Wednesday, November 5, 2014 By: visalakshi

శ్రీ శ్రీ శ్రీ ద్వారకామాయి షిర్డీసాయి సేవా సత్సంగం - 72

 ఓం  శ్రీ సాయికృష్ణాయ నమో నమ:


"నిరంతర సాధన వల్ల సాంసారిక చింతలు పూర్తిగా తొలగిపోయి భగవచ్చింతన మనస్సును ఆక్రమిస్తుంది. అప్పుడు అవసానకాలంలో సైతం మనస్సులో అదే మెదలుతూ ఉంటుంది."- శ్రీరామకృష్ణులు.



శ్రీ సాయికృష్ణుడు నానాకు చేసిన జ్ఞానబోధ :


శ్లో" తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా!


   ఉపదేక్ష్యంతి తే జ్ఞానం జ్ఞానిన స్తత్వ దర్శిన:!!

 ఇది గీతలోని మూల శ్లోకం. మొదటి రెండు చరణాల్లోని అర్ధాన్ని నానా వివరించి చెప్పింది బాబాగారు అంగీకరించారు. మిగిలిన రెండు చరణాల గురించి బాబాగారు ఎలా వివరించారో వినండి. 

 "నానా! శ్లోకంలోని మూడవ చరణం మళ్ళీ పూర్తిగా గుర్తుకు తెచ్చుకో. జ్ఞానమనే శబ్దం వెనుక అవగ్రహం ('అ ' ని లోపించినట్లు చూపించే 2చిహ్నం )పెట్టు. అప్పుడు ఆ చరణానికి అర్ధం చెప్పు. జ్ఞానులు, తత్వదర్శులు జ్ఞానోపదేశాన్ని చేస్తారని అన్నచోట అజ్ఞానాన్ని ఉపదేశిస్తారన్న శబ్దం ఉపయోగించు. అప్పుడు నిజమైన అర్ధం నీకు తెలుస్తుంది. జ్ఞానం మాటలతో చెప్పబడేది కాదు. మరి దాన్నెలా ఉపదేశించగలం? కనుక జ్ఞానం అనే మాటకి వ్యతిరేక శబ్దాన్ని తీసుకో. అప్పుడు దాని అనుభవాన్ని చూడు. నీవు చెప్పిన జ్ఞానం అనే మాటకి అర్ధాన్ని విన్నాను. అక్కడ అజ్ఞానం అనే మాటకి అర్ధం తీసుకుంటే ఏమైనా నష్టమా? అజ్ఞానం అనేది వాక్కుకి విషయం అవగల్గితే అప్పుడు జ్ఞానం మాటలకి అతీతంగా ఉంటుంది. గర్భాన్ని చుట్టుకొని ఉండే పొరలాగా, అద్దానికి పట్టే దుమ్ములాగా,లేదా అగ్నిని కప్పేసే బూడిదలాగే అజ్ఞానం జ్ఞానాన్ని కప్పేసి ఉంటుంది. జ్ఞానం అజ్ఞానంతో ఆవరించబడి ఉంటుందని శ్రీకృష్ణుడు గీతలో అన్నారు.కనుక అజ్ఞానాన్ని పక్కకు నెడితే జ్ఞానం స్వాభావికంగానే ప్రకాశించబడ్తుంది. జ్ఞానం స్వయం ప్రకాశకం. కానీ నాచుతో ఆచ్చాదించబడిన శుద్ధజలంలా ఉంటుందది. ఈ నాచుని తెలివిగలవారు పక్కకు నెట్టుతారు. వారికే ఆ శుద్ధజలం లభిస్తుంది. చంద్రుడికీ, సూర్యుడికీ గ్రహణం పట్టినప్పుడు చంద్రుడు, సూర్యుడు సర్వదా ప్రకాశిస్తూనే ఉంటారు. కానీ రాహు,కేతువులు అడ్డుగా వచ్చి మన దృష్టిని అడ్డుకొంటారు. చంద్రుడిపై, సూర్యుడిపై వీరి ప్రభావముండదు. మన దృష్టికే అవరోధం కలుగుతుంది. అలాగే జ్ఞానం తన స్థానంలో స్వయంసిద్ధంగా సురక్షితంగా ఉంటుంది. కళ్ళకున్న చూడగల శక్తే జ్ఞానం. దానిపై నున్న తెర అజ్ఞానం. దాన్ని తప్పకుండా దూరం చేయాలి. ఆ తెర లేదా ఆచ్చాదనని చేతి కుశలతతో దూరంగా నెట్టేయాలి. అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి, చూడగల శక్తిని ప్రకటం చేయాలి.

ప్రణిపాతం, పరిప్రశ్న, సేవ ఇవి గురుకృపను పొందడానికి సాధనలు. జగత్తుని నిజమని అనుకోవటం పెద్ద అజ్ఞానం అజ్ఞానమే సంసారంలోని దు:ఖానికి మూలం. గురుకృప అనే కాటుక కళ్ళకి పెట్టుకుంటే మాయా ఆవరణ ఎగిరిపోతుంది. స్వాభావిక జ్ఞానం మిగిలిఉంటుంది. దేవుడు, భక్తుడు వేరు అనుకోవడమే విలక్షణమైన అజ్ఞానం. దాన్ని నిరసించగానే పూర్ణజ్ఞానం మిగులుతుంది.దేహం జన్మించడానికి కారణం మాయ. దేహచలన వలనాలు, వర్తన,విధిననుసరించి ఉంటాయి. సమస్త (సుఖదు:ఖాలు, జయాపజయాలు, లాభనష్టాలు ఇత్యాదులు) ద్వంద్వాలు కూడా విధి ననుసరించి ఉంటాయి. మన శరీరంపట్ల ఆసక్తి ఉండటమే అజ్ఞానం. నేను శరీరాన్ని అన్న గుర్తు చెరిగిపోతే అజ్ఞానం నశిస్తుంది. కనుక మాయను నిరశించటానికి ఈశ్వరభజన అనేది ఒక్కటే ఉపాయం. మాయను దాటి   వెళ్ళడానికి సద్గురు పాదాలు పట్టుకోవాలి. ఆయన్ని అనన్యంగా శరణనాలి. అప్పుడు ఈ సంసారభయం వెంఠనే నశించిపోతుంది. అనివార్యంగా వచ్చేమరణం వస్తే రానీ. కానీ హరి విస్మరణని మాత్రం రానీకు.మనసులో హరి చరణాలను ధ్యానం చేయాలి.జీవుడు స్వస్వరూప జ్ఞానాన్ని ప్రాప్తింప చేసుకోగల మార్గానికి వెళ్ళాలి. అప్పుడు శాశ్వత శ్రేష్ఠ సుఖం అనే లాభం మిగులుతుంది. అంత:కరణలో హరి,గురువుల చింతన కలగాలి.చెవులతో వారి చరిత్రను వినాలి. మనసులో నిరంతరం వారిని ధ్యానించాలి. నాలుకతో వారి నామస్మరణ చేయాలి. పాదాలతో నడిచి హరి,గురు గ్రామాలకు వెళ్ళాలి.నాసికతో వాళ్ళ నిర్మాల్యాలను వాసన చూడాలి. చేతులతో వారి పాదాలకు నమస్కరించాలి. కళ్ళతో వాళ్ళ దర్శనం చేసుకోవాలి.అలా ఈ సమస్త ఇంద్రియ వృత్తులను హరి,గురువుల వైపు ప్రేమతో మళ్ళించిన ఆ భక్తుల స్థితి ధన్యం.  ఇంతకుమించిన భగవద్భక్తి మరోటి ఏముంటుంది? 

సారాంశం - అజ్ఞానాన్ని సమూలంగా పెకలించివేయాలి. మిగిలినదే స్వయంసిద్ధజ్ఞానమని తెలుసుకోవాలి అని ఈ శ్లోకం యొక్క అంతరార్ధాన్ని శ్రీకృష్ణుడు అర్జునునికి సూచించారు. 

శ్రీసాయిబాబా ప్రేమ,కరుణలు కలబోసిన సాగరం. ఆయన నానాని నిమిత్తంగా చేసుకొని మనందరికోసం గీతార్ధాన్ని ప్రవచనం చేసారు. 

 బాబాగారి జ్ఞానబోధను వినగానే నానాసాహెబ్ వినయవిధేతలతో బాబాకి సాష్టాంగ నమస్కారం చేశాడు. రెండు చేతులతో ఆయన పాదాలకి నమస్కరించి ఎంతో శ్రద్ధతో "బాబా నా తీవ్రమైన  అజ్ఞానాన్ని దూరం చేయండి. నాకు సరైన శిక్షణనిచ్చి నా మొండి అహంకారాన్ని నశింపజేయండి.నాపై కృపాదృష్టి చూపండి.ఇదే నాకు సుఖసంతృప్తులనిస్తుంది" అని ప్రార్ధించాడు. బాబాగారు ప్రేమ,కరుణలతో నానాను ఆశీర్వదించారు.


 సర్వం శ్రీ సాయినాధార్పణ మస్తు

      









0 comments: