Sunday, October 11, 2015 By: visalakshi

నారాయణ ఉపనిషత్ భావము

ఓం శ్రీ నారాయణాయ నమో నమ: 





 1.నారాయణుడే ఆది పురుషుడు. ఇది సత్యము.నారాయణునకు ప్రజలను సృష్టించవలెనను కోరిక కలిగినది .అపుడు మొదటగా నారాయణుని నుండి ప్రాణము(ప్రాణవాయువు)ఉద్భవించినది.ఆ తరువాత మనస్సు,ఇంద్రియములు,మరియు ఆకాశము,వాయువు, అగ్ని,జలము,భూమి వీటన్నింటికీ అధారమైన విశ్వము ఉద్భవించినవి. నారాయణుని నుండి బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు ప్రజాపతులు ఉద్భవించిరి.నారాయణుని నుండి ఆదిత్యులు(12) రుద్రులు(11)  వసువులు(8) ఉద్భవించిరి.మరియు వేద చందస్సు ఉద్భవించినది. ఇవన్నియూ నారాయణుని యందే పుట్టుచున్నవి.ప్రవర్తిల్లుచున్నవి. నారాయణునియందే విలీనమగుచున్నవి. ఇది ఋగ్వేద ఉపనిషత్తు.

 2.నారాయణుడు శాశ్వతుడు. నారాయణుడే బ్రహ్మ. నారాయణుడే శివుడు. నారాయణుడే ఇంద్రుడు. నారాయణుడే కాలుడు(మృత్యుదేవత).నారాయణుడే ఉర్ధ్వ-అధోదిక్కులు.లోపల వెలుపల (శరీరములోనున్న-బయటనున్న)ఉన్నది నారాయణుడే. సర్వము నారాయణుడే.ఇది సత్యము. భూతభవిష్యత్ వర్తమానములు నారాయణుడే. విభాగములు లేక ఒక్కటిగా నున్నది నారాయణుడే. 
సర్వమునకు ఆధారభూతుడు,దోషరహితుడు,భావింపశక్యముకానివాడు,వర్ణింపనలవికానివాడు, పవిత్రుడు, దివ్యుడు అయిన దేవుడు నారాయణుడు ఒక్కడే. ఆ నారాయణుడే విష్ణువు. ఆ నారాయణుడే సర్వవ్యాపి అయిన విష్ణువు. ఇది యజుర్వేద ఉపనిషత్తు.

3."ఓం" అని మొదటగా ఉచ్చరించవలెను. తరువాత "నమ:" అని ఉచ్చరించవలెను.తరువాత "నారాయణాయ" అని ఉచ్చరించవలెను."ఓం" అనునది ఏకాక్షరము."నమ:"అనునది రెండక్షరములు. "నారాయణాయ"అనునది ఐదక్షరములు.ఈ విధముగా నారాయణుడు "ఓం నమో నారాయణాయ"అను అష్టాక్షరి మంత్రముగా రూపుదిద్దుకొనినాడు.

ఈ అష్టాక్షరి మంత్రమును పఠించుట వలన సర్వారిష్టములు తొలగును.సంపూర్ణ ఆయురారోగ్యములు సిద్ధించును.

సంతానము, యశస్సు, ధనము, గోగణములు వృద్ధి చెందును. ఆ తరువాత అమృతత్వము(ముక్తి)సిద్ధించును.ఇది సత్యము. ఇది సామవేద ఉపనిషత్తు. 





4.పురుషుడైన నారాయణుని ప్రణవస్వరూపమైన ఓంకారమును పఠించుట వలన సంపూర్ణమైన ఆనందం కలుగును.ఓంకారము అకార,ఉకార,మకారములతో ఏర్పడినది.ఎవరు సదా ఓంకారమును ఉచ్చరింతురో వారు(యోగి)జన్మసంసార బంధముల నుండి విముక్తులగుదురు."ఓం నమో నారాయణాయ" అను అష్టాక్షరీ మంత్రమును ఎవరు ఉపాసింతురో వారు శ్రీమన్నారాయణుని వైకుంఠమునకు చేరుదురు.అది పరమ పురుషుని హృదయకమలం.అది ఇంద్రియాతీతమైన విజ్ఞానముతో నిండియున్నది. కారణముచే ప్రకాశించుచున్నది.

దేవకీపుత్రుడైన శ్రీకృష్ణుడు బ్రహ్మము. మధువు అను రాక్షసుని చంపిన విష్ణువు బ్రహ్మము. పుండరీకాక్షుడు బ్రహ్మము; అచ్యుతుడు బ్రహ్మము.ఓంకారమే బ్రహ్మము. సర్వభూతములలో ఒక్కడుగా నున్నది నారాయణుడే. కారణరూపమైన అకారపరబ్రహ్మమే ఓంకారము.ఇది అధర్వణవేద ఉపనిషత్తు.


నారాయణ ఉపనిషత్తును ఉదయ,మధ్యాహ్న,సాయం సమయముల ఎప్పుడైనను పఠింతురో వారు పంచమహాపాతకములనుండి ,ఉపపాతకముల నుండి విముక్తులగుదురు.మరియు వారికి సర్వవేదములు పారాయణ చేసిన పుణ్యము లభించును.నారాయణ సాయుజ్యము(మోక్షము) లభించును.ఇది సత్యము.అని ఉపనిషత్తు ఉపదేశించుచున్నది.

నారాయణుడు అవ్యక్తము కంటే అతీతుడు. అవ్యక్తమునుండే ఈ బ్రహ్మాండము పుట్టినది. ఈ బ్రహ్మాండములోనే పదునాల్గు లోకములు, సప్తద్వీపములు,భూమి ఉన్నాయి.

ఓం శాంతి: శాంతి: శాంతి:.

సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు  




0 comments: