Thursday, February 13, 2025 0 comments By: visalakshi

శుద్ధ భక్తి...

 


#శుద్ధ భక్తికి ముగ్ధుడైన పూరి జగన్నాథుడు ....

[కళ్ళలో ఆనందభాష్పాలు తెప్పించే కృష్ణుడి లీల] ...

  

బంధు మహంతి అతని భార్య , ఇద్దరు మగపిల్లలు భోజనం చేయక 2 రోజులు అయ్యింది. వర్షాలు లేక  కరువుకు బలి అయిన పేద కుటుంబం అతనిది. ఒడిషాలోని కటక్ మరియు బాలాసోర్ మధ్య వున్న జాజ్పూర్ లో భిక్షమెత్తుకొని  వచ్చిన కొంత అన్నాన్ని పిల్లలకు పెట్టి తాను  తన భార్య ఇంకా మిగిలివున్న చెట్ల యొక్క ఆకులు తింటూ బ్రతుకుతున్నాడు బంధు మహంతి. 


భార్య కంట తడిపెట్టినప్పుడల్లా బంధు ఇలా అనేవాడు '' ఏడవకు. నాకు పూరి నగరంలో ఒక ధనవంతుడైన స్నేహితుడున్నాడు. చాలా మంచివాడు. ఎవరు ఏ సహాయం అడిగినా అతను కాదనడు. మనకూ అతను సహాయం చేస్తాడులే''. 


ఒకరోజు భార్య ''మనం మీ  స్నేహితుడిదగ్గరికెళ్ళి మన దీనావస్థను చెప్పుకొందాం. ఇంకా ఆలస్యం చేస్తే పిల్లలు చనిపోతారు , '' అంటే బంధు మహంతి భార్య  పిల్లల్ని తీసుకొని  144 కి.మీ. దూరం లో వున్న పూరి నగరానికి బయలుదేరాడు. మధ్య దారిలో అడవి వస్తుంది. 


1530 వ సంవత్సరం లో నాలుగురోజులు కాలినడకన ప్రయాణించి బంధు మహంతి పురి నగరం చేరాడు. రాత్రి అయ్యింది. '' ఇపుడు నా స్నేహితుడు నిద్ర పోతుంటాడు. నిద్రా భంగం చేయడం మంచిది కాదు. ఉదయం ఆయన ఇంటికి వెళదాం '' అన్నాడు బంధు.


ఆమె సరే అంటూనే '' ఇపుడు పిల్లలకు తినడానికేమీ లేదు. వాళ్లు ఆకలికి ఏడుస్తున్నారు '' అని అంటే అపుడు బంధు '' చూడు , మనం ఇపుడు పూరి జగన్నాథుడి మందిర ప్రాంగణంలోవున్నాం. గుడి తలుపులు మూసేసారు అయినా ఒకసారి ఆ తలుపులనే చూసి వద్దాం అంటూ భార్యా పిల్లల్ని తీసుకొని ద్వారం బయటే నిలబడి కృష్ణ భగవానుడిని ప్రార్థించాడు . ఆరాత్రి అతను చేసిన ప్రార్థన ఎంత గొప్పదంటే సమస్త పురాణాల సారమంతా అందులో వుంది :  


'' ప్రభూ , నేను నీ భక్తుడిని . నీవు తప్ప నాకు ఎవరు దిక్కు ? నేను కటిక పేదవాడిని. నేను ఆకలితో వున్నాను. అయినా నాకు బాధ లేదు. కానీ నా భార్య , పిల్లలు ఆకలితో మరణిస్తారేమో. నేను ఇన్ని రోజులూ నా భార్యకు 'నాకో స్నేహితుడున్నాడు, అతను మనకు సహాయం చేస్తున్నాడు' అని చెపుతూ వస్తున్నాను. 


కానీ ఆమెకు తెలియదు నీవే ఆ స్నేహితుడని. ఇపుడు వాళ్ళ ఆకలి తీరలేదు, ఏ సహాయం అందలేదు అనుకో, ఆమెకు నీవు వున్నావు అనే విశ్వాసం పోతుంది. నేనది భరించలేను. నా మాటలు నమ్మి నీమీద నమ్మకం పెట్టుకొన్న ఆమెను నిరాశ పరచొద్దు. నీవు వున్నావు , నీవు ఇదంతా చూస్తున్నావు. ఇది నా నమ్మకం. ఆతరువాత నీ ఇష్టం. '' 


వాపసు వచ్చి ఆలయ ప్రాంగణంలో కుండల్లో పెట్టిన నీరు త్రాగి అక్కడే పడుకొన్నారు. మధ్యరాత్రి అయ్యింది. ఒక వ్యక్తి వచ్చాడు. ఆయన బ్రాహ్మణ రూపంలో వున్నాడు. బంధు మహంతి భార్య కళ్ళు మూస్కొన్నది కానీ నిద్రపట్టలేదు. చిన్నగా చప్పుడైతే లేచి కూర్చొంది. ఆ బ్రాహ్మణుడు ఒక పెద్ద పళ్ళెంలో కమ్మని పదార్థాలను ఆమె ముందు పెట్టాడు. ఆమె భావోద్వేగంతో పళ్ళెం అందుకొన్నది. ఆయన వెళ్ళిపోయాడు. 


ఆమె బంధును, పిల్లల్ని నిద్రలేపి 'ఒక బ్రాహ్మణుడు వచ్చి ఇది ఇచ్చిపోయాడు ' అని చెప్పింది. బంధు అన్నాడు 'నేను చెప్పాను కదా? నా స్నేహితుడు చాలా మంచివాడు అని. అతనే పంపివుంటాడు.' ఆ రాత్రి జగన్నాథుడే స్వయంగా అందించిన ఆహారాన్ని ఆ పేద భక్త కుటుంబం సంతోషంగా తిని , ఆ పళ్ళాన్ని కడిగి గుడ్డ సంచిలో పెట్టి నిద్ర పోయారు. 


కథ అయిపోయిందా? లేదు . ఇపుడు మొదలౌతుంది. 


తెల్లవారింది. జగన్నాథ దేవాలయం అర్చకులు మందిరం తలుపు తెరచి , స్వామి విగ్రహానికి నీళ్ళతో అభిషేకించి , అలంకరించబోతుంటే అక్కడుండాల్సిన బంగారు పళ్లెం లేదు. నిమిషాల్లో వార్త అందరికీ తెలిసిపోయింది.   ఇంతలో ఆలయంలో పనిచేసే ఒక వ్యక్తి బంధు దగ్గర బంగారు పళ్ళెం వుండటాన్ని చూసి , అధికారులకు చెప్పాడు. 


వాళ్ళు అర్చకులతో కలిసివచ్చి బంధును పట్టుకొని కొట్టడం మొదలుపెట్టారు. బంధు  ఏమీ మాట్లాడటం లేదు. కళ్ళు మూసుకొని దెబ్బలు తింటూనే మనసులో ' నేను దొంగను అని వీళ్లు నన్ను కొట్టినంతమాత్రాన, నీపై నాకున్న నమ్మకం పోతుందా? నీవు వున్నావు, ఇదంతా చూస్తున్నావు ' అని జగన్నాథుడైన  కృష్ణుడితో అంటున్నాడు. 


అతని భార్య మాత్రం ఏడ్చుకొంటూ ' ఆయన్ని కొట్టకండి. ఆయనకు ఏమీ తెలియదు. నిన్నరాత్రి ఒక  బ్రాహ్మణుడు వచ్చి ఈపళ్ళెంలో నాకు ఆహారం ఇచ్చి వెళ్ళిపోయాడు. మేము దొంగలం కాదు,'' అని  అంటున్నా వాళ్ళు వదల్లేదు. బంధును తీసుకెళ్లి జైల్లో పెట్టారు. ఆలయప్రాంగణంలో ఒక చెట్టు క్రింద ఏడ్చి ఏడ్చి పిల్లలను గుండెలకు హత్తుకొని బంధు భార్య సొమ్మసిల్లి పడిపోయింది. 


రాత్రి అయ్యింది. పూరి నగరంలోవున్న అప్పటి రాజు ప్రతాపరుద్రుడికి మధ్యరాత్రి ఒక కల వచ్చింది. '' అక్కడ నా భక్తుడు చెరసాలలో బాధపడుతుంటే , ఇక్కడ నీవు హాయిగా నిద్రపోతున్నావా ? అతను నాకు నిజమైన భక్తుడు. అతను నిరపరాధి. అతనికి బంగారు పళ్ళెంలో ఆహారాన్ని ఇచ్చింది నేనే , '' అని స్పష్టంగా ఎవరో చెప్పారు. ఆయన కాక ఇంకెవరు చెప్పివుంటారు ?


ఆ క్షణమే ప్రతాపరుద్రుడు జగన్నాథ మందిరానికి వెళ్ళి , అధికారులందరినీ రమ్మని ఆదేశించాడు. బంధు భార్య గురించి అక్కడివారు రాజుకు చెప్పారు. వారినీ అక్కడికి తీసుకురండి చెప్పి , స్వయంగా ప్రతాపరుద్ర రాజే జైలు గదికి వెళ్ళి , తాళాలు తీయించాడు. ఆ తరువాత ఆయన చేసిన పని అక్కడున్న వారిని దిగ్భ్రాంతికి గురిచేసింది. 


ఒడిషా మహారాజు అయిన ప్రతాపరుద్రుడు ,  బంధు మహంతి కాళ్ళకు సాష్టాంగ ప్రమాణం చేసాడు. అంతే కాదు , అక్కడిక్కడే బంధు మహంతిని పూరి జగన్నాథ మందిరపు వంటశాలకు ప్రధాన వంటవాడి గా నియమించాడు. అదొక్కటే కాదు , బంధు మహంతి కుటుంబానికి జగన్నాథ  దేవాలయం యొక్క ప్రధాన వంటవాళ్ళు గా శాశ్వత హక్కులు కల్పించాడు.ఇప్పటికీ బంధు మహంతి కుటుంబమే 494 సంవత్సరాలుగా జగన్నాథ దేవాలయంలో వంటపనిని నిర్వహిస్తున్నారు.


నమ్మక బాగుపడినవారు.. లేరు .. నమ్మి చెడినవారు లేరు.

.

..జై.. జగన్నాధ్ ....

నేటి వివాహవ్యవస్థ ....

                           ఓం శ్రీ మాత్రే నమః...


                                

                                    వివాహం....

బంధువులు.. ఆప్తులు...మిత్రుల సందడితో..ముక్కోటి దేవతలు ఆశీర్వాదం తో వేదోచ్ఛారణ మంత్రాలతో... భాజా భజంత్రీలతో అపురూపంగా జరిగే పెళ్లి వేడుక...నూతన వధూవరులు కోటి ఆశలతో ఒకటయ్యి...సంసారం లోకి అడుగిడుతున్నారు... ఇంత వరకు సజావుగా సాగిన వీరి జంట చిన్న చిన్న తగవులతో. మొదలయ్యి...తారాస్థాయికి గొడవలు జరుగుతున్నాయి..ఈ రోజుల్లో... స్వతంత్ర భావాలతో ఎవరికి వారు సంపాదనాపరులై వ్యక్తిత్వంతో గౌరవం గా మెలుగుతున్నారు..కానీ విలువలు లేని జీవితాన్ని కొనసాగిస్తున్నారు....కొందరు కొన్ని సంవత్సరాలుగా జంటగా కనిపిస్తున్నా ఇన్నర్ గా గొడవలు... ఒక స్టేజ్ లో విపరీత మానసిక స్ట్రగుల్ తో ఇరువురు ద్వేషాలతో పరుష పదాలతో వారిని వారు అందరి ముందు చులకన చేసుకుంటున్నారు... కొందరు మిత్రులు వారిని సమర్ధిస్తూ వారి గొడవలను పెంచుతారు .వైవాహిక బంధం.. మరియు జీవనానికి ఒకరికి ఒకరు కట్టుబడి ఉండట్లేదు సరికదా!నేను నీకు లోబడి ఉండను అనే వైఖరి కొన్ని జంటలలో చూస్తున్నాం...చిన్న చిన్న విషయాలకే విడాకులు దాకా... స్వతంత్ర జీవనం కావాలి.. ఇరువురికీ...పిల్లల భవిష్యత్ కోసం ఆగాం కానీ అంటూ ఈనాటి మహిళల ఆవేదన...భార్యాభర్తల ఇగో లతో కుటుంబ వ్యవస్థలో అపార్ధాలతో..అవమానించుకుంటూ పెద్ద వారికి తెలియకుండా వారిని లెక్కచేయకుండా.. స్వంత నిర్ణయాలతో జీవితాన్ని దుఃఖమయం చేసుకుంటున్నారు.

ఇలా నేను ఈ విషయం రాద్దాం అని ఒక పేరా రాసాను.. ఈరోజు whatsapp లో ప్రస్తుత పరిస్థితి అని ఒక లాంగ్ మెసేజ్ వచ్చింది.. చదివాను..కొంచం కఠినంగా ఎవరో రాసినా నిజమే కదా అని కింద కాపీ చేసాను...లాస్ట్ కొద్దిగా ముగింపు నేను రాసాను....


