Thursday, January 8, 2026 By: visalakshi

దేవి బీజాక్షరాలు..

 


                       ఓం ఐం హ్రీం శ్రీo శ్రీ మాత్రే నమః...


ఉమాదేవి బీజాక్షర వివరణ చేసిన గణపతిముని...


ఉమాసహస్రంలో శ్రీ కావ్యకంఠ గణపతిముని 

దేవి బీజాక్షరాలపై గొప్ప వివరణ నిచ్చారు.

ఈదర్శనం అంతా నవమ శతకంలో ముప్ఫైమూడవ స్తబకంలో ‘’వంశస్థ వృత్తాలు‘’లో మనోహరంగా, మనోజ్ఞంగా ఆరాధనా భావ బంధురంగా రచించి అమ్మవారి పరిపూర్ణ కటాక్షసిద్ధి పొంది , మనలనూ ఆ అనుభూతిని పొందమన్నట్లు చేశారు.


మొదటి శ్లోకంలోనే..!

‘’సుధాం కిరంతో ఖిల తాప హరిణీం,తమో హరంతః పటలేన రోచిషాం –శ్రియం దిశంతో దిశి దిశ్య సంక్షయాం ,జయంతి శీతాద్రి సుతాస్మితాంకురాః’’


తాపత్రయాన్ని ,వేడిని హరించే అమృతాన్ని వెదజల్లుతూ కాంతిపుంజంతో చీకటిని అజ్ఞానాన్ని నశింప జేస్తూ అన్నిదిక్కులలోను అక్షయమైన శోభను,సంపదను ప్రదర్శిస్తున్న ఉమాదేవి మందహాసాలు గొప్పగా విరాజిల్లుతున్నాయి అని కీర్తించారు.


నాలుగవ శ్లోకంలో..!

‘’మనః ప్రతాపస్య భవ త్యసంశయం ప్రవర్ధనం వైదిక మంత్రం చింతనం –ప్రశస్యతే ప్రాణమహః ప్రదీపనే దయాన్వితే తాంత్రిక మంత్రం సేవితా ‘’


దయామయీ ! ఋషులు దర్శించిన ‘’తత్స వితుః మొదలైన మంత్రాల ధ్యానంతో మన మనస్సు ప్రభావం పెరుగుతుంది.

ఇందులో సందేహమే లేదు.

శ్రీ విద్య మొదలైన తాంత్రిక మంత్రోపాసన వలన 

ప్రాణ తేజస్సు వృద్ధి చెందుతుంది అన్నారు.

వేదం మంత్రాలు తాంత్రిక మంత్రాలకంటే 

అర్ధ ప్రాధాన్యం కలిగి ఉంటాయని,

ఆమంత్రార్ధ విచారణ వల్ల జ్ఞానం కలుగుతుందని , 

హ్రీం కారం మొదలైన బీజాక్షరాలు ఉండే 

తాంత్రిక మంత్రాల పునశ్చరణ వలన 

ప్రాణనాడి శుద్ధి జరిగి నాదం అభివ్యక్తమౌతుందని 

దానివలన ప్రాణప్రభావం పెరుగుతుందని భావం.


తాంత్రిక మంత్రాలను ఉపాశించేవారినుండి విద్యుత్తుతో సమానమైన తేజస్సు బయటికి వచ్చి ప్రపంచమంతా వ్యాపిస్తుందని తర్వాతి శ్లోకంలో చెప్పారు ముని.

తాంత్రిక మంత్రోపాసకులకు మనస్సు వికారం చెందదని వారి దృష్టి ,బుద్ధి విషయ వాసనలకు లోను కాదని, వారి దేహంలో రోగాలు ప్రవేశించలేవని మరో శ్లోకంలో వివరించారు.


ఏడవ శ్లోకంలో..!

