Sunday, April 23, 2017 By: visalakshi

జీవనశైలి-విధానం

ఒక కుటుంబములో నలుగురు సభ్యులుంటే ఆ నలుగురి మనస్తత్వాలు ఒకే రీతిలో ఉండవు. విభిన్న అభిరుచులు అభిప్రాయాలు ఉంటాయి. కానీ ప్రముఖ నిర్ణయాలకు మాత్రము సంప్రదింపులతో ఏకాభిప్రాయముతో ఒక నిర్ణయము తీసుకొని అమలుపరుస్తారు. అలాగే  ఒకరికొకరు అని మమేకమై మైత్రీ భావనతో ఉన్న ఇద్దరు ప్రాణ మిత్రుల అభిప్రాయాలు కూడా ఒకేలా ఉండాలని లేదు. అభిరుచులు అసలు కలవకపోవచ్చు. వారి జీవన విధానము కూడా భిన్నంగా ఉండవచ్చు. వారి ఆలోచనా శైలి వేరుకావచ్చు. కానీ వారు  .. ఒకరి ఆలోచనలను ఒకరు గౌరవిస్తారు. ఒకరి అభిప్రాయలకు ఒకరు విలువనిస్తారు. ఇరువురి ఆలోచనా శైలిని ఒకరితో ఒకరు పంచుకుంటారు.   







కుటుంబములో కలతలూ కలహాలు సహజము. కానీ ప్రేమతో అవన్నీ సమసి పోయేలా మనం మలచుకుంటాము. మైత్రిలో అసలు కలతలూ, కలహాలు రాకూడదు. వచ్చినా ఆ ఇద్దరిలో ఏ ఒక్కరైనా సమర్ధవంతంగా వాటిని దూరం చేసి మనసుతో, మమతను తెలిపి మనసుకు హత్తుకునే మాటలతో మధుర భావనను ఆ స్నేహములో నింపాలి.  ఒక కుటుంబం, స్నేహం, బంధములను 
ఏకాభిప్రాయముతో ఎలా సత్సంబంధాలను నెలకొల్పుకుంటున్నామో... అలాగే మన భారతదేశంలో మత సంబంధమైన ఆదర్శాలు వందల శతాబ్దాలుగా ప్రభవిస్తున్నాయి. మనం  ఆదర్శాల మధ్యన పుట్టి పెరుగుతున్నాం. ఇవి మన రక్తంలో ప్రవేశించి, నరాల్లో స్పందిస్తూ, శరీరతత్వంలో ఒక భాగమై, మన జీవనశక్తిగా మారిపోయాయి. 





మన భారత హృదయం మతభావ పూరితం. ఆ తరువాతే మరొక దానికి స్థానం. మన ప్రాణాధారమైన రక్తం ఆధ్యాత్మికత.ఈ ప్రాణాధార రక్తం స్వచ్చంగా, బలంగా, శక్తిసంపన్నంగా ప్రవహిస్తే చాలు. రాజకీయ, సాంఘీక ఇతర ప్రాపంచిక లోపాలన్నీ, చివరికి మన దేశ దారిద్ర్య చిహ్నాలన్నీ కూడా చక్కదిద్దబడుతాయి. రాజకీయమైనా, సాంఘీకమైనా ఏదైనా సరే ప్రబోధించదలుచుకుంటే దానికి కావలసిన ఒకే అంశం - ఆధ్యాత్మికశక్తి ఎంతగా ద్విగుణీకృతమవుతుందో చెప్పాలి. ఏ ఇతర జ్ఞానమైనా మనబాధలను స్వల్ప వ్యవధి వరకే తొలగించగలదు. శాశ్వతంగా మన బాధలను తొలగించగలిగేది ఆధ్యాత్మిక జ్ఞానమొక్కటే." మత భావాలను భగ్నపరచకుండా సామాన్య ప్రజల సముద్ధరణాన్నే మన లక్ష్యంగా మన ముందుంచుకోవాలి".




 మంచి విషయం ప్రతిదీ ఇతరులనుండి నేర్చుకోవాలి. కానీ దాన్ని స్వీకరించి, నీ సహజ శైలిలో ఆకళింపు చేసుకోవాలి. మనం ఇతరులలా మారిపోకూడదు. మన భారతీయ జీనంలోంచి బయటకు రావడానికి అంగీకరించవద్దు. భారతీయులందరూ వేరే జాతులలా వేషం ధరించి, భుజించి, ప్రవర్తిస్తే భారతదేశ స్థితి ఏదో బాగుపడిపోతుందని ఒక్క క్షణం పాటైనా అనుకోకండి. పిరికితనంతో కూడిన అనుకరణ మనిషి పతనానికి ప్రత్యక్షచిహ్నం.  అవన్నీ పై పై మెరుగులే అని గుర్తించి మన భారతీయ జీవనశైలిని, ఆ విధానాన్ని గౌరవించి అనుసరించండి. మన హిందూ ధర్మాన్ని నిర్వర్తించి అభ్యుదయాన్ని సాధించండి.



 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు..

0 comments: