Wednesday, October 25, 2017 By: visalakshi

వ్యక్తిత్వ ధర్మం



 శ్లో" చతుర్విధా భజంతే మాం జనా స్సుకృతినో2 ర్జున !
     ఆర్తో జిజ్ఞాసు రర్ధార్ధీ జ్ఞానీ చ భరతషభ ! !!(7అ - 16శ్లో)

సుకృతులు, దుష్కృతులు అని లోకంలోని జనులను స్థూలంగా రెండు రకాలుగా విడదీసాడు పరమాత్మ. 

దుష్కృతులు - అత్యాశాపరులు ....


మనిషికి కోరికలు అనేకం. ఆ కోరికలే తోటివారిని నిందించేట్టు, లేదా హింసించేట్టు అనేక సందర్భాలలో వారిని  నిర్మూలించేటట్టు కూడా చేస్తూ ఉంటాయి. మనిషిలో ఉండే అత్యాశే  తన తోటి వారిని హింసించడానికి కారణమవుతోంది. ప్రతీ వస్తువును తయారుచేయడంలో పొటీతత్వంతో ఒకరిని మించి ఒకరు చేయాలన్న తాపత్రయంలో మనిషి సాగించే ప్రయత్నాలు ప్రకృతిని పాడుచేస్తున్నాయి.... పట్టెడన్నం కోసం పరితపించే వారినీ చూస్తున్నాం.... బస్తాలు బస్తాలు ఆహారధాన్యాల్ని పట్టుకెళ్ళి సాగరంపాలు చేసే దేశాల్నీ మనం చూస్తున్నాం. కోరిక ఉండాలి కానీ ఇంకొకరిని అధిగమించి స్వార్ధంగా తాను మాత్రమే ఎదగాలన్న చింతనతో అత్యాశాపరుడు కావటం తప్పు. తాను చేసే కార్యాలు తన తోటి ప్రాణకోటిని, ప్రకృతినీ హింసించని రీతిలో సాగాలి. తనను తాను ఆత్మవినాశనము చేసుకోని రీతిలో సాగాలి. 

మంచి మార్గంలో బతకడానికి భగవంతుని అనుగ్రహాన్ని కోరు. ఆయన అనుగ్రహిస్తాడు. అయితే మన కోరికలను బట్టి ఆయన పరీక్షలూ ఉంటాయి.  కావలసినవి కోరుకున్నా మనకు తగినవి అందిస్తాడాయన. మనకు హాని కలిగించని కోరికలను ఆ పరంధాముడు తీర్చి తన అనుగ్రహాన్ని మనకందిస్తాడు. పిల్లల కోరికకై తల్లిదండ్రులు ఎంత ఆతృత పడతారో లోకపిత అయిన భగవంతుడు కూడా మన విషయంలో ప్రేమతో అంత తపనా పడతాడు. అలాంటి జగత్పితను మనం ఏది కావాలన్నా అడగవచ్చును. ఏది తగునో అది మనకు తప్పక అనుగ్రహిస్తాడు.

మా కోరికలు తీర్చుటలేదు. అన్నీ కష్టాలే ఏ రూపంలో పూజించినా, ఎన్ని పండగలు చేసినా మాకు కష్టాలే..   పరమతంలో అందరూ సుఖంగా ఉన్నారు. కాబట్టి ఆ మతం తీసుకొని వెళ్ళిపోదాము అని చాలామంది ఏసు ప్రార్ధనలోకి మారతారు. మరి అప్పుడు కష్టాలు లేవా.. రావా.. వారి కర్మలు మారిపోయాయా..అంటే అదేమీ ఉండదు.. కానీ భ్రమలో మేము ఈ మతం తీసుకున్నాక చాలా సంతోషముగా ఉన్నాము.. మాకు ఎటువంటి కష్టాలు లేవు అని వారిని వారు మభ్యపరుచుకుంటారు. "ఏ మతం గానీ వారు కొలుస్తున్న వారి దైవం కానీ ఇతర మతస్తులను విమర్శిస్తూ మతమార్పిడులు చేయమని  చెప్పలేదు." ఏసుప్రభువు అంటే ఒక పవిత్ర ఆరాధన.. మహమ్మద్ ప్రవక్త అంటే ఒక పవిత్ర ఆరాధన మన హిందూ ప్రజలలో ఉంది. అలాగే వారికీ మన హిందూదేవతలపై, ధర్మాలపై మన పవిత్ర గ్రంధాల పై ఆరాధన ,గౌరవం ఉండాలి. అది కొద్దిమందిలో మనం చూస్తాం. కానీ ఎక్కువ శాతం అజ్ఞానంతో మతమార్పిడులకు పూనుకుంటున్నారు. దీనిని మనం ముక్తఖంఠంతో ఖండించాలి. ఇందుకు నేను సైతం ..అంటాను. కానీ వారి ధోరణిలోనే మనమూ వారిని విమర్శించడమూ ..విశ్లేషించడమూ అనవసరము. మన గొడవలను భగవంతుడికి ఆపాదించరాదు. హిందూ సంప్రదాయాలకు అర్ధం పరమార్ధం ఉన్నాయి. హిందూ కట్టుబాట్లకు క్రమశిక్షణ ఉంది. ప్రతి పండుగ వెనకాల ఒక ప్రబోధం ఉంటుంది. హిందూ పండగలను దేవతలను వ్యంగ్యముగా మాట్లాడితే  మనం సహించవలదు. పరమత సహనం అంటే గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి. "నమ్మకము"(Faith) అన్నది పుట్టిన హిందూత్వం పైనే లేకపోతే ఆ "నమ్మకం" వేరే మతం తీసుకున్నపుడు ఎలా వస్తుందో నాకు అర్ధం కాదు.      





సుకృతులు, దుష్కృతులు అని లోకంలోని జనులను స్థూలంగా రెండు రకాలుగా విడదీసాడు పరమాత్మ. 

నన్నుకోరి నా నుంచి పొందగోరేవారు సుకృతులు. అలా నా నుంచి పొందగోరేవారు 1. ఆర్త:,2. జిజ్ఞాసు:, 3.అర్ధార్ధీ, 4. జ్ఞానీ. 

ఆర్త: -ఒకనాడు సంపద వైభవాలు ఉండీ దురదృష్టవశాత్తు పోగొట్టుకొని తిరిగి పొందాలని కోరుకునేవాడు.. అర్ధార్ధి - తన వద్దలేని కొత్త సంపద వైభవాలు కోరుకునేవాడు. వీరిద్దరూ ఒకలాంటివారే. ఇలాంటి లౌకిక సంపదలు కాక జ్ఞానస్వరూపమైన ఆత్మని దర్శింపగోరువాడు జిజ్ఞాసువు. అంటే ఆత్మసాక్షాత్కార కాముడు అని అర్ధం.  జ్ఞానము కల ఆత్మ కూడా భగవంతుని వస్తువే కనుక అది మనకు స్వయంగా ప్రకాశించాలన్నా స్వామి అనుగ్రహిస్తేనే అవుతుంది తప్ప మన సాధన వలన కాదు.  కనుక జిజ్ఞాసువు అయిన వ్యక్తి కూడా పరమాత్మునే ఆశ్రయించాలి. ఇక జ్ఞానీ అంటే జ్ఞానము పూర్తిగా కలవాడు. జ్ఞానం పూర్తిగా లభిస్తే ఆత్మ స్వరూపం తెలుస్తుంది. ఆత్మ స్వరూపం తెలిస్తే దానికి నియంతగా ఉన్న పరమాత్మ స్వరూపం తెలుస్తుంది. అలా జగత్కారణమై సర్వనియంతయై, ఆత్మ లోపల ఉండి నడిపే శ్రీకృష్ణుని అధీనమే జీవుడని తెలియడమే జ్ఞానమంటే. జ్ఞానం కలవాడు అంటే పరమాత్మకి దాసుడుగా ఉన్నవాడు అనే అర్ధం. 