‘’స్మరన్తి మాయాం గగనాగ్ని  శాంతి భిః స్సహాచ్చ భాసా సాహితాభి రంబికే –తదా రసజ్నాం ద్రుహిణాగ్ని శాన్తిభి ర్భణంతి  దోగ్ధ్రీం తుఖషస్ట బిన్దుభిః’’


అమ్మా! పూర్ణ చంద్రుడితో కూడిన ఆకాశ -అగ్ని , శాంతులతో మాయా బీజాన్ని ,

చంద్రునితో కూడిన బ్రహ్మ –

అగ్ని శాంతులతో రసనా బీజాన్ని ,

ఆకాశ –షష్ఠ స్వర బిందువులతో ధేనుబీజాన్ని చెప్పటం లోకంలో అలవాటుగా ఉంది.

దీనికి వివరణ తెలుసుకోవాలి.

పూర్ణ చంద్రుడు అంటే పూర్ణానుస్వారం..అంటే 

నిండు సున్నా.

ఆకాశం అంటే హకారం అగ్ని అంటే రేఫం.

శాంతి అంటే ఈ కారం.

పూర్ణానుస్వారంతో కూడిన హకార ,రకార ,

ఈ కారాలతో ‘’హ్రీం ‘’అనే బీజాక్షరం ఏర్పడుతుంది.

దీన్ని మాయా బీజం అంటారు.


బ్రహ్మ అంటే క కారం .అగ్ని రకారం .శాంతి ఈకారం .

పూర్ణానుస్వారంతో కూడిన కకార,రకా,ఈకారాలతో ఏర్పడేదే’’క్రీం’’అనే బీజాక్షరం.

దీన్నే రసనాబీజం అంటారు.

ఆకాశం అంటే ఖ .హకారం షష్ఠ స్వరం,అంటే 

ఆరవ స్వరం ఊ కారం.

వీటన్నిటితో బిందువు సున్నాతో ఏర్పడిన ‘’హూం ‘’ 

అనే బీజాక్షరం ఏర్పడుతుంది.

దీనికే ధేనుబీజం అని పేరు.

ఈ మూడు మహా మంత్రాలు.


తరువాత గణపతి ముని ఈమహామంత్రం దేవతలను వివరించారు.


‘’అభాన్య తాడ్యాభువనేశ్వరీ బుధై  రనంతరా మాత రగాది కాళికా-ప్రచండ చండీ పరికీర్తితా పరా ,త్రయోష్యమీ తేమనవో మహా ఫలాః ‘’


దేవీ ! మొదటిది అయిన హ్రీంకార మాయాబీజంకు దేవత భువనేశ్వరి!

రెండవది అయిన క్రీం కార రసనాబీజానికి  దేవత 

కాళికా దేవి!

మూడవది అయిన హూం కార మనే  దేనుబీజానికి దేవత ప్రచండ చండి!

అని మంత్రం వేత్తలు చెప్పారు.

ఈ మూడు మంత్రాలూ మహా సిద్ధిదాయకాలే .

ప్రచండ చండికే మరో పేరు ‘’చిన్న మస్త ‘’లేక ‘

’వజ్ర వైరోచని ‘’అంటారు .


మరికొంచెం వివరణ ఇస్తూ తరువాతిశ్లోకాన్ని రచించారు.

‘’ఉపాధి భూతం శుచి నాభసం రజో దధాతి సాక్షా ద్భువనేశ్వరీపదం-తదాశ్రయా వ్యాపక శక్తి రర్భుతా,మనస్వినీ కాచన కాలి కేరితా ‘’


దేనితోను సంబంధంలేని స్వతస్సిద్ధంగా అందరికి ఉపాదానమైన ఆకాశరేణువే భువనేశ్వరి.

ఆ ఆకాశరేణువును ఆశ్రయింఛి ప్రాజ్న అయి ,

ఆశ్చర్య కరి అయి ,

మాటలతో వర్ణించటానికి వీలులేని సర్వవ్యాపకశక్తియే కాళికాదేవిగా చెప్పబడింది అని ముని అభిప్రాయం . 

అంటే సూక్షంగా చెప్పాలంటే  ఆకాశరేణువే భువనేశ్వరి అని సర్వవ్యాపిని అయిన చిచ్చక్తియే కాళీ అని అర్ధం .