*ప్రస్తుత  పరిస్థితి*

------------------------------------------------

 *కోడళ్ళ కోసం పరితపిస్తున్న పేరెంట్స్...అర్హత లేకున్నా అందలం ఎక్కుతున్న అమ్మాయిలు!! కొడుకు కు ముప్ఫై ఏళ్ల లోపు పెళ్లి కాకుంటే ఆజన్మ బ్రహ్మా చారిగా ఉంటాడనే బెంగ తల్లి దండ్రులను పట్టి పీడిస్తుంది...ఎక్కడ చూసినా మహిళా జనాభా ఎక్కువైనా కూడా ముప్ఫై ఏళ్ల వరకు అమ్మాయిలు కూడా పెళ్లి ధ్యాస లేకుండా ఉద్యోగం లో ఎదుగుదల కోసం ...మరియు సమాన స్థితిలో కాబోయే భర్త ఉండాలని సమాజంలో ఉన్నత స్థాయిలో ఆ జంట ఉండాలనే పెళ్లి  ఆలస్యం గా చేసుకుంటున్నారు అమ్మాయిలు.  ఈ తరం అమ్మాయిలు చెట్టు ఎక్కి మరి పిల్లవాడి రేజ్యూం చూసి పెదవి విరవడంతో ఒక అమ్మాయికి పదిమంది నిష్పత్తి చొప్పున పెళ్లి చూపుల పరంపర కొనసాగుతూనే ఉంది!! అబ్బాయిలు బెండకాయ ముదిరినట్టు ముదిరి పోతున్న పెళ్లి జాడ లేక విలవిల లాడి పోతున్నారు...అమ్మాయిల డిమాండ్ కన్నా ఆమెను కన్న పేరెంట్స్ కోరికలు చాంతాడు అంత ఉండడం తో పెళ్ళి కొడుకులు క్యూ కడుతున్నారు...వాడికి పర్మినెంట్ జాబు ఉండాలి ఒక ఐదెకరాల పొలం ఉండాలి...హైదరాబాద్ లో కోటి రూపాయల అపార్ట్మెంట్ ఉండాలి...అమ్మాయి మెళ్ళో ఇరవై ఐదు తులాల బంగారం వేయాలి...పెద్ద వివాహ వేదిక లో వెయ్యి మందికి భోజనం పెట్టాలి... ఆన్న డిమాండ్ ముందు ఉంచడమే కాకుండా అమ్మాయి పెళ్లి అయ్యాకా కూడా జాబ్ చేస్తే ఆ అమ్మాయి సంపాదన తల్లి దండ్రులకు చెందాలి  ఆన్న ప్రధాన డిమాండ్ల ను తలవొగ్గి పెళ్లి పీటల మీద కు అమ్మాయి వచ్చే వరకు వణుకుతూ పెళ్లి పనులు చేసే మగ పెళ్లి వారి బాధలు ఏ పగ వాడికి కూడా వద్దు! ఒక్క తెలుగు రాష్ట్రాల లోనే కాదు దేశం మొత్తం మీద అమ్మాయిల కోరికలు గుర్రాలు అయి పరిగెడుతుంటే భవిష్యత్ భారతంలో వివాహ వ్యవస్థ ఉంటుందా లేక *సహాజీవన వ్యవస్థ* గా మారిపోతుందా అనే భయం విద్యాధికులకు, సంప్రదాయ వాదులకు పట్టుకుంది..ఎందుకంటే కాలేజీ దాటగానే ఉద్యోగం ఆఫర్ రావడంతో ఇరవై ఐదేళ్ళకే అమ్మాయిలకు ముప్ఫై వేల ఉద్యోగం దొరకడం...మూడేళ్లలో అది రెట్టింపు కావడంతో సొంత కారు...కావాల్సిన కాస్మెటిక్స్...మాడ్రన్ దుస్తులతో కార్పోరేట్ కల్చర్ లోకి వెళ్లి పోతున్న అమ్మాయిలు...పెళ్లి ధ్యాస మరిచి రంగుల ప్రపంచం లో విహరిస్తూ *ఆడింది ఆట పాడింది పాట* జీవితం కొనసాగుతుంటే, పెళ్లి మీద ద్యాస ఎందుకుంటుంది?!...దానికి తోడు అమ్మాయిల కొలీగ్స్ లలో ఇద్దరో  ముగ్గురో డైవర్స్ కేసులు ఉంటే వాళ్ళ ప్రభావం వీళ్ళ మీద పడి, "పెళ్లి  చేసుకొని వాడి చెప్పిన మాట వినే కన్నా సోలో లైఫ్ బెటర్" అనే అమ్మాయిల సైకాలజీ వల్ల పెళ్ళిళ్ళు అటు మొగవారికి ఇటు ఆడవారికి సరియైన వయసులో జరగపోవడం, దానికి తోడు అబ్బాయి *మంచి వాడా చెడ్డవాడా* అని  తెలుసుకోవడానికి ఆర్నెల్లు *సహజీవన యాత్రలు* చేసి రావడంతో మోజు తీరి మరో *ఎర్నర్* కోసం వెతుకుతున్న ఈ తరం యువతుల వల్ల వివాహ వ్యవస్థ పెద్ద కుదుపునకు లోనవుతుంది...*కులం చెడ్డ సుఖం దక్కాలనే* పెద్దల మాట పెడచెవిన పెట్టి, రంగు రూపు చూసి వాడి బుట్టలో పడి రిజిష్టర్ మ్యారేజ్ చేసుకొని వాడు *సకల కళా వల్లభుడు* అని తెలుసుకొని అమ్మ గారి ఇంటికి చేరుకుని లబోదిబోమంటే పోయిన మృదుత్వం వస్తుందా?! ఇలా ముప్ఫై ఏళ్లు గడిచాకా డబ్బున్న ఏజ్ బార్ వాడు దొరికితే వాడితో నైనా సరిగా సంసారం చేస్తుందా అంటే అదీ లేదు! పిల్లలు పుడితే అందం ఎక్కడ మసి బారుతుందో అని ముప్ఫై ఐదేళ్ల వరకు పిల్లలు కనకుండా టాబ్లెట్లు మింగే అమ్మాయిల అతి ప్రవర్తన వల్ల మనవలు - మనవరాళ్లు కావాలనుకునే  పేరెంట్స్ ఆశలు అడియాశలు అయి పోతున్నాయి...2024 లో యువతుల *పెళ్లి సందడి* ముప్ఫై ఏళ్ళు దాటుతుంది అంటే అమ్మాయిల్లో పెళ్లి ద్యాస కన్నా సంపాదన ద్యాస ఎక్కువగా ఉందనే విషయం తేట తెల్లమవుతుంది...! ఏ వయసులో ఆ వయసు ముచ్చట తీరాలని పెద్దలు ఊరికే అనలేదు...అది లేకే నేటి పిల్లల పెళ్ళిళ్ళు ఆలస్యం అవుతున్నాయి...ఎంత మంచి ముహూర్తం పెట్టినా కూడా పెళ్ళిళ్ళు మూడు నాళ్ళ ముచ్చటగా కావడానికి ఆడపిల్లల తండ్రులు మొదటి కారణం కాగా *పిల్లవాడు సెటిల్* కాలేదు...అని అబ్బాయి ఆదాయం పై ఆశలు పెంచుకున్న తల్లిదండ్రులు రెండో కారణం! ముప్ఫై ఏళ్ల వరకు మహా అయితే అదా చేసుకుంటే యాభై లక్షలు ఉంటాయి కాబోలు *కోటి* ఆశలు తల్లి దండ్రులు ఉంటే ఆ కోటి వచ్చేసరికి నెత్తి మీద జుట్టు ఊడి పోతూ లేక...చిక్కి శల్యమైన *అతన్ని* ఏ పిల్ల పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తుంది?...ఆడపిల్లలు అందరూ మహేష్ బాబు లాంటి అబ్బాయి...ఆయన లా ఆడి కారు ఉండాలని కోరుకోవడంలో  తప్పులేదు.... కానీ అలాంటి వరుడు వేటలో ఉన్న ఎంపిక అయ్యే సరికి ఈడు పోయి అనాకారి దొరికితే వాళ్ళ ఆశలు అడి యాశలు అయి పెళ్లయిన ఏడాదికే కోర్టు మెట్లు ఎక్కుతూ డైవర్స్ ఆట మొదలు పెడుతున్నారు!🌷🌷🌷🌷🌷🌷🌷ఇక పవిత్ర భారత దేశంలో ఇప్పుడు అత్తల ఆరళ్ళ కన్నా కోడళ్ళ ఆరళ్ళు ఎక్కువవుతున్నాయి...   పెళ్లయిన ఆర్నేళ్ళకే వేరు కాపురం పెట్టి, అత్త మామలు రాకుండా సూటి పోటి మాటలు అంటూ దూరం పెడుతున్న వనితల అతి ప్రవర్తన వల్ల కుటుంబ వ్యవస్థ బీటలు వారిపోయింది...వృద్ధాప్యంలో కొడుకు కన్నా ఇంటి ముందు శునకం పెంచుకోవడం బెటర్ అనే మైండ్ సెట్ లో ఓల్డ్ ఏజ్    పేరెంట్స్ ఉంటున్నారు...పొరపాటున ఆడపిల్లల కన్న తల్లి దండ్రులు కూడా అటు అల్లుడి పంచన చేరలేక...చేరినా కూడా అక్కడ అడ్జెస్ట్ కాలేక మానసిక వేదన తో కుమిలి  పోతున్నారు...ఇక ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్లు ఉన్న ఇంట్లో.... పేరెంట్స్ బాధ వర్ణనాతీతం...ఆస్తుల పంచాయతీలు ఒక వైపు ఆదరణ లేక *వృద్ధ పక్షులు* ఒకరికి ఒకరై ఓదార్చు కుంటూ దేవుడు ఎప్పుడు తీసుకు వెళ్తాడా? అని ఎదురు చూస్తున్నారు! పదేళ్లు ఎత్తుకొని కాలికి ముల్లు అంటకుండా పెంచిన పిల్లలు...సంపాదన పరులు అయ్యాక తల్లి దండ్రులకు మంచి చెప్పులు కూడా కొనివ్వని దౌర్భాగ్య పరిస్థితి నేడు కనబడుతుంది...! నాలుగు రోజులు పెద్ద కొడుకు...నాలుగు రోజులు బిడ్డ దగ్గర ఉంటే వాళ్లకేం తోడి పెడుతున్నారని కొడుకు - కోడళ్ళ వేధింపులతో ఒంటరి జీవనంలో ఇమడలేక....అటు పిల్లలు ఆదరణ కోల్పోయి  కళ్ళ   వెంట ధారగా కన్నీళ్లు కారుస్తూ ఎవరూ ముందు పోయినా మరొకరికి కష్టం అని *భార్యభర్తలు* ఒకరికొకరం ఉన్నామని ధైర్యం చెప్పుకుంటూ జీవనం వెళ్ళ బోస్తున్నారు...! చాలా మంది అత్తమామలు కొడుకు కోడలు నుండి ఆదరణ -  ఆప్యాయతతో కోరుకుంటారు. చాలా సందర్భాల లో వాళ్లకు అది దూరం అవుతుంది..

మన 'ఆధునిక సమాజంలో అత్త మామలు అడ్జెస్ట్ కాలేక పోతున్నారు...ఇదీ చాదస్తం అనే కన్నా *ప్రేమ* ఎక్కువవడం అంటే కరెక్ట్!

భారతదేశంలోని కొంతమంది కోడలు ఎదుర్కొంటున్న మానసిక, ఆర్థిక సమస్యలు దీని వల్లే తలెత్తుతున్నాయి...అత్త పెత్తనం కోడలు సహించదు...తన కోడలు తన చెప్పు చేతల్లో ఉండాలని కోరుకుంటున్న తల్లి తన కూతురు మాత్రం *స్వేచ్ఛ* లేదు అని ఆరాట పడుతుంది...మహిళల్లో ఈ ద్వంద వైఖరి వల్లే కోడళ్ళు శాడిస్ట్ లుగా తయారవుతున్నారు...

అత్తమామలతో జీవించడం వాళ్లకు పెద్ద సవాళ్లు గా అనిపిస్తుంది.

ఈ తప్పుడు భావాలు అనాదిగా ఉంటూనే ఉన్నాయి..*కోడలు బిడ్డ కాదు...అల్లుడు కొడుకు కాదు* అనే  మైండ్ సెట్ ఇంకా వందేళ్లు అయినా మారేట్టు లేదు!  అత్తగారు - కోడలు మధ్య సంబంధం నిజానికి అందంగా ఉండాలి... కానీ తరచుగా వారి మధ్య ఘర్షణ వాతావరణం, ఆధిపత్య పోరాటం కొనసాగుతూనే ఉంటుంది..ఈ తప్పుడు భావాలు ఇద్దరి మధ్య మంచితనాన్ని నాశనం చేస్తున్నాయి. బహుశా, అత్తమామల జోక్యం, కొడుకు పై పెత్తనం వల్ల తాను *స్వాతంత్ర్యం* కోల్పోతున్నాననే అభద్రతా భావం లో కోడలు ఉంటుంది.. ఆ భయాలను ఆమె తల్లి దండ్రులు ఎక్కువ చేయడం వల్ల ఇంట్లో అశాంతి ఎక్కువవుతుంది.. తన కుమార్తె  తన అత్తమామలతో సుఖంగా జీవించాలని కోరుకునే తల్లి దండ్రులు ఉంటే ఇలాంటి అపశృతులు రావు...కూతురికి ఒక న్యాయం కోడలికి ఒక న్యాయం ఉండాలని కోరుకోవడం వల్లే ఈ అశాంతి!!

  ఒక కోడలు మరియు ఆమె అత్తగారి మధ్య ఏర్పడే సమస్యలు 'పోటీ' పడుతుంటాయి!  ఇది వివాహవ్యవస్థలో చాలా సమస్యలను కలిగిస్తుంది!  తల్లి మరియు భార్య ఇద్దరి మధ్య కొడుకు నలిగి పోతాడు...తల్లి కన్నా పెళ్ళామే బెల్లం అనుకున్న మరుక్షణం కొడుకు ఇంటి వైపు తల్లి చూడదు!!  అటు తల్లి ఇటు పెళ్ళాం మధ్య మానసిక వేదనకు గురయ్యే పుత్ర *రత్నాలు* కూడా కోకొల్లలు!!🌷🙏🌷🌷🙏🙏🌷🙏🌷🙏🙏

ఈ ఇంటికి నేను మొదటి కోడలు ను అనే ఇగో తల్లిలో బలంగా ఉంటుంది..

 35 సంవత్సరాలకు క్రితం ఈ ఇంటి పరువును నిలబెట్టాను...అలా నువ్వు అణిగి మణిగి ఉండాలని అత్తా కోరుకోవడంలో తప్పు లేదు కానీ  ఆనాటి అత్తలు వేరు ఈ  నాటి కోడళ్ళు వేరు! ఆనాటి అత్తలకు కావాల్సిన అస్తి ఉండేది...దానికి చూసుకోవడానికి కోడలు కు ఇంటి బాధ్యత అప్పగిం చేది. అయిన ఆనాటి అత్త కోడళ్ళు మధ్య కూడా అభిప్రాయ బేధాలు ఉండేవి...ఇంటి నిండా పనిమనుషులు ఉన్నారు కాబట్టి ఇంటి గుట్టు  బయట పడలేదు... ఇప్పుడు అలా కాదు కోడళ్ళు సంపాదన పరులు అయ్యారు. అత్త కొంగు పట్టుకు తిరగాలి అంటే ఏ కోడలు ముందుకు రాదు!   ఇప్పుడు కట్న కానుకల కన్నా *స్వేచ్ఛ జీవితం*, కోరుకుంటున్న ఈ తరం జంటల వల్ల మానవ సంబంధాలు ఆప్యాయతలు గంగలో కలిసి పోయాయి...మనవలతో అడుకోనివ్వని కోడళ్ళు...ఆతి గారాబం చేయవద్దని చెప్పే కొడుకుల వల్ల తాత మనవల ఆత్మీయత మసి బారి పోయింది!

కొత్తగా పెళ్లయిన వధువులు తమకు ఇష్టమైన దుస్తులను ధరించడానికి,  లేదా వారి తల్లిదండ్రులను ఎప్పుడు తన దగ్గరకు వచ్చి పోతుండాలి అని కోరుకుంటుంది తప్ప అత్తా మామలను ఆదరించాలని అనుకోక  పోవడం వల్లే అత్త కోడళ్ళ మధ్య బాగా గ్యాప్ పెరిగిపోతుంది! ఒక వేళ కొడుకు ఇంటికి వెళితే   ఆలస్యంగా నిద్ర లేచిన  కోడలు... చెప్పులు వేసుకొని ఇంట్లో తిరిగే కోడలు...పూజలు పునస్కారాలు  లేకుండా, స్నానం ఆచరించకుండానే వంటింట్లో దోసెలు వేసే కోడళ్ళ *పనితీరు* వంట బట్టలేక ఏదైనా మాట అత్త గారు అంటే తాను స్వేచ్చలేని పంజరంలో చిలుకను అయ్యాయని ఏడుస్తూ బెడ్ రూం లో అలక పాన్పు ఎక్కుతున్న సుందరాంగి మాటలు విని తల్లి పై కోపగిస్తున్న కొడుకుల ప్రవర్తన వల్ల కూడా ఉమ్మడి కుటుంబ వ్యవస్థ బీటలు వారిపోతుంది!! అత్తమామలు కొడుకు ఇంటికి వస్తే *హై-సెక్యూరిటీ జైలు* లో బంధించి నట్టు కోడలు ఫీలు అవుతుంది.. అత్త 'నియమాలు' కోడలు కు నచ్చవు...కోడలు తీరు అత్తకు నచ్చదు...

పిల్లల యొక్క ఏకైక బాధ్యత ఎలా కోడలు తీసుకుంటుందో 

అత్తమామలతో కలిసి జీవించడం కూడా బాధ్యత అనుకునే కోడళ్ళు ఈ కాలంలో చాలా తక్కువ!  

వృద్ధ అత్తమామలతో కలిసి జీవించడం ప్రతి కోడలికి ఎంతో విజ్ఞాన దాయకం., ఎందుకంటే వారి ప్రతి చిన్న విషయం పట్ల శ్రద్ధ వహించడం వాళ్ళు చేస్తారు...తెలివైన కోడలు అయితే అత్తా మామలతో ప్రేమ గా ఉంటే సగం పనిభారం తగ్గినట్టే! అత్త గారే వంట చేస్తుంది...మామ గారే పిల్లలను బడికి పంపే బాధ్యత తీసుకుంటారు...కానీ వంటింట్లో ఏదో *దోచుకుపోతుంది* అని భయపడి కిచెన్లోకి రానివ్వని కోడళ్ళు...కోడలు ఇంట్లో సమకూర్చిన ప్రతి వస్తువు తన కూతురు ఇంట్లో ఉండాలని అనుకునే అత్తల వల్ల ఈ గ్యాప్ ఎక్కువవుతూనే ఉంది! భారతదేశంలో పవిత్రమైన కర్తవ్యంగా అత్త కోడళ్ళు ఉండాలి... కానీ ఈ తరం మహిళల లో మార్పు వస్తేనే కుటుంబ వ్యవస్థ మళ్ళీ చిగురిస్తుంది..సేకరణ...

ముగింపు......

అమ్మాయి.. అబ్బాయి తల్లి తండ్రులు వివాహం దాని ప్రాధాన్యత గురించి ముందుగా వారికి వివరించి, ముందు తరాలకు ఆదర్శంగా నిలవాలి మీ కుటుంబం అని వారికి ఆశీర్వాదాలతో దీవెనలు ఇవ్వాలి...ఉమ్మడి కుటుంబం యొక్క విలువలు వివరించగలగాలి..మన ప్రయత్న లోపం లేకుండా మనం చెప్పగల వివరణ చెప్పాలి...ఇక వారి వారి పరిధిలో వారిని వదిలేయాలి...

                  సర్వే జనా సుఖినోభవంతు....







Monday, January 27, 2025 0 comments By: visalakshi

గీతాజ్ఞాన అభ్యాసం..


“భగవద్గీత - ఆత్మవిజ్ఞానశాస్త్ర మహాగ్రంధం”





కురుక్షేత్ర మహాసంగ్రామంలో అర్జునుడు గాండీవాన్ని క్రిందపడవేసి .. యుద్ధరంగం నుంచి పలాయనం చిత్తగించాలని చూసినట్లు...,  ఒక్కోసారి మనం కూడా ఆత్మజ్ఞానంతోనో, పామరత్వంతోనో మన జీవన కర్తవ్యాల నుంచి తప్పించుకో జూస్తూంటాం. అప్పుడు భగవద్గీత మనకు సత్యాన్ని బోధించి .. మనతో ధర్మాన్ని ఆచరింపజేసి .. క్రిందపడిన గాండీవాన్ని మళ్ళీ అర్జునుడిచే సంధింపజేయించినట్లు మనల్ని కూడా కర్తవ్య పరాయణులను చేస్తుంది♪. అందుకే “భగవద్గీత” అన్నది ఆత్మవిజ్ఞాన శాస్త్ర మహాగ్రంథం.


అది మనకు సత్య దర్శనం గురించీ మరి ధర్మాచరణం గురించీ విశేషంగా ప్రబోధిస్తూ ఉంటుంది.


“సత్యం” అన్నది “జ్ఞాతవ్యీయం” .. అంటే తెలుసుకోవలసినది .. మరి “ధర్మం” అన్నది “ఆచరణీయం” అంటే నిరంతరం ఆచరించవలసింది.


సత్యం తెలియకపోతే మనకు ధర్మాన్ని ఆచరించే విధివిధానం అర్థం కాదు. దాంతో యుద్ధరంగం నుంచి పలాయనం చెందాలని అర్జునుడు ప్రయత్నించినట్లు మనం కూడా ప్రాపంచిక సంసారంలో కర్తవ్యాల నుంచి తప్పించుకోవాలని చూస్తూంటాం.


మన ముసలి తల్లితండ్రులనూ మరి ఇంట్లో ఉన్న ఇతర పెద్దలనూ చూసుకోవడానికి విముఖత చూపిస్తూ .. వారిని వృద్ధాశ్రమాలలో చేర్పించి .. అదే "కర్తవ్యం” అని చేతులు దులుపుకుంటాం. కానీ .. “ఈ జన్మలో మనం మన కర్తవ్యాలను సరిగ్గా ఆచరించకపోతే మళ్ళీ మళ్ళీ అనేక జన్మలు ఎత్తి అవే కర్తవ్యాలను అవే పరిస్థితులలో మళ్ళీ మళ్ళీ నిర్వర్తించాల్సి వస్తుంది” అన్న సత్యాన్ని మనం తెలుసుకోవాలి.


“తే త్వం భూంక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి

ఏవం త్రయీధర్మమనుప్రపన్నా గతాగతం కామకామా లభంతే”

                        (భ.గీ.9-2)


“ఆ విశాలమైన స్వర్గలోకాలలోగల భోగాలను అనుభవించిన తరువాత .. మరి పుణ్యం అయిపోగానే .. నువ్వు మళ్ళీ మర్త్యలోకాలకు ప్రవేశిస్తావు. ఈ ప్రకారంగా మూడు రకాల ధర్మ కర్మలను ఆచరిస్తూ .. భోగాలను ఆశిస్తూ .. స్వర్గ మర్త్య లోకాలకు మధ్య రాకపోకలను సాగిస్తూనే ఉంటావు” అన్నారు శ్రీకృష్ణుల వారు.


పుణ్యం పెరగగానే స్వర్గలోకానికీ మరి పుణ్యం క్షీణించగానే మర్త్యలోకానికీ తిరుగుతూ .. మనలో ఉన్న “కామం” అన్నది “అకామం” అయ్యేంతవరకూ మనం రాకపోకలను సాగిస్తాం. ఎప్పుడయితే “త్రయీధర్మ పరాయణులుగా” మన 'దేహధర్మం', మన 'కుటుంబధర్మం' మరి మన 'సంఘధర్మానికి' చెందిన కర్తవ్యాలను ఆత్మజ్ఞానంతో సంపూర్ణంగా ఆచరిస్తామో .. అప్పుడు ఇక మళ్ళీ ఈ భూమిమీదకు నేర్చుకోవడానికి రావలసిన అవసరం ఇక ఉండదు.


 #“దేహధర్మం”:


ఈ దేహం మనకు ప్రకృతి నుంచి లభించింది♪. ఇందులోకి మనం ప్రవేశించాం కనుక దీనిని జాగ్రత్తగా చూసుకోవడం మన ధర్మం. అశాస్త్రీయమైన తిండితో, అశాస్త్రీయమైన ఆలోచనలతో మరి అశాస్త్రీయమైన కర్మాచరణలతో దానిని పాడుచేసుకోకూడదు.


అద్దెకు తీసుకున్న కొంపను ఇష్టం వచ్చినట్లు “కొల్లేరు”లా చేస్తే దాని యజమాని ఊరుకోనట్లే .. ప్రకృతి నుంచి అద్దెకు తీసుకున్న మన ఈ శరీరాన్ని తినకూడని వాటితో మరి తాగకూడని వాటితో నింపేస్తూంటే ఆ శరీరానికి యజమాని అయిన ప్రకృతి చూస్తూ ఊరుకుంటుందా? “నా ఇంటిని నీకు ఎలా ఇచ్చానో .. నువ్వు నాకు అలాగే అప్పచెప్పకపోతే నీ మీద ‘దావా’ వేస్తాను” అని ఇంటి యజమాని బెదిరించినట్లు .. ప్రకృతి కూడా ఏ క్యాన్సర్ రూపంలోనో, డయాబెటీస్ రూపంలోనో, లివర్ సిర్రోసిస్ రూపంలోనో మన మీద ‘దావా’ వేస్తుంది.


చాలా మంది “మాకు అన్నీ తెలుసు” అనుకుంటూ..“ ఎవరో చంపిన జంతువులను మేము తింటే తప్పేంటి? మేము స్వయంగా చంపట్లేదు కదా?” అని అతితెలివిగా వాదిస్తూంటారు. ఎవడో వచ్చి మన క్రొత్త పెట్రోలు కారులో ‘డీజిల్’ పోస్తే పాడైపోయేది మన కారే కదా! ఇది కూడా అంతే.


ప్రకృతిని మనం ఎంతగా నాశనం చేస్తామో అంతగా అది మనకు శిక్ష వేస్తుంది. కనుక ‘నాగరికత’ ముసుగులో శరీర ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించకుండా .. చేయవలసిన ధ్యానం చేసి విశ్వశక్తితో శరీరాన్ని వజ్రకాయంలా మార్చుకోవాలి.


#“కుటుంబ ధర్మం”: 


ఒకానొక తల్లిగా, ఒకానొక తండ్రిగా, ఒకానొక కొడుకుగా, ఒకానొక కూతురుగా, ఒకానొక అన్నగా, ఒకానొక తమ్ముడిగా .. ఇలా మనం కుటుంబంలో ఏ పాత్రలో ఉంటే ఆ పాత్రకు తగ్గట్లు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తూ మన సకల కుటుంబసభ్యుల పట్ల విద్యుక్త ధర్మాలను నెరవేర్చాలి.


#“సంఘధర్మం”:


మనకు ఉన్నదాంట్లో కొంత వాడుకుని .. మిగతాది సంఘంలోని ఇతర సభ్యులతో పంచుకోవాలి. సంఘ నిర్వహణ కోసం ప్రకృతిపరంగా విధించబడిన కట్టుబాట్లను గౌరవిస్తూ .. రాగద్వేషాలకు అతీతంగా వ్యవహరిస్తూ సంఘంలో ఒక సభ్యుడిగా సంఘం పట్ల మన కనీస ఆధ్యాత్మిక, ప్రాపంచిక ధర్మాలను నెరవేర్చాలి.


“యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి

శుభాశుభపరిత్యాగీ భక్తి మాన్ యః స మే ప్రియః”     

                       (భ.గీ.12-17)


“ఇష్టవస్తు ప్రాప్తికి పొంగిపోనివాడు, దేనిపట్ల కూడా ద్వేషభావం లేనివాడు దేనికీ శోకింపని వాడు, దేనినీ ఆశింపనివాడు .. శుభాశుభ కర్మలను త్యజించినవాడు అయిన భక్తుడు నాకు ప్రియుడు” అని ఒకానొక ఆత్మజ్ఞాని యొక్క లక్షణాలను తెలియజేశారు శ్రీకృష్ణులవారు.


ఇలా ఏది ఉన్నా ఏది ఊడినా బాధపడకుండా దేనిపట్ల కూడా ద్వేషం లేకుండా, దేనికీ శోకించకుండా ప్రకృతి మనకు అందించిన వాటిని “ఉన్నది ఉన్నట్లుగా” స్వీకరించి ముందుకు సాగుతూ మనం స్వర్గలోకానికీ .. మర్త్యలోకానికీ మధ్య రాకపోకలు చేయాలి. వస్తూ పోతూండే ఈ క్రమంలో .. క్షీణించిన మన శరీరాన్ని చినిగిన బట్టను విసిరివేసినట్లు వదిలివేస్తూ .. మళ్ళీ క్రొత్త బట్టలను ధరించినట్లు .. క్రొత్త జన్మలో క్రొత్త శరీరాన్నిధరిస్తూ ఉండాలి.


అనగ అనగ రాగమతిశయించినట్లు రాగాపోగా ఎప్పటికో ఒకప్పటికి మనలోని కామాలన్నీ కూడా “అకామాలు” అయిపోయి .. పరిశుద్ధం చెందబడతాయి.


“అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే

తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షే మం వహామ్యహామ్”

                      (భ.గీ.|| 9-22)


“వేరే ప్రాపంచిక ఆలోచనలు లేకుండా నిరంతరం తనలో తాను నిమగ్నమవుతూ నిష్కామ భావంతో తనను తాను సేవించుకునే వారి యోగక్షేమాలను వారు స్వయంగా వహిస్తాను” అని భగవాన్ శ్రీకృష్ణుల వారు తెలియజేశారు.


ప్రతి ఒక్క ఖజానాను తెరవడానికి ఒక రహస్యమైన “తాళం చెవి” ఉన్నట్లే భగవద్గీతను అర్థం చేసుకోవడానికి కూడా ఒక రహస్యమైన “తాళం చెవి” ఉంది.


#అదే “మామ్” మరి “అహం” పదాలు యొక్క సరియైన అర్థాలు:


ఇక్కడ “మామ్” అన్నా మనమే .. మరి “అహం” అన్నా మనమే! ఒకటి మన అంశాత్మకు సంకేతం మరి ఇంకొకటి మన పూర్ణాత్మకు సంకేతం! రెండూ మనమే!


అంశాత్మలమైన మనం మన స్వీయ పూర్ణాత్మల పట్ల అనన్య భక్తితో ఉంటూ, పూర్ణాత్మనే సేవిస్తూ .. పూర్ణాత్మనే ధ్యానిస్తూ .. నిష్కామ భావంతో పూర్ణాత్మనే చింతిస్తూ ఉంటే .. మన పూర్ణాత్మే మన యోగక్షేమాలను చూసుకుంటూ ఏదో ఒక నాటికి మనల్ని కూడా తనంతటి పూర్ణాత్మలుగా పరిమారుస్తుంది! అంటే మనల్ని మనమే ఉద్ధరించుకుంటున్నామన్న మాట.


“ఉద్ధరేదాత్మనాత్మానాం ఆత్మానమవసాదయేత్

ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనః”

                            (భ.గీ.6-5)


“ఈ సంసార సాగరంలో ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి. ఎవరూ తమను తాము అధోగతి పాలుచేసుకోకూడదు. వాస్తవానికి ఈ లోకంలో ఎవరి ఆత్మే వారికి మిత్రుడు మరి ఎవరి ఆత్మే వారికి శత్రువు” కనుక .. మనం చెయ్యవలసిందల్లా నిరంతరం ధ్యానసాధనతో కూడిన ఎరుకతో మన పూర్ణాత్మకు అనుసంధానమై ఉండడమే .. అదే మనకు వున్న ఒక్కగానొక్క రాచబాట!


ఇలా నిరంతరం ధ్యాన యోగ సాధన వల్ల మాత్రమే ఆత్మతత్త్వం అవగతమై .. మన ఆత్మను ఆవరించి ఉన్న దుఃఖం దూరం అవుతుంది కనుక ..


“తపస్వి యోగీ జ్ఞానిభ్యోపి మతోధికః

కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీ భవార్జున” 

                          (భ.గీ.6-46)


“ఒకానొక యోగి తాపసులకంటే శ్రేష్ఠుడు. శాస్త్రజ్ఞానుల కంటే శ్రేష్ఠుడు. సకామ సాత్విక కర్మలను ఆచరించే వారి కంటే శ్రేష్ఠుడని భావించవచ్చు, కనుక అర్జునా! యోగివి కా” అని సూచించాడు శ్రీకృష్ణుడు.


రకరకాల పూజలూ, ఉపవాసాలూ మరి తపస్సులూ చేస్తే శరీరం తపిస్తుందే కానీ ఆత్మను ఆవరించి ఉన్న అజ్ఞానం మాత్రం పోదు గాక పోదు! సకల సంస్కృత శ్లోకాలను కంఠతా పట్టేసి రకరకాల శాస్త్రవిజ్ఞాన గ్రంథాలను పఠించేస్తే అక్షర పండితుడు అనబడతాడు కానీ అతని ఆత్మను ఆవరించి ఉన్న దుఃఖం పోదు గాక పోదు! గొప్ప గొప్ప కర్మలు చేసి ఎన్నెన్నో కీర్తిప్రతిష్ఠలు పొందినా ఆత్మను ఆవరించి వున్న అజ్ఞానం పోదు గాక పోదు! అందుకే ..


“క్లైబ్యం మాస్మ గమః పార్థ నైతత్త్వ య్యుపపద్యతే

క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప”

                            (భ.గీ.2-3)


“ఓ అర్జునా! పిరికితనానికి లోనుకావద్దు .. నీకు ఇది ఉచితం కాదు♪. ఓ పరంతపా! ఈ హృదయ దౌర్భల్యాన్ని వీడి యుద్ధం చేయడానికి నడుము బిగించు” అంటూ కర్తవ్య బోధ చేశాడు శ్రీకృష్ణుడు.


“శరీరం” అన్నది “ఆత్మ” కు “నీడ” వంటిది. శరీరానికి రోగం వచ్చినప్పుడు నీడకు చికిత్స చేస్తే లాభం లేనట్లు ఆత్మకు “అజ్ఞానం” అనే రోగం ఆవరించినప్పుడు దాని నీడలాంటి శరీరంతో తపస్సులు చేసినా, ఉపవాసాలు చేసినా, ఆసనాలు వేసినా, పుణ్యనదులలో మునిగినా మరి స్త్రోత్ర పారాయణలు చేసినా లాభం ఉండదు! చెయ్యవలసింది .. చిత్తవృత్తులన్నింటినీ నిరోధించుకుని ధ్యానం చేసి ఆత్మమూల ప్రకృతితో సంయోగం చెంది సత్యాన్ని అవగతం చేసుకోవడం.


సత్యాన్ని తెలుసుకునేంత వరకూ .. దానిని తెలుసుకోవడమే మన పని! మరి తెలుసుకున్నాక దానిని అందరికీ తెలియజెయ్యడమే మన పని!


మనం ఎవరిమో ఏ పని కోసం పుట్టామో తెలుసుకునేంత వరకూ మన ఆత్మకు దుఃఖమే ఉంటుంది. తెలుసుకున్న తరువాత ఇక ఆ చెయ్యాల్సిన పని చేస్తూంటే ఆనందమే ఆనందం! అలనాడు గౌతమ బుద్ధుడు అనుభవించిన ఆనందం అదే.. మరి ఈ రోజు ఆనాపానసతి .. “శ్వాస మీద ధ్యాస” ధ్యానప్రచారం చేస్తూ పిరమిడ్ మాస్టర్స్ అనుభవిస్తూన్న ఆనందం అదే.


కనుక చిన్నప్పటి నుంచే యోగస్థితిలో ఉంటూ పరమ యోగిలా గృహస్థధర్మంలోకి ప్రవేశించి విహిత ప్రాపంచిక కర్మలు చేయాలి. అప్పుడే అవి ధర్మబద్ధంగా సమస్థితిలో ఉంటాయి. లేకపోతే జీవితం అంతాకూడా తప్పులతడకగా మారి “గృహస్థధర్మం” అంతా కూడా “గృహస్థ అధర్మం” అవుతుంది. అందుకే....


 “యోగస్థః కురుకర్మాణి సంగం తక్త్వా ధనంజయ

సిద్ధ్యస్సిద్ధ్యో సమోభూత్వా సమత్వం యోగ ఉచ్యతే”

                          (భ.గీ.2-48)


 “ఓ ధనుంజయా! యోగస్థితుడవై ఆసక్తిని వీడి, సిద్ధి అసిద్ధుల పట్ల సమత్వభావాన్ని కలిగి కర్తవ్యకర్మలను ఆచరించు. ఈ సమత్వభావాన్నే యోగం అంటాం” అని యోగాన్ని నిర్వచించాడు శ్రీక్రుష్ణుడు.


“దమం” లోంచి “సమం” అన్నది వస్తుంది. “దమం” అంటే బహిరేంద్రియాలను లోపలికి ముడుచుకోవడం; .. “సమం” అంటే అంతరేంద్రియాన్ని అదుపులో ఉంచుకోవడం. బహిరేంద్రియాలను లోపలికి ముడుచుకుని ధ్యానం చేసినప్పుడు అంతరేంద్రియమైన మనస్సు అదుపులోకి వచ్చి .. మనం సమత్వస్థితిని పొంది ఆత్మ మూలప్రకృతిని అవగతం చేసుకుంటాం.


ఇలా “ఆత్మ యొక్క మూల ప్రకృతిని అవగతం చేసుకుని సమత్వస్థితిని పొందటమే యోగం” అనిపించుకుంటుంది కానీ ‘శీర్షాసనం’, ‘కుక్కుటాసనం’ వంటి శారీరక విన్యాసాలు చేసి “అదే యోగం” అనుకున్నంత మాత్రాన ఆత్మసత్యం అవగతమైపోదు.


“ధ్యానం” ఉన్నచోట “వివేకం” ఉంటుంది. వివేకంతో కూడిన బుద్ధితో చేసే కర్మలన్నీ కూడా ఫలాపేక్ష లేని అకర్మలుగా మారి లోకకల్యాణ కారకాలవుతాయి. కనుక ..


“కర్మణ్యకర్మ యః పశ్యేదకర్మణి చ కర్మ యః

స బుద్ధిమాన్ మనుష్యేషు స యుక్తః కృత్స్నకర్మతృత్”

                          (భ.గీ.4-18)


“కర్మలో అకర్మనూ, మరి అకర్మలో కర్మనూ దర్శించేవాడు మానవులలో బుద్ధిశాలి; అతడే యోగి .. మరి సమస్త కర్మలనూ చేసేవాడు” అంటూ యోగస్థితిలో ఉన్న బుద్ధిమంతుడు చేసే కర్మలపట్ల స్పష్టతను తెలియజేశారు శ్రీకృష్ణులవారు.


కర్మను “అకర్మ”గా .. అకర్మను “కర్మ”గా భావించడమే నిజమైన కర్మ! “భావం” అన్నదే “భవం” అవుతుంది కనుక “నా ద్వారా ఉత్తమోత్తమమైన కర్మ నిర్వహించబడుతోంది” అని భావన చేసుకుని .. కర్మ ఫలితాన్ని ఆశించకుండా అంకిత భావంతో కర్మలు చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడే అది “అకర్మ” అవుతుంది.


“అనుకోవడం” బీజం .. “అవడం” వృక్షం. బీజం వేస్తే ఏదో ఒకరోజు వర్షం పడి .. ఆ బీజం మొలకెత్తి .. ఒకానొక మహావృక్షం అయినట్లు .. ఉత్తమోత్తమమైన సంకల్పం చేసినప్పుడే ఉన్నతోన్నతమైన కర్మలు నిర్వహించబడతాయి.


“తపస్విభ్యోధికో యోగీ జ్ఞానిభ్యోపి మతోధికః

కర్మిభ్యశ్చాధికో యోగీ తస్మాద్యోగీభవార్జున”

                       (భ.గీ.|| 6-46)


“ఒకానొక యోగి తాపసులకంటే శ్రేష్ఠుడు; శాస్త్రజ్ఞానులకంటే శ్రేష్ఠుడు; సకామ కర్మలను ఆచరించే వాడి కంటే కూడా శ్రేష్ఠుడని భావించబడుతుంది కనుక ఓ అర్జునా! నువ్వు యోగివి కా!” అన్నాడు యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు.


వేదవ్యాసులవారు నాలుగు వేదాల సారాన్నీ మరి సకల ఉపనిషత్తుల సారాన్నీ చక్కగా క్రోడీకరించి “పంచమవేదం”గా మనకు మహాభారతాన్ని అందించారు.


ఆనాటి సమకాలీన సమాజానికి చెందిన హీరోలను శ్రీకృష్ణుడు, పాండవుల పాత్రలుగా మరి విలన్‌లను కౌరవుల పాత్రలుగా మలచి అన్ని సత్యాలనూ మరియు అన్ని ధర్మాలనూ అందులో పొందుపరచి అనేకానేక ఉపమానాలతో అతి రమణీయమైన మహాభారత కావ్యాన్ని మనకు అందించారు. శ్రీకృష్ణుడిని గోవర్థన గిరిధారి అని స్తుతించాడు.


” ‘గోవర్థన గిరిధారి’ అంటే ధ్యానయోగ సాధకుడే” “గో” లేదా “గోవులు” అంటే “ఇంద్రియాలు”. “మామూలు కంటికి కనిపించేదే జ్ఞానం’ అనుకునే “గోకులం” లో ఒకడిగా పుట్టిన ధ్యాన యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు .. “గోపాలకుడి”లా వాళ్ళ ఇంద్రియాలను పాలన చేస్తూ “వర్థనం” చేస్తూ .. తన అతీంద్రియ శక్తితో చిటికెన వ్రేలుపై “గోవర్థనగిరి”ని ఎత్తినంత సులభంగా వాళ్ళ సమస్యలకు సమాధానాలు ఇచ్చేవాడు.


అంటే “ధ్యానయోగసాధన” అన్నది మన ఇంద్రియాలను వర్థనం చేసి మనల్ని అతీంద్రియుల్లా పరిమార్చివేస్తుంది.


అప్పుడు మనం ఇక్కడ వినపడే వాటితో పాటు ఎక్కడో గొప్ప గొప్ప “ఆస్ట్రల్ మాస్టర్స్” ఇచ్చే జ్ఞానపూర్వకమైన సందేశాలను వినవచ్చు; ఇక్కడ కనపడే వాటితో పాటు ఎక్కడో అందమైన లోకాలలోని సుందర దృశ్యాలను చూడవచ్చు; ఇక్కడి వాసనలతో పాటు ఏవేవో జన్మల వాసనలు కూడా పసిగట్టవచ్చు; మరి ఇక్కడ ఉన్న గురువులతో పాటు ఏవేవో లోకాలలో ఉన్న గురువులతో సంపర్కం పొందవచ్చు.


ఇలా తన ఇంద్రియాలపై తాను స్వయంగా పట్టును కలిగి ఉన్న ఒకానొక యోగి .. తన ఆత్మశక్తితో, ఆత్మజ్ఞానంతో అందరినీ సేదదీరుస్తూ గోవర్థునుడిలా వర్థిల్లుతూంటాడు.


“యత్ర యోగీశ్వరః కృష్ణ యత్ర పార్థో ధనుర్ధరః

తత్ర శ్రీర్విజయో భూతిః ధృవా నీతిర్మతిర్మమ”

                        (భ.గీ.18-78)


 ‘యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు మరియు ‘ధనుర్ధారి’ ‘ధర్మధారి’ అయిన అర్జునుడు ఉండేచోట సకల సంపదలు, సర్వవిజయాలు, సకల భోగాలు మరి సుస్థిరమైన నీతి కొలువుదీరి ఉంటాయి.” అని తన నిశ్చితాభ్రిప్రాయాన్ని తెలియజేశాడు సంజయుడు.


ప్రాపంచిక కర్మలు చేస్తూనే అర్జునుడిలాంటి మనం అంటే “నరులం” .. ధ్యానం చేసి మన ఆత్మ యొక్క విశ్వరూపాన్ని దర్శించుకుని ఆ రకంగా జీవించాలి♪. అప్పుడు మన జీవితరధానికి పూర్ణాత్మ అయిన “నారాయణుడు” రథసారధిలా సారధ్యం వహిస్తూ ప్రాపంచిక కురుక్షేత్రంలో మనకు విజయాన్ని ప్రాప్తింపజేసి మనల్ని కూడా నారాయణుడిలా అంటే తనంతటి పూర్ణాత్మలా మార్చేస్తాడు.


మళ్ళీ ఆ సరి క్రొత్త పూర్ణాత్మ .. సూర్యకిరణాలలా వేల కొద్దీ అంశాత్మలను ఈ భూమి మీదకు పంపించి వారికి సందేశాలు అందిస్తూ .. వారి ద్వారా తాను సృష్టి రచనా విన్యాసంలో పాలుపంచుకుంటూ ఉంటుంది.


ఇదంతా జరగాలంటే ముందు నరుడిలా పుట్టిన అంశాత్మలో .. నారాయణుడిలాంటి “పూర్ణాత్మ”ను తెలుసుకోవాలన్న జిజ్ఞాస మొదలుకావాలి. అందుకు తపన చెందాలి; సాధన చెయ్యాలి.


“మనుష్యాణాం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే

యతతామపి సిద్ధానాం కశ్చిన్మాం వేత్తి తత్త్వతః”

                            (భ.గీ.7-3)


 “వేలకొద్దీ మనుష్యుల్లో ఎవడో ఒకడు మాత్రమే తనను గురించి తాను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు♪. అలా ప్రయత్నించిన వారిలో కూడా ఒకానొకడు మాత్రమే తన యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటాడు” అని లెక్కలు కూడా కట్టారు భగవాన్ శ్రీకృష్ణుల వారు. అంతేకాదు....


“సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ

అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః”

                        (భ.గీ.18-66)


“సర్వధర్మాలనూ అంటే సమస్త కర్తవ్యకర్మలనూ తాత్కాలికంగా పరిత్యజించి .. నీలో నువ్వు స్వీయ శరణు భావనతో వుండు. అప్పుడు అన్ని పాపాల నుంచి నిన్ను నువ్వే విముక్తి చెందించుకుంటావు” అని అభయం కూడా ఇచ్చారు.


 “ఇక్కడ ‘మామ్’ అంటే అంశాత్మ అనీ ‘అహం’ అంటే ‘పూర్ణాత్మ’ అనీ గుర్తించి మన సకల ఇంద్రియ ధర్మాలనూ, కుటుంబ ధర్మాలనూ ఒకింత ప్రక్కన పెట్టి .. ధ్యాన అభ్యాసం చెయ్యాలి” అని అర్థం చేసుకోవాలి.


కళ్ళు రెండూ మూసేసుకుని మన అంతరంగంలోకి ప్రవేశించి మన స్వీయ ఆత్మను అంటే “మామ్”ను మనం శరణు వేడాలి. అప్పుడు మన “పూర్ణాత్మ” అంటే మన “అహం”.. మనం గత అనేకానేక జన్మలుగా కూడబెట్టుకున్న అనేకానేక పాపకర్మల నుంచి మనల్ని విముక్తులను చేస్తుంది.


మనం కొంత చేస్తే .. మన పూర్ణాత్మ మిగిలింది చేయగలుగుతుంది. మనం చెయ్యవలసింది చేస్తేనే మనం పొందవలసిన వాటిని ఏ ఆటంకం లేకుండా సకాలంలో పొంది శోకవిముక్తులం అవుతాము.


విశ్వనియమాలు చాలా ఖచ్చితంగా ఉంటాయి. ప్రతి ఒక్కటీ అక్కడ ఖచ్చితంగా అమలుపరచబడుతుంది.


 కనుక ఎంత “ఎరుక”తో మనం ఇక్కడ జీవిస్తే పైలోకాలలో అంత ప్రశాంతంగా ఉంటాం; అదే “సరస్వతీ జ్ఞానం” మరి ఆ సరస్వతీ జ్ఞానాన్ని మనకు తత్త్వ దర్శినులే అందిస్తారు. అలాంటి తత్త్వదర్శినులు దానికి సంబంధించిన ప్రశ్నలనే మనం తత్త్వ దర్శనులను అడగాల్సిందే.


తత్త్వదర్శనం పొందిన “జ్ఞానులు” మనకు సత్యాన్ని బోధిస్తారు:


“తద్విద్ది ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా

ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్త్వ దర్శినః”

                          (భ.గీ.4-34)


“తత్త్వదర్శనుల నుంచి జ్ఞానాన్ని గ్రహించాలి. వారికి సాష్టాంగ దండ ప్రణామాలు ఆచరించి .. సేవించి కపటం లేకుండా భక్తితో వారిని సముచితరీతిలో ప్రశ్నించాలి. అప్పుడు ఆ జ్ఞానస్వరూపులు నీకు సత్యాన్ని ఉపదేశిస్తారు” అని తెలియజేసారు శ్రీకృష్ణుల వారు.


“రెండు కాళ్ళూ .. రెండు చేతులూ, ఒక మొండెం .. ఒక శిరస్సు .. మనస్సు మరి బుద్ధి” అనే ఎనిమిది అంగాలతో శ్వాసగురువుకు సాష్టాంగ నమస్కారం చెయ్యాలి.


అంటే బహిరేంద్రియాలనూ, మనస్సునూ బుద్ధినీ “శ్వాస గురువు”కు అధీనం చేసి .. “పరి సేవ” చెయ్యాలి. అప్పుడు మన చిత్తవృత్తులన్నీ నిరోధం కాబడి మన దివ్యచక్షువు తెరుచుకోబడి .. తత్త్వదర్శనులైన ఎందరెందరో ఉన్నత లోకవాసులు మనకు దివ్యచక్షువులో దర్శనం ఇస్తారు. వారిని మనం “చనిపోయిన తరువాత ఏమౌతుంది?” అన్న పరిప్రశ్న వేసి వారి నుంచి “సరస్వతీ జ్ఞానాన్ని” పొందాలి. అదొక్కటే ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరూ తెలుసుకోవలసిన జ్ఞానం.


అంతే కానీ ధ్యానంలో జ్ఞానస్వరూపులు దర్శనం ఇవ్వగానే .. “నా కొడుకు పెళ్ళి ఎప్పుడవుతుంది?” .. “నాకు ప్రమోషన్ ఎప్పుడొస్తుంది?” .. “నాకు పిల్లలు పుడతారా?” .. “నా స్థలానికి ఎంత రేటు వస్తుంది?” అంటూ మూర్ఖపు ప్రశ్నలు అడగకూడదు. అలా అడిగిన వారు ఏమీ సమాధానం చెప్పరు.


ఊరికే మనవైపు కాస్సేపు చూసి వెళ్ళిపోతారు అంతే! ఏకలవ్యుడు తపస్సు చేసి శారదాదేవి ప్రత్యక్షం అయ్యింది. అప్పుడు అతడు తనకు గొప్ప విలువిద్యను ప్రసాదించమని ఒక ప్రాపంచిక కోరిక కోరాడు. ఆమె “తథాస్తు” అంది! కానీ ఆ విలువిద్య అతనికి పనికి వచ్చిందా? శారదా దేవి అంతటి తత్త్వదర్శిని ప్రత్యక్షమైనప్పుడు .. “ఈ లోకంలో మరి పరలోకంలో కూడా నన్ను తరింపజేయగల సరస్వతీజ్ఞానాన్ని ఇవ్వమ్మా” అని కోరుకోవాలే కానీ .. ఈ లోకంలోనే పనికివచ్చే విలువిద్యను కోరుకోవడం తప్పు.


మన జీవిత పరిస్థితులను మనమే ఎంచుకుని వచ్చాం కాబట్టి .. “వాటిని మార్చెయ్యాలి” అనుకోవడం తప్పు.


బాగా ధ్యానం చెయ్యడం మరి ప్రాపంచిక జీవితానికి సంబంధించి ఏమీ అడగకుండా ఉండడమే సరియైన జీవితం♪. సరియైన జీవితాన్ని జీవిస్తూంటే .. రావలసినవి అన్నీ వాటంతట అవే వస్తాయి.


“ధ్యానం” అన్నది ఒక ఆత్మవిజ్ఞానమహాశాస్త్రం! ఇంత గొప్ప శాస్త్రాన్ని నిరంతర ధ్యానప్రచారం ద్వారా ప్రపంచం అంతా తెలియజేసే బృహత్తర బాధ్యతను చేపట్టిన “పిరమిడ్ మాస్టర్స్” అందరూ “ఆత్మవిజ్ఞాన శాస్త్రవేత్తలు”!


గత అనేకానేక జన్మలుగా “శ్వాస మీద ధ్యాస” పెట్టి ధ్యానం చేసి చిత్తవృత్తులను నిరోధం చేసుకుని .. నాడీ మండలాన్ని శుద్ధి చేసుకుని .. దివ్యచక్షువును ఉత్తేజితం చేసుకుని తమ మీద తామే ప్రయోగాలు చేసుకున్న ఈ అనుభవజ్ఞానశాస్త్రజ్ఞులు .. ఇప్పుడు ఆ ఆత్మవిజ్ఞానాన్నంతా ఇతరులకు బోధించడానికే ఈ జన్మలో ఆ దివి నుంచి ఈ భువికి దిగివచ్చారు.


దివ్యచక్షువును ఉత్తేజితం చేసుకోవడం ద్వారా ప్రతి ఒక్కరూ “మనంకూడా దివి నుంచి భువికి దిగి వచ్చిన ఆత్మలం” అని తెలుసుకుంటారు. సుఖమయప్రాణాయామం ద్వారా మరి అభ్యాస వైరాగ్యాల ద్వారా సూక్ష్మంలో మోక్షాన్ని పొందుతారు.


ఇలా అభ్యాస వైరాగ్యాల ద్వారా గత అనేకానేక జన్మలుగా ఎంతెంతో ధ్యానసాధన చేసిన మాస్టర్లంతా ఒక్కొక్క జీవిత ప్రణాళికతో .. ప్రపంచంలోని ఒక్కొక్క ప్రాంతంలో పుట్టి తాము నేర్చుకున్న ఆత్మవిద్యను అందరికీ బోధిస్తూ ఆధ్యాత్మిక ఉద్యమాలను నిర్వహిస్తున్నారు.


తమ దివ్యచక్షువుతో ఉన్నత లోకాలను దర్శిస్తూ అక్కడి మాస్టర్లతో సజ్జనసాంగత్యం చేస్తూ తమ “జ్ఞానచక్షువు”ను ఉత్తేజితం చేసుకుంటారు. అప్పుడే వాళ్ళకు “యుక్త అవబోధ” కలిగి ఇతరులకు ఆత్మసత్యాలను సరిఅయిన విధంగా బోధించగలిగే అర్హత వస్తుంది.


సకల రాజరికపు సంపదలతో తులతూగుతూన్న బుద్ధుడు తన అంతర్వాణి ప్రబోధంతో సంపదలన్నీ వదిలివేసి .. ప్రపంచానికి దుఃఖ నివారణా మార్గం కనుగొనడానికి బయలుదేరాడు. ఆనాపానసతి ధ్యానసాధన చేసి తన దివ్యచక్షువును ఉత్తేజితం చేసుకుని .. తన గతజన్మ పరంపరను చూసుకుని .. కర్మసిద్ధాంతాన్ని అవగతం చేసుకుని “బుద్ధుడు” అయ్యాడు.


“బుద్ధుడి”గా అయిన తక్షణమే అతడు తాను కనుక్కున్న సత్యాన్ని అందరికీ తెలియజేయడం మొదలుపెట్టాడు. మరి తన వాక్కును అద్భుతంగా వినియోగించుకుంటూ లోకోద్ధరణకు నడుము కట్టాడు.


అందుకే మనస్సును నిగ్రహించుకుని సత్యదర్శనం చేసిన ఒకానొక ధ్యానయోగి మాటకే అంతటి విలువ వస్తుంది కనుక “అర్జునా! నువ్వు ధ్యానయోగివికా నాయనా!” అని సూచించాడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో! అందుకు అర్జునుడు


“చంచలం హి మనఃకృష్ణ ప్రమాధి బలవద్ధృడమ్

తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరమ్”

                          (భ.గీ.6-34)


“ఈ మనస్సు చాలా చంచలమైంది. బాగా ప్రమాద స్వభావం కల్గినదీ, దృఢమైనదీ మరి ఎంతో బలమైంది. దీనిని నిగ్రహించడం అంటే గాలిని ఆపడంలా ఎంతో దుష్కరం” అని వాపోయాడు. అప్పుడు శ్రీకృష్ణుడు ..


“అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్

అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చగృహ్యతే”

                          (భ.గీ.6-35)


“నిస్సందేహంగా మనస్సు చంచలమైందే మరి దానిని వశపరచుకోవడం చాలా కష్టం! కానీ కౌంతేయా! .. అభ్యాస వైరాగ్యాల ద్వారా దానిని వశపరచుకోవడం సాధ్యమే! అని తెలియజేశాడు శ్రీకృష్ణుడు.  “అభ్యాసం” + “వైరాగ్యం” ..


రోజులో కాస్సేపు చర్మచక్షువులను మూసేసుకుని కర్మేంద్రియ చాపల్యాలన్నింటినీ లోపలికి ముడుచుకుని .. కూర్చోవడాన్ని “వైరాగ్యం” అంటాం! మరి శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చెయ్యడాన్ని “అభ్యాసం” అంటాం. ఇలా అభ్యాస వైరాగ్యాల ద్వారా ఇంద్రియాలతో కూడిన మనస్సును అదుపులో ఉంచుకున్న వారే మహేంద్రులు. వారి దగ్గరికే అక్షయపాత్ర .. కామధేనువు .. కల్పవృక్షం .. చింతామణి .. వజ్రాయుధం .. ఐరావతం.. ఇలాంటివి అన్నీ వచ్చి చేరుతాయి.


కాబట్టి, మనస్సు పట్ల జాగ్రత్త! మాట పట్ల జాగ్రత్త! మరి చేసే కర్మల పట్ల జాగ్రత్త వహించాలి! వారికే మాట శాంతంగా ఉంటుంది .. మనస్సు శాంతంగా ఉంటుంది .. మరి వారు చేసే కర్మలు ప్రశాంతంగా ఉంటాయి! ఇలా ప్రజలు అందరూ యోగులుగా మారితే భూలోకం అంతా కూడా శాంతిమయం అవుతుంది.

🙏  భగవద్గీత కు జేజేలు! 

వేదవ్యాసుల వారికి సహస్రకోటి ప్రణామాలు 🙏


సేకరణ....



                    







 


 

Monday, September 16, 2024 0 comments By: visalakshi

నేను ఎవరు?

                                                          

                                                     భగవాన్ రమణ మహర్షి...

       

   



అరుణాచల శివ..అరుణాచల శివ..అరుణాచల శివ..అరుణాచలా .....          


 *జీవితంలో  అన్నిటి కంటే  గొప్ప మత్తు "భగవాన్ " సన్నిధి "‌.... చలం.!!

*దర్శనం కన్నా ….ఆ దర్శనం కోసం ' ఆవేదన ' ఎంతో ముఖ్యం....... "రమణ మహర్షి" .!!

*కుటుంబంతో సహా..రమణాశ్రమానికి చేరుకున్నాక నా మనసును జయించారు భగవాన్".... చలం.!!

"ఇప్పుడే విస్కీ  మత్తుతో వ్రాస్తున్నాను...అని మొదలు పెట్టి ' అరుణాచలం నుంచి తిరిగి రమ్మని ' శ్రీశ్రీ ' ఉత్తరం రాసినా. అది చదివి చలించని, .కదలని  'చలం'…!!"విస్కీ కంటే గొప్ప మత్తు 'భగవాన్ ' "సన్నిధి "వలన లభిస్తుందని " .నువ్వే ఇక్కడకి రా..! అంటూ..తిరుగు జాబు రాశారు చలం. తన జీవిత చరమాంకం వరకు చలం గారు అరుణాచలంలోనే  ఉండిపోయారు.

  తన నివాసానికి "రమణస్థాన్"అని పేరు పెట్టుకున్నారు.రమణస్థాన్ లో చలంగారు పడిన వేదనకు,ఆవేదనకు అంతే లేదు. భగవాన్ "దర్శనంకన్నా... దర్శనంకోసం పడే 'ఆవేదన' ముఖ్యం"   అన్న భగవాన్ బోధ  చలం గారిపై బాగా ప్రభావం చూపింది.!


"*నేను…"...* నువ్వు  "  ఎవరో తెలుసుకుంటే మహదానందమే అన్న భగవాన్ చింతన చలంగారి తాత్వికలోక దర్శనానికి  తెరతీసింది.


* చలంగారి పై 'భగవాన్ ' బోధనల ప్రభావం..!!


లోకంలో గురుబోధ గొప్పది. ఆధ్యాత్మిక గురు బోధ ఇంకా గొప్పది..అయితే గురుబోధ బాధలకు ఉపశమనమే కానీ, శాశ్వత పరిష్కారం కాదు. గురువుదారి మాత్రమే చూపుతాడు.సాధనతో గమ్యా‌నికి చేరుకోవాల్సిన బాధ్యత…..మాత్రం మనదే...దానికి శరీరాన్ని కష్టపెట్టాలి. లౌకిక వాసనలకు దూరంగా వుండాలి. పరిసరాలు,ధ్వని, వాతావరణ కాలుష్యాలకు ఎడంగా జరగాలి. మనసుకు పట్టిన జాడ్యాల్ని,వికారాల కిలుంను వదిలించు కొని,మనసును తెల్లగా మల్లెపూవులా వుంచు కోవాలి.. అప్పుడే మన పెద్దలు చెప్పినట్లు 'సాధనమున పనులు సమకూరుతాయి'....!

రమణులవారి బోధనలు ఫలితంగా చలంగారు తనను తాను కష్టపెట్టుకున్నారు. తనలోని…"నేను" గురించి తెలుసుకోడానికి నానాయాతనలు పడ్డారు.

*నేనెవరు ...? నువ్వెవరు. ?ఈ రెండూ బోధపడితే మనిషి తన  జన్మకు  ఆనవాళ్ళు, తన అస్తిత్వానికి మూలాలు తెలుసుకున్నట్లే…. భగవాన్ ఆధ్యాత్మిక గురుబోధవల్ల మాత్రమే ఈ రెండూ తెలుస్తాయి.

ఇవి తెలుసుకున్న రోజున మానవుడి ఆనందానికి అంతుండదు. అవధులుండవు.‌ అనంతమైన ఈ జగత్తులో తాను పూసుకున్న లౌకిక భవబంధాల రంగువెలిసి పోతుంది... కళ్ళకు కప్పిన మాయపొర తొలిగి,సత్యం తెలిసిపోతుంది.అప్పుడు విశ్వం ఓ‌ ఊయలవుతుంది .మనం అందులో  పరుండే పసి పాపగా  మారిపోతాం..!

ఇన్నాళ్ళు లోకంలో పెంచుకున్న స్వార్థపు రేఖలు చెరిగిపోతాయి. భవబంధాల చిక్కుముడులు విడిపోతాయి.మనం  అనుభవించిన బాధలు,  మానసికక్షోభ  దూదిపింజలై ఎగిరిపోతాయి. మన ముందు భూమ్యాకాశాలు కూడా పిల్లాడి చేతిలో ఆటవస్తువులుగా మారిపోతాయి.

చలం గారు భగవాన్ రమణుల వారిని గొప్పఆధ్యాత్మిక గురువుగా భావించారు..సేవించారు.!

*సత్య శ్రవణం :..!!

మనం ఏది విన్నా,దాని ప్రభావం సున్నితమైన మన...మనస్సుపై బలంగా పడుతుంది. అందుకే ఏది పడితే అది వినకుండా..వినేటపుడు జాగ్రత్త వహించాలి. మంచి  మాత్రమే మనసుకు ' మైల'  అంటకుండాచేస్తుంది .అందుకే మంచినిమాత్రమే వినాలి. ఎందుకంటే విశ్వంలో అదే.. సత్యం...నిత్యం.!

ఈ సత్య వస్తువును గురించిన శ్రవణం రెండు రకాలని రమణుల వారు చెబుతారు.

 *మొదటిది గురువు వివరించి చెప్పగా వినడం.

 *రెండవది తనకుతానే ప్రశ్నించుకోవడం…

గురువు వివరించి చెబితే..అది ద్రాక్ష పాకం.తేలిగ్గా తెలిసిపోతుంది......సులభంగా బోధ పడుతుంది. రెండోది నారీకేళ పాకం..ఇది మనకు మనమే సాధించుకోవాల్సిన మార్గం. ఇది కొంత కష్టం. తినగాతినగా వేము తీయన అన్నట్లు..నిరంతర సాధనతో‌‌ అభ్యాసంతో సాధించుకోవాలి. అఖండమైన ' నేను ' గా తనయందే అన్వేషించి, సమాధానం కనుగొనాలి. అయితే..ఈ రెండింటిలో ఏది గొప్పదంటే..‌ రెండోమార్గమే గొప్పదంటారు రమణుల వారు..గురువు దారి చూపుతాడు శిష్యుడు స్వయంగా  ప్రయాణించి అమృతభాండాన్ని కనుగొనాలి. ఆ తర్వాత అందుకొని,సేవించి అలా అలౌకమైన ఆత్మానందాను భూతిని పొందాలంటారు రమణుల వారు

చలం గారు తన జీవిత చరమాంకం వరకు ఈఆత్మానందానుభూతి కోసమే తపించారు.తపస్సుచేశారు.

*"మిధ్య" అంటే ..?

"నేను " అని మీరంటున్నారే... ఆ   " నేను "  ఎవరో తెలుసుకుంటే... ఆ తర్వాత మీకే తెలు స్తుంది." అంటారు భగవాన్ రమణుల వారు.....మనం " నేను " అనే భౌతిక ప్రపంచం లో ఉన్నాం. నిద్రలో మాత్రం " నేను " ఎక్కడా కనబడదు.  'నేను ' అనేది పనిచేయదు. మనం నిద్రలో ఉన్నపుడు నిద్రలోని  నేనే... మెళుకువలోనూ ఉంటుంది. అయితే వ్యత్యాసం నిద్రలోని నేనుఆలోచించే మనసుతో కలవడం లేదు మెలుకువలో కలుస్తోంది అంతే...

*నీ నిజ స్వరూపం ఏది ?

నీ నిజం స్వరూపం ఏది? ఆలోచన తో కలిసి పోవడమా.?లేక కలగకుండా వేరుగా ఉండడమా?" ఇప్పుడు అంటే ...

మెలుకువలో ఇలా చెప్తున్నావు మరి నిద్రలో ఇలా అనలేవుకదా  పోనీ... నిద్రలో ' నేను'   అని అనగలవా?".

*నిజానికి అనలేము.....

" రెండు అవస్థలలొను...నీవు ఉన్నావు అసలు ఉండుటనేది "ఆత్మ"  లక్షణము... ఉన్నాను అను  స్ఫురణను అనుభవిస్తూనే ఉన్నావు.. ఈ ఆత్మే నీ అసలు స్వరూపము…"..అంటారు భగవాన్ .

మరైతే..ఈ సత్యాన్ని తెలుసు కోవడానికైనా,ఆలోచించాలి కదా? అన్న అనుమానం వస్తుంది. అప్పుడెలా? అంటే….

"ఇతర ఆలోచనలని  తొలిగించడానికే .....ఈ ఆలోచన" ఈ" నేను"  ఎవరు? ....ఎవరిది ..ఈ అజ్ఞానం .ఈ ప్రశ్నలకు జవాబు దొరికితే.... ఆత్మ ను గుర్తించినట్లే ఎవరైనా ఎంతటి అజ్ఞాని..... అయినా తాను లేనని అనలేడు కదా....నిద్రలో నేను లేనని అనలేడు కదా.అలా నిజమైన ఆత్మ ఉనికిని అంగీకరించక తప్పదుఆ ఆత్మను గుర్తిస్తే అసలు  అజ్ఞానమే ఉండదు..అంటారు భగవాన్.!!

ఆత్మజ్ఞానం అంటే కోరికలు లేకపోవడమే కదా? కోరికలు లేకపోతే అతను మానవుడు అవుతాడా? అన్న ప్రశ్న మళ్ళీ మనిషి బుర్రను తొలుస్తుంది...దానికి భగవాన్ ఏమంటున్నారో చూడండి…

నిద్రలో నేను ఉన్నది కానీ మనస్సు తో కలవలేదు.అప్పుడు శరీరాన్ని కూడా గుర్తించలేదు అందుచేత నేను   అంటే...ఈ దేహము.మాత్రమే అని అనవు...... నీకు అన్యంగా దేనిని చూడవు..ఇక ఇప్పుడు దేహంతో ఏకత్వం పొంది యున్నావు..నేను అంటే ఈ దేహమే అని తలుస్తూన్నావు నీకు అన్యంగా ఇతర వస్తువులు,విషయాలు ఉన్నాయని తలుస్తూన్నావు...అప్పుడు కోరికలు  పుడుతున్నాయి నిద్రలో ...నీకు ఏ కోరికా లేదు.ఏ దుఃఖమూ లేదు .  ఈ మానవ ఆకారమే " నేను " ,అనుకున్నప్పుడే ఈ కోరికలు పుడతాయి. కనుక ఈ మానవ ఆకారమే నేను అనుకొని...ఈ కోరికలు ఈ..వేడుకలు ఎందుకు  కొని తెచ్చుకోవాలి?

నిజానికి ఈ జడ శరీరము నేను అని పలకదు.... మరి ఈ శరీరానికి భిన్నంగా మరొకటి ఉండాలి కదావుంటే .అదేమిటి?అదే. "ఆత్మ ".ఈ శరీరమే నేను అని అనదు మధ్యలో మెలుకువతో పాటు నేను అని ఒకటి పుడుతుంది అది "అహం" మునుముందుగా ఈ "నేను " ఎవరు అని నిరంతరం ప్రశ్నించుకో, అపుడు నీకు తప్పక సమాధానం దొరుకుతుంది.."  అంటారు రమణుల వారు.

స్వామి ఎప్పుడూ, ఎవరినీ, దేనినీ, దేనికి ఖండించేవారు కాదు,విమర్శించేవారు కాదు,నివారించేవారు కాదు, నిరోధించేవారు కాదు, నిందించేవారు కాదు. ఎవరినీ, ఏమీ అనకుండా ఊరికే జరిగి పోతున్న వాటిని చూస్తూ వుండేవారు.“జీవితాన్ని బంధించకు. తలుపులు పూర్తిగా తెరిచెయ్యి. నీలోఅందరికీ,అన్నింటికీ, అన్ని వేళలా చోటియ్యి," అనేదే స్వామితత్వం.అదే  ఆయన మార్గం. అదే ఆయన శక్తి . ఆయన్నిసమీపించిన వారు ఏ వర్గానికి ,ఏ మతానికి, యేసిద్ధాంతానికి, సాంప్రదాయానికి, ఏ పద్ధతికి . చివరికి దేనికి చెందినవారైనప్పటికీ ఆయన ఎప్పుడూ ఎవరినీ.., దేనినీ,... ఖండించ లేదు , విమర్శించ లేదు.చివరికి జీవితంలో ఎదురైన దుర్మారుల్ని ,దొంగల్నిదుష్టుల్ని, శత్రువుల్ని తిరుగుబాటుదారుల్ని ఎవరినీ ఎప్పుడూ ఆయన ఏమీ అనలేదు, ప్రశ్నించలేదు, కనీసం సందేహించ లేదు. ఏమీ చేయలేదు. అందుచేత ఆయన్ని ఎవరూ ఏ కారణానికి సమీపించినా, వారి అహం అణగిపోయేది. ఆయన్ని...యేం చేయడానికి వారికి తోచేది కాదు, అది మౌనాన్ని మించిన గొప్ప ఆయుధం. చలం గారు ..ఈ భగవతత్వానికి లొంగిపోయారు. ఆయన  తన జీవిత చరమాంకం వరకు భగవాన్ చూపిన దారిలో నడవటానికే….ప్రయత్నించారు. తన అనుభవ సారాన్ని."భగవాన్ స్మృతులు" పేరిట అక్షరబద్ధం చేశారు. ప్రతి రమణ భక్తుడు చదివి తీరాల్సిన పుస్తకం ఇది. చదువుతున్నంత సేపు మనం రమణుల వారి సన్నిధిలోవున్నా మన్న అనుభూతి కలుగుతుంది.


చిత్రమేమిటంటే 1917కు పూర్వం చలంగారు రాసిన ఓ భావగీతంలో...ఓ" ఆరాధన "  కనబడుతుంది.

*ఎన్నాళ్ళనీ యెట్టు యెదురు చూచెద స్వామి

సుంతైన దయ రాదుగా.

పలుపాపి నేనని పడిపడి వేడిన

విలపింప వలదను పలుకైన లేదాయె.

ప్రాణవల్లభయని పలువరించుటె కాని

యెన్నడైనను పోనీ కన్నెత్తి చూచెదవే.

పిలుచుటే తడవుగ వారింతు వీవని

పలుకుల వలలోనె పడి మోసపోయితి.

వేచితి నిరతము ప్రేమ దృష్టిని గోరి

వేచి విసుగుటె కాని ఫలమేమి లేదాయె.(*చలం.) 

ఆప్పట్లో  చలంగారి మీద రవీంద్రుడి ప్రభావం ఉన్నా కూడా ఆ గీతాల్లో మనకి భగవంతుణ్ణి స్వయంగా చూసిన అనుభవం కనిపించదు. ఒక సౌందర్యం భావనని మాత్రమే  ప్రేమిస్తున్న వైనం కనిపిస్తుంది. కాకపోతే 1917 నుంచి 1937 దాకా అంటే ఇరవయ్యేళ్ళు ఆయన సౌందర్యాన్ని స్త్రీలో.... వెతుక్కున్నాడు, నిజమైన ఈశ్వరసందర్శనానుభవం ఎలా ఉంటుందో తెలియడానికి ఆయనకి  ఆ తర్వాత ముప్పై ఏళ్ళు పట్టింది. 

రమణాశ్రమానికి చేరుకున్నాక.ఆయన భగవంతుణ్ణి సౌందర్యంలో వెతుక్కున్నాడు.అనుభవానికి తెచ్చుకున్నాడు. అంతకు ముందు..ఒక భక్తుడు భగవంతుణ్ణి ప్రేమించినట్టుగా ఆయన స్త్రీని ప్రేమించాడు.  ఆ మహామోహమయ, ఆనందమయ అనుభూతి,ఆయన ప్రేమలేఖల్లోనూ, తొలి ఎనిమిది నవలల్లోనూ కనిపిస్తుంది. కానీ…., 1938 లో దీక్షితులు గారితో కలిసి మొదటిసారి తిరు వణ్ణామలై వెళ్ళి రమణ మహర్షిని చూసిన తర్వాత ఆయనలో సంఘర్షణ మొదలయ్యింది. అంతదాకా తనకుసౌందర్యనిధానంగా నూ,ఆనందప్రదాయినిగానూ ఉన్న స్త్రీ ఒకవైపూ, రమణ మహర్షి మరొక వైపూ ఆయన్ని లాగడం మొదలుపెట్టారు.  దాదాపు పది పన్నెండేళ్ళు ఆయన తీవ్రమైన నలుగులాట పడ్డాడు. అదంతా ఆయన దీక్షితులు గారికి రాసినఉత్తరాల్లో స్పష్టంగా కనిపిస్తుంది.

*భగవాన్ తో…..

 లోకోత్తర అనుభవం..!!

ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు ఓ సారి రమణస్థాన్లో  ఉన్న చలం గారిని చూడటానికి వెళ్ళారు ఈ సందర్భంగా ఆయన చలం గారిని ఓ ఆసక్తికరమైన ప్రశ్న వేశారు..

"భగవాన్ని చూసినందు వల్ల మీకు కలిగిన లోకోత్తర అనుభవం ఏమిటి? అంతా చూడ్డం వేరు..మీరు చూడ్డం వేరు" అనడిగారు..  హనుమత్ శాస్త్రి గారు.

 దీనికి చలంగారు రెండు నిముషాలు గంభీరంగ చూసి ఓ చిరునవ్వు నవ్వి ఇలా చెప్పారు..

"భగవాన్ని చూడటానికి నిజానికి చాలా ప్రశ్నలతోవెళ్ళాను. కానీ జరిగిన చిత్రం ఏమంటే..భగవాన్ ఎదుట చాలామందిలో నేనూ ఒకడిగా ఒక పక్కకూర్చొని వున్నాను. భగవాన్ ఎవరిమీదా దృష్టి నిలపకుండా సరాసరి ఒక చూపు నాపై వేశారు. దాంతో నాలో చెప్పరాని వేదన  బయల్దేరింది. అంటే చండ్ర నిప్పులు మీద కూర్చోబెడితే ఎలావుంటుందో అట్లా ఆ చూపును నేను భరించలేక పోయాను. తరువాత నేనడగదలచిన ప్రశ్నలన్నీ..నాకే పేలవంగా తోచాయి. నేనేమీ ఆయన్ను అడగలేకపోయాను. తరువాత ఎన్నోసార్లు ఆశ్రమానికి వెళ్ళాను. నాలోని శంకలకూ..సంశయాలకు ఏదో‌ తేజస్సు జవాబు చెప్పినట్లయింది."..అని చలంగారు బదులు చెప్పారు....

                                                            అరుణాచల శివ🌹

Sunday, June 18, 2023 3 comments By: visalakshi

నాన్నకో ఉత్తరం.....మణిగాడి లేఖ...

 నాన్నకో ఉత్తరం...





మీకంటూ ఒక రోజుని కేటాయించి ఆరోజు మీకు శుభాకాంక్షలు చెప్పాలని తహ తహలాడే ఎంతో మంది అమ్మాయిలని అబ్బాయిలని చూస్తూ,  ఆశ్చర్యపోతూ , ఈరోజు ప్రత్యేకంగానో, ప్రత్యక్షంగానో,పరోక్షంగానో అందరిచేత అందరి నాన్నలు శుభాకాంక్షలు అందుకొంటుంటే, మరి నేనెలా అందజేయను నా శుభాకాంక్షలు మీకు? "నేను మీదగ్గరికి వచ్చేయనా నాన్నగారు "? అని అడుగుదామనిపిస్తొంది , మరి నేను వచ్చేస్తే ..మీ మనవడు, మనవరాలు ఎలా?


 " ఉత్తరం అంటే ఎదుటి మనిషి మనముందే ఉండి మనతో మాట్లాడుతున్నట్లు ఉండాలి! ఏ నది వడ్డునో కూర్చుని, వెచ్చటి టీ తాగుతూ, గుప్పున సిగరెట్ పొగ, చేతిలో చెలి ఉత్తరం, పక్కన నెచ్చెలి అలా అలలా తీయగా మాట్లాడ్తున్నట్లుగా ఉండే భావన ఎంతో బాగుంటుందిట. చలంగారు ప్రేమలేఖలు చెప్తాయి.


మేము ఉత్తరాలు రాసే అవసరం లేకుండా ఎప్పటికప్పుడు క్షేమ సమాచారాలు తెలుసుకొనే అవకాశం మా చేతిలో ఉండేట్టుగా అరచేతిలోనే ప్రపంచాన్ని చూపించేస్తొంది ప్రస్తుత సాంకేతిక పరిజ్ఞానం.


మరిలా ఈ సెల్ ఫోన్లలో మాట్లాడుకొంటూ, కంప్యూటర్‍లో శుభాకాంక్షలు అందుకోంటూ అందరూ అధునిక సాంకేతికపరిజ్ఞానం ఆసరాగా అందరికి దగ్గర్లో ఉంటున్నట్టుగా భావించి, అంత ఆనందంగా పరస్పర శుభాకాంక్షల వెల్లువ కురిపిస్తుంటే నువ్వేంటి పాతకాలంలా ఉత్తరం వ్రాస్తున్నాననుకొంటున్నారా నాన్నగారు? " ఏం చేయను? వెళ్తూ వెళ్తూ కనీసం ఒక్కమాట చెప్పారా నాకు, నేను "వెళ్తున్నానమ్మా" అని, (అయినా నా పిచ్చి కాని , మీరు వెళ్ళేప్పటికి ఈ email కాని, ఈ సెల్ ఫోన్లు కాని ఉన్నాయా నాన్నగారు, నంబరు అడగడానికి  గాని, మెయిల్ అడ్రస్ అడగడానికి గాని) "నాన్నగారు స్కూలుకి వెళ్తున్నాను" అంటే "తప్పమ్మా వెళ్ళొస్తాను అనాలి, ఒక్క హాస్పిటల్ లో ఇలా అనకూడదు" అని చెప్పిన మీరు ఎక్కడ నేను "నాన్నగారు వెళ్ళొస్తాను అనండి" అని సతాయిస్తాననే కదూ మాటవరసకన్నా నాకు "వెళ్తున్నాను " అని చెప్పలేదు.


 అవును నాన్నగారు! ఒక్క విషయం ఎన్నాళ్ళుగానో అడగాలని అనుకొంటూ ఎప్పటికప్పుడు దాటేస్తున్నాను. ఆరోజు మీకు గుర్తుందా? అమ్మా , తమ్ముడు వరలక్ష్మి వ్రతం అని ఊరెళ్ళారు. చిన్నదాన్ని నాదగ్గిర ఉంచమని మీరు అమ్మదగ్గిర మంకు పట్టు పట్టారు, ఎందుకని ?  "ఆడపిల్లలు ఇద్దరూ ఉండాలి ఇంటి మహాలక్ష్ములు, వరలక్ష్మీ  వ్రతానికి వాళ్ళిద్దరూ ఉండాలి అన్నా కాని, వద్దంటే , వద్దని వాదన చేసి నెగ్గారు. ఎందుకు నాన్నగారు, మీరు అంత బతిమాలి నన్ను మీదగ్గిర అట్టేపెట్టుకొని, జాగ్రత్తగా చూసుకొంటానని మాట తప్పారు కదూ.. చూసుకోలేకపోయానని, అమ్మకి చెప్పెస్తే సరిపోయేది కదా, దానికి మీరలా వెళ్ళిపోవడమెందుకు? .


నాకింకా గుర్తుంది నాన్నగారు! తెల్లవారుఝామునే నన్ను లేపి తలంటు పోసి, నీకేమి తెచ్చానో చెప్పుకో చూద్దాం అని కళ్ళు మూసి , నాతో దోబూచులాడి మరీ చూపించిన ఆకుపచ్చ గళ్ళ పట్టులంగా కళ్ళల్లో నిన్నో మొన్నో కొని తెచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. అదివేసి, జడలు వేయడానికి విఫల ప్రయత్నం చేసి, " నాకు రాదురా అత్తయ్య చేత వేయించుకో " అని అన్నప్పుడు, పరిగెత్తుకొని వెళ్ళి అదేదో హక్కులా "అత్తయ్యా మా నాన్నగారు జడ వెయ్యమంటున్నారు " అంటే , "పండగ పనిలో ఉన్నానిప్పుడు, నా దగ్గిరకి పంపడమేమిటే?" అని విసుక్కొంటూ అత్తయ్య జడ వేస్తే , "ఇదిగోండి, పాపని విసుక్కొవద్దు, పసిపిల్ల దానికేమి తెలీదు " అని నన్ను తీసుకొచ్చుకొన్నారు కదూ.. నిన్న మొన్న జరిగినట్లుండే ఏ విషయాన్ని మనసుపొరల్లోంచి బయటికి పంపలేక పోతున్నాను. మరి పక్కింటావిడ విసుక్కొంది అని, అలా చెప్పి నన్ను తీసుకెళ్ళిన మీరు ఆరోజు సాయంత్రమే ఎందుకు వెళ్ళిపోయారు? "మావయ్యా వాళ్ళింటికి వెళ్తున్నాను" అన్నారు. ఆ తరువాత ఈరోజు వరకూ ఎంత మంది మీరు లేరని అలుసుగా తీసుకొని నన్ను విసుక్కొన్నారో మీకు తెలుసా? మీరు చెంతనుంటే ఎవరన్నా ఎమన్నా అనేవారా? ఎందుకొదిలేసారలా?


 మొన్నే అనుకోకుండా ఎవరో ఒక sms పంపించారు. అది చదువుతుంటే అసలు తప్పు మాది కూడా ఉందనిపిస్తొంది నాన్నా!.


ఒక చిన్న పాప, వాళ్ళ నాన్న అలా నడుస్తూ ఉంటే.... ఒక చిన్న పిల్ల కాలువ దాటాల్సివచ్చిందిట. అప్పుడు వాళ్ళ నాన్న అన్నారుట:


 "చిన్నారి! నన్ను జాగ్రత్తగా పట్టుకోమ్మా! గబుక్కున ఎక్కడన్నా కాలువలో జారిపడ్తావేమో! జాగ్రత్త" అని చెప్తే ....ఆ చిన్నారి అందిట


 "నాన్నా! నేను నీ వేలు పట్టుకొంటే భయానికి గబుక్కున జార విడిచేస్తానేమో, నువ్వే నా వేలు పట్టుకో.. నేనెక్కడపడిపోతానో అని వడిసి పట్టుకొంటావు, అప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉంటావు, నేను సేఫ్" అని అందిట.


ఆ చిన్నారి తెలివితేటలు నిజానికి నా(మా)కు లేవేమో కదా నాన్నగారు, మేము మీవేలు వదిలేసాము. మీకు కోపమొచ్చింది కదూ.. "తెలియక చేసిన తప్పు నాన్నగారు ! మా వేలు పట్టుకోండి నాన్నగారు" అని చెప్పాడానికి అందనంత దూరానికి వెళ్ళిపోయారు. ఉండిలేక ఉన్నది మీరే, ఉన్నా కూడా లేనిది నేనే. మిమ్మల్ని మా వేలు పట్టుకోనీయకుండా , నేనే మీ వేలు పట్టుకొని నడుద్దామన్న స్వార్థం మమ్మల్ని ఇలా శిక్షించింది. అయినా... ఈరోజు ప్రత్యేకమంటూ అందరూ శుభాకాంక్షలు చెప్తుంటే, నేను మటుకు మౌనం వహించడమెందుకని, ఇంకో ఇన్ని జన్మలకి మీకే కూతురిగా పుట్టాలని, అప్పుడు ఆ భగవంతుడిని మిమ్మల్ని పూర్ణాయుష్కుడిని చేయాలని, మీరే మావేలు పట్టుకొని నడిపించాలని మనస్పూర్తిగా కోరుకొంటూ........


ఇక్కడ లేని నాన్నగారికి! ఇక్కడే ఉన్న నా శుభాకాంక్షలు. 


ఎప్పటికీ మీ కూతురే అయిన మణిగాడు


*******

మా చెల్లి రాసిన ఈ లేఖ నా మనసును కదిలించింది.. అందుకే ఇలా బ్లాగులో...నాన్న గారికి నా నమస్సులు..🙏🙏🙏...



Friday, February 3, 2023 0 comments By: visalakshi

అద్వైతం - విశిష్టాద్వైతం

ఓం శ్రీ గురుభ్యో నమః

                                   🙏🙏🙏...



అద్వైతం - విశిష్టాద్వైతం / జగత్ గురువులు జగతికి వెలుగులు.


శ్రీ శంకరాచార్యులు - అద్వైతం - సర్వ భౌతిక ప్రపంచానికి బ్రహ్మమే ఆధారం.


శ్రీ రామానుజాచార్యులు - విశిష్టాద్వైతం


 సర్వ భౌతిక ప్రపంచంతో బ్రహ్మం అంతర్లీనమై అంతా ఒక్కటే.


     

 జగత్తులో అనేక రకాల ఆధ్యాత్మిక సాధనాలున్నాయి. ఇందులో ఏది ఎవరికి తగినదనే దాన్ని సాధకుని యోగ్యత, అవగాహన స్థాయిని బట్టి నిర్ణయించి, అది వారికి ఉపదేశించేది గురువే. గురువు అంటే అజ్ఞానాన్ని దూరం చేసేవాడని అర్థం. ‘గు’ అంటే చీకటి. ‘రు’ అంటే ప్రకాశం. గురువు అంటే చీకటిని తొలగించి వెలుగుతో ప్రకాశింపచేసేవాడు అని అర్థం. జ్ఞాన మార్గ దర్శకుడైన గురువు స్థానం పరమ పవిత్రమైనది. జ్ఞానాన్ని ఆర్జించడం కన్నా సద్గురువు చరణారవిందాలను సేవించడం, అనుగ్రహాన్ని పొందడం ఉత్తమమైనది.


వేదాంతులందరూ జరిపే తత్వవిచారం జీవాత్మ, పరమాత్మల అంతర్లీనత ప్రాతిపదికన జరుగుతుంది. అవి వేరుకాదన్న ఏకాభిప్రాయమే వారందరిలో కనపడుతుంది. ప్రామాణికాలైన వేదాలు, ఉపనిషత్తులు, భగవద్గీత- అద్వైతం చెప్పేదంతా పొందుపరచి బ్రహ్మజిజ్ఞాసులకు అందుబాటులో ఉంచాయి. వేదాంతులైన మహాగురువులు ఆదిశంకరుడు, రామానుజుడు ఇద్దరూ జీవాత్మపరమాత్మల సంలీనమే అద్వైతానికి మూల సూత్రంగా అంగీకరిస్తారు. ఆ రెండింటి స్వరూపం మీద, ఆ సంయోగం జరిగేది ఎలాగో, అందుకు వారిచ్చే వివరణలు మాత్రం భిన్నమైనవిగా ఉన్నట్లు అనిపిస్తాయి.


జీవాత్మ పరమాత్మలు వేరుకాదని చెప్పే తిరుగులేని అద్వైతం శంకరుడిది. ‘లోకమాయ’, ‘కర్మసిద్ధాంతం’ కేంద్ర బిందువులుగా ఆయన అద్వైత వాదనలుంటాయి. జీవుడు, దేవుడు ఒకరేనన్న నిజాన్ని మాయా ప్రభావంతో మనిషి గుర్తించలేడంటారు శంకరులు. చీకటిలో చూసిన తాడును పాము అనుకుని, వెలుతురు రాగానే అది పాము కాదు తాడు అని తెలుసుకున్నట్లే- లేనిది ఉన్నట్లు, ఉన్నది లేనట్లు అనిపింపజేసే ‘సర్పరజ్జుభ్రాంతి’లాంటి అటువంటి మాయను అధిగమించలేనంత కాలం ‘అవిద్య’తో ఉండిపోతాడని చెబుతారు. జీవితకాలమంతా అతణ్ని వెంటాడుతూ వేధించే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలకు అది మూలరూపమంటారు. ఆత్మశక్తికి తప్ప అవి లొంగుబాటులోకి రావని తెలుసుకొమ్మంటారు. కార్యం లేకుండా ఫలితం ఉండదని, ఫలితం ఉండబట్టే అందుకొక కారణం ఉండితీరాలని ఆయన విశ్వసిస్తారు. వర్తమానంలో మనిషికి ఎదురయ్యే పర్యవసానాలన్నీ కార్యకారణాలతో ముడివడిఉన్నవేనని చెప్పే కర్మసిద్ధాంతం, ఆయన అద్వైతవాదనలన్నింటిలో కీలకమై కనిపిస్తుంది.


శంకరులు- నిద్రాణమై తనలోనే ఉన్న ఆత్మను జ్ఞానభక్తి సాధనలతో జాగృతం చేయమంటారు. అప్పుడే అది బ్రహ్మంతో పునరేకీకరణ పొందగలదంటారు. జ్ఞానానికి, భక్తికి సమగ్రమైన వివరణలుండే సౌందర్యలహరి, శివానందలహరి, వివేకచూడామణి వంటి రచనలు శంకరులవే. అహంకారభావనలు తొలగిపోవటమే జ్ఞానమని చెప్పే సారాంశమే ఆ రచనలన్నీ ప్రస్ఫుటిస్తాయి.


రామానుజులు వైదిక పరమైన దైవత్వాన్ని గురించి చెప్పే అద్వైతాన్ని ఆమోదిస్తారు. వేదోక్తమైన ఆస్తికత్వాన్ని సమర్థించేదాన్ని ‘విశిష్టాద్వైతం’ అన్నారు. దేహం, ఆత్మ రెండూ దైవ స్వరూపాలే అంటారాయన. శంకరులు చేసినట్లు- సగుణ నిర్గుణ బ్రహ్మలుగా, బ్రహ్మాన్ని వేరుచేసేందుకు అంగీకరించరు. అద్వైతానికి మౌలిక సూత్రమైన జీవాత్మపరమాత్మల సంవిలీనాన్ని మాత్రం వ్యతిరేకించరు. జీవుడు, పరమాత్ముడు ఒకరేనన్న ప్రగాఢ విశ్వాసంతో జీవుణ్ని పరమాత్ముడిని వెదకమంటారు. కర్మరాహిత్యం అయినప్పుడే జీవుడికి ‘శుద్ద సత్వస్వరూపం’ లభిస్తుందని, ‘బ్రహ్మశరీరం’ అంటే అదేనని, ఆ శరీరంతోనే అతడు అంతర్యామిలో విలీనం కాగలడన్నారు. ‘వైకుంఠపాప్త్రి’ అదేనంటారు.


సామాజిక స్పృహ కనపడని ఆధ్యాత్మికతను విశిష్టాద్వైతం ప్రోత్సహించదు. రామానుజులు-మనుషుల మధ్య సంచారం చేస్తూ, కులం మూఢనమ్మకాలకు అతీతంగా వారిని కొనసాగమంటూ ఉద్బోధించారు. దేవాలయాల్లో ప్రవేశానికి అందరూ అర్హులేనన్నారు. సామూహికంగా ప్రజలు, భగవత్సేవలు నిర్వహించమన్నారు. విశిష్టాద్వైతానికి వివరణలన్నీ ఆయన రచించిన శ్రీభాష్యం, వేదాంత సాగరం, వేదాంత సంగ్రహాల్లో కనపడతాయి.


శంకరుడు అది అద్వైతం అన్నా, రామానుజుడు విశిష్టాద్వైతం అని చెప్పినా, వారిద్దరూ భగవంతుడైన బ్రహ్మాన్ని చేర్చేది అద్వైత మార్గం ఒక్కటేనని తెలిసిన మహాజ్ఞానులు. అది సూత్రీకరించి మనిషికి సులభగ్రాహ్యం చేసిన మహాపురుషులు.


మన సనాతన ధర్మాన్ని కాపాడటానికి జన్మించిన

మహనీయులు,ఈ రోజు మన ధర్మం ఉందంటే

అది వారు ఏర్పరిచిన బాట,క్షేత్రాలు,మార్గదర్శనం తోనే అని మనం తెలుసుకోవాలి.


మన భారతీయ సంప్రదాయంలో ‘గురు’ శబ్దం చాలా మహత్తరమైనది. ఆధ్యాత్మిక వేత్తల్ని గురువులుగా భావించే విలక్షణ సంస్కృతి మనది. 


విశిష్ట దర్శనాలతో ప్రజానీకానికి మార్గదర్శనం చేసిన శంకరాచార్యులు, రామానుజాచార్యులు ఇరువురూ వైశాఖ శుద్ధ పంచమి నాడే జన్మించడం విశేషం.


#శ్రీ ఆది శంకరులనగానే అద్వైతం, శ్రీ రామానుజుడనగానే విశిష్టాద్వైతం గుర్తుకు వస్తాయి.


#శ్రీ ఆది శంకరాచార్యులు


శంకరులు కేరళలోని కాలడి గ్రామంలో జన్మించారు. ఆర్యాంబ, శివగురువులు వీరి తల్లిదండ్రులు. రెండేళ్ల స్వల్ప వ్యవధిలోనే వేదాలను, వేదాంతసారాన్ని అధ్యయనం చేసిన కుశాగ్రబుద్ధి. గోవింద భగవత్పాదుల వద్ద సన్యాస దీక్షను స్వీకరించారు. గురువుల ఆదేశానుసారం కాశీకి వెళ్ళి శిష్యులకు ఉపదేశంచేస్తూ, పండితులతో చర్చలు సాగిస్తూ, వివిధ మతాల్లోని దోషాలను సహేతుకంగా విమర్శించేవారు. మండనమిశ్రుణ్ని, అతడి భార్య ఉభయ భారతిని శాస్త్ర చర్చల్లో ఓడించి, సత్యనిష్ఠతో జ్ఞానమార్గ వైశిష్ట్యాన్ని గుర్తింపజేశారు. సన్యాసం ఒక మానసిక పరిపక్వ స్థితి. మనుషుల మధ్య ఉంటూనే మమతానుబంధాలను అధిగమించి మానవతా ధర్మాన్ని ప్రచారం చెయ్యాలని శంకర సందేశం.


శంకరులు బోధించిన తత్వం అద్వైతం. అది ఈ దేశపు అఖండత్వాన్ని కాపాడటానికి అక్షయమైన సిద్ధాంతం. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ వంటి శ్రుతి వాక్యాలు అద్వైత సిద్ధాంతానికి ప్రాతిపదికలు. నాలుగు వేదాల నుంచి ఈ నాలుగు వాక్యాలు గ్రహించి బ్రహ్మ స్వరూపాన్ని వివరించడంలో వాటిని సమన్వయించారు. శంకరాచార్యులు జ్ఞానమార్గానికి అత్యంత ప్రాముఖ్యం ఇచ్చారు.

          


 అద్వైతం అంటే రెండు కానిది. అంటే జీవుడికి, దేవుడికి భేదం లేదని చెప్పే మతమన్నమాట. ఈ సిద్ధాంతానికి రూపకర్త జగద్గురు శ్రీ ఆదిశంకరులు. కేరళలోని కాలడి అనే గ్రామంలో జన్మించిన ఆదిశంకరులు ప్రపంచమంతా జగద్గురువుగా గౌరవించే అత్యున్నతమైన ఆధ్యాత్మికవేత్త, మహాజ్ఞాని, మహాపండితులు. సౌందర్యలహరి, శివానందలహరి, వివేకచూడామణి, ప్రస్థాన త్రయభాష్యంతో బాటు ఈనాడు మనం స్తుతించుకునే అనేక స్తోత్రగంథాలు, ప్రకరణ గ్రంథాలు, కనకధారాస్తోత్రం, భజగోవింద శ్లోకాలు ఆయన రచించినవే. రవాణా సదుపాయాలు లేని రోజుల్లోనే ప్రపంచమంతా కాలినడకన పర్యటించి అన్ని మతాలను, విశ్వాసాలను ఒక తాటిపైకి తెచ్చిన ఈ జగద్గురువు భారతదేశంలో నాలుగు పీఠాలను స్థాపించారు.


 బదరీనాథ్, పూరి, శృంగేరి, ద్వారకలలో వీరు స్థాపించిన ఈ పీఠాలకు బాధ్యతలు చేపట్టిన వారు కూడా వీరి నామంతోనే జగద్గురువులుగా ప్రఖ్యాతి చెందుతుండటం విశేషం. వీరి లెక్క ప్రకారం దేహమే దేవాలయం. దేహంలో ఉండే జీవుడే దేవుడు. భౌతికమైన దేహం నశించినా, ఆ దేహంలో ఉండే జీవుడు మాత్రం స్థిరంగా ఉంటాడని అద్వైతుల నమ్మకం. నిశ్చలమైన బుద్ధితో ‘అహం బ్రహ్మాస్మి’ అంటే నే నే బ్రహ్మను అని తెలుసుకునేవాడు  జీవన్ముక్తుడు అవుతాడని అద్వైతులంటారు.

               ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మ సూత్రాలు అనే ప్రస్థానత్రయానికి భాష్యం రాశారు. వివేక చూడామణి, శివానందలహరి, సౌందర్య లహరి, భజగోవిందం, కనకధారాస్తవం వంటి గ్రంథాల్లో వారి పాండిత్యం వెల్లడవుతుంది. సర్వజనామోదంగా ఉండేలా శివ, విష్ణు, గణపతి, సూర్య, శక్తి రూపాలతో కూడిన పంచాయతన పూజా విధానాలను ప్రవేశపెట్టారు. శంకరులు జాతీయ సమైక్యతా సూత్రాన్ని పరిరక్షించడానికి ధార్మిక జాగృతిని కలిగిస్తూ బదరి, ద్వారక, పూరి, శృంగేరిలలో నాలుగు పీఠాలు స్థాపించారు.


                                  °°°°°°°°°°°°

🙏🙏🙏...


#శ్రీరామానుజాచార్యులు


రామానుజులు తమిళనాడులో శ్రీపెరంబుదూరులో జన్మించారు. తల్లిదండ్రులు కాంతిమతి, కేశవాచార్యులు. యామునాచార్యుల వద్ద వైష్ణవ దీక్షను పొందారు. తిరుకోష్ఠియారు ‘ద్వయ’ మంత్ర రహస్యాన్ని వివరించి గోప్యంగా ఉంచమని కోరితే మోక్షం ఏ కొద్దిమందికో పరిమితం కాకూడదని తలచిన రామానుజులు ఆలయ గోపురం అధిరోహించి అక్కడ గుమిగూడిన జనులందరికీ మంత్రాన్ని బోధించారు.


పరమాత్మ ఒక్కడే. ఆయన విశిష్ట గుణసంపన్నుడు. ఆ విశేషణాలు, తత్వాలకు గల లక్షణాల్ని, వాటి మధ్య పరస్పర సంబంధాన్ని అవగాహన చేసుకునేందుకు తోడ్పడేదే జ్ఞానమని విశిష్టాద్వైతం చెబుతుంది. సూక్ష్మరూపంలో ఉండే అనేక జీవాత్మలు స్థూల రూపుడైన పరమాత్మలో అంశగా ఉంటూ పరమాత్మతో భేదాన్ని కలిగి ఉంటాయని, ఇదే విశిష్టాద్వైతమని పేర్కొన్నారు రామానుజులు. రామానుజులు సంస్కర్త. నాటి సమాజంలోని వివిధ వర్ణాలవారికి వైష్ణవంలో స్థానం కల్పించారు. భక్తిని ఉద్యమస్థాయిలో ప్రచారం చేశారు.


రామానుజులు వేదాంత సారం, వేదాంత సంగ్రహం, వేదాంత దీపం అనే గ్రంథాలు రచించారు. బ్రహ్మ సూత్రాలు, భగవద్గీతకు భాష్యం వెల్లడించారు. ఆయన కేవలం వేదాంతి కాదు. సమత, మమతలను నిత్య జీవితంలో ఆచరించిన పుణ్య యోగి. అనేక ప్రత్యేక సేవలను భగవదారాధనలో భాగంగా చేసి, విలక్షణ పూజా విధానాన్ని వ్యాప్తి చేశారు.


 బ్రహ్మానికి, ప్రకృతికి భేదం లేదని బోధించే విశిష్టాద్వైత మత స్థాపకులు రామానుజాచార్యులు. ఈ మతాన్ని అనుసరించేవారు విశిష్టాద్వైతులుగా ప్రసిద్ధి. జగత్తు సత్యం, జీవుడు సత్యం, దేవుడు సత్యం అన్నది వీరి విశ్వాసం. దేహంలోని భాగాల వలె జీవుడు కూడా దేవునితో చేరి ఉంటారని, దేహం నశించిన తరువాత జీవుడు మరో దేహంలో ప్రవేశిస్తాడు లేదా ప్రకృతిలో లీనమైపోతారని వీరి నమ్మకం.


విశిష్టాద్వైతమతాచార్యులైన భగవద్రామానుజులు నేటి చెన్నైకు చేరువలోని శ్రీపెరంబుదూరులో జన్మించారు. కాంచీపురం లోని తిరుక్కచినంబికి శిష్యులైన రామానుజులు శ్రీరంగంలో గొప్ప పండితుడు, వైష్ణవ మత ప్రవక్త అయిన యామునాచార్యులవారి వారసుడిగా నిలిచారు.


 బ్రహ్మసూత్రభాష్యానికి విశిష్టాద్వైత దృష్టితో శ్రీ భాష్యం వ్యాఖ్యను రచించారు. మొట్టమొదటి మత సంస్కర్తగా నిలిచిన రామానుజులవారు వేదాంత సంగ్రహం, గద్యత్రయం వంటి విశిష్టమైన గ్రంథాలను రచించారు. ఉత్తరభారతమంతా విస్తృతంగా పర్యటించిన ఆయన దేశం నలుమూలలా నాలుగు శ్రీైవైష్ణవ మఠాలను నెలకొల్పారు. జాతి, మత భేదాలను పాటించకుండా భక్తి భావంతో భగవంతుని సందర్శించాలనుకున్న ప్రతి ఒక్కరికి ఆలయ ప్రవేశం కల్పించేలా చేశారు. తిరుమలతో సహా అనేక దేవాలయాలలో నిర్దిష్టమైన పూజావిధానాలను, సంప్రదాయాలను ఏర్పరిచారు.

                     

తత్వాలు భిన్నంగా గోచరించినా గమ్యం ఒక్కటే. పుణ్య శ్లోకులు సదా స్మరణీయులే.....,,🙏🙏🙏.....

సంగ్రహించిన వ్యాసం...



Thursday, February 2, 2023 1 comments By: visalakshi

సీతోపనిషత్

  ఓం నమో శ్రీ నారాయణాయ నమః




  శ్లో"  ఇచ్చా జ్ఞాన క్రియాశక్తి త్రయం యద్భావ సాధనం!

     తద్బ్రహ్మసత్తా సామాన్యం సీతాతత్వ ముపాస్మహే !!


మం!!  ఓం దేవాహవై ప్రజాపతి మబ్రువన్, కా సీతా కిం

      రూపమితి, సహోవాచ, ప్రజాపతిః సా సీతా ఇతి (1)

ఇచ్ఛా, జ్ఞాన, క్రియాశక్తులనే మూడు శక్తులూ ఎలాంటి దివ్యభావాన్ని సాధించడానికి ఉపయోగపడతాయో , అలాంటి బ్రహ్మసత్తాతో సమానమైన సీతాదేవి తత్వాన్నిఉపాసిస్తున్నాను. 

పూర్వం ఒకనాడు దేవతలు బ్రహ్మ దగ్గరకు వెళ్లి పితామహా! సీత అంటే ఎవరు? ఆమె ఎలాంటి రూపం కలిగి ఉంటుంది ?అని ప్రశ్నించారు.

బ్రహ్మదేవుడు వారికిలా సమాధానం చెప్పాడు. "సీతాదేవి మూలప్రకృతి స్వరూపిణి అందుకే ఆమె ప్రకృతి అని పిలవబడుతోంది.'సీతా' అనే పదంలో మొత్తం మూడు అక్షరాలు ఉన్నాయి. ఆమె సాక్షాత్తు మాయా స్వరూపిణి. విష్ణువు ప్రపంచ బీజం. 'ఈ'కారం మాయా, 'స'కారం సత్యం అమృతం, ప్రాప్తం, చంద్రుడు, 'త'కారం లక్ష్మీ బీజం.  శ్రీంకారం,వైరాజం , సోమ , అమృతావయవాలు కలిగిన దేవి  'ఈ'కార రూపిణి అవుతోంది. ఆ దేవి ఆభరణాలతో ముత్యాలతో అలంకరించబడివుంది. ఆది మహామాయ శబ్ద బ్రహ్మరూపం. అందుకే స్వాధ్యాయం సమయంలో ప్రసన్నురాలౌతుంది. సమున్నతమైన భావాల్ని ఉత్పత్తి చేస్తుంది. ఇక రెండవ మాయ పృధ్వీభాగంలో హలం (నాగలి)చివర సీతగా జన్మించింది.'ఈ'కార స్వరూపిణి అనే ఆమె ఆ దేవికి చెందిన మూడో మాయ. అది అవ్యక్త రూపంలో ఉంటుంది. శౌనకీయమైన శౌనకీ తంత్రంలో సీతాదేవి ఈవిధంగా వర్ణించబడివుంది. ఆమె శ్రీరాముడు సన్నిధిలో జగదానంద కారిణిగా ఉన్నది. సృష్టి , స్థితి, లయకారిణి కూడా ఆ సీతాదేవే.ఆ సీతమ్మ వ్యక్తంగా ఉన్న అన్ని జీవుల శరీరాలలో మూలప్రకృతి స్వరూపిణిగా జ్ఞేయరూపంలో ఉంటుంది. ఆమె ప్రణవ స్వరూపిణి కనుక ప్రకృతి అని వ్యవహరిస్తారు. ఆమెనే బ్రహ్మవాదినీ అని కూడా అంటారు. ఆ దేవి  "అధాతో బ్రహ్మజిజ్ఞాసా" స్వరూపిణి , సర్వవేదమయి , సర్వకీర్తిమయి , సర్వధర్మమయి , సర్వలోకమయి , సర్వాధార కార్యకారణమయి , మహాలక్ష్మీ తదితర దేవేశుల భిన్నాభిన్న రూపమయి , చేతనా చేతనాత్మక , బ్రహ్మ స్థావరాత్మక , గుణ ,కర్మ ,విభాగ భేదంలోదేహ స్వరూపిణి, ఆమె. దేవ ,ఋషి ,మనుష్య ,గంధర్వ స్వరూపిణి, అలాగే అసుర ,రాక్షస, భూత ,ప్రేత ,పిశాచ , దేహాలు ధరించినది.పంచభూత ,ఇంద్రియ ,మనః ప్రాణ స్వరూపిణి కూడా ఆమేనని తెలుస్తోంది. 



ఆ సీతాదేవి 1.ఇచ్ఛాశక్తి 2.క్రియాశక్తి 3.సాక్షాత్ శక్తి అనే నామాలతో మూడు రూపాల్లో శక్తి స్వరూపిణిగా ఉన్నది. ఆమే శ్రీ, భూ , నీలా , భద్రరూపిణీ ,ప్రభావరూపిణీ ,సోమసూర్యాగ్ని రూపిణీ అవుతున్నది. ఆ జనని సోమరూపిణిగా ఓషధుల్ని పుట్టిస్తోంది.కల్పవృక్షం, పుష్ప ,ఫల‌ ,లతా, గుల్మాత్ములైన ఔషధ భేషజాత్మికా ఉంది.అమృతం రూపంలో దేవతలకి మహస్తోమరసఫలాన్నిస్తోంది. అలా దేవతలకు అమృత రూపంలో, మానవులకు అన్నం రూపంలో , పశువులకి గడ్డి రూపంలో ఇలా సకల జీవులకీ ఎన్నో విధాలుగా ఆహారాన్ని అందిస్తోంది. ఆ సీతాశక్తి సూర్యాదులతో సకల లోకాల్నీ ప్రకాశింపజేస్తోంది. రాత్రి -పగలు రూపంతో , కాలస్వరూపిణిగా కల , విమేషం నుంచి ఘడియ,8జాములు ,దినం ,వారం ,పక్షం ,ఋతుఆయన ,సంవత్సర భేదాలతో మనుషులకి (వందసంవత్సరాలు ) కల్పనతో ప్రకాశిస్తోంది. ఇలా చిర ,క్షిప్ర రూపాలలో నిముషం నుంచి పదార్ధం వరకు ఉన్న ఈ కాలచక్రాన్ని  ఒక చక్రం లాగ త్రిప్పుతూ ,తన కాల విశేషాలతో ప్రకాశిస్తూ, తానే కాల స్వరూపిణి అవుతోంది.

ఆ సీతాదేవి అగ్ని రూపం కలిగింది. ఆమె ఆకలి దప్పికల రూపంలో ప్రాణులలో , ముఖ రూపంలో దేవతలలో , శీతోష్ణ రూపంలో వనౌషధులలో , కాష్ఠం(కర్ర) లోపలా బయటా నిత్యానిత్య రూపంతో ఉఃటుంది. ఆ శ్రీదేవి మొత్తం మూడు రూపాలు ధరించి శ్రీహరి సంకల్పం ప్రకారం లోకాల్ని రక్షిస్తూ ఉంటుంది. కాలానుగుణంగా ఆయా అవతారాలు ధరిస్తుంది. శ్రీ అని లక్ష్మీ అని భూదేవి అని ఆమెని పిలుస్తారు. ఆ తల్లి సప్త సాగరాల్లో నీరుగా , సప్త ద్వీపాలతో కూడిన భూమిగా, భూమి మొదలు14లోకాలకీ ఆధార ఆధేయమైన ఓంకార రూపిణి గా ఉంటుంది. సీతాదేవి అవతారమైన నీళాదేవి విద్యున్మాలినీ రూపంతో సకల ఔషధులకీ ,ప్రాణులకీ  పోషణ నిమిత్తం సర్వ స్వరూపిణి గా ఉంటుంది. అంతేకాక ఈ దేవి సమస్త భువనాలకీ క్రింది భాగంలో  జలాకారాత్మకమైన ఒక మండూకం (కప్ప)రూపంలో భువనాలన్నిటికీ ఆధారంగా ఉంటుంది.


సీతాదేవి క్రియాశక్తి స్వరూపిణి. ముందుగా శ్రీ మహావిష్ణువు ముఖం నుంచి నాదం , ఆ నాదం నుంచి బిందువు, ఆ బిందువు నుంచి ఓంకారం , ఆ ఓంకారానికి చివర వైఖానస పర్వతం ఆవిర్భవించాయి. ఆ పర్వతం నుంచి కర్మజ్ఞానమయమైన ఉపశాఖలు వచ్చాయి. ఆ ప్రదేశం లో త్రయీమయ రూపంలో అనగా ఋగ్వేదం యజుర్వేదం సామవేదం.. సర్వార్ధాలు దర్శనమిస్తాయి. లోకంలో వేదాలు మూడే అని చెప్పినప్పటికీ కార్యసిద్ధికో నాలుగో వేదం ఏర్పడింది. ఆ నాలుగో దాన్నే ఆసంగిరసం అంటారు. ఈ అధర్వాంగి రసవేదం కూడా త్రివేదాత్మకంగానే ఉంటుంది. ఋగ్వేదం21శాఖలతో., యజుర్వేదం 109శాఖలతో సామవేదం 100శాఖలతో ,అధర్వణ వేదం 50శాఖలతో ఉంది. ముందుగా అన్ని దర్శనాలకన్నా వైఖానస దర్శనం ప్రత్యక్ష దర్శనంగా ఉంది. ఆ తరువాత కల్పం ,వ్యాకరణం ,శిక్ష, జ్యోతిష్యం , నిరుక్తం ,ఛందస్సు అనేవి షడాంగాలు (ఇవే వేదాంగాలు).వీటి ఉపాంగాలైన న్యాయ మీమాంస లు ఏర్పడ్డాయి. ధర్మాన్ని తెలుసుకోవడం కోసం వేదవేదాంగాలన్నిటికన్నా అధికంగా  కాలానుగుణంగా ధర్మశాస్త్రాలు ఏర్పడ్డాయి. ధర్మశాస్త్రము అంటే అది మునీశ్వరుల అంతఃకరణ ప్రవృత్తే. బ్రహ్మ చెబుతున్నాడు ..ఇంకా ఇతిహాస పురాణాలు 1. వాస్తు వేదం 2.ధనుర్వేదం 3.గాంధర్వవేదం 4.ఆయుర్వేదం 5.మునివేదం..అనే ఈ అయిదు ఉపవేదాలు ఉన్నాయి. అలాగే దండం ,నీతి, వార్త ,విద్య ,వాయుజయం లాంటి స్వయంప్రకాశాలైన 21రకాల శాస్త్రాలున్నాయి. వైఖానస మహర్షికి పూర్వమే శ్రీ మహావిష్ణువు వాక్కు ప్రభవించింది. అది మూడువేదాల రూపంలో ఆవిర్భవించింది. వైఖానస మహర్షికి ముందు సాంఖ్యశాస్త్రం ఎలా పుట్టిందో అది ఏం చెప్పిందో మీకు బోధిస్తాను శ్రవణం చేయండి. (ఇతిహాస.. పురాణాలని పంచమవేదంగా పండితులు చెబుతారు.)


ఆ క్రియాశక్తి స్వరూపిణి ఉత్తమమైన బ్రహ్మమయ రూపం కలిగింది. సాక్షత్తు బ్రహ్మమైన ఆ శక్తిని స్మరించినంత మాత్రానే ఆమె అనుభవాన్నిస్తుంది. అంతే కాక ఆ దేవి నిగ్రహానుగ్రహ స్వరూపిణి. శాంతి తేజోరూపిణి. ఆమె వ్యక్తావ్యక్తకారణ చరణాది సమగ్ర అవయవ రూపంలో ,భేదాభేద రూపంగా ప్రకాశిస్తుంది. ఆ దేవి భగవంతుడి సహచారిణిగా ఉంటుంది. అనపాయిని అయిన ఆమె అనవతరం సాధకులకి సహాయ ఆశ్రయాల్ని ప్రసాదిస్తుంది. కళ్ళు మూసి తెరిచేంతలోనే సృష్టి ,స్ధితి, సంహార తిరోధాన ,అనుగ్రహాది శక్తుల్నీ ఆమె ప్రదర్శించగలదు.ఇంత సమర్ధులు కలిగిన ఆ దేవి  (సీత) సాక్షాత్తు శక్తిగా ప్రస్తుతించబడుతోంది.

ఇచ్ఛాశక్తి అనేది మూడు విధాలుగా ఉంటుంది. 1.యోగశక్తి 2.భోగశక్తి 3.వీరశక్తి అని.

1.యోగశక్తి - ప్రళయకాలంలో విశ్రాంతి తీసుకుంటున్న భగవంతుడి (శ్రీహరి) వక్షస్ధలంలో శ్రీవత్సాకార రూపంతో విశ్రమిస్తూ ఉంటుంది.

2.భోగశక్తి- భోగరూపంలో కల్పవృక్ష ,కామధేను ,చింతామణి ,శంఖ ,పద్మ నిధుల్ని ,నవనిధుల్ని ఆశ్రయించి ఉంటుంది. భగవంతుణ్ణి కోరికలతోగానీ ,కోరికలు లేకుండా గానీ ఉపాసించేవారిని అనుగ్రహిస్తుంది. అంతేకాదు భక్తులైనవారు అగ్నిహోత్రాలతో, యమ నియమాది అష్టాంగాలతో ,ఆరాధనలతో ,నిత్యపూజా జపహోమాదికాలతో ,పితృపూజలు ,నైవేద్యాలు ,వ్రతాలు, నోములు వంటి వాటితో నిత్యం భగవంతుని ఆరాధిస్తున్నారు.

3.వీరశక్తి - సీతాదేవి వీరశక్తి రూపంలో చతుర్భుజగా ,అభయ ,వరద ,పద్మాలని ,కిరీటాది సకలాభరణాలనీ ధరించి ఉంటుంది. సకల దేవతలతో పరివేష్ఠించబడి ,కల్పవృక్షం నీడలో నాలుగు ఏనుగులు తమ తొండంతో ఉంచిన రత్న ఘటాలలోని అమృత జలాలతో అభిషేకం చేస్తుండగా, దివ్యంగా ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఆమె సమస్త దేవతల చేతా ,బ్రహ్మాదుల చేతా ,కామధేనువు ,వేదశాస్త్రాల చేతా ప్రస్తుతించబడుతూ జయాది అప్సరసలు చేత పరిచర్యలు అందుకుంటూ ఉంటుంది. ఆమె సూర్య చంద్రులనే దీపాలతో ప్రకాశించబడుతుంది. నారద తుంబురులు నిత్యం ఆమె ని తమ గానంతో సంతృప్తి పరుస్తుంటారు. ఆమె రాకా ,సినీవాలీ అనే ఛత్రాల నీడలో అలంకృతమై ఉంటుంది. హ్లాదినీ అనే మాయ ఆమె కి చామరాలు వీస్తూ ఉంటుంది. స్వాహా, స్వధా అనేవారు వ్యజనాలతో ఆమెను పూజిస్తారు. బృగువు లాంటి ఎందరో మహర్షులు ఆమెని నిత్యం అర్చిస్తుంటారు. ఇలా దివ్య సింహాసనం మీద ఆసీనురాలై సకల కార్యకారిణి అయిన ఆ లక్ష్మీదేవి భవనానికి వేరుగా స్థిరంగా ఉన్నది. ఆమె ప్రసన్నమైన నేత్రాలతో సర్వదేవతలతో పూజించబడుతూ వీరలక్ష్మి అనే నామంతో ప్రసిద్ధి చెందింది..

                              ఓం శ్రీ మాత్రే నమో నమః