి ఆలయం ఆది వరాహ క్షేత్రముగా ప్రసిద్ధి పొందింది. కలియుగములో శ్రీనివాసుడు వైకుంఠం నుండి ఇక్కడకు వచ్చి తాను ఉండడానికి శ్రీవరాహస్వామివారిని 100 అడుగుల స్థలాన్ని దానంగా అడిగాడు. "ప్రధమ దర్శనం, ప్రధమ పూజ, ప్రధమ నైవేద్యం " అను నియమ ఒప్పందంతో దానపత్రం రాసిచ్చి, 100 అడుగుల స్థలాన్ని దానంగా శ్రీనివాసుడు పొందినాడు. ఆ తర్వాతి కాలంలో ఆ క్షేత్రంలో భక్తకోటి నీరాజనాలతో తన ప్రాబల్యాన్ని పెంచుకున్నాడు శ్రీవేంకటేశ్వరస్వామి. ప్రస్తుతం ఆనాటి నియమం ప్రకారమే నేటికీ తిరుమలలో శ్రీభూవరాహస్వామికి తొలిగా పూజా నివేదనాదులు అన్నీ సక్రమంగా జరుపబడుతున్నాయి. అంతేగాక శ్రీవరాహస్వామివారికి వలసిన నివేదనలు, పూజాసామాగ్రి, వగైరాలన్నీ శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయం నుండే నేటికీ పంపబడుతుండటం గమనింపదగిన విశేషం. 

వరాహస్వామి ఆలయం ముఖమండపం, అర్ధమండపం, అంతరాళం, గర్భాలయం అని నాలుగు భాగాలుగా నిర్మింపబడింది.గర్భాలయం మధ్యలో సుమారు ఒక అడుగు ఎత్తుగల శిలావేదికపై సుమారు రెండడుగుల ఎత్తుగల శ్రీ భూవరాహస్వామివారి శిలావిగ్రహం ప్రతిష్ఠింపబడివుంది. అదిగో! పై రెండు చేతుల్లో శంఖ చక్రాలు, ఎడమ తొడమీద భూదేవిని కూర్చొనబెట్టుకున్నట్లుగా ఉన్న, ఊర్ధ్వపుండ్రధారియైన శ్రీవరాహస్వామిని కన్నులారా దర్శించండి. 




  
వరాహస్వామిదగ్గర ఉన్న సుమారు ఒక అడుగు చతురస్రాకార రాగి పలకయంత్రాన్ని తిలకించండి! అది శ్రీవేంకటేశ్వరుడు శ్రీవరాహస్వామికి వ్రాసి ఇచ్చిన దాన పత్రమని చెప్పబడుతున్నది. దానిమీద బ్రాహ్మీ లిపిని పోలిన వ్రాత ఉన్నది. శ్రీవరాహస్వామికి ప్రత్యేకంగా ధ్వజస్తంభం లేదు. అందువల్ల వారికి ప్రత్యేకంగా ఉత్సవాలు నిర్వహింపబడటం లేదు. అంతేగాక శ్రీవేంకటేశ్వరస్వామివారి జన్మనక్షత్రం, శ్రీవరాహస్వామివారి జన్మనక్షత్రం కూడా శ్రవణమే. ఇద్దరూ ఒక్కరే కాక అభిన్నులుగా అయినందువల్ల శ్రీవేంకటేశ్వరస్వామికి జరుగుతున్న ఉత్సవాలన్నీ ఈ వరాహస్వామివారికి జరిగినట్లేనని భావింపవలసియున్నది. 

క్రీ.శ 1800 ప్రాంతంలో ఈస్టిండియా కంపెనీ, ఆదాయం  అతి తక్కువగా ఉన్న శ్రీవరాహస్వామి ఆలయాన్ని పర్యవేక్షించుటకు నిరాకరించినందువల్ల శిధిలావస్థకు గురైంది. తరువాత 1900 ప్రాంతంలో దేవస్థానం అప్పటి అధికారియైన మహంతు ప్రయాగదాసు శిధిలమైన వరాహస్వామి ఆలయం నుండి వరాహస్వామి మూర్తులను సేకరించి, శ్రీవేంకటేశ్వరస్వామివారి ఆలయంలోని ఇప్పటి అద్దాల మండపంలో భద్రపరచారు. ఆ తర్వాత 10ఏళ్ళకు శిధిలమైన వరాహస్వామి ఆలయాన్ని ప్రత్యేక శ్రద్ధతో, భక్తితో పునరుద్ధించి, వరాహస్వామిని మహంతుప్రయాగదాసు పున: ప్రతిష్టించాడు. అప్పటినుంచి ఈ ఆలయపాలనా శ్రీవేంకటేశ్వరుడే చూస్తున్నాడు. ఇటీవల శ్రీవరాహస్వామి ఆలయానికి మహాసంప్రోక్షణ జరిగింది. శ్రీస్వామి మూలవరుల వేదిక ఎత్తును పెంచడం, స్వామివారి చుట్టూ బంగారు మకర తోరణం అమర్చడం, ఆలయంపై పెద్ద విమాన నిర్మాణం, బంగారు కలశస్థాపన వంటి కార్యక్రమాలు ఘనంగా జరుపబడ్డాయి.

క్షేత్ర సంప్రదాయము ప్రకారం భక్తులు ఈ వరాహస్వామిని తొలుత దర్శించుకొని తదుపరి వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటారు.  తానే మళ్ళీ అనంతకాలంలో ఇక్కడే ఈ క్షేత్రంలోనే శ్రీవేంకటేశ్వరునిగా వెలుగొందుతూ భక్తుల కోరిక లీడేరుస్తూ ఉన్న శ్రీ శ్వేత వరాహస్వామివారిని ఒక్కసారి ఇలా ప్రార్ధిద్దాం!     

 వరం శ్వేతావరాహాఖ్యం స  సంహారం ధరణీధరం
 స్వ దం ష్ట్రాభ్యాం ధరోద్ధారాం శ్రీనివాసం భజే2 నిశం.




శ్రేష్ఠమైన అవయవాలతో విరాజిల్లేవాడును, భూదేవిని హరించిన హిరణ్యాక్షుని సంహరించినవాడును, తన కోరలచే భూమిని ఉద్ధరించినవాడును, శ్వేతవరాహుడును అయిన శ్రీనివాసుని ఎల్లప్పుడు భజింతునుగాక!

             గోవిందా!**గోవిందా!**గోవిందా!**గోవిందా!**గోవిందా!  


 సర్వం శ్రీసాయినధార్పణ మస్తు











0 comments: