Friday, November 14, 2014 By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 73

ఓం శ్రీ పరబ్రహ్మస్వరూపాయ నమ:

" సాయి పారాయణగ్రంధము లో ప్రతీఘటనను పరిశీలిస్తే ఓ అద్భుతమైన ఆధ్యాత్మికబోధన అవగతమౌతుంది. మన శాస్త్రాలు స్మృతులు సంక్లిష్టంగా చెప్పేవే సరళంగా తెలియజేసిన ఘటనలే అవన్నీ. ఉదాహరణకు త్రివిధములైన సంచిత, ఆగామి, ప్రారబ్ధకర్మములలో ప్రారబ్ధం భోగముతో, జ్ఞానంచే సంచితము, మిత్రులు శత్రువుల పరుష మాటలచే ఆగామి నశించునని శాస్త్రం చెప్తున్దిలా -

ప్రారబ్ధం భోగతో నశ్యేత్తత్త్వజ్ఞానేన సంచితమ్ / 
ఆగామి ద్వివిధం ప్రోక్తం తద్ద్వేషి ప్రియవాదినో: //

దీనినే సామాన్యులకు సైతం అర్ధమయ్యే ఘటనలు పారాయణంలో చదివాను - అని  బాబాగారి సచ్చరిత్ర లోని ప్రతి సంఘటన ఒక జ్ఞానబోధ. ప్రతి ఘటనను వివరముగా రాయమని ప్రోత్సహించిన నా శ్రేయోభిలాషి, ప్రియస్నేహితురాలికి ధన్యవాదాలు తెలుపుతూ", బాబాగారు శ్యామాకు తెలిపిన ప్రారభ్దకర్మ గురించి ఇలా....

 ఒక భక్తుడు సాయిబాబాకి భక్తితో 2రూ"ల దక్షిణ ,సాయి పేరుమీద శిరిడీకి పంపాడు. ఆ సమయములో సాయి మశీదులో లేరు. ఆ రెండు రూపాయలను శ్యామా తీసుకొని సంతకం చేసాడు. శ్యామాకు బాబాగారిని పరీక్షించాలని వారి సర్వజ్ఞత, శక్తి స్వయంగా చూడాలని,వాటిని సాయికి ఇవ్వకుండా, మశీదులో ఒక మూలకు పాతిపెట్టాడు. సాయి మశీదుకు వచ్చి ఏమీ మాట్లాడలేదు. కొన్నాళ్ళకు ,శ్యామా ఇంట్లో దొంగలు పడి 200రూ"లు దొంగిలించారు. శ్యామా బాధపడి, తనకు జరిగిన దుస్థితిని సాయితో చెప్పుకున్నాడు.  అపుడు సాయి నవ్వుతూ,  "నీకు చెప్పుకోడానికి నేనైనా వున్నాను. నా రెండు రూపాయలు పోయి ఆరు నెలలు అయింది. మరి నేనెవరితో చెప్పుకోవాలి." అని శ్యామావైపు సాయి గంభీరంగా చూసాడు. 

శ్యామా రెండు రూపాయలు దాచిపెట్టిన సంగతి సాయి తెలుసుకున్నారని సాయి సర్వజ్ఞత్వానికి ఆశ్చర్యపోయి బాబా! ఏదో తమాషాకొద్దీ, నేను 2రూ"లు దాచిపెడితే, నాకు 200రూ"ల నష్టం కలిగిస్తావా? ఇదేమి న్యాయం అని శ్యామా అన్నాడు.

  "ఎందుకు దిగాలు పడతావు, ఎవరి తలరాత ఎలావుంటే అలా జరుగుతుంది. మనచేతనిబట్టే ప్రారబ్ధమనే తలవ్రాత వుంటుంది. కర్మఫలాన్ని అనుభవించక తప్పదు" అని   ఉద్యోగం చేసే నీకు 200రూ"లు ఎంతో, ఏ ఉద్యోగం లేని ఈ ఫకీరుకు 2రూ"లు అంతే. అని శ్రీసాయి చెప్పడముతో ధర్మ సూక్ష్మానికి శ్యామా అశ్చర్యపడ్దాడు. బాబా హితబోధ వలన ప్రారబ్ధం అన్నది అనుభవించక తప్పదని, అది అనుభవిస్తే పోతుందని,   తెలుసుకొని తిరుగులేని విశ్వాసాన్ని సాయి మీద నిలుపుకున్నాడు.

  శ్యామాద్వారా మనకు 3 విషయాలు బోధపడ్డాయి. అవి "1. గురువును పరీక్షించరాదు. 2. గురువు విషయంలో తప్పు చేస్తే, ఎప్పుడో ఒకనాడు శిక్ష అనుభవించక తప్పదు. 3. గురువుకు చేసే మంచైనా, చెడైనా శిష్యునికి 100 రెట్లు తిరిగి వస్తుంది " 

ఇక్కడ నా ప్రారబ్ధ ఘటన గురించి కూడా మీకు తెలియజేయాలి. దాదాపు ఐదు నెలల క్రితం నేను,మావారు మా వియ్యంకులవారి ఇంటికి వెళ్ళి వస్తుండగా, రాత్రి వర్షం పడి, చిన్న,చిన్న చినుకులు పడుతుండగా నడుచుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ పరధ్యానంగా ఉన్న సమయంలో,బైక్ మీద ఒకవ్యక్తి మమ్మల్ని కంఫ్యూజన్ చేస్తూ మా ముందుకు వచ్చి నామీద లైట్ ఫోకస్ చేస్తూ నాకు తెలియకుండా పక్కకు వచ్చి నా మంగళసూత్రాలు, నల్లపూసలగొలుసు ఒక్క క్షణంలో లాక్కుని వెళ్ళిపోయాడు. నేను లాగేస్తున్నాడు అని అరుస్తుంటే మావారు పరిగెత్తి పట్టుకోబోయి పడిపోయారు. వర్షం వల్ల రోడ్డుపైన జారి పడిపోయారు. వాడు అప్పటికే పారిపోయాడు.నా అరుపులకి చుట్టుపక్క జనాలు వచ్చి నన్ను ఓదారుస్తుండగా అప్పటి వరకు వెలగని స్ట్రీట్ లైట్స్ అప్పుడు వెలిగాయి. ఐదు ని"లలో  పోలీసులు వచ్చారు. జరిగినది తెలుసుకున్నారు. మా వియ్యంకులవారు,మేము పోలిస్ స్టేషన్లో ఎఫ్.ఐ.ఆర్ రాసి సంతకంచేసి ఇచ్చి వచ్చాము. జరిగిన దానికి నా అజాగ్రత్తే కారణమని తలచినా, మంగళవారం నాడు పోయాయి అని చాలా బాధపడ్డాను. ఈ సంఘటన తెలిసిన సత్సంగ సభ్యులు ఇద్దరుమరియు స్నేహితులు మమ్ములను ఇలా అడిగారు. "మీరు రోజూ బాబాకి పూజలు చేస్తారుకదా! మరి మీకెందుకిలా జరిగింది?"మేము చెప్పాము..."మీ కర్మలకు నన్ను కారణభూతుణ్ణి చేయకండి. నేను సాక్షీభూతుణ్ణి మాత్రమే!" అని బాబాగారు చాలా సంధర్భాలలో చెప్పారు.మరి నేను చేసిన ఏ కర్మఫలమో అని అనుకున్నాను. కానీ బాబాగారికి విన్నవించుకున్నాను. ఎందుకిలా జరిగిందో తెలియదు. పరిష్కారం నీకే తెలుసు. నీ చరణాలు పట్టుకున్న మేము ఈ విషయాన్ని నీ పాదాలవద్ద వుంచాము అని. ఒక వారంలో  స్టేషన్ నుండి ఫోన్ వచ్చింది. మీ గోల్డ్ దొరికింది. దొంగను పట్టుకున్నాము. కోర్టుకు వచ్చి మీ బంగారం తీసుకెళ్ళవచ్చు . అని చెప్పారు. మూడున్నర తులాలు పోతే, సగంకి కొంచం ఎక్కువ బంగారం ఇచ్చారు. అప్పుడు సత్సంగ సభ్యులు మీ భక్తి, పూజలవల్ల బాబాగారి అనుగ్రహం వల్ల మీకు పోయిన బంగారం దొరికింది అని అన్నారు.    ఎందుకు జరిగినా.. మమ్మల్ని సదా ఎరుకలో ఉండమని బాబాగారు హెచ్చరించినట్లు మాకు బోధపడింది.


  శివేరు ష్టే గురు: త్రాతా గురౌ రుష్టే న కశ్చ న !



శివుడు కోపించిన గురువు మనలను రక్షించును. గురువు కోపించిన రక్షించువాడు మరొకడు లేడని పరమేశ్వరుడు తెలిపెను.

  ఇద్దరువ్యక్తులవాక్కలహంతో ఆగామి నశించే విధం ...ఘటనలు సవివరముగా తదుపరి.....



సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు.




1 comments:

Sanath Sripathi said...

Can you please let me know the source of the sloka

ప్రారబ్ధం భోగతో నశ్యేత్తత్త్వజ్ఞానేన సంచితమ్ /
ఆగామి ద్వివిధం ప్రోక్తం తద్ద్వేషి ప్రియవాదినో: //