ధర్మంగా మంచి ఆశయాలను తీర్చమని భగవంతుని కోరండి. భగవంతుడు తప్పక తీరుస్తాడు.మన ఆశలన్నీ ఆలోచించి తగిన రీతిలో నెరవేరుస్తాడు. ఆయన అనుగ్రహించినవి ఆనందంతో స్వీకరిద్దాం. వ్యక్తిత్వాన్ని నమ్ముకుందాం. తద్వారా భగవంతుని అశీస్సులు పొందుదాం. ఇక్కడ ఒక ఉదాహరణ:- సోదరి నివేదిత జీవితం గురుభక్తికి ప్రతీక. భారతదేశ వాతావరణం, ఆచారవ్యవహారాలు, సాంఘీక కట్టుబాట్లు తెలియని ఆవిడ వివేకానంద స్వామికి శిష్యురాలై..మార్గరేట్ "నివేదిత"గా మారారు. అంటే భగవంతునికి నివేదింపబడినదని అర్ధం. ఆవిడ భారత ప్రజల సేవలో స్వచ్చందంగా తనను తాను నివేదించుకొని తన పేరును సార్ధకం చేసుకొంది. పాశ్చాత్యులు భారతీయులను ఎంత చులకన చేశారో, ఎంత అణగద్రొక్కే ప్రయత్నం చేశారో ప్రత్యక్షంగా ఆమె చూసారు. భారతీయులకు కావలసినది పాశ్చాత్య విద్య కాదు..భారతీయ చరిత్ర, సంస్కృతి, భాష అని గ్రహించారు. మాతృభాషలో పదాలుండగా ఇంగ్లీషు వాడడం ఎందుకు? అని ఖండించారు నివేదిత. భారతదేశం గురించి, ఇక్కడ తన అనుభవాల గురించి ఆమె అనేక పుస్తకాలు వ్రాసారు. హృదయాలను కదిలించే ఎన్నో గాధలు భారతీయ చరిత్రలో ఉన్నాయి. చిత్రించడానికి ఎన్నో భారతీయ కళాఖండాలు ఉండగా విదేశీ అనుకరణ ఆమెకు ఏమాత్రం నచ్చలేదు. పురాతన భారతీయ కళలను పునరిద్ధరించాలని ఆమె ప్రగాఢంగా ఆకాంక్షించారు. ఆమె  మనదేశ స్వాతంత్ర్య దిశలో సమైక్యతా దిశగా విశేష కృషి సలిపారు. నివేదిత ఆధ్యాత్మికంగా సేవలందిస్తూ రామకృష్ణ, వివేకానందులకే తన జీవితాన్ని అంకితం చేసారు. 
సోదరి నివేదిత భారతీయ సంస్కృతి ప్రాముఖ్యమును ప్రాచుర్యము చేశారు. కానీ మనలో కొందరు మన సంస్కృతిని విమర్శించడం శోచనీయం. 

భగవద్గీతలో శ్లోకానికి అర్ధాన్ని ఊటంకిస్తూ భారతీయ హిందూ సంస్కృతి పరి రక్షణ మన ధర్మం.  అని తెలియజేయుటయే ఈ పోస్ట్ సారాంశము.


 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు  


3 comments:

prabha said...

Post chala bagundi alage yuvakulaku alochana leka tamanu tamu tarkinchu konutaku vealuga undi. Nijame mana meada manaku nammakamu sampradayalu meada gouravamu roju roju ki attadugu ki velli pothundi. Paramatma ante emiti evaru? Ante na drushti lo manamu viswasinche amma nannalu ki inko roopamu. Iddaru thama pillalanu ela rakshana kalpinchi variki kavalisanadi amarchi pedtharo alane paramatma Leda oka sakthi daniki manamu manamu ishtamaina perlu pettukoni piluchukuntamu. Devudu adigina adagaka poyina mana sradha saboori valla mana jhole lo vestharu. Ika pothe vere mathasthula gurinchi nenu peddaga matladanu endukanaga naku antha gnanamu ledu kani na chinnappati nunchi chusindi emiti ante oka oorilo oka gudi Unte ela ledanna oka padi families danimeada brathuku thayi inthakana manava (madhava)seva inkoti untunda ani nenu aduguthunnanu.

visalakshi said...

ప్రభ తన స్పందనను ఇలా చెప్పారు..
టపా చాలా బాగుంది. యువతకు ఆలోచనలు రేకెత్తించి, తమని తాము తర్కించుకొనే విధంగా ఉంది. నిజమే! మన సంస్కృతి మీద నమ్మకము, సాంప్రదాయాల మీద గౌరవము రోజు రోజుకీ అట్టడుగుకి వెళ్ళిపోతున్నాయి.పరమాత్మ అంటే నా దృష్టిలో తల్లిదండ్రులకు ప్రతిరూపం. పిల్లల రక్షణ తల్లిదండ్రులు ఎలా కల్పిస్తారో అలా అడిగినా అడగకపోయినా పరమాత్మ మన 'శ్రద్ధ,సబూరీ ' ల వలన మనకు తగిన రక్షణను, సహాయాన్ని మన జోలెలో వేస్తారు. ఇతర మతస్తుల గురించి మాట్లాడగలిగే అవగాహన నాకు లేదు కానీ నా చిన్నప్పటి నుండీ చూసినది ఏమిటంటే ఒక ఊరిలో ఒక గుడి ఉంటే 10 కుటుంబాలు దాని మీద బ్రతుకుతాయి. ఇంతకన్నా (మాధవసేవ)మానవసేవ ఉంటుందా.. అని తన స్పందనలో తెలిపారు......స్పందనకు ధన్యవాదాలు ప్రభా!..

రుక్మిణిదేవి said...

Excellent... Parah ante malinam lenidi.. Shuddamainadi.. Aatma emito telisinade.. Shuddamaina aatma galavaadu bhagavantudu.. Tallidandrulanu paramaatmulu antaaru anduke.. Pillalo kosam edainaa cheyagalaru..dhanyulamu Veda Sri garu...