తరువాత –

‘’అమర్త్య సామ్రాజ్య భ్రుతః ప్రవర్తికా ,విశాల లోకత్రయ రంగ నర్తికా –పరాక్రమాణా మది నాయికోచ్యతే ,ప్రచండ చండీతి  కలా సవిత్రి తే’’


‘’దేవతలా రాజు ఇంద్రుడిని ప్రపంచ వ్యవహారాలకు నియమించి మూడు లోకాలలోనూ ,

అప్రతి హతంగా విహరిస్తూ ,

వివిధ పరాక్రమాలకు అది దేవతవు అయిన 

నీ కళయే ప్రచండ చండిగా లోకంలో ప్రసిద్ధమైంది .

దీని వలన నీకు శచి ,,ఇంద్రాణి అనే పేర్లు సార్ధకాలైనాయి .

కొంచెం లోతుకు వెళ్లి విచారిస్తే –

ప్రచండ చండికి క్రియాశక్తి ముఖ్యం .

కాళికి వ్యాపించటం జ్ఞాన శక్తి  ముఖ్యం .

అయితే ఈ రెండిటికి మూలం భువనేశ్వరీ మాతయే .


ఈరకంగా దేవియొక్క మూడు మహామంత్రం 

దేవతా విభూతులను గణపతి ముని ప్రతిపాదించారు .

అలాంటి భువనేశ్వరిని అర్చించేవారికి ఏమిఫలం లభిస్తుందో తరువాతి శ్లోకాలలో చెప్పారు .


‘’స్మరన్ మానుం రోదితి భక్తిమాం స్తవ ,ప్రగృహ్య పాదం ముని రంబ లంబతే –ఫలం చిరాయ ప్రధమః సమాప్నుయాత్ ,పరో మరందం పద ఏవ విన్దతి ‘’


‘’తల్లీ ! నీ మంత్రాన్ని ధ్యానించే భక్తుడు ఏడుస్తూ  చాలాకాలానికి కాని ఫలాన్ని పొందలేదు .

కాని నీ పాదాల్ని ఆశ్రయించిన మౌని మాత్రం వెంటనే ఫలసారాన్ని పొందుతాడు .

అంటే మంత్రం జపిస్తే ఎప్పుడో కాని ఫలితం రాదు. 

అదే పాదాలను ఆశ్రయిస్తే వెంటనే ఫలితాన్ని పొందుతాడు అని భావం .


పదహారవ శ్లోకంలో..!

‘’అహం (నేను )అనే పదం యొక్క అర్ధం జ్ఞానం అనే 

తీగ అయితే ,

అది అంటే అహంకార పదార్ధం దేనుబీజం అయిన ‘’హూం ‘’అనే మంత్రార్ధం కంటే వేరైనది ఎలా అవుతుంది?

అహం అనేది ప్రాణధ్వనియొక్క వైఖరి అయితే దేనుబీజం అయిన హూం ఆ ప్రాణ ధ్వని వైఖరి కాదు 

అని చెప్పటానికి వీలే లేదు .

ఇంకొంచెం వివరంగా –

అహం శబ్దం ప్రాణ ధ్వనియే .

హూమ్కారమూ ప్రాణ ధ్వనే .

కనుక శబ్దంలో ఈ రెండిటికి భేదం ఉంది

కాని అర్ధంలో భేదం లేదని కావ్య కంఠుల అభిప్రాయం


మరో శ్లోకంలో..!

‘’పారేతు యాం చేతన శక్తి మామన ,న్త్యభాణి సా కుండలి నీతి తాన్త్రికైః-విలక్షణా  నామ చమత్రుతి ర్జడాన్ ,ప్రతారయత్యాగమ సార దూరాన్ ‘’


కొందరు తంత్ర వేత్తలు  చేతన శక్తి ఉన్నదాన్నే కుండలిని అన్నారు .

ఈ అసాధారణ చమత్కారం  మంత్రం శాస్త్రం  తెలియని మంద బుద్ధులను వంచించటానికే కదా అని ప్రశ్నించారు .

అంటే తాంత్రికులు చిచ్చక్తిని కుండలిని అన్నారు .

ఇది విలక్షణమైన చమత్కారం .

కుండలిని అంటే పాము అని సామాన్యులు భయపడతారు.

కాని కుండలిని అని వారికీ చప్పున స్పురించదు .

దీనివలన మోహం జరిగే ప్రమాదం ఉంది అని అంటారు .


‘’మతిః పరాచీ వ్యవహార కారణం ,భావేత్ప్రతీచీ పరమార్ధ సంపది –ఉభౌ దిశే యస్య మతి ర్విగాహతే ,

పదా చ మూర్ధ్నా చ స సిద్ధి ఇష్యతే ‘’బహిర్ముఖం 

అయిన బుద్ధి బయటి ప్రపంచ వ్యవహారానికి కారణం అవుతుంది .

అంతర్ముఖం అయిన బుద్ధి పరమ పురుషార్ధం అయిన మోక్షానికి కారణం అవుతుంది .

బహిర్ముఖం అంతర్ముఖం అయిన బుద్ధి గల యోగి 

పాదం చేతా ,శిరస్సు చేతా సిద్దుడౌతాడు .

ఇక్కడ పాదం అంటే హృదయం అనే ఆకాశం .

మూర్ధం అంటే సహస్రారం .

అంటే  హృదయం చేత సిద్దుడైనవాడు ప్రత్యేక దృష్టి సిద్ధుడు అవుతాడు .

సహస్రారం చేత సిద్ధుడైనవాడు పరాక్ దృష్టి సిద్దుడవుతాడు .

అందరికి పరాగ్ దృష్టి అంటే బాహ్య దృష్టి అవకాశం కలుగుతుంది .

కాని ప్రత్యక దృష్టి అంటే అంతర్ దృష్టి కలవాడికి 

బాహ్య దృష్టి అదుపులో ఉంటుంది .

జీవన్ముక్తుడు అయిన పురుషుడు మాత్రమే అంతర్ముఖంగా ప్రజ్ఞను విడవకుండా బాహ్య వ్యవహారాలూ నిర్వహించే సమర్ధుడు అవుతాడు..అని అంతరార్ధంగా వివరించారు. వ్యాఖ్యాతలైన కపాలి శాస్త్రి, పన్నాల రాధా కృష్ణ గార్లు .


బుద్ధికి లక్ష్యమైన స్థానం హృదయం అని హృదయంలో ఎల్లప్పుడూ దృఢంగా ఉన్నవాడు 

బుద్ధి బయటి ప్రపంచం విషయాల్లో తిరుగుతున్నా ,

చిచ్వరూపిణి అయిన దేవియందు నిమగ్నుడయ్యే ఉంటాడు .

కనుక జనన మరణ భయం అలాంటివారికి ఉండదని తరువాతి శ్లోకంలో చెప్పారు .

ధ్యానంలో అద్భుతమైన ధ్యాన శక్తిగా ,

దర్శనంలో దీప్తం అయిన దర్శన శక్తిగా ,

ప్రవచనం చేసేటప్పుడు శ్రేష్టమైన ప్రవచన శక్తిగా 

దేవిని దర్శించే నైష్టిక పురుషుడు బాహ్య విషయాల చేత బంధింపబడడు అని తరువాతి శ్లోకంలో వివరించారు . 

ఆశ్రితుల భయాన్ని పోగొడుతూ పండితుల చేత ప్రస్తుతింపబడే పరమేశ్వరి కనిపించేవాటియందు’ ’సంగం’’(బంధం ) వదిలి దర్శన కర్మ ను చూసే 

క్రాంతదర్శి అయిన కవి దృష్టిలో నిత్యం సన్నిహితం గా ఉంటుంది అన్నారు.


చివరి శ్లోకం లో..!

‘’అయం భయానాం పరిమార్జక స్సతాం సమస్త పౌపేఘ నివారణ క్షమః –మనోజ్ఞ వంశస్థ గణో గణేషితు-,ర్మనో మహేశాబ్జ దృశో దినోత్పలం ‘’


సజ్జనులకు భయహరంగా ,

సమస్త పాపాలకు నివారణగా గణపతి కవి 

‘’వంశస్త వృత్తం‘’లలో రచించిన 

ఈరమణీయ శ్లోక బృందం ఉమాదేవికి పరమానందం కలిగించుగాక అని చెప్పి ముగించారు.

                  *ఓం శ్రీ మాత్రే నమః*  

0 comments: